RSS
Wecome to my Blog, enjoy reading :)

మిఠాయి కొట్టు

అనగా అనగా.....

చింతలపల్లి అనే ఓగ్రామం ఉండేది. ఆ గ్రామాధికారి పేరు ఆదిశేషయ్య. అతడి భార్య పేరు అనసూయమ్మ. కొద్దిరోజులు క్రితం వారి కుమార్తె పెళ్ళి అయ్యింది. ఇక పిల్లని చీరె సారెలతో అత్తవారింటికి పంపాలి.

ఓ రోజు ఉదయాన్నే అనసూయమ్మ భర్తతో “ఏమండోయ్! ఎల్లుండి గురువారం. ఆరోజు అమ్మాయిని అత్తవారింటికి పంపాలి. పది మణుగులు నేతి మిఠాయిలు కావాలి. సుబ్బయ్య మిఠాయిల దుకాణం నుండి తెప్పించండి” అంది.

ఆది శేషయ్య సాలోచనగా “అలాగే” అన్నాడు.

వెళ్ళి వీధి అరుగు మీద కూర్చున్నాడు. అనసూయమ్మ పనులు హడావుడిలో పడిపోయింది. రెండు ఘడియల తర్వాత చూస్తే ఆదిశేషయ్య వీధి అరుగు మీదే కూర్చోని ఏవో కచేరి [ఆఫీసు] కాగితాలు చూసుకుంటున్నాడు.

అనసూయమ్మ వీధి అరుగు దగ్గరికి వచ్చి భర్త వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.

కాస్త ఆగమన్నట్లుగా ఆదిశేషయ్య చేసైగ చేసాడు. ఆవిడ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నమయ్యింది. అప్పటికీ ఆది శేషయ్య వీధి అరుగు మీదే కూర్చోని, కచేరీ పనుల నిమిత్తమై తనకోసం వచ్చిన గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు. అనసూయమ్మ అసహనంగా ఇంట్లోంచి బైటకొచ్చింది. ఆదిశేషయ్య నింపాదిగా ఉన్నాడు.

భోజనాలవేళ ఆవిడ భర్తమీద ఖయ్యిమంది. “పిల్లకి సారె చీరె లిచ్చి పంపాలి, మిఠాయిలు తెప్పించమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉలకరు, పలకరేం?” అంది రుసరుసలాడుతూ.

ఆదిశేషయ్య నిమ్మకు నీరెత్తినట్లు, నింపాదిగా “ఆపని మీదే ఉన్నానులే!” అన్నాడు.

అనసూయమ్మ తెల్లబోయింది. మాట్లాడకుండా వూరుకొంది. సాయంత్రమైంది. మిఠాయిలింటికి రాలేదు.

రాత్రి భోజనాల వేళ భర్తకి మరోసారి గుర్తు చేసింది అనసూయమ్మ.

“ఎల్లుండి కి కదా మిఠాయిలు కావాలి? రేపు తెస్తానులే!” అన్నాడు ఆదిశేషయ్య.

"ముందుగా చెప్పకపోతే అన్నిరకాలూ దొరకవద్దూ?" దీర్ఘం తీసింది అనసూయమ్మ.

"మరేం ఫర్లేదు. అన్నిరకాలూ ఉంటాయి. నామీద భరోసా ఉంచు” తొణకని కుండలా చెప్పాడు ఆదిశేషయ్య.

ఇంకేమన లేక మౌనంగా వూర్కొంది అనసూయమ్మ.

మర్నాటి సాయంత్రం వరకూ కూడా అదే తంతు నడిచింది వీధి అరుగుమీద. చేసేది లేక అనసూయమ్మ చూస్తూ ఊర్కొంది.

సాయంత్రానికి ఆదిశేషయ్య పనివాణ్ణి వెంట బెట్టుకుని సుబ్బయ్య మిఠాయి దుకాణానికి బయలుదేరాడు. కాస్సేపటికల్లా ఇరవై మణుగులు నేతి మిఠాయిలు ఇంట దిగాయి. అనసూయమ్మ తెల్లబోయింది.

భర్తకి మంచినీళ్ళందిస్తూ “కావలసింది పది మణుగులైతే ఇరవై మణుగులు తెచ్చారేం? డబ్బు దండుగ కాదూ?” అంది.
"అదేం లేదు! ఇరవై మణుగులు కలిపి ఐదు మణుగుల ఖరీదుకే వచ్చాయి” అన్నాడు ఆదిశేషయ్య విజయదరహాసంతో.

"అదేలా?" ఆశ్చర్యంగా అడిగింది అనసూయమ్మ.

గుబురుమీసాలు సవరించుకొంటూ చెప్పాడు ఆదిశేషయ్య.

"పిచ్చిదానా? నీకన్నీ తొందరే! హుటాహుటిన నిన్నే సుబ్బయ్య దుకాణానికి మిఠాయిల కోసం వెడితే మణుగు ఖరీదు నాలుగింతలుండేది. నిన్న పొద్దున నువ్వు చెప్పగానే అరుగు మీద కూర్చొని నాతో పనిబడి వచ్చిన వారందరితో ‘సుబ్బయ్య కొట్లో మిఠాయిలు చద్ది వాసన వస్తూన్నాయంటగా?’ అంటూ గాలివార్త వదిలాను. అది నమ్మింది కొందరూ, నాతో పని ఉంది కాబట్టి నన్ను ప్రసన్నం చేసికొనేందుకు నమ్మినట్లు నటించినది కొందరూ. ఏమైతేనేం? మొత్తానికి అందరూ కలిసి సుబ్బయ్యకొట్లో మిఠాయిలు చద్ది వాసన వస్తున్నాయనీ పుకారు, గాలివార్తని ఊరంతా టాంటాం వేసారు. ఒకరికి పదిమంది అదే మాట అనేసరికి నిన్న సాయంత్రానికి సుబ్బయ్య మిఠాయిల ధర సగానికి సగం తగ్గించి అమ్మాడు. వార్త ప్రచారం ఆగకపోయేసరికి ఈరోజు సాయంత్రానికి ధర నాలుగో వంతుకి తగ్గించాడు. ఇప్పడు ఇరవై మణుగుల నేతి మిఠాయిలు, ఐదు మణుగుల ధరకే వచ్చాయి”.

అనసూయమ్మ భర్త తెలివితేటలకు తెగ మురిసిపోయింది. కించిత్తు గర్వంగా ఆదిశేషయ్య అనసూయమ్మ కేసి చూస్తూ “చూసావా? ఏ పని చేసినా మనచేతికి తడి అంటకుండా చేయాలి, నేర్పుగా ఓర్పుగా పని చక్కబెట్టాలి” అన్నాడు తత్త్వం బోధిస్తూన్నట్లు.

“నిజమే సుమా!” అంటూ తలూపింది అనసూయమ్మ.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

2 కామెంట్‌లు:

Harish చెప్పారు...

దాన్ని తెలివి అనరు....స్వార్థం అంటారు...నాకు నచ్చలే... :(

amma odi చెప్పారు...

అనువర్తన చూడక పోతే నచ్చక పోవటం సహజం!:)

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes