RSS
Wecome to my Blog, enjoy reading :)

జ్ఞానమూ ప్రతికూలాంశం కావటం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 20]

విక్రమాదిత్యుడి సహాయంతో భేతాళుని వశపరుచుకొని, పిదప అతణ్ణి వెయ్యవ బలిగా కాళికాదేవిని సమర్పించవలెనన్నది జ్ఞాన శీలుని పన్నాగం.

దాంతో, మర్నాడు అతడొక సామాన్య సాధు వేషంలో, విక్రమాదిత్యుని సభా భవనానికి వెళ్ళి, మహారాజుకు కానుకగా ఒక దానిమ్మ పండుని సమర్పించాడు. ఒక్క మాటైనా మాట్లాడకుండా, మరుక్షణం అక్కడి నుండి నిష్ర్కమించాడు. కొన్ని రోజుల పాటు నిరంతరాయంగా అదే ప్రకారం చేసాడు.

అలాగే... ఒక రోజు ఈ సాధువు దానిమ్మ పండు విక్రమాదిత్యునికి సమర్పించి వెళ్ళిపోయాడు. మహారాజు దాన్ని ప్రక్కనే ఉన్న చిన్న బల్లపై ఉంచాడు. సభా భవనాన్ని ఆనుకొని రాజోద్యాన వనం ఉంది. కిటికీ లో నుండి పూదోట కనువిందు చేస్తుంటుంది. ఆ తోటలో చెట్టు కొమ్మమీద కూర్చొన్న కోతి దృష్టిని, ఈ దానిమ్మ పండు ఆకర్షించింది.

అది అమాంతం కిటికీ లో నుండి లోపలికి దుమికి, పండు చేతిలోకి తీసుకొని కసుక్కున కొరికింది.

ఆశ్చర్యం!

సన్నిని నీటి గొట్టం నుండి నీటి ధార ఎగజిమ్మినట్లు, దానిమ్మ పండులో నుండి కెంపులు జల జలా రాలి క్రింది పడ్డాయి. ఒక్కసారిగా సభలోని వాళ్ళంతా దిగ్ర్భమ చెందారు. విక్రమాదిత్యు మహారాజు, ప్రతీ రోజూ సాధువు యిస్తూ వచ్చిన దానిమ్మ పండ్లను, రాజమందిరంలో ఓ ప్రక్కన ఉంచి పట్టించుకోలేదు.


దాంతో విక్రమార్కుడు సేవకులను పిలిచి, ఆ పళ్ళన్నిటినీ తీసుకు రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. దానిమ్మ పళ్ళను కోస్తే, ఒక్కోపండులో గింజలపేర్చి ఉన్నట్లుగా, మణిమాణిక్యాలున్నాయి! ఒక దానిలో రత్నాలు, మరో దానిలో మరకతాలు, ఇంకో దానిలో పుష్యరాగాలు, గోమేధీకాలు, తెల్లని మేలి ముత్యాలు... ఇలా!

అన్ని పళ్ళనూ కోసేటప్పటికి అక్కడ నవరత్నాలు రాశిగా పడ్డాయి. అదంతా చూసి సభికులూ, రాజూ కూడా ఆశ్చర్య పోయారు. విక్రమాదిత్యుడు ప్రతీ రోజూ తనకు పండ్లని సమర్పిస్తున్న సాధువు గురించి ఆలోచించాడు. తానెప్పుడూ అతడిని ఆదరించి పలకరించనందుకు చింతించాడు. ఒక్క మాట కూడా మాట్లాడ కుండా, తన పలకరింపును ఆశించకుండా, పండు సమర్పించి వెళ్ళిపోయే సాధువు పట్ల రాజుకు ఆశ్చర్యం గౌరవం కలిగాయి.

మరునాడు కూడా ఆ సాధువు సభలోకి వచ్చి, రాజుకు పండు సమర్పించాడు. విక్రమాదిత్యుడు అతణ్ణి ఆపి, ఆదరంగా పలకరించి, సుఖాసీనుణ్ణి చేసాడు. అతిధి మర్యాదలన్నీ చేసి, గౌరవంగా, "ఓ తపస్వీ! నా నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? ఎందుకిలా మమ్మల్ని బహుకరిస్తున్నారు? నేను మీకు చెయ్యగల కార్యమేదైనా ఉంటే సెలవియ్యండి. తప్పక నెరవేరుస్తాను" అన్నాడు.

సామాన్య సాధు వేషంలో ఉన్న జ్ఞానశీలుడు, "ఓ రాజోత్తమా! చాలా రోజులుగా నాకొక ఆకాంక్ష ఉన్నది. అది నెరవేర్చగలనని నీవు నాకు ప్రమాణం చేస్తేనే, నేను నీకది వివరించగలను." అన్నాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వుతో "మీరు కోరినట్లే చేయగలను" అన్నాడు.

అంతట జ్ఞానశీలుడు "ఓ రాజేంద్రా! నా పేరు జ్ఞానశీలుడు. ఇక్కడికి దాపుల నున్న బృహదారణ్యంలోని కాళికా దేవి ఆలయంలో నేనొక యాగం నిర్వహిస్తున్నాను. రానున్న అమావాస్యకు ముందు రోజు, దయ ఉంచి నీవక్కడికి వచ్చినట్లయితే, అప్పుడు నీవు నాకు చేయగల ఉపకారం గురించి చెబుతాను. నీవు నాకై అది నెరవేర్చాలి. దాంతో నా యాగం పరి సమాప్తి కాగలదు" అన్నాడు అభ్యర్ధనగా!

విక్రమాదిత్యుడు ఆనందంగా అంగీకరించాడు. రాజిచ్చిన హామీతో జ్ఞాన శీలుడక్కడి నుండి వీడ్కొలు తీసుకున్నాడు.

అమావాస్యకు ముందు రోజు, విక్రమాదిత్యుడు బృహదారణ్యంలోని కాళీ మాత గుడికి వెళ్ళాడు. జ్ఞాన శీలుడు అత్యంత సంతోషంతో రాజుని ఆహ్వానించాడు. విక్రమాదిత్యుడు చెప్పమన్నట్లు చూశాడు.

జ్ఞాన శీలుడు "ఓ మహారాజా! నీవు సత్యవాక్పరిపాలకుడవు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇచ్చటికి వచ్చావు. నేను నిన్నిక్కడికు ఎందుకు పిలిచానంటే -ఇక్కడకు అరామడ దూరంలో ఓ గొప్ప మోదుగ వృక్ష ముంది. శవ రూపంలో భేతాళుడు ఆ చెట్టు కొమ్మకు తల్లక్రిందులుగా వ్రేళ్ళాడుతుంటాడు. అతడెవ్వరికీ వశువు కాడు. అతణ్ణి వశపరుచుకోగల వాడవు నీవే! ఏ దోక విధంగా అతడిని నీవిక్కడకు తీసుకు రావాలి. ఇదే నీవు నాకోసం నిర్వర్తింపవలసిన కార్యం!" అన్నాడు.

విక్రమాదిత్యుడందుకు సమ్మతించి, భేతాళుడి కోసం బయలు దేరాడు. జ్ఞాన శీలుడందుకెంతో సంతోషించి, యాగాన్ని పూర్తి చేసేందుకు కావలసిన ఇతర ఏర్పాట్లు చేసుకోవడంలో మునిగి పోయాడు. అసలిందుకే అతడు విక్రమాదిత్యుడిని వెయ్యవ బలిగా ఎంపిక చేసుకొంది!

విక్రమాదిత్యుడు మోదుగ వృక్షాన్ని చేరి, దాని మీది శవాన్ని నిశవంగా గమనించాడు. చుట్టూ చీకటి! శ్మశానాన్ని తలపించే వాతావరణం, నిశ్శబ్ధం! రాజు కివన్నీ పట్టలేదు. చెట్టెక్కి శవాన్ని దించి భుజన వేసుకొని, కాళీ మాత ఆలయం వైపు అడుగులు వేశాడు.

శవంలోని భేతాళుడు విక్రమాదిత్యుణ్ణి పరిశీలించాడు.

భేతాళుడు "రాజా! ఎందుకు నన్ను మోసుకెళ్తున్నావు? నేనెవవ్వరికీ లొంగను. నేను నీకు వశుడను కావలెనంటే ఒక షరతు ఉంది. నేను నీకొక కథ చెబుతాను. ముగింపులో కథను గురించి ఒక ప్రశ్న అడుగుతాను. దానికి నీవు సరైన సమాధానం చెప్పాలి. అయితే నా ప్రశ్నకు జవాబు చెప్పేందుకు నీవు మౌనం వీడితే, మరుక్షణం నేను నీ భుజంపై అదృశ్యమై చెట్టుపై నుంటాను. అలాగని జవాబు తెలిసీ చెప్పకుండా మౌనాన్ని పాటిస్తే, నీతల వెయ్యి వక్కలౌతుంది. ఇదీ నియమం" అన్నాడు.

విక్రమాదిత్యుడందుకు అంగీకార సూచకంగా తలాండించాడు. మౌనాన్ని వీడక చిరునవ్వు నవ్వాడు. భేతాళుడు మొదటి కథ ప్రారంభించాడు.

[ఇక్కడ ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే - కథ ద్వారా భేతాళుడిచ్చే ప్రవల్లిక (పజిల్ వంటి ప్రశ్నని)ని విక్రమాదిత్యుడు పరిష్కరించాలి. కానీ, విక్రమాదిత్యుడు మౌనభంగం చేసి ప్రశ్నకు జవాబిచ్చాడో... భేతాళుడు తిరిగి చెట్టెక్కేస్తాడు. తెలిసీ జవాబు చెప్పక పోతే... తల వెయ్యి వక్కలౌతుంది. విక్రమాదిత్యుడు సకల శాస్త్ర పారంగతుడు గనక, అతడు ఎలాంటి ప్రశ్నకైనా జవాబు చెప్పగలడు. దాంతో మౌనభంగమౌతుంది. అప్పుడు భేతాళుడు వశుడు కాడు. ‘భేతాళుడి ప్రశ్నకు విక్రమాదిత్యుడికి సమాధానం తెలియక పోవటం’ మాత్రమే దీనికి పరిష్కారం అవుతుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, జ్ఞానం కలిగి ఉండటం అనుకూలాంశం (Advantage) అవుతుంది. ఇక్కడ అది ప్రతికూలాంశం (Disadvantage) గా ఉంటుంది. అదే గమ్మత్తు!]

~~~~~~~~~

1 కామెంట్‌లు:

Manikanth చెప్పారు...

ayithe gnana sheeludi valla Vikram-bethal kathalu modalu ayyayi annamaata ... bagundhi ! Bethaludu enno kathalu cheppadam, vikramarkudu anni prashnalaku javabu ivvadam, bethaludu mallee chettu ekkadam, chinnappudu chadivina kathallo gurthundhi. Mari bethaludu chivariki Vikramarkudiki chikkadaaa? gnanasheeludu paristhithi enti chivariki? thelusukovalani uthsahangaa undhi ...

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes