RSS
Wecome to my Blog, enjoy reading :)

’ఏమీ లేదు’ అన్నదాన్నే ఇవ్వు!

అనగా అనగా.....

అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే ఊరు.

ఆ ఊళ్ళోని ఓ కట్టెలు కొట్టుకునే వాడు దాపులనే ఉన్న అడవికి కట్టెల కోసం వెళ్ళాడు. కష్టపడి ఓ పెద్దమోపు కట్టెలు కొట్టాడు. ఎత్తి నెత్తిన పెట్టుకొనేందుకు సాయం అవసరమై చుట్టూ చూశాడు.

దారిన పోతున్న ఓ బాటసారి కనబడ్డాడు.

"అయ్యా! కాస్త ఈ మోపు ఎత్తి నానెత్తిన పెట్టుకొనేందుకు సాయం పడతారా?" అర్ధించాడు కట్టెలు వాడు.

"అలాగే! దానికేం భాగ్యం! కానీ సాయం చేస్తే నాకేమిస్తావు?" కళ్ళెగరేస్తూ అడిగాడు బాటసారి.

"ఏమి లేదు బాబయ్య!” యధాలాపంగా జవాబిచ్చాడు కట్టెల వాడు.

"మాట తప్పకూడదు సుమా!” అంటూ కట్టెల మోపు ఎత్తుకోడానికి సాయపడ్డాడు బాటసారి.

మోపు నెత్తికెత్తుకొని ఇంటిదారిపట్టాడు కట్టెల వాడు.

"ఏమయ్యోయ్! నాకిస్తానన్నది ఇవ్వకుండా పోతున్నావు. ఇదేం న్యాయం?" అంటూ వెంటపడ్డాడు బాటసారి.

"నేనేమిస్తానన్నాను బాబయ్య! ఏమీ లేదనే చెప్పానే?" అయోమయంగా అడిగాడు కట్టెల వాడు.

"ఆ. అదే! అ ’ఏమిలేదు’ అన్నదాన్నే నా మొహాన పారేస్తే నా దారిన నేపోతా” విసుగ్గా అన్నాడు బాటసారి.

"ఏమీ లేని దాన్ని ఎక్కడి నుండి తెచ్చివ్వను బాబయ్య!” ఘోల్లుమన్నాడు కట్టెల వాడు.

"అదంతా నాకు తెలియదు. ’ఏమీ లేదు’ అన్నదాన్ని ఇస్తానన్నావు. మాట తప్పకూడదని ముందే హెచ్చరించాను కూడా. ఏమైనా సరే! నువ్వు నాకు ’ఏమీ లేదు’ అన్న దాన్ని బాకీ పడ్డావు. నా ’ఏమీ లేదు’ నాకిచ్చేస్తే సరి, లేకపోతే మర్యాద దక్కదు” పెడసరంగా హెచ్చరించాడు బాటసారి.

కట్టెల వాడు లబోదిబో మన్నాడు. బాటసారి అతడి వెంటపడి వేధించసాగాడు.

అలా గొడవపడు తూనే ఇద్దరు ఊళ్ళోకి వచ్చారు.

వారికి నసీరుద్దీన్ తారస పడ్డాడు.

"ఏమిటి గొడవ?" అడిగాడాయన.

విషయమంతా చెప్పుకొని బావురుమన్నాడు కట్టెల వాడు.

గట్టిగా తన వాదన వినిపించాడు బాటసారి.

చిరునవ్వు నవ్వాడు నసీరుద్దీన్.

"కట్టెల మోపు నెత్తికెత్తుకోవడానికి సాయం పడితే ఏమిస్తానన్నాడు ఇతడూ?" నిర్ధారణ కోసం అన్నట్లుగా బాటసారిని అడిగాడు.

గొంతు సవరించుకొని “ఏమిస్తావని నేను అడిగినప్పుడు ఈ మనిషి, ’ఏమీ లేదు’ అన్నాడు. ఆ ’ఏమీ లేదు’ అన్నదే ఇచ్చేయమనండి. నాదారిన నేను పోతాను” మరింత రచ్చచేస్తూ అన్నాడు బాటసారి.

"తప్పకుండా నీ దారిన నువ్వు పోదూగాని! ఇంతకీ ఇప్పటికి ఏమిచ్చాడు ఈ కట్టెల వాడు నీకు?" ఆరాగా అడిగాడు నసీరుద్దీన్.

"ఏమీ లేదూ. అందుకేగా ఈ గొడవంతా” చిరాగ్గా చెప్పాడు బాటసారి.

"మరింకెందుకు గొడవ? నీ ’ఏమీ లేదు’ అన్నదాన్ని నీకిచ్చేశాడుగా!” అన్నాడు నసీరుద్దీన్.

అప్పటికే చుట్టుమూగిన జనం ఘోల్లున నవ్వుతూ చప్పట్లు చరిచారు.

సిగ్గుతో తలదించుకొన్నాడు బాటసారి.

"రక్షించారు బాబయ్య!” అంటూ కట్టెలు వాడు నసీరుద్దీన్ కి దండం పెట్టెశాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఆనందించడానికి ఇదీ ఒక మార్గమే !

అనగా అనగా.....

మౌల్వీ నసీరుద్దీన్ ఓసారి ఏదో పని ఉండి వీధిలో నడుచుకొంటూ పోతుండగా ఓ ధనికుడు తారసపడ్డాడు. అతడు చాలా ఖరీదైన దుస్తులు వేసుకొని ఉన్నాడు. కాని అతడి ముఖంలో ఏదో దిగులు, విచారం! నసీరుద్దీన్ అతణ్ణి తేరిపారా చూశాడు. కుతూహలంగా తోచింది. ఆగి పలకరించాడు. “ఈ పట్టణానికి కొత్తలా ఉన్నారు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకలా దిగులుగా ఉన్నారు?" అడిగాడు నసీరుద్దీన్.

ధనికుడు భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు.

"ప్రక్క నున్న పల్లె నుండి వచ్చాను” అన్నాడు.

నసీరుద్దీన్ కొనసాగించమన్నట్లుగా చూశాడు.

ధనికుడు “నాకు పది తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపద ఉంది. కాని ఆనందం మాత్రం లేదు. నేనెప్పడూ సంతోషంగా గడపలేదు” అన్నాడు విచారంగా.

"అదేం? ఆరోగ్యం లేదా?" అడిగాడు నసీరుద్దీన్.

"నాకేం. పిడిరాయిలా ఉన్నాను”.

"మరి సంతానం లేదా?"

"రత్నాల్లాంటి బిడ్డలు నలుగురున్నారు”కించిత్తు గర్వంగా చెప్పాడు ఆ ధనికుడు.

"వాళ్ళుత్త బడుద్దాయిలా?" అనుమానంగా అడిగాడు నసీరుద్దీన్.

"చాలా బుద్ధిమంతులు. నే గీచిన గీత దాటరు. చక్కగా వ్వాపారం చేసి భారీగా లాభాలు గడిస్తున్నారు?"

"మరేమిటి మీ సమస్య? ఎందుకు విచారం?" మరింత ఆరాగా అడిగాడు నసీరుద్దీన్.

"నాకన్నీ ఉన్నాయి, ఆనందం తప్ప. ఈ పట్టణం గురించి అందరూ చెప్పగా విన్నాను. అందుకే చూడటానికి వచ్చాను. ఇక్కడైనా నాక్కొంచెం సంతోషం దొరుకుతుందేమోనని ఆశ. అదీ తీరేటట్లుగా కనబడటం లేదు.”

నిర్వేదంగా చెప్పి నీరసంగా ముందుకు కదిలిపోయాడు ధనికుడు. సాలోచనగా అటువైపే చూస్తూ నిలబడ్డాడు నసీరుద్దీన్.

ఆ ధనికుడికి అన్నీ ఉన్నాయి. మరి ఆనందం ఎందుకు లేదు. తళుక్కున బుర్రవెలిగింది నసీరుద్దీన్ కి.

వెనుక నుండి పరిగేట్టుకుంటూ వెళ్ళి, ఒక్క ఉదుటున ధనికుడి చేతిలోంచి డబ్బు సంచీ లాక్కుని, ఇంకా వేగంగా పరుగెట్టి సందు మలుపులో దాగుండిపోయాడు.

"అయ్యో! అయ్యో. నాడబ్బు. నాడబ్బు” ఘొల్లుమన్నాడు ధనికుడు.

అతడి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కంగారూ, దుఃఖం, హడావుడీ, వత్తిడీ ముప్పరిగొన్నాయితణ్ణి, తేరుకొని గట్టిగా అరిచాడు.

"నాడబ్బు సంచీ లాక్కొని పారిపోతున్నాడు. దొంగా! పట్టుకోండి” భయంతో కీచుమంది ధనికుడి గొంతు.

వీధంతా హడావుడిగా ఉంది. ఎవరి పరుగులో వారున్నారు. ఎవ్వరూ అతడి గోల పట్టించుకోలేదు.

ధనికుడికేం చేయాలో పాలుపోలేదు. చాటుగా నసీరుద్దీన్ అతణ్ణి అనుసరిస్తూ, పరిశీలిస్తూనే ఉన్నాడు.

ధనికుడికి ఆకలి వేసింది. నీరసంగా ఉంది. అలిసిపోయాడు. ఎక్కడైనా బస చేద్దామన్నా, తిండి తిందామన్నా చేతిలో డబ్బులేదు.

దాదాపు ఏడుపొచ్చేసింది అతడికి. “ఈ ఉళ్ళో తెలిసిన వాళ్ళు కూడా లేరు. నేరకపోయి వచ్చాను. ఆనందం లేకపోతే పోయింది. ఇప్పడు తిండీ తిప్పలూ లేవు, నిద్రానిప్పులూ లేవూ. వెనక్కి వెళ్ళెందుకు దారి ఖర్చులు కూడాలేవు. ఏం చేయాలిరా బాబూ” అని గొణుక్కుంటూ రోడ్డుప్రక్కన చెట్టు క్రింద కూలబడ్డాడు.

అతణ్ణీ అనుసరిస్తున్న నసీరుద్దీన్ చెట్టు చాటు నుండి అతడు ముందు పడేలాగా డబ్బు సంచీ విసిరేసాడు.

నీరసంగా తూగుతున్న ధనికుడి ముందు ఖణేల్ మంటూ నాణాల సంచి పడింది. తనదే. అచ్చంగా తనదే.

ఒక్క గెంతులో పైకి లేచాడు ధనికుడు. డబ్బు సంచి మీదకి ఒక్క దూకు దూకాడు. చేతిలోకి తీసికొని అనందంతో కెవ్వున కేక పెట్టాడు. కుప్పిగంతులు వేశాడు.

"ఓ హోహో! దొరికింది. నాడబ్బు దొరికింది” సంతోషంగా అరిచాడు.

చిరునవ్వుతో ఎదురుగా నిలబడ్డాడు నసీరుద్దీన్.

ఒక్కక్షణం అయోమయంగా చూశాడు ధనికుడు. మరుక్షణం నసీరుద్దీన్ ని గుర్తుపట్టాడు.

నవ్వుతూ చెప్పాడు నసీరుద్దీన్ “ఆనందించడానికి ఇదీ ఒక మార్గమే.”

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

నమ్మకానికి, అహంకారానికి ఫలితాలివి

అనగా అనగా.....

ఒక గురువు గారు ఓ పల్లె ప్రక్కన గల అడవిలో ఓ గురుకులం నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులుండే వారు. వారిలో ఒక శిష్యుడు గురువు పట్ల ఎంతో వినయం, గౌరవం, మీదు మిక్కిలి నమ్మకం కలవాడు.

ఓ రోజు గురువుగారు కొద్దిమంది శిష్యులతో కలిసి చిన్ననది పాయకి స్నానానికి వెళ్ళారు. ఆ సమయంలో ఈ శిష్యుడు నదికి ఆవలి వైపున ఉన్నాడు. గురువు గారు శిష్యుణ్ణి తన దగ్గరికి రావలసినదిగా సైగ చేసారు. శిష్యుడు పడవకోసం వేచి చూడలేదు. నది కడ్డంపడి నడవసాగాడు. గురువు మీద నమ్మకం ఉంచి, గురునామం ధ్యానిస్తున్నాడు.
ఆశ్చర్యం! అతడు నీటిలో మునిగి పోలేదు. నడవ గలుగుతున్నాడు.

గురువు అది చూశాడు. తన శిష్యుడి శక్తి చూసి అతడికి చాలా సంతోషం, గర్వం కలిగాయి. ’నా పేరుకే ఇంత మహిమ ఉంటే నాకు మరింత మహిమ ఉండి ఉండాలి. నేను నడుస్తాను నీళ్ళమీద’ అనుకున్నాడు గురువు.

నదిలోకి దిగి నడవడానికి ప్రయత్నిస్తూ ’నేను నేను’ అని తన పేరు జపించసాగాడు.

అంతే! నీళ్ళల్లో మునిగి చనిపోయాడు.

నమ్మకానికి, అహంకారానికి ఫలితాలివి.

ఇదీ కథ!

~~~~~~~

అనగా అనగా...

ఓ ఊరిలో ఒక అమాయకుడుండేవాడు. వాడోసారి పనిమీద ప్రక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. దారిలో చిన్న నదిని దాటవలసి వచ్చింది. మన వాడికి భయమేసింది. అంతలో అక్కడికొక యోగి వచ్చాడు. ఈ అమాయకుడు తననీ నది దాటేలా చేయమని యోగిని ప్రార్ధించాడు. ఆయోగి ఇతడి కొక రాగి తాయత్తునిచ్చాడు. దాని మీద బీజాక్షరాలు [మంత్రాక్షరాలు] వ్రాసి ఉన్నాయని, చెప్పి అది వాడి కిచ్చి “నాయనా! ఈ తాయత్తునూ చేతబట్టి, శ్రీరామ శ్రీరామ అని జంపిస్తూ నది దాటూ. ఒరవడిని తట్టుకొని నీట నడవగలవు” అని అన్నాడు.

ఈ అమాయకుడు యోగికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. యోగి తన దారిన తాను పోయాడు. అమాయకుడు ’శ్రీరామ శ్రీరామ’ అని జపిస్తూ నదిలో దిగాడు. ఆశ్చర్యం! వాడు నీటిమీద నడవగలుగుతున్నాడు. వాడికి పిచ్చి సంతోషం వేసింది. కించిత్తు గర్వంగా అనిపించింది. అప్పటికి సగం నది దాటాడు. ఉండీ ఉండీ వాడికి ఆ రాగి తాయత్తుమీద ఏమంత్రం వ్రాసి ఉందో అన్న కుతూహలం పుట్టింది. మడిచి ఉన్న రాగి తాయత్తు విప్పిచూశాడు. దాని మీద ’శ్రీరామ’ అని వ్రాసి ఉంది. అది చదివి ‘ఒట్టి రామా అనేనా? మంత్రమో, తంత్రమో కాదా!’ అనుకున్నాడు.

ఆ క్షణమే వాడు నీటిలో మునిగి పోయాడు.

ఇదీకథ!


మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వెళ్ళిన దారినే రావాలి!

అనగా అనగా.....

ఓ అడవి. అందులో ఎన్నో జంతువులూ ఉన్నాయి.

వాటిల్లో ఓ నక్క.

దాని దురదృష్టం కొద్దీ, దానికి 10 రోజులుగా తిండి దొరక లేదు. నీరసించిపోయింది. డొక్క ఎండి పోయింది.

అలాగే కాళ్ళీడ్ఛుకొంటు ఆహారం వెదకసాగింది.

అదృష్టం!

ఓ చెట్టు తొర్రలో దానికి ఆహారం కన్పించింది.

చెట్లు కొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళో, లేక వేటగాళ్ళో లేక యాత్రికులో దాచుకున్న అన్నం మూట దానికి కన్పించింది.

చెట్టు తొర్ర సన్నగా ఉంది.

లోపల తిండి దండిగా ఉంది.

వాసన నోరూరిస్తోంది, ఆకలి ఆగనంటోంది.

ఎండిన డొక్కతో ఉన్న నక్క ఒక్క ఉదుటున తొర్రలోకి దూరింది.

అన్నం పప్పు, కూరలు, అప్పడం, అప్పాలతో కమ్మటి భోజనం.

కడుపునిండా మెక్కెసింది.

పొట్టలావుగా అయ్యింది.

ఇప్పడు ఓ చిక్కొచ్చింది నక్కకి.

దాని శరీరం తొర్ర వెడల్పు కన్నా ఎక్కువలావుగా ఉంది. బయటకి రావడం కుదరటం లేదు.

లోపలే ఉంటే, తిండి దాచుకొన్న మనుషులొచ్చి నాలుగు పీకితేనో?

లేక తన్ని తగలేస్తే నో!

తలుచుకొంటేనే వళ్ళు జలదరించింది దానికి.

కుయ్యోమొర్రో మంటూ మొత్తుకోవటం మొదలుపెట్టింది.

ఆ దారినే పోతున్న ఓ కుందేలు నక్క ఏడుపు విన్నది.

దగ్గరికొచ్చి చెట్టుతొర్ర కేసి చూసింది.

ఏడుస్తున్న నక్కని చూసి, "ఏమిటి సంగతి నక్కబావా" అంది.

నక్క వివరంగా చెప్పింది వెక్కిళ్ళుపెడుతూ.

"మరి లోపలికి వెళ్ళేటప్పడు ఎలా వెళ్ళావు?" లాజికల్ గా అడిగింది కుందేలు ప్రశ్నార్ధకపు ముఖం పెట్టి.

"ఆకలితో డొక్క ఎండి అప్పడు సన్నగా ఉన్నాను" అంది నక్క ఏడుపుముఖపెట్టి.

"అయితే వెళ్ళిన దారిలోనే తిరిగి రా నక్క బావా?" అంది కుందేలు చిరునవ్వుతో కళ్ళు మెరుస్తుండగా.

"అంటే మళ్ళీ 10 రోజులు పస్తుండలా?" భోరుమంది నక్క.

"అంతే మరి! కాకపోతే ఈసారి 10 రోజులు పట్టదులే. పస్తులయితే తప్పదు" అంది కుందేలు నింపాదిగా.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఏనుగు - గ్రుడ్డి వాళ్ళు

అనగా అనగా.....

ఒకసారి నలుగురు గ్రుడ్డివాళ్ళు కలిసి ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకొన్నారట. నలుగురు ఏనుగుని చేరారు.

ఒకడు దాని కాళ్ళని తడిమాడు “ఒరేయ్! ఏనుగు స్తంభంలా ఉంటుందిరా. మాఇంటి వసారాలో స్తంభాలిలాగే ఉంటాయి” అన్నాడు.

మరొకడు దాని చెవులు తడిమాడు. “కాదురా! ఏనుగు చేటలా ఉంటుంది. మా అమ్మ రోజూ బియ్యం చెరిగే చేట నాకు బాగా తెలుసు. ఏనుగు చేటలా ఉంది” అన్నాడు.

ఇంకొకడు దాని కడుపు తడిమాడు. “ఛస్! నోరు ముయ్యండిరా! మీకేం తెలీదు. ఏనుగు పెద్ద బాన లాగా ఉంటుంది. మాదొడ్లో బాన కన్నా కూడా పెద్దది” అన్నాడు.

నాలుగో వాడు దాని తోక తడిమాడు. నెత్తి నోరూ కొట్టుకుంటూ “అయ్యయ్యో! కాదర్రా. మీరలా పొరపాటు పడుతున్నారు. ఏనుగు బారెడు తాడులా ఉంటుంది. మీకర్ధం కావటం లేదు” అన్నాడు

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

విభజించి - పాలించు అని చెప్పే కణిక నీతి కథ

అనగా అనగా.....

ఈ కథ మహా భారతం, ఆది పర్వంలోనిది.

కౌరవ పాండవుల విద్యా ప్రదర్శన ముగిసింది. ప్రజల్లో పాండవుల పట్ల ఆదరణా, ఆరాధనా పెరిగిపోతున్నాయి. అనివార్యమై ధర్మరాజుకి యువరాజుని చేశాడు ధృతరాష్ట్రుడు. సద్గుణ సంపన్నుడూ, దయార్ధ్ర హృదయుడూ, ధెర్యస్ధెర్య సమన్వితుడూ అయిన ధర్మరాజు తన ప్రవర్తనతో ప్రజల మనస్సులను గెలుచుకున్నాడు. అర్జునుడు సోదరులతో జైత్రయాత్ర చేసివచ్చాడు. నానాటికి పాండవుల కీర్తి పెరిగిపోయింది.

ఇది ధృతరాష్ట్రుని హృదయాన్ని కలచివేసింది. ధృతరాష్ట్రునికి ముగ్గురు మంత్రులు.

అందులో ప్రధాని విదురుడు. ఈయన విద్వాంసుడు, ధర్మపరుడు, నీతికోవిదుడు. నిష్కర్షగా రాజు లోటుపాట్లని నిస్సంకోచంగా ముఖమ్మీదే చెప్పగల ధైర్యశాలి.

రెండవ వాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వహిస్తూ నిరంతరం ధృతరాష్ట్రుని ఆంతరంగిక సలహాదారుగా ఉంటాడు. వినయశీలి.

మూడవ వాడు కణికుడు. ఈయన కూటనీతి కుశలుడు. అంటే మోసంతో, కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు.

అలాంటి కణికుడిని ధృతరాష్ట్రుడు ఏకాంతానికి రప్పించి తన బాధ, కాంక్ష తెలియజేశాడు.

ఆ నీతివేత్త “మహారాజా! శతృనాశనానికి ముందు వారి ఉత్సాహ, ఐశ్వర్య, మంత్రాంగాలనే మూడు మార్గాలను నాశనం చేయాలి. అమాత్య[అంటే మంత్రులు, కార్యదర్శులన్న మాట], దుర్గ[అంటే పట్టణాలు, నగరాలన్న మాట], కోశ[అంటే ధనపునిల్వలు], సేన[పాలనా యంత్రాంగం, సైన్యాలు], రాష్ట్రాలు[రాజ్యంలోని అంతర్భాగాలన్న మాట] ఈ ఐదు వర్గాలనూ నాశనం చేయాలి.

సామ దాన భేద దండ ఉద్భంధన విషప్రయోగ అగ్ని ప్రసరణ మార్గాలలో శత్రువుల్ని నాశనం చేయాలి. శతృబలాన్ని మొదలంటూ నాశనం చేసి, తర్వాత వారి ఆశ్రయు వర్గాన్ని [అంటే అనుచరవర్గం అన్నమాట] నాశనం చేయాలి.

శతృవులని విభజించి గెలవాలి.

మహారాజా! వారిలో పిరికి పందల్ని భయపెట్టాలి. లోభికి ధనమిచ్చి లోబరుచుకోవాలి. బలహీనుడయితే పరాక్రమంతో స్వాధీనం చేసుకోవాలి. సమబలునితో స్నేహం చేయాలి. విషం తినిపించి గానీ, మోసగించి గాని శతృవుని క్రమంగా కడతేర్చాలి.

ఇది నీతి శాస్త్రం చెప్పే విషయం!

శతృవుని సాధించ దలిచినప్పడు [అంటే హెరాజ్ చెయ్యాలనుకొన్నప్పడు] క్రోధం పనికిరాదు. చిరునవ్వుతో చరిస్తూ వాడికి విశ్వాసం కలిగించి పాములా కాటు వేయాలి. ఎటువంటి ఘాతకం తలపెట్టినా ఆ విషయం పైకి తెలియకుండా, చిరునవ్వుతో, మృదుభాషణ తో ఓరిమి వహించి అదునెరిగి నెరవేర్చుకోవాలి.

ఆశలు రేకెత్తించాలి కాని అవి నెరవేర్చకూడదు. అలాగని ఆ భావం ఎదుటి వారికి తెలియనివ్వకుండా వాయిదాలు వేస్తుండాలి. ఇనుముతో చేసిన కత్తిని తోలు కవచంతో భద్రపరచి, అవసరానికి తీసి కేశ ఖండనానికి వినియోగించి నట్లుండాలి. మన మంత్రాంగం, మనం ఏ పనిచేసినా అది మనకి మరిన్ని ఆపదలు తెచ్చిపెట్టకూడదు.

ఒక కథ చెబుతాను వినండి మహారాజా!

అనగా అనగా ...

ఓ మహారణ్యం.

ఆ అడవిలో ఎన్నో కౄరమృగాలు యధేచ్చగా విహరిస్తూన్నాయి. అక్కడి ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది, కుటిల బుద్ది కలది. తన పనులన్నీ ఇతరులు చేత చేయించుకొని, పని పూర్తి కాగానే వారిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది.

ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు.

పులి, తోడేలు, ముంగిస, ఎలుక.

ఈ నక్క వీటితో కలిసి మెలిసి ఉన్నట్లు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నది.

ఆరోజులలో ఒకనాడు --

పిక్కబలిసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ, చెంగుచెంగున దూకుతూ పోయే లేడి దాని కంటపడింది. ఆలేడి ఈ మిత్రబృందాన్ని దూరం నుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. దాన్ని తినాలని నక్కకు కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టడం సాధ్యం కావడం లేదు.

బాగా ఆలోచించింది నక్క.

మిత్రులను చుట్టూ కూర్చో బెట్టుకుని,

"స్నేహితులారా! ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయితే దానితో పరుగెత్తే శక్తి మనకెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. ఇప్పడు మనం ఒక కుట్రపన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం అరగించవచ్చు” అని నాలుక చప్పరించి, అది ఎంత రుచిగా ఉంటుందో చూపించింది.

అన్నిటికీ నోరూరించి.

"ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం” అన్నాయి అవి ఆతురతతో అటే చూస్తూ.

అది కొంత సేపు ఆలోచన అభినయించింది.

"ఆ! ఇప్పడు ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి.ఈ లేడి మెలకువగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలిసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పడు చప్పడు కాకుండా పాకుతూపోయే ఈ ఎలక బావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అదనులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే!” అంది.

దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి.

అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతులేస్తూ, పచ్చికమేసి, సెలయేటి ఒడ్డున నీరు త్రాగి, బాగా అలిసి విశ్రాంతిగా కాళ్ళు జాపి నిద్రపోతున్నది లేడి.

నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలకవెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతుండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది.

నక్కతో పాటు దాని స్నేహితులు నలుగురూ సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి.

అప్పడా నక్క:

"న్నేహితులారా! ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పడు మీ శరీరాలన్నీ దుమ్మూ ధూళితో ఉన్నాయి. అందుచేత ఆకొండ లోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు” అంది.

అవి నాలుగూ సంతోషంతో స్నానానికి వెళ్ళాయి.

అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని.

నక్క బొటబొటా కన్నీరు కారుస్తూంటే చూసిన పులి,

"బావా! ఎందుకు విచారిస్తున్నావు?" అంది.

"ఏం చెప్పను పులిబావా! ఆ ఎలక లేదూ! అది ఏమన్నదో తెలుసా! ’పులి ఎంత పెద్ద జంతువైతే ఏంలాభం? నేను కాళ్ళు కొరికితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తూంది సిగ్గులేకుండా,’ అని వేళాకోళం చేస్తే
నాకు బాధ కలిగింది” అంటూ నక్క కన్నీరు విడిచింది.

పులికి పౌరుషం వచ్చింది.

"మిత్రమా! ఎలక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరిమీద ఆధారపడను” అంటూ వెళ్లిపోయింది.

అంతలో ఎలక రాగా, నక్క

"విన్నావా, ఎలక బావా! ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎలకనూ తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది” అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది.

మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. “విన్నావా! పులి బావకు నీ మీద కోపం వచ్చి, నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట”, అనడంతో తోడేలు దౌడు తీసింది.

అప్పడు ముంగిస రాగా, “చాలా ఆశగా వచ్చావు. వాళ్ళ ముగ్గుర్నీ చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను” అనగా అది తోక ముడిచి పారిపోయింది.

హాయిగా ఆ లేడి మాంసం ఆరగించింది నక్క.

విన్నారా! మహారాజా! తెలివితో, వంచనతో మనకార్యలు చక్క బెట్టుకోవాలి” అన్నాడు కణికుడు.

ఇదే కణిక నీతి.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

కోకిలమ్మ వైద్యం

అనగా అనగా.....

ఓ అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులూ, పక్షులూ ఉండేవి. అప్పటికి గుడ్లగూబలు కూడా పగలు తిరుగుతూ రాత్రి నిద్రపోయేవి.

ఓరోజు ఆ అడవి దాపులనే ఉన్న ఓగ్రామం నుండి ఓ కుర్రాడు ఉండేలు తీసుకొని అడవికి వచ్చాడు. వాడు బంక మట్టితో చిన్న గోళీకాయలంత ఉండలు చేసి ఉండేలులో బెట్టి పక్షుల్ని కొడుతున్నాడు. ఒకటి రెండు పిట్టలు వాడి బారిన పడ్డాయి. కొమ్మ మీద కూర్చొని దిక్కులు చూస్తున్న గుడ్లగూబకి రెక్కక్రింద ఉండేలు మట్టి ఉండ గుచ్చుకొంది. బాధతో కీచు మంది గుడ్లగూబ.

అంతలో అటువైపు కౄరజంతువులు రావడంతో ఉండేలు కుర్రాడు అక్కణ్ణుండి పారిపోయాడు.

గుడ్లగూబ బాధతో చెట్టుకొమ్మల్లో చతికిలబడింది. గట్టిగా ఏడవడం మొదలెట్టింది. కాకి దాన్ని చూసి మెల్లిగా దగ్గరికొచ్చింది.

"ఏం జరిగింది గూబమామా? ఎందుకు ఏడుస్తున్నావు?" అంది. గుడ్లగూబ ఎక్కిళ్ళుపెడుతూ “ఎవడో కుర్రవెధవ! రాయితో కొట్టాడు అల్లుడూ” అంది.

"అయితే వైద్యుడి దగ్గరికి పోరాదూ?" అంది కాకి సానుభూతిగా.

"వైద్యుడెక్కడున్నాడు?" మూలుగుతూ అడిగింది గుడ్లగూబ.

"కోకిలమ్మ చాలాబాగా వైద్యం చేస్తూంది. కాకపోతే వూరికే చేయదు. మనమే దైనా ప్రత్యుపకారం చెయ్యాలి" అంటూ కాకి వివరించింది.

గుడ్లగూబకి నొప్పి మరీ ఎక్కువై ఇంకా గట్టిగా ఏడుస్తోంది. పాపం! కాకికి దాన్ని చూసి చాలా జాలివేసింది.

గుడ్లగూబ రెక్కకి తన రెక్కలానించి మెల్లిగా దాన్ని కోకిలమ్మ దగ్గరికి తీసికెళ్ళింది.

"ఎవరికి జబ్బూ?" పరిశీలనగా చూస్తు అడిగింది కోకిలమ్మ.

"గూబ మామాకి. ప్రొద్దునే ఎవరో కుర్రకుంక రాయితో కొట్టాట్టా" చెప్పింది కాకి.

కోకిలమ్మ గుడ్లగూబని పరిక్షించింది. రెక్కక్రింద బంకమన్ను రాయి ముద్ద కనబడింది.

"వూ. వైద్యం చేస్తాను. మరి నాపారితోషికం ఎవరిస్తారు?" అంది ముందు జాగ్రత్తగా.

గూబ కుయ్యు మందిగాని “సరే నేనిస్తాను” అనలేదు.

కోకిలమ్మ మళ్ళీ అదే ప్రశ్నవేసింది.

ఈసారి గుడ్లగూబ మరింత గట్టిగా ఏడుపులూ పెడబొబ్బలూ పెట్టింది గానీ, వైద్యం ఖర్చు నేనిస్తాననలేదు.

ఇదంతా చూస్తూన్న కాకి, "ఫీజు దేముంది కోకిలమ్మ? ముందు రోగి ప్రాణం ముఖ్యం కదా? వైద్యం చెయ్యి” అంది ఆదుర్దాగా.

"మరి నా ఫీజు?" సందేహంగా అడిగింది కోకిలమ్మ.

"గూబమామా ఇస్తాడులే. నాదీ పూచీ!” అంది పుచిక్కని కాకి. ఎంతైనా వైద్యం చేయించుకొని ఫీజు ఎగ్గొట్టదులే గుడ్లగూబ అన్న భరోసాతో.

"సరే” అంటూ వైద్యం ప్రారంభించింది కోకిలమ్మ.

గుడ్లగూబని ఆ అడవిలో ఉన్న వేడినీటి బుగ్గ దగ్గరికి తీసికెళ్ళి వేడినీటిలో ఓ ఘడియ సేపు గుడ్లగూబ రెక్కలు తడిసేలా కూర్చోబెట్టింది. వెచ్చని నీటికి మట్టి ఉండ కరిగిపోయింది. గుడ్లగూబకి నొప్పి తగ్గిపోయింది. హుషారుగా పైకి లేచింది గుడ్లగూబ.

"నా ఫీజు?" వెంట బడింది కోకిలమ్మ.

"ఏం ఫీజు? నేనిస్తానన్నానా?" అంది దబాయింపుగా గుడ్లగూబ.

కోకిలమ్మ కాకి నడిగింది.

కాకి “అదేమిటి గూబ మామా! కోకిలమ్మ నీకు వైద్యం చేసింది కదా! మరి ఆఖర్చు ఇవ్వద్దూ” అంది.

"ఎవరు చెయ్యమన్నారు వైద్యం? నేనిస్తానన్నానా ఫీజు?" పెడసరంగా అంది గుడ్లగూబ. మరుక్షణమే అక్కణ్ణుంచి ఎగిరిపోయింది.

"కాకి! అదంతా నాకు తెలీదు. నువ్వు రోగిని నాదగ్గరికి తెచ్చావు. నీది పూచీ అంటేనే నేను వైద్యం చేసాను. కాబట్టి నువ్వే నా ఫీజు కట్టు” అంది కోకిలమ్మ.

"బాగుంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుంది. పోన్లే పాపం ఏడుస్తోందని సాయం వస్తే నేనేందుకు ఫీజు కట్టాలి? నువ్వు నాకు వైద్యం చేసావా ఏమిటి?" కాకి వాదన పెట్టుకొంది.

కాస్సేపటికి తగవు పెద్దదయ్యింది.

పది పక్షులు చుట్టూ చేరాయి. రాజు దగ్గర ఫిర్యాదు చేయటం మేలని అన్ని పక్షులూ సలహా ఇచ్చాయి.

సరేనని కాకి, కోకిలా, నెమలి రాజు ఆస్ధానానికి వెళ్ళివిన్నవించుకొన్నాయి.

పక్షుల రాజు నెమలి గుడ్లగూబని పిలిపించి విచారణ మొదలుపెట్టింది.

కోకిలమ్మ, కాకి వివరంగా అన్ని విషయాలూ చెప్పాయి. నెమలి గుడ్లగూబని సంజాయిషీ అడిగింది.

"రాజా! నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు. నాపాటికి నేను ఏడుస్తూంటే కాకి తీసుకెళ్ళింది. కోకిలమ్మ కి వైద్యం ఖర్చు చెల్లిస్తాననలేదు. కావాలంటే కోకిలమ్మనే అడగండి” అంది గుడ్లగూబ తన వాదనని బలంగావినిపిస్తూ.

కోకిలమ్మ “నిజమే ప్రభూ! అక్కడికీ నేను రెండు మూడు సార్లు నొక్కి అడిగాను. ఈ గుడ్లగూబ కుయ్యిమంది గాని వైద్యంకు కూలీ ఇస్తానన లేదు. కాకే నాదీ పూచి అంది. అందుకే వైద్యం చేసాను” అంది వినయంగా.

కాకి “అవును ప్రభూ! నొప్పితో ఏడుస్తూంటే నేనే గుడ్లగూబ వైద్యడి దగ్గరికి తీసికెళ్ళాను. కోకిలమ్మ కూలీ అడిగినప్పడు నొప్పితో జవాబు చెప్పలేక పోతుందను కొని నాదీ పూచి అన్నాను. ముందు వైద్యం అందితే గుడ్లగూబ ప్రాణం నిలబడుతుంది గదా అన్న తొందరలో అన్నాను. అంతే గాని ఏరు దాటి తెప్ప తగలేసినట్లు వైద్యం చేయించుకొని గుడ్లగూబ మాట మారుస్తూందనూ కోలేదు” అంది ఏడుపు గొంతుతో.

"అసలు నేను మాటే ఇవ్వలేదు ప్రభూ! ఇక మాట మార్చేందుకేముంది?" న్యాయచుక్క[లా పాయింట్] లేవనెత్తింది గుడ్లగూబ.
రాజ్యాంగ సంక్షోభంలో పడిపోయాడు నెమలి రాజు. పక్షి మేధావులతో చట్టసభా సంఘాన్ని [పార్లమెంటరీ సంఘాన్ని] నియమించాడు. వాళ్ళుకొన్నినెలలు అధ్యయనం చేసి రాజుకి నివేదిక ఇచ్చారు.

రాజు తీర్పు ఇచ్చేరోజు పక్షుల సభ కిక్కిరిసి పోయింది. అందరూ రాజు ఏం తీర్పు చెబుతాడా అని ఆత్రంగా ఎదురుచూస్తూన్నారు.

చివరకి నెమలి రాజు తీర్పు చెప్పాడు.

"కోకిలమ్మ, గుడ్లగూబకే వైద్యం చేసినా, కూలీ గురించి గుడ్లగూబతో ఒప్పందం చేసుకోలేదు. ఆ విషయమై ముందే కోకిలమ్మ పక్కా ఒప్పందం ఉంటే సమస్య లేక పోయేది. అయితే కాకి పూచిని నమ్మింది. ఆ విషయం కాకి కూడా ఒప్పకుంది. కాబట్టి కోకిలమ్మకి కాకి వైద్యపు కూలీ ఇచ్చితీరాలి”.

తీర్పు విని గుడ్లగూబ చప్పట్లు చరిచింది.

కోకిలమ్మ “హమ్మయ్య!” అనుకొంది.

పక్షులన్నీ బిత్తరపోయాయి.

కాకి ఘోల్లుమంది.

"మహాప్రభో! నాదగ్గర డబ్బెక్కడిది? ఏదో సాటి పక్షి బాధ పడుతోంది కదా అని సాయం వెళ్ళినందుకు నాకా శిక్ష” అక్రోశంతో అడిగింది కాకి.

"న్యాయశాస్త్ర పరంగా అంతే” అంది చట్టసభాసంఘం. అంగీకారంగా తలవూపింది నెమలి రాజు.

"పేదవాణ్ణి. కనికరించండి బాబోయ్!” ఏడుపులంకించుకొంది కాకి.

"డబ్బులేక పోతే నీ సేవతో బకాయి చెల్లించు” ఇదే తుది తీర్పన్నట్లు నెమలి రాజు సభాచాలించి ఇంటికెళ్ళి పోయింది.

ఆనాటి నుండి కోకిలమ్మ గుడ్లని కాకి పొదిగి, పిల్లల్ని పెంచసాగింది. ఆవిధంగా సేవ చేసి బకాయి తీర్చుకొంటుంది.

కానీ ఈ అన్యాయం చూసి పక్షులకి ఒళ్ళుమండింది. అన్నీ కలిసి గుడ్లగూబ అన్యాయాన్ని, అనైతికతనీ తిట్టి పోసాయి. అది కన్పిస్తే చాలు అసహ్యంతో మొహం తిప్పుకొన్నాయి. శాపనార్దాలు పెట్టాయి. అవమానించాయి.

దానితో గుడ్లగూబకి పక్షుల ముందుకు రావడానికి మొహం చెల్లక పగలు గూట్లోనో, చెట్టు తొర్రల్లోనో దాక్కుని రాత్రిళ్ళు ఆహారం వెదుక్కోవడం మొదలెట్టింది.

ఆనాటి నుండి ఈనాటి వరకూ కోకిల గుడ్లని పొదిగి పిల్లల్ని చేస్తూ కాకులూ, పగలు నిద్రపోయి రాత్రి సంచరిస్తూ గుడ్లగూబలు బ్రతకసాగాయి.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

హైసర బజ్జా

అనగా అనగా.....

రామాపురం అనే ఊర్లో రాజశేఖరం అనే యువకుడుండే వాడు. ఇతడు కొంచెం అమాయకుడు. దానికి తోడు ఙ్ఞాపకశక్తి పెద్దగా ఉండేది కాదు. అతడికి పెళ్ళై భార్య విశాలాక్షి కాపురానికొచ్చింది. విశాలాక్షి అణకువ గల పిల్ల. పనీ పాటలు తెలిసిన అమ్మాయి.

ఓసారి రాజశేఖరుడు ఏదో పని ఉండి ప్రక్కఊరు రాఘవాపురం వెళ్ళాడు. పని పూర్తయ్యాక ఆ ఊళ్ళోనే ఉన్న మేనత్తని చుట్టపు చూపు చూడబోయాడు. రాక రాక వచ్చిన మేనల్లుణ్ణి అతడి మేనత్త ఎంతో సంతోషంగా ఆహ్వానించి ఆదరించింది. పిండి వంటలతో భోజనం పెట్టింది. భోజనంలో వడ్డించిన బూరెలు రాజశేఖరానికి తెగనచ్చేసాయి. ఒకటికి రెండు అడిగి పెట్టించుకొని తిన్నాడు.

“అత్తా! వీటి పేరేంటి?” మొహమాట పడుతూ అడిగాడు రాజశేఖరుడు. ఆవిడ అభిమానంగా నవ్వుతూ “బూరెలంటారు నాయనా? మరి నాలుగు కట్టివ్వనా?”అంది.

"వద్దులే అత్తా! విశాలాక్షికి అన్నీ వచ్చు. వండించుకు తింటాలే!” అంటూ ఇంటికి బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణం అంటే కాలినడక లేదా ఎద్దుల బళ్ళే శరణ్యం కదా! మనవాడు నడుచుకుంటూ బయలుదేరాడు. ఎక్కడ పిండి వంట పేరు మరిచిపోతానో అనుకుంటూ “బూరెలు, బూరెలు” అని వల్లిస్తూ అడవిదారి వెంట నడవ సాగాడు.

దారిలో చిన్న నీటి పాయ వచ్చింది. ఎగిరి దాని మీదుగా దూకూతూ వూపు కోసం “హైసర బజ్జ” అన్నాడు.

అంతే!

బూరెల పేరు మరిచిపోయి, ’హైసరబజ్జా’ అని జపం చేస్తూ ఇల్లు చేరాడు. ఇంటికి రాగానే భార్యని పిలిచి తన మేనత్త వడ్డించిన పిండివంట రుచిని తెగ వర్ణించి, తనకు వండి పెట్టమన్నాడు.

"వాటినే మంటారని చెప్పారు, మీ మేనత్త గారు?" అనడిగింది విశాలాక్షి.

"హైసరబజ్జ!” టక్కున చెప్పాడు రాజశేఖరం.

అదేం పిండి వంటో విశాలాక్షి కి అర్ధం కాలేదు.

"ఎలా ఉన్నాయి? తియ్యగానా, కారంగానా?" అంది.

"తియ్యగా ఉన్నాయి. గుండ్రంగా అరచేతి మందాన ఉన్నాయి?" అన్నాడు.

“దేనితో చేస్తారో?” మెల్లిగా గొణిగినట్లు అడిగింది.

“వరిపిండి తో నట” కొంచెం కరుగ్గా చెప్పాడు రాజశేఖరం.

ఇంకా ఏమంటే భర్తకి ఎంత కోపం వస్తుందోనని విశాలాక్షి లోపలికెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా భర్తకంత నచ్చిన ఆ
‘హైసర బజ్జ’ ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు.

చివరకి కుడుములై ఉంటాయను కొని, బియ్యప్పిండి, బెల్లం కలిపి, అరచేతి మందాన ఆవిరిలో ఉడికించి గుండ్రని కుడుములు చేసింది. చిన్నపళ్ళెంలో తెచ్చి భర్త ముందు పెట్టింది.

ఎంత నచ్చినా, మేనత్త ఇంట్లో తనివి తీరా బూరెలు తినడానికి మొహమాట పడ్డ రాజశేఖరం, ఇప్పడు భార్య వండి పెడితే తెగ లాగించెయ్యాలని ఆశగా ఎదురుచూస్తూన్నాడు. భార్య తెచ్చిన కుడుములు చూసేసరికి అతనికి కోపం నషాళానికంటింది. [కోరిక లేదా కామం తీరక పోతే క్రోధం పర్యవసానమని భగవద్గీత చెబుతుంది]

భార్య అలుసుగా కనబడి ఒక్క పెట్టున ఆ పిల్ల చెంప ఛెళ్ళుమనిపించాడు. విశాలాక్షి ఘోల్లుమంది.

ఈ గొడవుకి ప్రక్కింటి పిన్నిగారు పరుగెత్తుకొచ్చింది. అప్పటికే విశాలాక్షి చెంప వాచి పోయింది.

అది చూసి ప్రక్కింటి పిన్నిగారు “అయ్యో! అదేమిటి నాయనా, అమ్మాయిని అలా కొట్టావు? పిల్లబుగ్గ బూరెలా పొంగి పోయింది చూడు” అంది మందలింపుగా.

"ఆ అదే పిన్నిగారు, అదే! బూరె బూరె!” అన్ని మరిచి పోయి ఆనందంగా గావుకేక పెట్టాడు రాజశేఖరం.

నొప్పి, అవమానం మరిచిపోయి ఫక్కున నవ్వింది విశాలాక్షి.

విషయం తెలిసాక విరగబడి నవ్వారు ప్రక్కింటి పిన్నిగారు.

రాజశేఖరం భార్యకి క్షమాపణ చెప్పుకొన్నాడు.

బియ్యం నానపోసి దంచి విశాలాక్షి తియ్యటి బూరెలు చేసి పెట్టింది.

ప్రక్కింటి పిన్నిగారితో సహా అందరూ ఆనందంగా ఆరగించారు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

మిఠాయి కొట్టు

అనగా అనగా.....

చింతలపల్లి అనే ఓగ్రామం ఉండేది. ఆ గ్రామాధికారి పేరు ఆదిశేషయ్య. అతడి భార్య పేరు అనసూయమ్మ. కొద్దిరోజులు క్రితం వారి కుమార్తె పెళ్ళి అయ్యింది. ఇక పిల్లని చీరె సారెలతో అత్తవారింటికి పంపాలి.

ఓ రోజు ఉదయాన్నే అనసూయమ్మ భర్తతో “ఏమండోయ్! ఎల్లుండి గురువారం. ఆరోజు అమ్మాయిని అత్తవారింటికి పంపాలి. పది మణుగులు నేతి మిఠాయిలు కావాలి. సుబ్బయ్య మిఠాయిల దుకాణం నుండి తెప్పించండి” అంది.

ఆది శేషయ్య సాలోచనగా “అలాగే” అన్నాడు.

వెళ్ళి వీధి అరుగు మీద కూర్చున్నాడు. అనసూయమ్మ పనులు హడావుడిలో పడిపోయింది. రెండు ఘడియల తర్వాత చూస్తే ఆదిశేషయ్య వీధి అరుగు మీదే కూర్చోని ఏవో కచేరి [ఆఫీసు] కాగితాలు చూసుకుంటున్నాడు.

అనసూయమ్మ వీధి అరుగు దగ్గరికి వచ్చి భర్త వైపు ప్రశ్నార్ధకంగా చూసింది.

కాస్త ఆగమన్నట్లుగా ఆదిశేషయ్య చేసైగ చేసాడు. ఆవిడ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నమయ్యింది. అప్పటికీ ఆది శేషయ్య వీధి అరుగు మీదే కూర్చోని, కచేరీ పనుల నిమిత్తమై తనకోసం వచ్చిన గ్రామస్తులతో మాట్లాడుతున్నాడు. అనసూయమ్మ అసహనంగా ఇంట్లోంచి బైటకొచ్చింది. ఆదిశేషయ్య నింపాదిగా ఉన్నాడు.

భోజనాలవేళ ఆవిడ భర్తమీద ఖయ్యిమంది. “పిల్లకి సారె చీరె లిచ్చి పంపాలి, మిఠాయిలు తెప్పించమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉలకరు, పలకరేం?” అంది రుసరుసలాడుతూ.

ఆదిశేషయ్య నిమ్మకు నీరెత్తినట్లు, నింపాదిగా “ఆపని మీదే ఉన్నానులే!” అన్నాడు.

అనసూయమ్మ తెల్లబోయింది. మాట్లాడకుండా వూరుకొంది. సాయంత్రమైంది. మిఠాయిలింటికి రాలేదు.

రాత్రి భోజనాల వేళ భర్తకి మరోసారి గుర్తు చేసింది అనసూయమ్మ.

“ఎల్లుండి కి కదా మిఠాయిలు కావాలి? రేపు తెస్తానులే!” అన్నాడు ఆదిశేషయ్య.

"ముందుగా చెప్పకపోతే అన్నిరకాలూ దొరకవద్దూ?" దీర్ఘం తీసింది అనసూయమ్మ.

"మరేం ఫర్లేదు. అన్నిరకాలూ ఉంటాయి. నామీద భరోసా ఉంచు” తొణకని కుండలా చెప్పాడు ఆదిశేషయ్య.

ఇంకేమన లేక మౌనంగా వూర్కొంది అనసూయమ్మ.

మర్నాటి సాయంత్రం వరకూ కూడా అదే తంతు నడిచింది వీధి అరుగుమీద. చేసేది లేక అనసూయమ్మ చూస్తూ ఊర్కొంది.

సాయంత్రానికి ఆదిశేషయ్య పనివాణ్ణి వెంట బెట్టుకుని సుబ్బయ్య మిఠాయి దుకాణానికి బయలుదేరాడు. కాస్సేపటికల్లా ఇరవై మణుగులు నేతి మిఠాయిలు ఇంట దిగాయి. అనసూయమ్మ తెల్లబోయింది.

భర్తకి మంచినీళ్ళందిస్తూ “కావలసింది పది మణుగులైతే ఇరవై మణుగులు తెచ్చారేం? డబ్బు దండుగ కాదూ?” అంది.
"అదేం లేదు! ఇరవై మణుగులు కలిపి ఐదు మణుగుల ఖరీదుకే వచ్చాయి” అన్నాడు ఆదిశేషయ్య విజయదరహాసంతో.

"అదేలా?" ఆశ్చర్యంగా అడిగింది అనసూయమ్మ.

గుబురుమీసాలు సవరించుకొంటూ చెప్పాడు ఆదిశేషయ్య.

"పిచ్చిదానా? నీకన్నీ తొందరే! హుటాహుటిన నిన్నే సుబ్బయ్య దుకాణానికి మిఠాయిల కోసం వెడితే మణుగు ఖరీదు నాలుగింతలుండేది. నిన్న పొద్దున నువ్వు చెప్పగానే అరుగు మీద కూర్చొని నాతో పనిబడి వచ్చిన వారందరితో ‘సుబ్బయ్య కొట్లో మిఠాయిలు చద్ది వాసన వస్తూన్నాయంటగా?’ అంటూ గాలివార్త వదిలాను. అది నమ్మింది కొందరూ, నాతో పని ఉంది కాబట్టి నన్ను ప్రసన్నం చేసికొనేందుకు నమ్మినట్లు నటించినది కొందరూ. ఏమైతేనేం? మొత్తానికి అందరూ కలిసి సుబ్బయ్యకొట్లో మిఠాయిలు చద్ది వాసన వస్తున్నాయనీ పుకారు, గాలివార్తని ఊరంతా టాంటాం వేసారు. ఒకరికి పదిమంది అదే మాట అనేసరికి నిన్న సాయంత్రానికి సుబ్బయ్య మిఠాయిల ధర సగానికి సగం తగ్గించి అమ్మాడు. వార్త ప్రచారం ఆగకపోయేసరికి ఈరోజు సాయంత్రానికి ధర నాలుగో వంతుకి తగ్గించాడు. ఇప్పడు ఇరవై మణుగుల నేతి మిఠాయిలు, ఐదు మణుగుల ధరకే వచ్చాయి”.

అనసూయమ్మ భర్త తెలివితేటలకు తెగ మురిసిపోయింది. కించిత్తు గర్వంగా ఆదిశేషయ్య అనసూయమ్మ కేసి చూస్తూ “చూసావా? ఏ పని చేసినా మనచేతికి తడి అంటకుండా చేయాలి, నేర్పుగా ఓర్పుగా పని చక్కబెట్టాలి” అన్నాడు తత్త్వం బోధిస్తూన్నట్లు.

“నిజమే సుమా!” అంటూ తలూపింది అనసూయమ్మ.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

బావి కప్ప - సముద్రపు కప్ప

అనగా అనగా.....

ఓసారి సముద్రంలో తుఫాను రేగింది. ఎగసి పడే అలలకీ, సుడి గాలికీ ఓ కప్ప విధివశాత్తు చిక్కుకొని ఎగిరివచ్చి దాపులనున్న గ్రామంలోని బావిలో పడింది. సముద్రపు కప్పని చూచి ఆ బావిలోనే చాలాకాలం నుండీ నివసిస్తూన్న కప్ప గెంతుకుంటూ దగ్గరికొచ్చింది.

"ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు?" వింతగా చూస్తూ సముద్రపు కప్పని అడిగింది బావికప్ప.

"నేను సముద్రపుకప్పని. సముద్రం నుండి ఎగిరి వచ్చి, ఖర్మకాలి ఈ బావిలో పడ్డాను” అంది కొంచెం దర్పం, కొంచెం విచారం కలిపిన స్వరంతో సముద్రపు కప్ప.

"ఎందుకంత విచారం? ఈ బావి చాలా పెద్దది" అంది ఓదార్పుగా బావి కప్ప.

సముద్రపు కప్ప నిస్పృహగా బావి కప్పవైపో చూపు విసిరి "సముద్రం చాలా పెద్దది!" అంది.

"ఎంత పెద్దది?" అంది బావికప్ప కుతూహలంగా!

"చాలా చాలా పెద్దది." అంది సముద్రపు కప్ప.

పాపం! తన జీవితంలో సంభవించిన అంత పెను విషాదాన్ని ఇంకా అది జీర్ణించుకోలేదు. దాని నిర్వేదంలో అది ఉంది.

ఇదంతా పట్టించుకోని బావికప్ప "ఎంతపెద్దది సముద్రం? ఇంత ఉంటుందా?" అంటు బావిలో ఓ వృత్తం గీచి చూపెట్టింది.

సముద్రపు కప్పకి నవ్వొచ్చింది. ఆపైన బావి కప్పపై జాలేసింది. ఓపిగ్గా "కాదు. ఇంకా పెద్దది" అంది.

"అవునా? అయితే ఇంతపెద్దదా?" ఈసారి ఇంకొంచెం పెద్దవృత్తం గీచి అడిగింది బావికప్ప కళ్ళింత చేసి,

ఈసారి సముద్రపు కప్పకి ఏడుపొచ్చింది.

"కాదు. చాలా చాలా పెద్దది." అంది విసుగ్గా.

బావికప్ప ఇంకా పట్టుదలగా మరి కొంచెం పెద్దవృత్తం గీచి "ఇంత పెద్దదా?" అనడిగింది.

ఇక తట్టుకోలేక కెవ్వున కేకపెట్టి ఘొల్లుమంది సముద్రపు కప్ప. ఇక ఎంత చెప్పినా బావికప్ప సముద్రపు విస్తారతని అర్ధం చేసుకోలేదని అర్ధం చేసుకొంది.

బావికప్పపై జాలి పడింది.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

కంచే చేను మేస్తే…

అనగా అనగా.....


పూర్వం విచిత్రపురం అనే రాజ్యం ఉండేది. దానికి రాజు తంత్రవర్మ. ఇతడు కాస్తభోగలాలసుడూ, మరికాస్త స్వార్ధపరుడూనూ. అయితే ప్రజల అదృష్టం కొద్దీ ఇతడి మంత్రులు కొంత బుద్ధిమంతులు. అందుచేత రాజ్యపాలన కొంత సజావుగా సాగుతూ ఉండేది.

ఇలా ఉండగా, ఓ రోజు, ఈ రాజు అడవికి వేటకు వెళ్ళాడు. మధ్యాహ్నం వరకూ జంతువుల వేటలో గడిపాడు. ఇక విశ్రాంతి తీసికొందామని నది ఒడ్డు చేరాడు. అక్కడ అతడి కొక అందమైన యువతి కన్పించింది. ఆమెని చూడగానే రాజుకి కన్ను చెదిరింది. మెల్లిగా ఆమెని చేరి “ఓ సుందరీ! నీవెవ్వరు? ఇంత నిర్జనారణ్యంలో ఒంటరిగా ఎందుకు సంచరిస్తున్నావు?” అనడిగాడు.

అందుకామె అలవోకగా ఓ చిరునవ్వు నవ్వి “రాజా! నేను ముని కన్యను! ఈ అరణ్యంలోనే మా నివాసం” అంది.

రాజు ఆమె పైన తనకు గల మోహన్ని వ్యక్తపరిచాడు. ఆమె “రాజా! నేను ముని వృత్తిలో నున్నదానిని. మీరు దేశాన్నేలే మహారాజులు. మీలాంటి వారు మాలాంటి వారాని కోరదగునా? కానీ, కోరి మీరు నన్నడిగినప్పడు కాదనడం సరికాదు. నాతల్లిదండ్రులను అర్ధించి నన్ను పొందండి” అంది. వీరిలా మాట్లాడు కొంటూ ఉండగా, హఠాత్తుగా వాళ్ళ ముందో రాక్షసుడు ప్రత్యక్షమయ్యడు. చెట్టంత రాక్షసుడు భీకరంగా గర్జిస్తూ ఒక్కవుదుటున రాజుని గుప్పిట బంధించి మ్రింగబోయాడు.

తంత్రవర్మ ఒక్కపెట్టున పెద్దగా ఏడుస్తూ “వద్దు. వద్దు! నన్ను చంపవద్దు” అన్నాడు.

“ఒక్క షరతు మీద నిన్ను వదిలేస్తాను” అన్నాడు రాక్షసుడు.

“చెప్పు. తప్పక నెరవేరుస్తా” అన్నాడు రాజు.

"నీరాజ్యంలో తల్లిదండ్రులిద్దరూ ఉన్న బాలుణ్ణి, నీకు బదులుగా నాకు సమర్పించేటట్లయితే, నిన్నువదిలేస్తాను" అన్నాడు రాక్షసుడు.

రాజు తంత్రవర్మ సరేనన్నాడు. రాక్షసుడు వదిలిందే క్షణం, రాజధానికి పరుగెత్తాడు. సైనికుల్ని పంపి రాజ్యంలో పేదవారి గురించి ఆరా తీయించాడు. చివరికి ఓ బ్రాహ్మణ కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆ పేద వారింట భార్యా,భర్త, ముగ్గురు కొడుకులూ ఉన్నారు. వారు ఆపూట కూటికి కూడా లేని పేదవారు. రాజు బ్రాహ్మణ దంపతలకి పెద్దఎత్తున డబ్బాశ పెట్టి వారి ముగ్గురు కొడుకుల్లో ఒకరిని తనకి ధారాదత్తం చెయ్యమని అడిగాడు. [అదే ఇప్పటి పాలకులైతే తన్ని తీసికెళ్ళెవాళ్ళు. పాపం తంత్రవర్మ ఎంత స్వార్దపరుడైనా, ఎంతో కొంత నీతిపరుడే. అందుకే బేరమడిగాడు.]

ఆ బ్రాహ్మణుడు "రాజా! నాపెద్ద కొడుకంటే నాకు చాలా ఇష్టం. రేపు నేను ఛస్తే నాకు తలకొరివి పెట్టవలసింది వాడే కదా! అందుచేత నాపెద్దకొడుకుని ఇవ్వను. మిగిలిన ఇద్దరిలో నీకు కావలసిన వాణ్ణి తీసుకుపో!" అన్నాడు.

అంతలో అతడి భార్య "మహారాజా! నాచిన్నకొడుకంటే నాకు తీరని ముద్దు. అంతే గాక రేపు నేను ఛస్తే, నాకు తలకొరివి పెట్టవలసినవాడు చిన్నవాడు. అందుచేత నా చిన్నకొడుకుని మీరు తీసికెళతానంటే నేను ఒప్పకోను. కావాలంటే మా రెండవకొడుకుని తీసుకుపొండి" అన్నది.

రాజు వారికి డబ్బుచ్చి, రెండో కొడుకుని కొనుక్కున్నాడు. ఆ బాలుణ్ణి తీసికెళ్ళి రాక్షసుడికి సమర్పించాడు. ముదురుగా, అరిషర్వర్గపూరితమైన, దుర్గంధభరితమైన రాజు శరీరం బదులుగా, తనకు ఆహారం కాబోతున్న బ్రాహ్మణబాలుడి లేత శరీరాన్ని ఆబగా చూస్తూ రాక్షసుడు పిల్లవాణ్ణి మింగబోయాడు.

సరిగ్గా ఆ పిల్లవాణ్ణి గుప్పట బిగించి, నోట బెట్టబోతుండగా ఆ బాలుడు గట్టిగా ఫకాలు మని నవ్వాడు. మరుక్షణం రాక్షసుడు పిల్లవాణ్ణి నేలదించి తలెత్తకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

భేతాళుడింత వరకూ కథచెప్పి, విక్రమాదిత్యుణ్ణి చూసి "విక్రమాదిత్య మహారాజా! ఎందుకు బ్రాహ్మణ బాలుడు నవ్వాడు? అది చూసి రాక్షసుడు బాలుణ్ణి మ్రింగకుండా ఎందుకు వదిలి పెట్టిపోయాడు? తెలిసీ సమాధానం చెప్పకపోతే నీ తలవెయ్యివక్కలౌతుంది. జవాబు చెప్పి మౌనభంగం చేశావో నేను నీకు అధీనం కాను" అన్నాడు.

విక్రమాదిత్యుడు పెదవులమీద చిరునవ్వు మెరుస్తుండగా,

"భేతాళా! ఆబాలుడి నవ్వులో "ఇరుగు పొరుగు వారు కొట్టవచ్చినప్పుడు కాపాడవలసిన వారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే దయమాలి బిడ్డలను హింసిస్తూ ఉంటే కాపాడవలసిన వాడు రాజు. రాజే కృరుడై ప్రజలని బాధిస్తుంటే కాపాడవలసినది దైవం. అలాంటి దైవమే దయమాలి నన్ను చంపబోతుంటే ఇంక నేమి గతి?" అన్నభావం ఉన్నది. అది చూసి రాక్షసుడే అయినా బాలుడితో పోల్చుకుంటే తనకు గల బలం తాలూకూ దైవత్వాన్ని గుర్తిరిగి రాక్షసుడు పిల్లవాణ్ణి విడిచి పెట్టిపోయాడు" అన్నాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇందులకేదో నిమిత్తముండి యుండవలయును

అనగా అనగా.....

చంపకవతి అనే పట్టణముండేది. అక్కడ సన్యాసులు చాలా మంది నివసిస్తూ ఉండేవాళ్ళు. వారిలో చూడాకర్ణుడనే సన్యాసి ఒకడుండే వాడు. అతడి కుటీరంలో హిరణ్యకుండనే ఎలుక ఓ కలుగు చేసికొని ఉండేది. ప్రతిరోజూ చూడా కర్ణుడు తాను భోజనం చేశాక మిగిలిన వంటకాలని భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మిద పెట్టి నిద్ర పోయేవాడు.

ఈ ఎలుక చప్పుడు చేయకుండా వచ్చి, చిలుక కొయ్య మేదికెగిరి ఆ వంటకాలని తినేసి పోతూ ఉండేది. ఓ రోజు చూడకర్ణుడు తనస్నేహితుడైన వీణాకర్ణుడనే మరో సన్యాసితో మాట్లాడుతూన్నాడు. కానీ అతడి దృష్టంతా చిలకకొయ్య మీదేఉంది. మాటిమాటికి పైకి చూస్తూ చేతికర్రతో నేలమీద అప్పుడప్పుడూ తట్టూతూ ఎలుకని దడిపించే పనిలో కొంత మునిగి ఉన్నాడు.

అది చూసి వీణాకర్ణుడు "చూడాకర్ణుడా! ఎందుకలా మాటిమాటికి పైకి చూస్తూ నేలమీద కర్రతో తట్టుతున్నావు?" అని అడిగాడు.

చూడాకర్ణుడు "ఒక ఎలుక ప్రతిదినము చిలుకకొయ్య మీదికి ఎగిరి భిక్షా పాత్రలోని పదార్ధాలని తిని పోతున్నది. నాకు దీని బెడద ఎక్కువుగా ఉన్నది" అన్నాడు.

అదివిని వీణా కర్ణుడు చిలుక కొయ్యవైపు చూశాడు. అది నేల నుండి సుమారు అయిదారు అడుగుల ఎత్తున ఉంది. "ఎక్కడి ఎలుక? ఎక్కడి చిలుకకొయ్య! ఇంత అల్పజంతువునకు అంతఎత్తుకు ఎగిరే బలమెక్కడి నుండి వచ్చినది. మామూలు ఎలుకలు రెండు మూడడుగుల కంటే ఎత్తుకు గెంతలేవే? ఇది అయిదారడుగులు ఎలా ఎగిరి చిలుకకొయ్యమీది పద్దార్ధాలు మ్రింగగలుగుతోంది? ఇందులకేదో నిమిత్త ముండి యుండవలయును.

ఒకసారి నేనో బ్రాహ్మణుని ఇంట భిక్షకు పోయి ఉంటిని. అదే సమయంలో ఆబ్రాహ్మణుడు తనభార్యను చూచి "రేపు అమావాస్య. బ్రాహ్మాణులకు భోజనము పెట్టవలయుసు. ఏమేమి వంటకాలు చేయగలవు?" అన్నాడు. దానికావిడ కొంత పెడసరంగా "మగవాళ్ళు వస్తుసంభారాలు తెచ్చి, ఇంటపడేస్తె ఆడవాళ్ళు వండి వార్చుతారు గానీ, మీరు తేనిసరుకులు ఎక్కడి నుండి వస్తాయి?" అంది.

అదివిని అతడు కోపంగా "ఉన్నంతలో జరుపుకోవాలి గానీ, ఆర్భాటం చేయాలని పేరాస పడకూడదు" అన్నాడు.

దానికావిడ సౌమ్యంగా "అలాగే కానివ్యండి. రేపటి కార్యక్రమం ఉన్నంతలోనో సరిపెడతాను" అనిచెప్పంది. తర్వాత నువ్వులు కడిగి, దంచి ఎండపోసింది. ఆ రోజు ఎండ తీవ్రంగా ఉండటంతో నేను వారింటి ఎదురు చెట్టునీడలోని అరుగు మీదే విశ్రమించాసు. ఇంతలో ఓ కోడి వచ్చి ఆబ్రాహ్మణి ఆరబోసిన నువ్వులు కాళ్ళతో జీరి చెలిగి పారేసింది.

బ్రాహ్మణుడది చూసి, "ఈ నువ్వులు అంటుపడ్డవి. బ్రాహ్మణ భోజనానికి పనికి రావు. కాబట్టి వీటిని మారకం వేయి" అని భార్యకు చెప్పాడు. ఆవిడ సరేనని వాటిని చేట కెత్తింది. ఇంతలో నేను ఆవీధిలోని మరో ఇంటికి భిక్షకు పోయాను. ఆ బ్రాహ్మణి సరిగ్గా ఆ ఇంటికే వచ్చి "వదినా! ఈ నువ్వు పప్పు పుచ్చుకొని నువ్వులిస్తావా?" అని ఆఇంటి గృహిణిని అడిగింది. పాపమా ఇల్లాలు ఆనందంగా అంగీకరించి చేటలో నువ్వులు తీసికొని వచ్చి ఈమెతో మాట్లాడుతూ ఉంది. అంతలో ఆమె భర్త వచ్చాడు. "ఏమి బేరమాడు తున్నావు" అన్నాడు.

ఆవిడ సంతోషంగా "చేరడు నువ్వులిచ్చి దంచిన నువ్వుపప్పు పుచ్చుకొంటున్నాను" అంది.

ఆవిడ భర్త, ఆమాటలు విని "ఓసి వెర్రిదానా! చేరడు ముడి నువ్వులకు బదులుగా ఎవరయినా దంచిన నువ్వుపప్పులిచ్చెదరా! ఈమె ఇలా తెచ్చి ఇవ్వడానికి ఏదో రహస్యకారణం ఉండి ఉంటుంది. కాబట్టి ఆ నువ్వుపప్పు పుచ్చుకోకు" అన్నాడు.

అలాగే ఈ ఎలుకకు ఇంత బలం ఉండటానికి ఏదో రహస్య కారణం ఉండి ఉంటుంది. కారణం లేకుండా ఏవీ సంభవించవు" అంటూ ముగించాడు వీణా కర్ణుడు.

అదివిని సాలోచనగా చూడాకర్ణుడు "చూడగా ఈ ఎలుక ఇక్కడే ఎక్కడో ఓ కలుగు చేసికొని ఉంటున్నట్లుంది. దానికింత బలం ఉండాటానికి నిమిత్తమేది తెలిసినదికాదు. త్రవ్వి చూచెదను గాక" అన్నాడు.

ఆ తర్వాత చూడాకర్ణుడు ఒక గునపం తెచ్చి కుటీరమంతా వెదికి ఎలుక కలుగును కనిపెట్టి, తవ్వి పారేసాడు. ఆశ్చర్యం! మామూలుగా ఎలుక కలుగులో వడ్లూ, బియ్యం, గోధుమలులాంటి ధాన్యమో మరేదైనా తిండితిప్పలో ఉంటాయి గదా! కాని హిరణ్యకుడి కలుగులో కొన్ని బంగారు, వెండి నాణాలు కూడా ఉన్నాయి.

[నిజంగానే కొన్ని ఎలుకలు బంగారు, వెండి లాంటి మెరిసేవాటిని కలుగుల్లోకి లాక్కెళతాయి తెలుసా! నా చిన్నప్పుడు మాపిన్ని రెండు వరుసల బంగారు మంగళ సూత్రం గొలుసు పోయింది. ధాన్యం బస్తాలున్న గదిలో ఆవిడా, ఆవిడ భర్తా నిద్రపోయేవాళ్ళు. గొలుసుపోయిన తగాదాలో ఉమ్మడి కుటుంబం కాస్తా వేరు కాపురాలు పడ్డాయి. ఆర్నెల్ల తర్వాత, ధాన్యం బస్తాలు తీసినప్పుడు, బస్తాలు క్రింద ఎలుక కలుగు కనబడింది. తవ్వితే కుంచెడు [రమారమి రెండు కిలోలు] వడ్లూ, వాటితో పాటే బంగారు గొలుసు, ఇంకా మెరిసే పట్టు లేసుతాళ్ళు కనబడ్డాయి. శాస్త్రీయ కారణం నాకు తెలీదుగానీ కొన్ని ఎలుకలకి బంగారు రంగు మీద మోజుంటుందని మాత్రం చెప్పగలను.]

చూడాకర్ణుడు ఆనందంగా ఆ వెండి బంగారు నాణాల్ని సంగ్రహించి వీణా కర్ణుణితో "నీవు చెప్పినది నిజమే. ఈ ఎలుక దగ్గర రహస్య సంపద ఉన్నది. అందుకే దానికి మామూలు ఎలుకల కన్నా చాలా ఎక్కువ బలం ఉంది" అని చెప్పాడు.

కాబట్టి ప్రతీ అసాధారణ విషయం వెనుకా ఏదో కారణముండి ఉంటుంది.

అంటే ప్రతీదాని వెనుకా ....

ఇందుల కేదో నిమిత్త ముండి యుండవలయును.
ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఇలాక్కూడా మనం నష్ట పోవచ్చు

ఆపరీక్షితకారి అనే బ్రాహ్మణుని కథ

ఒకా నొకప్పుడు గౌడ దేశం లోని ఓ అగ్రహారం లో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండే వాడు. అతడు వేదాల్ని, సకల శాస్త్రాల్ని అధ్యయనం చేశాడు. అరిషడ్వర్గాల్ని [ఆరు భావోద్రేకాలు: కామ, క్రోధ, లోభ , మోహ, మద, మాత్సర్యాలు] అధిగమించడ మెలాగో తెలిసినవాడు.

అతడికి సంతానం లేదు. ఇది తప్ప అతడికి మరే కొరతా లేదు. అతడి భార్య యాఙ్ఞసేని. తనకు సంతానం లేకపోవడం చేత ఆవిడ బిడ్డల తల్లులైన తన ఇరుగుపొరుగు స్త్రీలను చూసి ఎంతో ముచ్చట పడుతుండేది బిడ్డల కోసం ఆరాటంతో ఆవిడ సాధువుల్ని, సాధువేష ధారుల్నీ కూడా భక్తిగా కొలిచేది. స్వాముల కాళ్ళ మీద పడి వేర్లూ, తాయత్తులూ కట్టించు కొంటూ ఉండేది. రాయి కనబడితే రాయికి, గుడి కనబడితే గుడికీ మ్రొక్కేది. ఎవ్వరే తీర్ధం పేరు చెబితే ఆ తీర్ధానికి పోయి మునకలు వేసేది. లోకంలో లేని వ్రతాలూ, నోములూ నోచేది. ఇలా కొంత కాలం గడిచింది.

కొన్నాళ్ళకి దేవుడి దయ కలిగిందో ఏమొ, యాఙ్ఞసేని గర్భవతై పండంటి కొడుకుని కన్నది. లేక లేక పుట్టిన బిడ్డని దేవశర్మ, యాఙ్ఞసేని ఆ బిడ్డని అపురూపంగా పెంచసాగారు. కంటికి రెప్పలాగ కాపాడుతూ, బిడ్డని గుండెల మీద బెట్టుకు పెంచుతూండె వారు. పిల్లవాడి పాదాలు తల్లిదండ్రుల అరచేతుల్లో తప్ప నేల నంటనంత అపురూపంగా కొడుకుని పెంచసాగారు.

ఓ రోజు యాఙ్ఞసేని కొడుకుకి స్నానం చేయించి, పాలిచ్చి, నిద్రపుచ్చి వుయ్యాలలో పడుకోబెట్టింది. బిడ్డని జాగ్రత్తగా చూస్తుండమని భర్తకి చెప్పి, ప్రక్క వీధి లోని పుట్టింటికి వెళ్ళింది.

ఆ రోజు పర్వదినం కావటంతో ఆ నగరపు రాజు దేవశర్మకు పవిత్రదానమియ్య దలిచి ఆహ్వానం పంపాడు. దేవశర్మకు రాజు గారిచ్చే ద్రవ్య కనక వస్త్ర ధాన్య దానం అత్యంత అవసరం.

అతడికేం చేయాలో తోచలేదు. "చాలా కాలం తర్వాత రాజుకి నా మీద దయ కలిగింది. పండిత ప్రకాండులెందరో ఉండగా దానం నాకే ఇవ్వదలిచి కబురంపాడు. నా భాగ్యమిట్లుండి , రాజు ఆహ్వానం పంపగా, నా అభాగ్య దేవత ఈ సంధర్భం లోనే నాకీ ఇబ్బంది తెచ్చి పెట్టింది. నా భార్య ఎప్పుడు రావాలి, నేనెప్పుడు రాజమందిరానికి పోవాలి. పోనీ నా భార్య రాక పోయినా రాజుమందిరానికి పోదామంటే పిల్లవాడికి రక్షణ గా ఇంట్లో ఇంకెవ్వరూ లేరు ఆలస్యం చేస్తే రాజు ఈ దానాన్ని ఇంకెవ్వరికైనా ఇచ్చేయగలడు . ఏం చేయను? ఓ వుపాయం ఉన్నది. నా ఇంట పెంపుడు ముంగిస వున్నది గదా! ఎంతో కాలం నుండీ దాన్ని నేను ప్రేమగా పెంచున్నాను . ఈ ముంగిని నా బిడ్డకు కాపలాగా పెట్టి రాజ మందిరానికి వెళ్తాను. దానం పుచ్చుకొని ఇంటనున్నట్లే పరుగెట్టుకొని వెనక్కి వస్తాను."

ఇలా ఆలోచించి దేవశర్మ తన పెంపుడు ముంగిసని చేతుల్లోకి తీసికొని, ప్రేమగా దాని శరీరం నిమిరి, ఊయలలోని బిడ్డని చూపించి కాపుండ మని సైగలతో సూచించి రాజమందిరానికి పోయాడు . ఆచారప్రకారం దానం పుచ్చుకొని రాజుని దీవించి పూజాదికాలు నిర్వహించాడు. ఆ అరఘడియ పాటూ అతడి దేహం రాజ మందిరం లోనూ, మనస్సు ఇంట వుయ్యాల లోని కొడుకు మీదనూ వున్నాయి.

ఆ సమయం లో ఓ నల్ల త్రాచు వారింటి మిద్దె పైనుండి లోనికి జారి ఉయ్యాల తాడు మీదుగా బిడ్డ పానుపు పైకి ప్రాకుతోంది. ముంగిస పాముని చూసింది. రాబోయె ప్రమాదం పసి కట్టింది. ఒక్క ఉదుటున పైకెగిరి పాము మెడ పట్టుకొంది. పాముని ముక్కలు ముక్కలు చేసి నేల మీద పారేసింది. రక్తపు చుక్కలు నేలంతా పడ్డాయి.

ఇంతలో దేవశర్మ రాజ మందిరంలో ఆచార వ్యవహారాలు పూర్తి చేసుకొని, దానం పుచ్చుకొని ఇంటి ముఖం పట్టాడు. కొడుకు మీది ప్రేమ, అభద్రతా తనని తరుముతుండగా కాలి మడమలు నేలనంటనంత వేగంగా ఇల్లు చేరాడు.

ముంగిస తన యజమాని పద సవ్వడి విన్నది యజమాని బిడ్డని కాపాడాను కదా అన్న ఆనందంతోనూ , తనకి అప్పగించిన పనిని విజయవంతంగా చేసేను గదా అన్న సంతోషం తోనూ, యజమాని పట్ల దానికి గల ప్రేమ తోనూ, ముంగిస పరుగున దేవశర్మకు వీధి వాకిట్లోకి ఎదురుబోయింది. దాని నోరు రక్తం తో నిండి ఉంది. లోని గది లోనుండి వీధి వాకిలి వరకూ రక్తపు బిందువులు పడి ఉన్నాయి.

ఎంతో ప్రేమ తోనూ, కృతఙ్ఞత తోనూ, ముంగిస దేవశర్మ కాళ్ళు నాకుతున్నది. దేవశర్మ ముంగిసనీ, దాని రక్తపు మూతినీ చూసాడు. ఒక్కసారిగా అతని గుండె బ్రద్దలైనంత పనయ్యింది. తుఫానులో ఊగే చెట్టులా అతని శరీరం వణికింది. ముంగిస తన బిడ్డని చంపి ఉంటుందని ఈ బ్రాహ్మణుడు అనుకొన్నాదు. విపరీతమైన కోపం తో ఊగి పోయాదు.

"ఓసి పాపిష్ఠి దాన! ఎంతోకాలం నుండి చేర దీసి పెంచానన్న కృతఙ్ఞతైనా లేదే నీకు? ఎలా చంప గలిగావు నా బిడ్డని" అంటూ మితిమీరిన కోపం తోనూ, ఆ చిన్ని ముంగిస కన్నా ఎంతో బలమైన వాడి నన్న అంతర్గత అహం తోనూ, ముందు వెనుకలు ఆలో చించని తొందర పాటు తనం తోనూ, లావు పాటి కర్రతో ముంగిస నెత్తిమీద బలంగా కొట్టాడు.

ఆ దెబ్బ సరిగ్గా ముంగిస తల పైన ఆయువు పట్టు పైన తగిలింది దాని కనుగ్రుడ్డ్లు వెలికి వచ్చాయి. నేల మీద పడింది . హోరుగాలిలో చిరుకొమ్మలా విలవిల లాడింది. పెద్దగా ఒక్క అరపు అరిచి ప్రాణాలు విడిచింది. తానెంతో ప్రేమగా దగ్గరికి వస్తే యజమాని ఎందుకు తనని కొట్టాడో అర్ధం కాని అమాయకత్వం దాని కళ్ళల్లో ఉంది. తానెంతో భాధ్యత గా యజమాని కొడుకు ప్రాణం కాపాడితే, అతడెందుకు తనని చావ గొట్టాడో అర్ధం కాని అయోమయం దాని చూపుల్లో ఉంది. ఆ బాధని చావు దాని కళ్ళల్లో శాశ్వతం చేసింది.

ఇదేమీ దేవశర్మ పట్టించు కోలేదు. అతడక్కడ ఆగనూ లేదు. ఇంటిలోనికి ఒక్క అంగలో పరుగు పెట్టాడు. గట్టిగా ఏడుస్తూ ఉన్నాడు. కొడుకు చని పోయి ఉంటాడని మానసికంగా సిధ్ధమై పోయాడు. ఒక్క ఉదుటున ఉయ్యాల చేరాడు . ఉయ్యలలో పరుపు మీద బిడ్డ ఆదమరచి నిద్రిస్తూనే ఉన్నాడు. బిడ్డని సజీవంగా చూసాక గాని దేవశర్మ ఆవేశం, ఆక్రోశం తీరలేదు. అప్పటికి గాని అతనికి బాహ్య స్పృహ కలగ లేదు. అప్పుడు చూశాడతడు నేల మీద పడి ఉన్న నల్ల త్రాచు శరీర ఖండాల్నీ, రక్తపు బిందువుల్నీ.

అప్పటికి గాని అతడికి పరిస్థితి అర్ధం కాలేదు. ఇప్పుడతడు ముంగిస కోసం ఆక్రోశపడ సాగాడు. రొమ్ము మీద, గుండెల మీద, తల మీద, కడుపు మీద కొట్టుకుంటూ బిగ్గరగా ఏడ్వటం మొదలు పెట్టాడు.

"ఎంత మూర్ఖుణ్ణి నేను! నా పెంపుడు ముంగిస నా బిడ్డ ప్రాణాలు కాపాడింది. నిజం చెప్పాలంటే నా ప్రాణాల్నే కాపాడింది. కానీ, నేనది నా బిడ్డని చంపేసిందనుకొన్నాను. అది ప్రేమగా నా దగ్గరికి వస్తే, నేను దాన్ని చంపి వేశాను. ఏ విషయమూ పరిశీలించ లేదు. ఒక్క నిముషమైనా ఆలోచించ లేదు. కొద్ది క్షణాలు ఆగి ఉన్నా , లేదూ కొన్ని అడుగులు ఇంటి లోపలికి వేసినా నిజం తెలుసుకొని ఉండేవాణ్ణి. నా పెంపుడు ప్రాణిని కాపాడుకొని ఉండేవాణ్ణి. నా కొడుకు పుట్టక ముందు నుండీ ఆ ముంగిసని నా స్వంత కొడుకు లాగా ఈ చేతుల్లో పెంచాను. ఇప్పుడు ఇదే చేతుల్తో దాన్ని చంపేసాను. ఎవ్వరు నాకు దాన్ని ప్రాణాలతో వెనక్కి ఇవ్వగలరు ? ఎవ్వరు కాలాన్ని వెనక్కి తేగలరు? ఎవ్వరు జరిగి పోయిన దారుణాన్ని వెనక్కి త్రిప్పగలరు? వేదాలు చదివీ, అరిషడ్వర్గాలని అణిచే మార్గాలని యెరిగీ, చర్య చేపట్టే ముందు ఒక్క క్షణం సహనం తో ఆలో చించ లేక పోయానే! నిజంగా, జీవితంలో క్రోధం ఎంత ప్రమాదకరం? కోపం ఎంత కీడు కలిగిస్తుంది. కోపం నా నిజ మైన శతృవు ."

అతడెంత ఏడ్చినా , ఇప్పుడెంతగా పశ్చాత్తాప పడినా అతడి అమాయకపు పెంపుడు ముంగిస మాత్రం అతడికిక లేదు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

బార్బర్ బంగారం

అనగా అనగా…

ఒకప్పుడు అక్బర్ ఆస్థానంలో ఓ ఆస్థాన మంగలి ఉండేవాడు. అతడు తన వృత్తిలో చాలా నేర్పరి. అతడు గడ్డం గీస్తే అక్బరుకి మల్లెపూల చెండుతో చెంపలు తడిమినట్లుంటుంది. అతడు తలపైన క్షౌరం చేస్తే ప్రేమగా తన మనమరాలు తన జుట్టుతో ఆడుకున్నంత హాయిగా ఉంటుంది. అతడు తైలమర్దనా చేసి ఒళ్ళంతా మాలీషు చేస్తే ఏదో లోకంలో విహరించినట్లుంటుంది. అందుచేత అక్బరుకి ఈ మంగలంటే కాస్త అభిమానం పెచ్చు. దానితో మంగలికి కూడా పాదూషా దగ్గర కాస్త చనువు ఉండేది.

ప్రతి రోజూ మంగలి ॒క్షుర కర్మ చేసేటప్పుడు పాదుషా యధాలాపంగా ఏదో మాట్లాడుతుండేవాడు. పాదుషా తనపాలన గురించి ప్రజలేం అనుకొంటున్నారని అంటే మంగలి పాదుషాని ప్రజలు దేవుడంటున్నారని, ఆయన పాలన అంతనీ ఇంతనీ పాదుషాని ఆకాశాని కెత్తేసేవాడు. తన పాలనలో ప్రజలు ఎలా ఉన్నారని అక్బరు అడగటం ఆలస్యం ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారనీ, సిరిసంపదలతో తులతూగు తున్నారనీ చెప్పేవాడు. అందులో కొంత నిజం, మరికొంత ఎక్కువ అతిశయోక్తులు ఉండేవి.

ఇదంతా గమనిస్తున్న బీర్బలు మంత్రి వ్యవహరాన్ని ఇలాగే వదిలేస్తే ॒క్షేమం కాదనుకొన్నాడు. మంగలి, పాదుషా గారి శరీరానికి తైలం వేస్తే ఫరవాలేదు. మనస్సుకి వేస్తున్నాడు. అది పరిమితి దాటితే ప్రమాద హేతువే. ఏ శతృరాజైనా ఈ మంగలినే వేగుగా ప్రయోగిస్తే?

అందుచేత బీర్బలు మరునాడు నుండి పాదుషా క్షురకర్మ చేయుంచు కొనేటప్పడు తానూ పాదుషా ప్రక్కనే ఉంటూ పిచ్చాపాటి మాట్లాడసాగాడు. ఓ రోజు అలాగే పిచ్చాపాటి మాట్లాడతుండగా, తరచుగా పాదుషా అడిగే ప్రశ్నను ఈ సారి బీర్బల్ అడిగాడు, అక్బరు వారి పాలనలో ప్రజలెలా ఉన్నారని. మామూలుకంటే ఎక్కువ హుషారుగా మంగలి ప్రజలంతా భోగభాగ్యలతో తులతూగుతున్నారనీ, హాయిగా ఏ కష్టమూ లేకుండా ఉన్నారనీ, అంతా పాదుషా వారి చలవేననీ తెగతైలం వేసేశాడు.

ఇంతలో పాదుషాకి ॒క్షురకర్మ చేయటం పూర్తయింది. మంగలి కత్తి గట్రా శుభ్రం చేసుకోవటానికి ప్రక్కకి వెళ్ళాడు. బీర్బలు మంగలి పొదిని తెరిచాడు. అక్బరు, బీర్బల్ చర్యల్ని గమనిస్తూ మౌనంగా ఉన్నాడు. బీర్బల్ మంగలి పొది వెదుకుతున్నాడు. ఆశ్చర్యం! ఆ మంగలి వాని పెట్టెలో [పొది] లో కోడి గ్రుడ్డంత బంగారం ముద్ద ఉంది. గప్ చుప్ గా బీర్బల్ దాన్ని తీసి దాచేసాడు. ఏ పనీ బీర్బల్ వృధాగా చేయడనీ తేలిసిన అక్బర్ ఏం జరుగుతుందో చూడదలిచి ఏమి అనలేదు.

ఇంతలో మంగలి వచ్చి తన పెట్టి అడుగున బంగారం పోయిన సంగతి తెలియదుగనుక మామూలుగా కత్తి గట్రా సర్దుకొని పాదుషా దగ్గర సెలవు తీసికొన్నాడు.

మరునాడు మంగలి ముఖం వాడి పోయి ఉంది. ప్రపంచంలోని కష్టమంతా తనకే వచ్చినట్లున్నాడు. అతడి ముఖంలో దిగులూ, దుఃఖమూను.

చాలా నీరసంగా, నిస్తేజంగా పాదుషా వారికి గడ్డం గీస్తున్నాడు. నిన్నటి ప్రశ్ననే బీర్బల్ మళ్ళీ మంగలిని అడిగాడు. మంగలి నిట్టూరుస్తూ "ఏం చేప్పను హుజూర్! ప్రజలంతా నానా ఈతి బాధలతో సతమతమౌతున్నారు. దరిద్రం, అనారోగ్యం వారిని కుదిపెస్తున్నాయి. ఎటు చూసినా బాధార్తులే!" అన్నాడు.

అక్బరు కూ చాలా ఆశ్చర్యం వేసింది. అయినా మౌనంగానే ఉన్నాడు. ఈ రోజు మంగలి కత్తి కడగటానికి వెళ్ళినప్పడు బీర్బల్ మంగలి పొదిలో బంగారాన్ని యధాతధంగా పెట్టెసాడు. ఇదేమీ తెలియని మంగలి అదే దుఃఖభారంతో పాదుషా దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.

మరునాడు మంగలి ముఖం వెలిగిపోతుంది. హుషారుగా, ఆనందంగా పాదుషా వారికి క్షురకర్మ చేస్తున్నాడు. బీర్బల్ యధాలాపంగా అడిగినట్లు రోజుటి ప్రశ్నను వేశాడు. మంగలి ఎంతో ఆనందంగా "ప్రజలు ఆనందంతో నాట్యం చేస్తున్నంత హయిగా జీవిస్తున్నారు" అంటూ వెనకటి జవాబే చెప్పాడు. ఇందతా చూస్తూన్నా అక్బర్ ఫకాలుమని నవ్వాడు. మంగలికేమీ అర్దంకాలేదు. పాదుషా చిరునవ్వుతో "పోయిన నీ బంగారం తిరిగి దొరికినందుకు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు" అన్నాడు. మంగలి మ్రాన్పడి పోయాడు. "హుజూర్! నా బంగారం పోయి దొరికినట్లు తమరికెలా తెలుసు?" అన్నాడు.

అక్బర్ మాట్లాడకుండా చిరునవ్వుతో అతడికి బహుమతి ఇచ్చి పంపేశాడు. బీర్బల్ వైపు సహేతుకంగా చూశాడు.

బీర్బల్ చిరునవ్వునవ్వి "హుజూర్! తనపెళ్ళి విశ్వకళ్యాణం అనీ, తన చావు జగత్ర్పళయమనీ కొందరనుకొంటారు. పచ్చిస్వార్దం తప్ప అందులో మరేమి ఉండదు. అలాంటి వాళ్ళా మాటల్లో విశ్వసనీయత ఉండదు. అలాంటి వారి నివేదీకల్ని నమ్మరాదు" అన్నాడు.

అక్బర్, బీర్బల్ సునిశిత ఆలోచనా పటిమని మెచ్చుకొన్నాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes