RSS
Wecome to my Blog, enjoy reading :)

పైన కోపం – లోన ప్రేమ ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 22]

పదవకొండవ రోజున, పేదరాశి పెద్దమ్మకి మరిన్ని విలువైన కానుకలిచ్చి రకరకాలుగా ధైర్యం చెప్పి, పద్మావతికి సందేశం పంపారు. భయం భయంగానే అయినా, పేద రాశి పెద్దమ్మ పద్మావతి దగ్గరికి పోయి, పూల దండలిచ్చి, ఎవరూ లేకుండా చూసి గుసగుసగా దేవపురం యువరాజు వజ్రకూటుని గురించి చెప్పింది. అడవిలో సరస్సు దగ్గరి సంగతులు కూడా గుర్తు చేసింది.

ఈ సారీ పద్మావతి కోపమే చూపించింది. కుడిచేతి మూడువేళ్ళు ఎర్రని కుంకుమలో ముంచి, ముసలిదాని గుండెల మీద, పమిటపైన మూడు గుర్తులు పడేలా ఓ పోటు పొడిచింది. సుతారంగా తిడుతూ, తన మందిరపు దొడ్డివాకిలి ద్వారా పూటకూళ్ళ ముసలమ్మని వెళ్ళగొట్టింది.

పేదరాశి పెద్దమ్మ ఏడుస్తూ పోయి, యువరాజుకూ, మంత్రి కుమారుడికీ జరిగిందంతా చెప్పింది. ఆమెకు మరిన్ని కానుకలిచ్చి సంతోషపరిచాడు మంత్రి కుమారుడు. పద్మావతి ఇలా కోపం చూపించటం, రెండోసారి కూడా జరిగే సరికి, యువరాజుకి నిరాశ తోచింది. చింత పడ్డాడు.

మంత్రి కుమారుడు యువరాజుని ఓదార్చి, ఉత్సాహపరిచాడు "నా ప్రియమైన మిత్రుడా, యువరాజా! దిగులుపడకు! యువరాణి నిన్ను తన అంతఃపురపు వెనక గుమ్మం ద్వారా రమ్మనీ, అదీ మూడురోజుల తర్వాత రమ్మనీ కబురు పంపింది. ఆమె ఇప్పుడు ఋతు క్రమంలో ఉన్నందున, నిన్ను మూడు రోజుల గడువు కోరింది. అది నీకు సంకేతంగా ఉండేందుకే, ఎర్రని కుంకుమ గుర్తులు పడే విధంగా ముసలమ్మ పమిట మీద కొట్టి, వెనుక గుమ్మం ద్వారా పంపింది" అని విడమరిచాడు.

[పైకి చూడటానికి యువరాణి కోపం చూపించినట్లే ఉంటుంది. అందులో నుండే యువరాజుకు సందేశం పంపింది. ఈ ముసలి దానికి మాత్రం అదేమీ తెలియదు. జీవిత కాలం పాటు యువరాణి కోపమే గుర్తుండి పోతుంది. అదీ సంకేత భాషలో సౌలభ్యం!]

యువరాజుకి ఎంతో సంతోషం కలిగింది. మూడు రోజులు ఎలాగో ఓపిక పట్టాడు. నాలుగో రోజు చీకటి పడినాక దేవపురం యువరాజు వజ్రకూటుడు... అభ్యంగన స్నానమాచరించి, పట్టు పీతంబరాలు రత్నాభరణాలు ధరించి, పద్మావతి మందిరానికి, వెనుక గుమ్మం ద్వారా వెళ్లాడు. రహస్యంగా ఆమె అతణ్ణి కలుసుకుంది.

ఆనాటి నుండి ఆమెతో యువరాజు 10 రోజుల పాటు ఆనందంగా గడిపాడు. ఎవరికీ తెలియకుండా, తన అంతరంగిక మందిరంలో అతణ్ణి రహస్యంగా దాచి ఉంచింది పద్మావతి. ఆమె ఆటపాటలతో, సాన్నిహిత్యంతో... యువరాజుకు రోజులు క్షణాల్లా గడిచిపోయాయి.

అందమైన పద్మావతి... పలుకనేర్చిన చిన్నారి, పలు కళలు నేర్చిన వయ్యారి కావటంతో, ఆమె ప్రేమలో బడి యువరాజు, తన ప్రాణస్నేహితుడైన మంత్రి కుమారుణ్ణి కూడా మరిచిపోయాడు. ఇలా పది రోజులు గడిచేసరికి, ఓ రోజు రాజకుమారుడికి తన మిత్రుడు గుర్తుకొచ్చి బెంగ తోచింది.

"ఎంత చెడ్డవాడిని నేను? చిన్న నాటి నుండీ... నేనూ, మంత్రి కుమారుడూ, కన్నూ కనురెప్ప వలె కలిసి యుంటిమి కదా? కలిసి విద్యలు నేర్చి, కలిసి తిరిగి, కలిసి బ్రతికినాము. ఇప్పటి వరకు అతడినొక్క దినమైననూ విడిచి యుండలేదు. నేటికి, ఈ సుందర నారితో వలపు రీత్యా, నా ప్రియమిత్రుణ్ణి మరచినాను గదా?" అని ఆలోచిస్తూ యువరాజు చింతా క్రాంతుడయ్యాడు.

దాంతో నిరుత్సాహంగా ఒక మూల కూర్చొండి పోయాడు. యువరాణి పద్మావతి ఇదంతా గమనించింది. అతడి దరిచేరి, "ఓ ప్రియా! యువరాజా! నీవీ రోజు మునుపటి లా లేవు. ఏదో దిగులుతో, నిరుత్సాహంతో ఉన్నావు. నీకు నా సాన్నిహిత్యము విసుగు కలిగించి నదా? నా ప్రేమ నీకు చేదైనదా?" అని అడిగింది.

యువరాజు; "లేదు ప్రేయసీ! అలా అనుకోకు. నాకు నీవనిన ఎంతో ప్రేమ! నాకు చిన్ననాటి నెచ్చెలి యెకడు కలడు. అతడు మా మంత్రి కుమారుడు. బాల్యము నుండీ మేమిరువురమూ ఒకే కంచం, ఒకే మంచము మాదిరి కలిసిమెలిసి యుంటిమి. అతడి సాయముతోనే, నేను నిన్ను కలుసుకోగలిగితిని. మీ నగరమునకునూ ఇద్దరం కలిసే వచ్చి యున్నాము. ఇప్పుడు పది రోజులుగా అతడి ఊసైననూ ఎత్తక, నీ సాంగత్యమున బడి అతనిని వదిలి ఉంటిని. ఇది తలంచి నాకు తప్పు చేసినట్లని పించుచున్నది. లజ్జా భావము కలుగుచున్నది. అంతే! అందుకే దిగులుగా నుంటిని" అన్నాడు.

అది వినగానే పద్మావతి మనస్సులో అసంతృప్తి, అసూయ కలిగాయి. తన ప్రియునికి తనకంటే అతని బాల్య మిత్రుడే ఎక్కువ కావటం ఆమెకి క్రోధం కలిగించింది. అయితే ఇవేవీ ఆమె బయట పెట్టలేదు. కొన్ని క్షణాల తర్వాత, తనకు అత్యంత నమ్మకస్తురాలైన చెలికత్తెను పిలిచి, పాయసము చేసి తెమ్మన్నది. చెలికత్తె తెచ్చిన పాయసంలో విషం కలిపి, యువరాజు దగ్గరికి వచ్చింది.

"ఓ యువరాజా! నా ప్రియ సఖా! నీవు దిగులు చెందకు. మీ స్నేహితుడు నాకునూ ఆదర పాత్రుడే! నా కానుకగా ఈ పాయసమును తీసికెళ్ళి నీ మిత్రుని కిమ్ము. అతడీ పాయసమును ఆరగించిన పిదప, అతనితో కొంత సమయము సంతోషముగా గడిపి రమ్ము" అంటూ పాయసము గిన్నెను యువరాజు కిచ్చింది.

దాంతో యువరాజుకి ఆమె మీద మరింత ప్రేమ కలిగింది. ఆమెతో కొన్ని క్షణాలు మురిపాలాడి, పాయసం గిన్నె తీసుకొని, స్నేహితుడి దగ్గరికి బయలు దేరాడు. పద్మావతి మీద గల అనురాగం కొద్దీ, అతడేదీ శంకించలేదు.

స్నేహితుణ్ణి చూడగానే సంతోషంగా పలకరించి, పాయసం గిన్నె ఇచ్చాడు. ఎంతో ప్రేమతో కబుర్లు చెబుతూ, పాయసం తాగ మన్నాడు. మంత్రి కుమారుడు గిన్నెలోకి తీక్షణంగా చూసి "యువరాజా! నీ బాల్య మిత్రుణ్ణయిన నన్ను చంపటానికి, పాయసంలో విషం కలిపి తెచ్చావా?" అన్నాడు.

అది విని యువరాజు బిత్తర పోయాడు. ‘ఎందుకిలా అంటున్నాడతడు? ఎంతో ప్రేమతో నేను పాయసం తీసుకు వస్తే..., నేనెంతో ప్రేమతో తెచ్చానో, తానంత ప్రేమతో దాన్ని ఆరగించక, ఇలా సందేహిస్తున్నాడేమిటి? ఇతడికి నా మీద స్నేహం తగ్గి పోయిందా?’... అనుకుంటూ అలాగే చూడసాగాడు.

మంత్రి కుమారుడిదంతా గమనిస్తూనే ఉన్నాడు. పాయసపు పాత్రతో వీధిలోనికి వచ్చి, ఊరకుక్కని పిలిచి, పాత్ర దాని ముందుంచాడు. పాయసం తిన్న కుక్క మరుక్షణం క్రిందపడి, గిలగిల కొట్టుకుని ప్రాణాలు విడిచింది.


~~~~~~~~~~~

1 కామెంట్‌లు:

Manikanth చెప్పారు...

Interesting story ! avunu, deeni mugimpu kanapada ledhu ... pisinari dhanayya katha vachesindhi ... I missed the link somewhere ...

 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes