RSS
Wecome to my Blog, enjoy reading :)

మూగ బాసల అర్ధాలేమిటి? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 21]

భేతాళుడు మొదటి కథ ప్రారంభించాడు.

ఒకప్పుడు దేవాపురం అనే నగరం ఉండేది. ఆ నగరాధీశుడి పేరు ప్రతాపవంతుడు. అతడికొక కుమారుడు; పేరు వజ్రకూటుడు. ప్రతాప వంతుడి మంత్రికీ ఒక కుమారుడున్నాడు. రాజు, మంత్రి కుమారులిద్దరూ సమ వయస్కులు. ప్రాణ స్నేహితులు కూడా! అనతి కాలంలోనే గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి, ఇరువురూ నగరానికి తిరిగి వచ్చారు.

నెలకో రోజు ఇద్దరూ కలిసి, సపరివార సమేతంగా వేటకై అడవికి వెళ్ళేవారు.

అదే విధంగా, ఓ రోజు యువరాజు, మంత్రి కుమారుడూ వేట కెళ్ళారు. అడవిలో వేటాడుతుండగా వాళ్ళకొక సుందర సరోవరం కనబడింది. ఆ సరస్సులో అందమైన యువతి ఒకామె జలకాలాడుతోంది. ఆమెని చూడగానే యువరాజు ముగ్ధుడై పోయాడు. తొలి చూపులోనే ప్రేమలో పడి పోయాడు. ఒడ్డుకు చేరుకున్న ఆమె కూడా యువరాజుని చూసింది. అతడి అందమైన రూపానికి ఆమె కూడా ముగ్దురాలై, ప్రేమలో పడింది.

చెంపలు ఎర్రబడగా తల దించుకొంది. యువరాజు రెప్పలార్పక ఆమెనే చూస్తున్నాడు. ఆ యువతి క్రిందికి వంగి, కొలనులో నుండి పద్మాన్ని కోసింది. పద్మాన్ని తన రెండూ కళ్ళకూ తాకించుకొంది. దాన్ని మునిపంట కొరికి, పాదాల మీద వేసుకుంది. మరోసారి కొలనులో నుండి కలువ పూవు నొకదాన్ని కోసింది. ఆ పూవును సున్నితంగా ముద్దాడి, హృదయానికి తాకించుకుంది. ఆపైన సిగలో పెట్టుకొని, రాకుమారుడి వైపు క్రీగంట చూసి, ముసిముసి నవ్వులతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ఆమె అందాన్నీ, చేతల్నీ చూసి యువరాజు దిమ్మెర పోయాడు. మంత్రి కుమారుడితో "మిత్రుడా! ఆ యువతి నా మనస్సు హరించింది. చూడగా ఆమె చేతలకేదో సంకేతార్ధమున్నట్లు తోచుచున్నది. ఆమె చర్యల కేది అర్ధమై ఆలోచించి చెప్పు" అన్నాడు.

మంత్రి కుమారుడు కొన్ని క్షణాలు ఆలోచించి "యువరాజా! ఆమె పద్మాన్ని కనులకి తాకించుకొంది. ఆ విధంగా ఆమె తన నివాసం ఈ దాపులనే ఉన్న నేత్రపురమని చెప్పింది. పద్మాన్ని మునిపంట కొరికింది. ఆ విధంగా ఆమె తన పేరు పద్మావతి అని చెప్పింది. పిదప పద్మాన్ని పాదాల మీద పడవేసింది. అంటే ఆమె తండ్రి పేరు ఉత్తాన పాదుడన్న మాట.

ఆమె కలువ పూవును ముద్దాడి, హృదయానికి తాకించుకొంది. కలువ పూవు చంద్రుని ప్రేయసి. ప్రేమకు చిహ్నం. ఆ విధంగా, ఆమె తాను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని సంకేతమిచ్చింది. కలువని సిగలో తురిమి, మిమ్మల్ని ఓరకంట చూసి, ముసిముసిగా నవ్వి వెళ్ళిపోయిందంటే అర్ధం, మీరు తనని రహస్యంగా వచ్చి కలుసుకోమని. ఇవీ ఆమె చర్యలకు అర్ధాలు" అన్నాడు సాలోచనగా!

యువరాజుకి పట్టలేనంత సంతోషం కలిగింది. వేట చాలించి, పరివారంతో కలిసి దేవపురానికి తిరిగి వెళ్ళారు. తర్వాత ఇద్దరే మారువేషాల్లో బయలు దేరి, నేత్రపురం వెళ్లారు. అక్కడికి వెళ్ళి వాకబు చేస్తే తేలిందేమంటే - ఉత్తాన పాదుడు నేత్రపురాధీశుడు. పద్మావతి అతడి కుమార్తె.

అంతఃపురంలో ఉండే యువరాణి నెలా కలవటం? రాజు, మంత్రి కుమారులిద్దరూ, పద్మావతి దాసదాసీ జనుల వివరాలు సేకరించారు. యువరాణి పద్మావతికి పూమాలికలు అల్లి తీసికెళ్ళే దాసీ గురించి తెలుసుకున్నారు. ఆమె పూటకూళ్ళ ఇల్లు కూడా నడిపే పేదరాశి పెద్దమ్మ. పూలదండలని వైనవైనాలుగా అల్లే ఆమె చాతుర్యం రీత్యా, ప్రతీరోజూ యువరాణికి ఆమె పూలమాలలు తీసికెళ్ళి ఇచ్చేందుకు నియమింపబడింది.

రాజు, మంత్రి కుమారులిద్దరూ పూటకూళ్ళ అవ్వ ఇంట బస చేసారు. [పూర్వకాలపు హోటళ్ళనే పూటకూళ్ళ ఇళ్ళనే వాళ్ళు. అక్కడ డబ్బులిస్తే బస, ఆహారం దొరుకుతాయి.] విలువైన కానుకలిచ్చి, పూటకూళ్ళ అవ్వను బాగా మంచి చేసుకున్నారు. రెండు రోజులున్నాక అవ్వకు అన్ని విషయాలు చెప్పి, ఆమె ద్వారా పద్మావతికి తన రాక గురించి సందేశం పంపించాడు యువరాజు.

పూటకూళ్ళ అవ్వ యువరాణికి పూదండలిచ్చాక, ఎవరూ లేకుండా చూసి, యువరాజు రాక గురించీ, ఇతర వివరాలన్నీ చెప్పింది. అదంతా వినగానే పద్మావతి కోపంతో భగ్గుమంది. తన పదివేళ్ళనీ తెల్లని చల్లని చందనంలో ముంచి, ముసలవ్వ బుగ్గల మీద పదివేళ్ళ గుర్తులు పడేలాగా, చెంపల మీద సున్నితంగా కొట్టింది.

ఆపైన తిట్టి వెళ్ళగొట్టింది. పేద రాశి పెద్దమ్మ, యువరాణి కోపాన్ని చూసి, తిట్లు వినీ, దెబ్బలు తినీ, భయంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చింది. పులి పంజా నుండి తప్పించుకొచ్చిన లేడి కూనలా గజగజా వణుకుతూ, రాజు, మంత్రి కుమారులకి చెంపమీద వేళ్ళ గుర్తులు చూపిస్తూ పొగిలి పొగిలి ఏడ్చింది. యువరాజు ఏదో చెప్పబోయాడు.

అవ్వ”చాలు నాయనలారా చాలు! బహుశః ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసు కాబోలు. అందుకే అమాయకపు ముసలి దాన్ని నన్నెంచుకున్నారు. ఇంత వయస్సు వచ్చి, మీ చేతుల్లో ఇలా మోసగించబడ్డాను. ఇంతకూ మిమ్మల్నన పనేమిటి? ఇందులో మీ తప్పేం లేదు. తప్పంతా నాది. మిమ్మల్ని నమ్మి, ఈ వయస్సులో ఇలా భంగపడ్డాను!” అంటూ అంగలార్చింది.

పేదరాసి పెద్దమ్మ పెడబొబ్బలు విని యువరాజు మ్రాన్పుడిపోయాడు. యువరాణి పద్మావతికి కోపం రావట మేమిటని నిర్ఘాంతపడ్డాడు. పాపం, యువరాజుకి బెంగ కూడా వేసింది.

మంత్రి కుమారుడు యువరాజును ఊరడించి, ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయాడు. "ఓ యువరాజా! ఆమె సామాన్యురాలు కాదు. ఎంత అందమైనదో, అంత తెలివైనది. ఆమె పేదరాశి పెద్దమ్మ చెంపల మీద, తెల్లని గంధంలో ముంచిన పదివేళ్ళ గుర్తులు పడేలా సున్నితంగా కొట్టింది. నిజంగా కోపం ఉన్నదే అయితే సున్నితంగా కొట్టదు. చెంపలు వాతలు తేలేలా కొట్టి ఉండేది. అంతే కాదు, కేవలం తిట్లతో సరిపెట్టేది కాదు, రాజు గారితో చెప్పి ముసలవ్వకు శిక్ష వేయించేది. కాబట్టి, ఆమెకు నీ మీద ప్రేమలేదని బెంగపడకు.

ఒక ప్రత్యేక సంకేతాన్నిచ్చేందుకే ఆమె ఇలా చేసింది" అన్నాడు. యువరాజు ఆతృతగా "అవునా? ఏమిటా సంకేతం?" అనడిగాడు.

మంత్రి కుమారుడు "ఇప్పుడున్నవి శుక్ల పక్షపు రోజులు. ఈ రోజు పంచమి. రానున్న రోజులన్నీ వెన్నెల రోజులే! నేటికి పదవ రోజున పున్నమి. తర్వాత కృష్ణ పక్షపు రోజులొస్తాయి. అప్పుడంతా చీకటిగా ఉంటుంది. కాబట్టి, మిమ్మల్ని పదిరోజులు పాటు వేచి ఉండమన్న సంకేతం పంపింది." అని విడమరిచి చెప్పాడు. యువరాజు స్థిమితపడ్డాడు. పదిరోజులు పది యుగాలుగా గడిపాడు. నిరీక్షణ అంతూ దరీ లేనట్లు తోచింది. పదిరోజులు గడిచాయి. పదకొండవ రోజున…

~~~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes