RSS
Wecome to my Blog, enjoy reading :)

తల తెగి పడిన దొంగ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 49]

రాజభటులు దొంగల నాయకుడికి ఎర్రని దుస్తులు వేసి, మెడలో వేపదండ వేసారు. నుదుట పెద్ద బొట్టు తీర్చి, బండి మీది కెక్కించి, బండి స్తంభానికి కట్టి ఊరంతా డప్పు మోగిస్తూ ఊరేగించ సాగారు. అలాంటి శిక్షలు చూసిన ప్రజలలో నేరప్రవృత్తి మాసిపోతుందని రాజలా ఆజ్ఞాపించాడు.

వీధులలో కోలాహలంగా సాగుతున్న ఆ ఊరేగింపుని, ప్రజలంతా గుంపులుగా కూడి కుతూహలంతో తిలకించసాగారు. ఊరేగింపు వీరకేశుడు వీధిలోకి ప్రవేశించింది. రత్నావళి తన గది గవాక్షం నుండి దొంగలనాయకుణ్ణి చూసింది.

అప్పటికి ఆమె అవివాహితగా ఉండి పోవాలన్న ఆకాంక్షతో ఎన్నో పెళ్ళి సంబంధాలను తిరస్కరించి ఉంది. అలాంటి రత్నావళి… దొంగల నాయకుణ్ణి చూసిన వేళా విశేషమో, లేక అతడి రూప విలాసమో గానీ, తొలిక్షణంలోనే అతనిపై ప్రేమలో పడింది.

మరుక్షణం ఆమె తన తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తి “తండ్రీ! ఇప్పుడు సైనికులు వధ్యశిలకు తీసుకువెళ్తున్న దొంగల నాయకుణ్ణి చూశారు కదా! అతడే నా మనో నాయకుడు. పెళ్ళి చేసుకుంటే అతణ్ణే చేసుకుంటాను. మీరు అతణ్ణి ఎలాగైనా విడుదల చేయించి, నన్నిచ్చి వివాహం చేయండి. లేనట్లయితే నాకు మరణం తప్ప శరణ్యం లేదు” అంది.

ఇది విని ఒక్కసారిగా ఆమె తల్లిదండ్రులు మ్రాన్పడి పోయారు. రత్నావళికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. వీరకేశుడు “నా చిట్టి తల్లి! ఎంత పిచ్చిగా ఆలోచిస్తున్నావు? ఈ ప్రపంచంలో మరణశిక్ష పడిన దొంగని ఎవరైనా వరిస్తారా? తల్లీ! నువ్వు ఓ దొంగని వివాహమాడితే… ప్రజలు, బంధుమిత్రులూ అందరూ మమ్మల్నీ దొంగలనే నిందించరా?

అలాంటి వివాహంతో మన కుటుంబ గౌరవం, వంశగౌరవం కూడా నాశన మౌతాయి. నీ ప్రియమైన తల్లిదండ్రులుగా, మేము లోక నిందకి గురౌతాము. కనుక నువ్వు! ఓ దొంగని పెళ్ళాడాలని ఆలోచించటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అందమైన, సిరిసంపదలు గల, విద్యాబుద్దులు గల, గౌరవనీయమైన కుటుంబాల నుండి వచ్చిన ఎందరో యువకులు, నిన్నుపెళ్ళాడ గోరి వచ్చారు. వారందరినీ తిరస్కరించిన నువ్వు, ఇలా ఓ దొంగని వరించటం సరైనదేనా? ఆలోచించు తల్లీ!” అని నెత్తీ నోరూ కొట్టుకున్నారు.

కానీ వీరకేశుడి సొదంతా రత్నావళి ముందు, చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లయ్యింది. తల్లిదండ్రుల మాటలు ఆమె చెవికెక్కలేదు. ఇక ఆ వాణిజ్యవేత్త వీరకేశుడు ఏం చెయ్యగలడు? కుమార్తె పట్టుదల తెలిసిన వీరకేశుడు దిగులు చెందాడు. ఏం చెయ్యడానికీ తోచలేదు. భార్యతో సంప్రదించాడు. ఏదో ఒకటి చేయక తప్పదు.

అతడు, అపురూపమైన మణిమాణిక్యాలు, రత్నఖచిత అభరణాల వంటి విలువైన కానుకలు తీసుకొని, రాజ దర్శనానికి వెళ్ళాడు.

రాజు పాదాల ముందు తాను తెచ్చిన కానుకలుంచి నమస్కరించాడు. ఏమిటన్నట్లుగా చూసాడు రాజు. వీరకేశుడు “ఓ రాజా! నీవు గొప్పవాడివి. ప్రజారంజకుడవి. రాజులలో పేరెన్నిక గలవాడివి. నీకు వేనవేల నమస్కారాలు. ఇంతకాలం ప్రజలని బాధించిన దొంగలని పట్టుకున్న వీరుడవు నీవు. చోరనాయకుడికి నీవు మరణశిక్ష విధించావు.

అయితే ఓ రాజా! నా యందు దయ యుంచి, అతణ్ణి విడుదల చేయాల్సిందిగా ఆజ్ఞాపించు. వధ్యశిలకు గొనిపోతున్న దొంగల నాయకుణ్ణి చూసి, నా కుమార్తె ప్రేమలో పడింది. అతడిని పెళ్ళాడ గోరుతున్నది.

నాకున్నది ఈ కుమార్తె ఒక్కతే! అదీ మా వివాహమైన తర్వాత, ఎన్నో ఏళ్ళకు, ఎన్నో నోములు పూజలూ చేయగా జన్మించిన బిడ్డ! అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ! ఇప్పటి వరకూ ఎవరినీ పెళ్ళాడనని భీష్మించుకు కూర్చున్నది. ఇప్పుడీ దొంగని వరించినది. లేనట్లయితే మరణిస్తానని పంతం పట్టింది.

మహారాజా! ఆమె మరణిస్తే నేనూ నా భార్యా కూడా బ్రతక లేం. ఇలాంటి నిస్సహాయ స్థితిలో, నిన్ను చూడ వచ్చాను. దయయుంచి ఆ దొంగని విడుదల చెయ్యి. ఇది నా ప్రార్ధన!” అన్నాడు కన్నీటితో!

రాజది చూసి మొదట ఆశ్చర్యపోయాడు. విషయం అర్ధమయ్యాక ఆగ్రహోదగ్రుడయ్యాడు. అగ్గి మీద గుగ్గిలంలా చిటపట లాడుతూ “ఏయ్! వణిక శ్రేష్టీ! నీకేమైనా పిచ్చి ఎత్తినదా? ఎందుకు నీవు, ఆ దొంగల నాయకుణ్ణి కాపాడే ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకిలా కట్టు కథలల్లి నన్ను నమ్మించ జూస్తున్నావు? బహుశః నువ్వు ఇంకా పెద్ద దొంగవై ఉంటావు. అందుకే మరణశిక్ష పడ్డ దొంగని కాపాడ యత్నిస్తున్నావు.

బహుశః తాను దొంగిలించిన సొత్తు నుండి నీకు బంగారం, రత్నాలు, ధనం నీకు వాటాగా ఇస్తున్నాడు కాబోలు! లేకపోతే నీ కూతుర్ని సాకుగా చూపి దొంగని కాపాడే సాహసం చేస్తావా?

నాకు మీ వ్యాపార టక్కుటమారాలన్నీ తెలుసు. తక్షణం ఇక్కడి నుండి వెళ్ళు! ఇంకొక్క క్షణం నువ్విక్కడే ఉంటే, ఆ దొంగకి పడ్డ శిక్ష వంటిదే, నీకు కూడా పడుతుంది. ఫో! తక్షణం ఇక్కడి నుండి ఫో!” అన్నాడు.

రాజు కళ్ళ నుండి నిప్పులు రాలుతున్నట్లనిపించింది వీరకేశుడికి. భయంతో కాళ్ళు తడబడుతుండగా ఇంటికి పరిగెత్తుకు వచ్చాడు. జరిగిందంతా కూతురికి చెప్పి, మనస్సు మార్చుకోమన్నాడు. అది విన్న రత్నావళి మొదలు నరికిన అరటి చెట్టులా నేలపై కూలిపోయింది. క్షణాల్లో ఆమెకి స్పృహ తప్పింది.

తల్లిదండ్రులు, దాసీలు ఆమెకి శైత్యోపచారాలు చేసారు. కొద్ది క్షణాలకి సేద తీరి పైకి లేచింది. మరుక్షణం వీధిలోకి ఉరికింది. గుండెలు బాదుకుంటూ, బిగ్గరగా రోదిస్తూ, దొంగని ఊరేగిస్తున్న చోటికి చేరింది. అప్పటికే ఆమె జుట్టు ముడి ఊడింది. విరబోసుకున్న జుట్టుతో, చెదిరిన బొట్టుతో, చెమటలూ కన్నీరు వరదై కారుతున్న ముఖంతో, ఆమె మూర్తీభవించిన శోక దేవతలా ఉంది.

కుమార్తె స్థితి చూసి గుండె చెరువైన వీరకేశుడు, అతడి భార్య ఇంటిలో ఉండలేక పోయారు. వాళ్ళు కూడా బిగ్గరగా ఏడుస్తూ, ఆమె వెనక బడ్డారు.

ఇదంతా ఊళ్ళో పాకింది. ప్రజలెంతో ఆశ్చర్యపోయారు. గొప్ప కుతుహలం, ఆసక్తితో వారి చుట్టూ గుమిగుడారు. ముందు డప్పులు, వెనక దొంగని కట్టిన బండి, ఆ వెనక శోకిస్తూ రత్నవళి, ఆమె తల్లిదండ్రులు! మెల్లిగా ఊరేగింపు వధ్యశిలకు చేరింది. ఊరి జనమంతా అక్కడే పోగయ్యింది.

భటులు దొంగని బండి దింపి, వధ్యశిల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. అతడి తలను వధ్యశిలపై ఆన్చి పరుండ బెట్టారు. అప్పటికే వాళ్ళూ వీళ్ళూ అనుకుంటున్న మాటల్ని బట్టి, దొంగల నాయకుడికి విషయం అర్ధమైంది. అతడి చూపు రత్నావళి మీద నిలిచింది. ఆ పిల్ల సౌందర్యం, శోకం చూసి అతడికి ఆశ్చర్యం కలిగింది.

ఆమెనీ, ఆమె తల్లిదండ్రుల్ని ఒక్కక్షణం తదేకంగా చూసాడు. క్రమంగా అతడి చూపు రత్నావళి మీద నిలిచి పోయింది. ఒక్కక్షణం బిగ్గరగా పగలబడి నవ్వాడు. మరుక్షణం గట్టిగా ఏడ్చాడు. ఉత్తరక్షణం అతడి తల తెగి పడింది. భటులు తమ కర్తవ్యాన్ని తాము నిర్వహించారు.
~~~~~~~~~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes