RSS
Wecome to my Blog, enjoy reading :)

వంశ మార్గుడి కథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 42]

తర్వాతి ప్రయత్నంలో భేతాళుడు విక్రమాదిత్యుడికి మరొక కథ చెప్పటం ప్రారంభించాడు.

ఒకానొకప్పుడు వారణావతం అనే రాజ్యముండేది. దానికి రాజు వంశ మార్గుడు. [వంశానికే మార్గం చూపే వాడని అతడి పేరుకు అర్ధం.] అతడికి ఓ అందమైన భార్య ఉండేది. ఆమె పేరు చంద్రవదన. [చంద్రబింబం వంటి అందమైన ముఖం కలది అని అర్ధం.] పేరుకి తగ్గట్టే ఆమె అందాల భరిణె! అందానికి చందమామ!

రాజుకి భార్యంటే అమిత ప్రేమ, ఆకర్షణ. రాచకార్యాలన్నీ విడిచిపెట్టి దినమంతా ఆమెతోనే గడిపేవాడు.

ఆ రాజ్యపు మంత్రి పేరు నీతి వర్ధనుడు. [నీతిని వృద్ధి చేసే వాడని అర్ధం.] అతడెంతో మంచివాడు, తెలివైన వాడు. రాజు పరిపాలనా భారమంతా తనపై వదిలేసి అంతఃపురంలో రాణితో ఆటపాటలతో కాలం గడపటంతో మంత్రి రాజ్య భారమంతా వహించేవాడు.

నీతి నిజాయితీలతో, ధర్మబద్ధంగా పరిపాలన సాగేందుకు అన్ని విధాలా శ్రద్ధ తీసుకునేవాడు. కాలమిలా గడుస్తోంది. క్రమంగా ప్రజలు మంత్రిని శంకించ సాగారు. అతణ్ణి సందేహిస్తూ “ఈ మంత్రి చాలా తెలివైన వాడు. తన తెలివితేటలతో రాజుని ఏమార్చి, మరేవో విషయాలలో మునిగి తేలేటట్లు చేసాడు. ఆ నెపాన తానే అధికారమంతా చేతుల్లోకి తీసుకొని రాజ్యపాలన చేస్తున్నాడు” అని చాటుగా గుసగుసలు పోసాగారు.

ఆనోటా ఈ నోటా ఈ మాట మంత్రి చెవిన బడింది. అతడు దానికి చాలా మనస్తాపం చెందాడు. వికలమైన మనస్సుతో, దేశం విడిచి తీర్ధయాత్రకు బయలుదేరాడు. మంత్రి నీతి వర్ధనుడి దేశాటన గురించి ఇతర రాజోద్యోగులు వంశమార్గుడికి తెలియజేసారు.

రాజది విని విచారించాడు. ఇతర మంత్రులకూ, రాజోద్యోగులకూ పరిపాలనా బాధ్యతలు అప్పగించాడు.

నీతివర్ధనుడు పుణ్యక్షేత్రాలనీ, ఆయా ప్రదేశాల్లోని వింతలూ విశేషాలనీ చూస్తూ యాత్ర కొనసాగిస్తున్నాడు. మార్గవశాత్తూ అతడో రేవు పట్టణాన్ని చేరాడు. ఆ ఊళ్ళో ఓ వర్తక శ్రేష్ఠి ఉన్నాడు. అతడి తో మంత్రి నీతి వర్ధనుడికి చెలిమి కలిసింది.

ఇద్దరి అభిప్రాయాలూ, దృక్పధాలూ ఒకటి కావడంతో ఇరువురూ ఎన్నో విషయాలు చర్చిస్తూ హాయిగా కాలం గడపసాగారు. ఇద్దరూ తెలివైన వాళ్ళూ, పండితులూ కావటంతో, శాస్త్ర సాహిత్య విషయాలూ, కళాస్వాదనలూ, సత్సంగాలూ! రోజులు గడవసాగాయి.

రానూ రానూ వారి మైత్రి మరింత గాఢమైంది. ఓ రోజు… వర్తకుడు మంత్రితో “ఓ మిత్రుడా! నేను వ్యాపారనిమిత్తమై నా నౌకలో దేశాంతరం బయలు దేరనున్నాను. కొద్ది రోజులలోనే తిరిగి రాగలవాడను. నిన్ను వీడి వెళ్ళడానికి మనస్సొప్పడం లేదు. అయినా ఉదర పోషణార్ధం వృత్తి వ్యాపారాలు తప్పవు గదా! నేను తిరిగి వచ్చు వరకూ దయతో నీవిక్కడనే ఉండవలసిందిగా నా కోరిక” అన్నాడు.

నీతి వర్ధనుడు చిరునవ్వు నవ్వుతూ “ప్రియమిత్రుడా! నీవు లేని చోట నాకు మాత్రం పని యేమి ఉన్నది? ప్రపంచమున గల వింతలూ విడ్డూరాలూ చూడ వేడుక తోనే నేనిట్లు పుట్టిన భూమీ వదలి వచ్చితిని. కావున నీ నౌకలో నన్నూ గొనిపొమ్ము. ఇరువురమూ కలిసే వెళ్ళెదము గాక!” అన్నాడు.

వర్తక శ్రేష్ఠి ఇందుల కెంతో సంతోషించాడు. ఓ మంచి ముహుర్తాన నౌక బయలు దేరింది. నీలి సాగరపు అలలపై హుందాగా పయనిస్తోంది. సాగర సౌందర్యాన్ని, నీటి పక్షుల కోలాహలాన్ని, చల్లని గాలుల్నీ ఆనందిస్తూ మంత్రి తన ప్రియమిత్రుడితో మంచీ చెడు మాట్లాడుతూ కాలం గడుపుతున్నాడు.

దురదృష్టవశాత్తూ వాళ్ళ నౌక సముద్రపు తుఫానులో చిక్కుకుంది. సుడిగాలికి, రాకాసి అలలకీ ఆకులా అలల్లాడింది. నావికులెట్లో నౌకని నియంత్రంచ ప్రయత్నించసాగారు. తుఫాను తగ్గేటప్పటికి నౌక దారి తప్పి మరెటో పయనించింది.

నావికులకి అది పూర్తిగా కొత్త దారి కావటంతో, వారు కొంత వెఱగొంది, జాగరూకతతో నౌకని నడపసాగారు. అదృష్టం బాగుండి, భగవంతుడి కరుణ వారిపై ప్రసరించి, వారి నౌక ఓ దీవి చేరింది. నౌకకి లంగరు వేసారు. నావికులూ, సిబ్బంది దీవిలో చెట్లు నరికి నౌకలో వంట చెరకుకీ, ఇంధనానికీ ఏర్పాట్లు చేయదలిచారు. నౌక దిగి దీవిలో తిరగాడారు.

ఆ దీవిలో వారికొక ప్రాచీన ఆలయం కనిపించింది. అద్భుత శిల్ప సౌందర్యంతో చూడటానికి రెండు కళ్ళూ చాలననేంత అందంగా ఉంది. అయితే చిత్రంగా ఆ దేవాలయంలో గానీ, దీవిలో గానీ నరమానవ సంచారం లేదు. గర్భగుడి ఎదురుగా ఓ పెద్ద అశ్వత్ధ వృక్షం ఉంది. దాని క్రింద ఓ సౌందర్యవతి కూర్చొని ఉంది.

ఆలయమూ, ఆ యువతీ కూడా దేవలోకానికి చెందినట్లుగా ఉన్నారు తప్ప, భూలోకంలో అంతటి అందమైన దేవళం గానీ, అలాంటి యువతి గానీ ఉండరనిపించింది. దాంతో నావికులూ, నౌకా సిబ్బంది ఎంతో భీతిల్లారు. దేవతాలోకంలో అడుగుపెడితే శాపాలకు గురి కావచ్చొన్న వెరపుతో వడి వడిగా నౌక చేరి లంగరు తీసి, తెర చాపలెత్తి ప్రయాణం ప్రారంభించారు.

కొన్ని నాళ్ళకే తమ స్వస్థలానికి చేరారు. నీతి వర్ధనుడూ, అతడి మిత్రుడైన వర్తకుడూ కూడా వారితో పాటే తిరిగి వచ్చారు. ప్రయాణ ముచ్చట్లలో మరి మూడు నాలుగు దినాలు గడిచాయి. నీతి వర్ధనుడికి స్వదేశం మీదికి గాలి మళ్ళింది.

అతడు తన మిత్రుడైన వర్తక శ్రేష్ఠికి తన అభీష్టం చెప్పి వీడ్కొలు తీసుకున్నాడు. ప్రియమిత్రుడికి తగిన కానుకలిచ్చి ఆత్మీయంగా వీడ్కొలిచ్చాడు వర్తకశ్రేష్ఠి. నీతి వర్ధనుడు నేరుగా స్వదేశం బయలు దేరి కొన్నాళ్ళకు వారణావతం చేరాడు.

రాజు వంశమార్గుడతణ్ణి సాదరంగా ఆహ్వానించాడు.

“ఓ మంత్రీ! నీతి వర్ధనా! ఇన్నినాళ్ళూ నీవు క్షేమంగా ఉన్నావు కదా? ఎందుకు నీవు నన్నూ, మన దేశాన్నీ విడిచి వెళ్ళావు?” అని అడిగాడు.

నీతి వర్ధనుడు “మహారాజా! ప్రజలు నా గురించి ‘నేను మీకు బదులుగా రాజ్యాధికారం చలాయిస్తున్నాననీ, అందుకే మీరు ఇతరత్రా కాలం గడిపేటట్లుగా ప్రణాళికలు వేసాననీ’ నీలాపనిందలుగా అనుకోసాగారు. అందుచేత నాకు బాధ తోచింది. అందుకే మిమ్మల్నీ, దేశాన్నీ విడిచి తీర్ధయాత్రలకు పోయాను. దేశాటనంలో భాగంగా ఎక్కడెక్కడో తిరిగాను. ఎన్నెన్నో వింతలు చూసాను. అయితే నాకెక్కడా మనశ్శాంతి లభించలేదు. చివరికి మాతృభూమికి తిరిగి వచ్చాను” అన్నాడు.

రాజు వంశమార్గుడిది విని కొంత విచారించాడు. కొన్ని క్షణాల మౌనం తర్వాత “మంచిది. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందు, గతంలో వలె నీవు రాజ్యవ్యవహారాలు చక్క పెట్టగలవు. ఇంతకూ నీవు దేశాటనంలో ఏయే వింతలు చూచిన వాడవు. వినాలని కుతుహలంగా ఉంది. వివరించి చెప్పు” అన్నాడు.
~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes