RSS
Wecome to my Blog, enjoy reading :)

భర్త, మోహితుడు, దొంగ – ఎవరు గొప్ప! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 40]

దొంగ ఓ క్షణం ఆలోచనలో పడ్డాడు. ఏమనుకున్నాడో ఏమో ఆమెను వెళ్ళనిచ్చాడు. అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు.

మదన సేన నేరుగా చారు దత్తుడి ఇంటికి వెళ్ళింది. ఆమెని చూసి నిర్ఘాంత పడిన చారు దత్తుడితో “చారు దత్తా! నా మునుపటి ప్రమాణాన్ని నిలబెట్టుకుంటూ నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నువ్వు నా సౌందర్యాన్ని ఆనందించవచ్చు” అంది.

చారుదత్తుడు మరింతగా చేష్టులుడిగి పోయాడు. మరుక్షణం పశ్చాత్తాప పడ్డాడు. అతడు తనలో ‘ఈ యువతి, మదన సేన సామాన్యురాలు కాదు. ఈమె నిజాయితీ గలది, శీలవతి కూడాను. ఈమె పట్ల నేను చెడుగా ఆలోచించ కూడదు. ఈమె పతివ్రత’ అనుకున్నాడు.

అతడు ఆమె పాదల మీద వాలి క్షమార్పణ అడిగాడు. భర్తతో కలిసి నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో జీవించాల్సిందిగా దీవించి, వీడ్కొలిచ్చాడు. చారుదత్తుడు చూపిన పరిణతికీ, వాత్సల్యానికీ మదన సేన ఎంతో సంతోషించింది. అక్కడి నుండి వెనుదిరిగింది.

నేరుగా దొంగ ఎదురుచూస్తున్న చోటికి వచ్చింది. ఆమె తిరిగి వస్తుందో రాదో అనే అనుమానంతో అసహనంగా ఉన్న దొంగ, ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు, నమ్మశక్యం గానట్లు చూస్తున్న దొంగకి ఆమె జరిగిందంతా చెప్పింది. దొంగ అది విని నిరుత్తరు డయ్యాడు.

‘ఈ యువతి నిజంగా సామాన్యురాలు కాదు. పారిపోగల అవకాశం ఉన్నా కూడా ఇచ్చిన మాట కోసం తిరిగి వచ్చింది. ఈమె పాతివ్రత్యం కలది. కాబట్టే ఈమెపట్ల పాప చింతనని వదలిపెట్టాడు చారుదత్తుడు. ఈమెకు కీడు చేసినట్లయితే భగవంతుడు నన్ను క్షమించడు. ఈమె ఇప్పుడు నిస్సహాయంగా నాకు లొంగిపోయినా ఈమె కన్నీరైనా నన్ను శపించ గలదు’ అనుకున్నాడు.

పశ్చాత్తాపంతో ఆమె పాదాలపై బడ్డాడు. “అమ్మా! మన్నించు. నీవు నా సోదరీ తుల్యవు.” అంటూ క్షమాపణ కోరుకున్నాడు. అన్న వలె ఆదరించి, తన దగ్గరున్న ఆభరణాలని ఆమెకు కట్నంగా ఇచ్చి వీడ్కొలిచ్చాడు.

ఆమె సంతోషంగా భర్త దగ్గరికి తిరిగి వచ్చింది. జరిగిన విషయాలన్నీ భర్తకి పూసగుచ్చినట్లుగా చెప్పింది. తను నమ్మిన సత్యం తనను కాపాడినందుకు ఆమె ముఖం దీప్తిమంతంగా ఉంది. మంచితనాన్ని ఆస్వాదించిన ఆమె కళ్ళు కోటి చంద్రుల కాంతిని గుమ్మరిస్తున్నాయి.

అట్టి యువతీ రత్నాన్ని భార్యగా పొందిన తన అదృష్టానికి సముద్ర దత్తుడు ఎంతగానో మురిసిపోయాడు. ఆమెను దగ్గరికి తీసుకుని ఆశీర్వదించాడు. భార్యాభర్తలిద్దరూ చిరకాలం సుఖ సంతోషాలతో జీవించారు.

భేతాళుడు ఇంత వరకూ కథ చెప్పి, విక్రమాదిత్యుడితో “ఓ రాజాధిరాజా! మదన సేన భర్త సముద్రదత్తుడూ, ఆమె పై మోహం చెందిన చారుదత్తుడు, దొంగ – వీరందరిలో ఎవరు గొప్ప వారు? చెప్పు” అని అన్నాడు.

విక్రమార్కుడు గిరజాల జుట్టు ఊగుతుండగా సన్నగా నవ్వుతూ “భేతాళా విను! అందరిలోకి దొంగే గొప్పవాడు. మదన సేన భర్త సముద్ర దత్తుడు భార్య నిజాయితీ మీద నమ్మకంతో ఆమెకు అనుమతి ఇచ్చాడు. అతడి నమ్మకం నిజమైంది.
చారుదత్తుడు ఆమె నిజాయితీకి, సత్యవ్రతానికి బద్దుడై పశ్చాత్తాప్తుడైనాడు. అయితే దొంగ ప్రాధమికంగా చోరవృత్తిలో ఉన్నవాడు, దయా దాక్షిణ్యాలు లేని కౄరవృత్తి అది. అతడు యధేచ్ఛగా మదన సేన నగలతో పాటు, ఆమె పై అత్యాచారం జరిపి అయినా సరే, ఆమె అందాన్ని పొందగల అవకాశం ఉన్నవాడు.

అయినా గానీ, ఆమె పాతివ్రత్యానికి భయపడి, నిజాయితీకి అధీనుడై, పశ్చాత్తాపంతో చలించాడు. కాబట్టే ఆమెని స్వంత సోదరి వలె ఆదరించి పంపించాడు. తానెలా ప్రవర్తించినా, దొంగ కాబట్టి తన ఆచూకీ ఎవరికీ తెలియదు. అదే చారుదత్తుడికైతే అప్పటికి కోరికకి ప్రలోభపడినా, తర్వాత అపరాధానికి బాధ్యుడయ్యే అవకాశం ఉంది. దొంగకి అలాంటి ప్రమాదం లేదు. అయినా స్వయంగా తప్పు చేయడం నుండి విరమించు కున్నాడు. కాబట్టి దొంగే గొప్పవాడు” అన్నాడు.

విక్రమాదిత్యుడి సమాధానం వినగానే భేతాళుడు బిగ్గరగా నవ్వుతూ తిరిగి మోదుగ చెట్టు ఎక్కేసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో విక్రమాదిత్యుడు చూపించే తర్కం చక్కగా ఉంటుంది. ఒకే పని చేసిన వ్యక్తుల్ని వారి పరిస్థితుల్ని బట్టి విశ్లేషించడం పిల్లల్ని బాగా ఆకర్షిస్తుంది. ఇలాంటి కథల వలన వారిలో కుతూహలం కొద్దీ పఠనాసక్తి పెరుగుతుంది. వివేచనా శక్తి, విశ్లేషణా సామర్ధ్యం పెరుగుతాయి.

2 కామెంట్‌లు:

Tanu Collections చెప్పారు...

mee kathalu andaru chadavalsinavi....
chala bagunnayi

Tanu Collections చెప్పారు...

mee kathalu chaalaa bagunnayi....
anni kathalu kottaga chaala bagunnayi

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes