RSS
Wecome to my Blog, enjoy reading :)

ధారా నగరం – వేట వినోదం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 02]

అది ప్రాచీన కాలం!

ఈ కథ ప్రాచీన భారత దేశంలో సంభవించింది.

ఆ కాలంలో భారత దేశం భూలోక స్వర్గంలా ఉండేది. మూడు దిక్కులా ఆవరించిన సముద్రాలు, ఉత్తర దిక్కున ఠీవిగా నిలిచిన హిమాలయ పర్వతాలతో, వెల లేని రత్నాలూ విలువైన లోహాలూ కలిగి, ఒకేసారి నిండు గర్భిణి లాగానూ, పచ్చి బాలింత లాగానూ ఉండేది. వెండి బంగారు రాగి ఇనుము వంటి లోహాలూ, రత్నాలూ వజ్రలూ ప్రజలకి సునాయసంగా లభ్యమయ్యేవి.

చల్లని, సౌకర్యవంతమైన, అందమైన, పచ్చని ప్రకృతి పరచుకొని ఉండేది. ఆ జీవగడ్డపై సంవత్సరమంతా ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా పచ్చని పైరులు చిరుగాలికి ఊగుతుండేవి. నదీ నదాల గలగలలతో, పశుపక్షుల కిలకిలలతో, అరణ్యాలతో అలరారు తుండేది. అక్కడక్కడా విసిరేసినట్లుగా జనవాసాలు... గ్రామాలు, నగరాలు!

పచ్చని ప్రకృతిలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తుండేవాళ్ళు.

అలాంటి భారతదేశంలో అది దక్షిణ భూభాగం! పుడమి తల్లికి నుదుటి సింధూరంలా ధారానగరం అనే పట్టణం ఉండేది. ఆ నగరంలో ఇళ్ళన్నీ మిద్దెలూ మేడలే! పలు అంతస్ధుల భవనాలతో అందంగా ఉండే నగరం! అక్కడి ఇళ్ళకు తోరణాలుగా మామిడాకులు గాక, మణులతో చేసిన హారాలు వేలాడుతుండేవి. దొంగభయం లేదు. దోపిడిల భయమూ లేదు. ప్రజలంతా ఎంతో శాంతి సౌఖ్యాలతో ఉండేవాళ్ళు.

ధారా నగరం భోజరాజు యొక్క రాజధాని. భోజరాజు ఎంతో మంచివాడు, దయగలవాడు, ధర్మపరుడు. తన ప్రజల పట్ల బాధ్యత కలవాడు. అతడెల్లప్పుడూ తన ప్రజల క్షేమం గురించే ఆలోచించేవాడు. అతడి పన్ను విధానం ప్రజలకి ఏమాత్రం భారంగానూ, బాధ గానూ ఉండేది కాదు. అతడి పాలనా విధానం, పరిపాలనా యంత్రాంగం.... ఎల్లప్పుడూ ప్రజలకి సౌకర్యవంతంగా, ప్రజలని రక్షించేవిధంగా ఉండేది. అతడు తన రాజ్యంలోని ప్రజలని ప్రేమించేవాడు, అన్ని విధాలా రక్షించేవాడు. ప్రతిగా ప్రజలూ అతణ్ణి ప్రేమించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు.

ఒకరోజు భోజరాజు, తన ప్రధానమంత్రి బుద్ది సాగరుణ్ణి పిలిచాడు. బుద్ది సాగరుడు మంచివాడు, మేధావి, వివేకం గలవాడు. బుద్దిసాగరుడు అంటే సాగరము వంటి గొప్పబుద్ది కలవాడు, బుద్దికి సాగరము వంటి వాడు అని అర్ధం! అతడా పేరుకు తగినవాడు.

భోజరాజు "ప్రియమైన ప్రధానమంత్రి, బుద్ది సాగరా! మన గూఢచారులు తెల్పిన సమాచారం ప్రకారం, మన గ్రామీణులు కౄర, వన్య మృగాల వలన బాధలు పడుతున్నారు. అరణ్యాలు దట్టంగా ఉన్నాయి. వన్య, కౄర మృగాల సంఖ్య బాగా పెరిగిపోయింది. దాంతో అడవి మృగాలు పచ్చని పొలాలని నాశనం చేస్తున్నాయి. కౄర మృగాలు అమాయక గ్రామీణులని, వారి పెంపుడు జంతువులని గాయపరుస్తున్నాయి. ప్రజలని కాపాడటం మన ధర్మం! అందుచేత రేపటి రోజున వేటకు వెళ్ళాలని నిశ్చయించాను. అందుకు తగిన ఏర్పాట్లు చేయండి. మన సైన్యంలో నుండి కొన్ని దళాలని సమాయత్త పరచండి. నగరంలో ఉత్సాహం గల యువకులని, వేటకు రావలసిందిగా దండోరా వేయించండి" అని అజ్ఞాపించాడు.

బుద్దిసాగరుడు చిరునవ్వుతో "చిత్తం మహారాజా! రేపటి ఉదయానికల్లా వేటకి అన్ని ఏర్పాట్లు చేస్తాను" అన్నాడు.

మరునాటి ఉదయానికి భోజరాజు వేట కెళ్ళేందుకు సిద్దమయ్యాడు. ఉత్సాహం గల చాలామంది యువకులు వేటకు తగిన ఆయుధాలు.... కత్తులూ, విల్లంబులూ, ఈటెలూ ధరించి, కోట ముందు సమావేశమయ్యారు. వారి కేరింతలతో అక్కడంతా సందడిగా ఉంది. సైనికులూ, యువకులూ కదం తొక్కుతూ, గొంతెత్తి పాడుతున్నారు. సంగీత పరికరాలతో పాటకు అందుకనుగుణంగా తాళం వేస్తున్నారు. వాళ్ళ పాటల రాగాలు శ్రోతల్ని ఉర్రూతలూగిస్తున్నాయి. రజోగుణాన్ని ప్రేరేపిస్తూ రోమాంచితం చేస్తున్నాయి. అక్కడంతా పండగ వాతావరణం వెలిసింది.

[మానవ మనస్తత్వాన్ని భగవద్గీత, మూడు రకాలుగా నిర్వచిస్తుంది. సత్త్వం, రజస్సు, తమోగుణం. మనుషులందరిలో ఈ మూడు గుణాలూ ఉంటాయి. రజస్తమో గుణాల కంటే సత్త్వ గుణం ఎక్కువగా ఉన్నవారిలో.... సహనం, జ్ఞానం, శాంత స్వభావం, అహింసాతత్త్వం వంటి లక్షణాలు ఉంటాయి. రజోగుణం ఎక్కువగా ఉన్నవారిలో.... ధైర్యసాహసాలు, పోరాటపటిమ, నాయకత్వ స్ఫూర్తి వంటి లక్షణాలు ఉంటాయి. తమోగుణం ఎక్కువగా ఉన్నవారిలో.... అవివేకం, వితండవాదం, సోమరితనం, నిద్ర వంటి లక్షణాలు ఉంటాయి.]

ఈ విధంగా రజోగుణ ప్రవర్ధమాన పరిస్థితులలో.... భోజరాజు, మంత్రి బుద్దిసాగరుడు, సైనికులూ, యువకులూ వేటకు బయలు దేరారు. అరణ్యప్రాంతం చేరారు. అరణ్య మధ్యంలో విడిదిని ఏర్పాట్లు చేసుకున్నారు. రాత్రివేళల విశ్రాంతికి, విందు వినోదాలకి గుడారాలు నిర్మించుకున్నారు.

పగటి వేళల్లో అడవి జంతువుల వేట కొనసాగించారు. డప్పు వంటి వాయిద్యాలని గట్టిగా మోగిస్తూ అరణ్య మృగాలని భయపెట్టారు. భయంతో వాటి ఆవాసాల నుండి బయటికొచ్చి పరుగులు తీస్తున మృగాల వెంటబడి వధించారు. కొందరు సైనికులు, రజోగుణ పూరిత రాగాలు మ్రోగిస్తుండగా.... భోజరాజు, అతడి పరివారమూ రణోత్సాహం వంటి హుషారుతో అరణ్యమృగాలని వేటాడారు. ఆ వేట అందర్నీ ఎంతో ఉత్సాహ పరిచింది. అందరూ దాన్ని ఎంతో ఆస్వాదించారు.

[ప్రాచీన కాలంలో పాలకులకి, సంపన్నులకి, ప్రజలకి వేట ఎంతో ప్రీతిపాత్రమైనదై ఉండేది. అప్పట్లో అరణ్యాలు దట్టంగా విస్తారంగా ఉండేవి. అడవి జంతువుల సంఖ్య, ప్రజల కంటే ఎక్కువగా ఉండేది. దాంతో ప్రజల, పెంపుడు జంతువుల ప్రాణాలకు, అడవి జంతువుల నుండి ప్రమాదం ఉండేది. జింకలూ, దుప్పుల వంటి సాధుజంతువులు పొలాల మీద పడి మేసేవి. భల్లూకాలు, కుందేళ్ళు దుంప పంటలని తవ్వి పారేసేవి. ఏనుగుల గుంపులు వంటివి, చెఱకు వంటి పైర్లను పీకి పాకాన పెట్టేవి.

వాటిని నియంత్రించటానికి వేట అనివార్యమై ఉండేది. ఇప్పటి స్థితి దీనికి విపర్యయం. ఇప్పుడు అడవుల కంటే అడవి ప్రాణుల కంటే జనాల సంఖ్య ఎక్కువ! ఇప్పుడు మనిషి నుండి జంతువులకి ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు అడవులని సంరక్షించడం, అడవి జంతువులని సంరక్షించడం అనివార్యమైంది. కాబట్టి ఇప్పుడు వేట నిషిద్దం. అప్పుడు వేట వినోదం!]

భారతీయ సంస్కృతీ సంపద [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 01]

భారతీయ జానపద కథలు!

అది నిజంగా భారతీయ సంస్కృతీ సంపద!

వారసత్వంగా సంక్రమించిన సుందర సారస్వతం!

సాహితీ విలువలతో, రమణీయ పదబంధాలతో, వ్యాకరణాత్మకంగా, సంగీత భరితంగా, రసభరితంగా అలరారే కావ్యాలూ, నాటకాలు, కీర్తనలూ, కృతులూ!

ఇక[ఒకప్పుడు] రామాయణ భారతాలు భారతీయులకు సర్వేంద్రియాలు. ఏ విషయాన్నైనా చూసేది, వినేది, ఆఘ్రాణించేది, ఆస్వాదించేది రామాయణ భారతాలనే కళ్ళు, చెవులు, నాసికా నాలుకలతోనే!

కవులని, అందునా భక్త కవులని సాక్షాత్తూ భగవంతుడి స్వరూపం గానే కొలుస్తారు భారతీయులు. భారత కర్త వేదవ్యాసుణ్ణి శంకరరూపుడిగా సేవిస్తే... రామాయణ కర్త వాల్మీకిని ఆదికవిగా ఆదరిస్తారు.

వాల్మీకి గురించి ఎంత అందంగా అనుభూతిస్తారో చూడండి.

కూజంతం రామ రామేతి I మధురమ్ మధురాక్షరమ్ II
ఆరుహ్య కవితా శాఖాం I వందే వాల్మీకి కోకిలమ్ II

కవిత్వమనే చెట్టు కొమ్మపై కూర్చొని, వాల్మీకి అనే కవికోకిల, మధురమూ మధురాక్షరమూ అయిన రామనామాన్ని పాడుతోందట! ఎంత సౌందర్య సంపూర్ణ ఆస్వాదనో!

రామాయణ భారతాలు ఇతిహాసాలైతే....భారతీయ జనసామాన్యంలోకి చొచ్చుకుపోయిన జానపద సాహిత్యమూ పేరెన్నిక గన్నదే! ప్రజలని ప్రభావ పరిచినదే!

అలాంటి జానపద సాహిత్యంలో.... భట్టి విక్కమార్కుల కథలది ప్రత్యేక స్థానం. విక్రమాదిత్యుడు మహారాజు, భట్టి ఆయనకు మహామంత్రి. విక్రమాదిత్యుడి గొప్పతనమూ, ఆయనకు సోదరుడూ మంత్రీ కూడా అయిన భట్టి మేధావిత్వం గురించిన కథలివి.

ఈ కథలు దాదాపు 365 ఉండేవి. రోజుకో కథ చెప్పుకుంటే, పూర్తికావటానికి సంవత్సరం పడుతుంది. ఇప్పుడు కొన్ని కథలే లభ్యమౌతున్నాయి. ఒక కథలో నుండి మరో కథ, కంఫ్యూటర్ లో మనం ఒక విండో లోంచి మరో దానిలోకి, ఒక ఫోల్డర్ లోంచి మరో దాన్లోకి ప్రయాణించినట్లుగా ఉంటుంది. కథల నిండా అద్భుతరసమే! సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే సంఘటనలు, కథల్లో మలుపులు, స్ఫూర్తి నింపే సాహసాలు, చక్కని వర్ణనలతో పాటు, సాహసాలు, వితరణ శీలం, ఇతరులకు సహాయపడటం వంటి మానవ సహజ సుగుణాలకు ప్రాధాన్యత కనబడుతుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే - ఈ కథలలో అవధుల్లేనంతటి ఊహాశక్తితో, అజ్ఞాత కవి ఎవరో, మనల్ని అద్భుతలోకాల్లోకి.... అతివేగంగా, అతి రమ్యంగా తీసికెళతాడు.

ప్రాచీనకాలంలో, సంస్కృత లిపిలో ‘భట్టి విక్రమార్క సంవాదం’ పేరిట ఒక గ్రంధం ఉండేదట. కాలక్రమంలో దాని లభ్యత మృగ్యమైంది. తెలుగులోకీ, ఇతర భాషల్లోకీ ఈ కథల అనువాదాలున్నాయి. చాలా కథలు, తరం నుండి తరానికి ‘అమ్మమ్మ తాతయ్యల దగ్గర కథలు చెప్పించుకోవడం’ రూపేణా సంక్రమించాయి.

వీటిల్లో కొన్ని కథలని, పిల్లల పుస్తకాలలో చదివాను. భట్టి విక్రమార్క పేరుతో గ్రాంధిక భాషలో ఉన్న పుస్తకాన్ని, తొలిగా నా పదకొండవ ఏట చదివాను. కొన్ని కథలు సినిమాలుగా చూశాను. [చదివిన వాటితో పోల్చుకుంటే సినిమాలు పరమ చప్పగా ఉన్నాయి.] ఈ కథలని నేనెంతగా ఆనందించానంటే - చిన్నప్పటి నుండీ వీటిని మా అమ్మనాన్నలకి, మా వీధిలో అందరికీ చెప్పాను.

స్కూల్లో చదివేటప్పుడు ఈ కథలు చెప్పినందుకు ప్రతిఫలంగా, నా నేస్తాలు నా పుస్తకాల పెట్టె మోసిపెట్టేవాళ్ళు, వాళ్ళ తాయిలాల్లో వాటాలిచ్చేవాళ్ళు. మా పాపకి, నా శిష్యులకీ... అందరికీ చెప్పాను.

ఎప్పుడు ఎవరికి చెప్పినా.... శ్రోతల్లో ఎంతో సంభ్రమాశ్చర్యాలూ, సంతోషమూను! చెప్తూ నేనూ ఎంతో ఆనందించేదాన్ని. మా పెళ్ళైన కొత్తలో మా వారూ నేనూ కూడా, ఎంచక్కా ఈ కథలు చెప్పేసుకున్నాం. మరి అద్భుతరసంతో నిండిన ఊహకందని మలుపులున్న కథలవి! ఎన్నిసార్లు ఆనందించినా విసుగెత్తదు.

అందుకే పిల్లలూ పెద్దలూ అందరికీ చెప్పేదాన్ని. నిజానికి నేను, పిల్లలకి చెప్పడం ప్రారంభించేదాన్ని. కాస్సేపయ్యాక చూస్తే చుట్టూ పెద్దలు కూడా చేరి ఉండేవాళ్ళు. ఇది నన్నెంత ఉత్సాహ పరిచేదంటే - ఆ కథలని నా పద్దతిలో, చిన్న చిన్న మార్పులు చేసి చెప్పేదాన్ని.

నిజానికి ఈ కథలు, పిల్లల్లో చక్కని వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ధృఢమైన, నిర్దిష్టమైన వ్యక్తిత్వాన్ని! ఇలాంటి కాల్పనిక కథలు చదవటం రీత్యా, పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది. తమదైన ప్రపంచాన్ని ఆనందిస్తారు. దాంతో సృజనాత్మకత పెరుగుతుంది. ధైర్య సాహసాలు, పట్టుదల, సహనం, పెద్దల పట్ల వినయం, భక్తి, నమ్మకం వంటి మానవీయ విలువలు అలవడతాయి.

అంతేకాదు, తార్కిక ఆలోచన, సునిశిత పరిశీలన, విషయ విశ్లేషణ, సాహసాలకు పూనుకోవటం, సవాళ్ళను స్వీకరించటం వంటి లక్షణాలూ గ్రహిస్తారు. ఈ కథలు వాళ్ళని చక్కని మార్గంలో నడిపిస్తాయి. భావప్రసార శక్తిని పెంపొందిస్తాయి. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించాలి, ఎలా ప్రభావితుల్ని చేయాలి, ఎలా స్ఫూర్తిపూరితులని చేయాలి, ఇతరులని ఎలా ఒప్పించి తమ మార్గంలోకి తెచ్చుకోవాలి, ఎలా సంతోషపరచాలి... ఇలాంటివన్నీ! వీటితో పాటు.... సమయోచితంగా, సందర్బోచితంగా, హాస్య స్ఫూరకంగా ఎలా మాట్లాడాలో కూడా!

ఈ కథలు పూర్తయ్యేసరికల్లా, కథనాయకులైన భట్టి, విక్రమాదిత్యులు పిల్లలకు ఆదర్శం, ‘రోల్ మోడల్స్’ అయిపోతారు. వాళ్ళలాగే తామూ అన్నీ కళలనీ, జ్ఞానాన్ని నేర్చేసుకోవాలనిపిస్తుంది.

నిజానికి ఈ కథల సృష్టికర్త ఎవరో తెలియదు. భట్టి విక్రమార్కులు ఉజ్జయినీ నగరాన్ని, వేల సంవత్సరాల పాటు పరిపాలించిన మంత్రి, చక్రవర్తులని నమ్మకం. అతిశయోక్తులున్నా అది చారిత్రక సత్యం అంటారు. కల్పనలు జోడించబడినా, ఈ కథలు పిల్లల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

ఈ కథల ప్రభావం నామీద చాలా ఉందని నేను అనుకుంటాను. చదువరుల మీద ఈ కథలు వేసే ముద్ర బలమైనది. ఎన్నోసార్లు ఈ కథలని ఎందరికో చెప్పాను. ఇప్పుడు మళ్ళీ బ్లాగ్లోకంలో, మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. ఇంతకు ముందు ఇంగ్లీషులో సగభాగం వ్రాసాను.

మీ ఇళ్ళల్లోని చిన్నారులకి, ఈ మజాని పంచుతారని ఆశిస్తూ.... దఫాలుగా ఈ కథా పరంపర....!

దేవుడు దయతో చూస్తే ఏమైనా జరగవచ్చు!

ఓ రోజు తైమూర్ సభతీర్చి ఉన్నాడు. సభికుల్లో నసీరుద్దీన్ కూడా ఉన్నాడు. సభలో ఇష్టాగోష్టి నడుస్తోంది. తైమూర్ కి కొంత తలతిక్క[తాను రాజునన్న అహంకార మాన్నమాట] ఉంది. పిసినారి, అసూయాపరుడు కూడా. ప్రజల్లో నసీరుద్దీన్ కి ఉన్న మంచిపేరు, ఆదరణ పట్ల తైమూర్ కి చాలా దుఃఖంగా ఉండేది.

ఆరోజు చర్చ చదువులు మీదికి మళ్ళింది. మొద్దు పిల్లలకు, మూర్ఖులకు చదువు చెప్పటం అసాధ్యం అన్నారు కొందరు. అదేం లేదు, ఓపికగా నేర్పితే ఎలాంటి వారికైనా చదువు చెప్పవచ్చు అన్నారు కొందరు. వాదన తారాస్థాయికి అందుకుంది.

ఇంతలో నసీరుద్దీన్ “ఏలిన వారు చిత్తగించాలి. ఈప్రపంచంలో ఏదీ అసాధ్యం కాదు. సాధింపబడేవరకూ ప్రయత్నించాలి, అంతే. ఓపికగా చెబితే నా గాడిదకి సైతం చదువు నేర్పవచ్చు” అన్నాడు.

తైమూర్ కి నసీరుద్దీన్ పనిపట్టడానికి అదే తగిన అవకాశం అన్పించింది. “అయితే నీగాడిదకి చదువు నేర్పగలవా?" అన్నాడు సవాలు చేస్తున్నట్లుగా.

"తప్పకుండా. కాకపోతే కొంత సమయం పడుతుంది. మరికొంత ఖర్చువుతుంది” అన్నాడు నసీరుద్దీన్.

"ఎంత సమయం కావాలి? ఎంత డబ్బుకావాలి?" మరుక్షణం ప్రశ్నించాడు తైమూర్.

"సంవత్సరం పడుతుంది. రోజుకి వంద బంగారు దీనార్ లు ఖర్చువుతుంది” నింపాదిగా చెప్పాడు నసీరుద్దీన్.

‘చచ్చింది గొర్రె !’ మనసులో అనుకున్నాడు తైమూర్.

"నసీరుద్దీన్! బాగా ఆలోచించుకో. సంవత్సరం తర్వాత నీ గాడిదకి చదువురాలేదనుకో, నీకు మరణశిక్ష తప్పదు” అన్నాడు తైమూర్ గంభీరంగా.

సభికులంతా ఉత్కంఠగా చూడసాగారు. నసీరుద్దీన్ చిన్నగా నవ్వుతూ “ఏలిన వారు చిత్తగించాలి. సంవత్సరం తర్వాత నా గాడిద ఓ ఉద్ర్గంధాన్ని చదవటం తమరు చూడవచ్చు. దీనారాలిప్పించండి” అన్నాడు.

తైమూర్ నసీరుద్దీన్ కు 36,500 బంగారు దినార్ లు ఇప్పించాడు. అందరూ ఆ దిగ్ర్బాంతి నుండి తేరుకునే లోపలే నసీరుద్దీన్ సంతోషంగా డబ్బుమూట తీసుకొని గాడిదనెక్కి ఇంటికెళ్ళి పోయాడు.

విషయమంతా విన్న నసీరుద్దీన్ భార్య నెత్తినోరు బాదుకుంది. “గాడిదకి చదువెల చెబుతావు? తైమూర్ తో తమాషాలా? సంవత్సరం తర్వాత ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంటావా? డబ్బుకోసం ఇంతపని చేస్తావా? నీకేమైనా అయితే మేమంతా ఎలా బ్రతకాలి? ” అంది.

నసీరుద్దీన్ “ఓసి పిచ్చిదానా! ఇప్పటి వరకూ తైమూరే మూర్ఖుడనుకున్నాను. నువ్వు కూడానా! సంవత్సరం సమయం ఉంది. ఈ లోపున రోజుకి వందచొప్పన 36,500 ల బంగారు దీనార్ లు ముట్టాయి. ఆనందించక, ఎప్పుడో ఏదో అవుతుందని ఏడుస్తావేం? దేవుడు దయతో చూస్తే ఏడాది లోపల ఏమైనా జరగవచ్చు. నేనే చచ్చిపోవచ్చు. తైమూరే చచ్చిపోవచ్చు. ఈ గాడిద చచ్చినా చచ్చిపోవచ్చు. లేదా ఈ గాడిద చదవనైనా చదవవచ్చు. నిశ్చింతగా ఉండు” అనేసి వెళ్ళిపోయాడు.

తైమూర్ ఇచ్చిన డబ్బుతో రోజులు హాయిగా నడుస్తున్నాయి. పాపం! నసీరుద్దీన్ అన్నట్లు ఏవీ జరగలేదు. 11 నెలలు గడిచిపోయాయి. ఇంక ఒక నెల గడువు మిగిలింది. నసీరుద్దీన్ భార్య లబోదిబో మనసాగింది.

ఇక తప్పదన్నట్లు నసీరుద్దీన్ తీవ్రంగా ఆలోచించాడు. అతడికో ఉపాయం స్పురించింది. గాడిదని తీసుకొని గదిలోకి వెళ్ళి తలుపువేసుకున్నాడు. లోపలేం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. నెలరోజులు గడిచిపోయాయి. నిర్ణీతగడువు రోజున గాడిదనెక్కి నసీరుద్దీన్ సభకి వచ్చాడు. ‘గాడిద చదవటం’ అన్న వింత చూసేందుకు ఆరోజు సభకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు.

తైమూర్ సభకు వచ్చాడు. లోలోపల అనుమానంగా ఉంది. ‘ఈ నసీరుద్దీన్ కాలాంతకుడు. ఏదో చేస్తాడు’ అనుకుంటూ లోపల పళ్ళునూరుకున్నా పైకి చిరునవ్వునవ్వుతూ కూర్చున్నాడు.

నసీరుద్దీన్ “హుజూర్! చూడండి నా గాడిద చదువుతుంది” అంటూ తన గాడిద ముందు ఓ పెద్ద పుస్తకాన్ని ఉంచాడు. గాడిద ఒకో పేజీ తెరచి, నాలుకతో ఆ పేజీ అంతా నాకడం, మరో పేజీ తెరవటం, మళ్ళీ ఆ పేజీ నాకడం……. ఇలా పుస్తకం మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకూ తిరగేసింది. అది చూసి అబ్బురంతో ప్రజలంతా చప్పట్లు చరిచారు.

వాస్తవం ఏమిటంటే నసీరుద్దీన్ గాడిదని నెలరోజులుగా గదిలో పెట్టి దాని ముందు పెద్ద పుస్తకం పెట్టాడు. ఒకో పేజీలో గుప్పెడు ఓట్స్ గింజలు పోసాడు. గాడిద ఆ గింజల్ని నాలుకతో నాకి తినేటట్లు శిక్షణ ఇచ్చాడు. రుచికరమైన ఓట్స్ గింజలు దొరకటంతో గాడిద తేలిగ్గానే పేజీలు తిప్పటం నేర్చుకుంది. గింజలు గాక, పేజీలు తినేసినప్పుడు దానికి శిక్షలు పడేవి. అందునా పేజీలు తిప్పుతూ గింజలు మాత్రమే నాకి తినేస్తే తర్వాత దానికి రుచికరమైన దాణా పెట్టబడేది. దాంతో గాడిద ఎంచక్కా ఉద్ర్గంధం పేజీలు తిప్పటం నేర్చేసింది.

అయితే గాడిద ఇలా పేజీలు తిప్పిమరీ పుస్తకం చదివేసరికి తైమూర్ కి ఏడుపొచ్చేసింది. నసీరుద్దీన్ కి మరణ శిక్ష వేయచ్చు, అధమం దేశ బహిష్కారమన్నా విధించవచ్చు అనుకుంటే డబ్బులు పోయాయి. దాంతో అక్కసుగా

"గాడిద చదివింది. నిజమే గానీ ఏం చదివిందో మనకెలా తెలుస్తుంది?" అన్నాడు.

నసీరుద్దీన్ “హుజూర్! మన ఒప్పందం ప్రకారం గాడిదకి చదువునేర్పమన్నారే గానీ, చదివింది పైకి చెప్పాలని అనుకోలేదు గదా! కావాలంటే మరో ఏడాది గడువూ, రోజుకి వంద బంగారు దినార్ లూ ఇప్పించండి. ఈ సారి నా గాడిద తను చదివింది పైకి చెప్పేటట్లు చేస్తాను” అన్నాడు.

ప్రజలంతా ఒక్కసారిగా ఆమోదయోగ్యంగా చప్పట్లు చరిచి, హర్షధ్వానాలు చేసారు. దాంతో తైమూర్ మరోసారి 36,500 బంగారు దినార్ లు ఇచ్చి, సంవత్సరం గడువిచ్చాడు. మరో ఏడాది నసీరుద్దీన్ హాయిగా గడిపేసాడు. సంవత్సరం తర్వాత మునుపటి లాగే సభకి గాడిదనెక్కి వచ్చాడు. ప్రజలంతా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ‘ఈసారి నసీరుద్దీన్ ఓడిపోవటం ఖాయం’ అనుకుంటూ ఆనందంగా వచ్చాడు తైమూర్.

నసీరుద్దీన్ “ఏలిన వారు చిత్తగించాలి” అంటూ గాడిద ముందు పెద్ద ఉగ్ర్గంధంపెట్టాడు. మునుపటిలాగే గాడిద ఒకో పేజీ తిప్పటం, నాలుకతో పేజీనంతా నాకటం, ఆ పైన నసీరుద్దీన్ వైపు చూసి ‘బే’ అంటూ ఓండ్రపెట్టటం చేసింది. ప్రజలంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు.

జరిగిందేమిటంటే నసీరుద్దీన్ రోజూ గాడిదకి పుస్తకం పుటలలో గింజలు పెడుతూ, మధ్య మధ్యలో ఒకరోజు గింజలు పెట్టడం మానేసేవాడు. దాంతో అది గింజలు పెట్టని రోజునా ఒకో పుటా తిప్పతూ గింజలు లేవన్న సూచనగా నసీరుద్దీన్ వైపు చూసి అరుస్తుండేది. తర్వాత నసీరుద్దీన్ దానికి మంచిదాణా ఇచ్చేవాడు. ఈవిధమైన శిక్షణతో గాడిద బాగా అలవాటుపడింది.

అయితే గాడిద ఇలా పేజీలు తిప్పి అరవడంతో తైమూర్ ఉడికిపోయాడు.

"నసీరుద్దీన్! ఇదేమిటి ఇదేం చదివిందో పైకి చెప్పమంటే ఇలా ఓండ్రపెడుతోంది?” అన్నాడు.

నసీరుద్దీన్ “హుజూర్! తానేం చదివిందో తన భాషలో చెబుతోంది. మనభాషలో చెప్పాలని మనం ముందుగా షరతు పెట్టుకోలేదుగా” అన్నాడు. తైమూర్ కి కోపంతో పిచ్చెక్కినంత పనయ్యింది. కానీ ఏం చేస్తాడు? పైకి ఏమీ అనలేని పరిస్థితయ్యె.

దాంతో “అయితే ఈసారి నీగాడిద తను చదివింది మన భాషలో చెప్పేలా శిక్షణ నివ్వగలవా?" అన్నాడు కసిగా.

నసీరుద్దీన్ చల్లగా నవ్వుతూ “మన్నించాలి హుజూర్. రెండేళ్ళుగా చదువుచెప్పి చెప్పి నేనూ, నేర్చుకుని నా గాడిదా బాగా అలిసిపోయాము. కొంతకాలం విశ్రాంతి తీసుకున్నాక అప్పుడు చూద్దాం” అన్నాడు.

ప్రజలంతా ఒక్కపెట్టున చప్పట్లు చరిచారు. తైమూర్ లోలోపల ఏడుపుతో కుళ్ళిపోతూ పైకిమాత్రం నసీరుద్దీన్ ని అభినందించాడు.

ఇదీ కథ!

విద్య పరమార్ధం ఏమిటి?

‘విద్యలేని వాడు వింత పశువు’ అన్నారు పెద్దలు.

అసలు విద్యంటే ఏది? దాని పరమార్ధం ఏమిటి?

పశువు స్థాయినుండి మనిషిగా రూపాంతరం చెందించే ఆ ‘విద్య’ ఏమిటి?

ఫ్యాషన్ పేరిట కురచదుస్తులతో శరీరప్రదర్శనలూ, మత్తుపదార్ధసేవనం వల్ల తూలిన ప్రవర్తనలతో మనిషి ఏ ‘స్థాయి’కి పరిణమిస్తున్నాడు?

ఆ స్థాయికి తీసికెళ్ళెదాన్ని ‘విద్య’ అనాలా, ‘అవిద్య’ అనాలా?

ఆదిమానవుడు, ప్రకృతిలోని శీతోష్ణస్థితుల నుండి శరీరాన్ని కాపాడు కునేందుకు కవచంగా దుస్తుల్ని కనుగొని ధరించాడు. క్రమంగా శరీరాన్ని కప్పుకోవడంలో సభ్యతనీ, సంస్కారాన్ని గుర్తించగలిగాడు. కాబట్టే జంతుస్థాయినుండి వేరుపడ్డాడు. గుహల నుండి గృహ నిర్మాణాల దాకా పయనించాడు. అది పురోగమనం.

మనిషిని జంతుస్థాయి నుండి వేరు చేసింది ‘విద్య’.

అయితే నేడు?

విద్యకు పరమార్ధం ఉద్యోగం.

విద్యకు చివరి గమ్యం ఉపాధి.

చదువుకునేది డబ్బు సంపాదన కోసమే.

ఒకసారి ఉద్యోగమో, ఉపాధో సంపాదిస్తే ఇక అక్కడితో చదువుకోవటానికి, విద్యా సముపార్జనకీ పుల్ స్టాఫ్ పడుతుంది. ఇదేనా చదువంటే? ఇదేనా విద్యంటే?

ప్రతి పిల్లీ, తన కూనలకి ఎలుకలని ఎలా వేటాడాలో నేర్పుతుంది.

ప్రతి కోతీ, తన పిల్లలకి ఇళ్ళ పెరళ్ళల్లోకి చెట్లమీది జామకాయలూ, మామిడికాయలూ ఎలా తెంపుకోవాలో, ఇంటి వాళ్ళు వెంటపడి రాళ్ళు విసిరితే ఎలా తప్పించుకోవాలో నేర్పుతుంది.

అలాగే మనమూ మన పిల్లలకి [ఉద్యోగమో, ఉపాధి] జీవన భృతి సంపాదించుకునే విద్యని నేర్పుతున్నాం. అంతే!

ఒకప్పుడు కుటుంబవృత్తులుండేవి. ఓ రైతు బాలుడు తన తండ్రి, తాతల దగ్గర వ్యవసాయపు మెళకువలు నేర్చుకునేవాడు. అందుకు ఫీజులు అక్కర్లేదు, సర్టిఫికేట్లు అక్కర్లేదు. ఓ అమ్మాయి తన అమ్మ, అమ్మమ్మల దగ్గర హౌస్ కీపింగ్, ఛైల్డ్ కేరింగ్ నేర్చుకునేది. దానికీ ఫీజులు అక్కర్లేదు, సర్టిఫికేట్లు అక్కర్లేదు.

ఓ వడ్రంగి, ఓ తాపీ మేస్త్రి, ఓ మెకానిక్ ఆయా వృత్తుల్లో రాణిస్తున్న మేస్త్రిల దగ్గర శిష్యరికం చేసి ఆయా విద్యల నేర్చి పొట్టపోసుకొనేవారు. పొట్టకూటి విద్య పరమావధి అక్కడికే. జీవనోపాధి సంపాదించుకోవటంతో ఆగిపోతే పిల్లికూనకీ, మనకీ తేడా ఏమిటీ? కోతి పిల్లకీ, మన పిల్లలకీ వ్యత్యాసం ఏమిటి?

అసలు విద్య పరమార్ధం పొట్టకూడు సంపాదించటమేనా?

ఎంతమాత్రంకాదు.

వాస్తవానికి – ఏవిద్య అయితే మనిషిని చెడు ఆలోచించకుండా, చెడు చేయకుండా నిరోధిస్తుందో అదే అసలైన విద్య. అదే అసలైన చదువు. ఏవిద్య అయితే మనిషిని అహంకారం నుండి దూరం చేస్తుందో, ఆరిషడ్వర్గాల నుండి దూరం చేస్తుందో అదే అసలైన విద్య. అదే అసలైన చదువు. ఈ నిజాన్ని మన కళ్ళకి కట్టినట్లు చెప్పే ఓ చిన్నకథ చెబుతాను.

అవి ధారా నగరాన్ని భోజమహారాజు పరిపాలిస్తున్న రోజులు. స్వయంగా కవీ, పండితుడు అయిన భోజరాజు ఆస్థానంలో చాలామంది కవి పండితులుండేవాళ్ళు. మహాకవి కాళిదాసు వంటి గొప్ప వారుండేవారు.

అలాంటి భోజరాజు ఆస్థానంలో ఓ సంస్కృతి పండితుడు ఉండేవాడు. ఇతడు బహు కుటుంబీకుడు. అతడి దురదృష్టమేమో గాని రాజుగారి దృష్టి ఇతడి మీద అంతగా పడలేదు. రాజుని మెప్పించే అవకాశాలు అతడి కంతగా రాకపోవటం చేత, రాజ సన్మానం తక్కువుగా ఉండడం చేత అతడికి ఆర్దికంగా చాలా ఇబ్బందులుండేవి.

ఈ దారిద్ర్య బాధ పడలేక ఓరోజు అతడు రాజ ప్రాసాదం నుండి ఏవైనా విలువైన వస్తువులు దొంగిలించాలనుకున్నాడు. ఓరోజు రాత్రి, కొన్ని ద్వారాల దగ్గరి కాపాలా భటుల కనుగప్పి, కొన్ని ద్వారాల దగ్గరి కాపాలా భటులకి రాజుగారే తనని రమ్మన్నారని నమ్మబలికి, రాజు గారి అంతఃపురాన్ని చేరాడు. వెంట ఓపెద్ద సంచీ కూడా తెచ్చుకున్నాడు, దొంగిలించిన సొమ్ము వేసుకుపోవడానికి.

మొదట అతడికి ఓ మూల బల్లపై అలంకారార్ధమై పెట్టి ఉంచిన స్వర్ణప్రతిమ కనబడింది. దాన్ని ఎత్తి సంచిలో పెట్టుకోబోయాడు. అంతలో అతడికి తాను చదివిన గ్రంధాల నుండి ‘బంగారు బొమ్మని దొంగిలిస్తే నరకలోకాధిపతి యముడు 7 ఏళ్ళ సుదీర్ఘ కాలం శిక్షవేస్తాడని’ చెప్పే శ్లోకం గుర్తుకువచ్చింది. అంతే! చేతులాడలేదు. బొమ్మని యధాస్థానంలో ఉంచాడు.

అంతలో పరిచారకులు రావటంతో మూలన నక్కాడు. మరికొంత సేపు గడిచింది. అంతా సద్దుమణిగాక దారిద్రపీడితడైన ఈ పండితుడు మళ్ళా వెదుకులాట ప్రారంభించాడు. ఈసారి రాజుగారు ధరించే వజ్రాల హారం కనబడింది. నిశ్శబ్ధంగా దాన్ని తీసి సంచిలో వేసుకోబోయాడు. అభరణాలు దొంగిలిస్తే నరకంలో 12 ఏళ్ళు శిక్షపడుతుందన్న శ్లోకం గుర్తుకొచ్చింది. మళ్ళీ ప్రయత్నం విరమించుకున్నాడు.

ఉత్తచేతులతో ఇంటికెళ్తే, ఇంట్లో అవసరాలు గుర్తుకొచ్చాయి. మళ్ళీ ప్రయత్నించటం, తప్పుచేస్తే భగవంతుడు దండిస్తాడని చెప్పే శ్లోకం గుర్తుకురావటం, అంతటితో ఆగిపోవటం. రాత్రంతా ఎన్ని వస్తువులపై చెయ్యి వేసాడో, అన్నిటినీ అప్పుడే యధాస్థానంలో పెట్టేస్తూ గడిపేశాడు.

వేకువయ్యింది. తొలిఝాము నగారా మ్రోగింది. పండితుడికి కాళ్ళు చేతులూ వణికాయి. భయం ముప్పిరి గొంది. ఏంచెయ్యాలో దిక్కుతోచలేదు. పట్టుబడితే రాజదండన పడుతుంది. చటుక్కున రాజుగారి మంచం క్రిందికి దూరాడు. ఇంతలో రాజు గారి అంతఃపురంలో మంగళ వాద్యాలు మ్రోగాయి. మహారాజు నిద్రలేచి, వళ్ళు విరుచుకుంటూ వెళ్ళి నిలువుటద్దం ముందు నిలుచున్నాడు.

అంతలో వందిమాగధుల స్త్రోత్రపాఠాలు మొదలయ్యాయి. ఆ పొగడ్తలు వినగానే, ఆ మహారాజులో తన సంపద, సామ్రాజ్యం, గొప్పదనం పట్లా, తన అందమైన బలిష్ఠమైన రూపం పట్లా అతిశయం, అహంకారం కలిగాయి. రాజు అద్దం ముందు నిలబడిన భంగిమలో, అతడి దేహభాషలో ప్రతిఫలిస్తున్న ఈ అతిశయం, అహంకారం చూడగానే మంచం క్రింద దాక్కున్న పండితుడికి, తాను చదువుకున్న గ్రంధాల నుండి ’ఈ లోకంలో, జీవితం, అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, అన్నీ ఎంత అశాశ్వతమైనవో, చావు పుట్టుకలెంత సహజమైనవో, పోయేనాడు ఈ సంపద, సౌభాగ్యమూ, రూపలావణ్యభరితమైన శరీరమూ ఎలా వెంటరాదో ’ తెలియ చెప్పే శ్లోకం గుర్తుకు వచ్చింది. ‘ఈ ప్రపంచానికి మనం వీడ్కొలు చెప్పి వెళ్ళేముందు ఏదీ వెంటరాదనీ, చేసుకున్న మంచి చెడులే తప్ప మరేదీ శాశ్వతం కాదని’ చెప్పే శ్లోకాన్ని బిగ్గరగా, స్పష్టంగా పాడుతూ పండితుడు మంచం క్రింది నుండి బయటికొచ్చాడు.

స్వయంగా తాను పండితుడే అయినా భోజ మహారాజు మరుక్షణం ఆ శ్లోకంలోని ఆదర్శప్రాయమైన భావాన్ని గ్రహించగలిగాడు. తనలో పొడసూపిన అతిశయాన్ని, అహంకారాన్ని గుర్తించగలిగాడు. ఎప్పుడైతే గుర్తించగలిగాడో మరుక్షణం అతిశయాన్నీ, అహంకారాన్ని తననుండి పారద్రోల గలిగాడు. ఒకసారి అహంకారం అతడి మనస్సు నుండి దూరమయ్యాక, భోజరాజు ఉదయపు ఆనందాన్ని, సూర్య కిరణాల్లోని నులివెచ్చదనాన్ని, పిల్లగాలి లోని చల్లదనాన్ని, పూల పరిమళాన్ని ఆస్వాదించగలిగాడు.

అప్పుడు స్పురించిందాయనకి పండితుడి ఉనికి. అనువుకాని సమయాన, అనువుకాని చోట, అందునా తన శయన మందిరంలో, తన పడక మంచం క్రిందనుండి బయటి కొచ్చిన పండితుణ్ణి చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. విచారించగా విషయం బోధపడింది. దారిద్ర బాధ ఎంతగా ఉన్నప్పటికీ దొంగతనానికి ప్రయత్నించినందుకు పశ్చాత్తాపపడుతూ పండితుడు నిజం చెప్పేసాడు.

ఈ స్థితికి మహారాజు బాధ్యత వహించాడు. విచారం, పశ్చాత్తాపం వెలిబుచ్చాడు. పండితుడి ఆర్ధికావసరాలని తాను పట్టించుకోనందుకు మన్నింపు కోరాడు. ఉదయాన్నే సత్యం చెప్పి, తన పాండిత్య ప్రతిభతో సరైన శ్లోకాన్ని గుర్తుచేసి, అహంకారం అనే సర్పంబారిన పడబోయిన తనను కాపాడినందుకు కృతఙ్ఞతలు చెప్పుకొని, పండితుడి దారిద్ర్య బాధని తొలగించాడు.

ఇదీ కథ!

ఈ కథ మనకి విద్య,[ఙ్ఞానంతో కూడిన విద్య] మనల్ని మంచిమార్గంలో నడిపిస్తుందనీ, చెడు ఆలోచనలూ, చెడు పనులూ చేయబోయినప్పుడు హెచ్చరించి మంచివైపు మళ్ళిస్తుందనీ చెబుతుంది. ఈ కధలో పండితుడికి తప్పు చేయబోయినప్పుడు చట్టం గుర్తుకు రాలేదు. రాజు గుర్తుకు రాలేదు. భగవంతుడు గుర్తుకు వచ్చాడు. దొంగతనం చేసి పట్టుబడకుండా తప్పించుకుపోగలిగితే సాక్ష్యం లేదు గనుకా, చట్టం ఏంచేయలేదు, రాజూ శిక్షించలేడు. కానీ భగవంతుడికి సాక్ష్యం అక్కర్లేదు. తప్పు చేస్తే విధి తనని శిక్షిస్తుందని పండితుడు భయపడ్డాడు. ఈవిధంగా గుణశీలాలని, నైతికతని నేర్పవలసినది విద్య.

విద్య పరమార్ధం ఇదే. అంతేగాని కేవలం డబ్బు సంపాదన విద్య లక్ష్యం కాదు. సుఖంగా, సౌఖ్యంగా బ్రతకాలని ప్రతి మనిషీ, ప్రతి ప్రాణీ కోరుకుంటాయి. నిజానికి సుఖశాంతులతో బ్రతకడం ప్రతివారి హక్కు కూడాను. ప్రతిమనిషి ‘సౌఖ్యంగా బ్రతకటం’ అన్న గమ్యం కోసమే ప్రయత్నిస్తాడు. అయితే గమ్యంతో పాటు, దాన్ని చేరే మార్గం కూడా ఉన్నతంగానే ఉండాలి కదా!

బ్రతుకు తెరువు జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు.

ఈ నేపధ్యంలో ఒకసారి ఆలోచించి చూస్తే -

మనిషిని మంచి మార్గంలో నడిపించేది విద్య.

చెడు చేయకుండా నిరోధించేది విద్య.

ఈ విద్య మనం నేర్చుకున్నామా? నేర్చుకుంటున్నామా? మన పిల్లలకి నేర్పిస్తున్నామా?

బ్రతుకు తెరువు సంపాదించిపెట్టేది విద్య అయితే అది `డుకృఞ్ కరణే’ మాత్రమే. అలాంటి ‘డుకృఞ్ కరణే’ మనకే కాదు సర్వ జీవులకీ వచ్చు. జింకల నెలా వేటాడాలో పులిపిల్ల నేరుస్తుంది. లేత చిగురాకుల కోసం ఎక్కడ వెదకాలో జింక పిల్లా నేర్చుకుంటుంది.

కానీ మనిషి అంతకంటే ఎక్కువ నేర్చుకోవాలి కదా!

‘డుకృఞ్ కరణే ’ – అసలైన విద్యంటే....

ఆవి 8 వ శతాబ్ధి నాటి రోజులు. ఓనాడు కాశీపుర వీధుల్లో ఆది శంకరాచార్యులు, శిష్యసమేతంగా భిక్షార్ధియై వెళ్తున్నారు. ఓ ఇంటి వీధి అరుగు మీద, డెభై ఏళ్ళ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. పదేపదే గట్టిగా ’డుకృఞ్ కరణే, డుకృఞ్ కరణే’ అని వల్లిస్తున్నాడు. అది వ్యాకరణ సూత్రం. ఇతడు వృద్దుడు. కొన్ని దంతాలు ఊడిపోయి, కొన్ని వదులైపోయి మాట తొసి పోతున్నది. అసలు వ్యాకరణ సూత్రం ధ్వనిమారి, అతడి తొర్రినోట తప్పు పలుకుతున్నది. ముందుకూ వెనక్కీ ఊగుతూ, అతడు దాన్ని బట్టీ వేస్తున్నాడు. ఆ విధంగా సంపాదించిన పాండిత్యాన్ని – ఏ రాజుల ముందో, చక్రవర్తుల ముందో ప్రదర్శించి, సన్మానాలు, సంపదలూ పొందాలన్నది ఆ వృద్దుడి ఆకాంక్ష.

అది చూసి శంకరాచార్యుల వారికి ఆగ్రహం, జాలి కలిగాయి. ఎదుటి వాడు వృద్ధుడు. జీవితపు చివరిదశకు చేరినా సత్యమేమిటో ఇంకా గ్రహించలేకున్నాడు. ఇప్పటికీ సిరిసంపదలంటూ, సన్మానాలంటూ, పరుగులు పెడుతూనే ఉన్నాడు. అది చూసిన మరుక్షణం శంకరాచార్యుల వారినోట

భజగోవిందమ్ భజగోవిందమ్
గోవిందమ్ భజ మూఢమతే
సంప్రాప్తే సన్నిహిత కాలే
నహినహి రక్షతి డుకృఞ్ కరణే

అన్న శ్లోకం పలికిందట.

“ఓరి మూర్ఖుడా! అంత్యకాలం సమీపించినప్పుడు, ఈ లౌక్యపు విద్యలు, ‘ఉపాధి, సంపద’ ఇస్తాయని సాధన చేసిన ఈ కళలు నిన్ను రక్షించలేవు. ఇప్పటికైనా గోవిందుణ్ణి [భగవంతుణ్ణి] భజించు” అని దాని అర్ధం. ముక్కుముఖం తెలియని ఎదుటివాణ్ణి, వయో భేదాన్ని పట్టించుకోకుండా, ఙ్ఞాన భేదాన్ని పరిగణించి, శిష్యుణ్ణి మందలించినట్లుగా ‘మూఢమతే’ అని మందలిస్తూ, సత్యాన్ని బోధించినందుకేనేమో ఆది శంకరుల వారిని జగద్గురువని పిలుస్తారు. భజగోవింద శ్లోకాలు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గాత్ర మాధుర్యంలో రంగరించి చెవులబడుతుంటే ఆత్మ విశ్వపర్యటన చేస్తున్నట్లుంటుంది.

తదుపరి శ్లోకాలలో కొన్ని జగద్గురు ఆది శంకరాచార్యుల వారి శిష్యులు పూరించారట. భజగోవింద శ్లోకాలని విన్నప్పుడు, చదివినప్పుడూ మనస్సులో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి.

ఆ వృద్ధుడు రాజు గారి నుండి ప్రశంసలూ, సన్మానాలు, తద్వారా కానుకలు, సంపదలు పొందాలని, వయసైపోయిన తర్వాత కూడా విద్యలు వల్లిస్తున్నాడు. విద్యా ప్రదర్శనతో, ఎలాగైనా రాజప్రీతిని పొందగలిగితే ఆర్ధికలాభం. ఇదీ ఆలోచన.

నిజానికి మన విద్యాసంస్థల్లో బోధించేది, సర్టిఫికేట్లు లో సూచించేది విద్య అనుకుంటాం గానీ, అది అసలైన విద్యకాదు. అది ’డుకృఞ్ కరణే’ వంటి విద్య మాత్రమే. అసలైన విద్య ఏమిటో, దాని పరమార్ధమేమిటో, నాకు చేతనైనట్లుగా మరో టపాలో వివరిస్తాను.

చిక్కుడు గింజకు చారలెందుకు వచ్చాయంటే!

అనగా అనగా.....

ఓ ఊరిలో ఓ అవ్వ ఉండేది. ఓ రోజు ఆవిడ వంట చేద్దామని పొయ్యి వెలిగించి, పొయ్యి మీద కుండ పెట్టింది. కుండలో కొన్ని నీళ్ళు పోసింది. ఎండుపుల్లలు బాగా మండేందుకు గాను కొన్ని బొగ్గు ముక్కలూ, వరిగడ్డి పోచలూ పొయ్యి పక్కన పెట్టుకుంది.

ఇంతలో ఓ గడ్డిపోచ ప్రక్కకు తప్పించుకుంది. ఓ బొగ్గుముక్క కూడా పొయ్యిలో పడకుండా పక్కకు గెంతింది. కానీ అప్పటికే పాపం దాని ఒంటికి కాస్త సెగ అంటుకుంది. అంతలో పొయ్యి మీది కుండలో నీళ్ళు మరగడం మొదలెట్టాయి. అవ్వ చేటలో కొన్ని చిక్కుడు గింజలు తెచ్చి కుండలో పోసింది. పొయ్యి ముందు కూర్చొని మంటెక్కువ పెట్టసాగింది.

ఇంతలో ఓ చిక్కుడు గింజ చేటలోంచి కుండలోని వేన్నీళ్ళలో పడకుండా తెలివిగా ప్రక్కకు జారి తప్పించుకుంది. చిక్కుడు గింజా, బొగ్గుముక్కా, గడ్డిపీచు కూడబలుక్కున్నాయి.

"అమ్మో. ఇక్కడే ఉంటే ఈ అవ్వ మనల్ని చూడకా మానదు. మంటల్లో వెయ్యక మానదు. పారిపోదాం” అనుకున్నాయి. గోడవారగా జరుగుతూ మెల్లిగా అవ్వ ఇంట్లోంచి బయట పడ్డాయి. వీధి ప్రక్కగా నక్కుతూ నక్కుతూ గాలికి కొట్టుకుపోతున్నట్లుగా నటిస్తూ పారిపోవటం మొదలెట్టాయి. అలా అలా వీధి చివరికి వచ్చేసాయి. వీధి చివర వాటికొక కాలువ అడ్డంగా ఉంది. ఆ చిన్న వీధి కాలువ వాటి ప్రాణానికి గంగా ప్రవాహమంత పెద్దగా కన్పించింది.

ఎలాదాటడం? గడ్దిపోచ, బొగ్గు ముక్కా, చిక్కుడు గింజ తీవ్రంగా ఆలోచించసాగాయి.

“ఐడియా!” ఒక్కసారిగా అరిచింది గడ్డిపోచ.

"ఏమిటి?" ఆత్రంగా అడిగాయి బొగ్గుముక్కా చిక్కుడు గింజా.

"నేను ఈ కాలువకి అడ్డంగా వంతెనలా పడుకుంటాను. నామీదుగా దాటండి మీ ఇద్దరూ!” అంది గడ్దిపోచ ఉత్సాహంగా.

"భలే భలే!” మరింత ఉత్సాహంగా అభినందించింది బొగ్గు ముక్క.

" ముందు నేను దాటుతాను” గోముగా అడిగింది చిక్కుడు గింజ.

గడ్దిపోచ కాలువకి అడ్డంగా పడుకుంది. దాని మీదుగా దాటుతూ చిక్కుడు గింజ ఆవలి వైపుకి చేరిపోయింది.

ఇక బొగ్గు ముక్క వంతు వచ్చింది. మెల్లిగా గడ్దిపోచ మీదకి ఎక్కి కాలవ దాటడం మొదలు పెట్టింది బొగ్గుముక్క. దానికి కొంచెం సెగ అంటుకొని ఉందయ్యె. గడ్డిపోచకి అది సోకింది. అప్పటికే బొగ్గుముక్క సగానికి వచ్చేసింది.

"త్వరగా దాటేయ్! నీ సెగకి నేను కాలిపోయేలా ఉన్నాను” గాబరా పడింది గడ్డిపోచ.

కంగారుగా కిందికి చూసింది బొగ్గుముక్క. సన్నని గడ్డిపోచపై తాను. క్రింద పారుతున్న నీళ్ళు. దెబ్బకి దానికి కళ్ళు తిరిగాయి. కాళ్ళు తడబడ్డాయి. కదల్లేక పోయింది. అది ఒకేచోట ఆగిపోయేసరికి, దాని సెగకి గడ్డిపోచ కాస్తా మధ్యకి తగలబడింది. దెబ్బకి కాలువలోకి రెండు ముక్కలుగా విరిగిపోయింది. దాంతో బొగ్గుముక్క నీళ్ళల్లో పడిపోయింది. పాపం రెండూ నీళ్ళల్లో కొట్టుకు పోతూ కేకలు పెట్టసాగాయి.

ఇదంతా చూసి ఒడ్డునున్న చిక్కుడు గింజ విరగబడి నవ్వింది. పడీ పడీ నవ్వింది. పొట్టపట్టుకొని పగల బడి నవ్వింది. క్రిందపడి దొర్లి దొర్లి నవ్వింది. ఆ దెబ్బకి దాని పొట్ట కాస్తా పగిలిపోయింది.

దాంతో అప్పటిదాకా నవ్వుతూ తుళ్ళుతూ, ఉన్న చిక్కుడు గింజ కాస్తా కుయ్యో మొర్రో మంటూ ఏడవటం మొదలు పెట్టింది. అప్పడే ఆ దారిలో వెళుతున్న దర్జీ ఒకడు దాన్ని చూసి చేతుల్లోకి తీసుకొని “ఎందుకు ఏడుస్తున్నావు?" అని అడిగాడు.

కళ్ళు తుడుచుకుంటూ సంగతంతా చెప్పింది చిక్కుడు గింజ.

దర్జీ దానివైపు జాలిగా చూస్తూ “చూశావా? గడ్డిపోచ, బొగ్గుముక్క నీకు మిత్రులు. నీలాంటి వాళ్ళే. పాపం గడ్డిపోచ నీకు సహాయం చేసింది. దాని సాయమే లేకుంటే నీవు కాలువ దాటలేవు కదా! గడ్డిపోచ బొగ్గుముక్కకీ సాయం చేయబోయి నీళ్ళల్లో పడిపోయింది. న్యాయంగా అయితే నువ్వు వాటికి సాయం చేయాలి. సాయం చేయలేక పోతే కనీసం సానుభూతి కలిగి ఉండాలి. అదేమీ లేకుండా వాటిని చూచి ఎగతాళి చేశావు. అవి నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే పగలబడి నవ్వావు. పొట్టపగిలేవరకూ నవ్వావు. తప్పు కదా!” అన్నాడు.

చిక్కుడు గింజ వెక్కిళ్ళు పెడుతూ “నిజమే! నాకు బుద్దొచ్చింది. దయచేసి నా పొట్ట కుట్టవా?" అంది జాలిగా.

దర్జీ జేబులో వెతుక్కుంటే సూది ఉంది గానీ మ్యాచింగ్ దారం దొరక లేదు. దాంతో ఉన్న దారంతో దాని పొట్టకుట్టేసాడు.

అందుకే ఇప్పటికీ నల్లని, ఎర్రని చిక్కుడు గింజల మీద తెల్లని చార, తెల్లని చిక్కుడుగింజల మీద నల్లటి చారా ఉంటాయి.

ఏ రంగులో ఉన్నా చిక్కుడు గింజలు రుచిగా ఉంటాయి.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

మ్రింగెడు వాడు విభుండని …… మహా శివరాత్రి పండుగ కథ!

అనగా అనగా.....
అమృతాన్ని ఆశించి క్షీరసాగర మధనం చేస్తూంటే, అమృతం కంటే ముందు హాలాహలం ప్రభవించింది. వెలువడిన విషపుధాటికి లోకాలన్ని అల్లకల్లోలమయ్యాయి. హాలాహలపు జ్వాలలకు అందరూ హాహాకారాలు చేస్తున్నారు.

కాపాడమని పరమశివుని ప్రార్ధించారు. సమస్య తనది కాదు. మింగితేనే తననేమీ చేయలేని విషం, మింగకపోతే అసలేమీ చేయలేదు. అయినా లోకహితం కోరి ఆ విషాన్ని పానం చేశాడు పరమేశ్వరుడు. ఆయన ఆదిభిక్షువే, అయినా అది హాలాహలం. దాన్ని గొంతులోనే నిలిపివేసాడు శివుడు. అది ఆయన కంఠాన్ని నల్లగా మాడ్చింది. అందుకే శివుడిని గరళకంఠుడనీ, నీలకంఠుడనీ పిలుస్తారు. తన యోగశక్తితో హాలాహలాన్ని, దాని శక్తిని అణిచివేసాడు పరమశివుడు. అంత కష్టాన్ని – లోకహితం కోసం, లోకాలకు శ్రేయస్సు కలిగించటం కోసం భరించాడు.

విషపానం చేసే ముందు పార్వతీ దేవితో శివుడు “ఇందరి ప్రాణ రక్షణ నా చేతులలో ఉంది. శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం. ఇప్పుడీ హాలాహలాన్ని తియ్యని పండులా ఆరగిస్తాను” అనగా ఆ యిల్లాలు చిరునవ్వుతో అంగీకరించింది.

“మ్రింగెడు వాడు విభుండని
మ్రింగెడిది గరళ మనియును
మేలని ప్రజకున్ మ్రింగమనె
సర్వ మంగళ! మంగళ సూత్రంబు
నెంత మది నమ్మినదో! “


అందుకే ఆ తల్లి లోకమాత.

అందుకే శివపార్వతులు ఆదిదంపతులు. సర్వలోకాల్లోని సకలప్రాణులకి జననీ జనకులు.


పరమశివుడు పచ్చివిషాన్ని కంఠాన బంధించేందుకు, తన యోగశక్తితో హాలాహలాన్ని అణిచేందుకు కన్నులు మూసుకొని వెత భరించాడు. ఎంతటి వారికైనా ఏ పనీ ’హాంఫట్’ అని అయిపోదు. దానికి కావలసిన ‘కర్తవ్య నిర్వహణ’ చేయవలసిందే. అందుచేత పరమశివునికీ ఆ ‘effort’ తప్పలేదు. కాబట్టే తర్వాత అమృతం పుట్టడం, దాని పంపకంలో జరిగిన గల్లంతూ, జగన్మోహినీ అవతారం శివుడు చూడలేదు.

ఆనాడు పరమశివుడు భరించిన వెతని తలుచుకుంటూ, శివరాత్రి నాడు, భక్తులందరూ శివనామ స్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తారు. ఉపవాస దీక్షలో గడుపుతారు. అదే శివరాత్రి పండుగ.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

సైన్యమా, దైవమా - ఎవరు గెలుపునిస్తారు?

అనగా అనగా.....

మహా భారతంలో, పాండవులు ఉద్యోగపర్వానంతరం ఉపప్లావ్యంలో నివసిస్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్దం అందరికీ వూహాతీతం కాదు. కురుపాండువులిద్దరూ పరస్పరం రాయబారాలు నడుపుతూనే మరోవైపు యుద్దసన్నద్దులై, సైన్యసమీకరణాలు చేస్తున్నారు.

సైన్యసమీకరణల సందర్భంలో ఒకరోజు ధర్మరాజు, అర్జునుణ్ణి శ్రీకృష్ణుని సహాయాన్ని అర్ధించడానికి పంపించాడు. అర్జునుడు ద్వారక చేరే సమయానికి, అదేపనిమీద దుర్యోధనుడు, అర్జునుడి కంటే ముందుగానే వచ్చి ఉన్నాడు.

దుర్యోధనుడు అర్జునుడి కంటే ముందుగానే కృష్ణమందిరం చేరాడు. ఆ సమయానికి కృష్ణుడు నిద్రిస్తున్నాడు లేదా నిద్ర నటిస్తున్నాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుని తలవైపుగల ఆసనంలో కూర్చోన్నాడు, కాళ్ళవైపు ఆసనంలో కూర్చోవడంలో అవమానమని తలిచాడు. [అందులో తప్పేమి లేదనీ, అది అతడి ఇచ్చనీ అనుకోవచ్చు] కాస్సేపటికీ అక్కడికీ ప్రవేశించిన అర్జునుడు శ్రీకృష్ణుని పాదాల చెంత నిలిచి వేచిచూడసాగాడు. [అర్జునుడికి కృష్ణునిపట్ల భక్తి, గౌరవం, గురుభావనా ఉన్నాయి గనుక ఇది ఇతడి ఇచ్ఛ.]

కొద్దీక్షణాల తర్వాత శ్రీకృష్ణుడు లేచి ఇద్దరినీ కుశలమడిగాడు. తర్వాత ఏపని మీద వచ్చారో కనుక్కున్నాడు. ఇద్దరూ ‘రానున్న యుద్దంలో సహాయార్ధం వచ్చాం’ అన్నారు.

దుర్యోధనుడు:
"కృష్ణా, ముందుగా నేను వచ్చాను. కనుక ముందుగా నాకు సహాయం చేయటం న్యాయం” అన్నాడు.

శ్రీకృష్ణుడు:
ముందుగా వచ్చావు నీవు. కాని నేను ముందుముందుగా అర్జునుని చూశాను. మీరిద్దరూ నాకు బంధువులే. నా సహాయం మీ ఇద్దరికీ చెందాలి. నా సైన్యంలో 10,000 మంది నాకు సమానులైన వారు, నారాయణాంశగల యోధులున్నారు. వారొకవైపు. నేనొకవైపు. వారు యుద్ధం చేస్తారు. నేను యుద్ధం చేయను. యుద్ధంలో కావలసిన సలహాలు, మాట సహాయం చేస్తాను. ఇక మీకు ఏవికావాలో కోరుకొండి. కానీ అర్జునునికి ముందుగా కోరుకునే అవకాశం ఇస్తాను. ఏమందువు అర్జునా?

దుర్యోధనుడు:
కృష్ణా! నీయవచ్ఛక్తీనీ వినియోగించి, ఇందు అర్జునునకు భాగము కల్పించుటయే గాక కోరుకొనుటలోను అతడికీ ముందరవకాశ మొసంగి, బావా నీయభిప్రాయమేమి అని అడుగుచున్నావు. అహ! ఇంతకన్న ఎవరి అభిప్రాయమెట్లుండెడిది బావా?

శ్రీకృష్ణుడు:
బావా దుర్యోధనా! నీవు స్వతంత్రుడవు. అర్జునుడు సేవకుడు. అన్న ఆఙ్ఞలకు బద్దుడై చరిచెడి వాడు. అందుకే అలా వేరుగా అడగవలసి వచ్చింది.

దుర్యోధనుడు: [స్వగతంలో] కృష్ణుడెంత మోసము చేస్తున్నాడు? ఆయుధం పట్టడట, యుద్ధం చేయడట. ఊరికే సాయం చేస్తాడట. తన సైన్యాన్నంతా ఒకవైపు పెట్టి, తాను ఒక వైపు నిలుచున్నాడు. కంచిగరుడ సేవ లాంటి ఇతడితో ఏమీ ఉపయోగం? అర్జునుడు మాత్రం కృష్ణుణ్ణి ఎందుకు కోరుకుంటాడు? సైన్యాన్నే కోరుకుంటాడు.

కానీ అర్జునుడు కృష్ణుణ్ణే కోరుకుంటాడు. దుర్యోధనుడు “కృష్ణుని కపటోపాయము మనకే కలిసివచ్చింది” అనుకుంటూ సంతోషంగా సైన్యాన్ని తీసికొని, అర్జునునిపై జాలిపడి మరీ వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణుడు అర్జునుణ్ణి అడుగుతాడు, "ఆయుధపాణులైన యోధుల్ని వదిలి, ఒట్టిగోపాలుణ్ణి, నన్ను కోరుకున్నావు, బాలుడవువైతి వక్కటా” అంటాడు.

అర్జునుడు “కృష్ణా! నాకు యోధులు, ఆయుధాలు, నీ యుద్ధకౌశలం అక్కరలేదు. నీవు నా అండనుండుటయే చాలు. నేనే అన్నిటినీ గెలవగలను” అంటాడు.

ఆవిధంగా అర్జునుడు భావవాది గనుక, పదార్ధాన్ని గాక విల్ పవర్ నీ, తన ఆత్మబలాన్ని, సంకల్పబలాన్ని నమ్మాడు, లక్ష్యాన్ని ఛేదించాడు. ‘యతో ధర్మతతో జయః’ అన్నట్లు పాండవులు కురుక్షేత్రంలో గెలుపొందారు కదా!

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

రజాకార్ల అఘాయిత్యం!

అనగా అనగా.....

స్వాతంత్రం వచ్చిన తొలిరోజులు! రజాకార్ల దౌష్ట్యంతోనూ, కౄరచర్యలతోనూ అల్లాడిన నిజాం సంస్థానం, పటేల్ తీసుకొన్న పోలీసు చర్య అనంతరం భారత్ లో కలిసిపోయింది. ఈ సంఘటన రజాకార్ల అఘాయిత్యాలు పెట్రేగి ఉన్న సమయంలో జరిగింది, తర్వాత వెలుగుచూసింది.

హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిపోయిన కొద్దికాలం తర్వాత ఓరోజు – కొంతమంది రైల్లో ప్రయాణిస్తున్నారు. అప్పటి రాజకీయాల గురించి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణ నాటి నిజాం క్రౌర్యం గురించి, రజాకార్ల హింస గురించి నడుస్తుంది. హఠాత్తుగా ఒక మహిళ తన ఒంటిమీది దుస్తులన్నీ విప్పి, అందరి ఎదుట నగ్నంగా నిలబడింది. అక్కడ పిల్లలూ, స్త్రీలూ, పురుషులు ఉన్నారు. అందరూ దిగ్భ్రాంతులయ్యారు. ఎవరూ మాట్లాడలేదు.

కొన్ని క్షణాల తర్వాత తేరుకున్న ఓ పెద్దాయన, "ఏమిటిది తల్లీ! ఇలా అందరి ఎదుట నిలబడతావా? ఆడదానివి కాదూ! ఇలా నిలబడటానికి సిగ్గుగా లేదూ?" అన్నాడట. ఒక్కసారిగా అగ్నిపర్వతం బ్రద్దలయినట్లు ఆమె “నేను కాదు. మీరందరూ సిగ్గుపడాలి” అంటూ భోరుమన్నది. దుఃఖాతిశయం తీరాక, దుస్తులు ధరించి, “నన్ను రజాకార్లు బహిరంగ స్థలంలో నగ్నంగా చెట్టుకి కట్టేసి వారం రోజులుంచారు. నానా హింసా పెట్టారు” అంటూ తన శరీరం మీద నాటి హింసల గుర్తులు చూపిందట. చూస్తోన్న అందరి కళ్ళల్లో నీళ్ళు!

ఇది ఆ రోజుల్లో కృష్ణాపత్రికలో ప్రచురింపబడినట్లుగా 2008 లో ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కేసీఆర్ ’నిజాం’ని పొగిడిన సందర్భములో ఈ వార్తని ప్రచురించింది.

ఇంతటి కసాయి తనం, హద్దుల్లేని హింస!

ఇదీ కథ!

ఇది నిజంగా జరిగిన సంఘటన. మన చరిత్ర.

రాజభక్తి - దైవభక్తి

అనగా అనగా.....

ఓ దేశరాజధాని నగరం. రాజుగారి పుట్టినరోజు ఉత్సవసభ జరుగుతోంది. సభా ప్రాంగణం ప్రజలతో క్రిక్కిరిసి ఉంది. రాజు గారిని పొగుడుతూ సైన్యాధికారి ఉపన్యాసించాడు. ప్రజలంతా ఆ’సొల్లు’విని గట్టిగా జేజేలు పలికారు. తర్వాత మంత్రి! ప్రజలీసారి మరింత గట్టిగా చప్పట్లూ కొట్టి, హర్షధ్యానాలు చేశారు.

తర్వాత రాజుగారు కృతఙ్ఞతలు చెబుతూ ఉపన్యసించారు. ఈ సారి ప్రజలంతా దిక్కులు పిక్కటిల్లేలా చప్పట్లు చరుస్తూ, జేజేలు పలుకుతూ రాజుగారి పట్ల తమ విధేయత చాటుకున్నారు. సభకు రాకపోతే, రాజుగారిని పొగడక పోతే ఎక్కడ రాజుగారికి కోపం వస్తుందోనన్న భయం, రాజుకు కోపం వస్తే తమకి నష్టం అన్న ఆతృతా వారిలో ఉంది.

ఆ సభలో ఓ మూల ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడు మౌనంగా ఉన్నాడు. చప్పట్లూ కొట్టలేదు, జేజేలు పలకలేదు. ప్రజలకి అతణ్ణి చూసి ఆశ్చర్యం వేసింది. గుసగుసలు పోయారు. విషయం రాజుగారి దాకా పోయింది. ఆయన గుర్రుమన్నాడు. విచారణ మొదలైంది. మంత్రి దర్పంగా, కాస్త కోపంగా “మేమంతా మన రాజు గారిని కీర్తిస్తుంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావ్? నీకు రాజంటే భయం భక్తీ లేవా?” అన్నాడు.

చిరునవ్వు నవ్వాడు ఆ వ్యక్తి. చిర్రెత్తుకొచ్చింది అందరికీ.

"జవాబు చెప్పు?" హుంకరించాడు సైన్యాధికారి.

ఆవ్యక్తి ప్రశాంతంగా “అయ్యా! మీరంతా ఈ రాజుగారు సర్వాధికారి అని కదా ఆయన్ని పొగుడుతున్నారు! ఈ రాజుగారి పాలనలో జరుగుతున్న అన్యాయాలు మీకు తెలుసు. అయినా అవేవి మాట్లాడకుండా రాజుని పొగుడుతున్నారు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని మెచ్చుకోవాలని, రాజుగారి దయ మీమీద ఉండాలని, రాజు గారికి మీరు ప్రీతిపాత్రులు కావాలని!

అటువంటప్పుడు ఈ రాజు గారి కంటే కూడా గొప్పవాడు, సర్వాధికారి అయిన దేవుడి దయ నామీద ఉండాలనీ, దేవుడు నన్ను మెచ్చుకోవాలని, దేవుడికి నేను ప్రీతిపాత్రుణ్ణి కావాలని అనుకుంటే తప్పేమిటి?" అన్నాడు.

సభలో ఒక్కసారిగా నిశ్శబ్ధం!

రాజుకి ఙ్ఞానోదయమైంది. ప్రజలకీ ’సత్యం’ గోచరమైంది.

రాజు ఆవ్యక్తికి క్షమాపణా, కృతఙ్ఞతలూ చెప్పుకొని, తర్వాత నుండీ తన కర్తవ్యం అయిన ’ప్రజా శ్రేయస్సు’కోసం పాటు పడ్డాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

పరమానందయ్య గారి శిష్యులు

అనగా అనగా.....

తెలుగు సాహిత్యంలో పరమానందయ్య గారి శిష్యుల కథలు ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్న కథలు. పరమానందయ్య గారికి ఏడుగురు [పన్నెండు మందని కొందరంటారు] శిష్యులు. వీళ్ళు అమాయకులు, లోకఙ్ఞానశూన్యులు. [శాపగ్రస్తులైన తాపసులు] వీరు తమ అఙ్ఞానంతోనూ అమాయకత్వం తోనూ గురువుగారినీ, గురుపత్నినీ ఇబ్బందుల పాలు జేస్తూ ఉంటారు. అయితే ప్రతీసారి ఈ ఇబ్బందులు గురువు గారికి మేలే చేస్తుంటాయి.

ఓ రోజు పరమానందయ్య గారు మధ్యాహ్న భోజనం చేసి కాస్సేపు నడుం వాల్చాలను కుంటారు. తన శిష్యుల్లో ఇద్ధరిని పిలిచి తన కాళ్ళు పట్టవలసిందిగా ఆఙ్ఞ ఇచ్చి నిద్రకుపక్రమిస్తాడు. శిష్యులిద్దరూ భక్తిగా గురువు గారి కాళ్ళుపిసకటం మొదలు పెడతారు. ఆ మర్ధనా సుఖానికి గురువు గారు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. కొద్దిసేపటి తర్వాత కాళ్ళ పడుతున్న శిష్యుల్లో ఒకడు తను వత్తుతున్న గురువు గారి కాలును మురిపెంగా చూసుకొంటూ “నేను ఒత్తుతున్న గురువుగారి కాలు చూడు. ఎంత బాగా మర్ధనా చేసానో. మిలమిల్లాడుతోంది” అన్నాడు.

రెండో వాడు “ఏడిశావ్ లేరా! నా కాలు చూడు. ఎలా తళతళ్లాడు తుందో? నేనే బాగా మర్ధనా చేసాను” అన్నాడు.

మొదటి వాడికి చిర్రెత్తు కొచ్చింది. “కాదు. నాకాలే మెరుస్తోంది. నీకాలు వికారంగా ఉంది” అన్నాడు కోపంగా.

రెండోవాడికి ఇంకా మండుకొచ్చింది. “నోరు ముయ్యి. నీకాలు చెత్తది. నా కాలు బంగారం” అన్నాడు గురువు గారి కాలుని చేత్తో నిమిరుతూ.

మొదట వాడు కోపంతో రొప్పుతూ “నువ్వు నా కాలుని అవమానించావు. చూస్కో నేనేం చేస్తానో?" అంటూ రెండోవాడు ఒత్తుతున్న గురువుగారి కాలిని ఒక్కటి కొట్టాడు.రెండో వాడు అంతకంటే కోపంతో “నా కాలునే కొడతావా? చూస్కో నీ కాలుని నరికేస్తాను” అంటూ గొడ్డలి తెచ్చాడు.

మొదటి వాడు “నీ కాలుని మాత్రం నే వదులుతానా?" అంటూ కత్తి పట్టుకొచ్చాడు.

ఇద్దరూ కలిసి గురువు గారి కాళ్ళని కొట్టటం అయిపోయి నరికేందుకు సిద్ధ పడ్డారు. ఈ గొడవకు నిద్ర లేచిన గురువు గారు ఇద్దరి అఘాయిత్యాల్ని ఆపమంటూ గావుకేక పెట్టారు.

తర్వాత ఆయన సహనంగా ఇద్దరు కలిసి తన కాళ్ళనే బాధించిన విషయాన్ని బోధపరచి వారిని వివేకవంతుల్ని చేసే ప్రయత్నం చేశాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

అవినీతి, నీతిగా ఎలా మారిందంటే…….. మైనర్ బాబు కథ

అనగా అనగా.....


అది కృష్ణా జిల్లాలోని ఓ గ్రామం. మరీ పల్లెటూరు కాదు, అలాగని పట్టణం కూడా కాదు. ఆ వూరి జమీందారు గారికి పిల్లల్లేని కారణంగా బంధువుల కుర్రాణ్ణి దత్తత తెచ్చుకున్నారు. ఆ పిల్లవాడికి మైనారిటి తీరని కారణంగా ఆ దత్తుడిని, ’మైనర్ బాబ’ని పిలవటం మొదలెట్టారు. మైనర్ బాబు పెరిగి పెద్దై మేజర్ అయినా పేరు మాత్రం మైనరు బాబుగానే స్థిరపడిపోయింది.

సదరు మైనర్ బాబు పక్కమెడలాల్చీలూ, సైడు క్రాపులతో సోగ్గాడిలాగా తిరిగేవాడు. పిల్ల జమీందారు అయిన కారణంగా చదువైతే ఒంట బట్టలేదు గానీ సకల దుర్గణాలూ అంటుకున్నాయి.

ఇంతలో జమీందారు గారు పరమపదిస్తూ తన యావదాస్తినీ మైనర్ బాబు పరంచేసి పోయాడు. అప్పటికే పెళ్ళై పిల్లలున్న మైనర్ బాబు ఆస్తి చేతికి రావడంతో మరీ పైలాపచ్చీసుగా తిరగడం మొదలెట్టాడు. వారానికోసారి చెన్నాపట్నం ప్రయాణం – మందు, విందు, అందాల పొందు.

ఇంట్లో మైనర్ బాబు శ్రీమతి కన్నీళ్ళు పెట్టుకుంటూ, వూళ్ళోని ఆడంగుల సానుభూతితో ఓదార్పు పొందుతూ కాలం గడిపేస్తోంది. ఇలా ఉండగా ఓరోజు హఠాత్తుగా మైనర్ బాబు చెన్నాపట్నం నుండి సినిమాల్లో చిన్నాచితకా వేషాలేసి రాణించలేకపోయిన ఓ ఎక్స్ ట్రా ఆర్టిస్టు ’రాణి’ని లేపుకొచ్చి జమీందారు భవనం వెనకున్న ’ ఔట్ హౌవుస్’లో పెట్టాడు.

ఊరంతా ఈ వార్త గుప్పుమంది. మరి అవి ఇంకా విలువుల గురించి కనీసం మాట్లాడుకుంటున్న రోజులయ్యె. వారం పదిరోజులు జమీందారు భవంతి వచ్చీపోయే ఆడంగులతో, జమీందారిణి వెక్కిళ్ళతో, ఓదార్పులతో సందడే సందడి! జమీందారిణిని ఓదార్చాలని వచ్చేవాళ్ళకి – జమీందారిణి దుఃఖం కన్నా, చెన్నాపట్నం నుండి వచ్చిన ’ఫిల్మ్ స్టార్’ రాణి ఎలా ఉంటుందో చూడాలన్న కుతుహలమే ఎక్కువుంది.

దాంతో ఔట్ హౌస్ వైపు తొంగి తొంగి చూసే వాళ్ళు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఔట్ హౌస్ లో రాణితో పాటు ఆవిడ తమ్ముడూ, మరో పనిమనిషి కూడా వచ్చారు. ఈ పనిమనిషి మహా నేర్పరి. అన్నింటి గురించీ, అందరి గురించి ఆచూకీలూ, కూపీలూ అలవోకగా లాగేసేది. రాణి గారి తమ్ముడు వారానికి రెండుసార్లు చెన్నపట్నం వెళ్ళి వస్తూ ఉండేవాడు.

మొదట్లో ఊరంతా ’రాణి’ని విడ్డూరంగా చూసేవాళ్ళు. మెల్లిగా అలవాటై పోయారు. ఈ లోపులో రాణి జమిందారిణి గారికి, తన తమ్ముడు చెన్నపట్నం నుండి తెచ్చిన విదేశీ స్నోలూ, పౌడర్లూ, పిల్లలకి విదేశీ చాక్లెట్లూ, రంగు రిబ్బన్లూ, రంగు రంగుల విదేశీ బట్టలు లాంటి చిన్నచిన్న బహుమతులు పంపింది. ముందు తిరగ్గొట్టిన జమీందారిణి మెల్లిగా తీసికోవటం మొదలైట్టింది. పిల్లలకైతే చెన్నపట్మం వింతబొమ్మలు మహా నచ్చేసాయి. మెల్లిగా జమీందారు భవనానికి, ఔట్ హౌస్ కు రాకపోకలు కూడా మొదలైనవి.

మెల్లిగా ’రాణి’ని చూడవచ్చే ఆడంగులు పోగయ్యారు. తన ఇంటికి అతిధులొచ్చినప్పుడల్లా చప్పున కలిపే కాఫీ పౌడర్లూ, జపాన్ చాక్ లెట్లు, రుచి చూపించింది రాణి. జమీందారిణికి, రాణికి సంబంధాలు బలపడ్డాయి. కందకి లేని దురద కత్తి పీటకెందుకన్నట్లు ఊళ్ళో వాళ్ళు ’రాణి’తో స్నేహం మొదలెట్టారు. మెల్లిగా పెళ్ళి పేరంటాలకి రాణిని పిలవడంతో మొదలై, మొదటి తాంబూలం దాకా సాగింది. రాణి నివాసం ఔట్ హౌస్ నుండి జమీందారు భవంతికి మారింది.

క్రమంగా అందరూ ’రాణి’ని రెండో జమీందారిణిగా గుర్తించారు. ఓ పుకారు ఏమిటంటే ’ఇటీవలే రాణికి జ్వరం వస్తే జమీందారిణి రాణికి కాళ్ళు వత్తిందని.’

ఇలా అవినీతి క్రమంగా సమాజంలో నీతిగా చలామణి అవుతుందని ఈ కథ వలన తెలుస్తుంది. ఇలా విదేశీ పౌడర్లూ, రిబ్బన్లూ, బొమ్మలూ, కాఫీలు, చాక్ లెట్లు తో మొదలై మోజు[ఫ్యాషన్] మాటున ప్రతీ అవినీతి కూడా సమాజంలో జనామోదం [Stamp?] పొందేస్తుంది.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఛత్రపతి శివాజీ సాహసాలు – 3

అనగా అనగా.....

ఛత్రపతి శివాజీ జీవితంలోని ఈ సంఘటన....

ఓ రోజు శివాజీ కొలువు తీరి ఉండగా, సభలోనికి ఓ అనుచరుడు ఓ అందమైన యువతిని వెంటబెట్టుకొని వచ్చాడు. అతడు వినయము, అతృతా నిండిన గొంతుతో “మహారాజా! ముస్లింల నివాస ప్రాంతంలో ఈ అందమైన ముస్లిం యువతిని పట్టుకున్నాను. ఈమెను మీకు కానుకగా ఇవ్వాలని తెచ్చాను” అన్నాడు.

ఆరోజుల్లో, ముస్లిం రాజ్యాల్లో, ఆ ముస్లిం రాజుల అనుచరులు అందమైన హిందూ యువతుల్ని నిర్భందించి తీసుకుపోవటం, ముస్లిం రాజులకీ, వారి రాజోద్యోగులకీ కానుకలుగా సమర్పించటం చేస్తుండేవాళ్ళు. బదులుగా రాజుల నుండీ, రాజోద్యోగుల నుండి ప్రయోజనాలు పొందుతుండేవాళ్ళు. [అంటే ప్రమోషన్లూ, అవార్డులూ, రివార్డులూ లేదా కేరీర్ లాంటివన్న మాట]ఒక్కోసారి వాళ్ళు ముస్లిం స్త్రీలనీ విడిచి పెట్టేవాళ్ళు కాదు. తమ స్వార్ధం, స్వసుఖవిషయంలో వాళ్ళకి మానవత్వం లేదు, మతం, కులం, పేదరికం, పాపం పుణ్యం – ఏవీ పట్టవు.

శివాజీ ముస్లిం రాజులకీ, ముస్లిం చక్రవర్తి ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు గనుక ఆయనకి ముస్లిం లంటే ద్వేషం ఉంటుందని ఆ అనుచరుడు అనుకొన్నాడు. ముస్లిం రాజులు హిందూ స్త్రీల మీద అత్యాచారాలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు గనుక ప్రతీకారంగా శివాజీ కూడా ముస్లిం స్త్రీలని అవమానిస్తాడు, అనుకొన్నాడు. అందుచేత అలాంటి చర్య తీసికున్నాడు. అలాంటి ముస్లిం యువతిని తెచ్చినందుకు తనను సత్కరిస్తాడని కూడా ఆశించాడు.

ఈ సంఘటనతో ఒక్కసారిగా సభమొత్తం నిశ్శబ్థం ఆవరించింది. సభికులంతా ఆశ్చర్యం తోనూ, ఉత్కంఠతోనూ చూస్తున్నారు. శివాజీ ఏమంటాడో నన్న కుతుహలం వాళ్ళందరిలోనూ ఉంది. ఆ ముస్లిం యువతి భయంతో వణుకుతోంది.

శివాజీ ఆమె వైపు తిరిగి “అమ్మా! భయపడకు!” అన్నాడు.

సభికుల వైపు తిరిగి “నిజంగానే ఈమె ఎంతో అందంగా ఉంది. ఈమె కడుపున నేను జన్మించి ఉంటే ఎంత అదృష్టవంతుడయ్యేవాడినో కదా! నా తల్లి కూడా ఈమెంతటి సౌందర్యవతి అయితే, నేను మరింత అందంగా ఉండి ఉండేవాడిని. ఈమె నా తల్లి జిజియా బాయి లాగే నాకు పూజ్యనీయురాలు” అన్నాడు.

చివరిగా తన అనుచరుడి వైపు చూచి “స్త్రీలని ఎలా గౌరవించాలో నేర్చుకో! పరస్త్రీలందరూ మనకు మాతృసమానులు. సగౌరవంగా ఈమెను, ఈమె ఇంట దిగవిడిచిరా!” అని ఆఙ్ఞాపించాడు.

శివాజీ ఆమెకు బహుమతులిచ్చి, రాచమర్యాదలతో ఆమెను స్వగృహానికి పంపించాడు. అదీ ఆయన నిబద్దత – ధర్మంపట్లా, నైతికత పట్లా, మానవతా విలువల పట్లా! వాస్తవానికి ధర్మం, నీతి, మానవీయ విలువలూ ఎప్పటికీ కులమత రాజకీయాలకూ, స్థలకాలమానాలకు అతీతమైనవి. వీటినే హిందూ ధర్మం చెప్తుంది. దానిని ఆచరించటమే నిజమైన హిందువు [మనిషి] చేయవలసినది.

ఇలాంటిదే మరో సంఘటన!

ఒకసారి శివాజీ మాతృశ్రీ జిజియాబాయి ఆయన్ని సింహఘడ్ ను గెలుచుకొని తనకు కానుకగా ఇమ్మని చెప్పింది. ఆయనీ కార్యాన్ని సాధించే పనిని తన అనుచరుడైన తానాజీకి అప్పగించాడు. తానాజీ శివాజీకి ఆప్తమిత్రుడు, అనుంగు అనుచరుడూ, మహా యోధుడు. ఈ వర్తమానం అందుకొనేటప్పటికి తానాజీ తన కుమారుడి వివాహానంతర విందు వినోద కార్యక్రమాల్లో ఉన్నాడు. అయితే వర్తమానం అందుకున్న మరుక్షణమే తానాజీ సింహఘడ్ మీదకి దాడికి సేనాసమేతుడై వెళ్ళాడు. తీవ్రపోరాటంతో సింహఘడ్ ని స్వాధీనం చేసుకొన్నాడు. అయితే ఆ పోరాటంలో తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు.

దుర్గాన్ని గెలుచుకొన్న తర్వాత, విజయచిహ్నంగా ఫిరంగి మ్రోగింపబడింది. ఫిరంగి శబ్థం విన్న శివాజీ సింహఘడ్ కి చేరుకొన్నాడు. కోట గుమ్మం దగ్గర శివాజీకి విజయ స్వాగతం ఇవ్వబడింది. కానీ శివాజీ మరుక్షణమే తానాజీ అక్కడ లేకపోవడాన్ని, ఆయన నిర్జీవ శరీరాన్ని గమనించాడు. ఇంతలో ఓ సైనికుడు సంతోషం, గర్వం నిండిన గొంతుతో “మహారాజా! మీరు సింహఘడ్ ని గెలుచుకొన్నారు” అన్నాడు. [బహుశః విజయవార్తని చెప్పినందుకు శివాజీ మహారాజు నుండి బహుమానాన్ని అతడు ఆశించి ఉండవచ్చు.]

శివాజీ అతడి వైపు వాడి చూపు చూసి, తీవ్రస్వరంతో “ఘడ్ తో ఆయా, లేకిన్ సింహ్ చలాయా!” అన్నాడు. [దుర్గం వచ్చింది కానీ సింహాన్ని కోల్పోయాను]

అదీ శివాజీ భావవాద దృక్పధం, ఆలోచనా సరళి! సింహఘడ్ దుర్గాన్ని గెలిచిన ఆనందం కన్నా, తన ప్రియమిత్రుడూ, మహా యోధుడు అయిన తానాజీ మరణంపట్ల దుఃఖమే ఆయన హృదయాన్ని తాకింది. ప్రతి విషయాన్ని, అనుభూతినీ రూపాయల్లోకి తర్జుమా చేసుకుంటున్న నేటి సమాజంలో ఈ ’భావం’ ఎందరికి అర్ధమౌతుందో భగవానుని కెఱుక.

ఛత్రపతి శివాజీ సాహసాలు - 2

అనగా అనగా.....

మన చరిత్రలో జరిగిన నిజ సంఘటనలు!

ఓ సారి ఔరంగజేబు ముస్లిం సైనికులు తమ దుర్గం మీదకి దాడికి వస్తున్నారని శివాజీ సేనకి సమాచారం అందింది. తామున్న చోటుకు చేరాలంటే సన్నని లోయలో నుండి ప్రయాణించాలి. శివాజీ సేన, ముస్లిం సైనికులు లోయలో నుండి ప్రయాణిస్తుండగా, సైనికుల మీదికీ, వారి గుర్రాల మీదికి పెద్దపెద్దబండరాళ్ళని కొండ అంచుల నుండి క్రిందికి దొర్లించారనీ ఆ విధంగా వారిని పార దోలారనీ కథనాలున్నాయి.

మరోసారి ఔరంగజేబు మద్దతుదారులైన ఓ సామంత ముస్లింరాజు శివాజీ దుర్గం మీదకి దండయాత్ర కొచ్చాడట. అంత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు శివాజీ దగ్గర చాలినంత ధనమూ లేదు, సైన్యం లేదు, ఆయుధాలు లేవు. ఉన్నది సంకల్పమూ, ధైర్యమూ, మేధస్సులే [లగాన్ సినిమాలో ఇండియన్ టీం లాగా].

ఉన్న పరిమిత వనరులతోనే ప్రతివ్యూహం పన్నారు. రాత్రికి శతృశిబిరం ఎక్కడ విడిది చేస్తుందో అంచనా వేసారు, ఆనుపానులు కనిపెట్టారు. దానికి తగిన దూరంలో కనుచూపులో ఉండేటట్లు తమ విడిది [campaign] నిర్మించారు. గుడారాలు వేసారు. కాగడాలు వెలిగించారు. గస్తీ ఏర్పాట్లు చేశారు.

దూరం నుండి ఇదంతా చూసిన శతృసైనికులకి ఆ చీకట్లో మండుతున్న కాగడాలు. లెక్కకు మిక్కిలి గుడారాలు గుబులు పుట్టించాయి. గెలవగలమన్న ఆశనీ, ధైర్యాన్ని కోల్పోయారు. కాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇలాంటి ప్రయత్నాల్లో శివాజీ, ఆయన అనుచరులూ, ఉన్నది కొద్దిమందే అయినా గుర్రాలు, ఉడుములూ, కోతులూ, పావురాలని కూడా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకున్నారట.

ఈవిధంగా ధనబలాన్ని, అధికార బలాన్ని, కేవలం మనోబలంతో ఎదుర్కొన్న యోధులు మరాఠాలు. ఒకసారి ఔరంగజేబు శివాజీ తండ్రిని బంధించి, చర్చల కంటూ శివాజీని పిలిపించి బంధించాడు. శివాజీ చెరసాల నుండి మాసిన బట్టల మూటలో దాక్కొని చాకలి వాడి సాయంతోనూ, తన అనుచరుల సాయంతోను తప్పించుకున్నాడట.

ఆ సమయంలో ఆ మాసిన బట్టల మూటని చెరసాల కావలి వాళ్ళు గానీ పట్టుకుంటే, శివాజీతో పాటు చాకలి వాడూ మరణాన్ని ఎదుర్కొక తప్పదు. అయినా వాళ్ళు వెనుకడుగు వేయలేదు. తమ ‘కర్తవ్యం’గా, దేన్ని తమంత తాముగా స్వీకరించారో, ఆ సంస్కృతీ పునఃప్రతిష్ఠ పట్ల వారి కున్న నిబద్దత అది! ధర్మ స్ఫూర్తి అది!

మరోసారి కూడా ఔరంగజేబు శివాజీని, ఆయన జ్యేష్ఠపుత్రుడు శంభాజీని నిర్భందించాడు. శివాజీని చంపితే తన రాజ్యంలో పెద్దసంఖ్యలో ఉన్న హిందువుల్లో అసంతృప్తి, తిరుగుబాటూ వస్తుందని భయపడి, సరియైన అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్ని నెలలు గడిచాయి. శివాజీ జబ్బుపడినట్లు నమ్మించాడు. అయన అనుచరులు శివాజీ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ దైవపూజలు నిర్వహించేవారు. ప్రతీరోజూ జైలులోని ఖైదీలకి, కావలి భటులకీ ప్రసాదాలు పంచిపెట్టేవారు.

మొదట్లో జైలు కావలి భటులూ, ఇతర సిబ్బంది ఈ ప్రసాదాలూ, మిఠాయిలు పట్ల జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ముందుగా పరీక్షించాక గానీ పంచి పెట్ట నిచ్చేవాళ్ళు కాదు, తామూ తినే వాళ్ళు కాదు. అయితే మిఠాయిల్లో ఏ మతలబు లేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. నెమ్మదిగా ప్రసాదాలని పరీక్షించటంలో ఓ సాచాటు వచ్చింది. యధాలాపంగా స్వీకరించటం మొదలు పెట్టారు. పరిస్థితి మామూలుగా, శాంతిపూరితంగా ఉంది.

ఓ రోజు ప్రసాదంగా జైలుకు లడ్డూలు పంపబడ్డాయి. అయితే వీటిలో మత్తు పదార్ధం కలపబడింది. లడ్డూలు తిన్న జైలు సిబ్బంది, కావలి భటులూ, ఇతరులూ స్పృహ కోల్పోయారు. తన అనుచరులూ, జైలులో తన అనుకూలురుల సాయంతో శివాజీ, శంభాజీ కూడా జైలు నుండి తప్పించుకోగలిగారు.

[’ఇది కుట్రకాదా’ అని ఎవరైనా వాదిస్తే వారికి సమాధానం చెప్పకుండా ఊరుకోవాల్సిందే. ఎందుకంటే ముస్లిం రాజుల కుట్రల వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ, శివాజీ జైలు నుండి తప్పించుకోవాడానికి పన్నిన పధకానికి వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ తేడా గమనించని వాళ్ళతో, వాదించి మాత్రం సాధించగల ప్రయోజనం ఏముంది?]

శివాజీ సమాజంలో నీతినీ, ధర్మాన్ని, సంస్కృతినీ తిరిగి స్థాపించడానికి ఎంతో దీక్షతో పోరాడాడు. అదే అయన జీవిత లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొడానికైనా, ప్రాణాలొడ్డానికైనా ఏక్షణమూ వెనుకాడలేదు. తన రాజ్యాన్ని సైతం ప్రజలకు తాను ఆదర్శంగా ఉండేలాగా, ప్రజలు కూడా నీతీ ధర్మాల్ని ఆచరించేలాగా, ఉత్తేజపరుస్తూ పరిపాలించాడు.

మన వీరుడు ఛత్రపతి శివాజీ !

అనగా అనగా.....

మన చరిత్రలో జరిగిన కథ!

ఛత్రపతి శివాజీ ’రాజ’ కుటుంబం నుండి రాలేదు. సాధారణ రాజోద్యోగ కుటుంబం నుండే వచ్చాడు. ఆయన దృఢ సంకల్పం, మంచి చేయాలనే దృక్పధం భగవంతుడి నుండీ, పురాణీతిహాసాల నుండి, ధర్మతత్త్వ చింతన నుండీ ఆయన పొందిన స్ఫూర్తి, ఆయనలోని ఉత్తేజం, ఆయన అనుచరుల్లోకి ప్రవహించి ప్రజ్వరిల్లింది. సమిష్టి కృషి అద్భుతాన్ని ఆవిష్కరించింది.

ఈ ప్రయత్నంలో ఓసారి శివాజీ షెయిస్తఖాన్ ని ఎదుర్కొనాల్సి వచ్చింది. షెయిస్తఖాన్ ఏడడుగుల ఎత్తులో, శరీరక బలంతో, కౄరుడిగానూ, రాక్షసుడిగానూ పేరు పడ్డాడు. ఔరంగజేబు తరుపున శివాజీతో చర్చించడానికి వస్తున్నాడు. అయితే ఇది పైకారణం మాత్రమే. ఆ వంకతో శివాజీని చంపడమే అతడి లక్ష్యం. ఈ విషయం శివాజీకి తన వేగుల ద్వారా ముందే తెలుసు.

శివాజీ ఆ ప్రమాదాన్ని[రిస్క్ ని] ఎదుర్కొనేందుకే నిశ్చయించుకున్నాడు. ఈ సంఘటనని ఎదుర్కొడానికి బయలుదేరేముందు శివాజీ తన అనుచరులందర్నీ జాగరూకుల్ని చేసి, తదుపరి కర్తవ్వాన్ని వివరించాడు. ఒకవేళ షెయిస్తఖాన్ తో పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోయినా, సమాజంలో నీతినీ, విలువల్నీ హిందూ సంస్కృతినీ పునఃప్రతిష్టించే పనిని తాము కొనసాగించాలని ప్రభోదించాడు. అవీ వారి ధైర్యసాహసాలూ, ధృఢ సంకల్పాలు!

ప్రతిపాదిత సమయానికి శివాజీ, షెయిస్తఖాన్ ని కలిసేందుకు బయలుదేరాడు. రహస్యంగా తన చేతి పది వెళ్ళకు పులిగోళ్ళను పోలిన ఇనుపగోళ్ళను తగిలించుకున్నాడు. షెయిస్తఖాన్ విశాలంగా నవ్వుతూ శివాజీని ఆహ్వానించాడు. స్నేహాన్ని వ్యక్తీకరిస్తూ శివాజీని కౌగిలించుకున్నాడు. నిజానికది మృత్యుకౌగిలి; శివాజీకైనా, షెయిస్తఖాన్ కైనా. ఆ కౌగిలింతలోనే శివాజీని పిడిబాకుతో పొడిచి చంపాలని షెయిస్తఖాన్ ప్రయత్నించాడు.

అయితే శివాజీ షెయిస్తఖాన్ కంటే చురుగ్గానూ, వేగంగానూ కదిలాడు. షెయిస్తఖాన్ తనను బాకుతో పొడవబోయే లోగానే తాను అతని వీపుని తన ఇనుపగోళ్ళతో చీల్చివేశాడు. అది చూసి షెయిస్తఖాన్ సైనికులు మ్రాన్పడిపోయాడు. తమ శిబిరంలోకి వచ్చి తమ నాయకుణ్ణి చంపే సాహసాన్ని వాళ్ళు ఊహించలేదు. వారా దిగ్ర్భమ నుండి తేరు కొనే లోగానే శివాజీ సైన్యం వారిపై దాడి చేసింది. అప్పటికే భయభ్రాంతులైన షెయిస్తఖాన్ సైనికులు పలాయనం చిత్తగించారు.

ఆ విధంగా శివాజీ కర్తవ్యం కంటే ప్రాణాలు విలువైనవి కావని నిరూపించాడు. ఎందుకంటే వ్యక్తి జీవితం ఈ ప్రపంచంలో ఎప్పటికీ తాత్కాలికమే. కానీ ధర్మం, విలువలు మాత్రం శాశ్వతం. మనం ఎలా బ్రతికినా, ఏదో ఒక రోజున చావడం ఖాయం. కానీ చావనిది సంస్కృతి, ధర్మమే.

మరో కమ్మని కథ లాంటి విషయం కోసం వేచి చూడండి.

భారతీయ వారసత్వానికి ప్రతీక రాణి పద్మిని !

అనగా అనగా.....

మన చరిత్రలో జరిగిన నిజ సంఘటనలు!

13వ శతాబ్ధంలో మరొక మహ్మదీయుడు అల్లా ఉద్దీన్ ఖీల్జీ భారతదేశంలోని, రాజ పుత్ర రాజ్యం చిత్తోడ్ ఘడ్ మీదకి దండయాత్ర చేశాడు. అప్పటికి చిత్తోడ్ ఘడ్ రాజు రాణా రత్నసింహుడు. ఆయన భార్య రాణి పద్మిని. ఆమె అద్భుత సౌందర్యవతిగానూ, విదుషీమణిగానూ, పేరుగాంచింది. ఆమెను కాంక్షించి అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ ఘడ్ పై అనేక సార్లు దండయాత్ర చేశాడు. కానీ గెలవలేకపోయాడు.

చివరికి ఒక రాయబారి ద్వారా రాణా రత్నసింహుడికి ఒక వర్తమానం పంపించాడు. “రాణి పద్మిని సౌందర్యం గురించి నేను చాలా విని ఉన్నాను. ఆ ప్రఖ్యాతి లోని నిజం తెలుసుకోవాలని, ఒక్కసారి ఆమెను చూడాలని కోరుకున్నాను. ఒక్కసారి ఆమెని చూడగలిగితే, నేను యుద్ధం విరమించి వెనక్కి వెళ్ళిపోతాను” అన్నది ఆ వర్తమాన సారాంశం.

రాజు రాణా రత్నసింహుడు, మంత్రులూ ఆలోచించారు. రాణి పద్మినితో చర్చించారు. చివరికి వారంతా “అల్లా ఉద్ధీన్ ఖిల్జీని మన రాజ్యానికి ఒక స్నేహితుడిగా భావించి విందుకు ఆహ్వానిద్దాం. మన సౌహార్ర్ధాన్ని, స్నేహాన్ని మనం చూపిద్దాం. ఏవిధంగా చూసినా యుద్ధం కంటే శాంతి గొప్పది కదా! రాణి పట్ల అతని దృష్టి నీచమైనది కాదని అతడి వర్తమానం చెబుతోంది. ప్రఖ్యాతి గాంచిన విషయం పట్ల గల కుతుహలమే నంటున్నాడు కాబట్టి రాణి ప్రతిబింబాన్ని అతడికి అద్దంలో చూపుదాం. మన రాణి గారికి సోదర తుల్యుడుగా అతణ్ణి గౌరవిద్దాం” అని తీర్మానించారు.

ఆ విధంగానే అతడికి కబురుపంపారు. అతడీ ఆహ్వానాన్ని అందుకుంటూ తనను తాను రాణీ పద్మినికి సోదర తుల్యుడిగానూ, రాజూకూ, చిత్తోడిఘడ్ ప్రజలకూ మిత్రుడిగానూ ప్రకటించుకున్నాడు. విందు రోజున రాజు రాణారత్నసింహుడు, మంత్రులూ, చిత్తోడ్ ఘడ్ ప్రజలూ అల్లా ఉద్దీన్ ఖీల్జీని విశిష్ట అతిధిగా గౌరవించారు. విందు తర్వాత రాణీ పద్మిని ప్రతిబింబాన్ని అద్దంలో అతిధికి చూపారు. ఆ సౌందర్యం చూచి అతడు అబ్బురపడ్డాడు. తన నైచ్యాన్ని పైకి ప్రదర్శించలేదు. తన అతిధి నటనను కొనసాగిస్తూ రాణా రత్నసింహుని ప్రతి విందుకు ఆహ్వానించాడు. రాజు ఇది అంగీకరించాడు.

తదుపరి రత్నసింహుడు కొద్దిపాటి పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి విందుకు వెళ్ళాడు. అతిధి మర్యాదని ఊహించారే గానీ కుట్ర అనుకోలేదు. ఎందుకంటే నమ్మకద్రోహం అంతగా భారతీయులకి తెలీదు. అతిధి మర్యాదులకు బదులుగా రత్నసింహుడు దగాని అందుకున్నాడు. రాజును బంధించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ రాణి పద్మినికి తనకు లొంగిపోవలసిందిగా కబురు పంపించాడు.

అల్లా ఉద్దీన్ ఖిల్జీ రత్నసింహుణ్ణి ’అతిధి’ అంటూ ఆహ్వానించాడు. మానవీయ విలువల్ని నమ్మి, రాణా రత్నసింహుడు పరిమిత పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి వచ్చాడు. కాబట్టే అతడు రత్నసింహుని బంధించగలిగాడు. ఇది కుట్రే కదా! ఇదే పని అల్లా ఉద్దీన్ ఖిల్జీ అతిధిగా చిత్తోడ్ ఘడ్ కు వచ్చినప్పుడు [అప్పుడతనిదీ పరిమిత పరివారమే] రత్నసింహుడు చేసి ఉంటే? అతిధిని ఆదరించాలి, నమ్మించి మోసగించ కూడదు లాంటి నీతుల్ని తలచకుండా అల్లా ఉద్దీన్ ఖిల్జీని బంధించిన, చంపేసినా ఏం చేయగలిగి ఉండేవాడు? కేవలం మానవతా విలువల్నీ, సత్యం పలకడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లాంటి నీతి, ధర్మం పాటించారు గనుక భారతీయ రాజులు అలాంటి కుట్రలు చేయలేదు. నేటికీ పాకిస్తాన్ మన పట్ల అదే విధమైన మోసాలు చేస్తూనే ఉంది.

ఆ విధంగా అల్లా ఉద్దీన్ ఖిల్జీ చేతిలో మోసానికి గురయ్యాక, రాణి పద్మిని, మంత్రులు కలిసి బాగా ఆలోచించి అల్లాఉద్దీన్ ఖిల్జీకి మరునాడు రాణి పద్మిని అతడికి లొంగిపోగలదని కబురు పంపారు.

మరునాడు పల్లకీల ’కాన్వాయ్’ అల్లాఉద్దీన్ ’కాంపైన్’ చేరింది. అల్లాఉద్దీన్ ఖిల్జీ ఆనందానికి అంతులేదు. ప్రఖ్యాతి గాంచిన అపురూప సౌందర్యవతి తన సొత్తు కాబోతోంది. తానామెను అందుకోబోతున్నాడు. ఆ పరవశంతో అతడు రాణీ గారి పల్లకీకి ఎదురు వెళ్ళి స్వాగతించాడు. అయితే అతడు స్వాగతించింది పరిచారికుల వేషంలో ఉన్న సైనికులకి.

రాణి పద్మిని పల్లకీలో సైతం స్త్రీ వేషంలో ఉన్న యోధుడున్నాడు. ’మోసం’ అంటూ గావు కేకలు పెట్టిన అల్లాఉద్దీన్ ఖిల్జీ అనివార్యమైన యుద్దాన్ని ఎదుర్కొన్నాడు. వీరోచితంగా పోరాడిన రాజ పుత్ర వీరులు రాణా రత్నసింహుని విడిపించుకొని పోయారు. దీనితో అల్లా ఉద్దీన్ ఖిల్జీ క్రుద్ద్రుడయ్యాడు. సహజమే కదా! తాను ఎదుటి వాళ్ళను మోసగించగలిగినప్పుడు అది తన తెలివీ లేదా సామర్ధ్యం అనుకొని సంతోషాన్ని గర్వాన్ని పొందినప్పుడు, తాను ఇతరుల చేతిలో మోసపోతే అసహనానికి క్రోధానికి గురవుతారు కదా!

తర్వాతి ప్రయత్నంలో అల్లా ఉద్దీన్ ఖీల్జీ మరింత సైన్య సమీకరణ చేసుకొని మరీ, చిత్తోడ్ ఘడ్ మీదికి దండయాత్ర చేశాడు. కోటని వశపరుచు కొన్నాడు. రాణా రత్నసింహుణ్ణి, ఇతర యోధుల్ని చంపేసాడు. కానీ ఎంతో కాంక్షతో అంతఃపురాల్లోకి ప్రవేశించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీకి కనబడింది అందాల రాశులు కాదు, బూడిద రాశులు. రాణి పద్మినితో సహా రాణివాసపు స్త్రీలందరూ శతృరాజుల అత్యాచారాన్ని తమ శరీరాల మీదా, మనుస్సుల మీదా కూడా నిరోధించటానికి, వారి రాకకు ముందే అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకొన్నారు. ఆవిధంగా నైతికత కాపాడు కోవటానికీ తమ జీవితాల్ని తృణప్రాయంగా, [ గరిక పోచల్ని వదిలినంత తేలికగా] వదిలివేశారు.

అంతేగాని ఆధునిక ప్రగతి సూత్రం “When the rape is unavoidable, enjoy it” అనుకోలేదు. అత్యాచారాల్లాంటి నైచ్యాన్ని భరించటం కంటే మరణం మేలన్నది వారి వివేచన. అలాంటి నైచ్యాన్ని నివారించటానికి వారు ఇతరుల్ని హత్య చేయాటానికైనా వెనుదీయరు, ఆత్మహత్య చేసుకోవాటానికైనా వెనుదీయరు. భారతీయ రక్తంలోనే అంతటి పౌరుషం నైతికత, సత్యం విషయంలో ఉంది.

ఇది నిజంగా జరిగిన సంఘటన. మన చరిత్ర.

పిల్లి గంపల వంశం పిట్టకథ

అనగా అనగా.....

ఒకవూరిలో ఓ పెద్ద మోతుబరి కుటుంబం ఉండేది. తరతరాలుగా ఉమ్మడి కుటుంబం. తాతలు తరం, తండ్రుల తరంతో వెరసి అప్పటికి ఆ కుటుంబంలో 30 మంది దాకా పెద్దవాళ్ళు, 50 మంది దాకా పిల్లవాళ్ళు, గొడ్డూ గోదా, పిల్లా మేకా, పాడిపంట!

పెద్దలోగిలిలో అంతా కలిసే ఉంటారు. అత్తలూ, కోడళ్ళూ అంతా సఖ్యంగా, తోబుట్టువులూ, దాయాదులూ సమైక్యంగా పనులు చేసుకుంటూ సుఖంగా ఉండే వాళ్ళూ. పాడీపంట ఎక్కువే, పిల్ల సైన్యమూ ఎక్కువే కావటంతో వాళ్ళ ఇంట్లో ఎలుకల బాధ మెండుగా ఉండేది. దాంతో పదిపన్నెండు పిల్లుల్ని పెంచేవాళ్ళు. రోజూ పిల్లలతో పాటే ఉదయాన్నే పిల్లులకి కూడా పాలబువ్వా, పెరుగన్నమూ పెట్టేవాళ్ళు.

అయితే పండగ రోజున మాత్రం దైవ పూజ అయ్యేదాకా పిల్లలకి కూడా ఏమీ పెట్టరు గదా! అసలే ఆ రోజుల్లో ఆచారాలు గట్టిగా పాంటించే వాళ్ళయ్యె! పిల్లలు పెద్దలకి భయపడో, దేవుడి మీద భక్తితోనో ఓర్చుకొనేవాళ్ళు. కానీ పిల్లులు మాత్రం ఆడవాళ్ళ కాళ్ళకి చుట్టుకుంటూ పనులు చేసుకోనివ్వకుండా ’మియ్యాం’ అంటూ వెంటపడేవి.

దాంతో పూజయ్యే దాకా పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టటం చేసేవాళ్ళు. రాను రాను అదో ఆచారం లాగా పండగ రోజు ఉదయాన్నే పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టి పూజ పూర్తయ్యాక విడిచిపెట్టటం చేసేవాళ్ళు. దాంతో వాళ్ళది పిల్లిగంపల వంశం అనే సార్ధక నామం ఏర్పడింది.

కాలం గడిచింది. రోజులు మారాయి. ఉమ్మడి కుటుంబం, చిన్న [న్యూక్లియర్] కుటుంబాలయ్యింది. తర్వాతి తరాల్లో ఓ కుటుంబం ముంబాయి అపార్ట్ మెంట్లులో కాపురముంటూ కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేస్తుంది.

కానీ తమ ఆచారం ప్రకారం పండగ నాడు పిల్లుల్ని వెదుక్కొచ్చి, గంపల తెచ్చి కప్పిపెట్టటం అంటే చచ్చే చావయ్యిందిట. గంపలు కొని, పండగలయ్యాక పదిలంగా అటకల మీద ఉంచటం, పిల్లుల్ని వెదకటం – ఓహ్! భీభత్సం! చివరకి తెలిసిన వాళ్ళ ’పెట్’ పిల్లుల్ని అరువు తెచ్చుకోవటం, పిల్లుల్ని పెంచే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం లాంటి నానా యాతనలూ పడ్డారట.

పిల్లుల్ని పెంచుదామంటే భార్యభర్తలిద్దరు ఉద్యోగం చేసే చోట దాన్ని పదిలంగా పెంచనూ లేరు, పోనీ పెంచుదామన్నా అది ప్రక్క వారి అపార్ట్ మెంట్లో ఏదైనా గల్లంతు చేసిందంటే ఆ’న్యూసెన్సూ’ ’నాన్ సెన్సు’ భరించటం కష్టం.

ఇదంతా చెప్పుకొని సదరు గృహస్తూ నిట్టూర్చాడట.
ఇదీ కథ!
[ఈ పిట్టకథ నేను డి.వి. నరసరాజు గారు ఒక రాజకీయ వ్యాసంలో వ్రాయగా చదివాను]

ఆనాడు అవసరం నుండి ఆచారం పుట్టింది. ఆలోచన లేని ఆచరణ ఈ రోజు ఆచారం పేరిట విచారం పుట్టిస్తోంది. లోపం ఎక్కడుంది? నిశ్చయంగా `అనాలోచన’ లోనే కదా? అనాలోచనకి తర్వాతి పరిణామం మూర్ఖత్వమే.

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

సింహాలు మీరు

అనగా అనగా.....

నిండు గర్భిణి అయిన ఒక సింహాం, ఆహారం కోసం తిరుగుతూ, ఒక గొర్రెలమందను చూచి, దాన్లోకి దుమికింది. కానీ ఆ శ్రమకు ఓర్వజాలక, ఈని, అది వెంటనే మరణించింది. దాని బిడ్డ, గొర్రెల పోషణ క్రిందనే పెరిగి, వాటితోపాటు గడ్డిమేస్తూ, వాటిలాగానే గొర్రె అరపు అరుస్తూండినది. పెద్దదైన తర్వాత కూడ, తాను ‘గొర్రె’ అనే దాని తలపు.

మరొక సింహాం ఒకనాడు, ఆ ప్రాంతానికి ఆహారార్ధం వచ్చి, ఆ మందలో సింహాం ఉండడం, గొర్రెలలాగా అదీ పారిపోవడమూ చూసి అశ్చర్యపోయింది. దాని దగ్గరకు వెళ్లి, అది గొర్రెకాదనీ, సింహామనీ తెలుపడానికి ప్రయత్నించింది కాని, అది అందకుండా పారిపోసాగింది.

సమయం కోసం వేచి ఉండి, ఒకరోజు ఆ ‘గొర్రె – సింహం’ నిద్రిస్తూండగా, దగ్గరకు వెళ్ళి, “నువ్వు సింహనివి” అని దానికి చెప్పింది. “కాదు, నేను గొర్రెనే” అంటూ అది గొర్రెఅరుపు అరిచింది. అంతట ఈ సింహం దాన్ని ఒక చెరువు దగ్గరికి లాక్కునిపోయి, తమ ఉభయుల ప్రతిబింబాల్ని చెరువు నీటిలో చూపిస్తూ, "బాగా చూడు, నువ్వు ఎవరివో యిప్పటికైనా తెలుసుకో” అన్నది సింహం.

అంతట, ఆ ‘గొర్రె – సింహం’ నీళ్లలో కనిపించే తన ప్రతిబింబాన్ని, ఆ సింహాన్ని పోల్చిచూసుకొన్నది. క్షణమాత్రంలో తాను సింహామనే సత్యం దానికి స్ఫురించింది. వెంటనే దాని గొర్రె అరుపు మాయమై, సింహగర్జనం వెలువడింది.

మనం అపరిశుద్ధులం అని ఎన్నడూ అనకండి. పరిశుద్దులమనే అనండి. మనం స్వల్పులమనీ, జన్మిస్తామనీ, మరణిస్తామనీ గాఢభ్రాంతిని ఒక దాన్ని కల్పించుకొని ఉన్నాం. అందువల్ల మనల్ని ఎప్పుడూ అకారణ భీతి వెన్నాడుతోంది. సింహాలు మీరు! నిత్యం పరిశుద్ధం, పరిపూర్ణం అయిన అత్మయే మీరు. విశ్వశక్తి మీలో అణగి ఉంది.

’మిత్రమా! ఏడుస్తున్నా వెందుకు? నీకు జననమరణాలు లేవు, వ్యాధి దుఃఖాలు లేవు. అనంతమైన అకాశం వంటివాడివి నువ్వు. రంగు రంగుల మబ్బులు దాని నావరించి, ఒక క్షణ మాత్రం క్రీడించి మాయమౌతూ ఉంటవి. కానీ, అకాశ మెప్పుడూ, నిత్యవినీల కాంతిమయమే. దుర్జనత్వం మనకేల కనిపిస్తోంది?’

నేను ఆత్మను. విశ్వంలో ఏదీ నన్ను చంపలేదు’అని మానవుడికి వ్యక్తపరిచే ధైర్యాన్ని అలవరుచుకోండి. అప్పుడు మీరు ముక్తులవుతారు.

[వివేకానంద చెప్పిన కథలు నుండి దీనిని తీసుకొన్నాను.]

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

బిందుసారుడి వారసుడెవరు?

అనగా అనగా.....

ఒకసారి ’బిందుసారుడి వారసుడెవరు?’ అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.

బిందుసారుడు రాజగురువు, చాణక్యుడి సలహా కోసం ఆశ్రయించాడు. అప్పటికే శతాధిక వృద్ధుడైన ఆచార్యుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయమంతా సావధానంగా విన్నాక ఆయన “నాయనా! రేపు ఉదయమే నీ పుత్రులందర్నీ దేవీ అలయానికి రమ్మని ఆఙ్ఞాపించు. వచ్చేముందు బలవర్థకమైన ఆహారాన్ని భుజించి, మంచి వాహనాన్ని అధిరోహించి రమ్మని చెప్పు. దేవాలయంలో కూర్చునేటందుకు విలువైన ఆసనాన్ని వెంట తెచ్చుకొమ్మని చెప్పు” అన్నాడు.

బిందుసారుడలాగే తన కుమారులందరికీ ఆఙ్ఞాపించాడు. మహారాజు, మంత్రులూ, విషయం తెలిసిన ఇతర ప్రజలూ – అందరూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత చెందారు.

నిర్ధేశింపబడిన సమయానికి రాకుమారులంతా దేవాలయం చేరారు. తమ ఆసనాలనీ వెంట తెచ్చుకున్నారు. ఒకరు బంగారు కుర్చీని తెచ్చుకున్నారు. ఒకరు దారుశిల్పంతో నిండిన ఆసనాన్ని తెచ్చుకొన్నారు. పట్టువస్త్రాలతోనూ, పరుపులతోనూ అలంకరించి ఆసనాన్ని మరోకరూ, ముత్యాలూ, రతనాలూ పొదగబడిన పీటను ఇంకొకరు తెచ్చుకున్నారు. ఒకొక్కరూ ఒకో వాహనం పైన వచ్చారు. ఒక రాకుమారుడు పల్లకిలో వచ్చాడు. ఒకరు గుర్రమీద, ఒకరు ఏనుగు అంబారీ పైనా, మరొకరు రధంలోనూ .... ఇలా ఎవరికి మంచిదనిపించిన వాహనం మీద వారు వచ్చారు.

దేవాలయ ప్రాంగణంలో మహారాజు, మంత్రులు, ఆచార్యుడు అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చోన్నారు. వారికి ఎదురుగా రాకుమారులంతా తమ తమ వెంట తెచ్చుకున్న ఆసనాలపై కూర్చొన్నారు. వారిలో అశోకుడు ఒక్కడే కటిక నేలపై కూర్చొని ఉన్నాడు. అది చూసి ఇతర రాకుమారుల ముఖమ్మీద ముసిముసినవ్వు కదలాడింది. అందులో హేళన మిళితమై ఉంది. దాసీ పుత్రుడికి అంతకంటే ఏం ఉంటుందన్న ఎగతాళి ఉంది.

ఆచార్యుడు అడిగాడు “మీరంతా ఒకరి తర్వాత ఒకరు, ఇక్కడికి వచ్చేముందు ఏ ఆహారం స్వీకరించారో చెప్పండి”.

రాకుమారులంతా తామేం తినివచ్చారో ఒకింత గర్వంగా చెప్పారు. అశోకుడి వంతు వచ్చింది. స్థిరమైన గొంతుతో అశోకుడు “గిన్నెడు పెరుగు” అన్నాడు. రాకుమారులంతా ఫక్కున నవ్వారు.

ఆచార్యుడు “బలవర్థమైన ఆహారం స్వీకరించి రమ్మని నీకిచ్చిన ఆఙ్ఞ. మరి పెరుగెందుకు తిన్నావు?" అని అడిగాడు.అశోకుడు తడబాటు పడకుండా “ఆచార్య! మీరిచ్చిన ఆఙ్ఞని నా తల్లికి యధాతధంగా చెప్పాను. ఆవిడ నాకు ఉదయమే పెద్దగిన్నెడు పెరుగు ఇచ్చింది. తల్లిగా ఆమెకు – బిడ్డకు మంచి ఆహారమేదో, సందర్భానికి తగిన ఆహారం ఏదో తెలుసు. కాబట్టి మారు మాట్లాడక ఆమె పెట్టింది తిని వచ్చాను” అన్నాడు.

చాణక్యుడు తలాడించి, "ఒకరి తర్వాత ఒకరు, మీరు ఇక్కడకు ఏయే వాహనాల మీద వచ్చారో చెప్పండి” అన్నాడు.

రాకుమారులంతా తాము ఏ వాహనాల మీద వచ్చిందీ చెప్పారు. అశోకుడి వంతు వచ్చినప్పుడు అతడు “నేను నడిచి వచ్చాను” అన్నాడు. ఈ సారి రాకుమారులు నవ్వే ధైర్యం చెయ్యలేదు. ఆచార్యుడు, తండ్రి, ఇతర పెద్దల ముఖాల్లోని గాంభీర్యం వాళ్ళని నవ్వే ధైర్యం చెయ్యనివ్వలేదు.

ఆచార్యుడు “ఆశోకా! నీకు నచ్చిన మంచి వాహనం మీద రమ్మని కదా నా ఆఙ్ఞ. మరి నడిచి వచ్చే నిర్ణయం ఎందుకు తీసికొన్నావు?"

అశోకుడు వినయంగా “ఆచార్య! నా దృష్టిలో నా కాళ్ళ కంటే గొప్ప వాహనం నాకు మరొకటి కన్పించలేదు. భగవంతుడు నాకు ఇంత బలమైన మంచి కాళ్ళను ఇవ్వకపోయి ఉంటే నేను రధం, అశ్వం, గజం వంటి ఏ ఇతర వాహనాన్ని ఉపయోగించలేను కదా” అన్నాడు.

ఆచార్యుడు చిరునవ్వు నవ్వాడు. “అశోకా! అందరూ బంగారం, ఇంకా విలువైన ఆసనాలు మీద కూర్చున్నారు. నీవు నేల పై ఎందుకు కూర్చున్నావు?” అన్నాడు.

అశోకుడు “ఆచార్య! నా దృష్టిలో భూమి – బంగారం లాంటి లోహాల కంటే, మణిమాణిక్యాల కంటే విలువైనది. ఎందుకంటే అవన్నీ మనకు భూమి నుండే లభిస్తాయి. భూమి కంటే మరేదీ విలువైనది లేదని నా అభిప్రాయం. అందుకే భూమినే ఆసనంగా చేసుకున్నాను!” అన్నాడు.

ఒక్కసారిగా చప్పట్లతో ఆ ప్రాంగణం మార్మోగింది. అందరూ అశోకుడి సునిశిత అలోచనా సరళినీ, దృక్పధాన్ని మెచ్చుకున్నారు. అశోకుడే బిందుసారుని వారసుడన్నది పరోక్షంగా ముద్రపడిపోయింది. బిందుసారుడు అశోకుడి తల్లీ, తన భార్య ఐన బ్రాహ్మణ రాణిని, కొడుకు నలా పెంచినందుకు ఎంతగానో అభినందించాడు. తానెంతో ఆనందించాడు.

ఇది మన చరిత్ర.

అధికారం Vs బుర్ర

అనగా అనగా.....

అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే దేశం.


ఆ దేశాన్ని తైమూర్ పాలిస్తుండేవాడు. ఇతడు పేరుకే రాజుగానీ, పరమ పిసినారి, స్వార్ధపరుడూను. అతడికి ఈర్ష్యాసూయలు కూడా ఎక్కువే.

ఎప్పుడూ నసీరుద్దీన్ నుండి సలహాలు తీసుకొంటాడే గానీ ఏనాడు మంచి పారితోషికం ఇవ్వడు.

నసీరుద్దీన్ తనకి ఒక గుర్రం కావాలని తైమూర్ ని అర్ధించాడు. పిసినారి తైమూర్ కి నసీరుద్దీన్ కి గుర్రాన్నివ్వడం ఇష్టంలేదు. ఇవ్వక తప్పేట్లు లేదు.

దాంతో ఓ ముసలి చచ్చు గుర్రాన్ని నసీరుద్దీన్ కిచ్చాడు.

ఇలా ఉండగా ఓ రోజు.....

తైమూర్ తన పరివారంతో కలిసి వేటకి బయలుదేరాడు. నసీరుద్దీన్ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు.
అందరూ గోబీ ఎడారి చేరారు.

ఇంతలో గాలి, దుమ్ము రేగాయి. మేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.

తైమూర్, అతని సైనికులు ఎక్కిన గుర్రాలు బలంగా ఉన్నాయి. ఆ గుర్రాలు మీద వాళ్ళంతా ఒక్క ఉదుటున దౌడు తీయిస్తూ వెనక్కి ఊళ్ళోకి మళ్ళారు. అయినా గానీ ఊరు చేరే లోగా తడిసి ముద్దయ్యారు. నసీరుద్దీన్ గుర్రం ముసలిది, ఒక్కచిక్కినది అయిన చచ్చు గుర్రంమయ్యే.


గాలి మొదలవ్వగానే అది అడుగు తీసి అడుగు వెయ్యకుండా, ఉన్న చోటునే బిర్ర బిగిసినట్లు నిలబడి పోయింది. ఎంత అదిలించినా కదల్లేదు, మెదల్లేదు. చేసేది లేక నసీరుద్దీన్ గుర్రం దిగాడు. వర్షం మొదలయ్యేలోగా బట్టలు విప్పి ఆ గుర్రం క్రింద దాచాడు. ఎడారిలో తడుస్తూ అలాగే నిలబడ్డాడు.

వర్షం తగ్గాక ఒళ్ళార్చుకొని, గుర్రం క్రింద దాచిన దుస్తులు తొడుక్కొని గుర్రమెక్కి ఊళ్ళోకి వచ్చాడు.

కొంచెమైనా తడవకుండా, పొడి దుస్తులతో వచ్చిన నసీరుద్దీన్ ని చూచి తైమూర్ ఆశ్చర్యపోయాడు.

"అదేమిటయ్యా నసీరుద్దీన్. ఎంత వేగంగా వచ్చినా మేం ముద్దగా తడిసిపోయాము. నువ్వెలా తడవకుండా వచ్చావు? ఎక్కడున్నావు ఇప్పటి దాకా?" కుతుహలంగా అడిగాడు తైమూర్.

"అహా..హా! ఏం చెప్పను హూజూర్! అద్బుతం. అమోఘం.” ఇంకా పరవశంలోనే ఉన్నట్లు నటిస్తూ మైమరుపుగా అన్నాడు నసీరుద్దీన్.

తైమూర్ కుతుహలం మరింత పెరిగిపోయింది.

"ఏమిటి అద్భుతం? త్వరగా చెప్పవయ్యా!” అంటూ తొందర పెట్టాడు తైమూర్.

"హూజూర్! ముందుగా నేను మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి” అన్నాడు నసీరుద్దీన్.

"ఎందుకు?" ఆత్రంగా అడిగాడు తైమూర్.

"ఇంత అద్భుతమైన గుర్రాన్ని నాకు ఇచ్చినందుకు హూజూర్!” మరింత వినయంగా అన్నాడు నసీరుద్దీన్.
అయోమయంగా చూశాడు తైమూర్.

"నన్ను వివరంగా చెప్పనివ్వండి హూజూర్! గాలీ వానా మొదలవ్వగానే మీరంతా వేగంగా ఊరి వైపు దౌడు తీశారా? సరిగ్గా అప్పడే నేనూ నా గుర్రాన్ని అదిలించాను. అప్పుడు జరిగింది అద్భుతం! మీరిచ్చిన గుర్రం సామాన్యమైనది కాదు హూజూర్! అది ఆకాశంలో ఎగర గలదు. వాన మొదలు కాగానే అది నన్ను మబ్బుల్లోకి తీసికెళ్ళింది. ఎంత పైకంటే అప్పుడు కురుస్తోన్న మేఘం కంటే పైకి. ఆ మేఘల్లోని నందనవనం లాంటి తోటకి తీసికెళ్ళింది. అక్కడ ఎంత బాగుందనుకొన్నారు హూజూర్! పరిమళాలు వెదజల్లే పూలు, మధురమైన ఫలాలు, పక్షులు కిలకిలా రావాలు. అక్కడ ఎంచక్కా విహరించాను. తిరిగి రావాలనే అనిపించలేదు. కానీ మీరు నాగురించి వాకబు చేసి, నేనేమయ్యానో అని కంగారు పడతారని వచ్చేసాను” భావాన్ని అభినయీస్తూ, దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించాడు నసీరుద్దీన్.

తైమూర్ కి మతిపోయింది.

అంత అద్భుతమైన గుర్రాన్ని తేరగా నసీరుద్దీన్ కి ఇచ్చేసినందుకు ఏడుపొచ్చింది. ఎలాగైనా ఆ గుర్రాన్ని తిరిగి పొందాలని “నసీరుద్దీన్. నీకిచ్చిన గుర్రం ముసలిది. ఆకాశంలో ఎగర గలదేమో గానీ, మామూలు సమయాల్లో వేగంగా పరిగెత్తలేదు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. నీకు మరో మంచి గుర్రం ఇస్తాను” అన్నాడు.

నసీరుద్దీన్ నసుగుతూ “హూజూర్! ఇచ్చిన వస్తువు తిరిగి తీసికొన్నారనీ చెడ్డపేరు మీకు వస్తుందేమో! నా మూలంగా మీకు చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు” అన్నాడు.

నసీరుద్దీన్ ని బ్రతిమాలి బామాలి, ఎదురు డబ్బిచ్చి, మరో మంచి గుర్రాన్నిచ్చి నసీరుద్దీన్ దగ్గరున్న ముసలి చచ్చు గుర్రాన్ని తిరిగి కొనుక్కున్నాడు తైమూర్.

మర్నాడు వాళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళారు. గోబీ ఎడారి లోకి ప్రవేశించగానే, ముందు రోజులాగే ఆ రోజూ గాలీ వానా వచ్చాయి.
మంచి బలమైన గుర్రం ఎక్కిన నసీరుద్దీన్ ఆఘామేఘాల మీద ఊళ్ళోకి దౌడాయించాడు.

తైమూర్ ఎక్కిన ముసలి చచ్చూ గుర్రం, గాలీ వానా మొదలవ్వగానే శిలా విగ్రహం లాగా నిలబడిపోయింది. తైమూర్ దాన్ని కొరడాతో కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. బండతిట్లు తిట్టాడు. తన్నాడు. ఉహూ! ఏం చేసినా ఆ ముసలి గుర్రం అడుగు తీసి అడుగు వేయ్యలేదు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు తైమూర్.

ఆ తడిసిన దుస్తులతోనే వర్షం తగ్గాక ఊళ్ళోకి తిరిగి వచ్చాడు. దాంతో బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది.

ఆ రాత్రి నీరసంగా పక్కమీదకి వాలుతున్నప్పుడు అర్ధమయ్యింది తైమూర్ కి.......

తను, ముసలి గుర్రాన్నిచ్చినందుకే నసీరుద్దీన్ తనకి గుణపాఠం నేర్పాడని. అంతే!

కన్నంలో తేలు కుట్టిన దొంగలా కిక్కురమన కుండా ఉండిపోయాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes