RSS
Wecome to my Blog, enjoy reading :)

యువరాణి ప్రేమాయణం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 51]

పునః ప్రయత్నాల వల్ల విక్రమాదిత్యుడు అలసిపోలేదు. సరికదా, రెట్టించిన ఉత్సాహంతో, భేతాళుడు చెప్పే కథల పట్ల ఆసక్తితో...మరోసారి మోదుగ చెట్టెక్కి, శవాన్ని దించి భుజాన వేసుకొని, బృహదారణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడూ అలిసి పోలేదు. మరో కథ, పద్దెనిమిదో కథ చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడు.

“ఓ రాజోత్తమా! పరాక్రమ శాలీ! ధైర్యశీలీ! విను...” అంటూ ఇలా కొనసాగించాడు.

ఒకప్పుడు గోపాలపురం అనే నగరం ఉండేది. అదెంతో సువిశాలమైనది, సుందరమైనది. దానికి రాజు కార్తికేయుడు. అతడా నగరాన్ని నిజాయితీగా పరిపాలిస్తుండేవాడు. దాంతో అతడు ప్రజల కెంతో ప్రీతిపాత్రుడయ్యాడు.

అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు భగవతి. ఆమె యుక్తవయస్సులో ఉంది. సౌందర్యంతో శోభిల్లుతూ ఉంది. ప్రజలామెని గని ‘అందాల గని’ అని పొగుడుతూ ఉండేవాళ్ళు. ఆటపాటల్లో సంగీత సాహిత్యాల్లో ఆమెది అందె వేసిన చెయ్యి.

ఓనాటి సాయం సంధ్య వేళ.... భగవతి తలారా స్నానం చేసి, తన పొడవాటి అందమైన కురులని ఆర్చుకుంటున్నది. వేళ్ళతో అలవోకగా చిక్కులు తీస్తూ సంజ కెంజాయ రంగులని ఆస్వాదిస్తున్నది. పిల్లగాలికి ఆ పిల్ల కురులూగుతూ హొయలొలికిస్తున్నాయి.

ఆ సమయంలో.... రాజవీధిలో ఓ బ్రాహ్మణ యువకుడు పోతున్నాడు. అతడి పేరు ధనస్వామి. అతడెంతో అందంగా ఉన్నాడు. గిరజాల జుట్టు, కోరమీసం, తెల్లని దేహచ్ఛాయ... మూర్తీభవించిన మన్మధుడిలా ఉన్నాడు. యధాలాపంగా అతడు భగవతిని చూసాడు. సౌందర్యాధిదేవతలా ఉన్న యువరాణిని చూసి అతడు అబ్బురపడ్డాడు.

సరిగ్గా ఆ క్షణమే.... భగవతీ అతణ్ణి చూసింది. ఆమె కళ్ళు ఒక్కసారిగా తళుక్కుమన్నాయి. ఇద్దరూ తొలిచూపులోనే ప్రేమలో పడ్డారు. ఒకరొకరిపై చూపుల తూపులు విసురు కున్నారు. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉదయించిందని ఇద్దరికీ అర్ధమైంది. కానీ ఎలా కలుసుకోగలరు?

భగవతి రాచకన్య. ధనస్వామి సాధారణ బ్రాహ్మణ యువకుడు. అలాంటి చోట, ధనస్వామి యువరాణినెలా కలుసుకోగలడు? దాంతో ఇద్దరూ భారమైన హృదయాలతో, దీనంగా చూస్తూ ఊర్కున్నారు.

అయితే ధనస్వామి ఇంటికి వెళ్ళినా క్షణం కుదురుగా ఉండలేకపోయాడు. నిద్రాహారాలు పట్టలేదు. ప్రతీక్షణం, పగలూ రాత్రి, అదే థ్యాసగా యువరాణి భగవతిని ఎలా కలుసుకోవాలా అని ఆలోచించసాగాడు. చివరికి అతడో నిర్ణయానికి వచ్చాడు.

ఆ ప్రకారం ధనస్వామి, తన మిత్రుడైన లోకదేవుణ్ణి కలుసుకున్నాడు. లోకదేవుడు చాలా తెలివైన వాడు. యుక్తి పరుడు. నేర్పరి. ధనస్వామి లోకదేవుడికి విషయమంతా చెప్పి ‘యువరాణిని కలుసుకునేందుకు ఉపాయమేదైనా చెప్పి పుణ్యం కట్టుకో’మన్నాడు.

లోకదేవుడు మిత్రుడి కోరిక విని మ్రాన్పడి పోయాడు. తేరుకున్నాక “మిత్రమా, ధనస్వామి? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమి మాట్లాడుతున్నావు? ఎక్కడ నీవు? ఎక్కడ యువరాణి? తేడా వస్తే కుత్తుకలు తెగిపోగలవు సుమా!” అని హెచ్చరించాడు. దాంతో ఖిన్నుడైన ధనస్వామి ముఖం చూసి లోకదేవుడికి జాలి కలిగింది. మిత్రుడి యందు ప్రేమాతిశయంతో.... సాహసానికి పూనుకున్నవాడై “ప్రియమిత్రుడా! నీ కోరిక తీర్చుట కష్టసాధ్యం. ప్రమాదభరితం కూడా! అయినా నీవు నా ప్రాణసఖుడవు. నీ కోసం నేను పూనుకుంటున్నాను. నీకో ఉపాయం చెబుతాను. నువ్వు చింతించకు” అన్నాడు.

దాంతో ధనస్వామికి ఎంతో ఊరట కలిగింది. బాగా ఆలోచించి లోకదేవుడు ఓ ఉపాయం చెప్పాడు. ఆ ప్రకారం, లోకదేవుడు ఓ మునిలా వేషం ధరించాడు. ధనస్వామికి అందమైన యువతి వేషం వేసాడు.

ఇద్దరూ రాజు కార్తికేయుడి సభకు వెళ్ళారు. లోకదేవుడు రాజుకు నమస్కరించి “మహారాజా! నీకు సర్వసుఖాలూ కలుగుగాక! భగవంతుడు నీకు ఆయురారోగ్య భోగభాగ్యాలూ ఇచ్చుగాక!” అని దీవించాడు.

రాజతణ్ణి గౌరవించి, అతిధి సత్కారాలు ఆచరించాడు. లోకదేవుడు “రాజోత్తమా! నేను కాశీ యాత్రకు పోవుచున్నాను. ఇదిగో ఈ పిల్ల నా కుమార్తె సుకేశిని. (అందమైన మంచి శిరోజాలు కలది అని ఆ పేరుకు అర్ధం.) తల్లి లేని ఈ బిడ్డని అల్లారు ముద్దుగా పెంచాను. ఇప్పుడు ఈ అందమైన యవ్వనవతిని వెంటబెట్టుకుని, కాశీ యాత్ర వంటి దూరప్రయాణం చెయ్యలేను. అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. కాబట్టి నిన్ను సాయమర్ధించ వచ్చాను. నేను తిరిగి వచ్చు వరకూ, నాబిడ్డను నీకు అప్పగిస్తాను. ఆమె రక్షణ భారం వహించవలసిందిగా నా ప్రార్ధన” అన్నారు.

రాజందుకు సంతోషంగా సమ్మతించాడు. సుకేశిని రూపంలో ఉన్నది స్త్రీ కాదనీ, పురుషుడనీ తెలియని రాజు, ఆమెని తన కుమార్తె భగవతి మందిరానికి పంపించాడు. సమ వయస్కులవ్వటం చేత, ఇద్దరూ స్నేహంగా మెలగ గలరని అతడనుకున్నాడు.

భగవతి మందిరం చేరిన సుకేశిని వేషధారణలో ఉన్న ధన స్వామి, యువరాణితో ఏకాంత సమయం కోసం వేచి ఉన్నాడు. ఓ రోజు ఎవరూ లేకుండా చూసుకుని, ధనస్వామి ‘తాను స్త్రీ కాదనీ, సుకేశినిగా ఉన్న తాను పురుషుడననీ, తన పేరు ధనస్వామి అనీ’ వివరించాడు.

అది విని భగవతి ఆశ్చర్యంతో కొయ్యబారి పోయింది. ఆమెకతడి మీద ప్రేమ ఉప్పొంగింది. కానీ అది పైకి కనబడనివ్వకుండా, కోపం నటిస్తూ “ఏమిటీ? ఎంత ధైర్యం నీకు, ఈ విధంగా రాజమందిరంలోకి రావటానికి? నేనంత చులకనగా తోచానా నీకు? ఇదంతా మా తండ్రికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? చూడు, నేను నిన్ను ఏం చేస్తానో?” అంది.

అయితే బ్రాహ్మణ యువకుడు ధనస్వామి అందుకు బెదరలేదు. చెదరని చిరునవ్వుతో “ప్రేయసీ! నీ మీది ప్రేమకొద్దీ నేనిలా ప్రాణాలకు తెగించాను, అంతే తప్ప మరిక దేని కోసమూ కాదు. తొలి చూపులోనే నీవూ నాపై వలపు కలిగి ఉన్నావని నాకు తెలుసు. కాబట్టి నన్ను బెదిరించ ప్రయత్నించకు. అది వృధా.

ప్రేమతో నన్ను అంగీకరించు. ఎందుకిదంతా మీ తండ్రికి చెప్పేందుకు ఆతృత చూపిస్తావు? నీవు నన్ను రక్షించగలవు. నన్ను కాపాడేందుకు నీవే సమర్ధరాలవు. నేను ప్రాణాధికంగా నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నిన్ను చేరేందుకు ఇంత ప్రమాదానికైనా పాలుపడ్డాను. ఇక ఇప్పుడు నన్ను రక్షిస్తావో లేక శిక్షిస్తావో నీదే నిర్ణయం. నీవేది చేసినా నాకు ఇష్టమే! నీ ప్రేమ పొందలేనప్పుడు రాజు చేతిలో మరణం పొందడమైనా నాకు ఆనందమే!” అన్నాడు.

ధనస్వామి తన కొరకు అంత సాహసానికి పూనుకోవటం, ప్రాణాలకు తెగించటం.... భగవతికి ఎంతో ఆనందం కలిగించింది. ఆపైన అతడి తీయని మాటలకీ తెగింపుకీ మరింత ముగ్దురాలైంది. కిలకిలా నవ్వుతూ “ప్రియా! నేను చేయగలిగింది ఇదే!” అంటూ అతడి చెక్కిలిపై ముద్దు పెట్టుకుంది. ధనస్వామి పరవశించి పోయాడు.

అది మొదలు ఏకాంతంగా ఇద్దరూ ఒండొకరి సాన్నిహిత్యాన్ని ఆనందించ సాగారు. ఇది ఇతరులెవరు కనిపెట్ట లేక పోయారు.

దొంగల నాయకుడు చచ్చేముందు ఎందుకు నవ్వి, ఏడ్చాడు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 50]

కళ్ళెదుట దొంగల నాయకుడి మరణాన్ని చూసిన రత్నావళి విహ్వలచిత్త అయ్యింది. అప్పటి కప్పుడు ఆ శశ్మాన వాటికలో చితి పేర్చుకుంది. దొంగల నాయకుడి తలను చేతబట్టి, చితి చుట్టూ ప్రదక్షిణలు చేసింది. మండుతున్న అగ్నికీలలకి నమస్కరించి నిప్పుల్లోకి దూకింది.

ఆకాశం నుండి, జరుగుతున్నదంతా గమనిస్తున్నారు జగదాంబ, పరమేశ్వరులు. మాత పార్వతికి రత్నావళిని చూసి జాలి కలిగింది. పతి వంక సాభిప్రాయంగా చూసిందామె. అనుమతిస్తున్నట్లుగా నవ్వాడు జంగమ దేవర. మరుక్షణం పార్వతీ పరమేశ్వరులు, రత్నావళి ముందు ప్రత్యక్షమయ్యారు.

అంతే! నిప్పుల గుండం పూల రాశిలా మారి పోయింది.

పార్వతీదేవి “అమ్మాయీ! అంత సాహసం చేయకు. ఏం కావాలో కోరుకో!” అంది ప్రేమగా! ఆది దంపతులని చూసి రత్నావళి పరవశించి పోయింది. సంతోషాంతరంగంతో చేతులెత్తి నమస్కరిస్తూ, వారిని స్తుతించింది. “తండ్రీ గిరిశా! తల్లీ గిరిజా దేవి! మీరు జగత్తుకే తల్లిదండ్రులు. నామీద మీకు కరుణ ఉంటే నా మనోనాయకుడయిన ఈ దొంగల నాయకుడిని సజీవుణ్ణి చెయ్యండి. అతణ్ణి నేను పతిగా వరించాను. నామీద దయ యుంచి, నాకు పతి భిక్ష పెట్టండి. ఇది తప్ప నాకు మరో కోరిక లేదు” అని ప్రార్ధించింది.

శివపార్వతులు రత్నావళి పట్టుదలనీ, నిజాయితీ గల ప్రేమనీ చూసి ముచ్చట పడ్డారు. ‘తధాస్తు’ అన్నారు. వారిచ్చిన వర ప్రభావంతో, చచ్చిపడి ఉన్న దొంగల నాయకుడు పునర్జీవితుడైనాడు. నిద్ర నుండి లేచినట్లుగా కసిగంద కుండా ఉన్నాడు. వారిద్దరినీ ఆశీర్వదించి పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమయ్యారు.

వీరకేశుడు, అతడి భార్యా, ఇదంతా చూసి ఆనందంతో తబ్బిబ్బయ్యారు. తల నరకబడిన దొంగ పునర్జీవితుడు కావటం చూసి, ప్రజలు ఆశ్చర్యం పట్టలేక పోయారు. అందరూ రత్నావళినీ, ఆమె ప్రేమ బలాన్నీ ఎంతగానో ప్రశంసించారు.

వీరకేశుడు, కూతురూ అల్లుడిని ఇంటికి తీసికెళ్ళి, బంధుమిత్రులందరినీ ఆహ్వానించి, రత్నావళిని దొంగల నాయకుడికిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

ఈ సమాచారమంతా వేగుల ద్వారా విన్న రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. రత్నావళి పట్టుదలనీ, నిజమైన ప్రేమనీ చూసి వెరగు పడ్డాడు. ఆమె స్వచ్ఛమైన ప్రేమ, భక్తి తలచి, పార్వతీ పరమేశ్వరులనే మెప్పించిన ఆమె పట్టుదలని చూసీ, వారిని గౌరవించటం తన విధి అనుకున్నాడు.

వీరకేశుణ్ణి దొంగల నాయకుణ్ణి సభకు పిలిపించి ఆదరించాడు. దొంగల నాయకుణ్ణి తన సైన్యానికి అధిపతిగా నియమించి సత్కరించాడు. దొంగల నాయకుడు కూడా, జరిగిందంతా చూసి చాలా మధనపడ్డాడు. ప్రేమ, పట్టుదల, భక్తి, మంచి చెడు... వంటి మానవీయ విలువలు అర్ధం చేసుకుని, అంకిత భావంతో పని చేయాలని నిశ్చయించుకున్నాడు. కొన్నాళ్ళకే ఎంతో సమర్ధుడైన, ధైర్యశాలి అయిన సైన్యాధిపతిగా ప్రజలందరి మన్ననా పొందాడు.

ఇదీ కథ!

భేతాళుడు ఈ కథ చెప్పి “ఓ విక్రమాదిత్య మహీపాలా! విన్నావు కదా కథ!? ఇప్పుడు చెప్పు. భటులతడి మరణ శిక్ష అమలు చేయబోయే ముందు, దొంగల నాయకుడు ముందు క్షణం నవ్వాడు. ఆ తర్వాత ఏడ్చాడు? ఎందుకలా చేసాడో చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు మృదుగంభీర స్వరంతో “భేతాళా! దొంగల నాయకుడు రత్నావళిని చూసి నవ్వాడు. తన గురించి ఏమీ తెలియకుండా, దొంగనని తెలిసీ, ఇంతటి సౌందర్యవతి తనని ప్రేమించి ఏడ్చుట చూసి అతనికి నవ్వు వచ్చింది. ఆమె తల్లిదండ్రుల దుఃఖం చూసి మనస్సు కరిగింది. అందుకోసమే మొదట నవ్వి పిదప ఏడ్చాడు” అన్నాడు.

భేతాళుడు గలగల నవ్వుతూ “మౌనభంగమైంది మహారాజా! అందుకో నా పరుగు” అంటూ మాయమై మోదుగ చెట్టెక్కాడు.

కథా విశ్లేషణ: ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్నట్లుగా, ఈ కథని క్లుప్తంగా చెప్పేస్తే చాలా సామాన్యమైన కథ. రాజు దొంగని బంధించాడు, వ్యాపారి కూతురు ప్రేమించింది, దేవిని మెప్పించి బ్రతికించుకుంది – ఇలా! కానీ కథనంలో ‘పోతురాజు’ అంటూ... రాజూ దొంగల మధ్య సంభాషణ, వీరకేశుడూ రత్నావళిల మధ్య సంభాషణ, వీరకేశుడూ రాజుల మధ్య సంభాషణ... ఎంతో చక్కగా ఆసక్తికరంగా ఉంటాయి.

ఇలాంటి కథలు... కథనం ఎంతో ఆసక్తికరంగా ఉండి, చక్కని సంభాషణా శైలిని పిల్లలకు నేర్పుతాయి. ఎంతో కాలం, డబ్బూ వెచ్చించి నేర్చుకునే ‘కమ్యూనికేషన్ స్కిల్స్’ని అలవోకగా నేర్పే కథలివి.

మన పెద్దలు మనకందించిన వరాల మూటలివి.

~~~~~~~~~

తల తెగి పడిన దొంగ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 49]

రాజభటులు దొంగల నాయకుడికి ఎర్రని దుస్తులు వేసి, మెడలో వేపదండ వేసారు. నుదుట పెద్ద బొట్టు తీర్చి, బండి మీది కెక్కించి, బండి స్తంభానికి కట్టి ఊరంతా డప్పు మోగిస్తూ ఊరేగించ సాగారు. అలాంటి శిక్షలు చూసిన ప్రజలలో నేరప్రవృత్తి మాసిపోతుందని రాజలా ఆజ్ఞాపించాడు.

వీధులలో కోలాహలంగా సాగుతున్న ఆ ఊరేగింపుని, ప్రజలంతా గుంపులుగా కూడి కుతూహలంతో తిలకించసాగారు. ఊరేగింపు వీరకేశుడు వీధిలోకి ప్రవేశించింది. రత్నావళి తన గది గవాక్షం నుండి దొంగలనాయకుణ్ణి చూసింది.

అప్పటికి ఆమె అవివాహితగా ఉండి పోవాలన్న ఆకాంక్షతో ఎన్నో పెళ్ళి సంబంధాలను తిరస్కరించి ఉంది. అలాంటి రత్నావళి… దొంగల నాయకుణ్ణి చూసిన వేళా విశేషమో, లేక అతడి రూప విలాసమో గానీ, తొలిక్షణంలోనే అతనిపై ప్రేమలో పడింది.

మరుక్షణం ఆమె తన తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తి “తండ్రీ! ఇప్పుడు సైనికులు వధ్యశిలకు తీసుకువెళ్తున్న దొంగల నాయకుణ్ణి చూశారు కదా! అతడే నా మనో నాయకుడు. పెళ్ళి చేసుకుంటే అతణ్ణే చేసుకుంటాను. మీరు అతణ్ణి ఎలాగైనా విడుదల చేయించి, నన్నిచ్చి వివాహం చేయండి. లేనట్లయితే నాకు మరణం తప్ప శరణ్యం లేదు” అంది.

ఇది విని ఒక్కసారిగా ఆమె తల్లిదండ్రులు మ్రాన్పడి పోయారు. రత్నావళికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. వీరకేశుడు “నా చిట్టి తల్లి! ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు? ఈ ప్రపంచంలో మరణశిక్ష పడిన దొంగని ఎవరైనా వరిస్తారా? తల్లీ! నువ్వు ఓ దొంగని వివాహమాడితే… ప్రజలు, బంధుమిత్రులూ అందరూ మమ్మల్నీ దొంగలనే నిందించరా?

అలాంటి వివాహంతో మన కుటుంబ గౌరవం, వంశగౌరవం కూడా నాశన మౌతాయి. నీ ప్రియమైన తల్లిదండ్రులుగా, మేము లోక నిందకి గురౌతాము. కనుక నువ్వు! ఓ దొంగని పెళ్ళాడాలని ఆలోచించటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అందమైన, సిరిసంపదలు గల, విద్యాబుద్దులు గల, గౌరవనీయమైన కుటుంబాల నుండి వచ్చిన ఎందరో యువకులు, నిన్నుపెళ్ళాడ గోరి వచ్చారు. వారందరినీ తిరస్కరించిన నువ్వు, ఇలా ఓ దొంగని వరించటం సరైనదేనా? ఆలోచించు తల్లీ!” అని నెత్తీ నోరూ కొట్టుకున్నారు.

కానీ వీరకేశుడి సొదంతా రత్నావళి ముందు, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లయ్యింది. తల్లిదండ్రుల మాటలు ఆమె చెవికెక్కలేదు. ఇక ఆ వాణిజ్యవేత్త వీరకేశుడు ఏం చెయ్యగలడు? కుమార్తె పట్టుదల తెలిసిన వీరకేశుడు దిగులు చెందాడు. ఏం చెయ్యడానికీ తోచలేదు. భార్యతో సంప్రదించాడు. ఏదో ఒకటి చేయక తప్పదు.

అతడు, అపురూపమైన మణిమాణిక్యాలు, రత్నఖచిత అభరణాల వంటి విలువైన కానుకలు తీసుకొని, రాజ దర్శనానికి వెళ్ళాడు.

రాజు పాదాల ముందు తాను తెచ్చిన కానుకలుంచి నమస్కరించాడు. ఏమిటన్నట్లుగా చూసాడు రాజు. వీరకేశుడు “ఓ రాజా! నీవు గొప్పవాడివి. ప్రజారంజకుడవి. రాజులలో పేరెన్నిక గలవాడివి. నీకు వేనవేల నమస్కారాలు. ఇంతకాలం ప్రజలని బాధించిన దొంగలని పట్టుకున్న వీరుడవు నీవు. చోరనాయకుడికి నీవు మరణశిక్ష విధించావు.

అయితే ఓ రాజా! నా యందు దయ యుంచి, అతణ్ణి విడుదల చేయాల్సిందిగా ఆజ్ఞాపించు. వధ్యశిలకు గొనిపోతున్న దొంగల నాయకుణ్ణి చూసి, నా కుమార్తె ప్రేమలో పడింది. అతడిని పెళ్ళాడ గోరుతున్నది.

నాకున్నది ఈ కుమార్తె ఒక్కతే! అదీ మా వివాహమైన తర్వాత, ఎన్నో ఏళ్ళకు, ఎన్నో నోములు పూజలూ చేయగా జన్మించిన బిడ్డ! అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ! ఇప్పటి వరకూ ఎవరినీ పెళ్ళాడనని భీష్మించుకు కూర్చున్నది. ఇప్పుడీ దొంగని వరించినది. లేనట్లయితే మరణిస్తానని పంతం పట్టింది.

మహారాజా! ఆమె మరణిస్తే నేనూ నా భార్యా కూడా బ్రతక లేం. ఇలాంటి నిస్సహాయ స్థితిలో, నిన్ను చూడ వచ్చాను. దయయుంచి ఆ దొంగని విడుదల చెయ్యి. ఇది నా ప్రార్ధన!” అన్నాడు కన్నీటితో!

రాజది చూసి మొదట ఆశ్చర్యపోయాడు. విషయం అర్ధమయ్యాక ఆగ్రహోదగ్రుడయ్యాడు. అగ్గి మీద గుగ్గిలంలా చిటపట లాడుతూ “ఏయ్! వణిక శ్రేష్టీ! నీకేమైనా పిచ్చి ఎత్తినదా? ఎందుకు నీవు, ఆ దొంగల నాయకుణ్ణి కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకిలా కట్టు కథలల్లి నన్ను నమ్మించ జూస్తున్నావు? బహుశః నువ్వు ఇంకా పెద్ద దొంగవై ఉంటావు. అందుకే మరణశిక్ష పడ్డ దొంగని కాపాడ యత్నిస్తున్నావు.

బహుశః తాను దొంగిలించిన సొత్తు నుండి నీకు బంగారం, రత్నాలు, ధనం నీకు వాటాగా ఇస్తున్నాడు కాబోలు! లేకపోతే నీ కూతుర్ని సాకుగా చూపి దొంగని కాపాడే సాహసం చేస్తావా?

నాకు మీ వ్యాపార టక్కుటమారాలన్నీ తెలుసు. తక్షణం ఇక్కడి నుండి వెళ్ళు! ఇంకొక్క క్షణం నువ్విక్కడే ఉంటే, ఆ దొంగకి పడ్డ శిక్ష వంటిదే, నీకు కూడా పడుతుంది. ఫో! తక్షణం ఇక్కడి నుండి ఫో!” అన్నాడు.

రాజు కళ్ళ నుండి నిప్పులు రాలుతున్నట్లనిపించింది వీరకేశుడికి. భయంతో కాళ్ళు తడబడుతుండగా ఇంటికి పరిగెత్తుకు వచ్చాడు. జరిగిందంతా కూతురికి చెప్పి, మనస్సు మార్చుకోమన్నాడు. అది విన్న రత్నావళి మొదలు నరికిన అరటి చెట్టులా నేలపై కూలిపోయింది. క్షణాల్లో ఆమెకి స్పృహ తప్పింది.

తల్లిదండ్రులు, దాసీలు ఆమెకి శైత్యోపచారాలు చేసారు. కొద్ది క్షణాలకి సేద తీరి పైకి లేచింది. మరుక్షణం వీధిలోకి ఉరికింది. గుండెలు బాదుకుంటూ, బిగ్గరగా రోదిస్తూ, దొంగని ఊరేగిస్తున్న చోటికి చేరింది. అప్పటికే ఆమె జుట్టు ముడి ఊడింది. విరబోసుకున్న జుట్టుతో, చెదిరిన బొట్టుతో, చెమటలూ కన్నీరు వరదై కారుతున్న ముఖంతో, ఆమె మూర్తీభవించిన శోక దేవతలా ఉంది.

కుమార్తె స్థితి చూసి గుండె చెరువైన వీరకేశుడు, అతడి భార్య ఇంటిలో ఉండలేక పోయారు. వాళ్ళు కూడా బిగ్గరగా ఏడుస్తూ, ఆమె వెనక బడ్డారు.

ఇదంతా ఊళ్ళో పాకింది. ప్రజలెంతో ఆశ్చర్యపోయారు. గొప్ప కుతుహలం, ఆసక్తితో వారి చుట్టూ గుమిగుడారు. ముందు డప్పులు, వెనక దొంగని కట్టిన బండి, ఆ వెనక శోకిస్తూ రత్నవళి, ఆమె తల్లిదండ్రులు! మెల్లిగా ఊరేగింపు వధ్యశిలకు చేరింది. ఊరి జనమంతా అక్కడే పోగయ్యింది.

భటులు దొంగని బండి దింపి, వధ్యశిల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అతడి తలను వధ్యశిలపై ఆన్చి పరుండ బెట్టారు. అప్పటికే వాళ్ళూ వీళ్ళూ అనుకుంటున్న మాటల్ని బట్టి, దొంగల నాయకుడికి విషయం అర్ధమైంది. అతడి చూపు రత్నావళి మీద నిలిచింది. ఆ పిల్ల సౌందర్యం, శోకం చూసి అతడికి ఆశ్చర్యం కలిగింది.

ఆమెనీ, ఆమె తల్లిదండ్రుల్ని ఒక్కక్షణం తదేకంగా చూసాడు. క్రమంగా అతడి చూపు రత్నావళి మీద నిలిచి పోయింది. ఒక్కక్షణం బిగ్గరగా పగలబడి నవ్వాడు. మరుక్షణం గట్టిగా ఏడ్చాడు. ఉత్తరక్షణం అతడి తల తెగి పడింది. భటులు తమ కర్తవ్యాన్ని తాము నిర్వహించారు.
~~~~~~~~~~~~~~~

దొంగపై తొలిప్రేమ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 48]

యధాప్రకారం విక్రమార్కుడు మోదుగ చెట్టు చేరి, భేతాళుని బంధించి నడక ప్రారంభించాడు. భేతాళుడు కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్య మహారాజా! నీ పట్టుదల చూడ ముచ్చటగా ఉంది. శ్రమ తెలియకుండా ఈ కథ విను!” అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు అయోధ్యా నగరం అనే రాజ్యం ఉండేది. ఆ నగరంలో ఒక ప్రముఖ వణిక శ్రేష్ఠి ఉండేవాడు. అతడి పేరు వీరకేశుడు. అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు రత్నావళి. ఆ పిల్ల చాలా చక్కనిది. ప్రజలామెని చూసి దేవకన్యలలో కూడా అంత అందమైన అమ్మాయి ఉండదని ప్రశంసించే వాళ్ళు.

అందంతో పాటు రత్నావళి వినయవిధేయతలూ, దయ వంటి సద్గుణాలూ కలది. కళాభినివేశం కలది.

ఆమె అందచందాల గురించీ, సుగుణ సంపద గురించీ విన్న చాలామంది యువకులు, ఆమెను వివాహమాడాలని ఉవ్విళ్ళూరే వారు. వారిలో కొందరు రత్నావళి తల్లిదండ్రులని సంప్రదించారు. వారిలో యోగ్యుడైన ఒక యువకుడికిచ్చి రత్నావళి వివాహం జరిపించాలని వీరకేశుడు, అతడి భార్య నిర్ణయించారు.

అది విని రత్నావళి, తల్లిదండ్రుల వద్దకు చేరి ‘తాను ఎవరినీ వివాహమాడననీ, తనకు వివాహేచ్ఛ లేదనీ’ తెగేసి చెప్పింది. అది విని కలవర పడ్డారు వీరకేశుడూ, అతడి భార్య!

తమ గారాల పట్టిని బుజ్జగించి వివాహం పట్ల విముఖత వీడమని పరిపరి విధాల నచ్చచెప్పారు. అయినా లాభం లేకపోయింది. రత్నావళి తన పట్టు వీడలేదు. చేసేది లేక వీరకేశుడు, అతడి భార్య బిడ్డని కంటికి రెప్పలా కాపాడ సాగారు.

రోజులు ఇలా గడుస్తున్నాయి.

ఆ సమయంలో అయోధ్యా నగరంలో దొంగల బెడద పెరిగిపోయింది. దొంగలు ఇళ్ళకి కన్నాలు వేసి, చాకచక్యంగా డబ్బూ దస్కం, నగానట్రా దోచుకు పోతున్నారు. ఎవరూ దొంగల్ని పట్టుకోలేక పోయారు. ప్రజలంతా కూడా దొంగల బాధకి చాలా కలవర పడ్డారు.

వారంతా గుంపుగా అయోధ్యా నగరపు రాజు దగ్గరికి పోయి ‘తమని దొంగల బారి నుండి కాపాడవలసింది’గా మొరపెట్టుకున్నారు. ఆ నగరపు రాజు మంచి వాడు, సమర్ధుడు! అతడు ప్రజలకి దొంగల బాధ నుండి విముక్తి కలిగిస్తానని హామీ ఇచ్చాడు.

వెంటనే సైనికులనీ, దళాధిపతులనీ పిలిచి, దొంగలను పట్టుకోవలసిందిగా ఆజ్ఞాపించాడు. కానీ లాభం లేక పోయింది. ఈ వార్త విని దొంగలు అప్రమత్తమయ్యారు. మరింత జాగ్రత్తగా ఇళ్ళకి కన్నాలు వేయటం, దొంగతనాలు చేయటం సాగించారు. సైనికులు, దళాధిపతులు ఒక్క దొంగని కూడా పట్టుకోలేక పోయారు.

ఇక లాభం లేదని రాజే స్వయంగా రంగంలోకి దిగాడు. మారు వేషం ధరించి, ఆయుధాల చేతబూని రాత్రివేళ నగర వీధుల్లో తిరగ సాగాడు.

ఆ రోజు అమావాస్య! అర్ధరాత్రి కావస్తోంది. నగర వీధుల్లో ఎంత చీకటిగా ఉందంటే – ఎదురుగా ఏముందో కూడా కనిపించటం లేదు. హఠాత్తుగా రాజుకు, తనకు కొద్ది దూరంలో భారీకాయుడొకడు నిలిచి ఉన్నట్లు లీలగా తోచింది.

రాజు బిగ్గరగా “ఏయ్! ఎవరు నువ్వు?”అనడిగాడు. అక్కడ నిలబడి ఉంది దొంగల నాయకుడు. అతడు రాజు కంఠ స్వరాన్ని గుర్తు పట్టాడు. గొంతు సవరించుకుని “ఓ రాజా! నేను ఈ నగర దేవత మహంకాళి కొడుకును. పోలేరమ్మ గుడిలో ఉండే దేవర పోతురాజును”అన్నాడు.

రాజు అతణ్ణి దొంగల నాయకుడిగా అనుమానించాడు. కానీ దొంగల నాయకుడు చెప్పినట్లుగా అతణ్ణి పోతురాజని నమ్మినట్లుగా నటిస్తూ “ఓ పోతురాజా! నిన్ను గుర్తించక ఎవరు నువ్వని అడిగినందుకు మన్నించు. నువ్వు మా నగర దేవత మహాంకాళి కుమారుడివి. కాబట్టి నువ్వూ మాకు దేవుడవే! మీ తల్లి మా నగరాన్ని, మమ్మల్నీ కాపాడుతుంది. నా మనస్సులో ఒక కోరిక ఉంది. చాలా రోజులుగా నీవు మా నగరానికి రక్షణగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నా కోరికని నిర్లక్ష్యం చెయ్యకుండా, నీవు నాకా వరాన్ని ఇవ్వాలి. నిన్ను వెయ్యి విధాల ప్రార్థిస్తూన్నాను. నువ్వు నా ప్రార్ధనని మన్నించి తీరాలి. నీవు మా నగరానికి రక్షణగా ఉండాలి” అన్నాడు. ఆ విధంగా అతణ్ణి మాటల్లో పెట్టటమే రాజు ఉద్దేశం.

అయితే ఆ ప్రార్ధన విన్న దొంగల నాయకుడు మనస్సులో ‘ఈ రాజు నన్ను ‘పోతురాజు’ అని నమ్మినట్లున్నాడు. నేను ఆ నమ్మకాన్ని చెడగొట్టకూడదు. తగిన సమయం చూసి ఈ రాజుని చంపగలిగినట్లయితే, ఆనక నేనే రాజుని అయిపోవచ్చు’ అనుకున్నాడు.

పైకి రాజుతో “ఓ రాజా! నీ ప్రార్ధన మన్నించాను. ఇద్దరమూ కోటగుమ్మం దగ్గరికి పోదాం పద!” అన్నాడు. రాజు సరేనన్నాడు.

దొంగల నాయకుడు రాజప్రాసాదం దగ్గరికి దారి తీసాడు. రాజతణ్ణి అనుసరించాడు. అప్పటికే రాజు అతడు దొంగల నాయకుడని నిర్ధారణ చేసుకున్నాడు. రాజప్రాసాదం దగ్గరికి చేరాక, మరోసారి రాజు దొంగల నాయకుడిని పోతురాజుగా సంభోదిస్తూ, నగరాన్ని రక్షించమని అర్ధించి లోపలికి వెళ్ళిపోయాడు.

దొంగల నాయకుడు సంతోష పడుతూ, తన అనుచర దొంగలందరినీ పిలిచి, తన పన్నాగం గురించి చెప్పాడు. ఆ ప్రకారం రాజుని చంపి, నగరాన్ని ఆక్రమించాలని చెప్పేసరికి, దొంగలందరికీ భలే హుషారు వచ్చేసింది. ఎంతో ఉత్సాహంతో తమ నాయకుణ్ణి సమర్ధించారు. దాంతో దొంగల ముఠా అంతా, తమ ప్రణాళికని అమలు చేయడానికి సిద్ధపడసాగారు.

రాజాజ్ఞ ప్రకారం, రాజు గూఢచారులంతా… దొంగల బృందంపైన నిఘా వేసి ఆనుపానులు కనిపెడుతున్నారు. దొంగల పన్నాగం గురించి రాజుకి అన్ని వివరాలూ తెలియజేసారు. తగిన సమయంలో రాజు తన సైనికులతో కలిసి, దొంగల ముఠాపై దాడి చేసి అందర్నీ బంధించాడు. చాలామంది దొంగలు సైనికుల చేతుల్లో మరణించారు. రాజు దొంగల నాయకుణ్ణి బంధించి, సభకు తీసుకురమ్మని భటులని ఆజ్ఞ యిచ్చాడు.

మర్నాటి సభలో, ప్రజల సమక్షంలో రాజు దొంగల నాయకుడికి శిరచ్ఛేదం శిక్షగా విధించాడు. ఆ ప్రకారం దొంగల నాయకుణ్ణి ఊరంతా ఊరేగించి, బహిరంగంగా వధ్యశిల దగ్గర తలనరికి చంపుతారు.

రాజభటులు దొంగల నాయకుడికి ఎర్రని దుస్తులు వేసి, మెడలో వేపదండ వేసారు. నుదుట పెద్ద బొట్టు తీర్చి, బండి మీది కెక్కించి, బండి స్తంభానికి కట్టి ఊరంతా డప్పు మోగిస్తూ ఊరేగించ సాగారు. అలాంటి శిక్షలు చూసిన ప్రజలలో నేరప్రవృత్తి మాసిపోతుందని రాజలా ఆజ్ఞాపించాడు.

వీధులలో కోలాహలంగా సాగుతున్న ఆ ఊరేగింపుని, ప్రజలంతా గుంపులుగా కూడి కుతూహలంతో తిలకించసాగారు. ఊరేగింపు వీరకేశుడు వీధిలోకి ప్రవేశించింది. రత్నావళి తన గది గవాక్షం నుండి దొంగలనాయకుణ్ణి చూసింది.

అప్పటికి ఆమె అవివాహితగా ఉండి పోవాలన్న ఆకాంక్షతో ఎన్నో పెళ్ళి సంబంధాలను తిరస్కరించి ఉంది. అలాంటి రత్నావళి… దొంగల నాయకుణ్ణి చూసిన వేళా విశేషమో, లేక అతడి రూప విలాసమో గానీ, తొలిక్షణంలోనే అతనిపై ప్రేమలో పడింది.

బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చుట్టుకుంటుంది? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 47]

విక్రమార్కుడు మళ్ళీ భేతాళుణ్ణి బంధించాడు. భేతాళుడు మళ్ళీ మరో కథ ప్రారంభించాడు.

ఒకప్పుడు ‘అవినాశి’ అనే నగరం ఉండేది. (వినాశం లేనిది అని ఆ పేరుకి అర్ధం.) ఆ నగరంలో దేవనాధుడు అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడి కొక కుమారుడు, అర్జున స్వామి. అతడు రూపవంతుడూ, గుణవంతుడు. అతడికి యుక్త వయస్సు వచ్చాక తండ్రి దేవనాధుడు, ఎన్నో ఊళ్ళు వెదికి తగిన కన్యని తెచ్చి వివాహం చేసాడు.

ఆ పిల్ల పేరు అనామతి. ఆమె అర్జునస్వామికి రూపంలోనూ, గుణంలోనూ తగిన భార్య. తీయని మాటలూ, చక్కని చేతలూ గలది. యువ దంపతులని చూసిన ఎవరైనా… వారు ఒకరి కొకరు తగి ఉన్నారనే వారు. గువ్వల జంట వంటి ఆ యువజంట, ఎప్పుడూ కలిసి మెలిసి ఉండేవాళ్ళు. ఏ పని చేసినా కలిసి చేసేవాళ్ళు. క్షణమైనా ఒకరినొకరు ఎడబాయక ఉండేవాళ్ళు.

వారి తీరుని చూసి అందరూ ముచ్చట పడే వాళ్ళు.

ఇలా ఉండగా…ఓ నాటి రాత్రి…

చల్లగాలి వీస్తొందని భార్యభర్తలిద్దరూ, పెరట్లో మల్లెపందిరి ప్రక్కనే మంచం వేసుకు పడుకున్నారు. అది వెన్నెల రాత్రి! అర్జునస్వామి, అనామతి ఆరుబయట ఆదమరిచి నిదురిస్తున్నారు. ఆ సమయంలో ఆకాశంలో ఓ రాక్షసుడు వెళ్తోన్నాడు. అతడు భీకరంగా ఉన్నాడు. అతడి చూపులు అంతకంటే కౄరంగా ఉన్నాయి.

దిగువకి చూసిన రాక్షసుడి కళ్ళు ఒక్కసారిగా మెరిసాయి. అతడికి అనామతి అద్భుతంగా అనిపించింది. ఆమె అందానికి అదిరిపోయాడు. అమాంతం క్రిందికి దిగి, ఆమెని ఎగరేసుకు పోయాడు. రాక్షస మాయ కారణంగా అనామతికి గానీ, అర్జునస్వామి గానీ నిద్రాభంగం కాలేదు.

తెల్లవారింది. అందరి కంటే ముందే లేచి గృహకృత్యాలలో నిమగ్నమయ్యే అనామతి ఏది? నిద్రలేచిన అర్జునస్వామికి భార్య ఎక్కడా కనబడలేదు. కుటుంబ సభ్యులంతా కూడా వెతికినా అనామతి జాడలేదు. ఎవరికీ ఏమీ తోచలేదు.

కీడెంచి మేలెంచమని, ఊళ్ళోని చెరువులూ నూతులూ కూడా గాలించారు. బంధుమిత్రులందరినీ వాకబు చేసారు. ఆమె ఆచూకీ తెలియ లేదు. అర్జునస్వామికి దుఃఖం కట్టలు దాటింది. అతడు ఎలాగైనా భార్య జాడ తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దాంతో దేశాటనం బయలు దేరాడు.

అనామతి గురించి వెతుకుతూ ఎన్నో ప్రదేశాలు, ఊళ్ళూ, అడవులూ గాలించాడు. ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది. నిరాశా నిస్పృహలతో, స్వంత ఊరు అవినాశికి తిరుగు ప్రయాణమయ్యాడు. లోలోపల మిణుకు మిణుకు మంటూ ఓ చిరు ఆశ… ‘ఒక వేళ ఈ పాటికి అనామతి ఇల్లు చేరిందేమోనని’.

తిరుగు ప్రయాణంలో, అలసటతోనూ, ఆకలి తోనూ ఉన్నాడు. అప్పటికి ఓ గ్రామం చేరాడు. ఓ బ్రాహ్మణ గృహం ఎంచుకొని ‘భోజనం పెట్ట’మని అడిగాడు. గృహస్థు భార్యని పిలిచి “అతిధికి భోజనం పెట్టు” అని చెప్పాడు.

ఆ గృహిణి అతడికి భోజనం వడ్డించే ప్రయత్నం చెయ్యబోగా…అర్జున స్వామి “అమ్మా! స్నాన సంధ్యలు ముగించుకొని ఆరగిస్తాను. భోజనం కట్టి ఇవ్వు” అని అర్ధించాడు.

గృహిణి ఒక చిన్న వెదురు బుట్టలో అరిటాకు వేసి, అందులో అన్నం పప్పూ కూరలూ సర్ధింది. ఓ చిన్న పిడతలో పెరుగు, ప్రక్కనే పండూ తాంబూలం ఉంచింది. భక్తిగా అతిధికి సమర్పించింది.

అర్జునస్వామి వారిని “అన్నదాతా! సుఖీభవ!” అంటూ ఆశీర్వదించి, తిన్నగా చెరువు గట్టుకు వెళ్ళాడు. చెరువులో నీళ్ళు నిర్మలంగా ఉన్నాయి. చెరువు ఒడ్డున పెద్ద మర్రి చెట్టుంది. దాని నీడ చల్లగా హాయిగా ఉంది. అర్జునస్వామి, భోజనం ఉన్న బుట్టని ఆ చెట్టు క్రింద ఉంచి, చెరువులో స్నానం, సంధ్యా వందనం పూర్తి చేసుకున్నాడు.

చెట్టు క్రింద కూర్చొని ఆవురావురుమంటూ అన్నం తినసాగాడు.

ఆ సమయంలో… మర్రి చెట్టు కొమ్మపైకి ఓ గ్రద్ద వచ్చి వాలింది. దాని గోళ్ళల్లో ఓ కాలనాగు గిలగిల్లాడుతుంది. చెట్టు కొమ్మపైన కూర్చున్న గ్రద్ద, ఆ పాముని ముక్కుతో పొడుచుకొని తినసాగింది.

మరణ యాతనకి పాము విలవిల్లాడుతూ విషం కక్కసాగింది. ఆ విషం తిన్నగా అర్జునస్వామి అన్నం తింటున్నా అరిటాకుపై సన్నని తుంపరగా పడసాగింది. ఎంత సన్నని బిందువులంటే…ఆరగిస్తున్న అర్జునస్వామికి సైతం దృష్టికి ఆననంత! అసలే ఆకలిగా ఉన్న అర్జునస్వామి, అన్నం పప్పూ కూరలతో స్వాదిష్టంగా ఉన్న భోజనాన్ని ఇష్టంగా ఆరగిస్తున్నాడు. అయితే కాస్సేపటికి, విషాహారం కారణంగా అతడు మృతి చెందాడు.

ఇదీ కథ!

అంటూ కథ ముగించిన భేతాళుడు…“విక్రమార్క మహీపాలా! ఈ బ్రహ్మహత్యా పాతకం ఎవరికి చెందుతుంది? ఆహారాన్నిచ్చిన బ్రాహ్మణ దంపతులకా? పాముని చంపితిన్న గ్రద్దకా? విషం గక్కిన పాముకా? విషాహారాన్ని తిని మరణించిన అర్జునస్వామికా?” అనడిగాడు.

[త్వరపడి ఈ ప్రశ్నకు జవాబు చెప్పకండి. విక్రమాదిత్యుడి తర్కం చదివాక, అప్పుడు చెప్పండి.

భారతీయుల నమ్మకాల్లో…బ్రాహ్మణ హత్య (అంటే సత్వగుణ సంపన్నుడి హత్య) మహా పాపమనీ! దాన్ని బ్రహ్మహత్యాపాతకం అంటారు. అలాగే గోహత్య, స్త్రీ హత్య, శిశుహత్యలను కూడా పరమ పాపాలని నమ్మేవాళ్ళు. ఆ కోవలోకే చెందుతుంది ఆత్మహత్య కూడా! ఇప్పుడు నమ్మకాలూ బాగానే సడలి పోయాయి, దృక్పధాలూ మారిపోయాయి. ఎంత పాపానికైనా వెనుతీయని సమాజాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం.]

విక్రమాదిత్యుడు స్ఫుటంగా “భేతాళా! ఇందులో ఎవరి తప్పూ లేదు. ఆకలిగొన్న అతిధిని సత్కరించటం గృహస్థు ధర్మంగా భావించి, బ్రాహ్మణ దంపతులు, అర్జునస్వామికి ఆహారం సమర్పించాడు. స్నాన సంధ్యలు ముగించి భోజనం చెయ్యడం సదాచారమని భావించి, అర్జునస్వామి చెరువుకు చేరాడు. చెట్టు నీడన కూర్చొని భోజనం చేసాడు.

గ్రద్ద తన ఆహారాన్ని తాను వేటాడి తెచ్చుకుంది. చెట్టు కొమ్మపై కూర్చొంది. మరణ యాతనకి పాము విషం గ్రక్కింది. పాములు గ్రద్దలకి దేవుడిచ్చిన ఆహారం. మరణ సమయాన విషం గ్రక్కడం పాము ప్రారబ్దం. అందుచేత వాటి దోషమూ లేదు.

అందుచేత వీరెవ్వరికీ బ్రహ్మహత్యా దోషం అంటదు. అయితే… ఎవరీ కథ విని, పూర్వాపరాలూ, ధర్మసూక్ష్మాలూ ఆలోచించకుండా… ‘ఫలానా వారికి బ్రహ్మహత్యా దోషం అంటుతుంది’ అంటారో, వారికి, ఈ బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంటుంది” అన్నాడు.

విక్రమార్కుడి విజ్ఞతకి భేతాళుడికి చెప్పలేనంత ఆనందం కలిగింది. చప్పట్లు చరుస్తూ తన ఆనందాన్నీ, అభినందననీ తెలిపాడు. అయితే మౌనభంగమైనందున మరుక్షణం మాయమై మోదుగ చెట్టు పైన మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు.

అది తెలుసు కాబట్టి విక్రమార్కుడూ వెనుదిరిగి మోదుగ చెట్టు వైపు అడుగులేసాడు.

కథా విశ్లేషణ:
బ్రహ్మహత్యా పాతకం వంటిది – ‘విషయం గూర్చి పూర్వాపరాలూ, మంచి చెడుగులూ తెలియకుండా మాట్లాడిన వారికి అంటుకుంటుంది’ అని చెప్పే ఈ కథ…శ్రోతలని అప్రమత్తుల్ని చేస్తుంది.

ఎన్నోసార్లు… ఎంతోమంది… తీరి కూర్చొని, అరుగుల మీదా, రచ్చబండలమీదా… తెగ తర్కాలు చేసేస్తుంటారు. ‘ఫలానా వాళ్ళ వ్యవహారంలో ఫలానా వాళ్ళది తప్పు’ ‘ఇది ఇలా చెప్పకూడదు’ ‘అలా చెయ్యాలి’… గట్రా తీర్పులు చెప్పేస్తుంటారు. తెలిసీ తెలియక, ఏదో మాట్లాడేస్తే, మనకే ప్రమాదం, మన విజ్ఞతే దెబ్బతింటుంది అనే హెచ్చరిక ఈ కథలో ఉంటుంది.

అందుకే…ఈ కథ చెప్పేటప్పుడు నేనెప్పుడూ “త్వరపడి బ్రహ్మహత్యా పాతకం ఫలానా వారికి చుట్టుకుంటుంది అని జవాబు చెప్పకండి. విక్రమాదిత్యుడి సమాధానం విన్నాక, అప్పుడు చెప్పండి” అని ముందుగానే చెప్పేస్తుంటాను. నోటి మాటని విజ్ఞతతో ఉపయోగించాలని చెప్పే ఈ కథ, ఎంతో విలువైనది!

మృత సంజీవని – కొత్త సమాధానం ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 46]

విక్రమాదిత్యుడు మరోసారి భేతాళుడున్న శవాన్ని బంధించాడు. దాన్ని భుజాన పెట్టుకుని మౌనంగా బృహదారుణ్యం కేసి నడవసాగాడు. భేతాళుడు పదిహేనవ కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్య మహారాజా! నీ పట్టుదల అనితర సాధ్యమైనది. నేనో కథ చెబుతాను. మార్గాయాసం మరిచి విను” అంటూ కథ కొనసాగించాడు.

ఒకానొకప్పుడు బ్రహ్మపురమనే బ్రాహ్మణ అగ్రహారం ఉండేది. అందులో విష్ణు స్వామి అనే బ్రాహ్మణుడుండే వాడు. అతడికి సంతతి లేదు. అందుచేత అతడెంతో దిగులు పడ్డాడు. ఎన్నో నోములూ, పూజలూ చేసాడు. చివరికి మహాశివుడి గురించి తీవ్ర తపమాచరించాడు. శివుడి దయతో, కొంత కాలానికి అతడికి సంతాన భాగ్యం కలిగింది. వరుసగా నలుగురు పుత్రులుదయించారు.

అతడువారినెంతో అల్లారుముద్దుగా పెంచి, తనకు తెలిసిన విద్యలన్నీ నేర్పాడు. మరిన్ని విద్యలు నేర్పాలన్న అభిలాషతో, కుమారులు నలుగురూ దేశాటనం బయలు దేరారు. అలా నానా దేశాలూ తిరుగుతూ, చివరికి ఓ యోగిని ఆశ్రయించారు.

ఆ యోగి సకల విద్యా పారంగతుడు. మంత్ర తంత్ర విద్యలని సైతం ఎఱిగిన వాడు. బ్రాహ్మణ కుమారులు. అతణ్ణి శ్రద్ధా భక్తులతో సేవించారు. వారి శుశ్రూషలకు మెచ్చిన యోగి, వారికి వారి అభిరుచుని బట్టి మంత్ర తంత్ర విద్యలు నేర్పాడు. తర్కమీమాంసాలు మీద గానీ, వేద విద్య మీద గానీ, వారికి ఆసక్తి లేకపోయింది.

దాంతో మృత సంజీవని సహా ఎన్నో అపూర్వమైన మంత్ర విద్యలు గురువు దగ్గర నేర్చుకున్నారు. ఓ శుభ దినాన, యోగి వాళ్ళ నలుగురికీ ‘విద్యాభ్యాసం పూర్తయ్యిందనీ ఇక ఇళ్ళకి వెళ్ళవచ్చనీ’ ఆనతిచ్చాడు.

కుర్రాళ్ళు నలుగురూ ఎంతో ఆనందంతో గురువుకి నమస్కరించి, స్వగ్రామానికి పయన మయ్యారు. దారిలో నదీ నదాలు, కొండలూ లోయలూ, అరణ్యాలూ జనపదాలూ దాటుతూ, తమ విద్యా ప్రదర్శనతో ప్రజలని అబ్బుర పరుస్తూ ప్రయాణించసాగారు.

మార్గమధ్యంలో వారొక అడవిలో నుండి ప్రయాణించాల్సి వచ్చింది. అప్పటికే తమ విద్యా ప్రదర్శనలకి ప్రజలు పలికిన జేజేలతో వాళ్ళల్లో అహం తలకెక్కి ఉంది. స్కోత్కర్షతో భుజాలు పొంగి ఉన్నాయి. ఆత్మస్తుతి శృతి మించింది. తమని తామే ప్రశంసించుకుంటూ ప్రయాణిస్తున్నారు.

అంతలో, బాట ప్రక్కనే ఓ పులి చచ్చిపడి ఉంది. శరీరం కుళ్ళి కంపు కూడా మాసిపోయింది. చీమలు తినగా శిధిలమై, మిగిలిన శరీరావశేషాలున్నాయి. నలుగురు అన్నదమ్ములూ దాన్ని చూశారు. తలకెక్కిన అహంకారానికి ఇంగిత జ్ఞానం అడుగంటింది. చచ్చిన పులిని బ్రతికించి, కుక్కలా తమ వెంట బెట్టుకు వెళ్ళితే, జనం భయంతో, ఆశ్చర్యంతో మూర్ఛబోతారనిపించింది. ఆ ఊహే వాళ్ళకి మత్తు గొల్పింది.

మొదటి వాడు మంత్రాలు జపిస్తూ పులి కళేబరంలో మిగిలిన ఎముకలు పోగు చేసి నీటిని మంత్రించి చల్లాడు. వెంటనే పులి అస్థిపంజరం తయారయ్యింది.

రెండవ వాడు మంత్రం జపిస్తూ, దానికి రక్తమాంసాలు ప్రసాదించాడు. మూడవ వాడు మంత్రాలు జపించి దానికి చర్మమూ, గుండె వంటి ముఖ్యమైన అవయవాలనూ సృష్టించాడు.

నాలుగవ వాడు మంత్రం జపించి దానికి ప్రాణం పోసాడు. అప్పటికే మిగిలిన ముగ్గురూ చప్పట్లు చరుస్తూ పులి ప్రాణం పోసుకోవడానికి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

నాలుగవ వాడి మంత్రోచ్ఛాటనతో పునర్జీవించిన పులి, తనకు ప్రాణదాతలైన తమ ఎదురుగా, వినయంగా నిలబడుతుందన్న ఊహతో, వొళ్ళు తెలియకుండా నిలబడి ఉన్న నలుగురినీ చూచి, పులి ఒక్కమారుగా గాండ్రించింది.

ఆకలితో నకనకలాడుతున్న పులి కంటికి నిండుగా ఆహారం కనబడింది. అది తమపై దాడి చేస్తోందన్న విషయం నలుగురు అన్నదమ్ములకీ అర్ధమయ్యేలోపునే, పులి నలుగురినీ చీల్చి పారేసింది. కడుపు నిండా తిన్నంత తిని, దాని దారిన అదిపోయింది.

ఇదీ కథ!

ఓ విక్రమార్క మహారాజా! నలుగురు బ్రాహ్మణ యువకులూ మృత్యువాత పడిన ఈ సంఘటనలో, ఈ బ్రహ్మహత్యా పాపం ఎవరికి చెందుతుంది?” అని అడిగాడు.

విక్రమాదిత్యుడు గొంతు సవరించుకుని “భేతాళుడా! నలుగురూ… విద్యాగర్వంతో, వినయాన్ని మరిచి విర్రవీగారు. అయితే మొదటి ముగ్గురి కారణంగా పులి శరీరాన్ని పొందిందే గానీ, చైతన్యాన్ని పొందలేదు. కాబట్టి ప్రాణహాని దాకా పరిస్థితి రాలేదు.

కనీసం చివరి వాడన్నా మంత్రప్రయోగం చేయటం ఆపి ఉంటే నలుగురు బ్రాహ్మణ యువకులూ బ్రతికి ఉండేవాళ్ళు. కాబట్టి మొదటి ముగ్గురి మృతి కారణంగా బ్రహ్మహత్యా దోషమూ, చివరి వాడి ఆత్మహత్యా పాపమూ కూడా, నాలుగో సోదరుడికే చెందుతాయి” అన్నాడు.

మరోసారి మౌనం భంగమైంది. భేతాళుడు అదృశ్యుడయ్యాడు.

కథా విశ్లేషణ: ఇది పంచతంత్రంలో కూడా ఉన్న కథ. చాలా చోట్ల విన్న కథ, చదివిన కథ. చివరికి పిల్లల పాఠాల్లో కూడా ఉన్న కథ! అయితే అంతగా ఆలోచించని సమాధానం ఈ కథలో ఉంటుంది.

పులి బ్రతకడానికి, అందరూ చావడానికీ నలుగురూ కారణమే అయినా… చివరి వాడి బాధ్యతే ఎక్కువ కాబట్టి, బ్రహ్మహత్యా పాపం అతడికే చుట్టుకుంటుందంటాడు విక్రమాదిత్యుడు.

చాలాసార్లు మనం ఇలాంతి స్థితిని గమనిస్తుంటాం. తలా కొంచెం అందరూ పాలుపంచుకున్న పని, చివరి క్షణంలో ఎవరి చేతుల్లో విఫలమయ్యిందో, వాళ్ళని బాధ్యుల్ని చేస్తున్నప్పుడు, “అతడొక్కణ్ణే అనడం దేనికి? అందరూ తలో చెయ్యివేసారు?” అంటుంటారు. దాంతో శిక్ష తీవ్రత పలుచనై పోతుంది.

నిజానికి చెడుకర్మల్లో… ఎవరి చేతుల్లో చివరి వైఫల్యం వచ్చిందో వాళ్ళని బాధ్యుల్ని చేస్తే…ఎవరికి వాళ్ళకే ఆ భయం ఉంటుంది. ఉదాహరణకి చేతులు మారుతున్న బాంబు ఎవరి చేతుల్లో పేలితే, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలవటం తధ్యం అనే స్థితిలో… ఎవరికి వాళ్ళూ ఎంతో అప్రమత్నంగా ఉంటారో… ఇదీ అంతే!

అప్పుడు ఎవరికి వాళ్ళూ చెడు కర్మకి వెనుతీస్తారు కదా!

ఆ నీతినే ఈ కథ చెబుతుంది!

ప్రియురాలు, ప్రియుడు, భర్త – ఎవరు గొప్ప? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 45]

విక్రమాదిత్యుడు తన ప్రయత్నం మాన లేదు. మోదుగ చెట్టెక్కి భేతాళుడిని దించి నడక ప్రారంభించాడు. భేతాళుడూ తన ప్రయత్నమాపలేదు. మరో కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్యా భూపాలా! విను” అంటూ కొనసాగించాడు.

అలకాపురి అనే నగరంలో ఒక వైశ్యశ్రేష్ఠుడు ఉండేవాడు. అతడి పేరు ఈశ్వర శెట్టి. అతడికి ఒక కుమార్తె ఉంది. పేరు రమ్యవల్లి. ఆమె పేరుకు తగ్గట్లే రమ్యమైన పూలతీగ వలె ఉండేది. ఆమె యుక్త వయస్సులో ఉంది.

వారి నివాసానికి దగ్గరలోని బ్రాహ్మణ అగ్రహారంలో నివసించే సందీపుడనే బ్రాహ్మణ యువకుడు ఆమెని ప్రేమించాడు. రమ్యవల్లికీ అతడంటే అనురాగమే ఉండటం వలన వారిద్దరూ ప్రతీ రోజూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు. పరస్పర సాన్నిహిత్యాన్ని ఆనందించే వాళ్ళు.

ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు అలకా పురి కి ప్రక్కనున్న నగరం నుండి ఓ వైశ్య యువకుడు, రంగనాధ శెట్టి అనేవాడు వచ్చి ఈశ్వర శెట్టిని కలుసుకున్నాడు. తనని తాను పరిచయం చేసుకొని పిల్లనివ్వమని అడిగాడు.

ఈశ్వర శెట్టి కి రంగనాధ శెట్టి కులగోత్రాలూ, రూపురేఖలూ, అర్హతలు నచ్చటంతో రమ్యవల్లినిచ్చి వివాహం చెయ్యడానికి అంగీకరించాడు. ముహుర్తం నిర్ణయించి, బంధుమిత్రులందర్నీ ఆహ్వానించి వైభవంగా పెళ్ళి జరిపించాడు.

ఇటు రమ్యవల్లి గానీ, అటు సందీపుడు గానీ తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పలేదు. పెళ్ళి వైభవోపేతంగా జరిగిపోయింది. రంగనాధ శెట్టి భార్యని వెంటబెట్టుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు. రమ్యవల్లి ప్రియుడైన సందీపుణ్ణి విడిచి వెళ్తున్నందుకు విపరీతంగా దుఃఖ పడింది.

అత్తగారిల్లు చేరినా, ప్రియుని వియోగ దుఃఖంతో కృంగి కృశించ సాగింది. కొన్ని రోజులకి ఆ వ్యధతో మరణించింది. ఆ వార్త విని సందీపుడు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చాడు. అన్నపానీయాలు నిద్రా విశ్రాంతులు మానివేసి, మనోవేదనతో మంచం పట్టాడు. కొద్ది రోజులకి అతడూ మరణించాడు.

రమ్యవల్లి మరణించడంతో ‘మనసు పడి వివాహం చేసుకున్న భార్య చనిపోయిందే’ – అన్న విచారంతో రమ్యవల్లి భర్త రంగనాధ శెట్టి కూడా దిగులు చెంది జబ్బున పడి మరణించాడు.

“ఓ విక్రమాదిత్య రాజేంద్రా! రమ్యవల్లి, ఆమె ప్రియుడు సందీపుడు, ఆమె భర్త రంగనాధ శెట్టి – ఈ ముగ్గురూ వ్యధ చెంది మరణించారు కదా! వీరిలో ఎవరు గొప్ప? వివరించి చెప్పు” అన్నాడు భేతాళుడు.

విక్రమాదిత్యుడు కొంత గంభీరంగా “ఓ భేతాళా! విను! రమ్యవల్లి, ఆమె ప్రియుడు సందీపుడూ… కొంతకాలం పరస్పర ప్రేమనీ, సాన్నిహిత్యాన్నీ అనుభవించారు. అందుచేత ఆ వియోగ దుఃఖాన్ని భరించలేక మనోవ్యధ చెంది మరణించారు. అయితే రమ్యవల్లి భర్త రంగనాధ శెట్టి అమాయకుడు. ముచ్చటపడి వివాహం చేసుకున్న భార్య మీద మమకారంతో, ఆమె మరణ దుఃఖాన్ని సహించలేక, బాధతో తాను మరణించాడు. కాబట్టి రంగనాధ శెట్టి గొప్పవాడు” అన్నాడు.

భేతాళుడు అంగీకార సూచకంగా తలాడించి “మౌనభంగమైంది మహారాజా! సెలవు” అంటూ మాయమై మోదుగ చెట్టు ఎక్కేసాడు.

చేజారిన మంత్రం కథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 44]

విక్రమాదిత్యుడు మరోసారి మోదుగ చెట్టెక్కి శవాన్ని దించి, భుజానికెత్తుకుని బృహదారణ్యం కేసి నడవసాగాడు. శవంలోని భేతాళుడు పదమూడవ కథ చెప్పడం ప్రారంభించాడు.

ఒకప్పుడు పుష్పపురం అనే నగరం ప్రక్కన ఓ శిధిలాలయం ఉండేది. ఒకరోజు ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో అలమటిస్తూ ఆ కోవెలలో పడుకున్నాడు.

అంతలో అక్కడికి ఓ యోగి వచ్చాడు. ఆ బ్రాహ్మణుణ్ణి చూడగానే యోగికి అతడి పరిస్థితి మొత్తం అర్ధమయ్యింది. యోగికి అతడిపై జాలి కలిగింది. అతడికి సాయపడదలిచాడు. వెంటనే ఆ యోగి ఒక మంత్రాన్ని జపించాడు.

వెంటనే అక్కడొక ఇల్లు సృష్టింపబడింది. చుట్టూ ఉద్యానవనం, ప్రక్కనే చిన్న సరస్సు, ఇంటి లోపలంతా అందమైన, విలువైన వస్తువులూ, సామాగ్రితో సర్వ సంపన్నంగా ఉంది. ఆ ఇంటి వంట గదిలో రుచికరమైన భక్ష్యభోజ్యాలు, మధురఫలాలూ, పానీయాలూ ఉన్నాయి.

యోగి బ్రాహ్మణుడిని ఆ యింటి లోనికి తీసుకు వెళ్ళాడు. అక్కడి మృష్టాన్న భోజనాన్ని చూచి బ్రాహ్మణుడి కళ్ళు మెరిసాయి. యోగి అతడిని వాటిని తినవచ్చునని ఆదేశించాడు. ఆ పేద బ్రాహ్మణుడు ఎంతో సంతోషంతో ఆకలి తీర్చుకున్నాడు.

యోగికి ఆ అభాగ్యుడి పట్ల ఎంతో వాత్సల్యం కలిగింది. అతడికి మంత్రోపదేశం చేయదలిచి “నాయనా, నీకు దివ్య మంత్రం ఉపదేశిస్తాను. పవిత్ర స్నానం ఆచరించాలి. పద!” అంటూ అతణ్ణి సరస్సు దగ్గరికి తీసికెళ్ళాడు. అందులో పుణ్యస్నానమాచరించి రావలసిందని పంపాడు. బ్రాహ్మణుడు సరస్సులో మునిగాడు.

తొలి మునక వేసిన క్షణం అతడి కొక దృశ్యం మనోఫలకం మీద గోచరించింది. అందులో అతడి కుమారుడు అతని ఎదురుగా నిలబడి ఉన్నాడు. రెండవ మునకలో అతడికి అతడి భార్య కనిపించింది. మూడో మునకలో అతడి వృద్ధులైన తల్లిదండ్రులు కనిపించారు.

స్నానం ముగించి గట్టు మీది కొచ్చాక బ్రాహ్మణుడికి అదంతా తన ఊహేగాని, తన భార్యాపుత్రులూ, తల్లిదండ్రులూ అక్కడ లేరని అర్ధమయ్యింది.

బ్రాహ్మణుడు తన అనుభవాన్నంతా యోగికి వివరించి చెప్పాడు. యోగి ఒక్కక్షణంతో తన ప్రయత్నం వృధా అయ్యిందని గ్రహించాడు. విచారం నిండిన స్వరంతో “నాయనా! అనవసరంగా నిన్ను శ్రమకు గురి చేసాను, నేనూ శ్రమ తీసుకున్నాను. ఈ మంత్రం నీకు ఉపయోగించదు. భగవదనుగ్రహమిట్లున్నది. నీవు ఇంటికి పోయి తోచిన రీతిన బ్రతుకు” అని అతడిని దీవించి తన దారిన తాను పోయాడు.

బ్రాహ్మణుడు కొంత సేపు విచారించి, చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

ఇదీ కథ!

భేతాళుడింత వరకూ కథ చెప్పి “ఓ విక్రమాదిత్యా! యోగి ఎందుకా విధంగా చెప్పాడు? మంత్రం యోగికి ఫలవంతమైనప్పుడు, ఆ పేద బ్రాహ్మణుడికెందుకు ఫలించదు? బ్రాహ్మణుడు సరస్సులో స్నానమాడి వచ్చేంతలో యోగి మనస్సు మార్చుకున్నాడా? యోగికి అతడిపై కలిగిన వాత్సల్యం అంతలోనే కరిగి పోయిందా? తెలిసీ జవాబు చెప్పకపోతే నీ తల వేయి వక్కలౌతుందని నీకు తెలుసు. మౌనభంగమైతే నీ ఈ ప్రయత్నం ఫలిందనీ, నీకు తెలుసు కదా! ఇక జవాబు చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు ఓ సారి దీర్ఘ శ్వాస తీసుకుని “ఓ భేతాళా! విను! ఆ యోగి అమృత హృదయుడు. ఆ పేదవాడిపై ప్రేమా జాలీ కలవాడై మంత్రోపదేశం చేసి అతడికి సహాయం చేయాలనుకున్నాడు. యోగి వాత్సల్యం కరిగి పోలేదు, మనస్సూ మారిపోలేదు.

అయితే… పుణ్యవ్రతం ఆచరించాలన్నా, దైవధ్యానం చెయ్యాలన్నా, యోగాభ్యాసమూ మంత్రోచ్ఛాటనా చేయాలన్నా, ఏకాగ్రత అవసరం. పూర్తిగా మనస్సుని లగ్నం చేసి సాధన మీదే దృష్టి కేంద్రీకరించి, ఇతరమైన ఆలోచన లేవీ లేకుండా ఏకాగ్రచిత్తులైతేనే… ఏ వ్యక్తి అయినా సాధన చెయ్యగలడు. ఆ పేద బ్రాహ్మణుడికి మనస్సుని ఏకాగ్రం చేసే శక్తి లేదు. అది గ్రహించిన వాడై, యోగి తన ప్రయత్నం విరమించుకొని, తన దారిన తాను పోయాడు. అంతే! అది బ్రాహ్మణుడి అసక్తత గానీ యోగి అనాదరణ కాదు” అన్నాడు.

భేతాళుడీ జవాబుకి సంప్రీతుడైనాడు గానీ తక్షణమే అదృశ్యుడూ అయ్యాడు.

కథా విశ్లేషణ: దేన్ని సాధించాలన్నా, ఏకాగ్రత అవసరం అనే విషయాన్ని పిల్లల మనస్సుకి హత్తుకునేలా చెబుతుందీ కథ! అందునా మాయమంత్రాలు నేర్చుకోవటమనే కథలంటే పిల్లలకి మహా సరదా! అలాంటి చోట మంత్రం నేర్చుకునే అవకాశం పోవటమంటే, పిల్లలకది బాగా గుర్తుండి పోతుంది. ఆ విధంగా ‘ఏకాగ్రత సాధించాలి’ అనే ఆలోచన వాళ్ళలో రేకెత్తుతుంది.

మంత్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 43]

నీతి వర్ధనుడు తన దేశాటన విశేషాలన్నిటినీ వివరించాడు. వర్తక శ్రేష్ఠితో స్నేహం, సముద్ర ప్రయాణం, తుపానులో దారి తప్పి కనీవినీ ఎరగని దీవికి చేరటం, అక్కడి ఆలయం, అందులోని అపురూప సుందరి గురించీ… ఏదీ దాచకుండా పూసగుచ్చినట్లు వర్ణించాడు.

రాజు వంశమార్గుడికి ఆ దీవిని చూడాలనే కోరిక కలిగింది. ఓ రోజు, నీతి వర్ధనుణ్ణి వెంటబెట్టుకుని, తగిన సిబ్బందితో నౌకా ప్రయాణం ప్రారంభించి, గతంలో నీతి వర్ధనుడు చేరిన దీవికి ప్రయాణమయ్యారు. కొన్నిరోజుల తర్వాత ఆ దీవికి చేరారు.

రాజు పరివారంతో గుడిలోకి ప్రవేశించాడు. అద్భుతమైన శిల్పాలతో అలరారుతున్న కోవెల అది. ఆవరణలో చెట్టు క్రింద నిదురిస్తున్న లావణ్య రాశిని చూశాడు రాజు. ఆమె చాలా అందంగా ఉంది. రాజుకి ఆమె పట్ల అనురాగం కలిగింది.

అలికిడికి నిద్ర లేచిన ఆ యువతి, రాజుని చూసి ఆశ్చర్య పోయింది. రాజు వంశమార్గుడు తీయని మాటలతో తన ప్రేమను ఆమెకు తెలిపాడు. అతడి మాట తీరుకు, గంభీరమైన అతడి రూపానికీ ఆమె ముగ్ధురాలైంది. అంగీకార సూచకంగా ఆమె కళ్ళు మెరిసాయి.

తనలో ‘ఇతడు గొప్ప చక్రవర్తై ఉంటాడు. ఇతడి రూపురేఖ మన్మధుణ్ణి, రాచఠీవి దేవేంద్రుణ్ణి తలపిస్తున్నాయి’ అనుకొంది.

మెల్లిగా తలెత్తి “ఓ రాజా! నీవు రాజులలో ఇంద్రుడి వలె ఉన్నావు. నేను నీ ప్రేమని తిరస్కరించినట్లయితే, ఇంత అందమైన శరీరం కలిగి ఉండీ నిరర్ధకమే! అయితే, నీవు కొంత సమయం వేచి ఉండక తప్పదు. రానున్న అష్టమి లేదా అమావాస్య వరకూ వేచి ఉండగలవు” అంది.

అప్పటి వరకూ రాజు తన పరివారంతో కోవెలలోని దుర్గామాతని ఆరాధిస్తూ, ఆ యువతితో తీయని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసాడు. అష్టమి రానే వచ్చింది.

ఆమె కోవెలలో ఒక వత్రమాచరింప ప్రారంభించింది. అందుకోసం గుడి ఆవరణలోని పవిత్ర పుష్కరిణిలో స్నానానికి వెళ్ళింది. ఆ కోనేటిలో కలువలూ, తామరలూ ఉన్నాయి. నీరు స్వచ్ఛంగా ఉంది. సన్నని అలలతో మనోహరంగా ఉంది.

రాజు “నీటిలో పసిబిడ్డని ఒంటరిగా విడిచి పెట్టరాదు. అదే విధంగా… అందమైన యువతినీ ఏ వేళలోనూ ఒంటరిగా ఉంచరాదు” అనుకొని, కత్తి చేతబూని, ఆమెకు కనబడకుండా ఆమెకి రక్షణగా ఉన్నాడు.

అంతలో… భీకరమైన శబ్దం వచ్చింది. అదేమిటో గమనించే లోగానే, ఓ భీకరాకారుడైన రాక్షసుడు వచ్చాడు. అమాంతం ఆమెని ఎత్తి నోట్లో పెట్టుకు మింగేసాడు.

ఒక్కక్షణం రాజు వంశమార్గుడు నివ్వెర పడ్డాడు. మరుక్షణం, ఆ రాక్షసుడి ముందుకు దూకి, ఒక్క ఉదుటున కత్తితో వాడి పొట్ట చీల్చాడు. అందులో నుండి ఆ యువతి సురక్షితంగా బయటపడింది.

ఆశ్చర్యంగా చూస్తున్న రాజుతో ఆమె “ఓ రాజా! నేను మృగాంకుడి పెద్ద కుమార్తెను. నా తండ్రి దేవసభలో ఇంద్రుడికి ప్రీతిపాత్రుడైన పండితుడు. నా పేరు మృగనయని (జింక కన్నుల వంటి కన్నులు కలది అని ఆ పేరుకు అర్ధం.)

నా తర్వాత నా తండ్రికి నూరుగురు కొడుకులున్నారు. నా సోదరులందరి కంటే నా తండ్రికి నేనంటే అమిత ప్రేమ. ఏనాడూ నన్నూ చూడకుండా ఉండలేడు, నేను లేనిది భోజనమైనా చేయడు.

ఆ రోజులలో ఓ అష్టమినాడు, నేను గౌరీ వ్రతాన్ని ప్రారంభించాను.

దాంతో గుడిలో పూజాది కార్యక్రమాలు ఆలస్యం కావటంతో, ఆ రోజు భోజనానికి చాలా సమయం గడిచినా ఇంటికి వెళ్ళలేక పోయాను. నా తండ్రి నాకోసం చాలా సేపు వేచి ఉన్నాడు. అలసిపోయి, ఆకలితో ఎదురు చూస్తుండగా, నేను ఇల్లు చేరుకున్నాను.

ఆకలితో వివశుడై ఉన్న నా తండ్రి కోపం పట్టలేక, నిగ్రహం కోల్పోయి, ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో, నన్ను “నీవు రాక్షసుడి చేత మ్రింగ బడెదవు గాక!” అని శపించాడు.

నేను కొయ్యబారి పోయాను. ఉత్తర క్షణం ఆయన కాళ్ళ మీద పడి విలపించాను. నా తప్పేమీ లేదనీ, ఆలయంలో పూజ ఆలస్యమైందనీ విన్నవించాను. శాపాన్ని ఉపసంహరించమని వినయంతో అర్ధించాను. దుఃఖాతిశయంతో వణుకుతున్న నన్ను చూసి, నా తండ్రికి తెలివి వచ్చింది. అప్పటి వరకూ దయ్యంలా ఆయన్ని పట్టి ఉంచిన క్రోధం ఒక్కసారిగా చల్లారింది. తానేం చేసాడో స్పృహ కలిగింది. నాకంటే వ్యగ్రంగా ఆయన దుఃఖించాడు.

నన్ను దగ్గరికి తీసుకొని తల నిమురుతూ “నా చిట్టి తల్లి! రాక్షసుణ్ణి చంపి నిన్ను కాపాడి ప్రేమించగల సాహసి నీకు తారసపడి నప్పుడు ఈ శాపం ముగుస్తుంది. అప్పటి వరకూ ఆ పార్వతీ దేవినే సేవించు. అయితే ప్రతీ అష్టమి, అమావాస్యలనాడు రాక్షసుడు వచ్చి నిన్ను మ్రింగుతూనే ఉంటాడు. మరునాడు రాక్షసుడు నిన్ను బయటకు కక్కుతాడు” అని శాప విమోచనం అనుగ్రహించాడు.

ఆనాటి నుండీ, నేనీ ఆలయంలో దేవిని సేవిస్తూ, ఇక్కడే ఉంటున్నాను. ప్రతీ అష్టమికీ, అమావాస్యకీ రాక్షసుడి చేత మ్రింగబడుతూ, మర్నాడు విడుదల అవుతూ, నన్ను ఉద్దరించగల సాహస వీరుడి కోసం ఎదురు చూస్తూ గడుపుతున్నాను. ఇన్నాళ్ళకి నా పుణ్యం ఫలించి, నీవు వచ్చి రాక్షసుణ్ణి సంహరించి, నన్ను ఉద్దరించావు.

ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది. ఓ రాజా! నేను నీ సొత్తుని. నీవు నన్ను వివాహం చేసుకొని జీవితాన్ని ఆనందించ వచ్చు” అన్నది.

ఆమె మాటలకు వంశమార్గుడెంతో ఆనందించాడు. మృగనయని నిష్టగా తన గౌరీ వ్రతాన్ని పూర్తి చేసింది. కోవెలలోని దుర్గామాత ఎదుట వారిద్దరూ వివాహం చేసుకున్నారు. మృగనయనితో కలిసి రాజు వంశమార్గుడు, మంత్రి నీతి వర్ధనుణ్ణి, ఇతర పరివారాన్ని వెంట బెట్టుకుని తిరిగి వారణావతం చేరుకున్నారు. రాణి చంద్రవదన నూతన వధూవరులకు స్వాగత సత్కారాలు చేసింది.

నగరానికి చేరిన మరునాడు మంత్రి నీతి వర్ధనుడు ఉరిపోసుకుని చనిపోయాడు.

ఇదీ కథ!

అని చెప్పిన భేతాళుదు “ఓ విక్రమాదిత్య మహారాజా! ఇప్పుడు చెప్పు. నీతి వర్ధనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? మృగనయనిని పొందిన రాజుని చూచి ఈర్ష్య చెందాడా?” అని అడిగాడు.

విక్రమాదిత్యుడు అడ్డంగా తల నాడిస్తూ “భేతాళా! నీతి వర్ధనుడికి రాజు పట్ల గానీ, అతడి అదృష్టం పట్ల గానీ ఈర్ష్యాసూయల వంటివి ఉన్నట్లుగా తోచదు. బహుశః అతడు ఇలా ఆలోచించి ఉండవచ్చు. ‘చెడ్డవాడైన వ్యక్తికి నీతులు బోధించ రాదు. అది వ్యర్ధమైన పని. అదే విధంగా మిఠాయిలు ఇష్టపడే బాలుడికి మరిన్ని తీపి వస్తువులు ఈయరాదు. అది ఆ బాలుడి ఆరోగ్యానికి చేటు తెస్తుంది.

అయితే నేను… ‘అసలుకే స్త్రీ సౌందర్యం పట్ల మితిలేని మోహం గల వంశమార్గుడి’కి, ఉన్న పట్టమహిషి చాలదన్నట్లు మరొక సుందరిని కట్టబెట్టాను. ఇప్పుడు ఖచ్చితంగా రాజు మరింతగా సుఖ భోగాలలో తేలియాడతాడే తప్ప రాజ్య వ్యవహారాలు చూడడు.
దీనంతటికీ కారకుడను నేను గనుక ప్రజలు మళ్ళీ నన్ను నిందించక మానరు. ఇవేవీ ఆలోచించకుండా రాజుకు నేను ఏకాంత ద్వీపం గురించీ, అందులోని అందమైన యువతి మృగనయని గురించీ చెప్పి, రాజామెను వివాహమాడే పరిస్థితులు తెచ్చాను. ప్రజానింద భరింప శక్యం కానిది’ అనుకొన్నవాడై ఆత్మహత్యకు పాల్పడ్డాడు” అన్నాడు.

భేతాళుడు “భళా విక్రమాదిత్యా భళా! నీ సునిశిత మేధావిత్వానికి ఇవే నా జోతలు” అంటూ ప్రశంసిస్తూనే చప్పున మాయమై పోయాడు. చిరునవ్వు నవ్వుతూ విక్రమాదిత్యుడు మోదుగ చెట్టు వైపుకు దారి తీసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో విక్రమాదిత్యుడు… ‘మంత్రి నీతి వర్తనుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోగలడు?’ అనే ప్రశ్నకు సునిశితమైన ఆలోచనతో జవాబిస్తాడు. ఒక వ్యక్తి ఒక పనిని నిర్వహించడానికి ఏయే ‘మోటివ్స్’ ఉండగలవో, వాటి గురించి ఎలా ఆలోచించాలో పిల్లలకి నేర్పే కథ ఇది!

దాదాపుగా ఇప్పుడు మన ఆధునిక నేరపరిశోధక విభాగాలు పనిచేసే తీరు ఇది! ఒక సంఘటన, ఓ దోపిడి, ఓ హత్య, ఓ నేరం… ఏది జరిగినా… ఎవరికి ఏ మోటివ్ ఉంది? ఏ పరిస్థితి ఇందుకు దారి తీసింది? – అనే కార్యకారణ సంబంధాన్ని ఛేదించే ఆలోచనా విధానం ఇది!

ఇలాంటి కథలు పిల్లలకి, ఆడుతూ పాడుతూ, చదువుతూ, వింటూనే, వాళ్ళకి తెలియకుండానే వారిలో సునిశిత ఆలోచనా శక్తిని ప్రేరేపిస్తాయి.
~~~~~~~~~

వంశ మార్గుడి కథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 42]

తర్వాతి ప్రయత్నంలో భేతాళుడు విక్రమాదిత్యుడికి మరొక కథ చెప్పటం ప్రారంభించాడు.

ఒకానొకప్పుడు వారణావతం అనే రాజ్యముండేది. దానికి రాజు వంశ మార్గుడు. [వంశానికే మార్గం చూపే వాడని అతడి పేరుకు అర్ధం.] అతడికి ఓ అందమైన భార్య ఉండేది. ఆమె పేరు చంద్రవదన. [చంద్రబింబం వంటి అందమైన ముఖం కలది అని అర్ధం.] పేరుకి తగ్గట్టే ఆమె అందాల భరిణె! అందానికి చందమామ!

రాజుకి భార్యంటే అమిత ప్రేమ, ఆకర్షణ. రాచకార్యాలన్నీ విడిచిపెట్టి దినమంతా ఆమెతోనే గడిపేవాడు.

ఆ రాజ్యపు మంత్రి పేరు నీతి వర్ధనుడు. [నీతిని వృద్ధి చేసే వాడని అర్ధం.] అతడెంతో మంచివాడు, తెలివైన వాడు. రాజు పరిపాలనా భారమంతా తనపై వదిలేసి అంతఃపురంలో రాణితో ఆటపాటలతో కాలం గడపటంతో మంత్రి రాజ్య భారమంతా వహించేవాడు.

నీతి నిజాయితీలతో, ధర్మబద్ధంగా పరిపాలన సాగేందుకు అన్ని విధాలా శ్రద్ధ తీసుకునేవాడు. కాలమిలా గడుస్తోంది. క్రమంగా ప్రజలు మంత్రిని శంకించ సాగారు. అతణ్ణి సందేహిస్తూ “ఈ మంత్రి చాలా తెలివైన వాడు. తన తెలివితేటలతో రాజుని ఏమార్చి, మరేవో విషయాలలో మునిగి తేలేటట్లు చేసాడు. ఆ నెపాన తానే అధికారమంతా చేతుల్లోకి తీసుకొని రాజ్యపాలన చేస్తున్నాడు” అని చాటుగా గుసగుసలు పోసాగారు.

ఆనోటా ఈ నోటా ఈ మాట మంత్రి చెవిన బడింది. అతడు దానికి చాలా మనస్తాపం చెందాడు. వికలమైన మనస్సుతో, దేశం విడిచి తీర్ధయాత్రకు బయలుదేరాడు. మంత్రి నీతి వర్ధనుడి దేశాటన గురించి ఇతర రాజోద్యోగులు వంశమార్గుడికి తెలియజేసారు.

రాజది విని విచారించాడు. ఇతర మంత్రులకూ, రాజోద్యోగులకూ పరిపాలనా బాధ్యతలు అప్పగించాడు.

నీతివర్ధనుడు పుణ్యక్షేత్రాలనీ, ఆయా ప్రదేశాల్లోని వింతలూ విశేషాలనీ చూస్తూ యాత్ర కొనసాగిస్తున్నాడు. మార్గవశాత్తూ అతడో రేవు పట్టణాన్ని చేరాడు. ఆ ఊళ్ళో ఓ వర్తక శ్రేష్ఠి ఉన్నాడు. అతడి తో మంత్రి నీతి వర్ధనుడికి చెలిమి కలిసింది.

ఇద్దరి అభిప్రాయాలూ, దృక్పధాలూ ఒకటి కావడంతో ఇరువురూ ఎన్నో విషయాలు చర్చిస్తూ హాయిగా కాలం గడపసాగారు. ఇద్దరూ తెలివైన వాళ్ళూ, పండితులూ కావటంతో, శాస్త్ర సాహిత్య విషయాలూ, కళాస్వాదనలూ, సత్సంగాలూ! రోజులు గడవసాగాయి.

రానూ రానూ వారి మైత్రి మరింత గాఢమైంది. ఓ రోజు… వర్తకుడు మంత్రితో “ఓ మిత్రుడా! నేను వ్యాపారనిమిత్తమై నా నౌకలో దేశాంతరం బయలు దేరనున్నాను. కొద్ది రోజులలోనే తిరిగి రాగలవాడను. నిన్ను వీడి వెళ్ళడానికి మనస్సొప్పడం లేదు. అయినా ఉదర పోషణార్ధం వృత్తి వ్యాపారాలు తప్పవు గదా! నేను తిరిగి వచ్చు వరకూ దయతో నీవిక్కడనే ఉండవలసిందిగా నా కోరిక” అన్నాడు.

నీతి వర్ధనుడు చిరునవ్వు నవ్వుతూ “ప్రియమిత్రుడా! నీవు లేని చోట నాకు మాత్రం పని యేమి ఉన్నది? ప్రపంచమున గల వింతలూ విడ్డూరాలూ చూడ వేడుక తోనే నేనిట్లు పుట్టిన భూమీ వదలి వచ్చితిని. కావున నీ నౌకలో నన్నూ గొనిపొమ్ము. ఇరువురమూ కలిసే వెళ్ళెదము గాక!” అన్నాడు.

వర్తక శ్రేష్ఠి ఇందుల కెంతో సంతోషించాడు. ఓ మంచి ముహుర్తాన నౌక బయలు దేరింది. నీలి సాగరపు అలలపై హుందాగా పయనిస్తోంది. సాగర సౌందర్యాన్ని, నీటి పక్షుల కోలాహలాన్ని, చల్లని గాలుల్నీ ఆనందిస్తూ మంత్రి తన ప్రియమిత్రుడితో మంచీ చెడు మాట్లాడుతూ కాలం గడుపుతున్నాడు.

దురదృష్టవశాత్తూ వాళ్ళ నౌక సముద్రపు తుఫానులో చిక్కుకుంది. సుడిగాలికి, రాకాసి అలలకీ ఆకులా అలల్లాడింది. నావికులెట్లో నౌకని నియంత్రంచ ప్రయత్నించసాగారు. తుఫాను తగ్గేటప్పటికి నౌక దారి తప్పి మరెటో పయనించింది.

నావికులకి అది పూర్తిగా కొత్త దారి కావటంతో, వారు కొంత వెఱగొంది, జాగరూకతతో నౌకని నడపసాగారు. అదృష్టం బాగుండి, భగవంతుడి కరుణ వారిపై ప్రసరించి, వారి నౌక ఓ దీవి చేరింది. నౌకకి లంగరు వేసారు. నావికులూ, సిబ్బంది దీవిలో చెట్లు నరికి నౌకలో వంట చెరకుకీ, ఇంధనానికీ ఏర్పాట్లు చేయదలిచారు. నౌక దిగి దీవిలో తిరగాడారు.

ఆ దీవిలో వారికొక ప్రాచీన ఆలయం కనిపించింది. అద్భుత శిల్ప సౌందర్యంతో చూడటానికి రెండు కళ్ళూ చాలననేంత అందంగా ఉంది. అయితే చిత్రంగా ఆ దేవాలయంలో గానీ, దీవిలో గానీ నరమానవ సంచారం లేదు. గర్భగుడి ఎదురుగా ఓ పెద్ద అశ్వత్ధ వృక్షం ఉంది. దాని క్రింద ఓ సౌందర్యవతి కూర్చొని ఉంది.

ఆలయమూ, ఆ యువతీ కూడా దేవలోకానికి చెందినట్లుగా ఉన్నారు తప్ప, భూలోకంలో అంతటి అందమైన దేవళం గానీ, అలాంటి యువతి గానీ ఉండరనిపించింది. దాంతో నావికులూ, నౌకా సిబ్బంది ఎంతో భీతిల్లారు. దేవతాలోకంలో అడుగుపెడితే శాపాలకు గురి కావచ్చొన్న వెరపుతో వడి వడిగా నౌక చేరి లంగరు తీసి, తెర చాపలెత్తి ప్రయాణం ప్రారంభించారు.

కొన్ని నాళ్ళకే తమ స్వస్థలానికి చేరారు. నీతి వర్ధనుడూ, అతడి మిత్రుడైన వర్తకుడూ కూడా వారితో పాటే తిరిగి వచ్చారు. ప్రయాణ ముచ్చట్లలో మరి మూడు నాలుగు దినాలు గడిచాయి. నీతి వర్ధనుడికి స్వదేశం మీదికి గాలి మళ్ళింది.

అతడు తన మిత్రుడైన వర్తక శ్రేష్ఠికి తన అభీష్టం చెప్పి వీడ్కొలు తీసుకున్నాడు. ప్రియమిత్రుడికి తగిన కానుకలిచ్చి ఆత్మీయంగా వీడ్కొలిచ్చాడు వర్తకశ్రేష్ఠి. నీతి వర్ధనుడు నేరుగా స్వదేశం బయలు దేరి కొన్నాళ్ళకు వారణావతం చేరాడు.

రాజు వంశమార్గుడతణ్ణి సాదరంగా ఆహ్వానించాడు.

“ఓ మంత్రీ! నీతి వర్ధనా! ఇన్నినాళ్ళూ నీవు క్షేమంగా ఉన్నావు కదా? ఎందుకు నీవు నన్నూ, మన దేశాన్నీ విడిచి వెళ్ళావు?” అని అడిగాడు.

నీతి వర్ధనుడు “మహారాజా! ప్రజలు నా గురించి ‘నేను మీకు బదులుగా రాజ్యాధికారం చలాయిస్తున్నాననీ, అందుకే మీరు ఇతరత్రా కాలం గడిపేటట్లుగా ప్రణాళికలు వేసాననీ’ నీలాపనిందలుగా అనుకోసాగారు. అందుచేత నాకు బాధ తోచింది. అందుకే మిమ్మల్నీ, దేశాన్నీ విడిచి తీర్ధయాత్రలకు పోయాను. దేశాటనంలో భాగంగా ఎక్కడెక్కడో తిరిగాను. ఎన్నెన్నో వింతలు చూసాను. అయితే నాకెక్కడా మనశ్శాంతి లభించలేదు. చివరికి మాతృభూమికి తిరిగి వచ్చాను” అన్నాడు.

రాజు వంశమార్గుడిది విని కొంత విచారించాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత “మంచిది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు, గతంలో వలె నీవు రాజ్యవ్యవహారాలు చక్క పెట్టగలవు. ఇంతకూ నీవు దేశాటనంలో ఏయే వింతలు చూచిన వాడవు. వినాలని కుతుహలంగా ఉంది. వివరించి చెప్పు” అన్నాడు.
~~~~~~

ఎవరు అత్యంత సుకుమారి! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 41]

విక్రమాదిత్యుడు అలసట గానీ, విసుగుదల గానీ తలచకుండా, మళ్ళీ మోదుగ వృక్షం చేరి భేతాళుని పట్టి బంధించి, భుజాన వేసుకుని బృహదారణ్య కేసి నడవసాగాడు. అది పదకొండవ ప్రయత్నమే అయినా ఆ మహారాజు జ్ఞాన శీలుడి కిచ్చిన వాగ్ధానాన్ని నెరవేర్చడంలో తొలిప్రయత్నమప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నాడో ఇప్పుడూ అంతే ఉత్సాహంగా ఉన్నాడు.

విక్రమాదిత్యుడు నడక ప్రారంభించగానే శవంలోని భేతాళుడు కథ ప్రారంభించాడు. “ఓ రాజాధిరాజా! ఇక కథ విను!” అంటూ కొనసాగించాడు.

పూర్వకాలంలో ఢిల్లీ నగరాన్ని వంశకేతుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. అతడికి ముగ్గురు భార్యలు. రాణులు ముగ్గురూ కూడా సౌందర్యానికీ, సౌకుమార్యానికీ ప్రసిద్ధి చెందారు.

ఓనాటి సాయం సమయాన మహారాజు తన రెండవ భార్యతో రాజోద్యాన వనంలో చల్లగాలికి విహరిస్తున్నాడు. ఆ సమయంలో ఓ చిన్ని సీతాకోక చిలుక, రాణి సిగలోని పువ్వుల మీద వాలింది. దాని బరువుకి రాణికి శిరోభారం కలిగి స్పృహ తప్పి పడిపోయింది.

చందనం, శీతల పానీయాలతో దాసీ లామెను సేద తీర్చారు.

మరునాటి రాత్రి వేళ, మహారాజు మొదటి రాణితో రాజాంతఃపురపు ఉప్పరిగ (మేడ) మీద కూర్చుని కబుర్లు చెబుతున్నాడు. అది పున్నమి రాత్రి! వెన్నెల పుచ్చపువ్వులా పృధివంతా వెదజల్లుతోంది.

పూర్ణ చంద్రుని నిండు కాంతికి రాణి తెల్లని శరీరం మీద ఎర్రటి దద్దుర్లు లేచాయి. బాధతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. దాస దాసీజనాలు, రాణిని అంతఃపుర మందిరం చేర్చి, చందనం, వట్టి వేళ్ళతో చికిత్స చేసి, శీతల పానీయాలతో సేద తీర్చారు.

ఆ మరునాటి మధ్యాహ్నం రాజు, మూడవ రాణితో కలిసి సంగీతాన్ని వింటూ ఆనందిస్తున్నాడు. సంగీత విద్వాంసుడు శ్రావ్యంగా పాడుతున్నాడు. ప్రక్క వాయిద్యాలతో ఇతర సంగీత కారులు అతడికి సహకరిస్తున్నారు. మంద్రంగా పరచుకున్న సంగీతం, శ్రోతలని ఏదో లోకాలలో విహరింప చేస్తోంది.

అంతలో ఎక్కడి నుండో…రోట్లో ధాన్యం పోసి రోకలితో దంచుతున్న చప్పుడు వినబడింది. ఆ రోకటి పోటు చప్పుడు వినగానే, మూడవ రాణి అరచేతుల్లో బొబ్బలెక్కి పోయాయి. బాధతో ఆమె చిన్నగా అరిచింది. ఆమె అరచేతులు చూస్తే… లేత గులాబి పువ్వుల్లా ఉన్న ఆమె అరచేతుల్లో కుంకుమపొడి చల్లినట్లుగా బొబ్బలు లేచాయి. బాధతో కన్నీరు తిరగగా, ఆమె స్పృహ తప్పి పడిపోయింది.

దాసీలు వచ్చి ఆమె అరచేతులకి వెన్నరాసి శైత్యోపచారాలు చేసారు.

భేతాళుడింత వరకూ కథ చెప్పి, “ఓ విక్రమాదిత్య రాజేంద్రా! ఈ ముగ్గురు రాణులలో, ఎవరు అత్యంత సుకుమారులు? వివరించి చెప్పు” అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులు చిలిపి నవ్వుతో మెరుస్తుండగా, భేతాళుడి వైపు కోర చూపు చూస్తూ “భేతాళా! రెండవ రాణి కొప్పులో సీతాకోక చిలుక బరువుని అనుభవించి బాధకి స్పృహ తప్పిపోయింది. సీతా కోక చిలుక చిన్నదే అయినా, దాని భారం ఆ చిన్నది భరించలేక పోయింది. ఆమె అంతటి సుకుమారి!

అలాగే పెద్దరాణి చంద్రుని పున్నమి కాంతిని అనుభవించింది. అందరికీ చల్లని వెన్నెలగా తోచే నిండు పున్నమి వెలుగులోని వేడికి సొక్కి సోలి పోయింది. ఆమె సౌకుమార్యం అంతటిది.

అయితే మూడవ రాణి, ప్రత్యక్షంగా ఏ అనుభవమూ పొందకుండానే, దూరాన వేరెవరో దంచుతుండగా, ఆ శబ్దానికే చేతులు బొబ్బలెక్కి, స్పృహ తప్పి పోయింది. మొదటి ఇద్దరు రాణుల అనుభవం శారీరకమైతే, మూడవ రాణి అనుభవం మానసికం. కాబట్టి మూడవ రాణి సౌకుమార్యమే గొప్పది. ముగ్గురిలోకి మూడవ రాణి అత్యంత సుకుమారి” అన్నాడు.

భేతాళుడూ నవ్వుతూ విక్రమాదిత్యుడి భుజం మీద నుండి మాయమై మళ్ళీ చెట్టేక్కేసాడు.
~~~~~~~

భర్త, మోహితుడు, దొంగ – ఎవరు గొప్ప! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 40]

దొంగ ఓ క్షణం ఆలోచనలో పడ్డాడు. ఏమనుకున్నాడో ఏమో ఆమెను వెళ్ళనిచ్చాడు. అక్కడే ఆమె కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు.

మదన సేన నేరుగా చారు దత్తుడి ఇంటికి వెళ్ళింది. ఆమెని చూసి నిర్ఘాంత పడిన చారు దత్తుడితో “చారు దత్తా! నా మునుపటి ప్రమాణాన్ని నిలబెట్టుకుంటూ నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నువ్వు నా సౌందర్యాన్ని ఆనందించవచ్చు” అంది.

చారుదత్తుడు మరింతగా చేష్టులుడిగి పోయాడు. మరుక్షణం పశ్చాత్తాప పడ్డాడు. అతడు తనలో ‘ఈ యువతి, మదన సేన సామాన్యురాలు కాదు. ఈమె నిజాయితీ గలది, శీలవతి కూడాను. ఈమె పట్ల నేను చెడుగా ఆలోచించ కూడదు. ఈమె పతివ్రత’ అనుకున్నాడు.

అతడు ఆమె పాదల మీద వాలి క్షమార్పణ అడిగాడు. భర్తతో కలిసి నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో జీవించాల్సిందిగా దీవించి, వీడ్కొలిచ్చాడు. చారుదత్తుడు చూపిన పరిణతికీ, వాత్సల్యానికీ మదన సేన ఎంతో సంతోషించింది. అక్కడి నుండి వెనుదిరిగింది.

నేరుగా దొంగ ఎదురుచూస్తున్న చోటికి వచ్చింది. ఆమె తిరిగి వస్తుందో రాదో అనే అనుమానంతో అసహనంగా ఉన్న దొంగ, ఆమెని చూసి ఆశ్చర్యపోయాడు, నమ్మశక్యం గానట్లు చూస్తున్న దొంగకి ఆమె జరిగిందంతా చెప్పింది. దొంగ అది విని నిరుత్తరు డయ్యాడు.

‘ఈ యువతి నిజంగా సామాన్యురాలు కాదు. పారిపోగల అవకాశం ఉన్నా కూడా ఇచ్చిన మాట కోసం తిరిగి వచ్చింది. ఈమె పాతివ్రత్యం కలది. కాబట్టే ఈమెపట్ల పాప చింతనని వదలిపెట్టాడు చారుదత్తుడు. ఈమెకు కీడు చేసినట్లయితే భగవంతుడు నన్ను క్షమించడు. ఈమె ఇప్పుడు నిస్సహాయంగా నాకు లొంగిపోయినా ఈమె కన్నీరైనా నన్ను శపించ గలదు’ అనుకున్నాడు.

పశ్చాత్తాపంతో ఆమె పాదాలపై బడ్డాడు. “అమ్మా! మన్నించు. నీవు నా సోదరీ తుల్యవు.” అంటూ క్షమాపణ కోరుకున్నాడు. అన్న వలె ఆదరించి, తన దగ్గరున్న ఆభరణాలని ఆమెకు కట్నంగా ఇచ్చి వీడ్కొలిచ్చాడు.

ఆమె సంతోషంగా భర్త దగ్గరికి తిరిగి వచ్చింది. జరిగిన విషయాలన్నీ భర్తకి పూసగుచ్చినట్లుగా చెప్పింది. తను నమ్మిన సత్యం తనను కాపాడినందుకు ఆమె ముఖం దీప్తిమంతంగా ఉంది. మంచితనాన్ని ఆస్వాదించిన ఆమె కళ్ళు కోటి చంద్రుల కాంతిని గుమ్మరిస్తున్నాయి.

అట్టి యువతీ రత్నాన్ని భార్యగా పొందిన తన అదృష్టానికి సముద్ర దత్తుడు ఎంతగానో మురిసిపోయాడు. ఆమెను దగ్గరికి తీసుకుని ఆశీర్వదించాడు. భార్యాభర్తలిద్దరూ చిరకాలం సుఖ సంతోషాలతో జీవించారు.

భేతాళుడు ఇంత వరకూ కథ చెప్పి, విక్రమాదిత్యుడితో “ఓ రాజాధిరాజా! మదన సేన భర్త సముద్రదత్తుడూ, ఆమె పై మోహం చెందిన చారుదత్తుడు, దొంగ – వీరందరిలో ఎవరు గొప్ప వారు? చెప్పు” అని అన్నాడు.

విక్రమార్కుడు గిరజాల జుట్టు ఊగుతుండగా సన్నగా నవ్వుతూ “భేతాళా విను! అందరిలోకి దొంగే గొప్పవాడు. మదన సేన భర్త సముద్ర దత్తుడు భార్య నిజాయితీ మీద నమ్మకంతో ఆమెకు అనుమతి ఇచ్చాడు. అతడి నమ్మకం నిజమైంది.
చారుదత్తుడు ఆమె నిజాయితీకి, సత్యవ్రతానికి బద్దుడై పశ్చాత్తాప్తుడైనాడు. అయితే దొంగ ప్రాధమికంగా చోరవృత్తిలో ఉన్నవాడు, దయా దాక్షిణ్యాలు లేని కౄరవృత్తి అది. అతడు యధేచ్ఛగా మదన సేన నగలతో పాటు, ఆమె పై అత్యాచారం జరిపి అయినా సరే, ఆమె అందాన్ని పొందగల అవకాశం ఉన్నవాడు.

అయినా గానీ, ఆమె పాతివ్రత్యానికి భయపడి, నిజాయితీకి అధీనుడై, పశ్చాత్తాపంతో చలించాడు. కాబట్టే ఆమెని స్వంత సోదరి వలె ఆదరించి పంపించాడు. తానెలా ప్రవర్తించినా, దొంగ కాబట్టి తన ఆచూకీ ఎవరికీ తెలియదు. అదే చారుదత్తుడికైతే అప్పటికి కోరికకి ప్రలోభపడినా, తర్వాత అపరాధానికి బాధ్యుడయ్యే అవకాశం ఉంది. దొంగకి అలాంటి ప్రమాదం లేదు. అయినా స్వయంగా తప్పు చేయడం నుండి విరమించు కున్నాడు. కాబట్టి దొంగే గొప్పవాడు” అన్నాడు.

విక్రమాదిత్యుడి సమాధానం వినగానే భేతాళుడు బిగ్గరగా నవ్వుతూ తిరిగి మోదుగ చెట్టు ఎక్కేసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో విక్రమాదిత్యుడు చూపించే తర్కం చక్కగా ఉంటుంది. ఒకే పని చేసిన వ్యక్తుల్ని వారి పరిస్థితుల్ని బట్టి విశ్లేషించడం పిల్లల్ని బాగా ఆకర్షిస్తుంది. ఇలాంటి కథల వలన వారిలో కుతూహలం కొద్దీ పఠనాసక్తి పెరుగుతుంది. వివేచనా శక్తి, విశ్లేషణా సామర్ధ్యం పెరుగుతాయి.

కట్టుబాటు వీడని మదన సేన! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 39]

మరోసారి విక్రమాదిత్యుడు భేతాళుని పట్టి బంధించి, బృహదారణ్యం వైపు నడవసాగాడు. భేతాళుడు ఎప్పటి లాగే కథ ప్రారంభించాడు. ఇది భేతాళుడు చెప్పిన పదవ కథ. భేతాళుడు “విక్రమార్క మహారాజా! విను” అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు ‘మగధ’ అనే రాజ్యం ఉండేది. దాని రాజధాని పేరు కోసల నగరం. మగధకు రాజు ధీర వీరుడు. అతడెంతో పరిపాలనా దక్షత గలవాడు.

ఆ నగరంలో ధనదత్తుడనే భాగ్యవంతుడైన వ్యాపారి ఉండేవాడు. అతడికి సంతానం లేదు. దాంతో అతడు శివుని గురించి భక్తి శ్రద్దలతో తపమాచరించాడు. మహాదేవుడి వరంతో అతడికొక కుమారుడు, కుమార్తె కలిగారు. కుమారుడికి ‘ధర్మదత్తుడ’నీ, కుమార్తెకు ‘మదన సేన’ అనీ పేర్లు పెట్టుకుని, ధనగుప్తుడు వాళ్ళిద్దరినీ అపురూపంగా పెంచసాగాడు.

పిల్లలిద్దరూ పెరిగి పెద్దయ్యారు. ధర్మదత్తుడు గురుకులంలో చేరి విద్యాబుద్దులు నేర్చాడు. అతడికొక స్నేహితుడున్నాడు. అతడి పేరు చారు దత్తుడు. ధర్మదత్తుడూ, చారు దత్తుడూ ఎంతో ప్రాణ మిత్రులైనందున, ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవారు. ‘ఒకే కంచం, ఒకే మంచం’ అన్నంతగా విడిపోని స్నేహంతో మెలిగే వారు.

ధనదత్తుడి కుమార్తె మదనసేన యుక్త వయస్కురాలైంది. ఆమె చాలా చక్కనిది. సుగుణ శీలి. ఒక నాడామె తలారా స్నానం చేసి జారుగా వేసిన జడతో, స్నేహితురాళ్ళతో కలిసి ఇంటి తోటలో బంతాట ఆడుకుంటోంది. గాలికి ఆమె ముంగురు లూగుతున్నాయి. పరుగెత్తి బంతిని పట్టుకుంటూ ఆమె ఆడుతుంటే, మెరుపు తీగ మెలికలు తిరిగినట్లుంది. ఆమె కిలకిల నవ్వులు చిలుకా కోకిలలు కబుర్లు చెబుతున్నట్లున్నాయి.

ఆ సమయంలో చారు దత్తుడు ధర్మదత్తుడితో కలిసి వచ్చాడు. మదన సేనను చూసి చారుదత్తుడు ముగ్ధుడైనాడు. ఆమె అందం, నవ్వు, మాట తీరు అతడికి మతి పోగొట్టాయి. మరునాడు అతడామెని తోటలో ఒంటరిగా కలుసుకున్నాడు.

ఆర్తితో “మదన సేనా! నీవు సౌందర్యవతివి. నీ అందాన్ని మరిచి పోలేకున్నాను. నీ మీద ప్రేమ, విరహంతో నిదుర రాకున్నది. దయ చేసి నన్ను అంగీకరించు.” అంటూ ప్రాధేయ పడ్డాడు.

మదన సేన తలెత్తి అతడి వైపు చూసింది. ఓ క్షణం మౌనంగా ఉంది. తర్వాత “చారు దత్తా! నా తల్లిదండ్రులు నన్ను సముద్ర దత్తుడికిచ్చి వివాహం చేయ నిశ్చయించారు. నేను వాగ్దత్తని. అది నీకూ తెలుసనుకుంటున్నాను. అయినా నీవు నా ముందు ప్రేమ ప్రసంగం తెచ్చావు. కానీ నేను కట్టుబాటు మీర గల దానిని కాను” అంది.

మదన సేనపై కోరికతో వివేకం కోల్పోయిన చారుదత్తుడు అక్కడే నిలబడి పోయాడు. ఆమె వైపు జాలిగా, అభ్యర్ధనగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.

మదన సేన “చారు దత్తా! నిన్ను నిరాశ పరచటం నా అభిమతం కాదు. త్వరలో నా వివాహం జరగనుంది. నా వివాహమైన మరునాడు, తొలిరాత్రికి పూర్వమే, నేను నీ వద్దకు రాగలను. నీ కోరిక తీర్చగల దానను. ఇదే నా ప్రమాణం. అప్పటి వరకూ నేను నా కట్టుబాటును దాటను. దయ చేసి వెళ్ళు” అంది.

చేసేది లేక చారు దత్తుడు వెనుదిరిగి పోయాడు. అప్పటి నుండి వారి ఇంటికి రాకపోకలు తగ్గించాడు. ధర్మదత్తుడెంత అడిగినా ఏదీ చెప్పలేదు.

కొన్ని రోజులు గడిచాయి. మదన సేన వివాహం సముద్ర దత్తుడితో అతి వైభవంగా జరిగింది. అందమైన భార్యని చూసుకుని సముద్ర దత్తుడెంతో మురిసిపోయాడు. తొలి రాత్రి నూతన వధూవరులిద్దరూ పడక గదికి చేరారు.

పూల సౌరభాలతో, వెన్నెల సోయగాలతో… పోటీ పడుతూ, మదన సేన శరీర గంధమూ, సౌందర్యమూ అతిశయిస్తున్నాయి. సముద్ర దత్తుడు ప్రేమగా భార్యను చేరబోయాడు. ఆమె అతణ్ణి ఆపుతూ “ఓ నా ప్రియపతీ! నాదొక ప్రార్ధన! దయ యుంచి వినుడు. మన వివాహానికి పూర్వం, నేను నా యింట నుండగా ఒక యువకుడు నా దగ్గరి కొచ్చాడు. నా మీద ప్రేమాతిశయాన్ని వివరించాడు.

నా వివాహమైన తొలి రాత్రి, నేనతడి కోరిక తీర్చగలనని ప్రమాణం చేసి ఉన్నాను. నా కట్టుబాటును దాటలేనని, కన్యాత్వమును వీడ జాలనని ఆ విధంగా ప్రమాణం చేసాను. ఇప్పుడా ప్రమాణాన్ని తృణీకరించుట ధర్మము కాదని మీకు చెబుతున్నాను. ఆపై మీ ఇచ్ఛ ఎట్లయిన, అట్లు నిర్ణయించి, నాకు ఆనతి నీయగలరు” అని విన్నవించింది.

ఇదంతా విని సుముద్ర దత్తుడు ఆశ్చర్య పోయాడు. ‘లోకంలో ఇట్టి కోరికలు కోరు వారుండవచ్చు గానీ, ఇట్టి ప్రమాణములు చేయు వారుందురా? ఈమె గుట్టు చప్పుడు గాక, ఏ తీరుగ నైనా ప్రవర్తించ వచ్చు. అట్లు చేయక, నా అనుమతి అడుగుతున్నది. ఈమె లోకంలో ఉండే ఇతర సాధారణ యువతుల వంటిది కాదు. ఈమెకు మోసపు బుద్ధి లేదు. ఈమెను విశ్వసించ దగు” అనుకున్నాడు.

మదన సేన వైపు చూస్తూ “మంచిది. పోయి రా!” అన్నాడు. ఆ విధంగా మదన సేన భర్త అనుమతి తీసుకుని, ఆ అర్ధరాత్రి సమయాన చారుదత్తుడి ఇంటికి బయలు దేరింది.

దారిలో ఒక గజదొంగ ఆమెను చూశాడు. ఆమె అందాన్ని చూసి అబ్బురపడ్డాడు. దారి కడ్డం వచ్చి ఆమె నాపాడు. తనతో గడపవలసిందిగా కోరాడు. మదన సేన చేతులు జోడిస్తూ “అయ్యా! ఎందుకు నా సాంగత్యాన్ని కోరుతావు? దాని తో ఒనగూడే ప్రయోజన మేముంది? నీవు దొంగవు. చేతులు జోడించి ప్రార్ధిస్తున్నాను. నా ఈ నగలన్నీ తీసికొని, నన్ను విడిచి పెట్టు. విలువైన ఈ నగలన్నిటితో సంతోషంగా నీ దారిన నీవు పో” అంది.

దొంగ విలాసంగా నవ్వి “ఓ యువతీ రత్నమా! నీవంటి సౌందర్యవతితో గడపటం అన్నిటి కంటే విలువైనది” అన్నాడు. మదన సేన నిస్సహాయంగా నిలబడింది. ఓ క్షణం తర్వాత, తన కథంతా అతడికి వివరించి చెప్పింది.

“ఇప్పుడు నేను చారు దత్తుడికిచ్చిన మాట నిలుపుకునేందుకై వెళ్తున్నాను. దయ చేసి నన్ను వెళ్ళ నివ్వు. తిరిగి వచ్చేటప్పుడు నీ దగ్గరకు రాగలను” అంది.

~~~~~~

యువరాజు, మేకపోతు – ఎవరి వివేకం గొప్పది? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 38]

ఆ క్షణంలో... ఆ ప్రక్కనే రెండు మేకలున్నాయి. ఒకటి ఆడమేక(పెంటి), మరొకటి మగమేక (పోతు). పోతుమేక పెంటి దగ్గరికి ప్రేమగా చేరబోయింది. ఆడమేక దాని నాపుతూ. "నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే... అదిగో, ఆ బావి లోతట్టు గోడల మీద పచ్చని లేత చివురాకులున్నాయి. ఆ బావి మనకి దాపులనే ఉంది. నీవా లేచిగురాకులు తెచ్చి నాకిచ్చినట్లయితే నీ ప్రేమని అంగీకరిస్తాను" అంది.

మగమేక బావి వద్ద కెళ్ళి తొంగి చూసింది. బావి గోడలు పాకుడు పట్టి ఉన్నాయి. లోతట్టు గోడల కున్న పగుళ్ళలో పచ్చని మెత్తని పచ్చిక, చిగురాకులతో చిన్న చిన్న మర్రి మొక్కలూ పెరిగి ఉన్నాయి. గాలికి అవి ఊగుతున్నాయి, ఆకులు వెన్నెలలో మెరుస్తున్నాయి.వాటిని చూసి మగమేక ఓ క్షణం చింత పడింది. బావిలోకి ఓ సారి, పెంటి మేక వైపోసారి మార్చిమార్చి చూసింది.


మగమేక “ఓ ఆడుదానా! నీవు నీ కౄర బుద్ధిని చూపెట్టుకున్నావు. నీకు నా మీద ఏ మాత్రమూ ప్రేమలేదు. నేను ఆ బావి లోతట్టు గోడల్లోని చిగురాకులు తెచ్చేందుకు వెళ్ళినట్లయితే, ఆ పాకుడుకి జారి, బావిలో పడి చావగలను. నేను చచ్చాక నీవెవరి మీద ప్రేమ చూపుతావు? నా చావు తర్వాత నేనైనా నీ మీద ఎలా ప్రేమ చూపగలను? ఈ లోకంలో… ఎవరైనా, ఎవరినైనా ప్రేమిస్తే…తాను ప్రేమించిన వాళ్ళని సంతోష పెట్టి, వాళ్ళ శ్రేయస్సుని కాంక్షించాలి. కానీ నీకు నీ స్వార్ధం తప్ప నా శ్రేయస్సు పట్టలేదు.

కాబట్టి నీ ప్రేమతో నాకు ఒనగూడేదేమీ లేదు. నీవు ప్రేమించినా లేకపోయినా నాకు తేడాలేదు. నీలాంటి స్వార్ధపరుల కోసం అలాంటి అవివేకపు పనులు చేసే బుద్ధిహీనుడెవడు ఇక్కడ లేడు. ఫోఫో!” అని పెంటి మేకను కసిరింది.

చితిపై పరుండిన యువరాజు మణిమేఖులుడుకి మేకల భాష కూడా తెలుసు. పోతు, పెంటి మేకల సంభాషణంతా విన్న మణిమేఖులుడు ఆలోచనలో పడ్డాడు. అటు చూస్తే మగ మేక ఆడమేకని ఛీకొట్టి చక్కా పోయింది.

ఇటు చూస్తే మణిమేఖల భర్త చెప్పబోయే రహస్యం కోసం ఊపిరి బిగబట్టి చూస్తోంది. అది చెబితే తన ప్రాణానికే ప్రమాదం అన్న భర్త మాట అసలామెకి పట్టడం లేదు. తనని సంతోష పరచడం కోసం భర్త ప్రాణాలు ఒడ్డుతున్న స్పృహ అంతకంటే లేదు. చితిపై పడుకున్న భర్త ప్రాణం గురించి ఆమెకి చింతలేదు, అతడు చెప్పబోయే విషయం పట్ల కుతూహలమూ ఆతృతా తప్ప!

అది చూసిన మణిమేఖలుడు చితి మీది నుండి దిగ్గున లేచాడు. “ఏమిటేమిటి?” అంటూ వెంటపడుతున్న భార్య వైపు చూడను కూడా లేదు. మణిమేఖల విడిచి పెట్టలేదు.

దారి కడ్డం వచ్చి నిలబడింది. మణిమేఖలుడు భార్యని తిరస్కారంగా చూసి, ఆమెని విడిచి పెట్టి స్వదేశం వెళ్ళిపోయాడు. మరో యువతిని వివాహం చేసుకుని సుఖంగా ఉన్నాడు.

ఇదీ కథ!

అంటూ కథ ముగించిన భేతాళుడు “విక్రమాదిత్య రాజేంద్రా! ఈ కథలో ఎవరి వివేకం గొప్పది? నా ప్రశ్నకు జవాబు చెప్పు. అయితే నియమం నీకు తెలుసు కదా?” అన్నాడు.

విక్రమాదిత్యుడు చిన్నగా నవ్వుతూ “భేతాళా! నియమం తెలియకేం? ఇక నీ ప్రశ్నకు సమాధానం విను. నా అభిప్రాయంలో… మనం ఎవరినైనా ప్రేమించినట్లయితే, వారిని సంతోషపరచాలి, వాళ్ళు ప్రశాంతంగా, సౌఖ్యంగా ఉండేలా చూడాలి.

మణిమేఖలుడు తన భార్య మణిమేఖలని సంతోషంగా ఉంచేందుకు చావటానికి కూడా సిద్ధ పడ్డాడు. అయితే మణిమేఖలకు భర్త పట్ల ప్రేమ గానీ, కరుణ గానీ లేవు. ఆమెకతడి మరణం కూడా పట్టలేదు. అతడి మరణ సన్నద్ధత కంటే కూడా, అతడెందుకు నవ్వాడో…ఆ రహస్యం తెలుసు కోవాలన్నదే ఆమె ఆరాటం.

సకల విద్యలూ అభ్యసించినా గానీ, మానవుడైనా గానీ… మణిమేఖలుడు, మేకపోతు… ‘ప్రేమ’కు నిర్వచనాన్ని విప్పి చెప్పే వరకూ… ఆ సత్యాన్ని గ్రహించ లేకపోయాడు. మేకపోతు…ప్రేమకీ, స్వార్ధానికీ మధ్య ఉన్న విభజనని స్పష్టంగా చెప్పడమే గాక, అతడి కళ్ళెదుటే దాన్ని సంఘటనా పరంగా నిరూపించింది.

ఆ విధంగా మేకపోతు తార్కికతనీ, సునిశిత ఆలోచననీ కనబరచింది. కాబట్టి దాని వివేకమే గొప్పది. కనుక ఈ కథలో మణిమేఖలుడి కంటే కూడా మేకపోతే గొప్పది” అన్నాడు.

అది సరైన జవాబు కావటంతో భేతాళుడు చప్పట్లు చరిచి తన ఆమోదాన్ని తెలిపాడు. కానీ నిశ్శబ్దం భంగమైంది గనక, మెరుపులా మాయమై మోదుగ చెట్టెక్కేసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో ప్రేమకీ స్వార్ధానికి గల తేడాని, పిల్లలకే కాదు పెద్దలకీ ఆసక్తికరంగా ఉండేలా వివరించబడింది. నిజానికి పెంటి మేక వంటి స్త్రీలను చాలా మందినే చూస్తుంటాం, మన చుట్టు సమాజంలో!

ఉద్యోగ వర్గాల్లో చాలామంది లంచగొండుల్ని, అనేక రంగాల్లో ఎంతోమంది అవినీతిపరుల్ని చూస్తుంటాం. వాళ్ళ అవకతవకల్ని చూసి అసహ్యించుకుంటూ ఉంటాం.

నిజానికి కొందరు అవినీతి పరుల వెనక…వాళ్ళ భార్యల ప్రోద్బలం, బలవంతం ఎక్కువగా ఉంటాయి. లేచిగురు లడిగిన పెంటి మేకలాగా…నగలు, చీరలు, ఆస్తులు కార్లూ వంటి గొంతెమ్మ కోరికలు కోరుతూ, వాటిని ప్రేమకి ముడిపెట్టి భర్తల్ని అక్రమ సంపాదన చెయ్యమని కాల్చుకుతినే వాళ్ళని ఎంతోమందిని చూసాను.

ఆయా అవినీతి మార్గాల్లో భర్తలెంత వత్తిడికి గురైనా, బాధలు పడినా వాళ్ళకి పట్టదు.

నిజానికి ప్రేమంటే ఎదుటి వాళ్ళని సంతోషపరచటం, శాంతంగా సౌఖ్యంగా ఉండేలా చూడటం అనే జవాబు చెప్పటంలో విక్రమాదిత్యుడి వివేకం, వివేచన పిల్లల్ని ఆకర్షిస్తాయి. ఆ విధంగా ఈ కథలు మంచి మార్గంలో నడిచేటట్లు పిల్లలకి స్ఫూర్తి కలిగిస్తాయి.

~~~~~~~

మణి మేఖల – మణి మేఖలుడు! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 37]

తదుపరి ప్రయత్నంలో భేతాళుడు మరో కథ ప్రారంభించాడు.

ఒకప్పుడు ఉషాపురం అనే నగరం ఉండేది. (ఆ పేరుకు అర్ధం ‘ఉదయపు నగరం’ అని.) దానికి రాజు గృహ భుజుడు. అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు మణిమేఖల. (అంటే మణులతో కూర్చిన దండ.)

ఆమె అందం గురించి దేశదేశాలలో పేరెన్నిక గలది. రాజు తన కుమార్తెను సకల విద్యాపారంగతుడికీ, అరవై నాలుగు కళలలో చతురుడికీ ఇచ్చి పెళ్ళి చేయాలని అభిలషిస్తున్నాడు. దాంతో యువరాణి వివాహానికై దేశదేశాలలో వెదకసాగాడు.

ఒకరోజు రాజు గృహ భుజుడికి సుదూర దేశంలో నున్న మణిమేఖులుడనే యువరాజు గురించి తెలిసింది. మణిమేఖలుడు స్పురద్రూపి, సౌందర్యవంతుడే గాక, సకల విద్యా పారంగతుడు, చతుష్పష్థి కళా ప్రపూర్ణుడు.

రాజు సంతోషంగా మణిమేఖలుడిని బంధుమిత్రులతో సహా రప్పించి, తన కుమార్తె మణిమేఖలని అతడికిచ్చి వివాహం చేసాడు. ఆ జంటని చూచి అందరూ అభినందించారు. నూతన వధూవరులిద్దరూ ఒండొకరి సానిహిత్యాన్ని ఆనందించసాగారు.

ఓనాటి రాత్రి... ఉషాపురంలోని మణిమేఖల మందిరంలో, వాళ్ళిద్దరూ హంసతూలికా తల్పంపైన శయనించి ఉన్నారు. పట్టు పరుపులపై పరచిన పాలనురుగు లాంటి దుప్పట్లు, ఆకాశంలోని వెన్నలని గదిలోకి తెచ్చి వెదజల్లుతున్నట్లున్నాయి. అగరుధూపాలు, పూలపరిమళాలు తుమ్మెదలకి మత్తెక్కిస్తున్నాయి.

భార్యభర్తలిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి శయ్యక్రింద ఒక చీమల బారు పోతున్నది. సరిగ్గా వారి పడక మధ్యలో, నిట్ట నిలువుగా విభజన రేఖ గీస్తున్నట్లుగా ఉన్నాయవి.

అంతలో ఉన్నట్లుండి, వరుసలో ముందు వెళ్తున్న చీమలు ఆగిపోయాయి. వెనక వస్తున్న చీమలు ముందున్న వాటిని "ఎందుకు ఆగిపోయారు?" అనడిగాయి.

ముందున్న చీమలు "ఇక్కడ ఓ మంచం ఉంది. దానిపైన కొత్తగా పెళ్ళైన జంట ఉంది. మనం వారి మంచం క్రింద, వారి మధ్య విభజన రేఖ గీస్తున్నట్లుగా నిట్టనిలువుగా ప్రయాణిస్తున్నాం. ‘అది ఎంత వరకూ సబబు?’ అని ఆలోచిస్తూ ఆగిపోయాయి" అన్నాయి.

వెనక ఉన్న చీమలు "దానికింత ఆలోచనెందుకు? మంచాన్ని ఎగరేసి పక్కకి త్రోసేద్దాం" అన్నాయి. ముందున్న చీమలు "అలాగే చేయవచ్చును గానీ, పడకపై నున్న భార్యభర్తలు ఒకరి సాన్నిహిత్యాన్నొకరు ఆనందిస్తూ ఏవో సరాగాలాడుకుంటున్నారు. వాళ్ళని అభ్యంతర పరచటం పాపకార్యమని సంకోచపడుతున్నాం" అన్నాయి.

మణిమేఖలుడు సకల కళా విశారదుడైనందున, అతడికి ‘చీమల భాష’ కూడా తెలుసు. ఆ సంభాషణంతా విన్న మణిమేఖలుడికి నవ్వు వచ్చింది. తమ దారి మార్చుకోవాలని గాక, తమ మంచాన్ని ఎగరేసి ప్రక్కకి త్రోసేయటంలోని పాపపుణ్యాల గురించి ఆలోచిస్తున్న చీమల్ని చూస్తూ, అతడు ఫకాలున నవ్వాడు.

అతడి ప్రక్కనే శయనించి ఉన్న మణిమేఖలకి భర్త ఎందుకు నవ్వాడో అర్ధం కాలేదు. బహుశః తనని చూసే నవ్వాడనుకొని చిన్నబుచ్చుకుంది. ఉండబట్టలేక "ఎందుకు నవ్వుతున్నావు?" అడిగింది.

అతడేదో చెప్పబోయేంతలో... ఇదంతా గమనించిన చీమలు "ఓ యువరాజా! మణిమేఖలుడా! మా సంభాషణ గురించి నీవు ఎవరికైనా చెప్పినట్లయితే, నీ తల వంద ముక్కలై మరణించగలవు సుమా!" అని శపించాయి.

దాంతో మణిమేఖలుడు మౌనంగా ఉండిపోయాడు. మణిమేఖల ఊరుకోలేదు. "నా ప్రియపతీ! ఎందుకు మౌనంగా ఉన్నావు? నా ప్రశ్నకు జవాబు చెప్పవేమి?" అంది.

మణిమేఖలుడు "ప్రియసఖీ! అది రహస్యం! ఆ విషయం ఇంతటితో వదిలిపెట్టు. దాని గురించి చెబితే నా ప్రాణాలకే ముప్పు. గనుక దాని గురించి మరిచిపో!" అన్నాడు.

మణిమేఖల నమ్మలేదు. ‘బహుశః తనని చూసే భర్త నవ్వి ఉంటాడు. చెప్పడం ఇష్టం లేక దాట వేస్తున్నాడు’ అనుకుంది. దాంతో..."నేనింత అడుగుతున్నా చెప్పడం లేదంటే నీకు నామీద ప్రేమ లేదు. ప్రేమ లేని చోట కలిసి జీవించి ఏం సుఖం? ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే నిప్పుల్లోనో నీళ్ళల్లోనో దూకి చావటం మేలు. ఊరి పెట్టుకు ఊసురు తీసుకున్నా నయమే! నేనిక బ్రతక జాలను" అంటూ దుఃఖ పడసాగింది.

భార్యమాటలు విని మణిమేఖలుడికి చాలా బాధ కలిగింది. అతడికి భార్యంటే చాలా ప్రేమ! ఆమె దుఃఖించటాన్ని చూడలేక పోయాడు. తనకి ఏమైనా సరే, ఆమెని సంతోష పెట్టాలనుకున్నాడు. దానితో భార్యని తీసుకుని, ఆ రాత్రి వేళ ఊరి బయటకు వెళ్ళాడు.

అక్కడ ఓ చితిపేర్చుకుని దానిపై పడుకున్నాడు. భార్యను దగ్గరికి పిలిచి, తానెందుకు నవ్వాడో చెప్పి, మరుక్షణం అగ్నిపెట్టుకు మరణించాలని అతడి ఆలోచన! అన్నీ సిద్ధం చేసుకుని మణిమేఖలని దగ్గరికి పిలిచాడు.

పైన చందమామ నిండుగా వెలుగుతున్నాడు. మణిమేఖల ముఖం కూడా చందమామలా వెలిగిపోతుంది. అయితే అతడి మీద ప్రేమతో కాదు, అతడు చెప్పబోయే రహస్యం పట్ల ఆతృత తో! అతడు నోరు విప్పి ఏదో అనబోయాడు.

ఆ క్షణంలో... ఆ ప్రక్కనే రెండు మేకలున్నాయి. ఒకటి ఆడమేక(పెంటి), మరొకటి మగమేక (పోతు). పోతుమేక పెంటి దగ్గరికి ప్రేమగా చేరబోయింది. ఆడమేక దాని నాపుతూ. "నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే... అదిగో, ఆ బావి లోతట్టు గోడల మీద పచ్చని లేత చివురాకులున్నాయి. ఆ బావి మనకి దాపులనే ఉంది. నీవా లేచిగురాకులు తెచ్చి నాకిచ్చినట్లయితే నీ ప్రేమని అంగీకరిస్తాను" అంది.

మగమేక బావి వద్ద కెళ్ళి తొంగి చూసింది. బావి గోడలు పాకుడు పట్టి ఉన్నాయి. లోతట్టు గోడల కున్న పగుళ్ళలో పచ్చని మెత్తని పచ్చిక, చిగురాకులతో చిన్న చిన్న మర్రి మొక్కలూ పెరిగి ఉన్నాయి. గాలికి అవి ఊగుతున్నాయి, ఆకులు వెన్నెలలో మెరుస్తున్నాయి.వాటిని చూసి మగమేక ఓ క్షణం చింత పడింది. బావిలోకి ఓ సారి, పెంటి మేక వైపోసారి మార్చిమార్చి చూసింది.

ధనలాలస - ధర్మనిరతి! (భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక - 36)

హఠాత్తుగా బ్రహ్మపురంలో ప్రత్యక్షమైన కార్పటికుడి గురించి క్షణాల్లో వార్త ఊరంతా ప్రాకి సంచలనం రేపింది. కార్పటికుడు నేరుగా వెళ్ళి రాజదర్శనం చేసుకున్నాడు.

చండసింహుడతణ్ణి "కార్పటికా! ఏమయ్యింది? నీవు వెళ్ళిన పనిని ఎంత వరకూ సాధించావు?" అనడిగాడు. కార్పటికుడు రాజుకు నమస్కరించి, తను బయలు దేరినప్పటి నుండీ అప్పటి వరకూ ఏం జరిగిందో, ఏదీ దాచకుండా చెప్పాడు.

రాజది విని ఆశ్చర్యపోయాడు. అతడికా ఆలయాన్ని, ఆ అద్భుత సుందరిని చూడాలనిపించింది. ఓ మంచిరోజున... రాజు, కార్పటికుడు నౌకమీద ప్రయాణం ప్రారంభించారు. కొంచెం కష్టపడినా గానీ, కార్పటికుడు గతంలో తను చేరిన దీవిని గుర్తించాడు.

వెంటనే, రాజు చండసింహుడు, కార్పటికుడు కాళికాదేవి ఆలయంలోకి వెళ్ళారు. రాజు కాళికా దేవికి పూజాదికాలు నిర్వహించాడు. తర్వాత ఆలయ ఆవరణలోకి వచ్చారు. మునుపటి లాగే, మర్రిచెట్టు నీడలో అరుగు మీద, అంతకు క్రితం కార్పటికుడు చూసిన వయ్యారి, విలాసంగా శయనించి ఉంది.

చుట్టూ పరిచారికలు, ఆమెకు సపర్యలు చేస్తున్నారు. రాజామెను చూశాడు. ‘కార్పటికుడు చెప్పింది నిజమే! ఈమె అద్భుత సౌందర్యవతి’ అనుకున్నాడు.

అదే సమయంలో ఆ యువతి కూడా రాజును చూసింది. కోర మీసం, గిరజాల జుట్టు, బలమైన భుజాలు, కండలు తిరిగిన ధృఢ శరీరుడైన రాజుని చూసి ఆమె మైమరచిపోయింది. శౌర్యాన్ని ప్రకటిస్తున్న అతడి దేహభాష, చురుకైన కంటి చూపు, ఆమెను రాజుపై ప్రేమలో పడదోసాయి.

చెలికత్తెలని పిలిచి, రాజును చూపి ఏదో చెప్పింది. ఇద్దరు చెలికత్తెలు రాజు దగ్గరికి వచ్చి నమస్కరించి, ఆమె పంపిన ప్రేమ సందేశాన్ని వినిపించారు. రాజామెను తన వద్దకు రావలసిందిగా కోరాడు. సంతోషంతో,వయ్యారంగా కదులుతూ ‘అందమే ప్రవహించుకొస్తుందా!’ అన్నట్లు ఆమె అతణ్ణి సమీపించింది.

చండసింహుడు "ఓ సౌందర్యరాశి! ఎవరు నీవు? ఇక్కడెందుకు ఉన్నావు?" అనడిగాడు.

తేనెలొలుకుతున్న స్వరంతో ఆమె "నేను నాగలోక యువరాణిని. నా పేరు నాగిని. ప్రతీరోజూ నేనీ కోవెలలో అమ్మవారిని సేవించుకునేందుకు వస్తాను. ఓ రాజా! నీ మీది వలపుతో నా తలపులు నిండిపోయాయి. నన్ను స్వీకరించు" అంది తలవాల్చుకుని.

చండసింహుడు కార్పటికుణ్ణి దగ్గరకు పిలిచి, ఆమెతో "ఓ నాగిని! నీ ప్రేమను అంగీకరించలేనందుకు నన్ను మన్నించాలి. ఇతడు నా ప్రియమిత్రుడు. ఇతడు నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు. ఇతడి ప్రేమను అంగీకరించు" అన్నాడు.

ఒక్కక్షణం నాగిని అయోమయంగా చూసింది. చండసింహుడు, కార్పటికుడి ప్రేమను స్వీకరించ వలసిందిగా ఆమెకు నచ్చచెప్పాడు. ఆమె కార్పటికుణ్ణి పెళ్ళాడేందుకు అంగీకరించింది.

చండసింహుడు "కార్పటికా! ఆ రోజు, వేట వినోదం నాడు, నీవు నాకు రెండు ఉసిరి ఫలాలనిచ్చి నా దప్పిక తీర్చి, నా ప్రాణాలు కాపాడావు. అందుకు ప్రత్యుపకారంగా... ఇదిగో ఈ యువతీ రత్నాన్ని నీకిస్తున్నాను. ఈమెతో జీవితాన్ని ఆనందించుదువుగాక!" అన్నాడు.

కార్పటికుడు తలవంచి రాజుకు నమస్కరించాడు. కాళికా దేవి సమక్షంలో వారిద్దరికీ వివాహం జరిపించి, చండసింహుడు నాగినీ కార్పటికుల వద్ద సెలవు తీసుకున్నాడు. మరోసారి అమ్మవారిని నమస్కరించి, ఆలయ ప్రాంగణంలోని బావిలో మునిగాడు. తక్షణం బ్రహ్మపురంలో తన రాజ సౌధం ముందు నిలబడి ఉన్నాడు.

కార్పటికుడు నాగినితో సుఖంగా ఉన్నాడు. చండసింహుడు సింహళ రాకుమారిని పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు.

భేతాళుడు ఈ కథ చెప్పి "విక్రమాదిత్య రాజేంద్రా! కార్పటికుడు, రాజు చండసింహులలో ఎవరు గొప్పవారు?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు వెన్నెల కురిసినట్లు చిరునవ్వు నవ్వాడు. "భేతాళా! విను! కార్పటికుడు తన యజమాని అయిన రాజుకు సేవ చేసాడు. మిగిలిన పరివారం అలిసిపోయినా, అతడు రాజు వెన్నంటే ఉన్నాడు. ఓ ప్రక్క రాజు రక్షణ బాధ్యత నిర్వహిస్తూ కూడా, దరిదాపుల్లో ఏమేమి ఉన్నాయోనని గమనిస్తూ అప్రమత్నంగానూ ఉన్నాడు. కాబట్టే దాపులనే ఉన్న ఉసిరి చెట్టునీ, సరస్సునీ గుర్తించగలిగాడు. అది అతడికి వృత్తిపట్ల గల నిబద్దత! అయితే అది అతడి వృత్తిధర్మం కూడా! ఆలికి అన్నం పెట్టడం ఊరినుద్దరించినట్లుకాదు. కాబట్టి - అతడి పని అతడు నెరవేర్చడం గొప్పకాదు.

అయితే రాజు చండసింహుడు కార్పటికుడి పట్ల చూపిన కృతజ్ఞత గొప్పది. ఎందుకంటే - కార్పటికుడు చేసిన సేవకే రాజతడికి జీతమిస్తున్నాడు. అయినా అతడి వృత్తి నిబద్దతని, సేవాధర్మాన్ని గ్రహించి, ప్రత్యుపకారం చేసాడు. లోక సహజంగా... ధనికులు, యజమానులు, రాజులు, సేవకుల నుండి సేవలు పొందుతూ ‘అందుకు తాము ధనం చెల్లిస్తున్నాం కదా!’ అనుకుని ఉదాసీనంగా ఉంటారు. అలా గాకుండా... రాజు చండసింహుడు, తన సేవకుడి పట్ల ప్రభుధర్మాన్ని నిర్వర్తించాడు. కాబట్టి చండసింహుడే గొప్పవాడు!" అన్నాడు.

భేతాళుడు అంగీకార సూచకంగా తలవూపుతూ, విక్రమాదిత్యుడి భుజం పైనుండి మోదగచెట్టు మీదికి ఎగిరిపోయాడు. విక్రమాదిత్యుడు వెనుదిరిగాడు.

కధావిశ్లేషణ: వీరవర్ధనుడు, కార్పటికుడు - రెండు కథలలోనూ, విక్రమాదిత్యుడు రాజు పాటించినదే గొప్ప ధర్మనిరతి అంటాడు. ధనలాలసలోనూ ధర్మనిరతి గుర్తించటం గొప్పవిషయమే కదా మరి!

కార్పటికుని కథ ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 35]

విక్రమాదిత్యుడు భేతాళుని బృహదారణ్యం వైపుకు మోసుకెళ్తుండగా, ఎప్పటి లాగానే భేతాళుడు మరో కథ ప్రారంభించాడు. ఇది, ఎనిమిదవ కథ!

ఒకప్పుడు చండ సింహుడనే రాజుండేవాడు. అతడు బ్రహ్మపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలు తుండేవాడు. అతడు మంచివాడు, ప్రతాపవంతుడు, తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలవాడు.

ఒకరోజు... కార్పటికుడు అనే యోధుడు రాజు వద్దకు వచ్చి, తన యోగ్యతలు వివరించి కొలువునివ్వ వలసిందిగా అభ్యర్ధించాడు. చండసింహుడికి కార్పటికుడి స్వరూప స్వభావాలు నచ్చటంతో, తన వ్యక్తిగత అంగరక్షకుడిగా అతణ్ణి నియమించాడు.

కార్పటికుడు రాజునెంతో భక్తిశ్రద్ధలతో సేవిస్తుండేవాడు. ఇలా ఉండగా... ఓ రోజు రాజు చండసింహుడు సపరివారంతో అడవికి వేటకెళ్ళాడు. రాజెక్కిన గుర్రం, సైనికుల గుర్రాల కంటే చురుగ్గా ఉంది. అది మెరుపు వేగంతో అడవిలోకి దూసుకెళ్ళింది. రాజు వెంట ఉన్న బృందంలో సైనికుల గుర్రాలు గానీ, మంత్రి తదితర అనుచరుల గుర్రాలు గానీ, దాని వేగాన్ని అందుకోలేక పోయాయి.

క్షణాల్లో రాజు ఎక్కిన గుర్రం అడవి మలుపుల్లో మాయమైంది. కొంత సేపటికి రాజు, తాను పరివారం నుండి దూరంగా వచ్చేసానన్న విషయాన్ని గ్రహించాడు. గుర్రాన్ని అదిలించి, దాని నియంత్రించాడు. వెనుదిరిగి చూస్తే... ఒక్క కార్పటికుడు తప్ప మరెవ్వరూ కనుచూపు మేరలో లేరు. అదీ కార్పటికుడు తన గుర్రాన్ని పరుగుతో అనుసరించి రావటం చూసి, రాజు చండసింహుడు అమితాశ్చర్య పడ్డాడు.

అయితే అప్పటికే అతడు డస్సిపోయి ఉన్నాడు. గుర్రం దిగి, ప్రక్కనే ఉన్న మర్రిచెట్టు నీడన కూలబడ్డాడు. దాహంతో నోరెండిపోయింది. కార్పటికుణ్ణి చూసి ‘దాహం’ అన్నట్లుగా సైగ చేశాడు.

అప్పటికి కార్పటికుడు చెమటలు గ్రమ్మి ఉన్నాడు. ఆయాసంతో రొప్పుతున్నాడు. అయినా గానీ, తన విద్యుక్త కర్తవ్యాన్ని మాత్రం మరిచి పోలేదు. రాజుకు అంగరక్షకుడిగా పరిసరాలని నిశితంగా పరిశీలించటం తన విధి. అందులో భాగంగా, అతడు దారి పొడుగునా పరిసరాలు గమనిస్తూనే వచ్చాడు.

రాజు విశ్రాంతికై కూర్చున్న మర్రి చెట్టుకు దాపులనే ఊసిరి చెట్టుండటం, కార్పటికుడు గుర్తించి ఉన్నాడు. రాజు ‘దాహం’ అనగానే పరిగెత్తుకు పోయి రెండు ఉసిరి కాయలు తెచ్చి రాజుకిచ్చాడు.

దాపులనే సరస్సుని గమనించి పరుగున పోయి ఆకుదొన్నెలో నీటిని తెచ్చి రాజుకిచ్చాడు. అప్పటికే ఉసిరి కాయాలతో నోరు తడి చేసుకున్న రాజు, నీరు త్రాగి సేదతీరాడు. రాజు స్థిమిత పడ్డాక, కార్పటికుడు వెళ్ళి సరస్సు నీటితో దాహం తీర్చుకుని వచ్చాడు. అప్పటికి రాజ పరివారం అక్కడికి చేరుకుంది.

కాస్సేపు సేద తీరి, అంతా రాజధానికి తిరిగి ప్రయాణమయ్యారు. రాజు కార్పటికుని విధి నిర్వహణకి ఎంతగానో ముగ్ధుడయ్యాడు. రాజధాని చేరాక, రాజు చండసింహుడు, కార్పటికుణ్ణి తన అంగరక్షక దళానికి అధిపతిగా చేసి సత్కరించాడు.

రోజులు గడుస్తున్నాయి. చండసింహుడు సింహళ రాజకుమారిని వివాహమాడదలిచాడు. ఆమె చాలా అందమైనదీ, తెలివైనదే గాక సుగుణశాలి అని అతడు విని ఉన్నాడు. దాంతో అతడు కార్పటికుణ్ణి పిలిచి, సింహళం వెళ్ళి ఇతర వివరాలు తెలుసుకు రమ్మన్నాడు.

కార్పటికుడు, ఓ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అతడి నౌకలో సింహళానికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నాడు. (నేటి శ్రీలంకకు నాటి పేరు సింహళమే.) సముద్రయానం ప్రారంభమైంది. మార్గమధ్యంలో వారు పెను తుఫానులో చిక్కుకున్నారు. గాలివానలో వాళ్ళ నౌక చిగురుటాకులా ఊగిపోయింది. రాకాసి అలల్లో అల్లాడుతుంది. చివరికి ఓడ బద్దలైంది.

సముద్రపు నీళ్ళల్లో ఈదుతున్న కార్పటికుణ్ణి ఓ పేద్ద తిమింగలం అమాంతం మ్రింగేసింది. ఒరనున్న కత్తి తీసి, కార్పటికుడు, ఆ చేప కడుపును చీల్చుకుని బయటకు వచ్చాడు. అప్పటికి అతడికి కనుచూపు మేరలో ఓ దీవి కనపించింది.

ఈదుకుంటూ అతడా దీవి చేరుకున్నాడు. అక్కడ అతడికి అద్బుతమైన శిల్పకళతో అలరారుతున్న కాళికా దేవి ఆలయం కనబడింది. అతడు ఆలయం ప్రవేశించి, అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశాడు. తర్వాత ఆలయం ఆవరణలో శిల్పాలను చూస్తూ తిరగసాగాడు. అక్కడ ఓ పెద్ద మర్రివృక్షం ఉంది. దాని చుట్టూ అరుగు నిర్మించి ఉంది. శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ చెట్టు నీడలో, ఓ అందమైన యువతి వయ్యారంగా వాలి పడుకుని ఉంది.

ఆమె చుట్టు దాసీలున్నారు. చుక్కల్లో చంద్రుడిలా, సరస్సులో కలువలా... ఆమె, చెలుల మధ్య భాసిస్తోంది. ఆమె అందాన్ని చూడటానికి కార్పటికుడికి రెండు కళ్ళూ చాలలేదు. వర్ణించేందుకు మాటలు రాలేదు.

ఆమె నల్లని కురులు చీకటిని తలపిస్తూ చెలరేగుతున్నాయి. నునువైన శరీరంతో, తీర్చిదిద్దినట్లున్న ఒంపుసొంపులతో, దేవాలయ గోడల మీద ఉన్న శిల్పసుందరి, ప్రాణం పోసుకు వచ్చినట్లుంది. కార్పటికుడామెని చూడగానే ప్రేమలో పడి పోయాడు.

కాస్సేపలా ఆమెనే చూస్తూ నిలబడి పోయాడు. అది గమనించి, ఆమె చెలికత్తెలలో ఒకతె... అతడి దగ్గరి కొచ్చి ‘ఏమిటన్నట్లు’గా చూసింది. మరొకామె ‘ఇక దయచెయ్’ అన్నట్లుగా సైగ చేసింది. అతడు వాళ్ళద్దరినీ ప్రాధేయపడుతూ... తనకు వారి యజమానురాలిపై గల ప్రేమను వివరించి, తన ప్రేమ సందేశాన్ని ఆమె కందించమని ప్రార్ధించాడు.

ఏమనుకున్నారో ఏమో, ఆ చెలికత్తెలిద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళి, అతడి గురించి చెప్పారు. ఊపిరి బిగబట్టి అదంతా చూస్తున్నాడు కార్పటికుడు. ఆమె ఓ క్షణం అతడి వైపు తదేకంగా చూసింది. వీణ మీటినట్లున్న స్వరంతో "వెళ్ళి, ఆలయ ఆవరణలో ఉన్న బావిలో స్నానం చేసి రా!" అంది.

కార్పటికుడు ఆ దిగుడు బావిలోకి దిగి, స్నానం చేద్దామని బుడుంగున మునిగాడు. ఒక్క మునక వేసి పైకి తేలి చూస్తే... ఆశ్చర్యం! అతడు తన ఊరైన బ్రహ్మపురంలో రాజ ప్రసాదానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు.
~~~~~~

రాజు – సేవకుడు – ధర్మనిరతి ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 34]

విక్రమాదిత్యుడు విసుగు చెందకుండా మరోసారి మోదుగ వృక్షమెక్కి, భేతాళుండిన శవాన్ని దించి, భుజాన వేసుకొని, జ్ఞానశీలుడి కిచ్చిన మాట నిలబెట్టుకునేందుకు బృహదారణ్యం కేసి నడవసాగాడు.

భేతాళుడూ విసుగు చెందకుండా మరో కథ ప్రారంభించాడు. "విక్రమాదిత్య మహారాజా! ఇది ఏడవ కథ" అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు శరభేశ్వరం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు సుగ్రీవుడు. అతడు మంచివాడు, సమర్ధుడు. రాజధాని నగరమైన శరభపురంలో వీరవర్ధనుడు అనే బ్రహ్మణుడుండేవాడు. అతడు వేద విద్యలతో పాటు క్షాత్రవిద్యలూ నేర్చిన వాడు. గొప్ప యోధుడు కూడా!

ఒక రోజు వీర వర్ధనుడు, రాజు సుగ్రీవుడి సభకు పోయి, తన అర్హతకు తగిన కొలువు అడిగాడు. సుగ్రీవుడు అతడి ముఖ వర్చస్సూ, మాటతీరూ, వినయ శీలాలకు ముచ్చటపడి, తన ఆంతరంగిక రక్షక సిబ్బందిలో ఒకరిగా నియమించాడు. నెలకు వెయ్యి బంగారు నాణాల జీతమూ నిర్ణయించాడు.

వీరవర్ధనుడు తన జీతాన్ని నాలుగు భాగాలుగా చేసాడు. ఒక భాగం, అంటే రెండువందల యాభై బంగారు నాణాలతో భగవంతుడిపై భక్తితో గుడులకూ, పూజలకూ వెచ్చించే వాడు. మరో భాగం కవి పండితులకూ, ఆశ్రితులకు వెచ్చించేవాడు. మరో భాగంతో పేదసాదలకు దాన ధర్మాలు చేసేవాడు. నాలుగో భాగంలో కుటుంబాన్ని పోషించే వాడు. అతడి ఇంట్లో అందరూ ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉండేవాళ్ళు.

ఇలా రోజులు గడుస్తుండగా, ఒక రోజు... వీరవర్ధనుడు విధి నిర్వహణలో ఉన్నాడు. అది రాత్రి సమయం. అతడు రాజు సుగ్రీవుడి అంతఃపుర రక్షణలో ఉన్నాడు. ఆ సమయంలో జడివాన ప్రారంభమైనది. ఈదురు గాలి... ఉరుములు... మెరుపులు! కుంభవృష్టి కురుస్తోంది.

క్షణాల్లో పరిస్థితి ప్రళయ భీకరంగా మారింది. పెనువృక్షాలు కూడా చిగురు టాకుల్లా ఊగిపోతున్నాయి. ఇంతలో నగరం వెలుపలి నుండి బిగ్గరగా ఏదో ధ్వని వినిపించింది. అది హృదయవిదారకంగా ఉంది. సుగ్రీవుడు "ఏమిటా శబ్ధం? ఎవరైనా వెళ్ళి అదేమిటో తెలుసుకుని రాగలరా?" అని అడిగాడు.

అతడి అంగరక్షకులలో అందరూ ముఖాముఖాలు చూసుకున్నారు. వీర వర్ధనుడు మాత్రం స్థిరమైన కంఠంతో "చిత్తం మహారాజా! నేనందుకు సిధ్దంగా ఉన్నాను" అన్నాడు. సుగ్రీవుడు సరే చూచి రమ్మన్నాడు.

వీరవర్ధనుడు తన ఆయుధాలను తీసుకుని తక్షణమే బయలు దేరాడు. రాజు సుగ్రీవుడికీ కుతుహలంగా ఉంది. దాంతో అతడు వీరవర్ధనుడి వెనకే అతణ్ణి అనుసరించ సాగాడు. వీరవర్ధనుడిదేమీ గమనించలేదు.

అతడు నేరుగా నగర ద్వారం చేరాడు. చుట్టూ పరిశీలిస్తూ ద్వారం దాటి నగరం బయటికి వచ్చాడు. అక్కడ ఓ స్త్రీ కూర్చుని బిగ్గరగా రోదిస్తోంది.

అతడామెని "అమ్మా! ఎవరు నీవు? నీ పేరేమిటి? నీ నివాసమేది? ఎందుకిలా దుఃఖిస్తున్నావు?" అనడిగాడు.

ఆమె అతడివైపు పరిశీలనగా చూస్తూ "ఓ బ్రాహ్మణోత్తమా! నేనీ నగర దేవత శరభేశ్వరిని. ఈ రాజ్యాధీశుడు సుగ్రీవుడి మరణం ఇక మూడు రోజులలో సంభవించనున్నది. అతడు సమర్ధుడూ, పిన్న వయస్కుడు. అతడి మరణానంతరం, ఈ రాజ్యమేమి కానున్నదో? అది తలచుకు దుఃఖిస్తున్నాను" అంది.

వీరవర్ధనుడు "అమ్మా! నీవీ నగర ప్రజలందరికీ తల్లివి. ఈ రాజ్యమాతవు. ఈ ప్రమాదం నుండి మహరాజుని కాపాడగల మార్గమేదీ లేదా? తల్లీ! దయతో చెప్పగలవు" అని ప్రార్ధించాడు.

శరభేశ్వరి "నాయనా! ప్రమాదాన్ని నివారించగల వ్యక్తి ఉంటే, దానికొక మార్గముంది" అంది. వీరవర్ధనుడు "తల్లీ! సెలవివ్వు! నీవు ఆశీర్వదిస్తే దాన్ని నేను నెరవేర్చగలను. నీవు నన్ను దీవిస్తే అసాధ్యమే ఉండదు. అందుచేత దయ ఉంచి తల్లీ, నాకా మార్గం ఉపదేశించు" అన్నాడు.

శరభేశ్వరి "వీర వర్ధనా! మహరాజు దీర్ఘాయువు కలిగి ఉండాలంటే, శరభపురంలో నివసించే 16 ఏళ్ళ బాలుడిని దుర్గామాతకి బలిగా ఇవ్వాలి. దుర్గా దేవి కోవెల ఈ సమీపంలోనే ఉంది. రాజు ప్రాణాలు కాపాడాలంటే ఇదొక్కటే మార్గం" అంది.

వీరవర్ధనుడు "తల్లీ! ఆ ప్రకారమే చేసేదగాక!" అన్నాడు. వెనుదిరిగి ఇంటికి పోయాడు. అతడికి 16 ఏళ్ళ పుత్రుడున్నాడు. అతడు కుటుంబ సభ్యులకు రాజుకు రానున్న మరణం గురించి, దేశానికి వాటిల్లే ప్రమాదం గురించీ చెప్పాడు. "దాన్ని నివారించటం మన బాధ్యత!" అన్నాడు. అందరూ అతడి మాటని సమర్ధించారు.

అతడు తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొని దుర్గామాత గుడికి వెళ్ళాడు. అక్కడ పూజాదికాలన్నీ భక్తి శ్రద్ధలతో చేశాడు. భార్యా బిడ్డలు దేవికి నమస్కరిస్తుండగా, తన 16 ఏళ్ళ పుత్రుడి తలనరికి బలిపీఠంపై ఉంచాడు.

క్షణంలో జరిగిన ఆ సంఘటనకి అతడి భార్య, మిగిలిన పిల్లలు విభ్రాంతి పడి చూడసాగారు. వీరవర్ధనుడేమీ మాట్లాడలేదు. అతడి భార్యాబిడ్డలు ఒక్కసారిగా పెను దుఃఖానికి గురయ్యారు. తలా మొండెం విడిపడి ఉన్నపిల్లవాణ్ణి చూసి, గుండె చెదిరి ఒక్కమ్మడిగా అందరూ ప్రాణాలు విడిచారు. వీరవర్ధనుడు ఏకధారగా శోకించాడు.

దుర్గామాత వైపు తిరిగి "తల్లీ! ఈ దేశపు పౌరులుగా, దేశాన్ని కాపాడుకోవటం మా ధర్మం. రాజుకు అంగరక్షకుడిగా ఆయన ప్రాణాలు కాపాడటం నాకు సేవాధర్మం. అయితే భార్యాబిడ్డలనూ, తల్లిదండ్రులనూ కోల్పోయి, ఒంటి బ్రతుకు నేను ఈడ్చజాలను. నా ప్రాణాలూ తీసుకో!" అంటూ దేవి ముందు తన తల నరుక్కున్నాడు.

రాజు సుగ్రీవుడిదంతా మాటున నిలబడి చూస్తూనే ఉన్నాడు. అతడికి చాలా బాధ కలిగింది. తన కోసం, దేశం కోసం, ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోవటం చూసి పరితాపం చెందాడు. దుర్గాదేవి సన్నిధి చేరి "ఓ తల్లీ! ఇదే నా తల తీసుకో!" అంటూ ఖడ్గమెత్తి కంఠం నరుక్కోబోయాడు.

తక్షణమే మెరుపు మెరిసినట్లు, అతడి కళ్ళ ముందు దుర్గాదేవి ప్రత్యక్షమైంది. అమె రాజుని దీర్ఘాయువుగా దీవించి, వీరవర్ధనుడి కుటుంబాన్నంతటినీ పునర్జీవితులని చేసింది. వాళ్ళు తనని గమనించే లోగానే, రాజు సుగ్రీవుడు అక్కడి నుండి తప్పుకున్నాడు. ఏమీ తెలియనట్లుగా నగరానికి తిరిగి వచ్చాడు. కుటుంబంతో సహా వీరవర్ధనుడు దుర్గామాతకు మొక్కుకుని ఇంటికి తిరిగి వచ్చాడు.

మర్నాటి ఉదయం, రాజు సభలో "వీర వర్ధనా! రాత్రి నీవు నగర బాహ్యం నుండి వస్తున్న ధ్వని ఏమిటో తెలుసుకునేందుకు వెళ్ళావు కదా? దాని గురించి ఏం తెలుసుకున్నావు?" అనడిగాడు.

వీరవర్ధనుడి "మహారాజా! నేనక్కడికి వెళ్ళేసరికి ఓ స్త్రీ అక్కడ రోదిస్తూ ఉంది. నేనెంత అడిగినా ఆమె జవాబివ్వలేదు. అంతే! ఇంత కంటే ఏమీ లేదు" అన్నాడు.

వీరవర్ధునుడి దేశభక్తికీ, ప్రభుభక్తి కీ, నిజాయితీకీ సుగ్రీవుడెంత గానో సంతోషించాడు. నిష్కామపూరితమైన అతడి విధి నిర్వహణ, త్యాగశీలత చూసి ముగ్ధుడయ్యాడు.

సభికుల వైపు తిరిగి "నా ప్రియమైన సభాసదులారా! ఈ వీర వర్ధనుడు నా ప్రాణాలు కాపాడటం కోసం తన ప్రాణాలని, తన కుటుంబ సభ్యుల ప్రాణాలని త్యాగం చేసాడు. అలాగయ్యీ, కనీసం నా మెప్పుకోసం కూడా, జరిగింది చెప్పాలనుకోలేదు. నిజంగా ఇతడు ఉత్తముడు" అంటూ... రాత్రి జరిగిందంటా వివరించాడు.

వీరవర్ధనుణ్ణి ఎంతగానో కొనియాడి, సత్కరించాడు. సభికులంతా కూడా వీరవర్ధనుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు.

భేతాళుడు ఈ కథ చెప్పి "విక్రమాదిత్య రాజేంద్రా! ఇదీ కథ! ఈ కథలో వీరవర్ధనుడు, రాజు సుగ్రీవుడు... ఈ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు?" అని ప్రశ్నించాడు.

విక్రమాదిత్యుడు "నిశ్చయంగా రాజు సుగ్రీవుడు! ఎందుకంటే - వీర వర్ధనుడు రాజుకు అంగరక్షకుడు. రాజు ప్రాణాలను తన సర్వస్వం ధారపోసి అయినా కాపాడవలసిన విద్యుక్త ధర్మం కలవాడు. అతడూ అతడి కుటుంబమూ అందుకోసమే పోషించబడుతోంది. దేశరక్షణకు ప్రాణాలు అర్పించటం ప్రజల ధర్మం. అయితే, రాజు సుగ్రీవుడు తన ప్రజలలో ఒకరైన వీరవర్దనుడి కుటుంబ సభ్యుల మృతికి కలత చెంది, తన ప్రాణాలు త్యాగం చేసేందుకు సిద్దపడ్డాడు. అందుచేత నిశ్చయంగా రాజు సుగ్రీవుడు గొప్పవాడు" అన్నాడు.

అంతే! గలగలా నవ్వుతూ భేతాళుడు విక్రమాదిత్యుడు భుజమ్మీద నుండి మోదుగ వృక్షం మీదికి ఎగిరిపోయాడు. విక్రమాదిత్యుడు చిరునవ్వు చిందిస్తూ భుజాలెగరేసాడు.

వెనుతిరిగి మోదుగ చెట్టు వైపు అడుగులేసాడు.

~~~~~~

ఆడువారిని నమ్మరాదా !? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 33]

లాలస, నేరుగా పడక గదిలోకి జొరపడింది. మంచం మీద భర్త ఆదమరచి నిదుర బోతున్నాడు. లాలస, ఏం చెయ్యాలా అని కాస్సేపు ఆలోచించింది. భర్త చేతి సంచిలోంచి ఓ పోక చెక్కని తీసి సగానికి కత్తిరించింది. పోక చెక్కకీ, కత్తికీ రక్తం పూసింది.

అంతే! పెద్ద పెట్టున మొర్రోమని మొత్తుకుంది. ఆమె గావుకేకలకి భర్త వరకీర్తి ఉలిక్కిపడి లేచాడు. ఆమె చావుకేకలకి తల్లీదండ్రీ, సేవకులూ పరుగెత్తుకు వచ్చారు. లాలస ఏడుస్తూ "నా భర్త నా ముక్కు కోసాడు" అంది.

కోపంతో ఊగిపోయిన గిరి వర్ధనుడు అల్లుణ్ణి బంధించి, రాజ భటులకి ఫిర్యాదు చేసాడు. మర్నాటి ఉదయం రాజభటులు వాళ్ళందరినీ రాజు ఎదుట హాజరు పరిచారు. రాజు ధర్మకేసరి, వరకీర్తిని "నీ భార్య ముక్కు నెందుకు కోసావు?" అని ప్రశ్నించాడు.

అతడు ఘోల్లుమంటూ "మహారాజా! నాకేమీ తెలియదు. ఆమె కేకలకి నేను నిద్రలో నుండి లేచాను. అప్పటికే ఆమె రక్తసిక్తమైన నాసికతో ఏడుస్తూ ఉంది. అంతకు మించి నాకేదీ తెలియదు" అన్నాడు.

రాజు లాలసని వివరమడిగాడు. ఆమె వినయంగా "ఓ మహారాజా. నేనింత వరకూ ఎవరికీ ఏ కీడూ చేయని దానను. నా భర్తకు సైతం ఏ అపచారమూ చేయలేదు. అలాంటప్పుడు నా భర్తపై ఊరికే నిందనెందుకు వేస్తాను?" అంది తార్కికంగా.

అదే సమయంలో నగర గస్తీ భటులు రాజుకు దైనందిన నివేదిక యిస్తూ "మహారాజా! రాత్రి నగరంలో గస్తీ తిరుగుతూ, నగర వీధులలో కాపలా కాస్తున్నాము. అప్పుడు ఈ వైశ్య వ్యాపారి ఇంటి వెనుక, ఎవరో దాగి ఉన్నట్లని పించింది. దొంగేమోనని సందేహించి హెచ్చరించాము. ఎందుకైనా మంచిదని బాణప్రయోగం చేసాము. ఏ చప్పుడూ రానందున, ఎవరూ లేరనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాము" అని చెప్పారు.

రాజు ధర్మకేసరి, సైనికులని పిలిచి, వైశ్యుడి ఇంటి వెనుక వెదకి రమ్మని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ పాటించి భటులక్కడ వెదికి, తోటలో పడి ఉన్న బ్రాహ్మణ యువకుడి శవాన్ని రాజ సభకి తెచ్చారు. శవాన్ని పరీక్షించగా, బిగుసుకు పోయిన దాని నోటిలో, లాలస ముక్కు కొన ఉంది, ముక్కు పుడకతో సహా!

ఇంకేముంది? లాలస సాక్ష్యంతో సహా తిరుగులేకుండా దొరికిపోయింది. విచారణలో, శవం వైశ్య వ్యాపారి గిరివర్ధనుడి ఇంటి సమీపంలో నివసించే బ్రాహ్మణ యువకుడిదని తేలింది. లాలసకి అతడితో వివాహేతర సంబంధం ఉందని వెల్లడయ్యింది.

రాజు ధర్మసేనుడు అన్ని కోణాల్లో విషయ విచారణ చేసాడు. లాలస దాసి కూడా, ఆమె రహస్య ప్రణయ సంబంధాన్ని ధృవీకరించింది.

ధర్మకేసరి "ఓ వైశ్య యువతీ, లాలస! నిజం చెప్పు!" అని గద్దించి అడిగేసరికి ఆమె భయంతో గడగడ వణుకుతూ తప్పు ఒప్పుకుంది. రాజు లాలసకి శిరశ్చేదం శిక్షగా విధించాడు. వరకీర్తిని విడుదల చేసాడు.

ఈ కథంతా చెప్పిన మగ చిలుక, యువరాణి రత్నావళి వైపూ, యువరాజు పరాక్రమ కేసరి వైపూ పరిశీలనగా చూస్తూ "ఓ నూతన దంపతులారా! ఇప్పుడు చెప్పండి, లాలస ఎంత ధూర్తురాలో!? అందుకే నేను, ఆడవారిని నమ్మరాదని చెప్పాను" అన్నది.

యువరాణీ యువరాజులిద్దరూ, రెండు చిలకల వాదనలని పూర్వపక్షం చేస్తూ, సరైన వాదన వినిపించారు. అందులోని నిజాన్ని అంగీకరించిన చిలుకలు రెండూ, సంతోషంగా, ప్రేమలో పడ్డాయి. వాటి ఒద్దిక చూసి, కొత్త జంట కూడా మురిసిపోయింది.

భేతాళుడు కథ పూర్తి చేస్తూ "ఓ విక్రమాదిత్య మహారాజా! ఇదీ కథ! చిలకలని ఒప్పించేందుకు... యువరాణి యువరాజులు ఏ వాదన చెప్పి ఉంటారో చెప్పగలవా?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు "భేతాళా! నా అభిప్రాయంలో వారి వాదన ఇలా ఉండి ఉండాలి.

స్త్రీ పురుషు లింగ భేదాన్ని బట్టి గానీ, పేద ధనిక వర్గ భేదాన్ని బట్టి గానీ... మనుషుల్లోని మంచీ చెడూ, నీతీ అవినీతి ఉండవు. అది వ్యక్తుల సహజ స్వభావాన్ని బట్టి ఉంటుంది. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాన్ని బట్టి, వారి మంచీ చెడూ ప్రవర్తన ఉంటుంది. తర్కకేసరి, అలంకారి ల విషయంలో, తర్కకేసరి భార్యని మోసగించాడు, హత మార్చాడు. అమాయకమైన పిల్ల గనక, అలంకారి... భర్త చేతిలో మోసపోయింది.

లాలస, వరకీర్తి విషయంలో లాలస చెడ్డదే కాదు, కౄరత్వం గలది. ఆమె దుష్ట బుద్ధి కారణంగా, అక్కడికి రప్పించబడ్డ బ్రాహ్మణ యువకుడు, విధివశాత్తూ, ప్రాణాలు కోల్పోయాడు. అయినా ఏమాత్రం భయమూ, పాపభీతి, పశ్చాత్తాపం లేకుండా, లాలస... స్వీయరక్షణ కోసం, భర్త పైకి నేరం తోసి, అతడి ప్రాణాలకు ఎసరు పెట్టింది.

ఏం జరిగిందో తెలిసి ఉండీ, జరిగిన వాటిపై స్పష్టత ఉండీ కూడా, లాలస, భర్త ప్రాణాలకి ప్రమాదం తెచ్చిపెట్టే ప్రయత్నం చేసింది. తక్షణం చేసిన ఆలోచన కూడా కాదది. ఆమె ఆలోచించి వేసిన ప్రణాళిక!

తర్కకేసరి, తన భార్య అలంకారిని... తనని నమ్మనందుకూ, తనతో రానన్నందుకూ... కోపాద్రిక్తుడై, ఒళ్ళు తెలియని ఆవేశంలో, ఆ క్షణమే భార్యని కొట్టి చంపాడు. అదే లాలస అయితే, తన అవినీతి ప్రవర్తనని కప్పిపుచ్చుకునేందుకు, పధకం ఆలోచించి, భర్తని చంపించేందుకు కుట్ర పన్నింది. కాబట్టి - ఆమె మరింత చెడు నడత కలిగిందనాలి.

మంచి చెడు లింగభేదాన్ని బట్టి ఉండక పోయినా, సహజంగా స్త్రీలు దయతోనూ, ప్రేమార్ధ్ర హృదయంతోనూ ఉంటారు. సహనంగా బిడ్డని కడుపున మోసి, జన్మనిచ్చి, ఓర్పుతో పెంచే ప్రాకృతిక ప్రేమ కారణంగానేమో... స్త్రీలు, సహజంగా ఎక్కువ మంచితనంతో ఉంటారు. అలాగయ్యీ లాలస, లాలసత్వం కొద్దీ, ఇంతకి తెగించింది. గనుక నిశ్చయంగా ఆమె శిరశ్చేదానికి అర్హురాలు.

అంతే తప్ప, స్త్రీ పురుష భేదాన్ని బట్టి, మనుషులను నమ్మరానంత ప్రమాదం ఏమీ లేదు" అని చెప్పిఉంటారు" అన్నాడు.

భేతాళుడు ఆ సమాధానం విని సంతృప్తి పడ్డాడు. అయితే నిశ్శబ్దం భంగమైందిగా! అందుకే చటుక్కున మాయమై మోదుగ చెట్టెక్కేసాడు.

తప్పు చేయబోతే ముక్కు యిరుక్కుంది![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 32]

అలంకారికి భర్త భయం అర్ధమైంది. ఆమె అతణ్ని ఆపి "నీవు భయపడనవసరం లేదు. జరిగిందేమీ నేను నా తల్లిదండ్రులకి చెప్పలేదు. ఏనాటికైనా నీవు మనస్సు మార్చుకొని వస్తావని ఎదురు చూస్తున్నాను. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని నీవు ఇంటికి వచ్చావు. నాకదే సంతోషం! జరిగింది మరిచిపోయి ఇకనైనా హాయిగా ఉందాం" అంటూ తను తల్లిదండ్రులకి ఏమని చెప్పిందో అంతా వివరించింది.

దాంతో తర్కకేసరి ‘బ్రతుకు జీవుడా!’ అనుకున్నాడు. అలంకారి "రా! నా తల్లిదండ్రులు నీకోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు" అంటూ లోపలికి తీస్కెళ్ళింది. నిషాదశెట్టి దంపతులు అల్లుణ్ణి చూసి ఆనందంగా ఆదరించారు. జరిగింది మరిచిపొమ్మని ఓదార్చారు. ఇకనైనా దొంగలు తమ అల్లుడని క్షేమంగా విడిచిపెట్టారనుకొని, దేవుడికి మొక్కులు తీర్చుకున్నారు.

ఎప్పటిలాగే వ్యాపారాన్ని అప్ప చెప్పారు. మళ్ళీ రోజులు హాయిగా గడవసాగాయి. దాంతో మళ్ళీ తర్కకేసరికి వేశ్యా సంపర్కం కోసం కాళ్ళూ చేతులూ లాగసాగాయి. ఈసారి భార్యని ప్రాధేయపడ్డాడు. క్రిందటి సారిలా చెయ్యననీ, తనతో అభయసత్యానికి రమ్మనీ అడిగాడు. అలంకారి ఒప్పుకోలేదు. అతడి మీద ఆమెకి నమ్మకం కుదరలేదు.

దాంతో తర్కకేసరికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన నెంతో ప్రేమించే భార్యని, తన తప్పు కడుపులో పెట్టుకు కాపాడిన భార్యని తల మీద మోది చంపేసాడు. ఆమె ఒంటి మీది నగానట్రా ఒలుచుకుని పారిపోయాడు.

కాబట్టే మగవారిని నమ్మరాదన్నాను" అంది ఆడ చిలుక ఆయాసంతో ఒగరుస్తూ!

అప్పటి వరకూ కథ చెబుతూ ఆడ చిలుక ఆయాసంతో ఒగరిస్తే, అది చెప్పిన కథ విని ఆవేశంతో ఒగర్చింది మగ చిలుక!

పరాక్రమ కేసరి, రత్నావళి, ఇదంతా విని ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. రత్నావళి మగ చిలుకతో "నీవెందుకు ఆడువారిని నమ్మరాదన్నావు?" అనడిగింది.

మగచిలుక, కోపాన్ని నియంత్రించుకుంటున్న స్వరంతో "యువరాణీ! విను" అని ఇలా చెప్పసాగింది.

ఒకప్పుడు అరిష్టపురం అనే నగరం ఉండేది. (దురదృష్ట నగరం అని ఆ పేరుకు అర్ధం.) ఆ నగరాన్ని ధర్మకేసరి అనే రాజు పాలిస్తుండేవాడు. (ధర్మాన్ని పాటించడంలో సింహం వంటి వాడని ఆ పేరుకి అర్ధం.)

ఆ నగరంలో గిరి వర్ధనుడు అనే వైశ్యుడుండేవాడు. అతడు గొప్ప ధనిక వ్యాపారి. అతడికి ఒకే ఒక్క కూతురు, లాలస. (ఆమె పేరుకు అర్ధం కోరిక అని!) ఆమె చక్కనిది. అయితే పేరుకు తగినది.

ఆమె యుక్తవయస్సులో ఉంది. అదే నగరంలో ఉన్న మరో వైశ్య యువకుడు వరకీర్తి, గిరి వర్ధనుణ్ణి కలుసుకొని పిల్లనిమ్మని అడిగాడు. గిరి వర్ధనుడికి అతడి కుటుంబ నేపధ్యమూ, అందచందాలు, గుణగణాలు నచ్చడంతో, లాలసని వరకీర్తి కిచ్చి పెళ్ళిచేసాడు.

కొన్ని రోజుల తర్వాత వరకీర్తి, లాలసని ఆమె పుట్టింట వదిలి పెట్టి, వ్యాపార నిమిత్తం దూరదేశాలకు వెళ్ళాడు. లాలస యవ్వనంలో ఉంది. భర్త దగ్గర లేడు. దాంతో ఆమె కోరికలని నియంత్రించుకోలేక, తమ ఇంటికి సమీపంలో నివసించే బ్రాహ్మణ యువకుణ్ణి ఒకణ్ణి ఆకర్షించి, అతడితో రహస్య ప్రణయం నడపసాగింది. (ఇలాంటి కథ పిల్లలకి చెప్పేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేనైతే ఆమె అతడితో డ్యూయెట్ పాడేసింది అని చెబుతుంటాను.)

లాలస తన అక్రమ ప్రేమయణాన్ని అతి రహస్యంగా కొనసాగించింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఓరోజు... వ్యాపార నిమిత్తం దూరదేశాలకు వెళ్ళిన వరకీర్తి ఇంటికి తిరిగి వచ్చాడు. వ్యాపారంలో మంచి లాభాలు గడించినందుకు, అతడెంతో సంతోషంగా... భార్యకు, అత్తమామలకు విలువైన బహుమతులు తెచ్చాడు. లాలసకు పట్టు చీరలు, వజ్రాభరణాలు పట్టుకొచ్చాడు.

ఆ రోజు రాత్రి, లాలస, భర్తతో తియ్యగా మాట్లాడి, అతడు తెచ్చిన కానుకలని మెచ్చుకొని, అతణ్ణి ఆనందపరిచింది. భర్త నిద్రపోయాక, తనకి అత్యంత నమ్మకస్థురాలైన దాసీని పిలిచి, తన ప్రియుడైన బ్రాహ్మణ యువకుని, ఎవరూ చూడకుండా పిలుచుకు రమ్మంది. లాలస వివాహేతర ప్రేమ సంబంధం గురించి ఈ దాసీకి ముందే తెలుసు. లాలస ఇచ్చే కానుకలతో, ఆమెకి కావలసినట్లుగా మసలు కుంటుంది.

దాంతో దాసి, లాలస చెప్పినట్లుగానే బ్రహ్మణ యువకుణ్ణి పిలుచుకు వచ్చి, వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే సంకేత ప్రదేశంలో ఉంచింది. ఎప్పటి లాగే గిరి వర్ధునుడి భవంతి వెనుక తోటలో, ప్రహరీ గోడ ప్రక్కనే నక్కి ఆ బ్రాహ్మణ యువకుడు, లాలస కోసం ఎదురు చూడసాగాడు.

అప్పటికి అర్ధరాత్రి దాటింది. నగరానికి కాపలాకాసే గస్తీ సైనికులు అప్పుడే, అక్కడికి వచ్చారు. వైశ్య వ్యాపారి ఇంటి వెనక ఎవరో నక్కి ఉండటం గమనించారు. తమ విధి నిర్వహణలో భాగంగా అది వాళ్ళ దినచర్య. గిరి వర్ధనుడు ధనికుడు గనుక ఇంటి వెనుక ఎవరో దొంగ మాటు వేసాడేమో నని అనుమానించారు.

"ఎవరదీ!" అంటూ గట్టిగా గద్దించారు. బ్రాహ్మణ యువకుడు చీకట్లోకి తప్పుకున్నాడు. ‘ఎందుకొచ్చిన సందేహం?’ అన్నట్లుగా గస్తీ సైనికులు చీకట్లోకి బాణాలు వదిలారు. వాటిల్లో ఒకటి బ్రాహ్మణ యువకుడికి తగిలింది. గాయమైంది. బాధకి విలవిల్లాడినా, ఆ బ్రాహ్మణ యువకుడు గట్టిగా అరవలేదు.

‘ఎక్కడ తన అక్రమ సంబంధం బయటపడుతుందో’ అన్న భయం అతడిది. ఇంతలో బాధకి, రక్తస్రావానికి స్ఫృహ తప్పిపోయాడు. ఏ చప్పుడూ రాకపోవటంతో, గస్తీ సైనికులు తమ దారిన తాము పోయారు.

లాలస కదంతా తెలియదు. అప్పటికే ఆలస్యమైందనుకుంటూ ఆదర బాదరా వచ్చింది. ప్రియుణ్ణి ప్రేమతో పిలిచింది. బ్రాహ్మణ యువకుడి నుండి ఉలుకూ పలుకూ లేదు. లాలస, తాను ఆలస్యంగా వచ్చినందుకు అతడు కోపగించుకుంటున్నాడనుకొంది.

అతణ్ణి ప్రసన్నం చేసుకోవాలనుకుని వెనుక నుండి వచ్చి కౌగిలించుకుంది. గుసగుసలు పోతూ, ముందు కొచ్చి మూతిమీద ముద్దు పెట్టుకుంది. అప్పుడే ఆమె ముక్కు అతడి నోట చిక్కుకుంది. ఆమె కుదుపులకు, అప్పటి వరకు స్పృహతో లేని బ్రాహ్మణ యువకుడికి ఒక్కసారిగా స్పృహ వచ్చింది. మరుక్షణమే... ఆమె ముక్కు అతడి నోట ఉండగానే, అతడు ప్రాణాలు వదిలేసాడు.

ఈ హఠాత్పరిణామానికి నివ్వెర పోయిన లాలస, ఒక్కసారిగా లేచి నిలబడింది. ఆ దెబ్బకి ఆమె ముక్కు కొన కాస్తా తెగి, బ్రాహ్మణ యువకుడి శవం నోటిలో ఉండిపోయింది.

ఒక్కసారిగా లాలస భయంతో వణికి పోయింది. ఏం చెయ్యడానికీ తోచలేదు. ఒక్క పెట్టున ఇంట్లోకి పరుగెత్తుకొచ్చింది.

~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes