RSS
Wecome to my Blog, enjoy reading :)

ఎవరు గొప్ప నాట్యగత్తె!? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 16]

మరునాటి సభకు విక్రమాదిత్యుడు రహస్యంగా విభిన్న రకాల, వాసనల పుష్పములను సేకరించాడు. రంభ ఊర్వశుల నాట్య కౌశలాన్ని పరీక్షించేటందుకు, ఆ పుష్పాలతో రెండు దండలను కూర్చాడు. ఆ దండల నడుమ విష కీటకాలని ఉంచాడు. దండలను ఎంత నేర్పుగా అల్లాడంటే..... ఇతరులెవరు చూసినా విరిదండ విలక్షణంగా ఉందనుకుంటారే గాని, లోపల పురుగులున్నాయని గుర్తించలేరు. రెండు దండలనూ విక్రమాదిత్యుడు సభకు తీసుకుని వెళ్ళాడు.

రంభ ఊర్వశుల నాట్య పోటీ ప్రారంభమైంది.

విక్రమాదిత్యుడు వాళ్ళిద్దరినీ దగ్గరికి పిలిచి, "మీరు రిక్త హస్తాలతో నాట్యం చేస్తే, అదంత ఆకర్షణీయంగా ఉండదు. కాబట్టి, ఇదిగో ఈ పూలహారాలని చేత ధరించి, నాట్యం చేయండి" అంటూ.... రంభ ఊర్వశిలకి చెరో దండనీ అందించాడు. వాళ్ళిద్దరూ నాట్యాన్ని పునఃప్రారంభించారు.

నాట్యం చేస్తున్న వేళ, రంభ, తన చేతిలోని దండని గట్టిగా పట్టుకుంది. దానితో దండలోపల దాచబడిన క్రిములు వత్తిడికి గురయ్యాయి. ఆమెని ఇబ్బంది పెట్టసాగాయి. దాంతో ఆమె నాట్యానికి అంతరాయం ఏర్పడసాగింది. శృతిలయలకు అనుగుణంగా పడాల్సిన అడుగులు తాళం తప్పుతున్నాయి. ఆమె చేతిలోని దండ నుండి పువ్వులు రాలి పడుతున్నాయి.

అదే సమయంలో ఊర్వశి, తన చేతిలోని దండని అలవోకగా పట్టుకొని నాట్యం చేయసాగింది. దానితో దండ లోపలి క్రిములకి ఏ వత్తిడీ కలగ లేదు. అవీ ఆమెని ఇబ్బంది పెట్టలేదు. ఆమె నాట్యం నిరంతరాయంగా, శృతిలయలకు అనుగుణంగా, తాళ బద్దంగా సాగుతోంది. ప్రేక్షకులని సమ్మోహన పరుస్తోంది. ఆమె చేతిలోని దండలో పువ్వులు... ఆమెలాగే అందంగా, ముగ్ద మనోహరంగా ఉన్నాయి.

వారి నాట్య ప్రదర్శన ముగిసాక, దేవేంద్రుడు "ఓ విక్రమాదిత్యా! సాహసీ! సునిశిత దృష్టి కలవాడా! ఈ నాట్య పోటీలో విజేత ఎవరు? రంభ, ఊర్వశిలలో ఎవరిని ఉత్తమ నాట్య ప్రవీణగా నీవు నిర్ణయించావు?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వుతో "దేవేంద్ర! ఊర్వశి ఉత్తమ నాట్యగత్తె" అన్నాడు స్థిరంగా!

దేవేంద్రుడు ఓ క్షణం ఆశ్చర్యచకితుడయ్యాడు. కుతూహలంగ "ఎలా నిర్ణయించగలవు?" అన్నాడు.

విక్రమాదిత్యుడు.... రంభ, ఊర్వశిలిద్దరినీ పిలిచి "నేను మీకిచ్చిన దండలేవి?" అని అడిగాడు.

వెంటనే ఊర్వశి తన చేతిలోని పూలహారాన్ని విక్రమాదిత్యుడికి అంద చేసింది. దాన్లోని పూలన్నీ చెక్కు చెదరనట్లుగా, తాజాగా, ముగ్దగా ఒదిగి ఉన్నాయి. రంభ, నాట్యం మధ్యలోనే తన చేతిలోని పూదండని దూరంగా గిరాటు వేసింది. అందులోని క్రిములు ఆమె చేతుల మీద పారాడి, కుట్టి, ఇబ్బంది పెట్టాయి మరి!

విక్రమాదిత్యుడు అడగటంతో, రంభ... సభామండపంలో తాను పూదండని విసిరిన చోటి కెళ్ళి, దాన్ని తెచ్చి అందించింది. అందులోకి పుష్పాలు కొన్ని రాలిపడి పోయి, అక్కడక్కడా దారం బయటపడింది.

ఆ దండలని చూపుతూ విక్రమాదిత్యుడు "దేవేంద్రా! ఈ రెండు దండలలోని వ్యత్యాసాన్ని గమనించండి. రంభ దండతో నాట్యం చేయలేక దూరంగా విసిరివేసింది. ఊర్వశి దండ చేతనుంచుకునే నాట్యమాడింది. నేనిద్దరికీ దండలిచ్చి, వాటిని చేత ధరించి నాట్యం చేయమన్నాను. బహుశః రంభ ఈ దండభారాన్ని సైపలేకపోయినట్లుంది" అన్నాడు మర్మగర్భంగా!

ఇలా అంటూనే విక్రమాదిత్యుడు, రెండు దండలనీ విడదీసాడు. వాటిల్లోంచి విషక్రిములు బయటకు వచ్చాయి. అది చూసి అందరూ ఆశ్చర్య పడుతుండగా విక్రమాదిత్యుడు "దేవేంద్రా! ఊర్వశి పూలదండని అలవోకగా పట్టుకోవటం చేత, ఈ క్రిములామెని పీడింపలేదు. రంభ పూదండని గట్టిగా పట్టుకోవటం చేత, అవి ఆమెని గాయపరిచాయి. కాబట్టి, ఆమె దండని గిరాటు వేసింది.

ఊర్వశికి, తన నాట్య కౌశలం మీద తనకి నమ్మకం ఉంది. ఆమె విజయాన్ని గురించి ఆందోళన చెందలేదు. కాబట్టి - ఆమె ప్రశాంత చిత్తంతో, స్వేచ్ఛగా నాట్యం సలిపింది. కనుక దండని అలవోకగా పట్టుకుంది.

రంభ తన నాట్యం గురించి, విజయం గురించి ఆందోళిత హృదయంతో ఉంది. దాంతో ఆమె తన నాట్యగతిని తప్పింది. నాట్య మాడు వేళ, ఆమె వత్తిడితోనూ, గెలుపు గురించిన బెంగతోనూ ఉంది. దాంతో దండని గట్టిగా పట్టుకుంది. దాంతో అందులోని క్రిములామెని కుట్టి బాధించాయి. అది భరించలేక రంభ దండని విసిరి కొట్టింది.

అదీ... వీరిద్దరి నాట్య కౌశలంలోని వ్యత్యాసం! అందుచేతే, నేను ఈ నాట్య పోటీలో విజేతని ఊర్వశిగా నిర్ణయించాను" అన్నాడు.

[నిజానికి ఇది భాగవద్గీతలో చెప్పబడిన బుద్దియోగమే! కర్మణ్యేవాధికారస్తే.... శ్లోకంలో, శ్రీకృష్ణుడు చెప్పినది ఇదే! మనం మన పని గురించే ఆలోచించాలి గానీ, ఫలితాన్ని గురించి కాదు. ఫలితం గురించిన ఆందోళన వదిలి, పని మీదే మన ఏకాగ్రత నిలిపినప్పుడు, విజయం దానంతట అదే వస్తుంది. ఈ విషయాన్ని, ఈ కథ... పిల్లల మనస్సులకి హత్తుకునేంతగా, ఆసక్తికరంగా చెబుతుంది.]

విక్రమాదిత్యుడి తీర్పు వినగానే, దేవసభలోని దేవతలు, మునులూ, మహామహులందరూ... హర్షాతిరేకంతో, జయజయ ధ్వానాలు చేసారు. విక్రమాదిత్యుడి మేధస్సునీ, సునిశిత ఆలోచనా పటిమనీ ప్రశంసించారు.

దేవేంద్రుడు ఊర్వశిని విజేతగా ప్రకటించి, గొప్ప కానులిచ్చాడు. రంభనూ ఉత్సాహపరుస్తూ, తగిన విధంగా సన్మానించాడు. ఆ సంఘటనని సభలోని అందరూ ఎంతో ఆనందించారు.

దేవేంద్రుడు "విక్రమాదిత్యా! నీవిచ్చటనే మా అతిధిగా మరో నాలుగు రోజులుండ వలెను. ఒక గొప్ప కానుకను నేను నీకివ్వనున్నాను" అన్నాడు ఎంతో ప్రేమాదరాలతో!

విక్రమాదిత్యుడికి దేవేంద్రుని పలుకులు ప్రవల్లిక[puzzle]లా తోచాయి. అయితే... కుతూహలం కొద్దీ కూడా, దేవేంద్రుడివ్వ బోయే ‘గొప్ప కానుక’ ఏమిటని అడగలేదు. విక్రమాదిత్యుడు అంతటి స్థిరబుద్ది కలవాడు, వస్తు సామాగ్రి, విలువైన కానుకల పట్ల మోహం లేని వాడు.
~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes