RSS
Wecome to my Blog, enjoy reading :)

బార్బర్ బంగారం

అనగా అనగా…

ఒకప్పుడు అక్బర్ ఆస్థానంలో ఓ ఆస్థాన మంగలి ఉండేవాడు. అతడు తన వృత్తిలో చాలా నేర్పరి. అతడు గడ్డం గీస్తే అక్బరుకి మల్లెపూల చెండుతో చెంపలు తడిమినట్లుంటుంది. అతడు తలపైన క్షౌరం చేస్తే ప్రేమగా తన మనమరాలు తన జుట్టుతో ఆడుకున్నంత హాయిగా ఉంటుంది. అతడు తైలమర్దనా చేసి ఒళ్ళంతా మాలీషు చేస్తే ఏదో లోకంలో విహరించినట్లుంటుంది. అందుచేత అక్బరుకి ఈ మంగలంటే కాస్త అభిమానం పెచ్చు. దానితో మంగలికి కూడా పాదూషా దగ్గర కాస్త చనువు ఉండేది.

ప్రతి రోజూ మంగలి ॒క్షుర కర్మ చేసేటప్పుడు పాదుషా యధాలాపంగా ఏదో మాట్లాడుతుండేవాడు. పాదుషా తనపాలన గురించి ప్రజలేం అనుకొంటున్నారని అంటే మంగలి పాదుషాని ప్రజలు దేవుడంటున్నారని, ఆయన పాలన అంతనీ ఇంతనీ పాదుషాని ఆకాశాని కెత్తేసేవాడు. తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారని అక్బరు అడగటం ఆలస్యం ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారనీ, సిరిసంపదలతో తులతూగు తున్నారనీ చెప్పేవాడు. అందులో కొంత నిజం, మరికొంత ఎక్కువ అతిశయోక్తులు ఉండేవి.

ఇదంతా గమనిస్తున్న బీర్బలు మంత్రి వ్యవహరాన్ని ఇలాగే వదిలేస్తే ॒క్షేమం కాదనుకొన్నాడు. మంగలి, పాదుషా గారి శరీరానికి తైలం వేస్తే ఫరవాలేదు. మనస్సుకి వేస్తున్నాడు. అది పరిమితి దాటితే ప్రమాద హేతువే. ఏ శతృరాజైనా ఈ మంగలినే వేగుగా ప్రయోగిస్తే?

అందుచేత బీర్బలు మరునాడు నుండి పాదుషా క్షురకర్మ చేయుంచు కొనేటప్పడు తానూ పాదుషా ప్రక్కనే ఉంటూ పిచ్చాపాటి మాట్లాడసాగాడు. ఓ రోజు అలాగే పిచ్చాపాటి మాట్లాడతుండగా, తరచుగా పాదుషా అడిగే ప్రశ్నను ఈ సారి బీర్బల్ అడిగాడు, అక్బరు వారి పాలనలో ప్రజలెలా ఉన్నారని. మామూలుకంటే ఎక్కువ హుషారుగా మంగలి ప్రజలంతా భోగభాగ్యలతో తులతూగుతున్నారనీ, హాయిగా ఏ కష్టమూ లేకుండా ఉన్నారనీ, అంతా పాదుషా వారి చలవేననీ తెగతైలం వేసేశాడు.

ఇంతలో పాదుషాకి ॒క్షురకర్మ చేయటం పూర్తయింది. మంగలి కత్తి గట్రా శుభ్రం చేసుకోవటానికి ప్రక్కకి వెళ్ళాడు. బీర్బలు మంగలి పొదిని తెరిచాడు. అక్బరు, బీర్బల్ చర్యల్ని గమనిస్తూ మౌనంగా ఉన్నాడు. బీర్బల్ మంగలి పొది వెదుకుతున్నాడు. ఆశ్చర్యం! ఆ మంగలి వాని పెట్టెలో [పొది] లో కోడి గ్రుడ్డంత బంగారం ముద్ద ఉంది. గప్ చుప్ గా బీర్బల్ దాన్ని తీసి దాచేసాడు. ఏ పనీ బీర్బల్ వృధాగా చేయడనీ తేలిసిన అక్బర్ ఏం జరుగుతుందో చూడదలిచి ఏమి అనలేదు.

ఇంతలో మంగలి వచ్చి తన పెట్టి అడుగున బంగారం పోయిన సంగతి తెలియదుగనుక మామూలుగా కత్తి గట్రా సర్దుకొని పాదుషా దగ్గర సెలవు తీసికొన్నాడు.

మరునాడు మంగలి ముఖం వాడి పోయి ఉంది. ప్రపంచంలోని కష్టమంతా తనకే వచ్చినట్లున్నాడు. అతడి ముఖంలో దిగులూ, దుఃఖమూను.

చాలా నీరసంగా, నిస్తేజంగా పాదుషా వారికి గడ్డం గీస్తున్నాడు. నిన్నటి ప్రశ్ననే బీర్బల్ మళ్ళీ మంగలిని అడిగాడు. మంగలి నిట్టూరుస్తూ "ఏం చేప్పను హుజూర్! ప్రజలంతా నానా ఈతి బాధలతో సతమతమౌతున్నారు. దరిద్రం, అనారోగ్యం వారిని కుదిపెస్తున్నాయి. ఎటు చూసినా బాధార్తులే!" అన్నాడు.

అక్బరు కూ చాలా ఆశ్చర్యం వేసింది. అయినా మౌనంగానే ఉన్నాడు. ఈ రోజు మంగలి కత్తి కడగటానికి వెళ్ళినప్పడు బీర్బల్ మంగలి పొదిలో బంగారాన్ని యధాతధంగా పెట్టెసాడు. ఇదేమీ తెలియని మంగలి అదే దుఃఖభారంతో పాదుషా దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.

మరునాడు మంగలి ముఖం వెలిగిపోతుంది. హుషారుగా, ఆనందంగా పాదుషా వారికి క్షురకర్మ చేస్తున్నాడు. బీర్బల్ యధాలాపంగా అడిగినట్లు రోజుటి ప్రశ్నను వేశాడు. మంగలి ఎంతో ఆనందంగా "ప్రజలు ఆనందంతో నాట్యం చేస్తున్నంత హయిగా జీవిస్తున్నారు" అంటూ వెనకటి జవాబే చెప్పాడు. ఇందతా చూస్తూన్నా అక్బర్ ఫకాలుమని నవ్వాడు. మంగలికేమీ అర్దంకాలేదు. పాదుషా చిరునవ్వుతో "పోయిన నీ బంగారం తిరిగి దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు" అన్నాడు. మంగలి మ్రాన్పడి పోయాడు. "హుజూర్! నా బంగారం పోయి దొరికినట్లు తమరికెలా తెలుసు?" అన్నాడు.

అక్బర్ మాట్లాడకుండా చిరునవ్వుతో అతడికి బహుమతి ఇచ్చి పంపేశాడు. బీర్బల్ వైపు సహేతుకంగా చూశాడు.

బీర్బల్ చిరునవ్వునవ్వి "హుజూర్! తనపెళ్ళి విశ్వకళ్యాణం అనీ, తన చావు జగత్ర్పళయమనీ కొందరనుకొంటారు. పచ్చిస్వార్దం తప్ప అందులో మరేమి ఉండదు. అలాంటి వాళ్ళా మాటల్లో విశ్వసనీయత ఉండదు. అలాంటి వారి నివేదీకల్ని నమ్మరాదు" అన్నాడు.

అక్బర్, బీర్బల్ సునిశిత ఆలోచనా పటిమని మెచ్చుకొన్నాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes