RSS
Wecome to my Blog, enjoy reading :)

కట్టుబాటు వీడని మదన సేన! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 39]

మరోసారి విక్రమాదిత్యుడు భేతాళుని పట్టి బంధించి, బృహదారణ్యం వైపు నడవసాగాడు. భేతాళుడు ఎప్పటి లాగే కథ ప్రారంభించాడు. ఇది భేతాళుడు చెప్పిన పదవ కథ. భేతాళుడు “విక్రమార్క మహారాజా! విను” అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు ‘మగధ’ అనే రాజ్యం ఉండేది. దాని రాజధాని పేరు కోసల నగరం. మగధకు రాజు ధీర వీరుడు. అతడెంతో పరిపాలనా దక్షత గలవాడు.

ఆ నగరంలో ధనదత్తుడనే భాగ్యవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతడికి సంతానం లేదు. దాంతో అతడు శివుని గురించి భక్తి శ్రద్దలతో తపమాచరించాడు. మహాదేవుడి వరంతో అతడికొక కుమారుడు, కుమార్తె కలిగారు. కుమారుడికి ‘ధర్మదత్తుడ’నీ, కుమార్తెకు ‘మదన సేన’ అనీ పేర్లు పెట్టుకుని, ధనగుప్తుడు వాళ్ళిద్దరినీ అపురూపంగా పెంచసాగాడు.

పిల్లలిద్దరూ పెరిగి పెద్దయ్యారు. ధర్మదత్తుడు గురుకులంలో చేరి విద్యాబుద్దులు నేర్చాడు. అతడికొక స్నేహితుడున్నాడు. అతడి పేరు చారు దత్తుడు. ధర్మదత్తుడూ, చారు దత్తుడూ ఎంతో ప్రాణ మిత్రులైనందున, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. ‘ఒకే కంచం, ఒకే మంచం’ అన్నంతగా విడిపోని స్నేహంతో మెలిగే వారు.

ధనదత్తుడి కుమార్తె మదనసేన యుక్త వయస్కురాలైంది. ఆమె చాలా చక్కనిది. సుగుణ శీలి. ఒక నాడామె తలారా స్నానం చేసి జారుగా వేసిన జడతో, స్నేహితురాళ్ళతో కలిసి ఇంటి తోటలో బంతాట ఆడుకుంటోంది. గాలికి ఆమె ముంగురు లూగుతున్నాయి. పరుగెత్తి బంతిని పట్టుకుంటూ ఆమె ఆడుతుంటే, మెరుపు తీగ మెలికలు తిరిగినట్లుంది. ఆమె కిలకిల నవ్వులు చిలుకా కోకిలలు కబుర్లు చెబుతున్నట్లున్నాయి.

ఆ సమయంలో చారు దత్తుడు ధర్మదత్తుడితో కలిసి వచ్చాడు. మదన సేనను చూసి చారుదత్తుడు ముగ్ధుడైనాడు. ఆమె అందం, నవ్వు, మాట తీరు అతడికి మతి పోగొట్టాయి. మరునాడు అతడామెని తోటలో ఒంటరిగా కలుసుకున్నాడు.

ఆర్తితో “మదన సేనా! నీవు సౌందర్యవతివి. నీ అందాన్ని మరిచి పోలేకున్నాను. నీ మీద ప్రేమ, విరహంతో నిదుర రాకున్నది. దయ చేసి నన్ను అంగీకరించు.” అంటూ ప్రాధేయ పడ్డాడు.

మదన సేన తలెత్తి అతడి వైపు చూసింది. ఓ క్షణం మౌనంగా ఉంది. తర్వాత “చారు దత్తా! నా తల్లిదండ్రులు నన్ను సముద్ర దత్తుడికిచ్చి వివాహం చేయ నిశ్చయించారు. నేను వాగ్దత్తని. అది నీకూ తెలుసనుకుంటున్నాను. అయినా నీవు నా ముందు ప్రేమ ప్రసంగం తెచ్చావు. కానీ నేను కట్టుబాటు మీర గల దానిని కాను” అంది.

మదన సేనపై కోరికతో వివేకం కోల్పోయిన చారుదత్తుడు అక్కడే నిలబడి పోయాడు. ఆమె వైపు జాలిగా, అభ్యర్ధనగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.

మదన సేన “చారు దత్తా! నిన్ను నిరాశ పరచటం నా అభిమతం కాదు. త్వరలో నా వివాహం జరగనుంది. నా వివాహమైన మరునాడు, తొలిరాత్రికి పూర్వమే, నేను నీ వద్దకు రాగలను. నీ కోరిక తీర్చగల దానను. ఇదే నా ప్రమాణం. అప్పటి వరకూ నేను నా కట్టుబాటును దాటను. దయ చేసి వెళ్ళు” అంది.

చేసేది లేక చారు దత్తుడు వెనుదిరిగి పోయాడు. అప్పటి నుండి వారి ఇంటికి రాకపోకలు తగ్గించాడు. ధర్మదత్తుడెంత అడిగినా ఏదీ చెప్పలేదు.

కొన్ని రోజులు గడిచాయి. మదన సేన వివాహం సముద్ర దత్తుడితో అతి వైభవంగా జరిగింది. అందమైన భార్యని చూసుకుని సముద్ర దత్తుడెంతో మురిసిపోయాడు. తొలి రాత్రి నూతన వధూవరులిద్దరూ పడక గదికి చేరారు.

పూల సౌరభాలతో, వెన్నెల సోయగాలతో… పోటీ పడుతూ, మదన సేన శరీర గంధమూ, సౌందర్యమూ అతిశయిస్తున్నాయి. సముద్ర దత్తుడు ప్రేమగా భార్యను చేరబోయాడు. ఆమె అతణ్ణి ఆపుతూ “ఓ నా ప్రియపతీ! నాదొక ప్రార్ధన! దయ యుంచి వినుడు. మన వివాహానికి పూర్వం, నేను నా యింట నుండగా ఒక యువకుడు నా దగ్గరి కొచ్చాడు. నా మీద ప్రేమాతిశయాన్ని వివరించాడు.

నా వివాహమైన తొలి రాత్రి, నేనతడి కోరిక తీర్చగలనని ప్రమాణం చేసి ఉన్నాను. నా కట్టుబాటును దాటలేనని, కన్యాత్వమును వీడ జాలనని ఆ విధంగా ప్రమాణం చేసాను. ఇప్పుడా ప్రమాణాన్ని తృణీకరించుట ధర్మము కాదని మీకు చెబుతున్నాను. ఆపై మీ ఇచ్ఛ ఎట్లయిన, అట్లు నిర్ణయించి, నాకు ఆనతి నీయగలరు” అని విన్నవించింది.

ఇదంతా విని సుముద్ర దత్తుడు ఆశ్చర్య పోయాడు. ‘లోకంలో ఇట్టి కోరికలు కోరు వారుండవచ్చు గానీ, ఇట్టి ప్రమాణములు చేయు వారుందురా? ఈమె గుట్టు చప్పుడు గాక, ఏ తీరుగ నైనా ప్రవర్తించ వచ్చు. అట్లు చేయక, నా అనుమతి అడుగుతున్నది. ఈమె లోకంలో ఉండే ఇతర సాధారణ యువతుల వంటిది కాదు. ఈమెకు మోసపు బుద్ధి లేదు. ఈమెను విశ్వసించ దగు” అనుకున్నాడు.

మదన సేన వైపు చూస్తూ “మంచిది. పోయి రా!” అన్నాడు. ఆ విధంగా మదన సేన భర్త అనుమతి తీసుకుని, ఆ అర్ధరాత్రి సమయాన చారుదత్తుడి ఇంటికి బయలు దేరింది.

దారిలో ఒక గజదొంగ ఆమెను చూశాడు. ఆమె అందాన్ని చూసి అబ్బురపడ్డాడు. దారి కడ్డం వచ్చి ఆమె నాపాడు. తనతో గడపవలసిందిగా కోరాడు. మదన సేన చేతులు జోడిస్తూ “అయ్యా! ఎందుకు నా సాంగత్యాన్ని కోరుతావు? దాని తో ఒనగూడే ప్రయోజన మేముంది? నీవు దొంగవు. చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. నా ఈ నగలన్నీ తీసికొని, నన్ను విడిచి పెట్టు. విలువైన ఈ నగలన్నిటితో సంతోషంగా నీ దారిన నీవు పో” అంది.

దొంగ విలాసంగా నవ్వి “ఓ యువతీ రత్నమా! నీవంటి సౌందర్యవతితో గడపటం అన్నిటి కంటే విలువైనది” అన్నాడు. మదన సేన నిస్సహాయంగా నిలబడింది. ఓ క్షణం తర్వాత, తన కథంతా అతడికి వివరించి చెప్పింది.

“ఇప్పుడు నేను చారు దత్తుడికిచ్చిన మాట నిలుపుకునేందుకై వెళ్తున్నాను. దయ చేసి నన్ను వెళ్ళ నివ్వు. తిరిగి వచ్చేటప్పుడు నీ దగ్గరకు రాగలను” అంది.

~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes