RSS
Wecome to my Blog, enjoy reading :)

మంత్రి కుమారుడి మాయోపాయం ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 23]

పాయసం తిన్న కుక్క ప్రాణాలు విడవటంతో, యువరాజు ఖంగుతిని, "ఇంత పన్నాగాన్ని నేను పసికట్టలేదు" అన్నాడు. మంత్రి కుమారుడు "యువరాజా! ఆమెనంత ప్రతికూలంగా చూడకు. నీ మీద ప్రేమతో, ఆమె నా చావుకోరుకుంది. నీ సాన్నిహిత్యం పట్ల ఆమెకున్న అభద్రత అది!" అన్నాడు.

దానికి పరిష్కారం కోసం వాళ్ళిద్దరూ కాస్సేపు ఆలోచించారు. ఆమెని తమ నగరానికి తీసికెళ్ళి వివాహం చేసుకోవటమే తగిన పరిష్కారమని తోచింది యువరాజుకి. ఇంత జరిగాక పద్మావతి తండ్రియైన ఉత్తాన పాదుడి దగ్గరి కెళ్ళి పిల్లనడగాలని పించలేదు. ఎంతో తెలివైన పద్మావతికీ ఒక పాఠం నేర్పాలనుకున్నారు.

మంత్రి కుమారుడు బాగా ఆలోచించి "మంచిది, మిత్రుడా! ఆమె దగ్గరికెళ్ళి నాకు పాయసం ఇచ్చానని చెప్పు. కొంత తడవు ఆమెతో గడిపాక, ఆమె నిద్రించే సమయంలో, మెడలోని ముత్యాల హారాన్ని తస్కరించి తీసుకురా! వచ్చే ముందు, నీ చేతి మూడు వ్రేళ్ళ గోటి గుర్తులు పడేలా, ఆమె వక్షస్థలం మీద గుచ్చి, వచ్చెయ్" అని చెప్పాడు.

ఆ రాత్రి, యువరాజు తన మిత్రుడైన మంత్రి కుమారుడు చెప్పినట్లే చేసి, ముత్యాల దండ తీసుకొచ్చాడు.

మరునాటి ఉదయం, మంత్రి కుమారుడు తాను యోగిలా వేషం ధరించి, యువరాజుకి తన శిష్యుడి వేషం వేసాడు. ఇద్దరూ శశ్మానం ప్రక్క నున్న చెట్టు క్రింద కూర్చొని, తపస్సు నటించారు. అలా కొంత సేపు, అటు ఇటు పోయే ప్రజల కంట బడ్డాక, గురువు [మంత్రి కుమారుడు], శిష్యుణ్ణి [యువరాజుని] పిలిచి "నువ్వు పోయి రాచ వీధిలో ఈ ముత్యాల హారాన్ని ప్రదర్శించు. రాజు దాన్ని గురించి నిన్ను ప్రశ్నించినప్పుడు, నా గురించి వివరించి, ఇక్కడికి తీసుకురా!" అని చెప్పాడు.

యువరాజు అలాగే చేసాడు. రాజు ఉత్తాన పాదుడికి, రాచవీధిలో సాధువు శిష్యుడొకడు, మంచి మేలిమి ముత్యాల హారాన్ని ప్రదర్శిస్తూ, అమ్మకానికి పెట్టాడని తెలియ వచ్చింది. రాజతణ్ణి పిలిపించి, ధర ఎంతని వాకబు చేసాడు.

శిష్యుడిలా నటిస్తున్న యువరాజు అమాయకంగా ముఖం పెట్టి "మహారాజా! నా కదేమీ తెలియదు. మా గురువు గారు మీకన్ని విషయాలు చెప్పగలరు. మీరాయన్ని దర్శించడం మంచిది. శశ్మానం ప్రక్కన ఆయన ధ్యానం చేసుకుంటున్నారు" అన్నాడు.

ముత్యాల హారాన్ని పరిశీలించిన రాజుకి, అది తన కుమార్తె పద్మావతి దని అనుమానం వచ్చింది. దాంతో అతడు ఆ యోగిని చూడాలని తీర్మానించుకున్నాడు. మంత్రితో కలిసి మాయాయోగిని చూడబోయాడు.

చెట్టుక్రింద ధ్యాన ముద్రలో ఉన్న మాయా యోగి దగ్గరికి చేరి, రాజు, మంత్రి అతడికి నమస్కరించారు. అతడు వీళ్ళని దీవించి ప్రక్కనే కూర్చొనమని ఆదేశించాడు. రాజు అతణ్ణి ముత్యాల హారం గురించి అడిగాడు.

యోగి "ఓ రాజా! నేనిక్కడ ధ్యానం చేసుకుంటున్నాను. అయితే ప్రతీ రాత్రి, ఒక అందమైన యువతి ఇక్కడికి రావటం చూశాను. ఆమె శశ్మానం చేరి, చితిలో సగం కాలిన శవాల్ని బైటకు లాగి, పీక్కు తింటోంది. అలా ఆమె చాలా ఆకలిగా, ఆబగా తినటం గమనించాను. ఆకలి చల్లారాక, తృప్తిగా తలాడించి, ఆమె మీ నగరం వైపు వెళ్తోంది. ప్రతీ రోజూ ఇలాగే జరుగుతోంది.

ఆమెని పరీక్షింపగోరి, నిన్నటి రాత్రి, ఆమెని నా త్రిశూలంతో అడ్డగించాను. నా త్రిశూలంతో ఆమె గుండెల మీద పొడిచి "ఎవరు నువ్వు" అని గద్దించాను. అమె గజగజ వణికింది. నా పాదాల మీద పడి ప్రాధేయపడుతూ, తన మెడలో నుండి ముత్యాల హారం తీసిచ్చింది.

చేతులు జోడించి ఆర్దిస్తూ " ఓ యోగి పుంగవా! రక్షించు. నా రహస్యాన్ని కాపాడు. ఎవరికీ బహిరంగ పరచకు" అని ప్రార్దించింది.

నా కామెను చూసి జాలి కలిగింది. "అమ్మాయీ! ఎవరు నువ్వు? ఎందుకింత భయంకర నీచ కృత్యం చేస్తున్నావు?" అని అడిగాను.

"అయ్యా! నా పేరు పద్మావతి! నేనిలా చేయకపోతే నా కడుపు నిండదు" అనేసి పరుగెత్తి పారిపోయింది. అందుచేత ఈ ముత్యాల హారం నాది కాదు. అందుచేత దీన్ని నా శిష్యుడికిచ్చి రాజ వీధిలో ప్రదర్శించమన్నాను. ఆ విధంగా దాని స్వంత దారుకి ఆ దండని చేర్చాలన్నది నా ఉద్దేశం. ఏమైతేనేం, విషయం మీకు తెలిసింది. ఈ హార మెవ్వరిదో విచారించి, స్వంతదారుడికి దీన్ని అందచేయండి" అన్నాడు మాయోయోగి.

ఇదంతా విని రాజు ఉత్తాన పాదుడు దిగ్భ్రాంతి పడినాడు. అన్యమనస్కంగానే మాయాయోగి వద్ద, అతడి శిష్యుని వద్ద సెలవు పుచ్చుకొని, మంత్రితో సహా నేత్రపురానికి తిరిగి వచ్చాడు.

మాయాయోగి చెప్పినదంతా వినేసరికి, ఉత్తానపాదుడు తన కుమార్తె పద్మావతినే శంకించాడు. రాజమందిరం చేరాక, రాణిని పిలిచీ, విషయమంతా వివరించాడు.

సందేహం తీరక "రాణీ! మన కుమార్తె పద్మావతి దగ్గరకు పోయి, ఆమె మెడనూ, హృదయసీమనీ పరీక్షించిరా!" అని పంపాడు. రాణి ముత్యాల హారాన్ని తమ కుమార్తెదిగా గుర్తించింది.

భర్త చెప్పినట్లే పోయి పద్మావతి మెడనూ, వక్ష స్థలాన్నీ పరీక్షించింది. యువరాణి వక్షస్థలం మీద మూడు గాయపు గుర్తులున్నాయి. తల్లి కుమార్తెతో "పద్మావతి! ఇది నీ ముత్యాల హారమే కదా?" అని ప్రశ్నించింది, దండ చూపిస్తూ!

పద్మావతి ఒక్కసారిగా కలవర పడింది. తల్లి దండ్రులకి తన రహస్య ప్రణయ వ్యవహారం తెలిసి పోయిందని తలచింది. సిగ్గూ, భయం, తప్పు చేసానన్న లజ్జా భావం ముప్పిరి గొనగా, కన్నీళ్ళతో తలదించుకుంది.

రాణి తిరిగి వెళ్ళి రాజుకన్నీ వివరించింది. ఇద్దరికీ చాలా బాధ కలిగింది. రాజది దిగమింగుకుంటూ, "ఓ మంత్రీ! ఈ వ్యవహారంలో నీవే తీర్పు చెప్పాలి. ఇట్టి నీచకార్యం చేసింది, యువరాణి అయినా, మరొకరు అయినా.... మనం మన ధర్మం తప్పకూడదు. యువరాణి పద్మావతి విషయంలో, తండ్రినైన నేను పక్షపాతరహితంగా న్యాయవిచారణ చేయలేను. కాబట్టి నీవే న్యాయం పరికించు" అన్నాడు.

~~~~~~

4 కామెంట్‌లు:

Pramida చెప్పారు...

ila part partgaa isthe kashtamandi... suspense thattukoleka pothunnam

amma odi చెప్పారు...

ఉత్కంఠ ఉన్నప్పుడే కదా మజా వచ్చేది!:)

Vinay Chakravarthi.Gogineni చెప్పారు...

chaala baagundandi.....

amma odi చెప్పారు...

వినయ చక్రవర్తి గారు: కథ నచ్చినందుకు నెనర్లండి!

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes