RSS
Wecome to my Blog, enjoy reading :)

యువరాజు, మేకపోతు – ఎవరి వివేకం గొప్పది? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 38]

ఆ క్షణంలో... ఆ ప్రక్కనే రెండు మేకలున్నాయి. ఒకటి ఆడమేక(పెంటి), మరొకటి మగమేక (పోతు). పోతుమేక పెంటి దగ్గరికి ప్రేమగా చేరబోయింది. ఆడమేక దాని నాపుతూ. "నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే... అదిగో, ఆ బావి లోతట్టు గోడల మీద పచ్చని లేత చివురాకులున్నాయి. ఆ బావి మనకి దాపులనే ఉంది. నీవా లేచిగురాకులు తెచ్చి నాకిచ్చినట్లయితే నీ ప్రేమని అంగీకరిస్తాను" అంది.

మగమేక బావి వద్ద కెళ్ళి తొంగి చూసింది. బావి గోడలు పాకుడు పట్టి ఉన్నాయి. లోతట్టు గోడల కున్న పగుళ్ళలో పచ్చని మెత్తని పచ్చిక, చిగురాకులతో చిన్న చిన్న మర్రి మొక్కలూ పెరిగి ఉన్నాయి. గాలికి అవి ఊగుతున్నాయి, ఆకులు వెన్నెలలో మెరుస్తున్నాయి.వాటిని చూసి మగమేక ఓ క్షణం చింత పడింది. బావిలోకి ఓ సారి, పెంటి మేక వైపోసారి మార్చిమార్చి చూసింది.


మగమేక “ఓ ఆడుదానా! నీవు నీ కౄర బుద్ధిని చూపెట్టుకున్నావు. నీకు నా మీద ఏ మాత్రమూ ప్రేమలేదు. నేను ఆ బావి లోతట్టు గోడల్లోని చిగురాకులు తెచ్చేందుకు వెళ్ళినట్లయితే, ఆ పాకుడుకి జారి, బావిలో పడి చావగలను. నేను చచ్చాక నీవెవరి మీద ప్రేమ చూపుతావు? నా చావు తర్వాత నేనైనా నీ మీద ఎలా ప్రేమ చూపగలను? ఈ లోకంలో… ఎవరైనా, ఎవరినైనా ప్రేమిస్తే…తాను ప్రేమించిన వాళ్ళని సంతోష పెట్టి, వాళ్ళ శ్రేయస్సుని కాంక్షించాలి. కానీ నీకు నీ స్వార్ధం తప్ప నా శ్రేయస్సు పట్టలేదు.

కాబట్టి నీ ప్రేమతో నాకు ఒనగూడేదేమీ లేదు. నీవు ప్రేమించినా లేకపోయినా నాకు తేడాలేదు. నీలాంటి స్వార్ధపరుల కోసం అలాంటి అవివేకపు పనులు చేసే బుద్ధిహీనుడెవడు ఇక్కడ లేడు. ఫోఫో!” అని పెంటి మేకను కసిరింది.

చితిపై పరుండిన యువరాజు మణిమేఖులుడుకి మేకల భాష కూడా తెలుసు. పోతు, పెంటి మేకల సంభాషణంతా విన్న మణిమేఖులుడు ఆలోచనలో పడ్డాడు. అటు చూస్తే మగ మేక ఆడమేకని ఛీకొట్టి చక్కా పోయింది.

ఇటు చూస్తే మణిమేఖల భర్త చెప్పబోయే రహస్యం కోసం ఊపిరి బిగబట్టి చూస్తోంది. అది చెబితే తన ప్రాణానికే ప్రమాదం అన్న భర్త మాట అసలామెకి పట్టడం లేదు. తనని సంతోష పరచడం కోసం భర్త ప్రాణాలు ఒడ్డుతున్న స్పృహ అంతకంటే లేదు. చితిపై పడుకున్న భర్త ప్రాణం గురించి ఆమెకి చింతలేదు, అతడు చెప్పబోయే విషయం పట్ల కుతూహలమూ ఆతృతా తప్ప!

అది చూసిన మణిమేఖలుడు చితి మీది నుండి దిగ్గున లేచాడు. “ఏమిటేమిటి?” అంటూ వెంటపడుతున్న భార్య వైపు చూడను కూడా లేదు. మణిమేఖల విడిచి పెట్టలేదు.

దారి కడ్డం వచ్చి నిలబడింది. మణిమేఖలుడు భార్యని తిరస్కారంగా చూసి, ఆమెని విడిచి పెట్టి స్వదేశం వెళ్ళిపోయాడు. మరో యువతిని వివాహం చేసుకుని సుఖంగా ఉన్నాడు.

ఇదీ కథ!

అంటూ కథ ముగించిన భేతాళుడు “విక్రమాదిత్య రాజేంద్రా! ఈ కథలో ఎవరి వివేకం గొప్పది? నా ప్రశ్నకు జవాబు చెప్పు. అయితే నియమం నీకు తెలుసు కదా?” అన్నాడు.

విక్రమాదిత్యుడు చిన్నగా నవ్వుతూ “భేతాళా! నియమం తెలియకేం? ఇక నీ ప్రశ్నకు సమాధానం విను. నా అభిప్రాయంలో… మనం ఎవరినైనా ప్రేమించినట్లయితే, వారిని సంతోషపరచాలి, వాళ్ళు ప్రశాంతంగా, సౌఖ్యంగా ఉండేలా చూడాలి.

మణిమేఖలుడు తన భార్య మణిమేఖలని సంతోషంగా ఉంచేందుకు చావటానికి కూడా సిద్ధ పడ్డాడు. అయితే మణిమేఖలకు భర్త పట్ల ప్రేమ గానీ, కరుణ గానీ లేవు. ఆమెకతడి మరణం కూడా పట్టలేదు. అతడి మరణ సన్నద్ధత కంటే కూడా, అతడెందుకు నవ్వాడో…ఆ రహస్యం తెలుసు కోవాలన్నదే ఆమె ఆరాటం.

సకల విద్యలూ అభ్యసించినా గానీ, మానవుడైనా గానీ… మణిమేఖలుడు, మేకపోతు… ‘ప్రేమ’కు నిర్వచనాన్ని విప్పి చెప్పే వరకూ… ఆ సత్యాన్ని గ్రహించ లేకపోయాడు. మేకపోతు…ప్రేమకీ, స్వార్ధానికీ మధ్య ఉన్న విభజనని స్పష్టంగా చెప్పడమే గాక, అతడి కళ్ళెదుటే దాన్ని సంఘటనా పరంగా నిరూపించింది.

ఆ విధంగా మేకపోతు తార్కికతనీ, సునిశిత ఆలోచననీ కనబరచింది. కాబట్టి దాని వివేకమే గొప్పది. కనుక ఈ కథలో మణిమేఖలుడి కంటే కూడా మేకపోతే గొప్పది” అన్నాడు.

అది సరైన జవాబు కావటంతో భేతాళుడు చప్పట్లు చరిచి తన ఆమోదాన్ని తెలిపాడు. కానీ నిశ్శబ్దం భంగమైంది గనక, మెరుపులా మాయమై మోదుగ చెట్టెక్కేసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో ప్రేమకీ స్వార్ధానికి గల తేడాని, పిల్లలకే కాదు పెద్దలకీ ఆసక్తికరంగా ఉండేలా వివరించబడింది. నిజానికి పెంటి మేక వంటి స్త్రీలను చాలా మందినే చూస్తుంటాం, మన చుట్టు సమాజంలో!

ఉద్యోగ వర్గాల్లో చాలామంది లంచగొండుల్ని, అనేక రంగాల్లో ఎంతోమంది అవినీతిపరుల్ని చూస్తుంటాం. వాళ్ళ అవకతవకల్ని చూసి అసహ్యించుకుంటూ ఉంటాం.

నిజానికి కొందరు అవినీతి పరుల వెనక…వాళ్ళ భార్యల ప్రోద్బలం, బలవంతం ఎక్కువగా ఉంటాయి. లేచిగురు లడిగిన పెంటి మేకలాగా…నగలు, చీరలు, ఆస్తులు కార్లూ వంటి గొంతెమ్మ కోరికలు కోరుతూ, వాటిని ప్రేమకి ముడిపెట్టి భర్తల్ని అక్రమ సంపాదన చెయ్యమని కాల్చుకుతినే వాళ్ళని ఎంతోమందిని చూసాను.

ఆయా అవినీతి మార్గాల్లో భర్తలెంత వత్తిడికి గురైనా, బాధలు పడినా వాళ్ళకి పట్టదు.

నిజానికి ప్రేమంటే ఎదుటి వాళ్ళని సంతోషపరచటం, శాంతంగా సౌఖ్యంగా ఉండేలా చూడటం అనే జవాబు చెప్పటంలో విక్రమాదిత్యుడి వివేకం, వివేచన పిల్లల్ని ఆకర్షిస్తాయి. ఆ విధంగా ఈ కథలు మంచి మార్గంలో నడిచేటట్లు పిల్లలకి స్ఫూర్తి కలిగిస్తాయి.

~~~~~~~

3 కామెంట్‌లు:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

చాలా బాగుందండి.

కొత్త పాళీ చెప్పారు...

brilliant.

Vamshi చెప్పారు...

ఈ కథలని చదువుతుంటే సరైన సమాధానం ఇవ్వగలుగుతున్నాను... కానీ నిజజీవితం లో అంత సమర్ధంగా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నా. కేవలం కథల్లోనే కాకుండా .. రాటు దేలే పరిస్థితుల్లో కూడా చలించ కుండా ఆలోచించే సామర్థ్యం సంపాదించటం ప్రతి మనిషికీ కావలసింది... కృతజ్ఞతలండి..

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes