RSS
Wecome to my Blog, enjoy reading :)

చంద్రవర్ణుడి కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 06]

ప్రాచీన కాలంలో, కర్మభూమియైన భారత ఖండంలో నంది పురమనే పట్టణ ముండేది. అందులోని బ్రాహ్మణ వాడలో, మిగుల సౌందర్యవంతుడైన యువకుడు ఒకడుండేవాడు. అతడి పేరు చంద్రవర్ణుడు. [చంద్రవర్ణుడు అంటే - చంద్రుని కాంతి వంటి శరీర ఛాయ గలవాడు అని అర్ధం.] చంద్రవర్ణుడు మంచివాడు. నీతి నియమాలు, ధర్మచింతనా గలవాడు. పైగా పండితుడు. అతడెన్నో శాస్త్రాలనూ, కళలనూ అభ్యసించాడు. అయినా గానీ, తాను నేర్చిన విద్యల పట్ల అతడికి సంతృప్తి లేదు.

"ఈ జగత్తున ఇంకనూ నేర్వవలసిన కళలూ, శాస్త్రాలూ, విద్యలూ ఎన్నిగలవో ఎవరూ చెప్పలేరు. నేనింకా నేర్వవలసింది ఎంతో ఉంది. ఇలాగే ఉంటే నా తృష్ణ తీరదు. సద్గురువును ఆశ్రయించి, విద్యల నభ్యసించవలసిందే" అని నిశ్చయించుకున్నాడు.

స్థిర నిశ్చయానికి వచ్చిన చంద్రవర్ణుడు ఇల్లు విడిచి పెట్టాడు. సద్గురువుని అన్వేషిస్తూ బయలు దేరాడు. ఎన్నో ప్రాంతాలు తిరిగాడు. పుణ్యక్షేత్రాలు చుట్టబెట్టాడు. విద్వాంసులున్నారని పేరున్న చోటునల్లా సందర్శించాడు. తన జ్ఞానతృష్ణని తీర్చే గురువుని కనుక్కోలేక పోయాడు. అయితే చంద్రవర్ణుడు తన సంకల్పాన్ని మాత్రం విడిచి పెట్టలేదు.

సద్గురు అన్వేషణనీ మానలేదు. ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు. అలా సాగుతూ... ఒక నిర్జనారణ్యాన్ని చేరాడు. అతడప్పటికే బాగా అలిసిపోయి ఉన్నాడు. అతడికి ఎదురుగా చిన్న కొండ ఉంది. ఆ ప్రక్కనే ప్రశాంతంగా ఓ నది ప్రవహిస్తోంది. నది ఒడ్డున ‘ఆకాసాన్నంతటినీ ఆవరించి ఉందా?’ అన్నట్లు రావి చెట్టొకటి ఉంది. నది నీటి గలగలలతో, రావి ఆకుల గలగలలు పోటీ పడుతున్నాయి.

చంద్రవర్ణుడు నదిలోకి దిగి దాహం తీర్చుకున్నాడు. ఆ చల్లని నీటిలో స్నానమాచరించాడు. అలసిన శరీరం, మనస్సు కూడా సేదతీరాయి. రావి చెట్టు క్రింద చేరగిలబడ్డాడు. చల్లని గాలి మెల్లిగా వీస్తోంది. చంద్రవర్ణుడు విశ్రాంతిగా ఆ చెట్టు నీడలో నిద్రించాడు.

భారీగా ఉన్న ఆ రావి చెట్టు మీద, చాలా కాలం నుండీ ఓ బ్రహ్మరాక్షసుడు నివసిస్తున్నాడు. [రాక్షసులు తామస గుణాత్ములు. వారిలో సత్వగుణం గల రాక్షసులని బ్రహ్మరాక్షసులంటారు. రాక్షసులలో వీరు మహర్షుల వంటి సాధు పురుషులన్న మాట.] అతడా రావి చెట్టు కొమ్మలపై ఉంటూ, ప్రతీరోజూ తపమాచరిస్తూ ఉన్నాడు. సంధ్యా వందనం చేసుకోవటానికి బ్రహ్మరాక్షసుడు చెట్టు దిగి వచ్చాడు. నది వైపు అడుగులు వేయబోయి, చెట్టు నీడన నిద్రిస్తున్న చంద్రవర్ణుణ్ణి చూశాడు.

ఆ బ్రాహ్మణ యువకుడి ముఖ వర్ఛస్సు, దేహకాంతిని బట్టి అతడి జ్ఞానతృష్ణని గ్రహించాడు. సుందరుడూ, సుకుమారుడూ అయిన చంద్రవర్ణుడి పట్ల బ్రహ్మరాక్షసుడికి ఎంతో వాత్సల్యం కలిగింది. నదిలో స్నానాదికాలు ముగించుకొని, సూర్య భగవానుడికి సంధ్యావందనాది అనుష్టానాలు ఆచరించి, చంద్రవర్ణుడి దగ్గరికి వచ్చాడు. అతణ్ణి తట్టి లేపాడు.

నిద్రలేచిన చంద్రవర్ణుడు, ఎదురుగా ఉన్న బ్రాహ్మ రాక్షసుడిని చూసి, నమస్కరించి నిలబడ్డాడు. బ్రహ్మరాక్షసుడు చంద్రవర్ణుడి వైపు ప్రేమగా చూస్తూ "వత్సా! ఎవరు నీవు? ఈ నిర్జనారణ్యానికి ఎందుకు వచ్చావు? మానవ మాత్రులెవరూ ఈ దుర్గమారణ్యంలోకి అడుగు పెట్టేందుకు సాహసించరే? నీవెందుకు వచ్చావు?" అని అడిగాడు.

చంద్రవర్ణుడు వినమ్రత ఉట్టిపడే స్వరంతో "మహాత్మా! నా పేరు చంద్రవర్ణుడు. ‘నందిపురం’ అనే పట్టణ వాసిని. నన్ను ఉద్దరించగల సద్గురువును అన్వేషిస్తూ తిరుగుతున్న వాడిని! నా దురదృష్టం కొద్దీ, నా ప్రయత్నాలు సఫలం కాలేదు. చూడగా మీరెవ్వరో, పండితుల వలె కనబడుతున్నారు. మీ ముఖ కాంతి, జ్ఞానదీప్తి ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి. దయ ఉంచి, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి" అన్నాడు.

బ్రహ్మరాక్షసుడికి, చంద్రవర్ణుడిపై కలిగిన వాత్సల్యం, అతడి మాటలు వినేసరికి రెట్టింపయ్యింది. ఎంతో దయగా "నాయనా! తప్పకుండా నిన్ను నా శిష్యుడిగా అంగీకరిస్తాను. భగవంతుడే నిన్ను నా దగ్గరికి పంపినట్లున్నాడు. నాకు తెలిసిన విద్యలన్నిటినీ నీకు ఆరునెలల్లో నేర్పుతాను. అయితే ఒక నియమం ఉన్నది" అని ఆగాడు.

చెప్పమన్నట్లుగా చేతులు జోడించాడు చంద్రవర్ణుడు. బ్రహ్మరాక్షసుడు కొనసాగిస్తూ "ఆరునెలలు పాటు నువ్వు ఆకలిదప్పలు, అలసటా మరిచిపోవాలి. అన్నపానాదులు, నిద్రా విశ్రాంతులు మాని, అనుశృతంగా నేర్చినట్లయితేనే నీకు నేను విద్యలు నేర్పగలను" అన్నాడు.

చంద్రవర్ణుడు ఆందోళన నిండిన కళ్ళతో, గురువు పాదాల మీద వ్రాలాడు. "స్వామీ! అందుకు తగిన తరుణోపాయం మీరే చెప్పండి" అని ప్రార్దించాడు. బ్రహ్మరాక్షసుడు అతడి పట్ల మరింత సంప్రీతుడై "నాయనా! దిగులు చెందకు. నేను నీకో మంత్రోపదేశిస్తాను. ఆ ప్రభావంతో నీకు ఆరునెలలుపాటు తరగని శక్తి లభిస్తుంది. దాని సహాయంతో నీవు అలసట, నిద్ర, ఆకలి, దప్పికలని నియంత్రించుకోగలవు.

నేనీ రావిచెట్టు కొమ్మలపై కూర్చుండి, రావి ఆకులపై శ్లోకములను వ్రాసి క్రింద పడవేస్తాను. నీవా ఆకులని గ్రహించి, వాటిపై శ్లోకములను పఠించవచ్చు" అన్నాడు.

[ప్రాచీన కాలంలో కాగితాలు లేవు కదా! తాటి ఆకులపై పక్షి ఈకతో వ్రాసేవారు. ఈ కథలో రావి ఆకుల మీద వ్రాసారు. అందుకేనేమో "ఫలానా వారి కంటే ఇతడు నాలుగాకులు ఎక్కువే చదివాడు" అనే సామెత పుట్టింది. ఒకరిని మించిన వాడు మరొకడు తారసిల్లి నప్పుడు, తరచుగా ఈ సామెత వాడుతుంటారు.]

చంద్రవర్ణుడి సంతోషం అవధులు దాటింది. బ్రహ్మరాక్షసుడికి గురుభావంతో, వినయంగా, తలవంచి నమస్కరించాడు. విద్యాభ్యాసం ప్రారంభమైంది. నిద్రాహారాలు లేకుండా బ్రహ్మరాక్షసుడు విద్యల నేర్పుతున్నాడు, చంద్రవర్ణుడు నేర్చుకుంటున్నాడు. ఆరునెలల కాలం గడిచింది.

అప్పుడు సంభవించిందొక అద్భుతం!
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes