RSS
Wecome to my Blog, enjoy reading :)

ప్రియురాలు, ప్రియుడు, భర్త – ఎవరు గొప్ప? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 45]

విక్రమాదిత్యుడు తన ప్రయత్నం మాన లేదు. మోదుగ చెట్టెక్కి భేతాళుడిని దించి నడక ప్రారంభించాడు. భేతాళుడూ తన ప్రయత్నమాపలేదు. మరో కథ ప్రారంభించాడు.

“ఓ విక్రమాదిత్యా భూపాలా! విను” అంటూ కొనసాగించాడు.

అలకాపురి అనే నగరంలో ఒక వైశ్యశ్రేష్ఠుడు ఉండేవాడు. అతడి పేరు ఈశ్వర శెట్టి. అతడికి ఒక కుమార్తె ఉంది. పేరు రమ్యవల్లి. ఆమె పేరుకు తగ్గట్లే రమ్యమైన పూలతీగ వలె ఉండేది. ఆమె యుక్త వయస్సులో ఉంది.

వారి నివాసానికి దగ్గరలోని బ్రాహ్మణ అగ్రహారంలో నివసించే సందీపుడనే బ్రాహ్మణ యువకుడు ఆమెని ప్రేమించాడు. రమ్యవల్లికీ అతడంటే అనురాగమే ఉండటం వలన వారిద్దరూ ప్రతీ రోజూ ఎవరికీ తెలియకుండా రహస్యంగా కలుసుకుంటూ ఉండేవాళ్ళు. పరస్పర సాన్నిహిత్యాన్ని ఆనందించే వాళ్ళు.

ఇలా కొన్నాళ్ళు గడిచాయి. ఒకనాడు అలకా పురి కి ప్రక్కనున్న నగరం నుండి ఓ వైశ్య యువకుడు, రంగనాధ శెట్టి అనేవాడు వచ్చి ఈశ్వర శెట్టిని కలుసుకున్నాడు. తనని తాను పరిచయం చేసుకొని పిల్లనివ్వమని అడిగాడు.

ఈశ్వర శెట్టి కి రంగనాధ శెట్టి కులగోత్రాలూ, రూపురేఖలూ, అర్హతలు నచ్చటంతో రమ్యవల్లినిచ్చి వివాహం చెయ్యడానికి అంగీకరించాడు. ముహుర్తం నిర్ణయించి, బంధుమిత్రులందర్నీ ఆహ్వానించి వైభవంగా పెళ్ళి జరిపించాడు.

ఇటు రమ్యవల్లి గానీ, అటు సందీపుడు గానీ తల్లిదండ్రులకు తమ ప్రేమ గురించి చెప్పలేదు. పెళ్ళి వైభవోపేతంగా జరిగిపోయింది. రంగనాధ శెట్టి భార్యని వెంటబెట్టుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు. రమ్యవల్లి ప్రియుడైన సందీపుణ్ణి విడిచి వెళ్తున్నందుకు విపరీతంగా దుఃఖ పడింది.

అత్తగారిల్లు చేరినా, ప్రియుని వియోగ దుఃఖంతో కృంగి కృశించ సాగింది. కొన్ని రోజులకి ఆ వ్యధతో మరణించింది. ఆ వార్త విని సందీపుడు కంటికి మంటికి ఏకధారగా ఏడ్చాడు. అన్నపానీయాలు నిద్రా విశ్రాంతులు మానివేసి, మనోవేదనతో మంచం పట్టాడు. కొద్ది రోజులకి అతడూ మరణించాడు.

రమ్యవల్లి మరణించడంతో ‘మనసు పడి వివాహం చేసుకున్న భార్య చనిపోయిందే’ – అన్న విచారంతో రమ్యవల్లి భర్త రంగనాధ శెట్టి కూడా దిగులు చెంది జబ్బున పడి మరణించాడు.

“ఓ విక్రమాదిత్య రాజేంద్రా! రమ్యవల్లి, ఆమె ప్రియుడు సందీపుడు, ఆమె భర్త రంగనాధ శెట్టి – ఈ ముగ్గురూ వ్యధ చెంది మరణించారు కదా! వీరిలో ఎవరు గొప్ప? వివరించి చెప్పు” అన్నాడు భేతాళుడు.

విక్రమాదిత్యుడు కొంత గంభీరంగా “ఓ భేతాళా! విను! రమ్యవల్లి, ఆమె ప్రియుడు సందీపుడూ… కొంతకాలం పరస్పర ప్రేమనీ, సాన్నిహిత్యాన్నీ అనుభవించారు. అందుచేత ఆ వియోగ దుఃఖాన్ని భరించలేక మనోవ్యధ చెంది మరణించారు. అయితే రమ్యవల్లి భర్త రంగనాధ శెట్టి అమాయకుడు. ముచ్చటపడి వివాహం చేసుకున్న భార్య మీద మమకారంతో, ఆమె మరణ దుఃఖాన్ని సహించలేక, బాధతో తాను మరణించాడు. కాబట్టి రంగనాధ శెట్టి గొప్పవాడు” అన్నాడు.

భేతాళుడు అంగీకార సూచకంగా తలాడించి “మౌనభంగమైంది మహారాజా! సెలవు” అంటూ మాయమై మోదుగ చెట్టు ఎక్కేసాడు.

1 కామెంట్‌లు:

గిరీష్ చెప్పారు...

bagundani..
inthaki evaru goppa :-)

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes