RSS
Wecome to my Blog, enjoy reading :)

భేతాళుని కథలో భాగవత గాథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 53]

ఇన్ని ప్రయత్నాలతో విక్రమాదిత్యుడు విసుగు చెందలేదు. పైగా భేతాళుడు చెబుతున్న కథల పట్ల తడవ తడవకీ మరింత కుతూహల పడసాగాడు. దాంతో పందొమ్మిదో మారు మోదుగ చెట్టెక్కి భేతాళుడున్న శవాన్ని దించి, భుజాన పెట్టుకుని బృహదారణ్యం వైపు నడక సాగించాడు. భేతాళుడూ ఊరుకోలేదు. మరో కథ ప్రారంభించాడు.

“విక్రమాదిత్య ధరణీ పాలా! విను” అంటూ కొనసాగించాడు.

ఒకప్పుడు పద్మపురం అనే నగరముండేది. దానికి రాజు జీమూత వాహనుడు. (నిజానికి ఇది భాగవతంలోని కథ. భట్టి విక్రమార్క కథల్లోకి చొప్పించబడి ఉండాలి.) ఆనాటి రాజులందరిలో జీమూత వాహనుడు ఉత్తమోత్తముడు. అతడికి సుసంపన్నమైన సైన్యం ఉండేది. సుశిక్షితులైన అధికార యంత్రాంగం ఉండేది.

అయినా గానీ.... రాజు, ప్రచ్ఛన్న వేషంలో స్వయంగా రాజ్యమంతటా పర్యటించి, ప్రజల బాగోగులు తెలుసుకుంటూ, వారిని కన్నబిడ్డల్లా కాపాడుతూ ఉండేవాడు. వేగులు తెచ్చే సమాచారంతో, తను స్వయంగా తెలుసుకున్న విషయాలను సరిపోల్చుకుని, పాలనా పరిస్థితులనీ, ప్రజల స్థితిగతులనూ అంచనా వేసుకునేవాడు.

అందుకే తరచుగా మారువేషంలో నగర పర్యటన చేసేవాడు.

ఆ రోజులలో పద్మపురం ప్రక్కనే ఓ చిన్నపాటి అడవి ఉండేది. అందులో చాలా పాములుండేవి. ప్రతీ రోజూ గరుడుడు వచ్చి పాముల్ని చంపి తినేవాడు. మహా విష్ణువు వాహనమైన గరుడుడు మహాబల సంపన్నుడు. అలాంటి గరుత్మంతుడు ప్రతీ రోజూ, ఏమాత్రం కనికరం లేకుండా, కనబడిన పాముల్ని కనబడినట్లు పట్టుకుని చంపి తినే వాడు.

ఆ కారణంనా ఆ చిట్టడివిలోని పాములన్ని భయోతాత్పతంలో పడి ఉన్నాయి. ఓ రోజు పాములన్నీ ఓ చోట సమావేశమైనాయి. తమ మృత్యు ప్రమాదం గురించి చర్చించుకున్నాయి. చివరికి తామంతా కలిసి గరుడుడికి ఓ విన్నపం చేయాలని నిశ్చయించుకున్నాయి. ఆపైన గరుడుడి రాక కోసం ఎదురు చూసాయి. అంతలో గరుడుడు రానే వచ్చాడు.

పాములన్నీ కలిసి ఏక కంఠంతో “హే గరుడా! మాదో ప్రార్ధన. దయతో ఆలకించు” అన్నాయి. గరుడుడు “ఏమిటి?” అన్నాడు. పాములు “గరుడా! నీవు మహావిష్ణువు వాహనుడవు. ఆ దేవదేవుని నీ బలమైన రెక్కల మధ్య మోసి మహిమాన్వితుడవైనావు. మేము నీ సేవకులం. నీకు ఆహారంగా అనుగ్రహించబడిన వాళ్ళం.

మా ఈ చిన్న పాముల గుంపు, గుట్టుగా ఈ చిట్టడవిలో బ్రతుకుతూ ఉంది. ప్రతీ రోజూ నీవు వచ్చి, కనబడిన పాముని కనబడినట్లు చంపి తింటున్నావు. దాంతో మేం దినదినం ప్రాణ గండంగా జీవిస్తున్నాం. ప్రతి దినమూ మృత్యువు మా వాకిట నిలిచే ఉంటోంది. నిత్యం భయంతో బ్రతుకు లీడుస్తున్నాం.

బ్రతికి ఉన్న క్షణాలైనా ప్రశాంతత లేకుండా పోయింది. దానితో మొత్తంగా మా జాతే సర్వనాశనం అయ్యే స్థితిలో ఉంది. ఆవల నీకూ ఆహార లభ్యతలో లోపం ఏర్పడగలదు. కావున మాది ఓ చిన్న విన్నపం. దయతో ఆలకించ వలసింది.

ప్రతీ దినం నీకు ఆహారంగా, మేం ఇంటి కొకరంగా వంతు లేసుకుని రోజు కొకరంగా వస్తాము. ఈ వంతుల పద్ధతిని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ జవదాటం. దయ చేసి నీవు, నీకు ఆనాటికి ఆహారమయ్యే వంతు గల పామును తప్ప, ఇతర వాటి జోలికి రానట్లయితే మేం బ్రతికిన నాలుగు నాళ్ళయినా ప్రశాంతంగా, భయరహితంగా బ్రతక గలము.

ఇదీ మా ప్రార్ధన! ఓ గరుడా! దయతో అంగీకరించగలవు. నీవు బలాఢ్యుడవు. మేము అల్పులము. కరుణతో చూడు!” అని ప్రార్ధించాయి.

గరుడుడు వాటి ప్రార్ధన మన్నించాడు. ఆనాటి నుండి గరుడుడు, విచ్చల విడిగా పాముల్ని వేటాడి, చంపి తినడం మాని వేసాడు. ఆ రోజుటి వంతు ప్రకారం, తనకి ఆహారంగా వచ్చే పాముని మాత్రమే భుజించి వెళ్ళిపోసాగాడు. రోజులు గడుస్తున్నాయి.

ఒక రోజు.... ఆనాటి వంతుగా శంఖచూడుడు అనే పాము వంతు వచ్చింది. అది దాని తల్లికి ఏకైక సంతానం. ఆ తల్లి కంటికి మంటికి ఏకధారగా ఏడ్వసాగింది. సరిగ్గా ఆనాడే జీమూత వాహనుడు తన రాజ్యపు మంచి చెడులను పర్యవేక్షించేందుకు నగర పర్యటనకి వచ్చాడు. నగరానికి దాపులనే ఉన్న ఈ చిట్టడివిలో, ఈ పాము తల్లి దుఃఖం చూసి, ఆయన చలించి పోయాడు.

“తల్లీ! ఎందుకిలా దుఃఖిస్తున్నావు?” అని అడిగాడు.

ఆ తల్లి తన శోక కారణాన్ని వివరించి చెప్పింది. జీమూత వాహనుడు ఆమెను ఓదార్చి, ఆమె పుత్రుణ్ణి కాపాడగలనని అభయమిచ్చాడు. అప్పటికే గరుడుడికి ఆహారంగా కొండకొమ్ముకి చేరిన శంఖచూడుణ్ణి వెదుక్కుంటూ వెళ్ళి కలిసాడు.

“శంఖచూడా! నీప్రాణం కాపాడతానని నీ తల్లికి మాట ఇచ్చాను. ఈ రోజు గరుడునికి ఆహారమయ్యే వంతు నీదని నాకు తెలుసు. నీ బదులుగా నేను గరుడునికి ఆహారమౌతాను. నీవు ఇంటికి వెళ్ళి, నీ తల్లికి సంతోషం కలిగించు” అన్నాడు.

దానికి శంఖచూడుడు “ఓ రాజా! ఈ లోకానికి నా జీవితం వల్ల ఒనగూడే ప్రయోజనమేమిటి? నేను అల్ప జీవిని. అంతేగాక విష ప్రాణిని. నీవు జీవించి ఉన్నట్లయితే.... మన దేశానికెంతో మేలు చేకూర గలదు. నీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. నీవు స్వార్ధపూరితుడైన పాలకుడవు కావు. నీతి పరుడవు. అట్టి ఉత్తముడవైన నీవు, నా వంటి అల్పప్రాణికి బదులుగా మరణించటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అందుచేత నీవన్న దానికి నేను సమ్మతించను” అన్నాడు.

జీమూత వాహనుడు.... శంఖచూడుడి నిబ్బరానికి, ఉన్నత వ్యక్తిత్వానికి ముచ్చట పడ్డాడు. దాంతో, సర్పబాలుడికి రాజు “నేను నీ తల్లికి, నిన్ను కాపాడతానని ప్రమాణం చేసాను. దాన్ని అతిక్రమించ లేను. కావున నీవు ఇంటికెళ్ళు. గరుడిడికి నేను ఆహారమౌతాను” అంటూ నచ్చ జెప్ప జూసాడు.

ఈ విధంగా వారిద్దరూ వాదించుకుంటుండగానే, గరుడుడు అక్కడికి వచ్చాడు. అందునా ఆకలి గొని ఉన్నాడు. జీమూత వాహనుడు గరుడినితో

“ఓ గరుడా! పక్షీంద్రా! ఈ రోజు నీకు అహారం కావలసిన వంతు ఈ శంఖచూడునిది. అయితే దయ చేసి, అతడిని విడిచిపెట్టు. బదులుగా నన్ను నీ ఆహారంగా గ్రహించు. ఇతడు తన తల్లికి ఒకే ఒక్క బిడ్డడు” అన్నాడు చేతులు జోడిస్తూ!

ఆ మాటలకు గరుడుడు ఆశ్చర్యపోయాడు. పరోపకారానికై శరీర త్యాగానికి సిద్దపడిన జీమూత వాహనుణ్ణి చూసి, గరుడునికి ముచ్చట కలిగింది. వాత్సల్యంగా అతడి వైపు చూస్తూ “ఓ రాజా! నీ మంచితనం, త్యాగనిరతి చూసి నాకెంతో సంతోషం కలిగింది. పరోపకారివైన నీ పట్ల నేనెంతో అపేక్ష పొందాను. నీవేది కోరినా అనుగ్రహిస్తాను. చెప్పు. నీకేది కోరిక” అని అడిగాడు.

జీమూత వాహనుడు గరుడునికి నమస్కరిస్తూ “ఓ గరుడా! విష్ణు వాహనా! నా కొరకై నేనేది నిన్ను కోరను. అయితే ఈ రోజు నుండి నీవీ అడవిలోని పాములని చంపి తినకు. ఇదే నేను నిన్ను కోరే వరం!” అన్నాడు.

గరుడుడు జీమూత వాహనుడిని అనుగ్రహించాడు. నాటి నుండి ఆ అడవికి రావడం మాని వేసాడు. అప్పటి నుండీ ఆ అడవిలోని పాములన్ని నిర్భయంగా బ్రతికాయి.

ఇదీ కథ!

భేతాళుడు ఇంత వరకూ కథ చెప్పి “ఓ విక్రమాదిత్య రాజేంద్రా! శంఖచూడుడు, జీమూత వాహనుడు, గరుడుడు.... ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప?” అని అడిగాడు.

విక్రమాదిత్యుడు “భేతాళా! విను! జీమూత వాహనుడు ఆ దేశానికి రాజు. రాజుగా తన రాజ్యంలోని వారి క్షేమం చూడటం, ఆశ్రితులందరి ప్రాణాలు కాపాడటం అతడి బాధ్యత. అందుచేత, శంఖచూడుడికి బదులుగా తాను గరుడుడికి ఆహారమవ్వాలని, జీమూత వాహనుడు భావించడం సబబే! అది అతడి బాధ్యతే తప్ప వేరు కాదు.

అదే విధంగా ఆ రాజ్య నివాసిగా శంఖచూడుడి బాధ్యత రాజును సేవించడం! అందుచేత జీమూత వాహనుడి ప్రతిపాదనని తిరస్కరించి, గరుడునికి తానే ఆహారం కావాలనుకోవటంలో శంఖచూడుడు చూపినదీ, బాధ్యతే తప్ప వేరే కాదు.

అయితే.... గరుడునికి పాములు భగవంతుడిచ్చిన ఆహారం. అంతేగాక, గరుడుడు శంఖచూడుడు వంటి పాముల కన్నా, జీమూత వాహనుడి వంటి రాజుల కన్నా బలవంతుడు. అతడికి ఎదురు లేదు. అయినా.... రాజుకి ప్రమాణం చేసిన రీత్యా, అడవిలోని పాముల జోలికిక రాలేదు. కాబట్టి గరుడుడే గొప్ప!” అన్నాడు.

ఆ విధంగా మౌనం భంగమైంది. భేతాళుని శవం మాయమైంది.

కథా విశ్లేషణ: ఈ కథ భాగవతంలోనిది. జానపదుల కల్పనలో నుండి విక్రమాదిత్యుడికి భేతాళుడు చెప్పిన కథగా పరిణమించి ఉంటుంది. అయితే ఎవరు గొప్ప అనే ప్రశ్ననూ, దానికి విక్రమాదిత్యుడి జవాబుగా..... చక్కని తర్కాన్ని అందించే ఈ కథ, పిల్లలనే గాక పెద్దలనీ అలరిస్తుంది.
~~~~~~~

1 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

Adi lakshmi garu mee blog nannu chinnatanam loki teskellindi...thaks for tis wonderful blog..

http:/kallurisailabala.blogspot.com

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes