RSS
Wecome to my Blog, enjoy reading :)

ఆడువారిని నమ్మరాదా !? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 33]

లాలస, నేరుగా పడక గదిలోకి జొరపడింది. మంచం మీద భర్త ఆదమరచి నిదుర బోతున్నాడు. లాలస, ఏం చెయ్యాలా అని కాస్సేపు ఆలోచించింది. భర్త చేతి సంచిలోంచి ఓ పోక చెక్కని తీసి సగానికి కత్తిరించింది. పోక చెక్కకీ, కత్తికీ రక్తం పూసింది.

అంతే! పెద్ద పెట్టున మొర్రోమని మొత్తుకుంది. ఆమె గావుకేకలకి భర్త వరకీర్తి ఉలిక్కిపడి లేచాడు. ఆమె చావుకేకలకి తల్లీదండ్రీ, సేవకులూ పరుగెత్తుకు వచ్చారు. లాలస ఏడుస్తూ "నా భర్త నా ముక్కు కోసాడు" అంది.

కోపంతో ఊగిపోయిన గిరి వర్ధనుడు అల్లుణ్ణి బంధించి, రాజ భటులకి ఫిర్యాదు చేసాడు. మర్నాటి ఉదయం రాజభటులు వాళ్ళందరినీ రాజు ఎదుట హాజరు పరిచారు. రాజు ధర్మకేసరి, వరకీర్తిని "నీ భార్య ముక్కు నెందుకు కోసావు?" అని ప్రశ్నించాడు.

అతడు ఘోల్లుమంటూ "మహారాజా! నాకేమీ తెలియదు. ఆమె కేకలకి నేను నిద్రలో నుండి లేచాను. అప్పటికే ఆమె రక్తసిక్తమైన నాసికతో ఏడుస్తూ ఉంది. అంతకు మించి నాకేదీ తెలియదు" అన్నాడు.

రాజు లాలసని వివరమడిగాడు. ఆమె వినయంగా "ఓ మహారాజా. నేనింత వరకూ ఎవరికీ ఏ కీడూ చేయని దానను. నా భర్తకు సైతం ఏ అపచారమూ చేయలేదు. అలాంటప్పుడు నా భర్తపై ఊరికే నిందనెందుకు వేస్తాను?" అంది తార్కికంగా.

అదే సమయంలో నగర గస్తీ భటులు రాజుకు దైనందిన నివేదిక యిస్తూ "మహారాజా! రాత్రి నగరంలో గస్తీ తిరుగుతూ, నగర వీధులలో కాపలా కాస్తున్నాము. అప్పుడు ఈ వైశ్య వ్యాపారి ఇంటి వెనుక, ఎవరో దాగి ఉన్నట్లని పించింది. దొంగేమోనని సందేహించి హెచ్చరించాము. ఎందుకైనా మంచిదని బాణప్రయోగం చేసాము. ఏ చప్పుడూ రానందున, ఎవరూ లేరనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాము" అని చెప్పారు.

రాజు ధర్మకేసరి, సైనికులని పిలిచి, వైశ్యుడి ఇంటి వెనుక వెదకి రమ్మని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ పాటించి భటులక్కడ వెదికి, తోటలో పడి ఉన్న బ్రాహ్మణ యువకుడి శవాన్ని రాజ సభకి తెచ్చారు. శవాన్ని పరీక్షించగా, బిగుసుకు పోయిన దాని నోటిలో, లాలస ముక్కు కొన ఉంది, ముక్కు పుడకతో సహా!

ఇంకేముంది? లాలస సాక్ష్యంతో సహా తిరుగులేకుండా దొరికిపోయింది. విచారణలో, శవం వైశ్య వ్యాపారి గిరివర్ధనుడి ఇంటి సమీపంలో నివసించే బ్రాహ్మణ యువకుడిదని తేలింది. లాలసకి అతడితో వివాహేతర సంబంధం ఉందని వెల్లడయ్యింది.

రాజు ధర్మసేనుడు అన్ని కోణాల్లో విషయ విచారణ చేసాడు. లాలస దాసి కూడా, ఆమె రహస్య ప్రణయ సంబంధాన్ని ధృవీకరించింది.

ధర్మకేసరి "ఓ వైశ్య యువతీ, లాలస! నిజం చెప్పు!" అని గద్దించి అడిగేసరికి ఆమె భయంతో గడగడ వణుకుతూ తప్పు ఒప్పుకుంది. రాజు లాలసకి శిరశ్చేదం శిక్షగా విధించాడు. వరకీర్తిని విడుదల చేసాడు.

ఈ కథంతా చెప్పిన మగ చిలుక, యువరాణి రత్నావళి వైపూ, యువరాజు పరాక్రమ కేసరి వైపూ పరిశీలనగా చూస్తూ "ఓ నూతన దంపతులారా! ఇప్పుడు చెప్పండి, లాలస ఎంత ధూర్తురాలో!? అందుకే నేను, ఆడవారిని నమ్మరాదని చెప్పాను" అన్నది.

యువరాణీ యువరాజులిద్దరూ, రెండు చిలకల వాదనలని పూర్వపక్షం చేస్తూ, సరైన వాదన వినిపించారు. అందులోని నిజాన్ని అంగీకరించిన చిలుకలు రెండూ, సంతోషంగా, ప్రేమలో పడ్డాయి. వాటి ఒద్దిక చూసి, కొత్త జంట కూడా మురిసిపోయింది.

భేతాళుడు కథ పూర్తి చేస్తూ "ఓ విక్రమాదిత్య మహారాజా! ఇదీ కథ! చిలకలని ఒప్పించేందుకు... యువరాణి యువరాజులు ఏ వాదన చెప్పి ఉంటారో చెప్పగలవా?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు "భేతాళా! నా అభిప్రాయంలో వారి వాదన ఇలా ఉండి ఉండాలి.

స్త్రీ పురుషు లింగ భేదాన్ని బట్టి గానీ, పేద ధనిక వర్గ భేదాన్ని బట్టి గానీ... మనుషుల్లోని మంచీ చెడూ, నీతీ అవినీతి ఉండవు. అది వ్యక్తుల సహజ స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బట్టి, వారి మంచీ చెడూ ప్రవర్తన ఉంటుంది. తర్కకేసరి, అలంకారి ల విషయంలో, తర్కకేసరి భార్యని మోసగించాడు, హత మార్చాడు. అమాయకమైన పిల్ల గనక, అలంకారి... భర్త చేతిలో మోసపోయింది.

లాలస, వరకీర్తి విషయంలో లాలస చెడ్డదే కాదు, కౄరత్వం గలది. ఆమె దుష్ట బుద్ధి కారణంగా, అక్కడికి రప్పించబడ్డ బ్రాహ్మణ యువకుడు, విధివశాత్తూ, ప్రాణాలు కోల్పోయాడు. అయినా ఏమాత్రం భయమూ, పాపభీతి, పశ్చాత్తాపం లేకుండా, లాలస... స్వీయరక్షణ కోసం, భర్త పైకి నేరం తోసి, అతడి ప్రాణాలకు ఎసరు పెట్టింది.

ఏం జరిగిందో తెలిసి ఉండీ, జరిగిన వాటిపై స్పష్టత ఉండీ కూడా, లాలస, భర్త ప్రాణాలకి ప్రమాదం తెచ్చిపెట్టే ప్రయత్నం చేసింది. తక్షణం చేసిన ఆలోచన కూడా కాదది. ఆమె ఆలోచించి వేసిన ప్రణాళిక!

తర్కకేసరి, తన భార్య అలంకారిని... తనని నమ్మనందుకూ, తనతో రానన్నందుకూ... కోపాద్రిక్తుడై, ఒళ్ళు తెలియని ఆవేశంలో, ఆ క్షణమే భార్యని కొట్టి చంపాడు. అదే లాలస అయితే, తన అవినీతి ప్రవర్తనని కప్పిపుచ్చుకునేందుకు, పధకం ఆలోచించి, భర్తని చంపించేందుకు కుట్ర పన్నింది. కాబట్టి - ఆమె మరింత చెడు నడత కలిగిందనాలి.

మంచి చెడు లింగభేదాన్ని బట్టి ఉండక పోయినా, సహజంగా స్త్రీలు దయతోనూ, ప్రేమార్ధ్ర హృదయంతోనూ ఉంటారు. సహనంగా బిడ్డని కడుపున మోసి, జన్మనిచ్చి, ఓర్పుతో పెంచే ప్రాకృతిక ప్రేమ కారణంగానేమో... స్త్రీలు, సహజంగా ఎక్కువ మంచితనంతో ఉంటారు. అలాగయ్యీ లాలస, లాలసత్వం కొద్దీ, ఇంతకి తెగించింది. గనుక నిశ్చయంగా ఆమె శిరశ్చేదానికి అర్హురాలు.

అంతే తప్ప, స్త్రీ పురుష భేదాన్ని బట్టి, మనుషులను నమ్మరానంత ప్రమాదం ఏమీ లేదు" అని చెప్పిఉంటారు" అన్నాడు.

భేతాళుడు ఆ సమాధానం విని సంతృప్తి పడ్డాడు. అయితే నిశ్శబ్దం భంగమైందిగా! అందుకే చటుక్కున మాయమై మోదుగ చెట్టెక్కేసాడు.

3 కామెంట్‌లు:

వేణూశ్రీకాంత్ చెప్పారు...

కంటిన్యుటీ మిస్ అయినట్లుందండీ. మధ్యలో ఓ భాగం మిస్ అయిందా... లాలస భర్తపై మోపిన నింద ఏమిటి?

amma odi చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారు: నిజమేనండి. ఇప్పుడు సరిదిద్దాను. పొరపాటు మా దృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞతలు!

Kiran చెప్పారు...

చాలా చక్కగా ఉందండి కథ ..

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes