RSS
Wecome to my Blog, enjoy reading :)

మదనాభిషేక ప్రతిమ చెప్పిన కథ ప్రారంభం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 19]

రెండవ రోజు.... భోజరాజు, అతడి మంత్రులూ, పరివారమూ, సభాసదులూ తమ దైనందిన కార్యక్రమాలు ముగించుకొని, ఎంతో ఆతృతతో సభకు విచ్చేసారు.

భోజరాజు సువర్ణ సింహాసనాన్ని సమీపించాడు. సభికులంతా ఊపిరి బిగబట్టి చూడసాగారు. భోజరాజు తొలి మెట్టు మీద కాలు మోపాడు. వినోదరంజిత ప్రతిమ మౌనంగా ఉండిపోయింది. అతడు రెండవ మెట్టుపై కాలుపెట్టేందుకు పాదం ఎత్తాడు. అంతలోనే రెండవ మెట్టు మీద ఉన్న బొమ్మ చప్పట్లు చరుస్తూ బిగ్గరగా నవ్వింది.

ఆ బొమ్మ "చాలు భోజరాజా చాలు! నీ శ్రేయస్సు కోరి, మేము నీతీధర్మాలను చెబుతున్నాము. బహుశః వాటిని నీవు గ్రహించటం లేదు కాబోలు. నల్లని బండరాయిని మనం నీటిలో పెక్కు దినాలుంచి, తీసి కడిగినప్పటికీ, దాని నలుపు పోయి తెల్లగాను రాదు, మృదువుగానూ మారదు. ఇదీ అట్లే ఉన్నది.

తొలి మెట్టుపై గల వినోదరంజిత ప్రతిమ, నీకెన్నో విషయాలు చెప్పి యున్నది. కానీ నీవు పెడచెవిన బెట్టినావు. పైగా గొప్ప ఆడంబర సరళితో, మంత్రి పరివార సభికుల సహితంగా సింహాసనమెక్కగా వచ్చినావు. ఓ భోజరాజా! ఈ సువర్ణ సింహాసనము నీకు లభ్యమగునను కొనుచున్నావా?

నీ ప్రయత్నము, చిటారు కొమ్మనున్న తేనెపట్టును అందుకోవాలని, రెండు కాళ్ళు లేని అవిటి వాడు ఆశించినట్లుగా ఉంది. చాలు. ఇక్కడితో ఆగుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము. లేనిచో వెనుదిరిగి ఇంటికి బొమ్ము.

నీవీ సింహాసనమును పొందలేవని తెలుసుకో! ఓ భోజరాజా! నేను తదుపరి విషయాలను చెప్పుచున్నాను వినుము. విక్రమార్కుడు దయామూర్తి. కరుణాత్మడు. నీతీ ధర్మాలు గల వాడు. సహన శీలి. సహాయ శాలి. శాంతమూర్తి. ప్రేమాదరాలు గలవాడు. ధైర్య సాహసాలు గలవాడు. దైవభక్తి గలవాడు. ధర్మం పట్ల ధృఢమైన నమ్మకాలున్నవాడు. నీలో ఈ లక్షణాలు ఉన్నాయా? నీవు విక్రమాదిత్యునితో సరిపోలవని నిశ్చయంగా చెప్పగలను. కాబట్టి... సింహాసనాన్నధిరోహించాలనే కాంక్ష వదిలి, వెనక్కి మరలు!" అన్నది.

భోజరాజు, అతడి మంత్రులు కొన్ని క్షణాలు లజ్జ బిడియాలతో మాట్లాడక నిలుచున్నారు. పిదప భోజరాజు "ఓ ప్రతిమా మణీ! మీ మహారాజు యొక్క గుణగణాలు గురించి, మరింతగా వినవలెనని కోరుతున్నాము. అవి మాకు వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యి" అన్నాడు.

సువర్ణ ప్రతిమ అతడి సుగుణశీలానికి, వినయానికి సంతృప్తి చెంది "ఓ భోజ రాజేంద్రా! విను. నేను ఈ సింహాసనము పైని రెండవ మెట్టు పై గల ప్రతిమను. నా పేరు మదనాభిషేక. నిన్నటి దినాన, వినోద రంజిత ప్రతిమ చెప్పినట్లుగా... విక్రమాదిత్యుడు ఏడాదికి ఆరు మాసములు రాజ్యపాలన చేస్తూ, మిగిలిన ఆరు మాసములు దేశాటనంలో భాగంగా వివిధ ప్రదేశాలు సందర్శిస్తూన్నాడు.

ఆ రోజులలో ఉజ్జయినీ నగరానికి పది ఆమడల దూరంలో దట్టమైన అరణ్యముండెడిది. దాన్ని బృహదారణ్యమని పిలిచేవాళ్ళు. ఆ ఆరణ్యంలో కాళీకా దేవి ప్రాచీనాలయమొకటి ఉండేది. దానికి అర్ధామడ దూరంలో ఒక మోదుకు వృక్షం ఉండేది. [దాని ఆకులతో ఒకప్పుడు విస్తళ్ళు కుట్టేవారు. బాదం చెట్టు ఆకుల్లాగే!]

ఆ పెను వృక్షపు ఒక కొమ్మకు, తల్లక్రిందులుగా, భేతాళుడు శవ రూపంలో వేలాడు తుండేవాడు. [భేతాళుడు భూతాలకు రాజు. మహా శివుని ప్రమధ గణాలలో ఒక గణాధిపతి.]

అట్టి బృదహరణ్యంలో, జ్ఞాన శీలుడనే యోగి ఉండేవాడు. అతడు దీర్ఘకాలం తపస్సు చేసాడు. దాంతో ఎంతో శక్తి సంపన్నుడయ్యాడు. అయితే ఇతడు సద్గుణుడూ, కరుణా హృదయుడు కాడు.

ఒక నాడు అతడు తపస్సు వదిలి, భేతాళుని వశపరుచు కోవాలనీ, కాళికా దేవి కృపను పొందాలనీ తలచాడు. దేవీ ఆలయాన్ని చేరి, పూజాదికాలూ, క్రతువులూ నిర్వహించాడు.

నిరంతరాయంగా, కాళిక దేవి ప్రీత్యర్దమై, క్రతువు నాచరించ సాగాడు. దుశ్శీలుడైనా... అతడి కఠోర దీక్షకూ, మొక్కవోని సాధనకూ సంప్రీతురాలై, కాళికా దేవి అతడి యెదుట ప్రత్యక్షమైంది.

[నిజానికి తపస్సు అంటేనే సాధన. ఏళ్ళ తరబడి, నేటి శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు కూడా తపస్సు వంటివే! ఆయా పరిశోధనలలో వారు చేసే సాంకేతిక ఆవిష్కరణలు, దేవతల వరాల వంటివి. పురాణ కథలలో వరాలతో పొందిన విమానాది యంత్రాలు, మంత్రోచ్ఛాటనతో ఎవరికైనా ఉపయోగ పడటం వంటిదే... ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ యంత్రాలు!]

కాళికా దేవి, అతణ్ణి "ఓయీ! జ్ఞాన శీలా! ఏమి కావాలి నీకు?" అని అడిగింది.

అతడు "ఓ తల్లీ! విశ్వమాతా! నీవు ఎల్లప్పుడూ నా పట్ల సంప్రీతి కలిగి ఉండాలి.[ఎంత తెలివైన కోరికో చూడండి.] భేతాళుడు నాకు వశుడై, నా బంటుగా ఉండాలి. ఈ సకల ప్రపంచానికి నేను సామ్రాట్టుని కావాలి. ముసలి తనమూ మరణమూ లేకుండా, విక్రమాదిత్యుని సువర్ణ సింహాసనం మీద కూర్చొని, ఈ ధరావలయాన్నంతా నేను పరిపాలించాలి. ఇదీ నా కోరిక!" అన్నాడు.

కాళికా దేవి మర్మగర్భంగా నవ్వుతూ "ఓ యోగీ! నీవు పరమ కఠోరమైన కోరిక కోరుతున్నావు. అది తీరవలెనంటే నీవు వెయ్యిమంది రాజుల శిరస్సులు ఖండించి, ఈ యాగాగ్నిలో వ్రేల్చాలి. విను, అందులో వెయ్యవ రాజు అసమాన శూరుడూ, సద్గుణ శోభితుడూ అయి ఉండాలి. ఇది సాధ్యం గానట్లయితే, నీకు సముడైన యోగి తలను ఖండించి, బలిగా ఈ పీఠముపై నుంచి, పిదప యాగాగ్నిలో బడవేయుము" అని చెప్పి అంతర్ధాన మయ్యింది.

జ్ఞానశీలుడు వెయ్యిమంది రాజుల శిరస్సులను బలి యివ్వటానికే నిశ్చయించు కున్నాడు. ఎందుకంటే - తనకు సమానుడైన యోగి లభ్యంకావటం అసంభవం గనుక!

999 మంది రాజులను... యోగి వేషమున, తీయని మాటలతో, ఆశలు రేపి, మోసగించి తెచ్చి బలి యిచ్చాడు. ఇక ఒకే ఒక తల బాకీ ఉంది. వెయ్యవ బలిగా... జ్ఞానశీలుడు విక్రమాదిత్యుని ఎంచుకున్నాడు. అసమాన శూరుడూ, సర్వ సల్లక్షణ శోభితుడూ విక్రమాదిత్యుడే! అతడి సహాయంతో భేతాళుని వశపరుచుకొని, పిదప అతణ్ణే వెయ్యవ బలిగా దేవికి సమర్పించవలెనన్నది జ్ఞానశీలుని పన్నాగం.
~~~~~~~~~~

2 కామెంట్‌లు:

Manikanth.P. చెప్పారు...

ee jnanasheeludi katha eppudu vina ledhu. Vikram Bethal kathalu chaala preu ganchinavi kaani inthaki vikramadithyudu bethaluni vaddaku endhuku vasthadu anedhi ekkada chadava ledhu chooda ledhu. Ippudu raaboye kathalo ee amshalu unnayani thelusthundhi ... thvaralo oka kotha vishayanni thelsuko bothunnam ayithe ! tharuvatha bhaganikai eduruchoosthu untaanu.

Regards,
Manikanth.P.
insights2day.blogspot.com

amma odi చెప్పారు...

వెంటవెంటనే ప్రచురిద్దామన్నా వ్రాయటానికి సమయం దొరకటం లేదండి! :)

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes