RSS
Wecome to my Blog, enjoy reading :)

పరమానందయ్య గారి శిష్యులు

అనగా అనగా.....

తెలుగు సాహిత్యంలో పరమానందయ్య గారి శిష్యుల కథలు ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్న కథలు. పరమానందయ్య గారికి ఏడుగురు [పన్నెండు మందని కొందరంటారు] శిష్యులు. వీళ్ళు అమాయకులు, లోకఙ్ఞానశూన్యులు. [శాపగ్రస్తులైన తాపసులు] వీరు తమ అఙ్ఞానంతోనూ అమాయకత్వం తోనూ గురువుగారినీ, గురుపత్నినీ ఇబ్బందుల పాలు జేస్తూ ఉంటారు. అయితే ప్రతీసారి ఈ ఇబ్బందులు గురువు గారికి మేలే చేస్తుంటాయి.

ఓ రోజు పరమానందయ్య గారు మధ్యాహ్న భోజనం చేసి కాస్సేపు నడుం వాల్చాలను కుంటారు. తన శిష్యుల్లో ఇద్ధరిని పిలిచి తన కాళ్ళు పట్టవలసిందిగా ఆఙ్ఞ ఇచ్చి నిద్రకుపక్రమిస్తాడు. శిష్యులిద్దరూ భక్తిగా గురువు గారి కాళ్ళుపిసకటం మొదలు పెడతారు. ఆ మర్ధనా సుఖానికి గురువు గారు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. కొద్దిసేపటి తర్వాత కాళ్ళ పడుతున్న శిష్యుల్లో ఒకడు తను వత్తుతున్న గురువు గారి కాలును మురిపెంగా చూసుకొంటూ “నేను ఒత్తుతున్న గురువుగారి కాలు చూడు. ఎంత బాగా మర్ధనా చేసానో. మిలమిల్లాడుతోంది” అన్నాడు.

రెండో వాడు “ఏడిశావ్ లేరా! నా కాలు చూడు. ఎలా తళతళ్లాడు తుందో? నేనే బాగా మర్ధనా చేసాను” అన్నాడు.

మొదటి వాడికి చిర్రెత్తు కొచ్చింది. “కాదు. నాకాలే మెరుస్తోంది. నీకాలు వికారంగా ఉంది” అన్నాడు కోపంగా.

రెండోవాడికి ఇంకా మండుకొచ్చింది. “నోరు ముయ్యి. నీకాలు చెత్తది. నా కాలు బంగారం” అన్నాడు గురువు గారి కాలుని చేత్తో నిమిరుతూ.

మొదట వాడు కోపంతో రొప్పుతూ “నువ్వు నా కాలుని అవమానించావు. చూస్కో నేనేం చేస్తానో?" అంటూ రెండోవాడు ఒత్తుతున్న గురువుగారి కాలిని ఒక్కటి కొట్టాడు.రెండో వాడు అంతకంటే కోపంతో “నా కాలునే కొడతావా? చూస్కో నీ కాలుని నరికేస్తాను” అంటూ గొడ్డలి తెచ్చాడు.

మొదటి వాడు “నీ కాలుని మాత్రం నే వదులుతానా?" అంటూ కత్తి పట్టుకొచ్చాడు.

ఇద్దరూ కలిసి గురువు గారి కాళ్ళని కొట్టటం అయిపోయి నరికేందుకు సిద్ధ పడ్డారు. ఈ గొడవకు నిద్ర లేచిన గురువు గారు ఇద్దరి అఘాయిత్యాల్ని ఆపమంటూ గావుకేక పెట్టారు.

తర్వాత ఆయన సహనంగా ఇద్దరు కలిసి తన కాళ్ళనే బాధించిన విషయాన్ని బోధపరచి వారిని వివేకవంతుల్ని చేసే ప్రయత్నం చేశాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

అవినీతి, నీతిగా ఎలా మారిందంటే…….. మైనర్ బాబు కథ

అనగా అనగా.....


అది కృష్ణా జిల్లాలోని ఓ గ్రామం. మరీ పల్లెటూరు కాదు, అలాగని పట్టణం కూడా కాదు. ఆ వూరి జమీందారు గారికి పిల్లల్లేని కారణంగా బంధువుల కుర్రాణ్ణి దత్తత తెచ్చుకున్నారు. ఆ పిల్లవాడికి మైనారిటి తీరని కారణంగా ఆ దత్తుడిని, ’మైనర్ బాబ’ని పిలవటం మొదలెట్టారు. మైనర్ బాబు పెరిగి పెద్దై మేజర్ అయినా పేరు మాత్రం మైనరు బాబుగానే స్థిరపడిపోయింది.

సదరు మైనర్ బాబు పక్కమెడలాల్చీలూ, సైడు క్రాపులతో సోగ్గాడిలాగా తిరిగేవాడు. పిల్ల జమీందారు అయిన కారణంగా చదువైతే ఒంట బట్టలేదు గానీ సకల దుర్గణాలూ అంటుకున్నాయి.

ఇంతలో జమీందారు గారు పరమపదిస్తూ తన యావదాస్తినీ మైనర్ బాబు పరంచేసి పోయాడు. అప్పటికే పెళ్ళై పిల్లలున్న మైనర్ బాబు ఆస్తి చేతికి రావడంతో మరీ పైలాపచ్చీసుగా తిరగడం మొదలెట్టాడు. వారానికోసారి చెన్నాపట్నం ప్రయాణం – మందు, విందు, అందాల పొందు.

ఇంట్లో మైనర్ బాబు శ్రీమతి కన్నీళ్ళు పెట్టుకుంటూ, వూళ్ళోని ఆడంగుల సానుభూతితో ఓదార్పు పొందుతూ కాలం గడిపేస్తోంది. ఇలా ఉండగా ఓరోజు హఠాత్తుగా మైనర్ బాబు చెన్నాపట్నం నుండి సినిమాల్లో చిన్నాచితకా వేషాలేసి రాణించలేకపోయిన ఓ ఎక్స్ ట్రా ఆర్టిస్టు ’రాణి’ని లేపుకొచ్చి జమీందారు భవనం వెనకున్న ’ ఔట్ హౌవుస్’లో పెట్టాడు.

ఊరంతా ఈ వార్త గుప్పుమంది. మరి అవి ఇంకా విలువుల గురించి కనీసం మాట్లాడుకుంటున్న రోజులయ్యె. వారం పదిరోజులు జమీందారు భవంతి వచ్చీపోయే ఆడంగులతో, జమీందారిణి వెక్కిళ్ళతో, ఓదార్పులతో సందడే సందడి! జమీందారిణిని ఓదార్చాలని వచ్చేవాళ్ళకి – జమీందారిణి దుఃఖం కన్నా, చెన్నాపట్నం నుండి వచ్చిన ’ఫిల్మ్ స్టార్’ రాణి ఎలా ఉంటుందో చూడాలన్న కుతుహలమే ఎక్కువుంది.

దాంతో ఔట్ హౌస్ వైపు తొంగి తొంగి చూసే వాళ్ళు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఔట్ హౌస్ లో రాణితో పాటు ఆవిడ తమ్ముడూ, మరో పనిమనిషి కూడా వచ్చారు. ఈ పనిమనిషి మహా నేర్పరి. అన్నింటి గురించీ, అందరి గురించి ఆచూకీలూ, కూపీలూ అలవోకగా లాగేసేది. రాణి గారి తమ్ముడు వారానికి రెండుసార్లు చెన్నపట్నం వెళ్ళి వస్తూ ఉండేవాడు.

మొదట్లో ఊరంతా ’రాణి’ని విడ్డూరంగా చూసేవాళ్ళు. మెల్లిగా అలవాటై పోయారు. ఈ లోపులో రాణి జమిందారిణి గారికి, తన తమ్ముడు చెన్నపట్నం నుండి తెచ్చిన విదేశీ స్నోలూ, పౌడర్లూ, పిల్లలకి విదేశీ చాక్లెట్లూ, రంగు రిబ్బన్లూ, రంగు రంగుల విదేశీ బట్టలు లాంటి చిన్నచిన్న బహుమతులు పంపింది. ముందు తిరగ్గొట్టిన జమీందారిణి మెల్లిగా తీసికోవటం మొదలైట్టింది. పిల్లలకైతే చెన్నపట్మం వింతబొమ్మలు మహా నచ్చేసాయి. మెల్లిగా జమీందారు భవనానికి, ఔట్ హౌస్ కు రాకపోకలు కూడా మొదలైనవి.

మెల్లిగా ’రాణి’ని చూడవచ్చే ఆడంగులు పోగయ్యారు. తన ఇంటికి అతిధులొచ్చినప్పుడల్లా చప్పున కలిపే కాఫీ పౌడర్లూ, జపాన్ చాక్ లెట్లు, రుచి చూపించింది రాణి. జమీందారిణికి, రాణికి సంబంధాలు బలపడ్డాయి. కందకి లేని దురద కత్తి పీటకెందుకన్నట్లు ఊళ్ళో వాళ్ళు ’రాణి’తో స్నేహం మొదలెట్టారు. మెల్లిగా పెళ్ళి పేరంటాలకి రాణిని పిలవడంతో మొదలై, మొదటి తాంబూలం దాకా సాగింది. రాణి నివాసం ఔట్ హౌస్ నుండి జమీందారు భవంతికి మారింది.

క్రమంగా అందరూ ’రాణి’ని రెండో జమీందారిణిగా గుర్తించారు. ఓ పుకారు ఏమిటంటే ’ఇటీవలే రాణికి జ్వరం వస్తే జమీందారిణి రాణికి కాళ్ళు వత్తిందని.’

ఇలా అవినీతి క్రమంగా సమాజంలో నీతిగా చలామణి అవుతుందని ఈ కథ వలన తెలుస్తుంది. ఇలా విదేశీ పౌడర్లూ, రిబ్బన్లూ, బొమ్మలూ, కాఫీలు, చాక్ లెట్లు తో మొదలై మోజు[ఫ్యాషన్] మాటున ప్రతీ అవినీతి కూడా సమాజంలో జనామోదం [Stamp?] పొందేస్తుంది.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఛత్రపతి శివాజీ సాహసాలు – 3

అనగా అనగా.....

ఛత్రపతి శివాజీ జీవితంలోని ఈ సంఘటన....

ఓ రోజు శివాజీ కొలువు తీరి ఉండగా, సభలోనికి ఓ అనుచరుడు ఓ అందమైన యువతిని వెంటబెట్టుకొని వచ్చాడు. అతడు వినయము, అతృతా నిండిన గొంతుతో “మహారాజా! ముస్లింల నివాస ప్రాంతంలో ఈ అందమైన ముస్లిం యువతిని పట్టుకున్నాను. ఈమెను మీకు కానుకగా ఇవ్వాలని తెచ్చాను” అన్నాడు.

ఆరోజుల్లో, ముస్లిం రాజ్యాల్లో, ఆ ముస్లిం రాజుల అనుచరులు అందమైన హిందూ యువతుల్ని నిర్భందించి తీసుకుపోవటం, ముస్లిం రాజులకీ, వారి రాజోద్యోగులకీ కానుకలుగా సమర్పించటం చేస్తుండేవాళ్ళు. బదులుగా రాజుల నుండీ, రాజోద్యోగుల నుండి ప్రయోజనాలు పొందుతుండేవాళ్ళు. [అంటే ప్రమోషన్లూ, అవార్డులూ, రివార్డులూ లేదా కేరీర్ లాంటివన్న మాట]ఒక్కోసారి వాళ్ళు ముస్లిం స్త్రీలనీ విడిచి పెట్టేవాళ్ళు కాదు. తమ స్వార్ధం, స్వసుఖవిషయంలో వాళ్ళకి మానవత్వం లేదు, మతం, కులం, పేదరికం, పాపం పుణ్యం – ఏవీ పట్టవు.

శివాజీ ముస్లిం రాజులకీ, ముస్లిం చక్రవర్తి ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు గనుక ఆయనకి ముస్లిం లంటే ద్వేషం ఉంటుందని ఆ అనుచరుడు అనుకొన్నాడు. ముస్లిం రాజులు హిందూ స్త్రీల మీద అత్యాచారాలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు గనుక ప్రతీకారంగా శివాజీ కూడా ముస్లిం స్త్రీలని అవమానిస్తాడు, అనుకొన్నాడు. అందుచేత అలాంటి చర్య తీసికున్నాడు. అలాంటి ముస్లిం యువతిని తెచ్చినందుకు తనను సత్కరిస్తాడని కూడా ఆశించాడు.

ఈ సంఘటనతో ఒక్కసారిగా సభమొత్తం నిశ్శబ్థం ఆవరించింది. సభికులంతా ఆశ్చర్యం తోనూ, ఉత్కంఠతోనూ చూస్తున్నారు. శివాజీ ఏమంటాడో నన్న కుతుహలం వాళ్ళందరిలోనూ ఉంది. ఆ ముస్లిం యువతి భయంతో వణుకుతోంది.

శివాజీ ఆమె వైపు తిరిగి “అమ్మా! భయపడకు!” అన్నాడు.

సభికుల వైపు తిరిగి “నిజంగానే ఈమె ఎంతో అందంగా ఉంది. ఈమె కడుపున నేను జన్మించి ఉంటే ఎంత అదృష్టవంతుడయ్యేవాడినో కదా! నా తల్లి కూడా ఈమెంతటి సౌందర్యవతి అయితే, నేను మరింత అందంగా ఉండి ఉండేవాడిని. ఈమె నా తల్లి జిజియా బాయి లాగే నాకు పూజ్యనీయురాలు” అన్నాడు.

చివరిగా తన అనుచరుడి వైపు చూచి “స్త్రీలని ఎలా గౌరవించాలో నేర్చుకో! పరస్త్రీలందరూ మనకు మాతృసమానులు. సగౌరవంగా ఈమెను, ఈమె ఇంట దిగవిడిచిరా!” అని ఆఙ్ఞాపించాడు.

శివాజీ ఆమెకు బహుమతులిచ్చి, రాచమర్యాదలతో ఆమెను స్వగృహానికి పంపించాడు. అదీ ఆయన నిబద్దత – ధర్మంపట్లా, నైతికత పట్లా, మానవతా విలువల పట్లా! వాస్తవానికి ధర్మం, నీతి, మానవీయ విలువలూ ఎప్పటికీ కులమత రాజకీయాలకూ, స్థలకాలమానాలకు అతీతమైనవి. వీటినే హిందూ ధర్మం చెప్తుంది. దానిని ఆచరించటమే నిజమైన హిందువు [మనిషి] చేయవలసినది.

ఇలాంటిదే మరో సంఘటన!

ఒకసారి శివాజీ మాతృశ్రీ జిజియాబాయి ఆయన్ని సింహఘడ్ ను గెలుచుకొని తనకు కానుకగా ఇమ్మని చెప్పింది. ఆయనీ కార్యాన్ని సాధించే పనిని తన అనుచరుడైన తానాజీకి అప్పగించాడు. తానాజీ శివాజీకి ఆప్తమిత్రుడు, అనుంగు అనుచరుడూ, మహా యోధుడు. ఈ వర్తమానం అందుకొనేటప్పటికి తానాజీ తన కుమారుడి వివాహానంతర విందు వినోద కార్యక్రమాల్లో ఉన్నాడు. అయితే వర్తమానం అందుకున్న మరుక్షణమే తానాజీ సింహఘడ్ మీదకి దాడికి సేనాసమేతుడై వెళ్ళాడు. తీవ్రపోరాటంతో సింహఘడ్ ని స్వాధీనం చేసుకొన్నాడు. అయితే ఆ పోరాటంలో తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు.

దుర్గాన్ని గెలుచుకొన్న తర్వాత, విజయచిహ్నంగా ఫిరంగి మ్రోగింపబడింది. ఫిరంగి శబ్థం విన్న శివాజీ సింహఘడ్ కి చేరుకొన్నాడు. కోట గుమ్మం దగ్గర శివాజీకి విజయ స్వాగతం ఇవ్వబడింది. కానీ శివాజీ మరుక్షణమే తానాజీ అక్కడ లేకపోవడాన్ని, ఆయన నిర్జీవ శరీరాన్ని గమనించాడు. ఇంతలో ఓ సైనికుడు సంతోషం, గర్వం నిండిన గొంతుతో “మహారాజా! మీరు సింహఘడ్ ని గెలుచుకొన్నారు” అన్నాడు. [బహుశః విజయవార్తని చెప్పినందుకు శివాజీ మహారాజు నుండి బహుమానాన్ని అతడు ఆశించి ఉండవచ్చు.]

శివాజీ అతడి వైపు వాడి చూపు చూసి, తీవ్రస్వరంతో “ఘడ్ తో ఆయా, లేకిన్ సింహ్ చలాయా!” అన్నాడు. [దుర్గం వచ్చింది కానీ సింహాన్ని కోల్పోయాను]

అదీ శివాజీ భావవాద దృక్పధం, ఆలోచనా సరళి! సింహఘడ్ దుర్గాన్ని గెలిచిన ఆనందం కన్నా, తన ప్రియమిత్రుడూ, మహా యోధుడు అయిన తానాజీ మరణంపట్ల దుఃఖమే ఆయన హృదయాన్ని తాకింది. ప్రతి విషయాన్ని, అనుభూతినీ రూపాయల్లోకి తర్జుమా చేసుకుంటున్న నేటి సమాజంలో ఈ ’భావం’ ఎందరికి అర్ధమౌతుందో భగవానుని కెఱుక.

ఛత్రపతి శివాజీ సాహసాలు - 2

అనగా అనగా.....

మన చరిత్రలో జరిగిన నిజ సంఘటనలు!

ఓ సారి ఔరంగజేబు ముస్లిం సైనికులు తమ దుర్గం మీదకి దాడికి వస్తున్నారని శివాజీ సేనకి సమాచారం అందింది. తామున్న చోటుకు చేరాలంటే సన్నని లోయలో నుండి ప్రయాణించాలి. శివాజీ సేన, ముస్లిం సైనికులు లోయలో నుండి ప్రయాణిస్తుండగా, సైనికుల మీదికీ, వారి గుర్రాల మీదికి పెద్దపెద్దబండరాళ్ళని కొండ అంచుల నుండి క్రిందికి దొర్లించారనీ ఆ విధంగా వారిని పార దోలారనీ కథనాలున్నాయి.

మరోసారి ఔరంగజేబు మద్దతుదారులైన ఓ సామంత ముస్లింరాజు శివాజీ దుర్గం మీదకి దండయాత్ర కొచ్చాడట. అంత సైన్యాన్ని ఎదుర్కొనేందుకు శివాజీ దగ్గర చాలినంత ధనమూ లేదు, సైన్యం లేదు, ఆయుధాలు లేవు. ఉన్నది సంకల్పమూ, ధైర్యమూ, మేధస్సులే [లగాన్ సినిమాలో ఇండియన్ టీం లాగా].

ఉన్న పరిమిత వనరులతోనే ప్రతివ్యూహం పన్నారు. రాత్రికి శతృశిబిరం ఎక్కడ విడిది చేస్తుందో అంచనా వేసారు, ఆనుపానులు కనిపెట్టారు. దానికి తగిన దూరంలో కనుచూపులో ఉండేటట్లు తమ విడిది [campaign] నిర్మించారు. గుడారాలు వేసారు. కాగడాలు వెలిగించారు. గస్తీ ఏర్పాట్లు చేశారు.

దూరం నుండి ఇదంతా చూసిన శతృసైనికులకి ఆ చీకట్లో మండుతున్న కాగడాలు. లెక్కకు మిక్కిలి గుడారాలు గుబులు పుట్టించాయి. గెలవగలమన్న ఆశనీ, ధైర్యాన్ని కోల్పోయారు. కాళ్ళకి బుద్ధి చెప్పారు. ఇలాంటి ప్రయత్నాల్లో శివాజీ, ఆయన అనుచరులూ, ఉన్నది కొద్దిమందే అయినా గుర్రాలు, ఉడుములూ, కోతులూ, పావురాలని కూడా శిక్షణ ఇచ్చి ఉపయోగించుకున్నారట.

ఈవిధంగా ధనబలాన్ని, అధికార బలాన్ని, కేవలం మనోబలంతో ఎదుర్కొన్న యోధులు మరాఠాలు. ఒకసారి ఔరంగజేబు శివాజీ తండ్రిని బంధించి, చర్చల కంటూ శివాజీని పిలిపించి బంధించాడు. శివాజీ చెరసాల నుండి మాసిన బట్టల మూటలో దాక్కొని చాకలి వాడి సాయంతోనూ, తన అనుచరుల సాయంతోను తప్పించుకున్నాడట.

ఆ సమయంలో ఆ మాసిన బట్టల మూటని చెరసాల కావలి వాళ్ళు గానీ పట్టుకుంటే, శివాజీతో పాటు చాకలి వాడూ మరణాన్ని ఎదుర్కొక తప్పదు. అయినా వాళ్ళు వెనుకడుగు వేయలేదు. తమ ‘కర్తవ్యం’గా, దేన్ని తమంత తాముగా స్వీకరించారో, ఆ సంస్కృతీ పునఃప్రతిష్ఠ పట్ల వారి కున్న నిబద్దత అది! ధర్మ స్ఫూర్తి అది!

మరోసారి కూడా ఔరంగజేబు శివాజీని, ఆయన జ్యేష్ఠపుత్రుడు శంభాజీని నిర్భందించాడు. శివాజీని చంపితే తన రాజ్యంలో పెద్దసంఖ్యలో ఉన్న హిందువుల్లో అసంతృప్తి, తిరుగుబాటూ వస్తుందని భయపడి, సరియైన అదను కోసం ఎదురు చూస్తున్నాడు. కొన్ని నెలలు గడిచాయి. శివాజీ జబ్బుపడినట్లు నమ్మించాడు. అయన అనుచరులు శివాజీ ఆరోగ్యం కోసం ప్రతిరోజూ దైవపూజలు నిర్వహించేవారు. ప్రతీరోజూ జైలులోని ఖైదీలకి, కావలి భటులకీ ప్రసాదాలు పంచిపెట్టేవారు.

మొదట్లో జైలు కావలి భటులూ, ఇతర సిబ్బంది ఈ ప్రసాదాలూ, మిఠాయిలు పట్ల జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ముందుగా పరీక్షించాక గానీ పంచి పెట్ట నిచ్చేవాళ్ళు కాదు, తామూ తినే వాళ్ళు కాదు. అయితే మిఠాయిల్లో ఏ మతలబు లేదు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. నెమ్మదిగా ప్రసాదాలని పరీక్షించటంలో ఓ సాచాటు వచ్చింది. యధాలాపంగా స్వీకరించటం మొదలు పెట్టారు. పరిస్థితి మామూలుగా, శాంతిపూరితంగా ఉంది.

ఓ రోజు ప్రసాదంగా జైలుకు లడ్డూలు పంపబడ్డాయి. అయితే వీటిలో మత్తు పదార్ధం కలపబడింది. లడ్డూలు తిన్న జైలు సిబ్బంది, కావలి భటులూ, ఇతరులూ స్పృహ కోల్పోయారు. తన అనుచరులూ, జైలులో తన అనుకూలురుల సాయంతో శివాజీ, శంభాజీ కూడా జైలు నుండి తప్పించుకోగలిగారు.

[’ఇది కుట్రకాదా’ అని ఎవరైనా వాదిస్తే వారికి సమాధానం చెప్పకుండా ఊరుకోవాల్సిందే. ఎందుకంటే ముస్లిం రాజుల కుట్రల వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ, శివాజీ జైలు నుండి తప్పించుకోవాడానికి పన్నిన పధకానికి వెనుక నున్న ’ఇన్ ట్యూషన్’కీ తేడా గమనించని వాళ్ళతో, వాదించి మాత్రం సాధించగల ప్రయోజనం ఏముంది?]

శివాజీ సమాజంలో నీతినీ, ధర్మాన్ని, సంస్కృతినీ తిరిగి స్థాపించడానికి ఎంతో దీక్షతో పోరాడాడు. అదే అయన జీవిత లక్ష్యం. ఆ లక్ష్యసాధనలో ఎంత ప్రమాదాన్ని ఎదుర్కొడానికైనా, ప్రాణాలొడ్డానికైనా ఏక్షణమూ వెనుకాడలేదు. తన రాజ్యాన్ని సైతం ప్రజలకు తాను ఆదర్శంగా ఉండేలాగా, ప్రజలు కూడా నీతీ ధర్మాల్ని ఆచరించేలాగా, ఉత్తేజపరుస్తూ పరిపాలించాడు.

మన వీరుడు ఛత్రపతి శివాజీ !

అనగా అనగా.....

మన చరిత్రలో జరిగిన కథ!

ఛత్రపతి శివాజీ ’రాజ’ కుటుంబం నుండి రాలేదు. సాధారణ రాజోద్యోగ కుటుంబం నుండే వచ్చాడు. ఆయన దృఢ సంకల్పం, మంచి చేయాలనే దృక్పధం భగవంతుడి నుండీ, పురాణీతిహాసాల నుండి, ధర్మతత్త్వ చింతన నుండీ ఆయన పొందిన స్ఫూర్తి, ఆయనలోని ఉత్తేజం, ఆయన అనుచరుల్లోకి ప్రవహించి ప్రజ్వరిల్లింది. సమిష్టి కృషి అద్భుతాన్ని ఆవిష్కరించింది.

ఈ ప్రయత్నంలో ఓసారి శివాజీ షెయిస్తఖాన్ ని ఎదుర్కొనాల్సి వచ్చింది. షెయిస్తఖాన్ ఏడడుగుల ఎత్తులో, శరీరక బలంతో, కౄరుడిగానూ, రాక్షసుడిగానూ పేరు పడ్డాడు. ఔరంగజేబు తరుపున శివాజీతో చర్చించడానికి వస్తున్నాడు. అయితే ఇది పైకారణం మాత్రమే. ఆ వంకతో శివాజీని చంపడమే అతడి లక్ష్యం. ఈ విషయం శివాజీకి తన వేగుల ద్వారా ముందే తెలుసు.

శివాజీ ఆ ప్రమాదాన్ని[రిస్క్ ని] ఎదుర్కొనేందుకే నిశ్చయించుకున్నాడు. ఈ సంఘటనని ఎదుర్కొడానికి బయలుదేరేముందు శివాజీ తన అనుచరులందర్నీ జాగరూకుల్ని చేసి, తదుపరి కర్తవ్వాన్ని వివరించాడు. ఒకవేళ షెయిస్తఖాన్ తో పోరాటంలో తాను ప్రాణాలు కోల్పోయినా, సమాజంలో నీతినీ, విలువల్నీ హిందూ సంస్కృతినీ పునఃప్రతిష్టించే పనిని తాము కొనసాగించాలని ప్రభోదించాడు. అవీ వారి ధైర్యసాహసాలూ, ధృఢ సంకల్పాలు!

ప్రతిపాదిత సమయానికి శివాజీ, షెయిస్తఖాన్ ని కలిసేందుకు బయలుదేరాడు. రహస్యంగా తన చేతి పది వెళ్ళకు పులిగోళ్ళను పోలిన ఇనుపగోళ్ళను తగిలించుకున్నాడు. షెయిస్తఖాన్ విశాలంగా నవ్వుతూ శివాజీని ఆహ్వానించాడు. స్నేహాన్ని వ్యక్తీకరిస్తూ శివాజీని కౌగిలించుకున్నాడు. నిజానికది మృత్యుకౌగిలి; శివాజీకైనా, షెయిస్తఖాన్ కైనా. ఆ కౌగిలింతలోనే శివాజీని పిడిబాకుతో పొడిచి చంపాలని షెయిస్తఖాన్ ప్రయత్నించాడు.

అయితే శివాజీ షెయిస్తఖాన్ కంటే చురుగ్గానూ, వేగంగానూ కదిలాడు. షెయిస్తఖాన్ తనను బాకుతో పొడవబోయే లోగానే తాను అతని వీపుని తన ఇనుపగోళ్ళతో చీల్చివేశాడు. అది చూసి షెయిస్తఖాన్ సైనికులు మ్రాన్పడిపోయాడు. తమ శిబిరంలోకి వచ్చి తమ నాయకుణ్ణి చంపే సాహసాన్ని వాళ్ళు ఊహించలేదు. వారా దిగ్ర్భమ నుండి తేరు కొనే లోగానే శివాజీ సైన్యం వారిపై దాడి చేసింది. అప్పటికే భయభ్రాంతులైన షెయిస్తఖాన్ సైనికులు పలాయనం చిత్తగించారు.

ఆ విధంగా శివాజీ కర్తవ్యం కంటే ప్రాణాలు విలువైనవి కావని నిరూపించాడు. ఎందుకంటే వ్యక్తి జీవితం ఈ ప్రపంచంలో ఎప్పటికీ తాత్కాలికమే. కానీ ధర్మం, విలువలు మాత్రం శాశ్వతం. మనం ఎలా బ్రతికినా, ఏదో ఒక రోజున చావడం ఖాయం. కానీ చావనిది సంస్కృతి, ధర్మమే.

మరో కమ్మని కథ లాంటి విషయం కోసం వేచి చూడండి.

భారతీయ వారసత్వానికి ప్రతీక రాణి పద్మిని !

అనగా అనగా.....

మన చరిత్రలో జరిగిన నిజ సంఘటనలు!

13వ శతాబ్ధంలో మరొక మహ్మదీయుడు అల్లా ఉద్దీన్ ఖీల్జీ భారతదేశంలోని, రాజ పుత్ర రాజ్యం చిత్తోడ్ ఘడ్ మీదకి దండయాత్ర చేశాడు. అప్పటికి చిత్తోడ్ ఘడ్ రాజు రాణా రత్నసింహుడు. ఆయన భార్య రాణి పద్మిని. ఆమె అద్భుత సౌందర్యవతిగానూ, విదుషీమణిగానూ, పేరుగాంచింది. ఆమెను కాంక్షించి అల్లా ఉద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ ఘడ్ పై అనేక సార్లు దండయాత్ర చేశాడు. కానీ గెలవలేకపోయాడు.

చివరికి ఒక రాయబారి ద్వారా రాణా రత్నసింహుడికి ఒక వర్తమానం పంపించాడు. “రాణి పద్మిని సౌందర్యం గురించి నేను చాలా విని ఉన్నాను. ఆ ప్రఖ్యాతి లోని నిజం తెలుసుకోవాలని, ఒక్కసారి ఆమెను చూడాలని కోరుకున్నాను. ఒక్కసారి ఆమెని చూడగలిగితే, నేను యుద్ధం విరమించి వెనక్కి వెళ్ళిపోతాను” అన్నది ఆ వర్తమాన సారాంశం.

రాజు రాణా రత్నసింహుడు, మంత్రులూ ఆలోచించారు. రాణి పద్మినితో చర్చించారు. చివరికి వారంతా “అల్లా ఉద్ధీన్ ఖిల్జీని మన రాజ్యానికి ఒక స్నేహితుడిగా భావించి విందుకు ఆహ్వానిద్దాం. మన సౌహార్ర్ధాన్ని, స్నేహాన్ని మనం చూపిద్దాం. ఏవిధంగా చూసినా యుద్ధం కంటే శాంతి గొప్పది కదా! రాణి పట్ల అతని దృష్టి నీచమైనది కాదని అతడి వర్తమానం చెబుతోంది. ప్రఖ్యాతి గాంచిన విషయం పట్ల గల కుతుహలమే నంటున్నాడు కాబట్టి రాణి ప్రతిబింబాన్ని అతడికి అద్దంలో చూపుదాం. మన రాణి గారికి సోదర తుల్యుడుగా అతణ్ణి గౌరవిద్దాం” అని తీర్మానించారు.

ఆ విధంగానే అతడికి కబురుపంపారు. అతడీ ఆహ్వానాన్ని అందుకుంటూ తనను తాను రాణీ పద్మినికి సోదర తుల్యుడిగానూ, రాజూకూ, చిత్తోడిఘడ్ ప్రజలకూ మిత్రుడిగానూ ప్రకటించుకున్నాడు. విందు రోజున రాజు రాణారత్నసింహుడు, మంత్రులూ, చిత్తోడ్ ఘడ్ ప్రజలూ అల్లా ఉద్దీన్ ఖీల్జీని విశిష్ట అతిధిగా గౌరవించారు. విందు తర్వాత రాణీ పద్మిని ప్రతిబింబాన్ని అద్దంలో అతిధికి చూపారు. ఆ సౌందర్యం చూచి అతడు అబ్బురపడ్డాడు. తన నైచ్యాన్ని పైకి ప్రదర్శించలేదు. తన అతిధి నటనను కొనసాగిస్తూ రాణా రత్నసింహుని ప్రతి విందుకు ఆహ్వానించాడు. రాజు ఇది అంగీకరించాడు.

తదుపరి రత్నసింహుడు కొద్దిపాటి పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి విందుకు వెళ్ళాడు. అతిధి మర్యాదని ఊహించారే గానీ కుట్ర అనుకోలేదు. ఎందుకంటే నమ్మకద్రోహం అంతగా భారతీయులకి తెలీదు. అతిధి మర్యాదులకు బదులుగా రత్నసింహుడు దగాని అందుకున్నాడు. రాజును బంధించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీ రాణి పద్మినికి తనకు లొంగిపోవలసిందిగా కబురు పంపించాడు.

అల్లా ఉద్దీన్ ఖిల్జీ రత్నసింహుణ్ణి ’అతిధి’ అంటూ ఆహ్వానించాడు. మానవీయ విలువల్ని నమ్మి, రాణా రత్నసింహుడు పరిమిత పరివారంతో అల్లా ఉద్దీన్ ఖిల్జీ విడిదికి వచ్చాడు. కాబట్టే అతడు రత్నసింహుని బంధించగలిగాడు. ఇది కుట్రే కదా! ఇదే పని అల్లా ఉద్దీన్ ఖిల్జీ అతిధిగా చిత్తోడ్ ఘడ్ కు వచ్చినప్పుడు [అప్పుడతనిదీ పరిమిత పరివారమే] రత్నసింహుడు చేసి ఉంటే? అతిధిని ఆదరించాలి, నమ్మించి మోసగించ కూడదు లాంటి నీతుల్ని తలచకుండా అల్లా ఉద్దీన్ ఖిల్జీని బంధించిన, చంపేసినా ఏం చేయగలిగి ఉండేవాడు? కేవలం మానవతా విలువల్నీ, సత్యం పలకడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం లాంటి నీతి, ధర్మం పాటించారు గనుక భారతీయ రాజులు అలాంటి కుట్రలు చేయలేదు. నేటికీ పాకిస్తాన్ మన పట్ల అదే విధమైన మోసాలు చేస్తూనే ఉంది.

ఆ విధంగా అల్లా ఉద్దీన్ ఖిల్జీ చేతిలో మోసానికి గురయ్యాక, రాణి పద్మిని, మంత్రులు కలిసి బాగా ఆలోచించి అల్లాఉద్దీన్ ఖిల్జీకి మరునాడు రాణి పద్మిని అతడికి లొంగిపోగలదని కబురు పంపారు.

మరునాడు పల్లకీల ’కాన్వాయ్’ అల్లాఉద్దీన్ ’కాంపైన్’ చేరింది. అల్లాఉద్దీన్ ఖిల్జీ ఆనందానికి అంతులేదు. ప్రఖ్యాతి గాంచిన అపురూప సౌందర్యవతి తన సొత్తు కాబోతోంది. తానామెను అందుకోబోతున్నాడు. ఆ పరవశంతో అతడు రాణీ గారి పల్లకీకి ఎదురు వెళ్ళి స్వాగతించాడు. అయితే అతడు స్వాగతించింది పరిచారికుల వేషంలో ఉన్న సైనికులకి.

రాణి పద్మిని పల్లకీలో సైతం స్త్రీ వేషంలో ఉన్న యోధుడున్నాడు. ’మోసం’ అంటూ గావు కేకలు పెట్టిన అల్లాఉద్దీన్ ఖిల్జీ అనివార్యమైన యుద్దాన్ని ఎదుర్కొన్నాడు. వీరోచితంగా పోరాడిన రాజ పుత్ర వీరులు రాణా రత్నసింహుని విడిపించుకొని పోయారు. దీనితో అల్లా ఉద్దీన్ ఖిల్జీ క్రుద్ద్రుడయ్యాడు. సహజమే కదా! తాను ఎదుటి వాళ్ళను మోసగించగలిగినప్పుడు అది తన తెలివీ లేదా సామర్ధ్యం అనుకొని సంతోషాన్ని గర్వాన్ని పొందినప్పుడు, తాను ఇతరుల చేతిలో మోసపోతే అసహనానికి క్రోధానికి గురవుతారు కదా!

తర్వాతి ప్రయత్నంలో అల్లా ఉద్దీన్ ఖీల్జీ మరింత సైన్య సమీకరణ చేసుకొని మరీ, చిత్తోడ్ ఘడ్ మీదికి దండయాత్ర చేశాడు. కోటని వశపరుచు కొన్నాడు. రాణా రత్నసింహుణ్ణి, ఇతర యోధుల్ని చంపేసాడు. కానీ ఎంతో కాంక్షతో అంతఃపురాల్లోకి ప్రవేశించిన అల్లా ఉద్దీన్ ఖిల్జీకి కనబడింది అందాల రాశులు కాదు, బూడిద రాశులు. రాణి పద్మినితో సహా రాణివాసపు స్త్రీలందరూ శతృరాజుల అత్యాచారాన్ని తమ శరీరాల మీదా, మనుస్సుల మీదా కూడా నిరోధించటానికి, వారి రాకకు ముందే అగ్నిలో దూకి ఆత్మాహుతి చేసుకొన్నారు. ఆవిధంగా నైతికత కాపాడు కోవటానికీ తమ జీవితాల్ని తృణప్రాయంగా, [ గరిక పోచల్ని వదిలినంత తేలికగా] వదిలివేశారు.

అంతేగాని ఆధునిక ప్రగతి సూత్రం “When the rape is unavoidable, enjoy it” అనుకోలేదు. అత్యాచారాల్లాంటి నైచ్యాన్ని భరించటం కంటే మరణం మేలన్నది వారి వివేచన. అలాంటి నైచ్యాన్ని నివారించటానికి వారు ఇతరుల్ని హత్య చేయాటానికైనా వెనుదీయరు, ఆత్మహత్య చేసుకోవాటానికైనా వెనుదీయరు. భారతీయ రక్తంలోనే అంతటి పౌరుషం నైతికత, సత్యం విషయంలో ఉంది.

ఇది నిజంగా జరిగిన సంఘటన. మన చరిత్ర.

పిల్లి గంపల వంశం పిట్టకథ

అనగా అనగా.....

ఒకవూరిలో ఓ పెద్ద మోతుబరి కుటుంబం ఉండేది. తరతరాలుగా ఉమ్మడి కుటుంబం. తాతలు తరం, తండ్రుల తరంతో వెరసి అప్పటికి ఆ కుటుంబంలో 30 మంది దాకా పెద్దవాళ్ళు, 50 మంది దాకా పిల్లవాళ్ళు, గొడ్డూ గోదా, పిల్లా మేకా, పాడిపంట!

పెద్దలోగిలిలో అంతా కలిసే ఉంటారు. అత్తలూ, కోడళ్ళూ అంతా సఖ్యంగా, తోబుట్టువులూ, దాయాదులూ సమైక్యంగా పనులు చేసుకుంటూ సుఖంగా ఉండే వాళ్ళూ. పాడీపంట ఎక్కువే, పిల్ల సైన్యమూ ఎక్కువే కావటంతో వాళ్ళ ఇంట్లో ఎలుకల బాధ మెండుగా ఉండేది. దాంతో పదిపన్నెండు పిల్లుల్ని పెంచేవాళ్ళు. రోజూ పిల్లలతో పాటే ఉదయాన్నే పిల్లులకి కూడా పాలబువ్వా, పెరుగన్నమూ పెట్టేవాళ్ళు.

అయితే పండగ రోజున మాత్రం దైవ పూజ అయ్యేదాకా పిల్లలకి కూడా ఏమీ పెట్టరు గదా! అసలే ఆ రోజుల్లో ఆచారాలు గట్టిగా పాంటించే వాళ్ళయ్యె! పిల్లలు పెద్దలకి భయపడో, దేవుడి మీద భక్తితోనో ఓర్చుకొనేవాళ్ళు. కానీ పిల్లులు మాత్రం ఆడవాళ్ళ కాళ్ళకి చుట్టుకుంటూ పనులు చేసుకోనివ్వకుండా ’మియ్యాం’ అంటూ వెంటపడేవి.

దాంతో పూజయ్యే దాకా పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టటం చేసేవాళ్ళు. రాను రాను అదో ఆచారం లాగా పండగ రోజు ఉదయాన్నే పిల్లుల్ని గంపక్రింద కప్పెట్టి పూజ పూర్తయ్యాక విడిచిపెట్టటం చేసేవాళ్ళు. దాంతో వాళ్ళది పిల్లిగంపల వంశం అనే సార్ధక నామం ఏర్పడింది.

కాలం గడిచింది. రోజులు మారాయి. ఉమ్మడి కుటుంబం, చిన్న [న్యూక్లియర్] కుటుంబాలయ్యింది. తర్వాతి తరాల్లో ఓ కుటుంబం ముంబాయి అపార్ట్ మెంట్లులో కాపురముంటూ కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటూ బ్రతికేస్తుంది.

కానీ తమ ఆచారం ప్రకారం పండగ నాడు పిల్లుల్ని వెదుక్కొచ్చి, గంపల తెచ్చి కప్పిపెట్టటం అంటే చచ్చే చావయ్యిందిట. గంపలు కొని, పండగలయ్యాక పదిలంగా అటకల మీద ఉంచటం, పిల్లుల్ని వెదకటం – ఓహ్! భీభత్సం! చివరకి తెలిసిన వాళ్ళ ’పెట్’ పిల్లుల్ని అరువు తెచ్చుకోవటం, పిల్లుల్ని పెంచే వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం లాంటి నానా యాతనలూ పడ్డారట.

పిల్లుల్ని పెంచుదామంటే భార్యభర్తలిద్దరు ఉద్యోగం చేసే చోట దాన్ని పదిలంగా పెంచనూ లేరు, పోనీ పెంచుదామన్నా అది ప్రక్క వారి అపార్ట్ మెంట్లో ఏదైనా గల్లంతు చేసిందంటే ఆ’న్యూసెన్సూ’ ’నాన్ సెన్సు’ భరించటం కష్టం.

ఇదంతా చెప్పుకొని సదరు గృహస్తూ నిట్టూర్చాడట.
ఇదీ కథ!
[ఈ పిట్టకథ నేను డి.వి. నరసరాజు గారు ఒక రాజకీయ వ్యాసంలో వ్రాయగా చదివాను]

ఆనాడు అవసరం నుండి ఆచారం పుట్టింది. ఆలోచన లేని ఆచరణ ఈ రోజు ఆచారం పేరిట విచారం పుట్టిస్తోంది. లోపం ఎక్కడుంది? నిశ్చయంగా `అనాలోచన’ లోనే కదా? అనాలోచనకి తర్వాతి పరిణామం మూర్ఖత్వమే.

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

సింహాలు మీరు

అనగా అనగా.....

నిండు గర్భిణి అయిన ఒక సింహాం, ఆహారం కోసం తిరుగుతూ, ఒక గొర్రెలమందను చూచి, దాన్లోకి దుమికింది. కానీ ఆ శ్రమకు ఓర్వజాలక, ఈని, అది వెంటనే మరణించింది. దాని బిడ్డ, గొర్రెల పోషణ క్రిందనే పెరిగి, వాటితోపాటు గడ్డిమేస్తూ, వాటిలాగానే గొర్రె అరపు అరుస్తూండినది. పెద్దదైన తర్వాత కూడ, తాను ‘గొర్రె’ అనే దాని తలపు.

మరొక సింహాం ఒకనాడు, ఆ ప్రాంతానికి ఆహారార్ధం వచ్చి, ఆ మందలో సింహాం ఉండడం, గొర్రెలలాగా అదీ పారిపోవడమూ చూసి అశ్చర్యపోయింది. దాని దగ్గరకు వెళ్లి, అది గొర్రెకాదనీ, సింహామనీ తెలుపడానికి ప్రయత్నించింది కాని, అది అందకుండా పారిపోసాగింది.

సమయం కోసం వేచి ఉండి, ఒకరోజు ఆ ‘గొర్రె – సింహం’ నిద్రిస్తూండగా, దగ్గరకు వెళ్ళి, “నువ్వు సింహనివి” అని దానికి చెప్పింది. “కాదు, నేను గొర్రెనే” అంటూ అది గొర్రెఅరుపు అరిచింది. అంతట ఈ సింహం దాన్ని ఒక చెరువు దగ్గరికి లాక్కునిపోయి, తమ ఉభయుల ప్రతిబింబాల్ని చెరువు నీటిలో చూపిస్తూ, "బాగా చూడు, నువ్వు ఎవరివో యిప్పటికైనా తెలుసుకో” అన్నది సింహం.

అంతట, ఆ ‘గొర్రె – సింహం’ నీళ్లలో కనిపించే తన ప్రతిబింబాన్ని, ఆ సింహాన్ని పోల్చిచూసుకొన్నది. క్షణమాత్రంలో తాను సింహామనే సత్యం దానికి స్ఫురించింది. వెంటనే దాని గొర్రె అరుపు మాయమై, సింహగర్జనం వెలువడింది.

మనం అపరిశుద్ధులం అని ఎన్నడూ అనకండి. పరిశుద్దులమనే అనండి. మనం స్వల్పులమనీ, జన్మిస్తామనీ, మరణిస్తామనీ గాఢభ్రాంతిని ఒక దాన్ని కల్పించుకొని ఉన్నాం. అందువల్ల మనల్ని ఎప్పుడూ అకారణ భీతి వెన్నాడుతోంది. సింహాలు మీరు! నిత్యం పరిశుద్ధం, పరిపూర్ణం అయిన అత్మయే మీరు. విశ్వశక్తి మీలో అణగి ఉంది.

’మిత్రమా! ఏడుస్తున్నా వెందుకు? నీకు జననమరణాలు లేవు, వ్యాధి దుఃఖాలు లేవు. అనంతమైన అకాశం వంటివాడివి నువ్వు. రంగు రంగుల మబ్బులు దాని నావరించి, ఒక క్షణ మాత్రం క్రీడించి మాయమౌతూ ఉంటవి. కానీ, అకాశ మెప్పుడూ, నిత్యవినీల కాంతిమయమే. దుర్జనత్వం మనకేల కనిపిస్తోంది?’

నేను ఆత్మను. విశ్వంలో ఏదీ నన్ను చంపలేదు’అని మానవుడికి వ్యక్తపరిచే ధైర్యాన్ని అలవరుచుకోండి. అప్పుడు మీరు ముక్తులవుతారు.

[వివేకానంద చెప్పిన కథలు నుండి దీనిని తీసుకొన్నాను.]

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

బిందుసారుడి వారసుడెవరు?

అనగా అనగా.....

ఒకసారి ’బిందుసారుడి వారసుడెవరు?’ అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది.

బిందుసారుడు రాజగురువు, చాణక్యుడి సలహా కోసం ఆశ్రయించాడు. అప్పటికే శతాధిక వృద్ధుడైన ఆచార్యుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. విషయమంతా సావధానంగా విన్నాక ఆయన “నాయనా! రేపు ఉదయమే నీ పుత్రులందర్నీ దేవీ అలయానికి రమ్మని ఆఙ్ఞాపించు. వచ్చేముందు బలవర్థకమైన ఆహారాన్ని భుజించి, మంచి వాహనాన్ని అధిరోహించి రమ్మని చెప్పు. దేవాలయంలో కూర్చునేటందుకు విలువైన ఆసనాన్ని వెంట తెచ్చుకొమ్మని చెప్పు” అన్నాడు.

బిందుసారుడలాగే తన కుమారులందరికీ ఆఙ్ఞాపించాడు. మహారాజు, మంత్రులూ, విషయం తెలిసిన ఇతర ప్రజలూ – అందరూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఆతృత చెందారు.

నిర్ధేశింపబడిన సమయానికి రాకుమారులంతా దేవాలయం చేరారు. తమ ఆసనాలనీ వెంట తెచ్చుకున్నారు. ఒకరు బంగారు కుర్చీని తెచ్చుకున్నారు. ఒకరు దారుశిల్పంతో నిండిన ఆసనాన్ని తెచ్చుకొన్నారు. పట్టువస్త్రాలతోనూ, పరుపులతోనూ అలంకరించి ఆసనాన్ని మరోకరూ, ముత్యాలూ, రతనాలూ పొదగబడిన పీటను ఇంకొకరు తెచ్చుకున్నారు. ఒకొక్కరూ ఒకో వాహనం పైన వచ్చారు. ఒక రాకుమారుడు పల్లకిలో వచ్చాడు. ఒకరు గుర్రమీద, ఒకరు ఏనుగు అంబారీ పైనా, మరొకరు రధంలోనూ .... ఇలా ఎవరికి మంచిదనిపించిన వాహనం మీద వారు వచ్చారు.

దేవాలయ ప్రాంగణంలో మహారాజు, మంత్రులు, ఆచార్యుడు అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చోన్నారు. వారికి ఎదురుగా రాకుమారులంతా తమ తమ వెంట తెచ్చుకున్న ఆసనాలపై కూర్చొన్నారు. వారిలో అశోకుడు ఒక్కడే కటిక నేలపై కూర్చొని ఉన్నాడు. అది చూసి ఇతర రాకుమారుల ముఖమ్మీద ముసిముసినవ్వు కదలాడింది. అందులో హేళన మిళితమై ఉంది. దాసీ పుత్రుడికి అంతకంటే ఏం ఉంటుందన్న ఎగతాళి ఉంది.

ఆచార్యుడు అడిగాడు “మీరంతా ఒకరి తర్వాత ఒకరు, ఇక్కడికి వచ్చేముందు ఏ ఆహారం స్వీకరించారో చెప్పండి”.

రాకుమారులంతా తామేం తినివచ్చారో ఒకింత గర్వంగా చెప్పారు. అశోకుడి వంతు వచ్చింది. స్థిరమైన గొంతుతో అశోకుడు “గిన్నెడు పెరుగు” అన్నాడు. రాకుమారులంతా ఫక్కున నవ్వారు.

ఆచార్యుడు “బలవర్థమైన ఆహారం స్వీకరించి రమ్మని నీకిచ్చిన ఆఙ్ఞ. మరి పెరుగెందుకు తిన్నావు?" అని అడిగాడు.అశోకుడు తడబాటు పడకుండా “ఆచార్య! మీరిచ్చిన ఆఙ్ఞని నా తల్లికి యధాతధంగా చెప్పాను. ఆవిడ నాకు ఉదయమే పెద్దగిన్నెడు పెరుగు ఇచ్చింది. తల్లిగా ఆమెకు – బిడ్డకు మంచి ఆహారమేదో, సందర్భానికి తగిన ఆహారం ఏదో తెలుసు. కాబట్టి మారు మాట్లాడక ఆమె పెట్టింది తిని వచ్చాను” అన్నాడు.

చాణక్యుడు తలాడించి, "ఒకరి తర్వాత ఒకరు, మీరు ఇక్కడకు ఏయే వాహనాల మీద వచ్చారో చెప్పండి” అన్నాడు.

రాకుమారులంతా తాము ఏ వాహనాల మీద వచ్చిందీ చెప్పారు. అశోకుడి వంతు వచ్చినప్పుడు అతడు “నేను నడిచి వచ్చాను” అన్నాడు. ఈ సారి రాకుమారులు నవ్వే ధైర్యం చెయ్యలేదు. ఆచార్యుడు, తండ్రి, ఇతర పెద్దల ముఖాల్లోని గాంభీర్యం వాళ్ళని నవ్వే ధైర్యం చెయ్యనివ్వలేదు.

ఆచార్యుడు “ఆశోకా! నీకు నచ్చిన మంచి వాహనం మీద రమ్మని కదా నా ఆఙ్ఞ. మరి నడిచి వచ్చే నిర్ణయం ఎందుకు తీసికొన్నావు?"

అశోకుడు వినయంగా “ఆచార్య! నా దృష్టిలో నా కాళ్ళ కంటే గొప్ప వాహనం నాకు మరొకటి కన్పించలేదు. భగవంతుడు నాకు ఇంత బలమైన మంచి కాళ్ళను ఇవ్వకపోయి ఉంటే నేను రధం, అశ్వం, గజం వంటి ఏ ఇతర వాహనాన్ని ఉపయోగించలేను కదా” అన్నాడు.

ఆచార్యుడు చిరునవ్వు నవ్వాడు. “అశోకా! అందరూ బంగారం, ఇంకా విలువైన ఆసనాలు మీద కూర్చున్నారు. నీవు నేల పై ఎందుకు కూర్చున్నావు?” అన్నాడు.

అశోకుడు “ఆచార్య! నా దృష్టిలో భూమి – బంగారం లాంటి లోహాల కంటే, మణిమాణిక్యాల కంటే విలువైనది. ఎందుకంటే అవన్నీ మనకు భూమి నుండే లభిస్తాయి. భూమి కంటే మరేదీ విలువైనది లేదని నా అభిప్రాయం. అందుకే భూమినే ఆసనంగా చేసుకున్నాను!” అన్నాడు.

ఒక్కసారిగా చప్పట్లతో ఆ ప్రాంగణం మార్మోగింది. అందరూ అశోకుడి సునిశిత అలోచనా సరళినీ, దృక్పధాన్ని మెచ్చుకున్నారు. అశోకుడే బిందుసారుని వారసుడన్నది పరోక్షంగా ముద్రపడిపోయింది. బిందుసారుడు అశోకుడి తల్లీ, తన భార్య ఐన బ్రాహ్మణ రాణిని, కొడుకు నలా పెంచినందుకు ఎంతగానో అభినందించాడు. తానెంతో ఆనందించాడు.

ఇది మన చరిత్ర.

అధికారం Vs బుర్ర

అనగా అనగా.....

అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే దేశం.


ఆ దేశాన్ని తైమూర్ పాలిస్తుండేవాడు. ఇతడు పేరుకే రాజుగానీ, పరమ పిసినారి, స్వార్ధపరుడూను. అతడికి ఈర్ష్యాసూయలు కూడా ఎక్కువే.

ఎప్పుడూ నసీరుద్దీన్ నుండి సలహాలు తీసుకొంటాడే గానీ ఏనాడు మంచి పారితోషికం ఇవ్వడు.

నసీరుద్దీన్ తనకి ఒక గుర్రం కావాలని తైమూర్ ని అర్ధించాడు. పిసినారి తైమూర్ కి నసీరుద్దీన్ కి గుర్రాన్నివ్వడం ఇష్టంలేదు. ఇవ్వక తప్పేట్లు లేదు.

దాంతో ఓ ముసలి చచ్చు గుర్రాన్ని నసీరుద్దీన్ కిచ్చాడు.

ఇలా ఉండగా ఓ రోజు.....

తైమూర్ తన పరివారంతో కలిసి వేటకి బయలుదేరాడు. నసీరుద్దీన్ కూడా వాళ్ళ వెంట ఉన్నాడు.
అందరూ గోబీ ఎడారి చేరారు.

ఇంతలో గాలి, దుమ్ము రేగాయి. మేఘాలు కమ్ముకొచ్చాయి. అంతలోనే ఉరుములు మెరుపులతో కుంభవృష్టి మొదలయ్యింది.

తైమూర్, అతని సైనికులు ఎక్కిన గుర్రాలు బలంగా ఉన్నాయి. ఆ గుర్రాలు మీద వాళ్ళంతా ఒక్క ఉదుటున దౌడు తీయిస్తూ వెనక్కి ఊళ్ళోకి మళ్ళారు. అయినా గానీ ఊరు చేరే లోగా తడిసి ముద్దయ్యారు. నసీరుద్దీన్ గుర్రం ముసలిది, ఒక్కచిక్కినది అయిన చచ్చు గుర్రంమయ్యే.


గాలి మొదలవ్వగానే అది అడుగు తీసి అడుగు వెయ్యకుండా, ఉన్న చోటునే బిర్ర బిగిసినట్లు నిలబడి పోయింది. ఎంత అదిలించినా కదల్లేదు, మెదల్లేదు. చేసేది లేక నసీరుద్దీన్ గుర్రం దిగాడు. వర్షం మొదలయ్యేలోగా బట్టలు విప్పి ఆ గుర్రం క్రింద దాచాడు. ఎడారిలో తడుస్తూ అలాగే నిలబడ్డాడు.

వర్షం తగ్గాక ఒళ్ళార్చుకొని, గుర్రం క్రింద దాచిన దుస్తులు తొడుక్కొని గుర్రమెక్కి ఊళ్ళోకి వచ్చాడు.

కొంచెమైనా తడవకుండా, పొడి దుస్తులతో వచ్చిన నసీరుద్దీన్ ని చూచి తైమూర్ ఆశ్చర్యపోయాడు.

"అదేమిటయ్యా నసీరుద్దీన్. ఎంత వేగంగా వచ్చినా మేం ముద్దగా తడిసిపోయాము. నువ్వెలా తడవకుండా వచ్చావు? ఎక్కడున్నావు ఇప్పటి దాకా?" కుతుహలంగా అడిగాడు తైమూర్.

"అహా..హా! ఏం చెప్పను హూజూర్! అద్బుతం. అమోఘం.” ఇంకా పరవశంలోనే ఉన్నట్లు నటిస్తూ మైమరుపుగా అన్నాడు నసీరుద్దీన్.

తైమూర్ కుతుహలం మరింత పెరిగిపోయింది.

"ఏమిటి అద్భుతం? త్వరగా చెప్పవయ్యా!” అంటూ తొందర పెట్టాడు తైమూర్.

"హూజూర్! ముందుగా నేను మీకు కృతఙ్ఞతలు చెప్పుకోవాలి” అన్నాడు నసీరుద్దీన్.

"ఎందుకు?" ఆత్రంగా అడిగాడు తైమూర్.

"ఇంత అద్భుతమైన గుర్రాన్ని నాకు ఇచ్చినందుకు హూజూర్!” మరింత వినయంగా అన్నాడు నసీరుద్దీన్.
అయోమయంగా చూశాడు తైమూర్.

"నన్ను వివరంగా చెప్పనివ్వండి హూజూర్! గాలీ వానా మొదలవ్వగానే మీరంతా వేగంగా ఊరి వైపు దౌడు తీశారా? సరిగ్గా అప్పడే నేనూ నా గుర్రాన్ని అదిలించాను. అప్పుడు జరిగింది అద్భుతం! మీరిచ్చిన గుర్రం సామాన్యమైనది కాదు హూజూర్! అది ఆకాశంలో ఎగర గలదు. వాన మొదలు కాగానే అది నన్ను మబ్బుల్లోకి తీసికెళ్ళింది. ఎంత పైకంటే అప్పుడు కురుస్తోన్న మేఘం కంటే పైకి. ఆ మేఘల్లోని నందనవనం లాంటి తోటకి తీసికెళ్ళింది. అక్కడ ఎంత బాగుందనుకొన్నారు హూజూర్! పరిమళాలు వెదజల్లే పూలు, మధురమైన ఫలాలు, పక్షులు కిలకిలా రావాలు. అక్కడ ఎంచక్కా విహరించాను. తిరిగి రావాలనే అనిపించలేదు. కానీ మీరు నాగురించి వాకబు చేసి, నేనేమయ్యానో అని కంగారు పడతారని వచ్చేసాను” భావాన్ని అభినయీస్తూ, దృశ్యాన్ని కళ్ళకి కట్టినట్లు వివరించాడు నసీరుద్దీన్.

తైమూర్ కి మతిపోయింది.

అంత అద్భుతమైన గుర్రాన్ని తేరగా నసీరుద్దీన్ కి ఇచ్చేసినందుకు ఏడుపొచ్చింది. ఎలాగైనా ఆ గుర్రాన్ని తిరిగి పొందాలని “నసీరుద్దీన్. నీకిచ్చిన గుర్రం ముసలిది. ఆకాశంలో ఎగర గలదేమో గానీ, మామూలు సమయాల్లో వేగంగా పరిగెత్తలేదు. అది నాకు తిరిగి ఇచ్చేయ్. నీకు మరో మంచి గుర్రం ఇస్తాను” అన్నాడు.

నసీరుద్దీన్ నసుగుతూ “హూజూర్! ఇచ్చిన వస్తువు తిరిగి తీసికొన్నారనీ చెడ్డపేరు మీకు వస్తుందేమో! నా మూలంగా మీకు చెడ్డపేరు రావడం నాకిష్టం లేదు” అన్నాడు.

నసీరుద్దీన్ ని బ్రతిమాలి బామాలి, ఎదురు డబ్బిచ్చి, మరో మంచి గుర్రాన్నిచ్చి నసీరుద్దీన్ దగ్గరున్న ముసలి చచ్చు గుర్రాన్ని తిరిగి కొనుక్కున్నాడు తైమూర్.

మర్నాడు వాళ్ళు మళ్ళీ వేటకి వెళ్ళారు. గోబీ ఎడారి లోకి ప్రవేశించగానే, ముందు రోజులాగే ఆ రోజూ గాలీ వానా వచ్చాయి.
మంచి బలమైన గుర్రం ఎక్కిన నసీరుద్దీన్ ఆఘామేఘాల మీద ఊళ్ళోకి దౌడాయించాడు.

తైమూర్ ఎక్కిన ముసలి చచ్చూ గుర్రం, గాలీ వానా మొదలవ్వగానే శిలా విగ్రహం లాగా నిలబడిపోయింది. తైమూర్ దాన్ని కొరడాతో కొట్టాడు. పిడిగుద్దులు గుద్దాడు. బండతిట్లు తిట్టాడు. తన్నాడు. ఉహూ! ఏం చేసినా ఆ ముసలి గుర్రం అడుగు తీసి అడుగు వేయ్యలేదు. వర్షంలో ముద్దగా తడిసిపోయాడు తైమూర్.

ఆ తడిసిన దుస్తులతోనే వర్షం తగ్గాక ఊళ్ళోకి తిరిగి వచ్చాడు. దాంతో బాగా జలుబు చేసి జ్వరం వచ్చింది.

ఆ రాత్రి నీరసంగా పక్కమీదకి వాలుతున్నప్పుడు అర్ధమయ్యింది తైమూర్ కి.......

తను, ముసలి గుర్రాన్నిచ్చినందుకే నసీరుద్దీన్ తనకి గుణపాఠం నేర్పాడని. అంతే!

కన్నంలో తేలు కుట్టిన దొంగలా కిక్కురమన కుండా ఉండిపోయాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

గీతా ప్రియకు జన్మదిన శుభాకాంక్షలు!

అనగా అనగా....

పదిహేనేళ్ళ క్రితం
సరిగ్గా ఈ రోజు
నవ్వులన్నీ తెచ్చి కుప్పబోసినట్లుగా
వారసత్వానికీ వారధిగా
దేవుడు మాకు పంపిన గొప్పకానుక!

మా పాప ఫణి గీతా ప్రియదర్శిని!!

మా పాపకి జన్మదిన శుభాకాంక్షలతో....

అమ్మ మనస్సు

అనగా అనగా .....

ఓ ఊరిలోని బ్రాహ్మణ వాడలో సరస్వతమ్మ అనే వితంతువు ఉండేది. ఆమెకు ఒకే ఒక్క కుమారుడు కాశీనాధుడు. కొడుకు పసివాడుగా ఉండగానే భర్తను పోగొట్టుకున్న సరస్వతమ్మ కాశీనాధుణ్ణి ఎంతో ప్రేమగా, అతిగారాబంగా పెంచింది.


కట్టడి చేసేందుకు తండ్రి లేని కారణంగానూ, తల్లి అతిగారాబంతోనూ కాశీనాధుడు ఎదిగే కొద్దీ బాధ్యత లేకుండానూ, వ్యసనపరుడు గానూ తయారయ్యాడు. మొదట్లో జూదమూ, మద్యమూ మరిగిన కాశీనాధుడు క్రమంగా వేశ్యాలోలుడయ్యాడు.


సరస్వతమ్మ కాశీనాధుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి ఎన్నోప్రయత్నాలు చేసింది. కాశీనాధుడిలో మార్పులేదు సరికదా ఆస్తి హారతి కర్పూరంలా కరగబెట్టి వేశ్యలకు ఖర్చుపెట్టసాగాడు. ఊరిలోని పెద్దవాళ్ళూ, బంధువులూ మందలించబోతే నోటి దురుసుతో నానా మాటలూ అన్నాడు. వ్యవహారం చెయ్యి దాటిపోయింది. ఆ దిగులుతో సరస్వతమ్మ కృంగిపోసాగింది.


దాంతో ఊరిజనం మెరకవీధి మీనాక్షిని తిట్టిపోయసాగారు. ఎందుకంటే ఆవిడే మరి కాశీనాధుణ్ణి వినోదింపజేస్తున్న వేశ్య. దానితో మీనాక్షికి సరస్వతమ్మ అంటే గొంతుదాకా కోపం, ద్యేషం నిండిపోయాయి.


మరింత కసిగా, వేగంగా కాశీనాధుడి ఆస్తి అవగొట్టేసింది. ఓ రోజు ఎంతో నయగారంగా కాశీనాధుణ్ణి మాయ చేసి అతడి స్వంత ఇల్లు కూడా వ్రాయించేసుకొంది. సరస్వతమ్మ చేసేది లేక పూరింటిలోకి మారి ఇల్లు మీనాక్షికి స్వాధీనం చేసింది. అయినా కసి తీరని మీనాక్షి ఓ రోజు కాశీనాధుణ్ణి అతడి తల్లి గుండె తెచ్చివ్వమని కోరింది.


ఉఛ్ఛనీచాలు మరిచిన ఈ కామాంధుడు తల్లి దగ్గరికి వెళ్ళి తనకి ఆవిడ గుండె కావాలని అడిగాడు. అప్పటికే జీవితేచ్ఛ నశించిన సరస్వతమ్మ కన్నీరు నిండిన కళ్ళతో “తీసికెళ్ళునాయనా” అంటూ కత్తితో గుండెలు చీల్చుకొని మరణించింది.


తల్లిగుండెని దోసిట్లో పెట్టుకొని వేగంగా వీధిలోకి వచ్చిన కాశీనాధుడు పరుగు పరుగున నడుస్తూ మీనాక్షి ఇంటిదారి పట్టాడు. ఆ వేగంలో అతడి కాలు రాయికి కొట్టుకొని తూలి పడబోయాడు. మరుక్షణం అతడి చేతిల్లోని తల్లి గుండె “జాగ్రత్త నాయనా! పడతావు” అంది. అదీ తల్లి హృదయం!


అప్పటికి కళ్ళకి కప్పిన కామపు పొరలు తొలిగిన కాశీనాధుడు సత్యం గ్రహించి, తన కామక్రోధాల్ని వదిలి భక్తి మార్గాన్ని ముక్తి దారిని పట్టాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

’ఏమీ లేదు’ అన్నదాన్నే ఇవ్వు!

అనగా అనగా.....

అది మౌల్వీ నసీరుద్దీన్ నివసించే ఊరు.

ఆ ఊళ్ళోని ఓ కట్టెలు కొట్టుకునే వాడు దాపులనే ఉన్న అడవికి కట్టెల కోసం వెళ్ళాడు. కష్టపడి ఓ పెద్దమోపు కట్టెలు కొట్టాడు. ఎత్తి నెత్తిన పెట్టుకొనేందుకు సాయం అవసరమై చుట్టూ చూశాడు.

దారిన పోతున్న ఓ బాటసారి కనబడ్డాడు.

"అయ్యా! కాస్త ఈ మోపు ఎత్తి నానెత్తిన పెట్టుకొనేందుకు సాయం పడతారా?" అర్ధించాడు కట్టెలు వాడు.

"అలాగే! దానికేం భాగ్యం! కానీ సాయం చేస్తే నాకేమిస్తావు?" కళ్ళెగరేస్తూ అడిగాడు బాటసారి.

"ఏమి లేదు బాబయ్య!” యధాలాపంగా జవాబిచ్చాడు కట్టెల వాడు.

"మాట తప్పకూడదు సుమా!” అంటూ కట్టెల మోపు ఎత్తుకోడానికి సాయపడ్డాడు బాటసారి.

మోపు నెత్తికెత్తుకొని ఇంటిదారిపట్టాడు కట్టెల వాడు.

"ఏమయ్యోయ్! నాకిస్తానన్నది ఇవ్వకుండా పోతున్నావు. ఇదేం న్యాయం?" అంటూ వెంటపడ్డాడు బాటసారి.

"నేనేమిస్తానన్నాను బాబయ్య! ఏమీ లేదనే చెప్పానే?" అయోమయంగా అడిగాడు కట్టెల వాడు.

"ఆ. అదే! అ ’ఏమిలేదు’ అన్నదాన్నే నా మొహాన పారేస్తే నా దారిన నేపోతా” విసుగ్గా అన్నాడు బాటసారి.

"ఏమీ లేని దాన్ని ఎక్కడి నుండి తెచ్చివ్వను బాబయ్య!” ఘోల్లుమన్నాడు కట్టెల వాడు.

"అదంతా నాకు తెలియదు. ’ఏమీ లేదు’ అన్నదాన్ని ఇస్తానన్నావు. మాట తప్పకూడదని ముందే హెచ్చరించాను కూడా. ఏమైనా సరే! నువ్వు నాకు ’ఏమీ లేదు’ అన్న దాన్ని బాకీ పడ్డావు. నా ’ఏమీ లేదు’ నాకిచ్చేస్తే సరి, లేకపోతే మర్యాద దక్కదు” పెడసరంగా హెచ్చరించాడు బాటసారి.

కట్టెల వాడు లబోదిబో మన్నాడు. బాటసారి అతడి వెంటపడి వేధించసాగాడు.

అలా గొడవపడు తూనే ఇద్దరు ఊళ్ళోకి వచ్చారు.

వారికి నసీరుద్దీన్ తారస పడ్డాడు.

"ఏమిటి గొడవ?" అడిగాడాయన.

విషయమంతా చెప్పుకొని బావురుమన్నాడు కట్టెల వాడు.

గట్టిగా తన వాదన వినిపించాడు బాటసారి.

చిరునవ్వు నవ్వాడు నసీరుద్దీన్.

"కట్టెల మోపు నెత్తికెత్తుకోవడానికి సాయం పడితే ఏమిస్తానన్నాడు ఇతడూ?" నిర్ధారణ కోసం అన్నట్లుగా బాటసారిని అడిగాడు.

గొంతు సవరించుకొని “ఏమిస్తావని నేను అడిగినప్పుడు ఈ మనిషి, ’ఏమీ లేదు’ అన్నాడు. ఆ ’ఏమీ లేదు’ అన్నదే ఇచ్చేయమనండి. నాదారిన నేను పోతాను” మరింత రచ్చచేస్తూ అన్నాడు బాటసారి.

"తప్పకుండా నీ దారిన నువ్వు పోదూగాని! ఇంతకీ ఇప్పటికి ఏమిచ్చాడు ఈ కట్టెల వాడు నీకు?" ఆరాగా అడిగాడు నసీరుద్దీన్.

"ఏమీ లేదూ. అందుకేగా ఈ గొడవంతా” చిరాగ్గా చెప్పాడు బాటసారి.

"మరింకెందుకు గొడవ? నీ ’ఏమీ లేదు’ అన్నదాన్ని నీకిచ్చేశాడుగా!” అన్నాడు నసీరుద్దీన్.

అప్పటికే చుట్టుమూగిన జనం ఘోల్లున నవ్వుతూ చప్పట్లు చరిచారు.

సిగ్గుతో తలదించుకొన్నాడు బాటసారి.

"రక్షించారు బాబయ్య!” అంటూ కట్టెలు వాడు నసీరుద్దీన్ కి దండం పెట్టెశాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఆనందించడానికి ఇదీ ఒక మార్గమే !

అనగా అనగా.....

మౌల్వీ నసీరుద్దీన్ ఓసారి ఏదో పని ఉండి వీధిలో నడుచుకొంటూ పోతుండగా ఓ ధనికుడు తారసపడ్డాడు. అతడు చాలా ఖరీదైన దుస్తులు వేసుకొని ఉన్నాడు. కాని అతడి ముఖంలో ఏదో దిగులు, విచారం! నసీరుద్దీన్ అతణ్ణి తేరిపారా చూశాడు. కుతూహలంగా తోచింది. ఆగి పలకరించాడు. “ఈ పట్టణానికి కొత్తలా ఉన్నారు? ఎక్కడి నుండి వచ్చారు? ఎందుకలా దిగులుగా ఉన్నారు?" అడిగాడు నసీరుద్దీన్.

ధనికుడు భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు.

"ప్రక్క నున్న పల్లె నుండి వచ్చాను” అన్నాడు.

నసీరుద్దీన్ కొనసాగించమన్నట్లుగా చూశాడు.

ధనికుడు “నాకు పది తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపద ఉంది. కాని ఆనందం మాత్రం లేదు. నేనెప్పడూ సంతోషంగా గడపలేదు” అన్నాడు విచారంగా.

"అదేం? ఆరోగ్యం లేదా?" అడిగాడు నసీరుద్దీన్.

"నాకేం. పిడిరాయిలా ఉన్నాను”.

"మరి సంతానం లేదా?"

"రత్నాల్లాంటి బిడ్డలు నలుగురున్నారు”కించిత్తు గర్వంగా చెప్పాడు ఆ ధనికుడు.

"వాళ్ళుత్త బడుద్దాయిలా?" అనుమానంగా అడిగాడు నసీరుద్దీన్.

"చాలా బుద్ధిమంతులు. నే గీచిన గీత దాటరు. చక్కగా వ్వాపారం చేసి భారీగా లాభాలు గడిస్తున్నారు?"

"మరేమిటి మీ సమస్య? ఎందుకు విచారం?" మరింత ఆరాగా అడిగాడు నసీరుద్దీన్.

"నాకన్నీ ఉన్నాయి, ఆనందం తప్ప. ఈ పట్టణం గురించి అందరూ చెప్పగా విన్నాను. అందుకే చూడటానికి వచ్చాను. ఇక్కడైనా నాక్కొంచెం సంతోషం దొరుకుతుందేమోనని ఆశ. అదీ తీరేటట్లుగా కనబడటం లేదు.”

నిర్వేదంగా చెప్పి నీరసంగా ముందుకు కదిలిపోయాడు ధనికుడు. సాలోచనగా అటువైపే చూస్తూ నిలబడ్డాడు నసీరుద్దీన్.

ఆ ధనికుడికి అన్నీ ఉన్నాయి. మరి ఆనందం ఎందుకు లేదు. తళుక్కున బుర్రవెలిగింది నసీరుద్దీన్ కి.

వెనుక నుండి పరిగేట్టుకుంటూ వెళ్ళి, ఒక్క ఉదుటున ధనికుడి చేతిలోంచి డబ్బు సంచీ లాక్కుని, ఇంకా వేగంగా పరుగెట్టి సందు మలుపులో దాగుండిపోయాడు.

"అయ్యో! అయ్యో. నాడబ్బు. నాడబ్బు” ఘొల్లుమన్నాడు ధనికుడు.

అతడి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కంగారూ, దుఃఖం, హడావుడీ, వత్తిడీ ముప్పరిగొన్నాయితణ్ణి, తేరుకొని గట్టిగా అరిచాడు.

"నాడబ్బు సంచీ లాక్కొని పారిపోతున్నాడు. దొంగా! పట్టుకోండి” భయంతో కీచుమంది ధనికుడి గొంతు.

వీధంతా హడావుడిగా ఉంది. ఎవరి పరుగులో వారున్నారు. ఎవ్వరూ అతడి గోల పట్టించుకోలేదు.

ధనికుడికేం చేయాలో పాలుపోలేదు. చాటుగా నసీరుద్దీన్ అతణ్ణి అనుసరిస్తూ, పరిశీలిస్తూనే ఉన్నాడు.

ధనికుడికి ఆకలి వేసింది. నీరసంగా ఉంది. అలిసిపోయాడు. ఎక్కడైనా బస చేద్దామన్నా, తిండి తిందామన్నా చేతిలో డబ్బులేదు.

దాదాపు ఏడుపొచ్చేసింది అతడికి. “ఈ ఉళ్ళో తెలిసిన వాళ్ళు కూడా లేరు. నేరకపోయి వచ్చాను. ఆనందం లేకపోతే పోయింది. ఇప్పడు తిండీ తిప్పలూ లేవు, నిద్రానిప్పులూ లేవూ. వెనక్కి వెళ్ళెందుకు దారి ఖర్చులు కూడాలేవు. ఏం చేయాలిరా బాబూ” అని గొణుక్కుంటూ రోడ్డుప్రక్కన చెట్టు క్రింద కూలబడ్డాడు.

అతణ్ణీ అనుసరిస్తున్న నసీరుద్దీన్ చెట్టు చాటు నుండి అతడు ముందు పడేలాగా డబ్బు సంచీ విసిరేసాడు.

నీరసంగా తూగుతున్న ధనికుడి ముందు ఖణేల్ మంటూ నాణాల సంచి పడింది. తనదే. అచ్చంగా తనదే.

ఒక్క గెంతులో పైకి లేచాడు ధనికుడు. డబ్బు సంచి మీదకి ఒక్క దూకు దూకాడు. చేతిలోకి తీసికొని అనందంతో కెవ్వున కేక పెట్టాడు. కుప్పిగంతులు వేశాడు.

"ఓ హోహో! దొరికింది. నాడబ్బు దొరికింది” సంతోషంగా అరిచాడు.

చిరునవ్వుతో ఎదురుగా నిలబడ్డాడు నసీరుద్దీన్.

ఒక్కక్షణం అయోమయంగా చూశాడు ధనికుడు. మరుక్షణం నసీరుద్దీన్ ని గుర్తుపట్టాడు.

నవ్వుతూ చెప్పాడు నసీరుద్దీన్ “ఆనందించడానికి ఇదీ ఒక మార్గమే.”

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

నమ్మకానికి, అహంకారానికి ఫలితాలివి

అనగా అనగా.....

ఒక గురువు గారు ఓ పల్లె ప్రక్కన గల అడవిలో ఓ గురుకులం నిర్వహిస్తూ ఉండేవారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులుండే వారు. వారిలో ఒక శిష్యుడు గురువు పట్ల ఎంతో వినయం, గౌరవం, మీదు మిక్కిలి నమ్మకం కలవాడు.

ఓ రోజు గురువుగారు కొద్దిమంది శిష్యులతో కలిసి చిన్ననది పాయకి స్నానానికి వెళ్ళారు. ఆ సమయంలో ఈ శిష్యుడు నదికి ఆవలి వైపున ఉన్నాడు. గురువు గారు శిష్యుణ్ణి తన దగ్గరికి రావలసినదిగా సైగ చేసారు. శిష్యుడు పడవకోసం వేచి చూడలేదు. నది కడ్డంపడి నడవసాగాడు. గురువు మీద నమ్మకం ఉంచి, గురునామం ధ్యానిస్తున్నాడు.
ఆశ్చర్యం! అతడు నీటిలో మునిగి పోలేదు. నడవ గలుగుతున్నాడు.

గురువు అది చూశాడు. తన శిష్యుడి శక్తి చూసి అతడికి చాలా సంతోషం, గర్వం కలిగాయి. ’నా పేరుకే ఇంత మహిమ ఉంటే నాకు మరింత మహిమ ఉండి ఉండాలి. నేను నడుస్తాను నీళ్ళమీద’ అనుకున్నాడు గురువు.

నదిలోకి దిగి నడవడానికి ప్రయత్నిస్తూ ’నేను నేను’ అని తన పేరు జపించసాగాడు.

అంతే! నీళ్ళల్లో మునిగి చనిపోయాడు.

నమ్మకానికి, అహంకారానికి ఫలితాలివి.

ఇదీ కథ!

~~~~~~~

అనగా అనగా...

ఓ ఊరిలో ఒక అమాయకుడుండేవాడు. వాడోసారి పనిమీద ప్రక్క ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. దారిలో చిన్న నదిని దాటవలసి వచ్చింది. మన వాడికి భయమేసింది. అంతలో అక్కడికొక యోగి వచ్చాడు. ఈ అమాయకుడు తననీ నది దాటేలా చేయమని యోగిని ప్రార్ధించాడు. ఆయోగి ఇతడి కొక రాగి తాయత్తునిచ్చాడు. దాని మీద బీజాక్షరాలు [మంత్రాక్షరాలు] వ్రాసి ఉన్నాయని, చెప్పి అది వాడి కిచ్చి “నాయనా! ఈ తాయత్తునూ చేతబట్టి, శ్రీరామ శ్రీరామ అని జంపిస్తూ నది దాటూ. ఒరవడిని తట్టుకొని నీట నడవగలవు” అని అన్నాడు.

ఈ అమాయకుడు యోగికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. యోగి తన దారిన తాను పోయాడు. అమాయకుడు ’శ్రీరామ శ్రీరామ’ అని జపిస్తూ నదిలో దిగాడు. ఆశ్చర్యం! వాడు నీటిమీద నడవగలుగుతున్నాడు. వాడికి పిచ్చి సంతోషం వేసింది. కించిత్తు గర్వంగా అనిపించింది. అప్పటికి సగం నది దాటాడు. ఉండీ ఉండీ వాడికి ఆ రాగి తాయత్తుమీద ఏమంత్రం వ్రాసి ఉందో అన్న కుతూహలం పుట్టింది. మడిచి ఉన్న రాగి తాయత్తు విప్పిచూశాడు. దాని మీద ’శ్రీరామ’ అని వ్రాసి ఉంది. అది చదివి ‘ఒట్టి రామా అనేనా? మంత్రమో, తంత్రమో కాదా!’ అనుకున్నాడు.

ఆ క్షణమే వాడు నీటిలో మునిగి పోయాడు.

ఇదీకథ!


మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వెళ్ళిన దారినే రావాలి!

అనగా అనగా.....

ఓ అడవి. అందులో ఎన్నో జంతువులూ ఉన్నాయి.

వాటిల్లో ఓ నక్క.

దాని దురదృష్టం కొద్దీ, దానికి 10 రోజులుగా తిండి దొరక లేదు. నీరసించిపోయింది. డొక్క ఎండి పోయింది.

అలాగే కాళ్ళీడ్ఛుకొంటు ఆహారం వెదకసాగింది.

అదృష్టం!

ఓ చెట్టు తొర్రలో దానికి ఆహారం కన్పించింది.

చెట్లు కొట్టుకోవడానికి వచ్చిన వాళ్ళో, లేక వేటగాళ్ళో లేక యాత్రికులో దాచుకున్న అన్నం మూట దానికి కన్పించింది.

చెట్టు తొర్ర సన్నగా ఉంది.

లోపల తిండి దండిగా ఉంది.

వాసన నోరూరిస్తోంది, ఆకలి ఆగనంటోంది.

ఎండిన డొక్కతో ఉన్న నక్క ఒక్క ఉదుటున తొర్రలోకి దూరింది.

అన్నం పప్పు, కూరలు, అప్పడం, అప్పాలతో కమ్మటి భోజనం.

కడుపునిండా మెక్కెసింది.

పొట్టలావుగా అయ్యింది.

ఇప్పడు ఓ చిక్కొచ్చింది నక్కకి.

దాని శరీరం తొర్ర వెడల్పు కన్నా ఎక్కువలావుగా ఉంది. బయటకి రావడం కుదరటం లేదు.

లోపలే ఉంటే, తిండి దాచుకొన్న మనుషులొచ్చి నాలుగు పీకితేనో?

లేక తన్ని తగలేస్తే నో!

తలుచుకొంటేనే వళ్ళు జలదరించింది దానికి.

కుయ్యోమొర్రో మంటూ మొత్తుకోవటం మొదలుపెట్టింది.

ఆ దారినే పోతున్న ఓ కుందేలు నక్క ఏడుపు విన్నది.

దగ్గరికొచ్చి చెట్టుతొర్ర కేసి చూసింది.

ఏడుస్తున్న నక్కని చూసి, "ఏమిటి సంగతి నక్కబావా" అంది.

నక్క వివరంగా చెప్పింది వెక్కిళ్ళుపెడుతూ.

"మరి లోపలికి వెళ్ళేటప్పడు ఎలా వెళ్ళావు?" లాజికల్ గా అడిగింది కుందేలు ప్రశ్నార్ధకపు ముఖం పెట్టి.

"ఆకలితో డొక్క ఎండి అప్పడు సన్నగా ఉన్నాను" అంది నక్క ఏడుపుముఖపెట్టి.

"అయితే వెళ్ళిన దారిలోనే తిరిగి రా నక్క బావా?" అంది కుందేలు చిరునవ్వుతో కళ్ళు మెరుస్తుండగా.

"అంటే మళ్ళీ 10 రోజులు పస్తుండలా?" భోరుమంది నక్క.

"అంతే మరి! కాకపోతే ఈసారి 10 రోజులు పట్టదులే. పస్తులయితే తప్పదు" అంది కుందేలు నింపాదిగా.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

ఏనుగు - గ్రుడ్డి వాళ్ళు

అనగా అనగా.....

ఒకసారి నలుగురు గ్రుడ్డివాళ్ళు కలిసి ఏనుగు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకొన్నారట. నలుగురు ఏనుగుని చేరారు.

ఒకడు దాని కాళ్ళని తడిమాడు “ఒరేయ్! ఏనుగు స్తంభంలా ఉంటుందిరా. మాఇంటి వసారాలో స్తంభాలిలాగే ఉంటాయి” అన్నాడు.

మరొకడు దాని చెవులు తడిమాడు. “కాదురా! ఏనుగు చేటలా ఉంటుంది. మా అమ్మ రోజూ బియ్యం చెరిగే చేట నాకు బాగా తెలుసు. ఏనుగు చేటలా ఉంది” అన్నాడు.

ఇంకొకడు దాని కడుపు తడిమాడు. “ఛస్! నోరు ముయ్యండిరా! మీకేం తెలీదు. ఏనుగు పెద్ద బాన లాగా ఉంటుంది. మాదొడ్లో బాన కన్నా కూడా పెద్దది” అన్నాడు.

నాలుగో వాడు దాని తోక తడిమాడు. నెత్తి నోరూ కొట్టుకుంటూ “అయ్యయ్యో! కాదర్రా. మీరలా పొరపాటు పడుతున్నారు. ఏనుగు బారెడు తాడులా ఉంటుంది. మీకర్ధం కావటం లేదు” అన్నాడు

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

విభజించి - పాలించు అని చెప్పే కణిక నీతి కథ

అనగా అనగా.....

ఈ కథ మహా భారతం, ఆది పర్వంలోనిది.

కౌరవ పాండవుల విద్యా ప్రదర్శన ముగిసింది. ప్రజల్లో పాండవుల పట్ల ఆదరణా, ఆరాధనా పెరిగిపోతున్నాయి. అనివార్యమై ధర్మరాజుకి యువరాజుని చేశాడు ధృతరాష్ట్రుడు. సద్గుణ సంపన్నుడూ, దయార్ధ్ర హృదయుడూ, ధెర్యస్ధెర్య సమన్వితుడూ అయిన ధర్మరాజు తన ప్రవర్తనతో ప్రజల మనస్సులను గెలుచుకున్నాడు. అర్జునుడు సోదరులతో జైత్రయాత్ర చేసివచ్చాడు. నానాటికి పాండవుల కీర్తి పెరిగిపోయింది.

ఇది ధృతరాష్ట్రుని హృదయాన్ని కలచివేసింది. ధృతరాష్ట్రునికి ముగ్గురు మంత్రులు.

అందులో ప్రధాని విదురుడు. ఈయన విద్వాంసుడు, ధర్మపరుడు, నీతికోవిదుడు. నిష్కర్షగా రాజు లోటుపాట్లని నిస్సంకోచంగా ముఖమ్మీదే చెప్పగల ధైర్యశాలి.

రెండవ వాడు సంజయుడు. ఈయన రాయబార కార్యాలు నిర్వహిస్తూ నిరంతరం ధృతరాష్ట్రుని ఆంతరంగిక సలహాదారుగా ఉంటాడు. వినయశీలి.

మూడవ వాడు కణికుడు. ఈయన కూటనీతి కుశలుడు. అంటే మోసంతో, కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలడు.

అలాంటి కణికుడిని ధృతరాష్ట్రుడు ఏకాంతానికి రప్పించి తన బాధ, కాంక్ష తెలియజేశాడు.

ఆ నీతివేత్త “మహారాజా! శతృనాశనానికి ముందు వారి ఉత్సాహ, ఐశ్వర్య, మంత్రాంగాలనే మూడు మార్గాలను నాశనం చేయాలి. అమాత్య[అంటే మంత్రులు, కార్యదర్శులన్న మాట], దుర్గ[అంటే పట్టణాలు, నగరాలన్న మాట], కోశ[అంటే ధనపునిల్వలు], సేన[పాలనా యంత్రాంగం, సైన్యాలు], రాష్ట్రాలు[రాజ్యంలోని అంతర్భాగాలన్న మాట] ఈ ఐదు వర్గాలనూ నాశనం చేయాలి.

సామ దాన భేద దండ ఉద్భంధన విషప్రయోగ అగ్ని ప్రసరణ మార్గాలలో శత్రువుల్ని నాశనం చేయాలి. శతృబలాన్ని మొదలంటూ నాశనం చేసి, తర్వాత వారి ఆశ్రయు వర్గాన్ని [అంటే అనుచరవర్గం అన్నమాట] నాశనం చేయాలి.

శతృవులని విభజించి గెలవాలి.

మహారాజా! వారిలో పిరికి పందల్ని భయపెట్టాలి. లోభికి ధనమిచ్చి లోబరుచుకోవాలి. బలహీనుడయితే పరాక్రమంతో స్వాధీనం చేసుకోవాలి. సమబలునితో స్నేహం చేయాలి. విషం తినిపించి గానీ, మోసగించి గాని శతృవుని క్రమంగా కడతేర్చాలి.

ఇది నీతి శాస్త్రం చెప్పే విషయం!

శతృవుని సాధించ దలిచినప్పడు [అంటే హెరాజ్ చెయ్యాలనుకొన్నప్పడు] క్రోధం పనికిరాదు. చిరునవ్వుతో చరిస్తూ వాడికి విశ్వాసం కలిగించి పాములా కాటు వేయాలి. ఎటువంటి ఘాతకం తలపెట్టినా ఆ విషయం పైకి తెలియకుండా, చిరునవ్వుతో, మృదుభాషణ తో ఓరిమి వహించి అదునెరిగి నెరవేర్చుకోవాలి.

ఆశలు రేకెత్తించాలి కాని అవి నెరవేర్చకూడదు. అలాగని ఆ భావం ఎదుటి వారికి తెలియనివ్వకుండా వాయిదాలు వేస్తుండాలి. ఇనుముతో చేసిన కత్తిని తోలు కవచంతో భద్రపరచి, అవసరానికి తీసి కేశ ఖండనానికి వినియోగించి నట్లుండాలి. మన మంత్రాంగం, మనం ఏ పనిచేసినా అది మనకి మరిన్ని ఆపదలు తెచ్చిపెట్టకూడదు.

ఒక కథ చెబుతాను వినండి మహారాజా!

అనగా అనగా ...

ఓ మహారణ్యం.

ఆ అడవిలో ఎన్నో కౄరమృగాలు యధేచ్చగా విహరిస్తూన్నాయి. అక్కడి ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది, కుటిల బుద్ది కలది. తన పనులన్నీ ఇతరులు చేత చేయించుకొని, పని పూర్తి కాగానే వారిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది.

ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు.

పులి, తోడేలు, ముంగిస, ఎలుక.

ఈ నక్క వీటితో కలిసి మెలిసి ఉన్నట్లు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నది.

ఆరోజులలో ఒకనాడు --

పిక్కబలిసి నవనవలాడుతూ హాయిగా గంతులేస్తూ, చెంగుచెంగున దూకుతూ పోయే లేడి దాని కంటపడింది. ఆలేడి ఈ మిత్రబృందాన్ని దూరం నుంచి చూసింది. చూస్తూనే వాటికి బహుదూరంగా పారిపోయింది. దాన్ని తినాలని నక్కకు కోరిక కలిగింది. ఎంత ప్రయత్నించినా దాన్ని పట్టడం సాధ్యం కావడం లేదు.

బాగా ఆలోచించింది నక్క.

మిత్రులను చుట్టూ కూర్చో బెట్టుకుని,

"స్నేహితులారా! ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయితే దానితో పరుగెత్తే శక్తి మనకెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. ఇప్పడు మనం ఒక కుట్రపన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం అరగించవచ్చు” అని నాలుక చప్పరించి, అది ఎంత రుచిగా ఉంటుందో చూపించింది.

అన్నిటికీ నోరూరించి.

"ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం” అన్నాయి అవి ఆతురతతో అటే చూస్తూ.

అది కొంత సేపు ఆలోచన అభినయించింది.

"ఆ! ఇప్పడు ఆలోచన వచ్చింది. జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి.ఈ లేడి మెలకువగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలిసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పడు చప్పడు కాకుండా పాకుతూపోయే ఈ ఎలక బావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అదనులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే!” అంది.

దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి.

అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతులేస్తూ, పచ్చికమేసి, సెలయేటి ఒడ్డున నీరు త్రాగి, బాగా అలిసి విశ్రాంతిగా కాళ్ళు జాపి నిద్రపోతున్నది లేడి.

నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలకవెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతుండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది.

నక్కతో పాటు దాని స్నేహితులు నలుగురూ సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి.

అప్పడా నక్క:

"న్నేహితులారా! ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పడు మీ శరీరాలన్నీ దుమ్మూ ధూళితో ఉన్నాయి. అందుచేత ఆకొండ లోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు” అంది.

అవి నాలుగూ సంతోషంతో స్నానానికి వెళ్ళాయి.

అందులో అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని.

నక్క బొటబొటా కన్నీరు కారుస్తూంటే చూసిన పులి,

"బావా! ఎందుకు విచారిస్తున్నావు?" అంది.

"ఏం చెప్పను పులిబావా! ఆ ఎలక లేదూ! అది ఏమన్నదో తెలుసా! ’పులి ఎంత పెద్ద జంతువైతే ఏంలాభం? నేను కాళ్ళు కొరికితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తూంది సిగ్గులేకుండా,’ అని వేళాకోళం చేస్తే
నాకు బాధ కలిగింది” అంటూ నక్క కన్నీరు విడిచింది.

పులికి పౌరుషం వచ్చింది.

"మిత్రమా! ఎలక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరిమీద ఆధారపడను” అంటూ వెళ్లిపోయింది.

అంతలో ఎలక రాగా, నక్క

"విన్నావా, ఎలక బావా! ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎలకనూ తినేస్తా అంటూ ముంగిస బయలుదేరింది” అనగా ఎలుక చటుక్కున కన్నంలోకి పారిపోయింది.

మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. “విన్నావా! పులి బావకు నీ మీద కోపం వచ్చి, నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట”, అనడంతో తోడేలు దౌడు తీసింది.

అప్పడు ముంగిస రాగా, “చాలా ఆశగా వచ్చావు. వాళ్ళ ముగ్గుర్నీ చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను” అనగా అది తోక ముడిచి పారిపోయింది.

హాయిగా ఆ లేడి మాంసం ఆరగించింది నక్క.

విన్నారా! మహారాజా! తెలివితో, వంచనతో మనకార్యలు చక్క బెట్టుకోవాలి” అన్నాడు కణికుడు.

ఇదే కణిక నీతి.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

కోకిలమ్మ వైద్యం

అనగా అనగా.....

ఓ అడవి. ఆ అడవిలో ఎన్నో జంతువులూ, పక్షులూ ఉండేవి. అప్పటికి గుడ్లగూబలు కూడా పగలు తిరుగుతూ రాత్రి నిద్రపోయేవి.

ఓరోజు ఆ అడవి దాపులనే ఉన్న ఓగ్రామం నుండి ఓ కుర్రాడు ఉండేలు తీసుకొని అడవికి వచ్చాడు. వాడు బంక మట్టితో చిన్న గోళీకాయలంత ఉండలు చేసి ఉండేలులో బెట్టి పక్షుల్ని కొడుతున్నాడు. ఒకటి రెండు పిట్టలు వాడి బారిన పడ్డాయి. కొమ్మ మీద కూర్చొని దిక్కులు చూస్తున్న గుడ్లగూబకి రెక్కక్రింద ఉండేలు మట్టి ఉండ గుచ్చుకొంది. బాధతో కీచు మంది గుడ్లగూబ.

అంతలో అటువైపు కౄరజంతువులు రావడంతో ఉండేలు కుర్రాడు అక్కణ్ణుండి పారిపోయాడు.

గుడ్లగూబ బాధతో చెట్టుకొమ్మల్లో చతికిలబడింది. గట్టిగా ఏడవడం మొదలెట్టింది. కాకి దాన్ని చూసి మెల్లిగా దగ్గరికొచ్చింది.

"ఏం జరిగింది గూబమామా? ఎందుకు ఏడుస్తున్నావు?" అంది. గుడ్లగూబ ఎక్కిళ్ళుపెడుతూ “ఎవడో కుర్రవెధవ! రాయితో కొట్టాడు అల్లుడూ” అంది.

"అయితే వైద్యుడి దగ్గరికి పోరాదూ?" అంది కాకి సానుభూతిగా.

"వైద్యుడెక్కడున్నాడు?" మూలుగుతూ అడిగింది గుడ్లగూబ.

"కోకిలమ్మ చాలాబాగా వైద్యం చేస్తూంది. కాకపోతే వూరికే చేయదు. మనమే దైనా ప్రత్యుపకారం చెయ్యాలి" అంటూ కాకి వివరించింది.

గుడ్లగూబకి నొప్పి మరీ ఎక్కువై ఇంకా గట్టిగా ఏడుస్తోంది. పాపం! కాకికి దాన్ని చూసి చాలా జాలివేసింది.

గుడ్లగూబ రెక్కకి తన రెక్కలానించి మెల్లిగా దాన్ని కోకిలమ్మ దగ్గరికి తీసికెళ్ళింది.

"ఎవరికి జబ్బూ?" పరిశీలనగా చూస్తు అడిగింది కోకిలమ్మ.

"గూబ మామాకి. ప్రొద్దునే ఎవరో కుర్రకుంక రాయితో కొట్టాట్టా" చెప్పింది కాకి.

కోకిలమ్మ గుడ్లగూబని పరిక్షించింది. రెక్కక్రింద బంకమన్ను రాయి ముద్ద కనబడింది.

"వూ. వైద్యం చేస్తాను. మరి నాపారితోషికం ఎవరిస్తారు?" అంది ముందు జాగ్రత్తగా.

గూబ కుయ్యు మందిగాని “సరే నేనిస్తాను” అనలేదు.

కోకిలమ్మ మళ్ళీ అదే ప్రశ్నవేసింది.

ఈసారి గుడ్లగూబ మరింత గట్టిగా ఏడుపులూ పెడబొబ్బలూ పెట్టింది గానీ, వైద్యం ఖర్చు నేనిస్తాననలేదు.

ఇదంతా చూస్తూన్న కాకి, "ఫీజు దేముంది కోకిలమ్మ? ముందు రోగి ప్రాణం ముఖ్యం కదా? వైద్యం చెయ్యి” అంది ఆదుర్దాగా.

"మరి నా ఫీజు?" సందేహంగా అడిగింది కోకిలమ్మ.

"గూబమామా ఇస్తాడులే. నాదీ పూచీ!” అంది పుచిక్కని కాకి. ఎంతైనా వైద్యం చేయించుకొని ఫీజు ఎగ్గొట్టదులే గుడ్లగూబ అన్న భరోసాతో.

"సరే” అంటూ వైద్యం ప్రారంభించింది కోకిలమ్మ.

గుడ్లగూబని ఆ అడవిలో ఉన్న వేడినీటి బుగ్గ దగ్గరికి తీసికెళ్ళి వేడినీటిలో ఓ ఘడియ సేపు గుడ్లగూబ రెక్కలు తడిసేలా కూర్చోబెట్టింది. వెచ్చని నీటికి మట్టి ఉండ కరిగిపోయింది. గుడ్లగూబకి నొప్పి తగ్గిపోయింది. హుషారుగా పైకి లేచింది గుడ్లగూబ.

"నా ఫీజు?" వెంట బడింది కోకిలమ్మ.

"ఏం ఫీజు? నేనిస్తానన్నానా?" అంది దబాయింపుగా గుడ్లగూబ.

కోకిలమ్మ కాకి నడిగింది.

కాకి “అదేమిటి గూబ మామా! కోకిలమ్మ నీకు వైద్యం చేసింది కదా! మరి ఆఖర్చు ఇవ్వద్దూ” అంది.

"ఎవరు చెయ్యమన్నారు వైద్యం? నేనిస్తానన్నానా ఫీజు?" పెడసరంగా అంది గుడ్లగూబ. మరుక్షణమే అక్కణ్ణుంచి ఎగిరిపోయింది.

"కాకి! అదంతా నాకు తెలీదు. నువ్వు రోగిని నాదగ్గరికి తెచ్చావు. నీది పూచీ అంటేనే నేను వైద్యం చేసాను. కాబట్టి నువ్వే నా ఫీజు కట్టు” అంది కోకిలమ్మ.

"బాగుంది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లుంది. పోన్లే పాపం ఏడుస్తోందని సాయం వస్తే నేనేందుకు ఫీజు కట్టాలి? నువ్వు నాకు వైద్యం చేసావా ఏమిటి?" కాకి వాదన పెట్టుకొంది.

కాస్సేపటికి తగవు పెద్దదయ్యింది.

పది పక్షులు చుట్టూ చేరాయి. రాజు దగ్గర ఫిర్యాదు చేయటం మేలని అన్ని పక్షులూ సలహా ఇచ్చాయి.

సరేనని కాకి, కోకిలా, నెమలి రాజు ఆస్ధానానికి వెళ్ళివిన్నవించుకొన్నాయి.

పక్షుల రాజు నెమలి గుడ్లగూబని పిలిపించి విచారణ మొదలుపెట్టింది.

కోకిలమ్మ, కాకి వివరంగా అన్ని విషయాలూ చెప్పాయి. నెమలి గుడ్లగూబని సంజాయిషీ అడిగింది.

"రాజా! నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు. నాపాటికి నేను ఏడుస్తూంటే కాకి తీసుకెళ్ళింది. కోకిలమ్మ కి వైద్యం ఖర్చు చెల్లిస్తాననలేదు. కావాలంటే కోకిలమ్మనే అడగండి” అంది గుడ్లగూబ తన వాదనని బలంగావినిపిస్తూ.

కోకిలమ్మ “నిజమే ప్రభూ! అక్కడికీ నేను రెండు మూడు సార్లు నొక్కి అడిగాను. ఈ గుడ్లగూబ కుయ్యిమంది గాని వైద్యంకు కూలీ ఇస్తానన లేదు. కాకే నాదీ పూచి అంది. అందుకే వైద్యం చేసాను” అంది వినయంగా.

కాకి “అవును ప్రభూ! నొప్పితో ఏడుస్తూంటే నేనే గుడ్లగూబ వైద్యడి దగ్గరికి తీసికెళ్ళాను. కోకిలమ్మ కూలీ అడిగినప్పడు నొప్పితో జవాబు చెప్పలేక పోతుందను కొని నాదీ పూచి అన్నాను. ముందు వైద్యం అందితే గుడ్లగూబ ప్రాణం నిలబడుతుంది గదా అన్న తొందరలో అన్నాను. అంతే గాని ఏరు దాటి తెప్ప తగలేసినట్లు వైద్యం చేయించుకొని గుడ్లగూబ మాట మారుస్తూందనూ కోలేదు” అంది ఏడుపు గొంతుతో.

"అసలు నేను మాటే ఇవ్వలేదు ప్రభూ! ఇక మాట మార్చేందుకేముంది?" న్యాయచుక్క[లా పాయింట్] లేవనెత్తింది గుడ్లగూబ.
రాజ్యాంగ సంక్షోభంలో పడిపోయాడు నెమలి రాజు. పక్షి మేధావులతో చట్టసభా సంఘాన్ని [పార్లమెంటరీ సంఘాన్ని] నియమించాడు. వాళ్ళుకొన్నినెలలు అధ్యయనం చేసి రాజుకి నివేదిక ఇచ్చారు.

రాజు తీర్పు ఇచ్చేరోజు పక్షుల సభ కిక్కిరిసి పోయింది. అందరూ రాజు ఏం తీర్పు చెబుతాడా అని ఆత్రంగా ఎదురుచూస్తూన్నారు.

చివరకి నెమలి రాజు తీర్పు చెప్పాడు.

"కోకిలమ్మ, గుడ్లగూబకే వైద్యం చేసినా, కూలీ గురించి గుడ్లగూబతో ఒప్పందం చేసుకోలేదు. ఆ విషయమై ముందే కోకిలమ్మ పక్కా ఒప్పందం ఉంటే సమస్య లేక పోయేది. అయితే కాకి పూచిని నమ్మింది. ఆ విషయం కాకి కూడా ఒప్పకుంది. కాబట్టి కోకిలమ్మకి కాకి వైద్యపు కూలీ ఇచ్చితీరాలి”.

తీర్పు విని గుడ్లగూబ చప్పట్లు చరిచింది.

కోకిలమ్మ “హమ్మయ్య!” అనుకొంది.

పక్షులన్నీ బిత్తరపోయాయి.

కాకి ఘోల్లుమంది.

"మహాప్రభో! నాదగ్గర డబ్బెక్కడిది? ఏదో సాటి పక్షి బాధ పడుతోంది కదా అని సాయం వెళ్ళినందుకు నాకా శిక్ష” అక్రోశంతో అడిగింది కాకి.

"న్యాయశాస్త్ర పరంగా అంతే” అంది చట్టసభాసంఘం. అంగీకారంగా తలవూపింది నెమలి రాజు.

"పేదవాణ్ణి. కనికరించండి బాబోయ్!” ఏడుపులంకించుకొంది కాకి.

"డబ్బులేక పోతే నీ సేవతో బకాయి చెల్లించు” ఇదే తుది తీర్పన్నట్లు నెమలి రాజు సభాచాలించి ఇంటికెళ్ళి పోయింది.

ఆనాటి నుండి కోకిలమ్మ గుడ్లని కాకి పొదిగి, పిల్లల్ని పెంచసాగింది. ఆవిధంగా సేవ చేసి బకాయి తీర్చుకొంటుంది.

కానీ ఈ అన్యాయం చూసి పక్షులకి ఒళ్ళుమండింది. అన్నీ కలిసి గుడ్లగూబ అన్యాయాన్ని, అనైతికతనీ తిట్టి పోసాయి. అది కన్పిస్తే చాలు అసహ్యంతో మొహం తిప్పుకొన్నాయి. శాపనార్దాలు పెట్టాయి. అవమానించాయి.

దానితో గుడ్లగూబకి పక్షుల ముందుకు రావడానికి మొహం చెల్లక పగలు గూట్లోనో, చెట్టు తొర్రల్లోనో దాక్కుని రాత్రిళ్ళు ఆహారం వెదుక్కోవడం మొదలెట్టింది.

ఆనాటి నుండి ఈనాటి వరకూ కోకిల గుడ్లని పొదిగి పిల్లల్ని చేస్తూ కాకులూ, పగలు నిద్రపోయి రాత్రి సంచరిస్తూ గుడ్లగూబలు బ్రతకసాగాయి.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

హైసర బజ్జా

అనగా అనగా.....

రామాపురం అనే ఊర్లో రాజశేఖరం అనే యువకుడుండే వాడు. ఇతడు కొంచెం అమాయకుడు. దానికి తోడు ఙ్ఞాపకశక్తి పెద్దగా ఉండేది కాదు. అతడికి పెళ్ళై భార్య విశాలాక్షి కాపురానికొచ్చింది. విశాలాక్షి అణకువ గల పిల్ల. పనీ పాటలు తెలిసిన అమ్మాయి.

ఓసారి రాజశేఖరుడు ఏదో పని ఉండి ప్రక్కఊరు రాఘవాపురం వెళ్ళాడు. పని పూర్తయ్యాక ఆ ఊళ్ళోనే ఉన్న మేనత్తని చుట్టపు చూపు చూడబోయాడు. రాక రాక వచ్చిన మేనల్లుణ్ణి అతడి మేనత్త ఎంతో సంతోషంగా ఆహ్వానించి ఆదరించింది. పిండి వంటలతో భోజనం పెట్టింది. భోజనంలో వడ్డించిన బూరెలు రాజశేఖరానికి తెగనచ్చేసాయి. ఒకటికి రెండు అడిగి పెట్టించుకొని తిన్నాడు.

“అత్తా! వీటి పేరేంటి?” మొహమాట పడుతూ అడిగాడు రాజశేఖరుడు. ఆవిడ అభిమానంగా నవ్వుతూ “బూరెలంటారు నాయనా? మరి నాలుగు కట్టివ్వనా?”అంది.

"వద్దులే అత్తా! విశాలాక్షికి అన్నీ వచ్చు. వండించుకు తింటాలే!” అంటూ ఇంటికి బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణం అంటే కాలినడక లేదా ఎద్దుల బళ్ళే శరణ్యం కదా! మనవాడు నడుచుకుంటూ బయలుదేరాడు. ఎక్కడ పిండి వంట పేరు మరిచిపోతానో అనుకుంటూ “బూరెలు, బూరెలు” అని వల్లిస్తూ అడవిదారి వెంట నడవ సాగాడు.

దారిలో చిన్న నీటి పాయ వచ్చింది. ఎగిరి దాని మీదుగా దూకూతూ వూపు కోసం “హైసర బజ్జ” అన్నాడు.

అంతే!

బూరెల పేరు మరిచిపోయి, ’హైసరబజ్జా’ అని జపం చేస్తూ ఇల్లు చేరాడు. ఇంటికి రాగానే భార్యని పిలిచి తన మేనత్త వడ్డించిన పిండివంట రుచిని తెగ వర్ణించి, తనకు వండి పెట్టమన్నాడు.

"వాటినే మంటారని చెప్పారు, మీ మేనత్త గారు?" అనడిగింది విశాలాక్షి.

"హైసరబజ్జ!” టక్కున చెప్పాడు రాజశేఖరం.

అదేం పిండి వంటో విశాలాక్షి కి అర్ధం కాలేదు.

"ఎలా ఉన్నాయి? తియ్యగానా, కారంగానా?" అంది.

"తియ్యగా ఉన్నాయి. గుండ్రంగా అరచేతి మందాన ఉన్నాయి?" అన్నాడు.

“దేనితో చేస్తారో?” మెల్లిగా గొణిగినట్లు అడిగింది.

“వరిపిండి తో నట” కొంచెం కరుగ్గా చెప్పాడు రాజశేఖరం.

ఇంకా ఏమంటే భర్తకి ఎంత కోపం వస్తుందోనని విశాలాక్షి లోపలికెళ్ళిపోయింది. ఎంత ఆలోచించినా భర్తకంత నచ్చిన ఆ
‘హైసర బజ్జ’ ఏమిటో ఆమెకు అర్ధం కాలేదు.

చివరకి కుడుములై ఉంటాయను కొని, బియ్యప్పిండి, బెల్లం కలిపి, అరచేతి మందాన ఆవిరిలో ఉడికించి గుండ్రని కుడుములు చేసింది. చిన్నపళ్ళెంలో తెచ్చి భర్త ముందు పెట్టింది.

ఎంత నచ్చినా, మేనత్త ఇంట్లో తనివి తీరా బూరెలు తినడానికి మొహమాట పడ్డ రాజశేఖరం, ఇప్పడు భార్య వండి పెడితే తెగ లాగించెయ్యాలని ఆశగా ఎదురుచూస్తూన్నాడు. భార్య తెచ్చిన కుడుములు చూసేసరికి అతనికి కోపం నషాళానికంటింది. [కోరిక లేదా కామం తీరక పోతే క్రోధం పర్యవసానమని భగవద్గీత చెబుతుంది]

భార్య అలుసుగా కనబడి ఒక్క పెట్టున ఆ పిల్ల చెంప ఛెళ్ళుమనిపించాడు. విశాలాక్షి ఘోల్లుమంది.

ఈ గొడవుకి ప్రక్కింటి పిన్నిగారు పరుగెత్తుకొచ్చింది. అప్పటికే విశాలాక్షి చెంప వాచి పోయింది.

అది చూసి ప్రక్కింటి పిన్నిగారు “అయ్యో! అదేమిటి నాయనా, అమ్మాయిని అలా కొట్టావు? పిల్లబుగ్గ బూరెలా పొంగి పోయింది చూడు” అంది మందలింపుగా.

"ఆ అదే పిన్నిగారు, అదే! బూరె బూరె!” అన్ని మరిచి పోయి ఆనందంగా గావుకేక పెట్టాడు రాజశేఖరం.

నొప్పి, అవమానం మరిచిపోయి ఫక్కున నవ్వింది విశాలాక్షి.

విషయం తెలిసాక విరగబడి నవ్వారు ప్రక్కింటి పిన్నిగారు.

రాజశేఖరం భార్యకి క్షమాపణ చెప్పుకొన్నాడు.

బియ్యం నానపోసి దంచి విశాలాక్షి తియ్యటి బూరెలు చేసి పెట్టింది.

ప్రక్కింటి పిన్నిగారితో సహా అందరూ ఆనందంగా ఆరగించారు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes