RSS
Wecome to my Blog, enjoy reading :)

మగవారినెందుకు నమ్మరాదు ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 31]

పంచవన్నెల చిలుక "ఓ యువరాజా! పరాక్రమ కేసరీ!విను...." అంటూ ఇలా కొనసాగించింది.

అభయ సత్యం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణంలో పేరెన్నికగన్న వైశ్య వ్యాపారి ఒకడుండేవాడు. అతడి పేరు వాల్మీకుడు. అతడికి తర్క కేసరి అనే కుమారుడుండేవాడు.(వాదనలో సింహం వంటి వాడని అతడి పేరుకు అర్ధం.) వాల్మీకుడు అత్యంత ధనవంతుడు. దాంతో ఏకైక కుమారుడైన తర్కకేసరిని అతి గారాబంగా పెంచాడు.

సహజంగానే... ఎదిగే కొద్దీ తర్కకేసరి, క్రమశిక్షణారాహిత్యంతో, పొగరబోతుగా, సోమరిగా, వ్యసన పరుడిగా తయారయ్యాడు. చిన్నప్పుడు ఆటపాటల మీద ఉండిన యావ కాస్తా, యవ్వనంలోకి వచ్చేసరికి వేశ్యల మీదికి పోవటంతో, తర్క కేసరి పూర్తిగా చెడు త్రోవ పట్టాడు.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు... వాల్మీకుడు, కొడుకు తర్కకేసరిని సరైన మార్గంలో పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. నయానా భయానా... తాను నచ్చ చెప్పాడు, ఇతరుల చేత చెప్పించాడు. లాభం లేకపోయింది. ఏడ్చాడు, మొత్తుకున్నాడు. కొడుకు మాట వినలేదు. చివరికి గుండె రాయి చేసుకుని, ఇలాగే వదిలేస్తే కొడుకు ఆస్తుపాస్తులన్నిటినీ హారతి కర్పూరంలా సానివాడకి అర్పించేస్తాడని భయం వేసి, తర్కకేసరిని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు. కడుపు కాలితేనన్నా బుద్ది మంచిమార్గం పడుతుందేమోనన్న ఆశ కొడగట్టిన దీపంలా వెలుగుతోంది ఆ తండ్రి మనస్సులో!

తర్కకేసరి ఇంటి చుట్టూ తచ్చట్లాడినా తండ్రి మనస్సు కరగలేదు. ఇక తప్పక తర్కకేసరి పట్టణంలో అక్కడా ఇక్కడా తిరిగాడు. ఆ పంచనా ఈ పంచనా పడుకున్నాడు. అందరూ అతణ్ణి ఛీ కొట్టడంతో, గత్యంతరం లేక ఊరు విడిచి పోయాడు.

ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ, చివరికి అలకాపూరి అనే పట్టణం చేరాడు. అక్కడ, పేరున్న ధనిక వ్యాపారి నిషాదశెట్టి అనే వైశ్యుడున్నాడు. అతడి దుకాణం చేరి, పని ఇమ్మని దీనంగా అడిగాడు. ఇతడి వాలకం చూసి జాలిపడిన నిషాద శెట్టి ఊరుపేరూ కనుక్కొని ‘సాటి వైశ్య యువకుడు కదా’ అనుకొని ఆదరించాడు.

తర్కకేసరి కూడా... అప్పటి వరకూ అనుభవించిన క్లేశాల రీత్యా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని, యజమాని దగ్గర అణుకువగా పనిచేశాడు. ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి, నిషాద శెట్టికి తర్కకేసరి మీద మంచి అభిప్రాయం కలిగింది.

తన కుమార్తె అలంకారినిచ్చి తర్కకేసరి పెళ్ళి జరిపించాడు. ఒక్కగానొక్క కూతురితో పాటు, వ్యాపారాన్ని కూడా చేతిలో పెట్టాడు. డబ్బూ, ఆధిపత్యం చేతికొచ్చేసరికి, తర్కకేసరిలో మరోమనిషి మెల్లిగా నిద్రలేవటం మొదలయ్యింది.

ఓ రోజు నిషాదశెట్టి దగ్గరికి చేరి "మామగారూ! నేను చాలా రోజుల క్రితమే నా తల్లిదండ్రుల్నీ, ఇంటినీ విడిచి వచ్చాను. కోపం కొద్దీ ఇల్లు విడిచి వచ్చిన రీత్యా ఇన్ని రోజులూ ఏదీ ఆలోచించలేదు. ఇన్నాళ్ళాయే! ఇప్పుడెందుకో గానీ, నా భార్యని తీసుకుని నా తల్లిదండ్రుల దగ్గరికి ఓసారి వెళ్ళి రావాలనుంది. కోడల్ని వాళ్ళకి చూపించి, కొన్నిదినాలుండి, వాళ్ళని సంతోషపరచి తిరిగి ఇద్దరమూ వచ్చేస్తాం. కన్నవారి ఉసురు తగలక మానదంటారు. కాబట్టి నాకు అనుమతి నీయవలసింది" అన్నాడు.

నిషాదశెట్టి అందుకు అంగీకరించి, కూతురూ అల్లుడికి కొత్తబట్టలు నగలు బహుకరించాడు. వియ్యంకులకీ నగలూ దుస్తులతో పాటు మరెన్నో విలువైన కానుకలిచ్చి, అమ్మాయినీ అల్లుణ్ణి సాగనంపాడు.

తర్కకేసరి, అతడి భార్య అలంకారి, నిషాదశెట్టి దంపతుల దగ్గర వీడ్కొలు తీసుకొని, అభయసత్యం పట్టణానికి బయలుదేరారు. ప్రయాణపు దారిలో తర్కకేసరికి తండ్రి ఇంట తానుండగా... పనీపాటా లేకుండా జులాయిగా తిరిగిందీ, వేశ్యల ఇంట హద్దూ అదుపులేకుండా మద్యమాంసాలతో విచ్చలవిడిగా గడిపిందీ గుర్తుకొస్తోంది. తండ్రి దగ్గరుండగా ఏ పనీ చేయకుండా సోమరిగా గడిపేసాడు. ఇప్పుడు మామగారింట ఒళ్ళొంచి వ్యాపారం చేస్తున్నాడు. బుద్దిగా ఉంటున్నాడు.

గతం గుర్తుకొచ్చి తర్కకేసరి మనస్సు అడవి గుర్రంలా సానివాడ కేసి పరుగెత్తింది. క్రమంగా ‘భార్యనెలా మోసగించాలా?’ అన్న ఆలోచనలు అతడిని ఆక్రమించసాగాయి. అతడు భార్యతో "ఓనా ముద్దుల సతీ! అలంకారీ! ఈ అడవిలో దొంగలుంటారని పేరుంది. ఇన్ని నగలు వంటి మీదుంచుకొని ప్రయాణం శ్రేయస్కరం కాదు. కాబట్టి నగలన్నీ ఒలిచి మూటగట్టి నాకివ్వు. నేను జాగ్రత్త చేస్తాను" అన్నాడు.

ఆమె అలాగే చేసింది. మరుక్షణం తర్కకేసరి అలంకారిని బాటప్రక్కనే ఉన్న పాత బావిలోకి త్రోసేసి, నగలూ ఇతర విలువైన వస్తువులతో, గతంలో తాను ఆదరించిన వేశ్యల దగ్గరికి చేరాడు. అలంకారి బావిలో పడిన క్షణమే స్పృహ కోల్పోయింది. కొద్దిక్షణాల తర్వాత తేరుకొని, రక్షించమని కేకలు వేయటంతో, బాటసారులెవరో ఆమెని కాపాడారు. వాళ్ళ సాయంతో, ఎన్నో ప్రయాసలు పడి, అలంకారి తిరిగి అలకాపురిలోని తల్లిదండ్రుల ఇంటికి చేరుకుంది.

నిషాదశెట్టి... కూతురు ఒంటరిగా, దైన్యంతో తిరిగి రావటం చూసి బెదిరిపోయాడు.

"ఏమైంది తల్లీ" అనడిగాడు గాభరా పడుతూ!

"తండ్రీ! మేమిద్దరం వెళ్తూ ఉండగా దొంగల గుంపు మమ్మల్ని అటకాయించింది. నా నగలు డబ్బు అన్నీ దోచుకుంది. దొంగలు నన్ను కొట్టి బావిలోకి త్రోసి, నా భర్తని బందీగా తమ వెంట తీసుకుపోయారు. బాటసారుల సాయంతో నేనెలాగో ఇల్లు చేరగలిగాను" అంది.

తల్లిదండ్రులకి నిజం చెబితే... ‘ఒక్కగానొక్క కూతురి బ్రతుకు ఇలా అయ్యిందే’ అని వారు దుఃఖపడతారని, ఆమె జరిగిందేమీ తల్లిదండ్రులకు చెప్పలేదు. సరికదా, దొంగలని కట్టుకథలు చెప్పింది.

నిషాదశెట్టి కూతుర్ని ఓదార్చి "నువ్వు దిగులు పడకు తల్లీ! సేవకులని పంపి నీ భర్త కోసం వెతికిస్తాను" అన్నాడు. అలంకారి తల్లి, అల్లుడి క్షేమం కోరి పూజలూ వ్రతాలు చేయిస్తుండగా, తండ్రి అల్లుడి కోసం అన్వేషణ చేయిస్తున్నాడు. ఇలా కొన్నిరోజులు గడిచాయి.

ఇలా ఉండగా... తర్కకేసరి తెచ్చిన సొమ్ము ఖర్చయిపోగానే, వేశ్యలతణ్ణి తన్ని తగలేసారు. మళ్ళీ అతడి బ్రతుకు బజారు పాలయ్యింది. చేసేది లేక, తక్కుతూ తారుతూ తిరిగి అత్తగారిల్లు చేరాడు. అతడింటికి వచ్చేసరికి, సరిగ్గా ఎదురుగా భార్య అలంకారి ఉంది. అతడది ఊహించలేదు. తాను బావిలో తోసాడు గనక ఆమె అక్కడే మరణించి ఉంటుందనీ, దారిలో తాము పులివాతో, దొంగల బారినో పడ్డామని చెప్పే ప్రణాళికతో వచ్చాడు.

తీరా ఎదురుగా భార్య ఉండేసరికి గతుక్కుమన్నాడు. "ఈమె ఎలా బ్రతికి వచ్చింది? ఏమైనా గానీ... తన గురించీ, తన దురాగతం గురించీ తండ్రికి ఈ పాటికి చెప్పే ఉంటుంది. ఇప్పుడు అత్తమామలు నన్ను చంపిపాతరెయ్యటం ఖాయం" అనుకొని భయంతో వెనుదిరిగి పారిపోబోయాడు.

~~~~~~

2 కామెంట్‌లు:

కాకి చెప్పారు...

హహా చాలా బాగుంది .. తోక వంకర .. చిన్నప్పుడే దారిన పెట్టక పోతే మళ్ళీ మళ్ళీ పెడదారి పడతారేమో.

amma odi చెప్పారు...

అంతే కదండి!

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes