RSS
Wecome to my Blog, enjoy reading :)

యువరాణి ప్రేమాయణం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 51]

పునః ప్రయత్నాల వల్ల విక్రమాదిత్యుడు అలసిపోలేదు. సరికదా, రెట్టించిన ఉత్సాహంతో, భేతాళుడు చెప్పే కథల పట్ల ఆసక్తితో...మరోసారి మోదుగ చెట్టెక్కి, శవాన్ని దించి భుజాన వేసుకొని, బృహదారణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడూ అలిసి పోలేదు. మరో కథ, పద్దెనిమిదో కథ చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు.

“ఓ రాజోత్తమా! పరాక్రమ శాలీ! ధైర్యశీలీ! విను...” అంటూ ఇలా కొనసాగించాడు.

ఒకప్పుడు గోపాలపురం అనే నగరం ఉండేది. అదెంతో సువిశాలమైనది, సుందరమైనది. దానికి రాజు కార్తికేయుడు. అతడా నగరాన్ని నిజాయితీగా పరిపాలిస్తుండేవాడు. దాంతో అతడు ప్రజల కెంతో ప్రీతిపాత్రుడయ్యాడు.

అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు భగవతి. ఆమె యుక్తవయస్సులో ఉంది. సౌందర్యంతో శోభిల్లుతూ ఉంది. ప్రజలామెని గని ‘అందాల గని’ అని పొగుడుతూ ఉండేవాళ్ళు. ఆటపాటల్లో సంగీత సాహిత్యాల్లో ఆమెది అందె వేసిన చెయ్యి.

ఓనాటి సాయం సంధ్య వేళ.... భగవతి తలారా స్నానం చేసి, తన పొడవాటి అందమైన కురులని ఆర్చుకుంటున్నది. వేళ్ళతో అలవోకగా చిక్కులు తీస్తూ సంజ కెంజాయ రంగులని ఆస్వాదిస్తున్నది. పిల్లగాలికి ఆ పిల్ల కురులూగుతూ హొయలొలికిస్తున్నాయి.

ఆ సమయంలో.... రాజవీధిలో ఓ బ్రాహ్మణ యువకుడు పోతున్నాడు. అతడి పేరు ధనస్వామి. అతడెంతో అందంగా ఉన్నాడు. గిరజాల జుట్టు, కోరమీసం, తెల్లని దేహచ్ఛాయ... మూర్తీభవించిన మన్మధుడిలా ఉన్నాడు. యధాలాపంగా అతడు భగవతిని చూసాడు. సౌందర్యాధిదేవతలా ఉన్న యువరాణిని చూసి అతడు అబ్బురపడ్డాడు.

సరిగ్గా ఆ క్షణమే.... భగవతీ అతణ్ణి చూసింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా తళుక్కుమన్నాయి. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. ఒకరొకరిపై చూపుల తూపులు విసురు కున్నారు. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉదయించిందని ఇద్దరికీ అర్ధమైంది. కానీ ఎలా కలుసుకోగలరు?

భగవతి రాచకన్య. ధనస్వామి సాధారణ బ్రాహ్మణ యువకుడు. అలాంటి చోట, ధనస్వామి యువరాణినెలా కలుసుకోగలడు? దాంతో ఇద్దరూ భారమైన హృదయాలతో, దీనంగా చూస్తూ ఊర్కున్నారు.

అయితే ధనస్వామి ఇంటికి వెళ్ళినా క్షణం కుదురుగా ఉండలేకపోయాడు. నిద్రాహారాలు పట్టలేదు. ప్రతీక్షణం, పగలూ రాత్రి, అదే థ్యాసగా యువరాణి భగవతిని ఎలా కలుసుకోవాలా అని ఆలోచించసాగాడు. చివరికి అతడో నిర్ణయానికి వచ్చాడు.

ఆ ప్రకారం ధనస్వామి, తన మిత్రుడైన లోకదేవుణ్ణి కలుసుకున్నాడు. లోకదేవుడు చాలా తెలివైన వాడు. యుక్తి పరుడు. నేర్పరి. ధనస్వామి లోకదేవుడికి విషయమంతా చెప్పి ‘యువరాణిని కలుసుకునేందుకు ఉపాయమేదైనా చెప్పి పుణ్యం కట్టుకో’మన్నాడు.

లోకదేవుడు మిత్రుడి కోరిక విని మ్రాన్పడి పోయాడు. తేరుకున్నాక “మిత్రమా, ధనస్వామి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమి మాట్లాడుతున్నావు? ఎక్కడ నీవు? ఎక్కడ యువరాణి? తేడా వస్తే కుత్తుకలు తెగిపోగలవు సుమా!” అని హెచ్చరించాడు. దాంతో ఖిన్నుడైన ధనస్వామి ముఖం చూసి లోకదేవుడికి జాలి కలిగింది. మిత్రుడి యందు ప్రేమాతిశయంతో.... సాహసానికి పూనుకున్నవాడై “ప్రియమిత్రుడా! నీ కోరిక తీర్చుట కష్టసాధ్యం. ప్రమాదభరితం కూడా! అయినా నీవు నా ప్రాణసఖుడవు. నీ కోసం నేను పూనుకుంటున్నాను. నీకో ఉపాయం చెబుతాను. నువ్వు చింతించకు” అన్నాడు.

దాంతో ధనస్వామికి ఎంతో ఊరట కలిగింది. బాగా ఆలోచించి లోకదేవుడు ఓ ఉపాయం చెప్పాడు. ఆ ప్రకారం, లోకదేవుడు ఓ మునిలా వేషం ధరించాడు. ధనస్వామికి అందమైన యువతి వేషం వేసాడు.

ఇద్దరూ రాజు కార్తికేయుడి సభకు వెళ్ళారు. లోకదేవుడు రాజుకు నమస్కరించి “మహారాజా! నీకు సర్వసుఖాలూ కలుగుగాక! భగవంతుడు నీకు ఆయురారోగ్య భోగభాగ్యాలూ ఇచ్చుగాక!” అని దీవించాడు.

రాజతణ్ణి గౌరవించి, అతిధి సత్కారాలు ఆచరించాడు. లోకదేవుడు “రాజోత్తమా! నేను కాశీ యాత్రకు పోవుచున్నాను. ఇదిగో ఈ పిల్ల నా కుమార్తె సుకేశిని. (అందమైన మంచి శిరోజాలు కలది అని ఆ పేరుకు అర్ధం.) తల్లి లేని ఈ బిడ్డని అల్లారు ముద్దుగా పెంచాను. ఇప్పుడు ఈ అందమైన యవ్వనవతిని వెంటబెట్టుకుని, కాశీ యాత్ర వంటి దూరప్రయాణం చెయ్యలేను. అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి నిన్ను సాయమర్ధించ వచ్చాను. నేను తిరిగి వచ్చు వరకూ, నాబిడ్డను నీకు అప్పగిస్తాను. ఆమె రక్షణ భారం వహించవలసిందిగా నా ప్రార్ధన” అన్నారు.

రాజందుకు సంతోషంగా సమ్మతించాడు. సుకేశిని రూపంలో ఉన్నది స్త్రీ కాదనీ, పురుషుడనీ తెలియని రాజు, ఆమెని తన కుమార్తె భగవతి మందిరానికి పంపించాడు. సమ వయస్కులవ్వటం చేత, ఇద్దరూ స్నేహంగా మెలగ గలరని అతడనుకున్నాడు.

భగవతి మందిరం చేరిన సుకేశిని వేషధారణలో ఉన్న ధన స్వామి, యువరాణితో ఏకాంత సమయం కోసం వేచి ఉన్నాడు. ఓ రోజు ఎవరూ లేకుండా చూసుకుని, ధనస్వామి ‘తాను స్త్రీ కాదనీ, సుకేశినిగా ఉన్న తాను పురుషుడననీ, తన పేరు ధనస్వామి అనీ’ వివరించాడు.

అది విని భగవతి ఆశ్చర్యంతో కొయ్యబారి పోయింది. ఆమెకతడి మీద ప్రేమ ఉప్పొంగింది. కానీ అది పైకి కనబడనివ్వకుండా, కోపం నటిస్తూ “ఏమిటీ? ఎంత ధైర్యం నీకు, ఈ విధంగా రాజమందిరంలోకి రావటానికి? నేనంత చులకనగా తోచానా నీకు? ఇదంతా మా తండ్రికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చూడు, నేను నిన్ను ఏం చేస్తానో?” అంది.

అయితే బ్రాహ్మణ యువకుడు ధనస్వామి అందుకు బెదరలేదు. చెదరని చిరునవ్వుతో “ప్రేయసీ! నీ మీది ప్రేమకొద్దీ నేనిలా ప్రాణాలకు తెగించాను, అంతే తప్ప మరిక దేని కోసమూ కాదు. తొలి చూపులోనే నీవూ నాపై వలపు కలిగి ఉన్నావని నాకు తెలుసు. కాబట్టి నన్ను బెదిరించ ప్రయత్నించకు. అది వృధా.

ప్రేమతో నన్ను అంగీకరించు. ఎందుకిదంతా మీ తండ్రికి చెప్పేందుకు ఆతృత చూపిస్తావు? నీవు నన్ను రక్షించగలవు. నన్ను కాపాడేందుకు నీవే సమర్ధరాలవు. నేను ప్రాణాధికంగా నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నిన్ను చేరేందుకు ఇంత ప్రమాదానికైనా పాలుపడ్డాను. ఇక ఇప్పుడు నన్ను రక్షిస్తావో లేక శిక్షిస్తావో నీదే నిర్ణయం. నీవేది చేసినా నాకు ఇష్టమే! నీ ప్రేమ పొందలేనప్పుడు రాజు చేతిలో మరణం పొందడమైనా నాకు ఆనందమే!” అన్నాడు.

ధనస్వామి తన కొరకు అంత సాహసానికి పూనుకోవటం, ప్రాణాలకు తెగించటం.... భగవతికి ఎంతో ఆనందం కలిగించింది. ఆపైన అతడి తీయని మాటలకీ తెగింపుకీ మరింత ముగ్దురాలైంది. కిలకిలా నవ్వుతూ “ప్రియా! నేను చేయగలిగింది ఇదే!” అంటూ అతడి చెక్కిలిపై ముద్దు పెట్టుకుంది. ధనస్వామి పరవశించి పోయాడు.

అది మొదలు ఏకాంతంగా ఇద్దరూ ఒండొకరి సాన్నిహిత్యాన్ని ఆనందించ సాగారు. ఇది ఇతరులెవరు కనిపెట్ట లేక పోయారు.

1 కామెంట్‌లు:

Sirisha చెప్పారు...

naku istamaina kadhalu...eppudu chadivi vellipotu unta...mee opika ki joharlu....

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes