RSS
Wecome to my Blog, enjoy reading :)

దొంగపై తొలిప్రేమ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 48]

యధాప్రకారం విక్రమార్కుడు మోదుగ చెట్టు చేరి, భేతాళుని బంధించి నడక ప్రారంభించాడు. భేతాళుడు కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్య మహారాజా! నీ పట్టుదల చూడ ముచ్చటగా ఉంది. శ్రమ తెలియకుండా ఈ కథ విను!” అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు అయోధ్యా నగరం అనే రాజ్యం ఉండేది. ఆ నగరంలో ఒక ప్రముఖ వణిక శ్రేష్ఠి ఉండేవాడు. అతడి పేరు వీరకేశుడు. అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు రత్నావళి. ఆ పిల్ల చాలా చక్కనిది. ప్రజలామెని చూసి దేవకన్యలలో కూడా అంత అందమైన అమ్మాయి ఉండదని ప్రశంసించే వాళ్ళు.

అందంతో పాటు రత్నావళి వినయవిధేయతలూ, దయ వంటి సద్గుణాలూ కలది. కళాభినివేశం కలది.

ఆమె అందచందాల గురించీ, సుగుణ సంపద గురించీ విన్న చాలామంది యువకులు, ఆమెను వివాహమాడాలని ఉవ్విళ్ళూరే వారు. వారిలో కొందరు రత్నావళి తల్లిదండ్రులని సంప్రదించారు. వారిలో యోగ్యుడైన ఒక యువకుడికిచ్చి రత్నావళి వివాహం జరిపించాలని వీరకేశుడు, అతడి భార్య నిర్ణయించారు.

అది విని రత్నావళి, తల్లిదండ్రుల వద్దకు చేరి ‘తాను ఎవరినీ వివాహమాడననీ, తనకు వివాహేచ్ఛ లేదనీ’ తెగేసి చెప్పింది. అది విని కలవర పడ్డారు వీరకేశుడూ, అతడి భార్య!

తమ గారాల పట్టిని బుజ్జగించి వివాహం పట్ల విముఖత వీడమని పరిపరి విధాల నచ్చచెప్పారు. అయినా లాభం లేకపోయింది. రత్నావళి తన పట్టు వీడలేదు. చేసేది లేక వీరకేశుడు, అతడి భార్య బిడ్డని కంటికి రెప్పలా కాపాడ సాగారు.

రోజులు ఇలా గడుస్తున్నాయి.

ఆ సమయంలో అయోధ్యా నగరంలో దొంగల బెడద పెరిగిపోయింది. దొంగలు ఇళ్ళకి కన్నాలు వేసి, చాకచక్యంగా డబ్బూ దస్కం, నగానట్రా దోచుకు పోతున్నారు. ఎవరూ దొంగల్ని పట్టుకోలేక పోయారు. ప్రజలంతా కూడా దొంగల బాధకి చాలా కలవర పడ్డారు.

వారంతా గుంపుగా అయోధ్యా నగరపు రాజు దగ్గరికి పోయి ‘తమని దొంగల బారి నుండి కాపాడవలసింది’గా మొరపెట్టుకున్నారు. ఆ నగరపు రాజు మంచి వాడు, సమర్ధుడు! అతడు ప్రజలకి దొంగల బాధ నుండి విముక్తి కలిగిస్తానని హామీ ఇచ్చాడు.

వెంటనే సైనికులనీ, దళాధిపతులనీ పిలిచి, దొంగలను పట్టుకోవలసిందిగా ఆజ్ఞాపించాడు. కానీ లాభం లేక పోయింది. ఈ వార్త విని దొంగలు అప్రమత్తమయ్యారు. మరింత జాగ్రత్తగా ఇళ్ళకి కన్నాలు వేయటం, దొంగతనాలు చేయటం సాగించారు. సైనికులు, దళాధిపతులు ఒక్క దొంగని కూడా పట్టుకోలేక పోయారు.

ఇక లాభం లేదని రాజే స్వయంగా రంగంలోకి దిగాడు. మారు వేషం ధరించి, ఆయుధాల చేతబూని రాత్రివేళ నగర వీధుల్లో తిరగ సాగాడు.

ఆ రోజు అమావాస్య! అర్ధరాత్రి కావస్తోంది. నగర వీధుల్లో ఎంత చీకటిగా ఉందంటే – ఎదురుగా ఏముందో కూడా కనిపించటం లేదు. హఠాత్తుగా రాజుకు, తనకు కొద్ది దూరంలో భారీకాయుడొకడు నిలిచి ఉన్నట్లు లీలగా తోచింది.

రాజు బిగ్గరగా “ఏయ్! ఎవరు నువ్వు?”అనడిగాడు. అక్కడ నిలబడి ఉంది దొంగల నాయకుడు. అతడు రాజు కంఠ స్వరాన్ని గుర్తు పట్టాడు. గొంతు సవరించుకుని “ఓ రాజా! నేను ఈ నగర దేవత మహంకాళి కొడుకును. పోలేరమ్మ గుడిలో ఉండే దేవర పోతురాజును”అన్నాడు.

రాజు అతణ్ణి దొంగల నాయకుడిగా అనుమానించాడు. కానీ దొంగల నాయకుడు చెప్పినట్లుగా అతణ్ణి పోతురాజని నమ్మినట్లుగా నటిస్తూ “ఓ పోతురాజా! నిన్ను గుర్తించక ఎవరు నువ్వని అడిగినందుకు మన్నించు. నువ్వు మా నగర దేవత మహాంకాళి కుమారుడివి. కాబట్టి నువ్వూ మాకు దేవుడవే! మీ తల్లి మా నగరాన్ని, మమ్మల్నీ కాపాడుతుంది. నా మనస్సులో ఒక కోరిక ఉంది. చాలా రోజులుగా నీవు మా నగరానికి రక్షణగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నా కోరికని నిర్లక్ష్యం చెయ్యకుండా, నీవు నాకా వరాన్ని ఇవ్వాలి. నిన్ను వెయ్యి విధాల ప్రార్థిస్తూన్నాను. నువ్వు నా ప్రార్ధనని మన్నించి తీరాలి. నీవు మా నగరానికి రక్షణగా ఉండాలి” అన్నాడు. ఆ విధంగా అతణ్ణి మాటల్లో పెట్టటమే రాజు ఉద్దేశం.

అయితే ఆ ప్రార్ధన విన్న దొంగల నాయకుడు మనస్సులో ‘ఈ రాజు నన్ను ‘పోతురాజు’ అని నమ్మినట్లున్నాడు. నేను ఆ నమ్మకాన్ని చెడగొట్టకూడదు. తగిన సమయం చూసి ఈ రాజుని చంపగలిగినట్లయితే, ఆనక నేనే రాజుని అయిపోవచ్చు’ అనుకున్నాడు.

పైకి రాజుతో “ఓ రాజా! నీ ప్రార్ధన మన్నించాను. ఇద్దరమూ కోటగుమ్మం దగ్గరికి పోదాం పద!” అన్నాడు. రాజు సరేనన్నాడు.

దొంగల నాయకుడు రాజప్రాసాదం దగ్గరికి దారి తీసాడు. రాజతణ్ణి అనుసరించాడు. అప్పటికే రాజు అతడు దొంగల నాయకుడని నిర్ధారణ చేసుకున్నాడు. రాజప్రాసాదం దగ్గరికి చేరాక, మరోసారి రాజు దొంగల నాయకుడిని పోతురాజుగా సంభోదిస్తూ, నగరాన్ని రక్షించమని అర్ధించి లోపలికి వెళ్ళిపోయాడు.

దొంగల నాయకుడు సంతోష పడుతూ, తన అనుచర దొంగలందరినీ పిలిచి, తన పన్నాగం గురించి చెప్పాడు. ఆ ప్రకారం రాజుని చంపి, నగరాన్ని ఆక్రమించాలని చెప్పేసరికి, దొంగలందరికీ భలే హుషారు వచ్చేసింది. ఎంతో ఉత్సాహంతో తమ నాయకుణ్ణి సమర్ధించారు. దాంతో దొంగల ముఠా అంతా, తమ ప్రణాళికని అమలు చేయడానికి సిద్ధపడసాగారు.

రాజాజ్ఞ ప్రకారం, రాజు గూఢచారులంతా… దొంగల బృందంపైన నిఘా వేసి ఆనుపానులు కనిపెడుతున్నారు. దొంగల పన్నాగం గురించి రాజుకి అన్ని వివరాలూ తెలియజేసారు. తగిన సమయంలో రాజు తన సైనికులతో కలిసి, దొంగల ముఠాపై దాడి చేసి అందర్నీ బంధించాడు. చాలామంది దొంగలు సైనికుల చేతుల్లో మరణించారు. రాజు దొంగల నాయకుణ్ణి బంధించి, సభకు తీసుకురమ్మని భటులని ఆజ్ఞ యిచ్చాడు.

మర్నాటి సభలో, ప్రజల సమక్షంలో రాజు దొంగల నాయకుడికి శిరచ్ఛేదం శిక్షగా విధించాడు. ఆ ప్రకారం దొంగల నాయకుణ్ణి ఊరంతా ఊరేగించి, బహిరంగంగా వధ్యశిల దగ్గర తలనరికి చంపుతారు.

రాజభటులు దొంగల నాయకుడికి ఎర్రని దుస్తులు వేసి, మెడలో వేపదండ వేసారు. నుదుట పెద్ద బొట్టు తీర్చి, బండి మీది కెక్కించి, బండి స్తంభానికి కట్టి ఊరంతా డప్పు మోగిస్తూ ఊరేగించ సాగారు. అలాంటి శిక్షలు చూసిన ప్రజలలో నేరప్రవృత్తి మాసిపోతుందని రాజలా ఆజ్ఞాపించాడు.

వీధులలో కోలాహలంగా సాగుతున్న ఆ ఊరేగింపుని, ప్రజలంతా గుంపులుగా కూడి కుతూహలంతో తిలకించసాగారు. ఊరేగింపు వీరకేశుడు వీధిలోకి ప్రవేశించింది. రత్నావళి తన గది గవాక్షం నుండి దొంగలనాయకుణ్ణి చూసింది.

అప్పటికి ఆమె అవివాహితగా ఉండి పోవాలన్న ఆకాంక్షతో ఎన్నో పెళ్ళి సంబంధాలను తిరస్కరించి ఉంది. అలాంటి రత్నావళి… దొంగల నాయకుణ్ణి చూసిన వేళా విశేషమో, లేక అతడి రూప విలాసమో గానీ, తొలిక్షణంలోనే అతనిపై ప్రేమలో పడింది.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes