RSS
Wecome to my Blog, enjoy reading :)

ఆషామాషీగా తీర్పులు చెబితే ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 24]

"యువరాణి పద్మావతి విషయంలో, తండ్రినైన నేను పక్షపాతరహితంగా న్యాయవిచారణ చేయలేను. కాబట్టి నీవే న్యాయం పరికించు" అన్నరాజుతో...

మంత్రి "ఓ మహారాజా! స్త్రీని చంపడం కంటె మహాపాపం ఇంకొకటి లేదు. కాబట్టి పద్మావతికి మరణ శిక్ష విధించలేం. కనుక ఆమెని దేశ బహిష్కారం చేద్దాం. అదే ఆమెకి తగిన శిక్ష!" అన్నాడు గంభీరంగా!

రాజు విచారంగా సైనికులను పిలిచి "ఓ భటులారా! రాణీ వాసం నుండి యువరాణీ పద్మావతిని తీసికెళ్ళి, దుర్గమారణ్యాల నడుమ విడిచి రండి" అని అజ్ఞపించాడు.

రాజభటులు రాజాజ్ఞను శిరసావహించి, పద్మావతిని అడవి మధ్యలో వదిలారు. భయ విహ్వలయైన పద్మావతి, తన విధిని నిందించుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించసాగింది.

అప్పుడామెని, ఆ అరణ్య మధ్యంలో దేవపురం యువరాజు వజ్రకూటుడు, మంత్రి కుమారుడు తమ నిజరూపాలతో కలుసుకున్నారు. ఆమె తన చెలికాడిని గుర్తించి, ఆశ్చర్య పోయింది. ప్రక్కనే ఉన్న మంత్రి కుమారుణ్ణి చూసి, అతణ్ణి చంపబూనిన తన పన్నాగం గుర్తొచ్చి, మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకొంది.

వారామెని చిరునవ్వుతో ఆశ్వాసించి, జరిగినదంతా వివరించారు. తర్వాత వారంతా దేవపురం చేరారు. దేవపురం రాజు ప్రతాపవంతుడు, తన కుమారుడి ప్రేమ వృత్తాంతాన్ని అంగీకరించి, పద్మావతి వజ్రకూటుల వివాహం జరిపించాడు. వివాహ నేపధ్యంలో నేత్రపురానికి కబురు పంపేలోగా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

అప్పుటికే... నేత్రపురంలో, పద్మావతి తండ్రియైన ఉత్తానపాదుడు, కుమార్తె విషయంలో జరిగిన వాటిని నమ్మలేక, ఆమె ఎడబాటును సహించలేక, దిగులుతో మరణించాడు. ఆమె తల్లి కూడా... భర్త మరణాన్ని, కుమార్తె దురదృష్టాన్ని తట్టుకోలేక మృతి చెందింది.

భేతాళుడు విక్రమాదిత్యునికి ఈ కథ చెప్పి, "విక్రమాదిత్యా! ఈ కథను సావధానుడవై విన్నావు కదా? ఇందులో రాజు ఉత్తాన పాదుడు, అతడి భార్య మరణాలకు సంబంధించిన పాపం ఎవరికి చెందుతుంది? ఈ ప్రశ్నకు నీవు జవాబు చెప్ప వలసి ఉంటుంది" అన్నాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వుతో తలాడించి, "భేతాళా! విను! దేవపుర యువరాజు వజ్రకూటుడు, మంత్రి కుమారుడు, నేత్రపుర యువరాణి పద్మావతి, తమతమ భావోద్వేగాల మేరకు ప్రవర్తించారు. ఉత్తానపాదుడు, అతడి భార్య కూడా, మానవ సహజమైన భావోద్రేకాల మేరకు బాధననుభవించి మరణించారు.

అయితే.... న్యాయం చెప్పవలసిన స్థానంలో ఉండి, నేత్రపురపు మంత్రి, పద్మావతి విషయంలో తన ధర్మాన్ని సరిగా పాటించలేదు. తన కుమార్తెను సందేహించవలసి ఉన్నందున, తీర్పు నిష్పక్షపాతంగా చెప్పలేనని తలచిన ఉత్తాన పాదుడు, ఆ బాధ్యతను మంత్రికి అప్పగించాడు.

మంత్రి, పద్మావతి విషయంలో ఏం జరిగిందో విచారించలేదు. పద్మావత కి సంజాయిషీ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా, ఏక పక్షంగా తాము విన్న వివరాల మీద ఆధారపడి తీర్పు చెప్పాడు. జరిగిన దేమిటో పూర్వాపరాలు తెలుసుకోకుండానే, పద్మావతిని శవాలను పీక్కుతినే దోషిగా నిర్ధారణ చేసి, శిక్షని నిర్ణయించాడు.

అందుచేత రాజు రాణిల అర్ధాంతర మృతికి సంబంధించిన పాపం అతడికి చెందుతుంది" అన్నాడు.

ఈ విధంగా భేతాళుడు ప్రశ్న సంధించాడు. విక్రమాదిత్యుడు సమాధానం అందించాడు. విక్రమాదిత్యుడి మౌనం భంగమైంది. మరుక్షణమే విక్రమాదిత్యుడి భుజం మీది శవంలో అవాహనుడైన భేతాళుడు, శవంతో సహా మాయమై, తిరిగి మోదుగు చెట్టెక్కాడు. విక్రమాదిత్యుడది గమనించి, వెనుదిరిగి శ్మశానం వైపు అడుగువేసాడు. దూరాన మోదుగ చెట్టుకు వేలాడుతూ శవం కనబడుతోంది. చుట్టూ చీకటి చిక్కబడుతోంది.

~~~~~

కథా విశ్లేషణ:

ఈ కథ మనకి న్యాయమూర్తి బాధ్యత ఎంత గురుతరమైనదో తెల్పుతుంది. తెలిసి గానీ, తెలియక గానీ, అధర్మతీర్పు చెబితే, ఆ పాపం అతడికే చుట్టుకుంటుందనే నమ్మకం అనివార్యంగా, న్యాయమూర్తి, నిష్పాక్షిక న్యాయం చేసేటట్లు, తగిన తీర్పు చెప్పేటట్లు చేస్తుంది.

అలాంటి స్థితి నుండి నేటి సమాజం ఎక్కడికి ప్రయాణించింది?
కక్షిదారుల నుండి డబ్బులు తీసుకుని తీర్పులు చెప్పే న్యాయమూర్తుల దాకా,
అందుకోసం న్యాయవాదులతో లోతట్టు స్నేహ సంబంధాలు కొనసాగించే న్యాయమూర్తుల దాకా,
పదోన్నతుల కోసం అధికార పార్టీకి అనుకూలంగా తీర్పులు వెలువరించే న్యాయమూర్తుల దాకా!

సంస్కృతినీ, నమ్మకాలనీ వదిలిపెట్టి, దమ్మిడీల కోసం పరుగులు పెడితే, సమాజం ఇక్కడికే ప్రయాణిస్తుంది. దమ్మిడీల పరుగులో వేగనిరోధకల్లాగా... ఇలాంటి కథలూ, ఇతిహాసాలూ పనిచేస్తాయి. అందుకే, పనిగట్టుకుని మరీ... కథలని, ప్రజల జీవితం నుండి తరిమేసి, గోచీపాతలు వేసుకునే నాయికల ప్రేమకథలతో, ప్రజా జీవితాలని కుమ్మేసే కుటిల యత్నాలు ముమ్మరంగా నడుస్తుంటాయి.

ఇలాంటి జవాబు చెప్పాడంటే మహారాజుగా న్యాయనిర్ధారణ చేసేటప్పుడు విక్రమాదిత్యుడు ఎంత జాగరూకుడై ఉంటాడో తెలుస్తోంది.

~~~~~~

5 కామెంట్‌లు:

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

blog baagundandi......

pellayyaka maa pillaliki cheppadaaniki baaga panikivastayi.

Manikanth.P. చెప్పారు...

story interesting ga, chamatkarangaa undhi ... good one ! Thanks for sharing it ...

అజ్ఞాత చెప్పారు...

Really good story and analysis.

I am loosing interest on these stories due to your slow updates.

amma odi చెప్పారు...

వినయ చక్రవర్తి గారు: బ్లాగు మీకు నచ్చినందుకు కృతజ్ఞతలండి!

మణికాంత్ గారు: నెనర్లండి!

అజ్ఞాత గారు: ఇది మరీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగండి!:) నేనూ వెంటవెంటనే టపా పెట్టాలనే అనుకుంటాను. కానీ సమయం కూడా అనుమతించాలి కదా!

Baddipadige Sathish చెప్పారు...

mee kathalu chala bagunnayandi!
maruguna paduthunna mana jaanapatha kathalanu thirigi gurthuku testunnaru.....Thank you very much

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes