RSS
Wecome to my Blog, enjoy reading :)

చిలుకలు త్రికాలవేదులు ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 30]

విక్రమాదిత్యుడు విసుగు చెందకుండా, మోదుగ చెట్టు వద్దకు చేరి, మళ్ళీ భేతాళుని దించి భుజమ్మీద వేసుకుని, బృహదారణ్యం కేసి నడవ సాగాడు. యధాప్రకారం భేతాళుడు కథ ప్రారంభించాడు.

ఒకానొకప్పుడు పాటలీ పుత్రమనే నగర ముండేది. (పాటలీ పుష్పాలతో నిండి ఉన్న నగరమని దాని అర్ధం. ఇప్పటి మన పాట్నా పేరు, ఒకప్పుడు పాటలీ పుత్రమే!) విక్రమకేసరి అనే రాజు దాన్ని పరిపాలిస్తుండేవాడు. (పరాక్రమంలో సింహం వంటి వాడని ఆ పేరుకి అర్ధం.) అతడి కొక కుమారుడు. పేరు పరాక్రమ కేసరి. (ఈ పేరు అర్దమూ అదే!)

యువరాజు పరాక్రమ కేసరి అన్ని విద్యలూ అభ్యసించాడు. అన్నికళల్లో ఆరి తేరాడు. ధైర్యసాహసాలకు, పరాక్రమానికి అతడెంతో పేరుగాంచాడు. అతడొక అందమైన, పంచవన్నెల రామచిలకని పెంచుతుండేవాడు. అది మగ చిలుక. అది త్రికాల వేది కూడా! అంటే ఎవరికైనా... వారి భూత భవిష్యవర్తమానాలను చెప్పగలిగేది.

ఓరోజు, యువరాజు తన చిలుకని "ఓ పంచ వన్నెల రామచిలుకా! నువ్వు ఎవరికైనా... జీవితంలో జరిగిపోయినవీ, జరగబోయేవీ, జరుగుతున్నవి కూడా చెప్పగలవు కదా! చెప్పు. నా వివాహం ఎప్పుడు జరుగుతుంది?" అని అడిగాడు.

చిలుక కనురెప్పులల్లార్పుతూ "ఓ యువరాజా! వేదపురి అనే నగరమొకటి ఉంది. దానిని గదాధరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడికి సంతానం లేదు. దాంతో అతడు మహాశివుడి గురించి తపమాచరించాడు. శివుడు ప్రత్యక్షమై "ఓ రాజా! నీ తపస్సుకు మెచ్చాను. నీకే వరం కావాలో కోరుకో! అనుగ్రహిస్తాను" అన్నాడు.

మహాశివుణ్ణి చూసిన గదాధరుడు అమితానందంలో శివుని పరిపరి విధాల కీర్తించాడు. భక్తి పూర్వక స్వరంతో "ఓ దేవా! నాకు సంతానాన్ని ప్రసాదించు" అని కోరాడు. శివుడు "తధాస్తు" అన్నాడు. ఆ దేవదేవుని కరుణతో గదాధరునికి ఒక ఆడశిశువు కలిగింది. ఆ బిడ్డకు ‘రత్నావళి’ అని పేరుపెట్టి, అల్లారు ముద్దుగా పెంచారు రాజదంపతులు. ఆమె ఇప్పుడు యుక్త వయస్కురాలై ఉంది. ఆ యువరాణి సౌందర్యవతి, సౌశీల్యవతి.

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఆమె కూడా నీకు లాగానే ఒక అందమైన పంచవన్నెల చిలుకని పెంచుచున్నది. అది సీత చిలుక! అంటే ఆడ చిలుకన్న మాట! అది కూడా నాలాగానే త్రికాల వేది.

నీలాగానే యువరాణి రత్నావళి కూడా, తన చిలుకని ‘తన వివాహమెప్పుడని’ అడిగింది. దానికా ఆడ చిలుక "ఓ అందాల రాణీ! యువతీ శిరోమణీ! పాటలీ పుత్రానికి రాజు విక్రమకేసరి. అతడి కుమారుడు పరాక్రమ కేసరి. అతడే నీకు తగిన భర్త" అని చెప్పింది.

రత్నావళి ఈ విషయాన్నంతా తండ్రి గదాధరుడికి వివరించి చెప్పింది. రాజదంపతులు ఆ అందాల భరిణెను నీకివ్వ దలిచారు. వాళ్ళంతా పాటలీ పుత్రం బయలు దేరారు. రత్నావళి పల్లకిలో ప్రయాణిస్తుండగా, రాజదంపతులు రధంలో వస్తున్నారు. మంత్రి సేనాపతుల బృందం గుర్రాలపై తరలి వస్తోంది. వాళ్ళంతా ఈ పాటికి మన నగర ద్వారానికి సమీపంలో ఉన్నారు" అని చెప్పింది.

పరాక్రమ కేసరి కిదంతా వినేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. తల్లిదండ్రుల కిదంతా తెలియ జేసాడు. విక్రమకేసరి దీనికెంతో సంతోషించి, రాణి, మంత్రులూ పరివారాన్ని తొడ్కొని గదాధరుడికీ, అతడి బృందానికీ ఘనస్వాగతం పలికాడు.

పలుకరింపులూ, పరామర్శలూ, రాచమర్యాదలూ అయ్యాక, అన్ని విషయాలు చర్చించుకొని, శుభమహుర్తం నిర్ణయించి పరాక్రమ కేసరికి, రత్నావళికి వివాహం జరిపించారు. వధూవరులు ఒకరికొకరు తీసిపోనట్లున్నారు. చిలుకా గోరింకల్లా ఉన్న జంటని అందరూ అభినందించారు. ఆశీర్వదించి మురిసి పోయారు.

పెళ్ళివేడుకల హడావుడీ పూర్తయ్యాక, ఓ రోజు వెన్నెల రాత్రి, ఏకాంత మందిరంలో ఒండొరుల సాన్నిహిత్యాన్ని ఆస్వాదిస్తూ... నూతన దంపతులు పరాక్రమ కేసరి, రత్నావళి, కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రసంగవశాన సంభాషణ వారి చిలుకల మీదికి మళ్ళింది.

పరాక్రమ కేసరి "నా ప్రియసఖి! రత్నావళి! మనమింత వరకూ ఎంతో ప్రేమతో ఆనందంగా కాలం గడుపుతున్నాము. మన వివాహం మన రామచిలుకల వలన గదా జరిగింది? అవి కూడా మనలాగే ఆనందంగా ఉంటే, మనకి మరింత ఆనందంగా ఉంటుంది. నేను పెంచింది మగ చిలుక. నీవు పెంచింది ఆడ చిలుక. అవి పరస్పర మైత్రీ బంధాన్నీ, ప్రేమనీ ఆనందించేటట్లుగా, రెండింటినీ ఒకే పంజరంలో పెడదాం" అన్నాడు.

రత్నావళి ఇందుకు సంతోషంగా ఒప్పుకుంది. మరింత విశాలమైన అందమైన పంజరాన్ని తెప్పించి, అందులో రెండు చిలుకల్నీ విడిచిపెట్టారు.

మగ చిలుక తనని సమీపించేందుకు రాగానే, ఆడ చిలుక కోపంతో... ఎర్రటి ముక్కుని మరింతగా ఎర్రగా చేసుకుంటూ "ఎందుకు నా దగ్గరికి వస్తున్నావు? అక్కడే ఆగు! మగవాళ్ళని నమ్మకూడదు" అంది.

అది వినగానే మగ చిలుక ముక్కుతో పాటు ముఖమంతా ఎర్రగా చేసుకుని "ఆ మాట కొస్తే ఆడవాళ్ళని అసలు నమ్మకూడదు"అంది. అంతే! అవి రెండూ గఁయ్యిమంటూ వాదులాడుకోసాగాయి. అప్పటికే నిద్రలోకి జారుకున్న కొత్త దంపతులు ఉలికిపాటుతో నిద్రలేచారు. "ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు?" అని ఏకకంఠంతో అడిగారు.

రెండు చిలుకలూ ఏం జరిగిందో వివరించాయి. దేని వాదన అది వినిపించింది. యువరాణీ, యువరాజుని తమ వివాదం తీర్చమని అడిగాయి. రత్నావళి, పరాక్రమ కేసరి బిత్తరపోయి విన్నారు.

చివరికి పరాక్రమ కేసరి ఆడచిలుకతో "నువ్వు మగవారిని నమ్మరాదని అనడానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.

గొంతు సవరించుకొని, ఆడ చిలుక ఇలా చెప్పసాగింది.

~~~~~~~~
కథా విశ్లేషణ:

ఈ కథలో... ఇంత వరకూ అద్భుతరసం నిండి ఉంటుంది. పంచవన్నెల రామచిలుకలు, మాట్లాడే చిలుకలు, కబుర్లు కథలు చెప్పే చిలుకలు! అందునా భూత భవిష్యత్ వర్తమానాలు చెప్పే చిలుకలు... చిన్నారులని ఊర్రూతలూగిస్తాయి!

2 కామెంట్‌లు:

Tanu Collections చెప్పారు...

mee kathalu chaalaa bagunnaayi...
meelaanti valla vallane inkaa telugu sahityam tarvati taralaki andutondi...

amma odi చెప్పారు...

మీ అభిమానానికి నెనర్లు! మరి కొంచెం పెద్ద అభినందనే!:)

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes