RSS
Wecome to my Blog, enjoy reading :)

ఇంద్రుడిచ్చిన సింహాసనం! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 17]

విక్రమాదిత్యుడికి వీడ్కొలు ఇస్తూ, దేవేంద్రుడా మహారాజును ఎంతగానో సత్కరించాడు. ప్రశంసలతో బాటుగా ప్రేమాదరణలనీ పంచాడు. ముప్పది రెండు మెట్లతో ఉన్న ఈ స్వర్ణ సింహాసనాన్ని, దేవేంద్రుడు విక్రమాదిత్యునికి కానుకగా ఇచ్చాడు. ఒకో మెట్టు పైనా ఒకో సుందర సువర్ణ ప్రతిమలున్న ఈ సింహాసనం అపూర్వమైనది. ఇంద్ర పట్టాభిషేక మహోత్సవ సమయంలో, దేవేంద్రుడికి, మహాశివుడు ఇచ్చిన సింహాసనమిది.

దేవేంద్రుడు "ఓ విక్రమాదిత్య భూపతీ! నీవు ఈ సువర్ణ సింహాసనాసీనుడివై వెయ్యేండ్లు రాజ్య మేలెదవు గాక! ఇది నేను నీకు ప్రీతితో ఇస్తున్న వరము. నీకు సర్వదా శుభమగు గాక!" అన్నాడు.

విక్రమాదిత్యుడు దేవేంద్రునికి వినయమంతోనూ, మైత్రితోనూ నమస్కరించి, కృతజ్ఞతలు తెలిపి, వీడ్కొలు తీసుకున్నాడు. దేవేంద్రుడు మాతలికి విక్రమాదిత్యుని ఉజ్జయినిలో దింపి రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.

మాతలి ఎంతో వినయ విధేయతలతోనూ, ఆరాధన తోనూ... విక్రమాదిత్యునికి చేయి అందించి, రధమున ఆసీనుణ్ణి చేసి, స్వర్ణ సింహాసనముతో సహా ఉజ్జయినికి తీసుకు వచ్చాడు. విక్రమాదిత్యుడి ఆనతి మేరకు, ఉజ్జయిని మహాంకాళి ఆలయము వద్ద దిగవిడిచి, వీడ్కొలు తీసుకున్నాడు.

విక్రమాదిత్యుడు ముందుగా కాళికాదేవి కోవెలలోకి వెళ్ళి, పూజాదికాలు ముగించి, తదుపరి తన భవనానికేగినాడు. భట్టి రాజుని చూడవచ్చాడు.

విక్రమాదిత్యుడు "తమ్ముడా!భట్టి! దేవేంద్రుడు ప్రీతితో నాకు స్వర్ణ సింహాసనమును బహుకరించినాడు. అది ఉజ్జయిని కాళీమాత ఆలయము వద్ద ఉన్నది. సేవకులను పంపి, దానిని తెప్పించి, మన సభా భవనమున ప్రతిష్ఠించు" అని ఆజ్ఞాపించాడు.

భట్టి ఆ ఏర్పాట్లన్నీ కావించి, అన్న దగ్గరకు తిరిగి వచ్చాడు. "ఓ విక్రమాదిత్య మహారాజా! మీరు అమరావతికి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకూ జరిగిన వాటినన్నింటి గురించీ తెలుసుకోవాలని, మాకందరికీ ఎంతో కుతుహలంగా ఉంది. దయచేసి వివరించండి" అన్నాడు.

విక్రమాదిత్యుడన్నీ పూసగుచ్చినట్లుగా వివరించాడు. స్వర్ణ సింహాసనాన్ని చూపుతూ "సభాసదులారా! తమ్ముడా, భట్టీ! ఈ బంగారు సింహాసనాన్ని మహేశ్వరుడు దేవేంద్రుని కిచ్చినాడట. నాయందు ప్రీతితో, దేవేంద్రుడిది నాకిచ్చినాడు. దీనిపై గూర్చుండి వెయ్యేండ్లు రాజ్యమేలునట్లుగా, దేవేంద్రుడు నాకు వరమొసంగినాడు. మాతలి రధముపై దీన్నితెచ్చినాడు. ఇదీ జరిగిన విశేషము" అన్నాడు.

భట్టీ "అన్నా! నీవు వెయ్యేళ్ళు రాజ్యమేలునట్లు వరము నందినావు. నీ ప్రియ సోదరుడనైన నా కొఱకు ఏ వరమునూ తేలేదా?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు "తమ్ముడా! మరచినాను" అన్నాడు ఒకింత విచారంగా!

భట్టి "నిజము. అది సహజమే! స్వర్గమునకు బోయినపుడు భూమిపైని విషయములు, బంధములు మరచుట సహజము. సరియె, పోనిమ్ము! గడిచిపోయిన వాటిపై దుఃఖించడం ఎందుకు? గతించిన వాటికై ఇప్పుడు దుఃఖించినా ప్రయోజనమేమున్నది?" అన్నాడు, ఒకింత కినుకగా!

ఈ విధంగా పలికి, భట్టి, అన్న వద్ద సెలవు పుచ్చుకొని తన మందిరానికి వెళ్ళాడు. పంచభక్ష్య పరమాన్నములతో కూడిన రాజోచిత భోజనాన్ని ఆరగించి, పట్టుపరుపులు పరచిన హంస తూలికా తల్పం పైన పవళించాడు. కానీ భట్టికి నిద్ర రాకున్నది.

"నేనూ రెండు వేల ఏళ్ళు బ్రతకవలెనని ఆకాంక్ష కలుగుచున్నది. అది యెట్లు సాధ్యమగును? విక్రమాదిత్యుడు దేవేంద్రుని మెప్పించి వరమును పొందినాడు. నేనేమి చేయవలె? ఆ! నేనెందుకు మా కులదేవతయైన మహంకాళి దేవి అనుగ్రహముపొంది వరముల గోరరాదు? అవును! అదే సరియైన పని." అనుకున్నాడు.

ఇట్లాలోచించిన భట్టి, దిగ్గునలేచి, రత్నాభరణములనూ, రత్నఖచిత ఖడ్గమునూ ధరించి, అప్పటికప్పుడే... రాత్రి పది ఘడియల వేళ భద్రకాళి గుడికేగినాడు.

ఆ సమయానికి ఉజ్జయినీ కాళీమాత ఆలయమున లేదు. నగర రక్షణనూ, బాగోగులనూ పర్యవేక్షించేందుకు, నగర సందర్శన చేయబోయినది. ఆలయమున దేవీ విగ్రహమందు తేజస్సులో వ్యత్యాసమును బట్టి, భట్టి ఇది గ్రహించినాడు. దేవళమునకు కాపున్న భూతగణముల పారద్రోలి, దేవళం తలుపులు బంధించి, అమ్మవారి విగ్రహం ఎదుట పద్మాసనస్థుడై ధ్యానమగ్నుడైనాడు.

కొంత తడవుకు కాళికా దేవి ఆలయమునకు తిరిగి వచ్చింది. ఆ తల్లికి అసాధ్యమన్నది లేకున్ననూ, తల్లిబిడ్డల నాడించి వినోదించురీతిన, తాను ఆలయములోనికి ప్రవేశించుటకు బంధించిన తలుపులు అడ్డుగానున్నట్లు "భట్టీ! తలుపులు తీయు"మన్నది.

భట్టి వినక ధ్యానము కొనసాగించినాడు. కాళీమాత నామాన్ని ఉచ్ఛరిస్తున్నాడు. ఆ తల్లి ముదముతో భట్టి ఎదుట ప్రత్యక్షమైనది. ఆమెకు భట్టి యొక్క భక్తి, వినయాలు చూసి ముచ్చట కలిగింది. "బిడ్డా, భట్టీ! ఇంత రాత్రివేళ ఏల ఇక్కడికి వచ్చితివి? ఎందుకీ విధమున నా నామస్మరణ చేయుచున్నావు?" అని అడిగింది.

భట్టి ఆ తల్లికి నమస్కరిస్తూ "అమ్మా! మా బంగారు తల్లి! వరాల తల్లి! సౌందర్యరూపిణీ! దయామూర్తీ! నీవు అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకివి! నీకు వేనవేల నమస్కారములు. ఎందులకు నిన్ను ప్రార్దించుచుంటినని అడిగితివి కదా? నాకు నీవు వరములు ప్రసాదించగలవు తల్లీ!" అన్నాడు.

భద్రకాళి "వత్సా! ఏమి కావలయును నీకు?" అనడిగింది.

భట్టి "తల్లీ! సకల జగత్తుకూ రక్షణ నిచ్చుదానవు. నీ భక్తుడూ, నా సోదరుడూ అయిన విక్రమాదిత్యుడు... అమరావతి కేగి, ఇంద్రుని మెప్పించి, ఈ భూమిపై వెయ్యేళ్ళు రాజ్యమేలునట్లు వరములు పొందినాడు. నన్ను మరచినాడు. దేవేంద్రుడిచ్చిన సువర్ణ సింహాసనముతో తిరిగి వచ్చినాడు.

నాకు నీవు తప్ప ఇతరులు తెలియదు. నీవు తప్ప అన్యధా శరణ్యము లేదు. నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను. నిన్నే కొలుచుచున్నాను. నిన్నే సేవించుకుంటున్నాను. నాకు నీవే రక్ష! కాబట్టే - నీ భక్తుడైన నేను నీ దగ్గరికీ వచ్చినాను. నీ దగ్గరకు గాక ఎటుకేగ గలను? నీవు తప్ప ఎవరు నా ఆశలు తీర్చువారు? తల్లీ! ఓ అమ్మా! ఈ భూమిపై రెండు వేల ఏళ్ళు, సుఖంబుగా బ్రతుకు నటుల నాకు వరమీయ గదే!"అని ప్రార్దించాడు.

ఇది విని కాళికా దేవి "ఓ మంత్రీ! భట్టీ! నీకు నేనట్టి వరములనీయలేను" అని మౌనము దాల్చింది. భట్టిని పరీక్షింపవలెనని ఆ తల్లి సంకల్పం! భట్టి ఆమెను పరిపరి విధముల ప్రార్దించినాడు.

"ఓ తల్లి! నీవు అమ్మలగన్న యమ్మవు. దయా రూపిణివి. విశ్వమాతా! నీకు అసాధ్యమన్నది లేదు. నీవే కాదనిన ఈ జగత్తున ఔనను వారెవ్వరు? నన్ను కరుణింపవే తల్లీ!" అంటూ పట్టు విడవకుండా దేవిని ప్రార్దించాడు.

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

I want to read the further continuation asap!!!!!!!!!!

chala tension ga undhi...kaali matha emani cheppindhoo ani :)

Manikanth. P. చెప్పారు...

Adi lakshmi garu, mee blog chaala bagundhi ... mukhyanga Bhatti Vikamadithya kathalu ! aa kathaloni adbuthamaina vishayalu, daaniki meeru jathaparichina vishleshanalu chaala akarshinchaayi ... okesari ivvale 17 post lu chadivanu ... next dani kosam aasakthiga edhuruchoosthunnanu. Intha chakkati pracheena kathalaku mallee blog dwara pranam posthunna meeku hrudayaporvaka abhinandhanalu ! ilanti purathana telugu kathalu inka unte blog lo post cheyadam kani, ledha vati details mail or post cheyagalaru... ituvanti kathalu ee tharam pillalaku cheppadam, vatiloni gunalani nerpadam entha mukhyam ani bhavisthunnanu !

Regards,
Manikanth.
insights2day.blogspot.com
Email : p.manikanth@yahoo.co.in

అజ్ఞాత చెప్పారు...

ayyooo ... thondaragaa story continue cheyyandi ... tv channel valla laaga manchi twist vachinappudu aapeyadam meeku nyaayamaa !!!? ... ;-)

amma odi చెప్పారు...

అజ్ఞాతల గారు: కొంచెం ఓపిక పట్టాలండి. తప్పదు!:)
మణికాంత్ గారు: కథలు మీకు అంతగా నచ్చినందుకు సంతోషం. భట్టి విక్రమార్కుల పేరిట గ్రాంధిక భాషలో పుస్తకం దొరుకుతుందండి. ముందురి టపాల వ్యాఖ్యలలో లింకులు రంజిత గారు ఇచ్చారు. ఒకసారి చూడగలరు. నా రచనలో విశ్లేషణలను కూడా జోడించాను. నెనర్లు!

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes