RSS
Wecome to my Blog, enjoy reading :)

ధారా నగరం – వేట వినోదం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 02]

అది ప్రాచీన కాలం!

ఈ కథ ప్రాచీన భారత దేశంలో సంభవించింది.

ఆ కాలంలో భారత దేశం భూలోక స్వర్గంలా ఉండేది. మూడు దిక్కులా ఆవరించిన సముద్రాలు, ఉత్తర దిక్కున ఠీవిగా నిలిచిన హిమాలయ పర్వతాలతో, వెల లేని రత్నాలూ విలువైన లోహాలూ కలిగి, ఒకేసారి నిండు గర్భిణి లాగానూ, పచ్చి బాలింత లాగానూ ఉండేది. వెండి బంగారు రాగి ఇనుము వంటి లోహాలూ, రత్నాలూ వజ్రలూ ప్రజలకి సునాయసంగా లభ్యమయ్యేవి.

చల్లని, సౌకర్యవంతమైన, అందమైన, పచ్చని ప్రకృతి పరచుకొని ఉండేది. ఆ జీవగడ్డపై సంవత్సరమంతా ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా పచ్చని పైరులు చిరుగాలికి ఊగుతుండేవి. నదీ నదాల గలగలలతో, పశుపక్షుల కిలకిలలతో, అరణ్యాలతో అలరారు తుండేది. అక్కడక్కడా విసిరేసినట్లుగా జనవాసాలు... గ్రామాలు, నగరాలు!

పచ్చని ప్రకృతిలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తుండేవాళ్ళు.

అలాంటి భారతదేశంలో అది దక్షిణ భూభాగం! పుడమి తల్లికి నుదుటి సింధూరంలా ధారానగరం అనే పట్టణం ఉండేది. ఆ నగరంలో ఇళ్ళన్నీ మిద్దెలూ మేడలే! పలు అంతస్ధుల భవనాలతో అందంగా ఉండే నగరం! అక్కడి ఇళ్ళకు తోరణాలుగా మామిడాకులు గాక, మణులతో చేసిన హారాలు వేలాడుతుండేవి. దొంగభయం లేదు. దోపిడిల భయమూ లేదు. ప్రజలంతా ఎంతో శాంతి సౌఖ్యాలతో ఉండేవాళ్ళు.

ధారా నగరం భోజరాజు యొక్క రాజధాని. భోజరాజు ఎంతో మంచివాడు, దయగలవాడు, ధర్మపరుడు. తన ప్రజల పట్ల బాధ్యత కలవాడు. అతడెల్లప్పుడూ తన ప్రజల క్షేమం గురించే ఆలోచించేవాడు. అతడి పన్ను విధానం ప్రజలకి ఏమాత్రం భారంగానూ, బాధ గానూ ఉండేది కాదు. అతడి పాలనా విధానం, పరిపాలనా యంత్రాంగం.... ఎల్లప్పుడూ ప్రజలకి సౌకర్యవంతంగా, ప్రజలని రక్షించేవిధంగా ఉండేది. అతడు తన రాజ్యంలోని ప్రజలని ప్రేమించేవాడు, అన్ని విధాలా రక్షించేవాడు. ప్రతిగా ప్రజలూ అతణ్ణి ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు.

ఒకరోజు భోజరాజు, తన ప్రధానమంత్రి బుద్ది సాగరుణ్ణి పిలిచాడు. బుద్ది సాగరుడు మంచివాడు, మేధావి, వివేకం గలవాడు. బుద్దిసాగరుడు అంటే సాగరము వంటి గొప్పబుద్ది కలవాడు, బుద్దికి సాగరము వంటి వాడు అని అర్ధం! అతడా పేరుకు తగినవాడు.

భోజరాజు "ప్రియమైన ప్రధానమంత్రి, బుద్ది సాగరా! మన గూఢచారులు తెల్పిన సమాచారం ప్రకారం, మన గ్రామీణులు కౄర, వన్య మృగాల వలన బాధలు పడుతున్నారు. అరణ్యాలు దట్టంగా ఉన్నాయి. వన్య, కౄర మృగాల సంఖ్య బాగా పెరిగిపోయింది. దాంతో అడవి మృగాలు పచ్చని పొలాలని నాశనం చేస్తున్నాయి. కౄర మృగాలు అమాయక గ్రామీణులని, వారి పెంపుడు జంతువులని గాయపరుస్తున్నాయి. ప్రజలని కాపాడటం మన ధర్మం! అందుచేత రేపటి రోజున వేటకు వెళ్ళాలని నిశ్చయించాను. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. మన సైన్యంలో నుండి కొన్ని దళాలని సమాయత్త పరచండి. నగరంలో ఉత్సాహం గల యువకులని, వేటకు రావలసిందిగా దండోరా వేయించండి" అని అజ్ఞాపించాడు.

బుద్దిసాగరుడు చిరునవ్వుతో "చిత్తం మహారాజా! రేపటి ఉదయానికల్లా వేటకి అన్ని ఏర్పాట్లు చేస్తాను" అన్నాడు.

మరునాటి ఉదయానికి భోజరాజు వేట కెళ్ళేందుకు సిద్దమయ్యాడు. ఉత్సాహం గల చాలామంది యువకులు వేటకు తగిన ఆయుధాలు.... కత్తులూ, విల్లంబులూ, ఈటెలూ ధరించి, కోట ముందు సమావేశమయ్యారు. వారి కేరింతలతో అక్కడంతా సందడిగా ఉంది. సైనికులూ, యువకులూ కదం తొక్కుతూ, గొంతెత్తి పాడుతున్నారు. సంగీత పరికరాలతో పాటకు అందుకనుగుణంగా తాళం వేస్తున్నారు. వాళ్ళ పాటల రాగాలు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. రజోగుణాన్ని ప్రేరేపిస్తూ రోమాంచితం చేస్తున్నాయి. అక్కడంతా పండగ వాతావరణం వెలిసింది.

[మానవ మనస్తత్వాన్ని భగవద్గీత, మూడు రకాలుగా నిర్వచిస్తుంది. సత్త్వం, రజస్సు, తమోగుణం. మనుషులందరిలో ఈ మూడు గుణాలూ ఉంటాయి. రజస్తమో గుణాల కంటే సత్త్వ గుణం ఎక్కువగా ఉన్నవారిలో.... సహనం, జ్ఞానం, శాంత స్వభావం, అహింసాతత్త్వం వంటి లక్షణాలు ఉంటాయి. రజోగుణం ఎక్కువగా ఉన్నవారిలో.... ధైర్యసాహసాలు, పోరాటపటిమ, నాయకత్వ స్ఫూర్తి వంటి లక్షణాలు ఉంటాయి. తమోగుణం ఎక్కువగా ఉన్నవారిలో.... అవివేకం, వితండవాదం, సోమరితనం, నిద్ర వంటి లక్షణాలు ఉంటాయి.]

ఈ విధంగా రజోగుణ ప్రవర్ధమాన పరిస్థితులలో.... భోజరాజు, మంత్రి బుద్దిసాగరుడు, సైనికులూ, యువకులూ వేటకు బయలు దేరారు. అరణ్యప్రాంతం చేరారు. అరణ్య మధ్యంలో విడిదిని ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రివేళల విశ్రాంతికి, విందు వినోదాలకి గుడారాలు నిర్మించుకున్నారు.

పగటి వేళల్లో అడవి జంతువుల వేట కొనసాగించారు. డప్పు వంటి వాయిద్యాలని గట్టిగా మోగిస్తూ అరణ్య మృగాలని భయపెట్టారు. భయంతో వాటి ఆవాసాల నుండి బయటికొచ్చి పరుగులు తీస్తున మృగాల వెంటబడి వధించారు. కొందరు సైనికులు, రజోగుణ పూరిత రాగాలు మ్రోగిస్తుండగా.... భోజరాజు, అతడి పరివారమూ రణోత్సాహం వంటి హుషారుతో అరణ్యమృగాలని వేటాడారు. ఆ వేట అందర్నీ ఎంతో ఉత్సాహ పరిచింది. అందరూ దాన్ని ఎంతో ఆస్వాదించారు.

[ప్రాచీన కాలంలో పాలకులకి, సంపన్నులకి, ప్రజలకి వేట ఎంతో ప్రీతిపాత్రమైనదై ఉండేది. అప్పట్లో అరణ్యాలు దట్టంగా విస్తారంగా ఉండేవి. అడవి జంతువుల సంఖ్య, ప్రజల కంటే ఎక్కువగా ఉండేది. దాంతో ప్రజల, పెంపుడు జంతువుల ప్రాణాలకు, అడవి జంతువుల నుండి ప్రమాదం ఉండేది. జింకలూ, దుప్పుల వంటి సాధుజంతువులు పొలాల మీద పడి మేసేవి. భల్లూకాలు, కుందేళ్ళు దుంప పంటలని తవ్వి పారేసేవి. ఏనుగుల గుంపులు వంటివి, చెఱకు వంటి పైర్లను పీకి పాకాన పెట్టేవి.

వాటిని నియంత్రించటానికి వేట అనివార్యమై ఉండేది. ఇప్పటి స్థితి దీనికి విపర్యయం. ఇప్పుడు అడవుల కంటే అడవి ప్రాణుల కంటే జనాల సంఖ్య ఎక్కువ! ఇప్పుడు మనిషి నుండి జంతువులకి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు అడవులని సంరక్షించడం, అడవి జంతువులని సంరక్షించడం అనివార్యమైంది. కాబట్టి ఇప్పుడు వేట నిషిద్దం. అప్పుడు వేట వినోదం!]

భారతీయ సంస్కృతీ సంపద [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 01]

భారతీయ జానపద కథలు!

అది నిజంగా భారతీయ సంస్కృతీ సంపద!

వారసత్వంగా సంక్రమించిన సుందర సారస్వతం!

సాహితీ విలువలతో, రమణీయ పదబంధాలతో, వ్యాకరణాత్మకంగా, సంగీత భరితంగా, రసభరితంగా అలరారే కావ్యాలూ, నాటకాలు, కీర్తనలూ, కృతులూ!

ఇక[ఒకప్పుడు] రామాయణ భారతాలు భారతీయులకు సర్వేంద్రియాలు. ఏ విషయాన్నైనా చూసేది, వినేది, ఆఘ్రాణించేది, ఆస్వాదించేది రామాయణ భారతాలనే కళ్ళు, చెవులు, నాసికా నాలుకలతోనే!

కవులని, అందునా భక్త కవులని సాక్షాత్తూ భగవంతుడి స్వరూపం గానే కొలుస్తారు భారతీయులు. భారత కర్త వేదవ్యాసుణ్ణి శంకరరూపుడిగా సేవిస్తే... రామాయణ కర్త వాల్మీకిని ఆదికవిగా ఆదరిస్తారు.

వాల్మీకి గురించి ఎంత అందంగా అనుభూతిస్తారో చూడండి.

కూజంతం రామ రామేతి I మధురమ్ మధురాక్షరమ్ II
ఆరుహ్య కవితా శాఖాం I వందే వాల్మీకి కోకిలమ్ II

కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని, వాల్మీకి అనే కవికోకిల, మధురమూ మధురాక్షరమూ అయిన రామనామాన్ని పాడుతోందట! ఎంత సౌందర్య సంపూర్ణ ఆస్వాదనో!

రామాయణ భారతాలు ఇతిహాసాలైతే....భారతీయ జనసామాన్యంలోకి చొచ్చుకుపోయిన జానపద సాహిత్యమూ పేరెన్నిక గన్నదే! ప్రజలని ప్రభావ పరిచినదే!

అలాంటి జానపద సాహిత్యంలో.... భట్టి విక్కమార్కుల కథలది ప్రత్యేక స్థానం. విక్రమాదిత్యుడు మహారాజు, భట్టి ఆయనకు మహామంత్రి. విక్రమాదిత్యుడి గొప్పతనమూ, ఆయనకు సోదరుడూ మంత్రీ కూడా అయిన భట్టి మేధావిత్వం గురించిన కథలివి.

ఈ కథలు దాదాపు 365 ఉండేవి. రోజుకో కథ చెప్పుకుంటే, పూర్తికావటానికి సంవత్సరం పడుతుంది. ఇప్పుడు కొన్ని కథలే లభ్యమౌతున్నాయి. ఒక కథలో నుండి మరో కథ, కంఫ్యూటర్ లో మనం ఒక విండో లోంచి మరో దానిలోకి, ఒక ఫోల్డర్ లోంచి మరో దాన్లోకి ప్రయాణించినట్లుగా ఉంటుంది. కథల నిండా అద్భుతరసమే! సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే సంఘటనలు, కథల్లో మలుపులు, స్ఫూర్తి నింపే సాహసాలు, చక్కని వర్ణనలతో పాటు, సాహసాలు, వితరణ శీలం, ఇతరులకు సహాయపడటం వంటి మానవ సహజ సుగుణాలకు ప్రాధాన్యత కనబడుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే - ఈ కథలలో అవధుల్లేనంతటి ఊహాశక్తితో, అజ్ఞాత కవి ఎవరో, మనల్ని అద్భుతలోకాల్లోకి.... అతివేగంగా, అతి రమ్యంగా తీసికెళతాడు.

ప్రాచీనకాలంలో, సంస్కృత లిపిలో ‘భట్టి విక్రమార్క సంవాదం’ పేరిట ఒక గ్రంధం ఉండేదట. కాలక్రమంలో దాని లభ్యత మృగ్యమైంది. తెలుగులోకీ, ఇతర భాషల్లోకీ ఈ కథల అనువాదాలున్నాయి. చాలా కథలు, తరం నుండి తరానికి ‘అమ్మమ్మ తాతయ్యల దగ్గర కథలు చెప్పించుకోవడం’ రూపేణా సంక్రమించాయి.

వీటిల్లో కొన్ని కథలని, పిల్లల పుస్తకాలలో చదివాను. భట్టి విక్రమార్క పేరుతో గ్రాంధిక భాషలో ఉన్న పుస్తకాన్ని, తొలిగా నా పదకొండవ ఏట చదివాను. కొన్ని కథలు సినిమాలుగా చూశాను. [చదివిన వాటితో పోల్చుకుంటే సినిమాలు పరమ చప్పగా ఉన్నాయి.] ఈ కథలని నేనెంతగా ఆనందించానంటే - చిన్నప్పటి నుండీ వీటిని మా అమ్మనాన్నలకి, మా వీధిలో అందరికీ చెప్పాను.

స్కూల్లో చదివేటప్పుడు ఈ కథలు చెప్పినందుకు ప్రతిఫలంగా, నా నేస్తాలు నా పుస్తకాల పెట్టె మోసిపెట్టేవాళ్ళు, వాళ్ళ తాయిలాల్లో వాటాలిచ్చేవాళ్ళు. మా పాపకి, నా శిష్యులకీ... అందరికీ చెప్పాను.

ఎప్పుడు ఎవరికి చెప్పినా.... శ్రోతల్లో ఎంతో సంభ్రమాశ్చర్యాలూ, సంతోషమూను! చెప్తూ నేనూ ఎంతో ఆనందించేదాన్ని. మా పెళ్ళైన కొత్తలో మా వారూ నేనూ కూడా, ఎంచక్కా ఈ కథలు చెప్పేసుకున్నాం. మరి అద్భుతరసంతో నిండిన ఊహకందని మలుపులున్న కథలవి! ఎన్నిసార్లు ఆనందించినా విసుగెత్తదు.

అందుకే పిల్లలూ పెద్దలూ అందరికీ చెప్పేదాన్ని. నిజానికి నేను, పిల్లలకి చెప్పడం ప్రారంభించేదాన్ని. కాస్సేపయ్యాక చూస్తే చుట్టూ పెద్దలు కూడా చేరి ఉండేవాళ్ళు. ఇది నన్నెంత ఉత్సాహ పరిచేదంటే - ఆ కథలని నా పద్దతిలో, చిన్న చిన్న మార్పులు చేసి చెప్పేదాన్ని.

నిజానికి ఈ కథలు, పిల్లల్లో చక్కని వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ధృఢమైన, నిర్దిష్టమైన వ్యక్తిత్వాన్ని! ఇలాంటి కాల్పనిక కథలు చదవటం రీత్యా, పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. తమదైన ప్రపంచాన్ని ఆనందిస్తారు. దాంతో సృజనాత్మకత పెరుగుతుంది. ధైర్య సాహసాలు, పట్టుదల, సహనం, పెద్దల పట్ల వినయం, భక్తి, నమ్మకం వంటి మానవీయ విలువలు అలవడతాయి.

అంతేకాదు, తార్కిక ఆలోచన, సునిశిత పరిశీలన, విషయ విశ్లేషణ, సాహసాలకు పూనుకోవటం, సవాళ్ళను స్వీకరించటం వంటి లక్షణాలూ గ్రహిస్తారు. ఈ కథలు వాళ్ళని చక్కని మార్గంలో నడిపిస్తాయి. భావప్రసార శక్తిని పెంపొందిస్తాయి. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఎలా ప్రభావితుల్ని చేయాలి, ఎలా స్ఫూర్తిపూరితులని చేయాలి, ఇతరులని ఎలా ఒప్పించి తమ మార్గంలోకి తెచ్చుకోవాలి, ఎలా సంతోషపరచాలి... ఇలాంటివన్నీ! వీటితో పాటు.... సమయోచితంగా, సందర్బోచితంగా, హాస్య స్ఫూరకంగా ఎలా మాట్లాడాలో కూడా!

ఈ కథలు పూర్తయ్యేసరికల్లా, కథనాయకులైన భట్టి, విక్రమాదిత్యులు పిల్లలకు ఆదర్శం, ‘రోల్ మోడల్స్’ అయిపోతారు. వాళ్ళలాగే తామూ అన్నీ కళలనీ, జ్ఞానాన్ని నేర్చేసుకోవాలనిపిస్తుంది.

నిజానికి ఈ కథల సృష్టికర్త ఎవరో తెలియదు. భట్టి విక్రమార్కులు ఉజ్జయినీ నగరాన్ని, వేల సంవత్సరాల పాటు పరిపాలించిన మంత్రి, చక్రవర్తులని నమ్మకం. అతిశయోక్తులున్నా అది చారిత్రక సత్యం అంటారు. కల్పనలు జోడించబడినా, ఈ కథలు పిల్లల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

ఈ కథల ప్రభావం నామీద చాలా ఉందని నేను అనుకుంటాను. చదువరుల మీద ఈ కథలు వేసే ముద్ర బలమైనది. ఎన్నోసార్లు ఈ కథలని ఎందరికో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ బ్లాగ్లోకంలో, మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. ఇంతకు ముందు ఇంగ్లీషులో సగభాగం వ్రాసాను.

మీ ఇళ్ళల్లోని చిన్నారులకి, ఈ మజాని పంచుతారని ఆశిస్తూ.... దఫాలుగా ఈ కథా పరంపర....!

దేవుడు దయతో చూస్తే ఏమైనా జరగవచ్చు!

ఓ రోజు తైమూర్ సభతీర్చి ఉన్నాడు. సభికుల్లో నసీరుద్దీన్ కూడా ఉన్నాడు. సభలో ఇష్టాగోష్టి నడుస్తోంది. తైమూర్ కి కొంత తలతిక్క[తాను రాజునన్న అహంకార మాన్నమాట] ఉంది. పిసినారి, అసూయాపరుడు కూడా. ప్రజల్లో నసీరుద్దీన్ కి ఉన్న మంచిపేరు, ఆదరణ పట్ల తైమూర్ కి చాలా దుఃఖంగా ఉండేది.

ఆరోజు చర్చ చదువులు మీదికి మళ్ళింది. మొద్దు పిల్లలకు, మూర్ఖులకు చదువు చెప్పటం అసాధ్యం అన్నారు కొందరు. అదేం లేదు, ఓపికగా నేర్పితే ఎలాంటి వారికైనా చదువు చెప్పవచ్చు అన్నారు కొందరు. వాదన తారాస్థాయికి అందుకుంది.

ఇంతలో నసీరుద్దీన్ “ఏలిన వారు చిత్తగించాలి. ఈప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. సాధింపబడేవరకూ ప్రయత్నించాలి, అంతే. ఓపికగా చెబితే నా గాడిదకి సైతం చదువు నేర్పవచ్చు” అన్నాడు.

తైమూర్ కి నసీరుద్దీన్ పనిపట్టడానికి అదే తగిన అవకాశం అన్పించింది. “అయితే నీగాడిదకి చదువు నేర్పగలవా?" అన్నాడు సవాలు చేస్తున్నట్లుగా.

"తప్పకుండా. కాకపోతే కొంత సమయం పడుతుంది. మరికొంత ఖర్చువుతుంది” అన్నాడు నసీరుద్దీన్.

"ఎంత సమయం కావాలి? ఎంత డబ్బుకావాలి?" మరుక్షణం ప్రశ్నించాడు తైమూర్.

"సంవత్సరం పడుతుంది. రోజుకి వంద బంగారు దీనార్ లు ఖర్చువుతుంది” నింపాదిగా చెప్పాడు నసీరుద్దీన్.

‘చచ్చింది గొర్రె !’ మనసులో అనుకున్నాడు తైమూర్.

"నసీరుద్దీన్! బాగా ఆలోచించుకో. సంవత్సరం తర్వాత నీ గాడిదకి చదువురాలేదనుకో, నీకు మరణశిక్ష తప్పదు” అన్నాడు తైమూర్ గంభీరంగా.

సభికులంతా ఉత్కంఠగా చూడసాగారు. నసీరుద్దీన్ చిన్నగా నవ్వుతూ “ఏలిన వారు చిత్తగించాలి. సంవత్సరం తర్వాత నా గాడిద ఓ ఉద్ర్గంధాన్ని చదవటం తమరు చూడవచ్చు. దీనారాలిప్పించండి” అన్నాడు.

తైమూర్ నసీరుద్దీన్ కు 36,500 బంగారు దినార్ లు ఇప్పించాడు. అందరూ ఆ దిగ్ర్బాంతి నుండి తేరుకునే లోపలే నసీరుద్దీన్ సంతోషంగా డబ్బుమూట తీసుకొని గాడిదనెక్కి ఇంటికెళ్ళి పోయాడు.

విషయమంతా విన్న నసీరుద్దీన్ భార్య నెత్తినోరు బాదుకుంది. “గాడిదకి చదువెల చెబుతావు? తైమూర్ తో తమాషాలా? సంవత్సరం తర్వాత ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంటావా? డబ్బుకోసం ఇంతపని చేస్తావా? నీకేమైనా అయితే మేమంతా ఎలా బ్రతకాలి? ” అంది.

నసీరుద్దీన్ “ఓసి పిచ్చిదానా! ఇప్పటి వరకూ తైమూరే మూర్ఖుడనుకున్నాను. నువ్వు కూడానా! సంవత్సరం సమయం ఉంది. ఈ లోపున రోజుకి వందచొప్పన 36,500 ల బంగారు దీనార్ లు ముట్టాయి. ఆనందించక, ఎప్పుడో ఏదో అవుతుందని ఏడుస్తావేం? దేవుడు దయతో చూస్తే ఏడాది లోపల ఏమైనా జరగవచ్చు. నేనే చచ్చిపోవచ్చు. తైమూరే చచ్చిపోవచ్చు. ఈ గాడిద చచ్చినా చచ్చిపోవచ్చు. లేదా ఈ గాడిద చదవనైనా చదవవచ్చు. నిశ్చింతగా ఉండు” అనేసి వెళ్ళిపోయాడు.

తైమూర్ ఇచ్చిన డబ్బుతో రోజులు హాయిగా నడుస్తున్నాయి. పాపం! నసీరుద్దీన్ అన్నట్లు ఏవీ జరగలేదు. 11 నెలలు గడిచిపోయాయి. ఇంక ఒక నెల గడువు మిగిలింది. నసీరుద్దీన్ భార్య లబోదిబో మనసాగింది.

ఇక తప్పదన్నట్లు నసీరుద్దీన్ తీవ్రంగా ఆలోచించాడు. అతడికో ఉపాయం స్పురించింది. గాడిదని తీసుకొని గదిలోకి వెళ్ళి తలుపువేసుకున్నాడు. లోపలేం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. నెలరోజులు గడిచిపోయాయి. నిర్ణీతగడువు రోజున గాడిదనెక్కి నసీరుద్దీన్ సభకి వచ్చాడు. ‘గాడిద చదవటం’ అన్న వింత చూసేందుకు ఆరోజు సభకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.

తైమూర్ సభకు వచ్చాడు. లోలోపల అనుమానంగా ఉంది. ‘ఈ నసీరుద్దీన్ కాలాంతకుడు. ఏదో చేస్తాడు’ అనుకుంటూ లోపల పళ్ళునూరుకున్నా పైకి చిరునవ్వునవ్వుతూ కూర్చున్నాడు.

నసీరుద్దీన్ “హుజూర్! చూడండి నా గాడిద చదువుతుంది” అంటూ తన గాడిద ముందు ఓ పెద్ద పుస్తకాన్ని ఉంచాడు. గాడిద ఒకో పేజీ తెరచి, నాలుకతో ఆ పేజీ అంతా నాకడం, మరో పేజీ తెరవటం, మళ్ళీ ఆ పేజీ నాకడం……. ఇలా పుస్తకం మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకూ తిరగేసింది. అది చూసి అబ్బురంతో ప్రజలంతా చప్పట్లు చరిచారు.

వాస్తవం ఏమిటంటే నసీరుద్దీన్ గాడిదని నెలరోజులుగా గదిలో పెట్టి దాని ముందు పెద్ద పుస్తకం పెట్టాడు. ఒకో పేజీలో గుప్పెడు ఓట్స్ గింజలు పోసాడు. గాడిద ఆ గింజల్ని నాలుకతో నాకి తినేటట్లు శిక్షణ ఇచ్చాడు. రుచికరమైన ఓట్స్ గింజలు దొరకటంతో గాడిద తేలిగ్గానే పేజీలు తిప్పటం నేర్చుకుంది. గింజలు గాక, పేజీలు తినేసినప్పుడు దానికి శిక్షలు పడేవి. అందునా పేజీలు తిప్పుతూ గింజలు మాత్రమే నాకి తినేస్తే తర్వాత దానికి రుచికరమైన దాణా పెట్టబడేది. దాంతో గాడిద ఎంచక్కా ఉద్ర్గంధం పేజీలు తిప్పటం నేర్చేసింది.

అయితే గాడిద ఇలా పేజీలు తిప్పిమరీ పుస్తకం చదివేసరికి తైమూర్ కి ఏడుపొచ్చేసింది. నసీరుద్దీన్ కి మరణ శిక్ష వేయచ్చు, అధమం దేశ బహిష్కారమన్నా విధించవచ్చు అనుకుంటే డబ్బులు పోయాయి. దాంతో అక్కసుగా

"గాడిద చదివింది. నిజమే గానీ ఏం చదివిందో మనకెలా తెలుస్తుంది?" అన్నాడు.

నసీరుద్దీన్ “హుజూర్! మన ఒప్పందం ప్రకారం గాడిదకి చదువునేర్పమన్నారే గానీ, చదివింది పైకి చెప్పాలని అనుకోలేదు గదా! కావాలంటే మరో ఏడాది గడువూ, రోజుకి వంద బంగారు దినార్ లూ ఇప్పించండి. ఈ సారి నా గాడిద తను చదివింది పైకి చెప్పేటట్లు చేస్తాను” అన్నాడు.

ప్రజలంతా ఒక్కసారిగా ఆమోదయోగ్యంగా చప్పట్లు చరిచి, హర్షధ్వానాలు చేసారు. దాంతో తైమూర్ మరోసారి 36,500 బంగారు దినార్ లు ఇచ్చి, సంవత్సరం గడువిచ్చాడు. మరో ఏడాది నసీరుద్దీన్ హాయిగా గడిపేసాడు. సంవత్సరం తర్వాత మునుపటి లాగే సభకి గాడిదనెక్కి వచ్చాడు. ప్రజలంతా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ‘ఈసారి నసీరుద్దీన్ ఓడిపోవటం ఖాయం’ అనుకుంటూ ఆనందంగా వచ్చాడు తైమూర్.

నసీరుద్దీన్ “ఏలిన వారు చిత్తగించాలి” అంటూ గాడిద ముందు పెద్ద ఉగ్ర్గంధంపెట్టాడు. మునుపటిలాగే గాడిద ఒకో పేజీ తిప్పటం, నాలుకతో పేజీనంతా నాకటం, ఆ పైన నసీరుద్దీన్ వైపు చూసి ‘బే’ అంటూ ఓండ్రపెట్టటం చేసింది. ప్రజలంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు.

జరిగిందేమిటంటే నసీరుద్దీన్ రోజూ గాడిదకి పుస్తకం పుటలలో గింజలు పెడుతూ, మధ్య మధ్యలో ఒకరోజు గింజలు పెట్టడం మానేసేవాడు. దాంతో అది గింజలు పెట్టని రోజునా ఒకో పుటా తిప్పతూ గింజలు లేవన్న సూచనగా నసీరుద్దీన్ వైపు చూసి అరుస్తుండేది. తర్వాత నసీరుద్దీన్ దానికి మంచిదాణా ఇచ్చేవాడు. ఈవిధమైన శిక్షణతో గాడిద బాగా అలవాటుపడింది.

అయితే గాడిద ఇలా పేజీలు తిప్పి అరవడంతో తైమూర్ ఉడికిపోయాడు.

"నసీరుద్దీన్! ఇదేమిటి ఇదేం చదివిందో పైకి చెప్పమంటే ఇలా ఓండ్రపెడుతోంది?” అన్నాడు.

నసీరుద్దీన్ “హుజూర్! తానేం చదివిందో తన భాషలో చెబుతోంది. మనభాషలో చెప్పాలని మనం ముందుగా షరతు పెట్టుకోలేదుగా” అన్నాడు. తైమూర్ కి కోపంతో పిచ్చెక్కినంత పనయ్యింది. కానీ ఏం చేస్తాడు? పైకి ఏమీ అనలేని పరిస్థితయ్యె.

దాంతో “అయితే ఈసారి నీగాడిద తను చదివింది మన భాషలో చెప్పేలా శిక్షణ నివ్వగలవా?" అన్నాడు కసిగా.

నసీరుద్దీన్ చల్లగా నవ్వుతూ “మన్నించాలి హుజూర్. రెండేళ్ళుగా చదువుచెప్పి చెప్పి నేనూ, నేర్చుకుని నా గాడిదా బాగా అలిసిపోయాము. కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాక అప్పుడు చూద్దాం” అన్నాడు.

ప్రజలంతా ఒక్కపెట్టున చప్పట్లు చరిచారు. తైమూర్ లోలోపల ఏడుపుతో కుళ్ళిపోతూ పైకిమాత్రం నసీరుద్దీన్ ని అభినందించాడు.

ఇదీ కథ!

విద్య పరమార్ధం ఏమిటి?

‘విద్యలేని వాడు వింత పశువు’ అన్నారు పెద్దలు.

అసలు విద్యంటే ఏది? దాని పరమార్ధం ఏమిటి?

పశువు స్థాయినుండి మనిషిగా రూపాంతరం చెందించే ఆ ‘విద్య’ ఏమిటి?

ఫ్యాషన్ పేరిట కురచదుస్తులతో శరీరప్రదర్శనలూ, మత్తుపదార్ధసేవనం వల్ల తూలిన ప్రవర్తనలతో మనిషి ఏ ‘స్థాయి’కి పరిణమిస్తున్నాడు?

ఆ స్థాయికి తీసికెళ్ళెదాన్ని ‘విద్య’ అనాలా, ‘అవిద్య’ అనాలా?

ఆదిమానవుడు, ప్రకృతిలోని శీతోష్ణస్థితుల నుండి శరీరాన్ని కాపాడు కునేందుకు కవచంగా దుస్తుల్ని కనుగొని ధరించాడు. క్రమంగా శరీరాన్ని కప్పుకోవడంలో సభ్యతనీ, సంస్కారాన్ని గుర్తించగలిగాడు. కాబట్టే జంతుస్థాయినుండి వేరుపడ్డాడు. గుహల నుండి గృహ నిర్మాణాల దాకా పయనించాడు. అది పురోగమనం.

మనిషిని జంతుస్థాయి నుండి వేరు చేసింది ‘విద్య’.

అయితే నేడు?

విద్యకు పరమార్ధం ఉద్యోగం.

విద్యకు చివరి గమ్యం ఉపాధి.

చదువుకునేది డబ్బు సంపాదన కోసమే.

ఒకసారి ఉద్యోగమో, ఉపాధో సంపాదిస్తే ఇక అక్కడితో చదువుకోవటానికి, విద్యా సముపార్జనకీ పుల్ స్టాఫ్ పడుతుంది. ఇదేనా చదువంటే? ఇదేనా విద్యంటే?

ప్రతి పిల్లీ, తన కూనలకి ఎలుకలని ఎలా వేటాడాలో నేర్పుతుంది.

ప్రతి కోతీ, తన పిల్లలకి ఇళ్ళ పెరళ్ళల్లోకి చెట్లమీది జామకాయలూ, మామిడికాయలూ ఎలా తెంపుకోవాలో, ఇంటి వాళ్ళు వెంటపడి రాళ్ళు విసిరితే ఎలా తప్పించుకోవాలో నేర్పుతుంది.

అలాగే మనమూ మన పిల్లలకి [ఉద్యోగమో, ఉపాధి] జీవన భృతి సంపాదించుకునే విద్యని నేర్పుతున్నాం. అంతే!

ఒకప్పుడు కుటుంబవృత్తులుండేవి. ఓ రైతు బాలుడు తన తండ్రి, తాతల దగ్గర వ్యవసాయపు మెళకువలు నేర్చుకునేవాడు. అందుకు ఫీజులు అక్కర్లేదు, సర్టిఫికేట్లు అక్కర్లేదు. ఓ అమ్మాయి తన అమ్మ, అమ్మమ్మల దగ్గర హౌస్ కీపింగ్, ఛైల్డ్ కేరింగ్ నేర్చుకునేది. దానికీ ఫీజులు అక్కర్లేదు, సర్టిఫికేట్లు అక్కర్లేదు.

ఓ వడ్రంగి, ఓ తాపీ మేస్త్రి, ఓ మెకానిక్ ఆయా వృత్తుల్లో రాణిస్తున్న మేస్త్రిల దగ్గర శిష్యరికం చేసి ఆయా విద్యల నేర్చి పొట్టపోసుకొనేవారు. పొట్టకూటి విద్య పరమావధి అక్కడికే. జీవనోపాధి సంపాదించుకోవటంతో ఆగిపోతే పిల్లికూనకీ, మనకీ తేడా ఏమిటీ? కోతి పిల్లకీ, మన పిల్లలకీ వ్యత్యాసం ఏమిటి?

అసలు విద్య పరమార్ధం పొట్టకూడు సంపాదించటమేనా?

ఎంతమాత్రంకాదు.

వాస్తవానికి – ఏవిద్య అయితే మనిషిని చెడు ఆలోచించకుండా, చెడు చేయకుండా నిరోధిస్తుందో అదే అసలైన విద్య. అదే అసలైన చదువు. ఏవిద్య అయితే మనిషిని అహంకారం నుండి దూరం చేస్తుందో, ఆరిషడ్వర్గాల నుండి దూరం చేస్తుందో అదే అసలైన విద్య. అదే అసలైన చదువు. ఈ నిజాన్ని మన కళ్ళకి కట్టినట్లు చెప్పే ఓ చిన్నకథ చెబుతాను.

అవి ధారా నగరాన్ని భోజమహారాజు పరిపాలిస్తున్న రోజులు. స్వయంగా కవీ, పండితుడు అయిన భోజరాజు ఆస్థానంలో చాలామంది కవి పండితులుండేవాళ్ళు. మహాకవి కాళిదాసు వంటి గొప్ప వారుండేవారు.

అలాంటి భోజరాజు ఆస్థానంలో ఓ సంస్కృతి పండితుడు ఉండేవాడు. ఇతడు బహు కుటుంబీకుడు. అతడి దురదృష్టమేమో గాని రాజుగారి దృష్టి ఇతడి మీద అంతగా పడలేదు. రాజుని మెప్పించే అవకాశాలు అతడి కంతగా రాకపోవటం చేత, రాజ సన్మానం తక్కువుగా ఉండడం చేత అతడికి ఆర్దికంగా చాలా ఇబ్బందులుండేవి.

ఈ దారిద్ర్య బాధ పడలేక ఓరోజు అతడు రాజ ప్రాసాదం నుండి ఏవైనా విలువైన వస్తువులు దొంగిలించాలనుకున్నాడు. ఓరోజు రాత్రి, కొన్ని ద్వారాల దగ్గరి కాపాలా భటుల కనుగప్పి, కొన్ని ద్వారాల దగ్గరి కాపాలా భటులకి రాజుగారే తనని రమ్మన్నారని నమ్మబలికి, రాజు గారి అంతఃపురాన్ని చేరాడు. వెంట ఓపెద్ద సంచీ కూడా తెచ్చుకున్నాడు, దొంగిలించిన సొమ్ము వేసుకుపోవడానికి.

మొదట అతడికి ఓ మూల బల్లపై అలంకారార్ధమై పెట్టి ఉంచిన స్వర్ణప్రతిమ కనబడింది. దాన్ని ఎత్తి సంచిలో పెట్టుకోబోయాడు. అంతలో అతడికి తాను చదివిన గ్రంధాల నుండి ‘బంగారు బొమ్మని దొంగిలిస్తే నరకలోకాధిపతి యముడు 7 ఏళ్ళ సుదీర్ఘ కాలం శిక్షవేస్తాడని’ చెప్పే శ్లోకం గుర్తుకువచ్చింది. అంతే! చేతులాడలేదు. బొమ్మని యధాస్థానంలో ఉంచాడు.

అంతలో పరిచారకులు రావటంతో మూలన నక్కాడు. మరికొంత సేపు గడిచింది. అంతా సద్దుమణిగాక దారిద్రపీడితడైన ఈ పండితుడు మళ్ళా వెదుకులాట ప్రారంభించాడు. ఈసారి రాజుగారు ధరించే వజ్రాల హారం కనబడింది. నిశ్శబ్ధంగా దాన్ని తీసి సంచిలో వేసుకోబోయాడు. అభరణాలు దొంగిలిస్తే నరకంలో 12 ఏళ్ళు శిక్షపడుతుందన్న శ్లోకం గుర్తుకొచ్చింది. మళ్ళీ ప్రయత్నం విరమించుకున్నాడు.

ఉత్తచేతులతో ఇంటికెళ్తే, ఇంట్లో అవసరాలు గుర్తుకొచ్చాయి. మళ్ళీ ప్రయత్నించటం, తప్పుచేస్తే భగవంతుడు దండిస్తాడని చెప్పే శ్లోకం గుర్తుకురావటం, అంతటితో ఆగిపోవటం. రాత్రంతా ఎన్ని వస్తువులపై చెయ్యి వేసాడో, అన్నిటినీ అప్పుడే యధాస్థానంలో పెట్టేస్తూ గడిపేశాడు.

వేకువయ్యింది. తొలిఝాము నగారా మ్రోగింది. పండితుడికి కాళ్ళు చేతులూ వణికాయి. భయం ముప్పిరి గొంది. ఏంచెయ్యాలో దిక్కుతోచలేదు. పట్టుబడితే రాజదండన పడుతుంది. చటుక్కున రాజుగారి మంచం క్రిందికి దూరాడు. ఇంతలో రాజు గారి అంతఃపురంలో మంగళ వాద్యాలు మ్రోగాయి. మహారాజు నిద్రలేచి, వళ్ళు విరుచుకుంటూ వెళ్ళి నిలువుటద్దం ముందు నిలుచున్నాడు.

అంతలో వందిమాగధుల స్త్రోత్రపాఠాలు మొదలయ్యాయి. ఆ పొగడ్తలు వినగానే, ఆ మహారాజులో తన సంపద, సామ్రాజ్యం, గొప్పదనం పట్లా, తన అందమైన బలిష్ఠమైన రూపం పట్లా అతిశయం, అహంకారం కలిగాయి. రాజు అద్దం ముందు నిలబడిన భంగిమలో, అతడి దేహభాషలో ప్రతిఫలిస్తున్న ఈ అతిశయం, అహంకారం చూడగానే మంచం క్రింద దాక్కున్న పండితుడికి, తాను చదువుకున్న గ్రంధాల నుండి ’ఈ లోకంలో, జీవితం, అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, అన్నీ ఎంత అశాశ్వతమైనవో, చావు పుట్టుకలెంత సహజమైనవో, పోయేనాడు ఈ సంపద, సౌభాగ్యమూ, రూపలావణ్యభరితమైన శరీరమూ ఎలా వెంటరాదో ’ తెలియ చెప్పే శ్లోకం గుర్తుకు వచ్చింది. ‘ఈ ప్రపంచానికి మనం వీడ్కొలు చెప్పి వెళ్ళేముందు ఏదీ వెంటరాదనీ, చేసుకున్న మంచి చెడులే తప్ప మరేదీ శాశ్వతం కాదని’ చెప్పే శ్లోకాన్ని బిగ్గరగా, స్పష్టంగా పాడుతూ పండితుడు మంచం క్రింది నుండి బయటికొచ్చాడు.

స్వయంగా తాను పండితుడే అయినా భోజ మహారాజు మరుక్షణం ఆ శ్లోకంలోని ఆదర్శప్రాయమైన భావాన్ని గ్రహించగలిగాడు. తనలో పొడసూపిన అతిశయాన్ని, అహంకారాన్ని గుర్తించగలిగాడు. ఎప్పుడైతే గుర్తించగలిగాడో మరుక్షణం అతిశయాన్నీ, అహంకారాన్ని తననుండి పారద్రోల గలిగాడు. ఒకసారి అహంకారం అతడి మనస్సు నుండి దూరమయ్యాక, భోజరాజు ఉదయపు ఆనందాన్ని, సూర్య కిరణాల్లోని నులివెచ్చదనాన్ని, పిల్లగాలి లోని చల్లదనాన్ని, పూల పరిమళాన్ని ఆస్వాదించగలిగాడు.

అప్పుడు స్పురించిందాయనకి పండితుడి ఉనికి. అనువుకాని సమయాన, అనువుకాని చోట, అందునా తన శయన మందిరంలో, తన పడక మంచం క్రిందనుండి బయటి కొచ్చిన పండితుణ్ణి చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. విచారించగా విషయం బోధపడింది. దారిద్ర బాధ ఎంతగా ఉన్నప్పటికీ దొంగతనానికి ప్రయత్నించినందుకు పశ్చాత్తాపపడుతూ పండితుడు నిజం చెప్పేసాడు.

ఈ స్థితికి మహారాజు బాధ్యత వహించాడు. విచారం, పశ్చాత్తాపం వెలిబుచ్చాడు. పండితుడి ఆర్ధికావసరాలని తాను పట్టించుకోనందుకు మన్నింపు కోరాడు. ఉదయాన్నే సత్యం చెప్పి, తన పాండిత్య ప్రతిభతో సరైన శ్లోకాన్ని గుర్తుచేసి, అహంకారం అనే సర్పంబారిన పడబోయిన తనను కాపాడినందుకు కృతఙ్ఞతలు చెప్పుకొని, పండితుడి దారిద్ర్య బాధని తొలగించాడు.

ఇదీ కథ!

ఈ కథ మనకి విద్య,[ఙ్ఞానంతో కూడిన విద్య] మనల్ని మంచిమార్గంలో నడిపిస్తుందనీ, చెడు ఆలోచనలూ, చెడు పనులూ చేయబోయినప్పుడు హెచ్చరించి మంచివైపు మళ్ళిస్తుందనీ చెబుతుంది. ఈ కధలో పండితుడికి తప్పు చేయబోయినప్పుడు చట్టం గుర్తుకు రాలేదు. రాజు గుర్తుకు రాలేదు. భగవంతుడు గుర్తుకు వచ్చాడు. దొంగతనం చేసి పట్టుబడకుండా తప్పించుకుపోగలిగితే సాక్ష్యం లేదు గనుకా, చట్టం ఏంచేయలేదు, రాజూ శిక్షించలేడు. కానీ భగవంతుడికి సాక్ష్యం అక్కర్లేదు. తప్పు చేస్తే విధి తనని శిక్షిస్తుందని పండితుడు భయపడ్డాడు. ఈవిధంగా గుణశీలాలని, నైతికతని నేర్పవలసినది విద్య.

విద్య పరమార్ధం ఇదే. అంతేగాని కేవలం డబ్బు సంపాదన విద్య లక్ష్యం కాదు. సుఖంగా, సౌఖ్యంగా బ్రతకాలని ప్రతి మనిషీ, ప్రతి ప్రాణీ కోరుకుంటాయి. నిజానికి సుఖశాంతులతో బ్రతకడం ప్రతివారి హక్కు కూడాను. ప్రతిమనిషి ‘సౌఖ్యంగా బ్రతకటం’ అన్న గమ్యం కోసమే ప్రయత్నిస్తాడు. అయితే గమ్యంతో పాటు, దాన్ని చేరే మార్గం కూడా ఉన్నతంగానే ఉండాలి కదా!

బ్రతుకు తెరువు జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు.

ఈ నేపధ్యంలో ఒకసారి ఆలోచించి చూస్తే -

మనిషిని మంచి మార్గంలో నడిపించేది విద్య.

చెడు చేయకుండా నిరోధించేది విద్య.

ఈ విద్య మనం నేర్చుకున్నామా? నేర్చుకుంటున్నామా? మన పిల్లలకి నేర్పిస్తున్నామా?

బ్రతుకు తెరువు సంపాదించిపెట్టేది విద్య అయితే అది `డుకృఞ్ కరణే’ మాత్రమే. అలాంటి ‘డుకృఞ్ కరణే’ మనకే కాదు సర్వ జీవులకీ వచ్చు. జింకల నెలా వేటాడాలో పులిపిల్ల నేరుస్తుంది. లేత చిగురాకుల కోసం ఎక్కడ వెదకాలో జింక పిల్లా నేర్చుకుంటుంది.

కానీ మనిషి అంతకంటే ఎక్కువ నేర్చుకోవాలి కదా!

‘డుకృఞ్ కరణే ’ – అసలైన విద్యంటే....

ఆవి 8 వ శతాబ్ధి నాటి రోజులు. ఓనాడు కాశీపుర వీధుల్లో ఆది శంకరాచార్యులు, శిష్యసమేతంగా భిక్షార్ధియై వెళ్తున్నారు. ఓ ఇంటి వీధి అరుగు మీద, డెభై ఏళ్ళ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. పదేపదే గట్టిగా ’డుకృఞ్ కరణే, డుకృఞ్ కరణే’ అని వల్లిస్తున్నాడు. అది వ్యాకరణ సూత్రం. ఇతడు వృద్దుడు. కొన్ని దంతాలు ఊడిపోయి, కొన్ని వదులైపోయి మాట తొసి పోతున్నది. అసలు వ్యాకరణ సూత్రం ధ్వనిమారి, అతడి తొర్రినోట తప్పు పలుకుతున్నది. ముందుకూ వెనక్కీ ఊగుతూ, అతడు దాన్ని బట్టీ వేస్తున్నాడు. ఆ విధంగా సంపాదించిన పాండిత్యాన్ని – ఏ రాజుల ముందో, చక్రవర్తుల ముందో ప్రదర్శించి, సన్మానాలు, సంపదలూ పొందాలన్నది ఆ వృద్దుడి ఆకాంక్ష.

అది చూసి శంకరాచార్యుల వారికి ఆగ్రహం, జాలి కలిగాయి. ఎదుటి వాడు వృద్ధుడు. జీవితపు చివరిదశకు చేరినా సత్యమేమిటో ఇంకా గ్రహించలేకున్నాడు. ఇప్పటికీ సిరిసంపదలంటూ, సన్మానాలంటూ, పరుగులు పెడుతూనే ఉన్నాడు. అది చూసిన మరుక్షణం శంకరాచార్యుల వారినోట

భజగోవిందమ్ భజగోవిందమ్
గోవిందమ్ భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహిత కాలే
నహినహి రక్షతి డుకృఞ్ కరణే

అన్న శ్లోకం పలికిందట.

“ఓరి మూర్ఖుడా! అంత్యకాలం సమీపించినప్పుడు, ఈ లౌక్యపు విద్యలు, ‘ఉపాధి, సంపద’ ఇస్తాయని సాధన చేసిన ఈ కళలు నిన్ను రక్షించలేవు. ఇప్పటికైనా గోవిందుణ్ణి [భగవంతుణ్ణి] భజించు” అని దాని అర్ధం. ముక్కుముఖం తెలియని ఎదుటివాణ్ణి, వయో భేదాన్ని పట్టించుకోకుండా, ఙ్ఞాన భేదాన్ని పరిగణించి, శిష్యుణ్ణి మందలించినట్లుగా ‘మూఢమతే’ అని మందలిస్తూ, సత్యాన్ని బోధించినందుకేనేమో ఆది శంకరుల వారిని జగద్గురువని పిలుస్తారు. భజగోవింద శ్లోకాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్ర మాధుర్యంలో రంగరించి చెవులబడుతుంటే ఆత్మ విశ్వపర్యటన చేస్తున్నట్లుంటుంది.

తదుపరి శ్లోకాలలో కొన్ని జగద్గురు ఆది శంకరాచార్యుల వారి శిష్యులు పూరించారట. భజగోవింద శ్లోకాలని విన్నప్పుడు, చదివినప్పుడూ మనస్సులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.

ఆ వృద్ధుడు రాజు గారి నుండి ప్రశంసలూ, సన్మానాలు, తద్వారా కానుకలు, సంపదలు పొందాలని, వయసైపోయిన తర్వాత కూడా విద్యలు వల్లిస్తున్నాడు. విద్యా ప్రదర్శనతో, ఎలాగైనా రాజప్రీతిని పొందగలిగితే ఆర్ధికలాభం. ఇదీ ఆలోచన.

నిజానికి మన విద్యాసంస్థల్లో బోధించేది, సర్టిఫికేట్లు లో సూచించేది విద్య అనుకుంటాం గానీ, అది అసలైన విద్యకాదు. అది ’డుకృఞ్ కరణే’ వంటి విద్య మాత్రమే. అసలైన విద్య ఏమిటో, దాని పరమార్ధమేమిటో, నాకు చేతనైనట్లుగా మరో టపాలో వివరిస్తాను.

చిక్కుడు గింజకు చారలెందుకు వచ్చాయంటే!

అనగా అనగా.....

ఓ ఊరిలో ఓ అవ్వ ఉండేది. ఓ రోజు ఆవిడ వంట చేద్దామని పొయ్యి వెలిగించి, పొయ్యి మీద కుండ పెట్టింది. కుండలో కొన్ని నీళ్ళు పోసింది. ఎండుపుల్లలు బాగా మండేందుకు గాను కొన్ని బొగ్గు ముక్కలూ, వరిగడ్డి పోచలూ పొయ్యి పక్కన పెట్టుకుంది.

ఇంతలో ఓ గడ్డిపోచ ప్రక్కకు తప్పించుకుంది. ఓ బొగ్గుముక్క కూడా పొయ్యిలో పడకుండా పక్కకు గెంతింది. కానీ అప్పటికే పాపం దాని ఒంటికి కాస్త సెగ అంటుకుంది. అంతలో పొయ్యి మీది కుండలో నీళ్ళు మరగడం మొదలెట్టాయి. అవ్వ చేటలో కొన్ని చిక్కుడు గింజలు తెచ్చి కుండలో పోసింది. పొయ్యి ముందు కూర్చొని మంటెక్కువ పెట్టసాగింది.

ఇంతలో ఓ చిక్కుడు గింజ చేటలోంచి కుండలోని వేన్నీళ్ళలో పడకుండా తెలివిగా ప్రక్కకు జారి తప్పించుకుంది. చిక్కుడు గింజా, బొగ్గుముక్కా, గడ్డిపీచు కూడబలుక్కున్నాయి.

"అమ్మో. ఇక్కడే ఉంటే ఈ అవ్వ మనల్ని చూడకా మానదు. మంటల్లో వెయ్యక మానదు. పారిపోదాం” అనుకున్నాయి. గోడవారగా జరుగుతూ మెల్లిగా అవ్వ ఇంట్లోంచి బయట పడ్డాయి. వీధి ప్రక్కగా నక్కుతూ నక్కుతూ గాలికి కొట్టుకుపోతున్నట్లుగా నటిస్తూ పారిపోవటం మొదలెట్టాయి. అలా అలా వీధి చివరికి వచ్చేసాయి. వీధి చివర వాటికొక కాలువ అడ్డంగా ఉంది. ఆ చిన్న వీధి కాలువ వాటి ప్రాణానికి గంగా ప్రవాహమంత పెద్దగా కన్పించింది.

ఎలాదాటడం? గడ్దిపోచ, బొగ్గు ముక్కా, చిక్కుడు గింజ తీవ్రంగా ఆలోచించసాగాయి.

“ఐడియా!” ఒక్కసారిగా అరిచింది గడ్డిపోచ.

"ఏమిటి?" ఆత్రంగా అడిగాయి బొగ్గుముక్కా చిక్కుడు గింజా.

"నేను ఈ కాలువకి అడ్డంగా వంతెనలా పడుకుంటాను. నామీదుగా దాటండి మీ ఇద్దరూ!” అంది గడ్దిపోచ ఉత్సాహంగా.

"భలే భలే!” మరింత ఉత్సాహంగా అభినందించింది బొగ్గు ముక్క.

" ముందు నేను దాటుతాను” గోముగా అడిగింది చిక్కుడు గింజ.

గడ్దిపోచ కాలువకి అడ్డంగా పడుకుంది. దాని మీదుగా దాటుతూ చిక్కుడు గింజ ఆవలి వైపుకి చేరిపోయింది.

ఇక బొగ్గు ముక్క వంతు వచ్చింది. మెల్లిగా గడ్దిపోచ మీదకి ఎక్కి కాలవ దాటడం మొదలు పెట్టింది బొగ్గుముక్క. దానికి కొంచెం సెగ అంటుకొని ఉందయ్యె. గడ్డిపోచకి అది సోకింది. అప్పటికే బొగ్గుముక్క సగానికి వచ్చేసింది.

"త్వరగా దాటేయ్! నీ సెగకి నేను కాలిపోయేలా ఉన్నాను” గాబరా పడింది గడ్డిపోచ.

కంగారుగా కిందికి చూసింది బొగ్గుముక్క. సన్నని గడ్డిపోచపై తాను. క్రింద పారుతున్న నీళ్ళు. దెబ్బకి దానికి కళ్ళు తిరిగాయి. కాళ్ళు తడబడ్డాయి. కదల్లేక పోయింది. అది ఒకేచోట ఆగిపోయేసరికి, దాని సెగకి గడ్డిపోచ కాస్తా మధ్యకి తగలబడింది. దెబ్బకి కాలువలోకి రెండు ముక్కలుగా విరిగిపోయింది. దాంతో బొగ్గుముక్క నీళ్ళల్లో పడిపోయింది. పాపం రెండూ నీళ్ళల్లో కొట్టుకు పోతూ కేకలు పెట్టసాగాయి.

ఇదంతా చూసి ఒడ్డునున్న చిక్కుడు గింజ విరగబడి నవ్వింది. పడీ పడీ నవ్వింది. పొట్టపట్టుకొని పగల బడి నవ్వింది. క్రిందపడి దొర్లి దొర్లి నవ్వింది. ఆ దెబ్బకి దాని పొట్ట కాస్తా పగిలిపోయింది.

దాంతో అప్పటిదాకా నవ్వుతూ తుళ్ళుతూ, ఉన్న చిక్కుడు గింజ కాస్తా కుయ్యో మొర్రో మంటూ ఏడవటం మొదలు పెట్టింది. అప్పడే ఆ దారిలో వెళుతున్న దర్జీ ఒకడు దాన్ని చూసి చేతుల్లోకి తీసుకొని “ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు.

కళ్ళు తుడుచుకుంటూ సంగతంతా చెప్పింది చిక్కుడు గింజ.

దర్జీ దానివైపు జాలిగా చూస్తూ “చూశావా? గడ్డిపోచ, బొగ్గుముక్క నీకు మిత్రులు. నీలాంటి వాళ్ళే. పాపం గడ్డిపోచ నీకు సహాయం చేసింది. దాని సాయమే లేకుంటే నీవు కాలువ దాటలేవు కదా! గడ్డిపోచ బొగ్గుముక్కకీ సాయం చేయబోయి నీళ్ళల్లో పడిపోయింది. న్యాయంగా అయితే నువ్వు వాటికి సాయం చేయాలి. సాయం చేయలేక పోతే కనీసం సానుభూతి కలిగి ఉండాలి. అదేమీ లేకుండా వాటిని చూచి ఎగతాళి చేశావు. అవి నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే పగలబడి నవ్వావు. పొట్టపగిలేవరకూ నవ్వావు. తప్పు కదా!” అన్నాడు.

చిక్కుడు గింజ వెక్కిళ్ళు పెడుతూ “నిజమే! నాకు బుద్దొచ్చింది. దయచేసి నా పొట్ట కుట్టవా?" అంది జాలిగా.

దర్జీ జేబులో వెతుక్కుంటే సూది ఉంది గానీ మ్యాచింగ్ దారం దొరక లేదు. దాంతో ఉన్న దారంతో దాని పొట్టకుట్టేసాడు.

అందుకే ఇప్పటికీ నల్లని, ఎర్రని చిక్కుడు గింజల మీద తెల్లని చార, తెల్లని చిక్కుడుగింజల మీద నల్లటి చారా ఉంటాయి.

ఏ రంగులో ఉన్నా చిక్కుడు గింజలు రుచిగా ఉంటాయి.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes