RSS
Wecome to my Blog, enjoy reading :)

యువరాజు, మేకపోతు – ఎవరి వివేకం గొప్పది? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 38]

ఆ క్షణంలో... ఆ ప్రక్కనే రెండు మేకలున్నాయి. ఒకటి ఆడమేక(పెంటి), మరొకటి మగమేక (పోతు). పోతుమేక పెంటి దగ్గరికి ప్రేమగా చేరబోయింది. ఆడమేక దాని నాపుతూ. "నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే... అదిగో, ఆ బావి లోతట్టు గోడల మీద పచ్చని లేత చివురాకులున్నాయి. ఆ బావి మనకి దాపులనే ఉంది. నీవా లేచిగురాకులు తెచ్చి నాకిచ్చినట్లయితే నీ ప్రేమని అంగీకరిస్తాను" అంది.

మగమేక బావి వద్ద కెళ్ళి తొంగి చూసింది. బావి గోడలు పాకుడు పట్టి ఉన్నాయి. లోతట్టు గోడల కున్న పగుళ్ళలో పచ్చని మెత్తని పచ్చిక, చిగురాకులతో చిన్న చిన్న మర్రి మొక్కలూ పెరిగి ఉన్నాయి. గాలికి అవి ఊగుతున్నాయి, ఆకులు వెన్నెలలో మెరుస్తున్నాయి.వాటిని చూసి మగమేక ఓ క్షణం చింత పడింది. బావిలోకి ఓ సారి, పెంటి మేక వైపోసారి మార్చిమార్చి చూసింది.


మగమేక “ఓ ఆడుదానా! నీవు నీ కౄర బుద్ధిని చూపెట్టుకున్నావు. నీకు నా మీద ఏ మాత్రమూ ప్రేమలేదు. నేను ఆ బావి లోతట్టు గోడల్లోని చిగురాకులు తెచ్చేందుకు వెళ్ళినట్లయితే, ఆ పాకుడుకి జారి, బావిలో పడి చావగలను. నేను చచ్చాక నీవెవరి మీద ప్రేమ చూపుతావు? నా చావు తర్వాత నేనైనా నీ మీద ఎలా ప్రేమ చూపగలను? ఈ లోకంలో… ఎవరైనా, ఎవరినైనా ప్రేమిస్తే…తాను ప్రేమించిన వాళ్ళని సంతోష పెట్టి, వాళ్ళ శ్రేయస్సుని కాంక్షించాలి. కానీ నీకు నీ స్వార్ధం తప్ప నా శ్రేయస్సు పట్టలేదు.

కాబట్టి నీ ప్రేమతో నాకు ఒనగూడేదేమీ లేదు. నీవు ప్రేమించినా లేకపోయినా నాకు తేడాలేదు. నీలాంటి స్వార్ధపరుల కోసం అలాంటి అవివేకపు పనులు చేసే బుద్ధిహీనుడెవడు ఇక్కడ లేడు. ఫోఫో!” అని పెంటి మేకను కసిరింది.

చితిపై పరుండిన యువరాజు మణిమేఖులుడుకి మేకల భాష కూడా తెలుసు. పోతు, పెంటి మేకల సంభాషణంతా విన్న మణిమేఖులుడు ఆలోచనలో పడ్డాడు. అటు చూస్తే మగ మేక ఆడమేకని ఛీకొట్టి చక్కా పోయింది.

ఇటు చూస్తే మణిమేఖల భర్త చెప్పబోయే రహస్యం కోసం ఊపిరి బిగబట్టి చూస్తోంది. అది చెబితే తన ప్రాణానికే ప్రమాదం అన్న భర్త మాట అసలామెకి పట్టడం లేదు. తనని సంతోష పరచడం కోసం భర్త ప్రాణాలు ఒడ్డుతున్న స్పృహ అంతకంటే లేదు. చితిపై పడుకున్న భర్త ప్రాణం గురించి ఆమెకి చింతలేదు, అతడు చెప్పబోయే విషయం పట్ల కుతూహలమూ ఆతృతా తప్ప!

అది చూసిన మణిమేఖలుడు చితి మీది నుండి దిగ్గున లేచాడు. “ఏమిటేమిటి?” అంటూ వెంటపడుతున్న భార్య వైపు చూడను కూడా లేదు. మణిమేఖల విడిచి పెట్టలేదు.

దారి కడ్డం వచ్చి నిలబడింది. మణిమేఖలుడు భార్యని తిరస్కారంగా చూసి, ఆమెని విడిచి పెట్టి స్వదేశం వెళ్ళిపోయాడు. మరో యువతిని వివాహం చేసుకుని సుఖంగా ఉన్నాడు.

ఇదీ కథ!

అంటూ కథ ముగించిన భేతాళుడు “విక్రమాదిత్య రాజేంద్రా! ఈ కథలో ఎవరి వివేకం గొప్పది? నా ప్రశ్నకు జవాబు చెప్పు. అయితే నియమం నీకు తెలుసు కదా?” అన్నాడు.

విక్రమాదిత్యుడు చిన్నగా నవ్వుతూ “భేతాళా! నియమం తెలియకేం? ఇక నీ ప్రశ్నకు సమాధానం విను. నా అభిప్రాయంలో… మనం ఎవరినైనా ప్రేమించినట్లయితే, వారిని సంతోషపరచాలి, వాళ్ళు ప్రశాంతంగా, సౌఖ్యంగా ఉండేలా చూడాలి.

మణిమేఖలుడు తన భార్య మణిమేఖలని సంతోషంగా ఉంచేందుకు చావటానికి కూడా సిద్ధ పడ్డాడు. అయితే మణిమేఖలకు భర్త పట్ల ప్రేమ గానీ, కరుణ గానీ లేవు. ఆమెకతడి మరణం కూడా పట్టలేదు. అతడి మరణ సన్నద్ధత కంటే కూడా, అతడెందుకు నవ్వాడో…ఆ రహస్యం తెలుసు కోవాలన్నదే ఆమె ఆరాటం.

సకల విద్యలూ అభ్యసించినా గానీ, మానవుడైనా గానీ… మణిమేఖలుడు, మేకపోతు… ‘ప్రేమ’కు నిర్వచనాన్ని విప్పి చెప్పే వరకూ… ఆ సత్యాన్ని గ్రహించ లేకపోయాడు. మేకపోతు…ప్రేమకీ, స్వార్ధానికీ మధ్య ఉన్న విభజనని స్పష్టంగా చెప్పడమే గాక, అతడి కళ్ళెదుటే దాన్ని సంఘటనా పరంగా నిరూపించింది.

ఆ విధంగా మేకపోతు తార్కికతనీ, సునిశిత ఆలోచననీ కనబరచింది. కాబట్టి దాని వివేకమే గొప్పది. కనుక ఈ కథలో మణిమేఖలుడి కంటే కూడా మేకపోతే గొప్పది” అన్నాడు.

అది సరైన జవాబు కావటంతో భేతాళుడు చప్పట్లు చరిచి తన ఆమోదాన్ని తెలిపాడు. కానీ నిశ్శబ్దం భంగమైంది గనక, మెరుపులా మాయమై మోదుగ చెట్టెక్కేసాడు.

కథా విశ్లేషణ: ఈ కథలో ప్రేమకీ స్వార్ధానికి గల తేడాని, పిల్లలకే కాదు పెద్దలకీ ఆసక్తికరంగా ఉండేలా వివరించబడింది. నిజానికి పెంటి మేక వంటి స్త్రీలను చాలా మందినే చూస్తుంటాం, మన చుట్టు సమాజంలో!

ఉద్యోగ వర్గాల్లో చాలామంది లంచగొండుల్ని, అనేక రంగాల్లో ఎంతోమంది అవినీతిపరుల్ని చూస్తుంటాం. వాళ్ళ అవకతవకల్ని చూసి అసహ్యించుకుంటూ ఉంటాం.

నిజానికి కొందరు అవినీతి పరుల వెనక…వాళ్ళ భార్యల ప్రోద్బలం, బలవంతం ఎక్కువగా ఉంటాయి. లేచిగురు లడిగిన పెంటి మేకలాగా…నగలు, చీరలు, ఆస్తులు కార్లూ వంటి గొంతెమ్మ కోరికలు కోరుతూ, వాటిని ప్రేమకి ముడిపెట్టి భర్తల్ని అక్రమ సంపాదన చెయ్యమని కాల్చుకుతినే వాళ్ళని ఎంతోమందిని చూసాను.

ఆయా అవినీతి మార్గాల్లో భర్తలెంత వత్తిడికి గురైనా, బాధలు పడినా వాళ్ళకి పట్టదు.

నిజానికి ప్రేమంటే ఎదుటి వాళ్ళని సంతోషపరచటం, శాంతంగా సౌఖ్యంగా ఉండేలా చూడటం అనే జవాబు చెప్పటంలో విక్రమాదిత్యుడి వివేకం, వివేచన పిల్లల్ని ఆకర్షిస్తాయి. ఆ విధంగా ఈ కథలు మంచి మార్గంలో నడిచేటట్లు పిల్లలకి స్ఫూర్తి కలిగిస్తాయి.

~~~~~~~

మణి మేఖల – మణి మేఖలుడు! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 37]

తదుపరి ప్రయత్నంలో భేతాళుడు మరో కథ ప్రారంభించాడు.

ఒకప్పుడు ఉషాపురం అనే నగరం ఉండేది. (ఆ పేరుకు అర్ధం ‘ఉదయపు నగరం’ అని.) దానికి రాజు గృహ భుజుడు. అతడికొక కుమార్తె ఉంది. ఆమె పేరు మణిమేఖల. (అంటే మణులతో కూర్చిన దండ.)

ఆమె అందం గురించి దేశదేశాలలో పేరెన్నిక గలది. రాజు తన కుమార్తెను సకల విద్యాపారంగతుడికీ, అరవై నాలుగు కళలలో చతురుడికీ ఇచ్చి పెళ్ళి చేయాలని అభిలషిస్తున్నాడు. దాంతో యువరాణి వివాహానికై దేశదేశాలలో వెదకసాగాడు.

ఒకరోజు రాజు గృహ భుజుడికి సుదూర దేశంలో నున్న మణిమేఖులుడనే యువరాజు గురించి తెలిసింది. మణిమేఖలుడు స్పురద్రూపి, సౌందర్యవంతుడే గాక, సకల విద్యా పారంగతుడు, చతుష్పష్థి కళా ప్రపూర్ణుడు.

రాజు సంతోషంగా మణిమేఖలుడిని బంధుమిత్రులతో సహా రప్పించి, తన కుమార్తె మణిమేఖలని అతడికిచ్చి వివాహం చేసాడు. ఆ జంటని చూచి అందరూ అభినందించారు. నూతన వధూవరులిద్దరూ ఒండొకరి సానిహిత్యాన్ని ఆనందించసాగారు.

ఓనాటి రాత్రి... ఉషాపురంలోని మణిమేఖల మందిరంలో, వాళ్ళిద్దరూ హంసతూలికా తల్పంపైన శయనించి ఉన్నారు. పట్టు పరుపులపై పరచిన పాలనురుగు లాంటి దుప్పట్లు, ఆకాశంలోని వెన్నలని గదిలోకి తెచ్చి వెదజల్లుతున్నట్లున్నాయి. అగరుధూపాలు, పూలపరిమళాలు తుమ్మెదలకి మత్తెక్కిస్తున్నాయి.

భార్యభర్తలిద్దరూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు. వారి శయ్యక్రింద ఒక చీమల బారు పోతున్నది. సరిగ్గా వారి పడక మధ్యలో, నిట్ట నిలువుగా విభజన రేఖ గీస్తున్నట్లుగా ఉన్నాయవి.

అంతలో ఉన్నట్లుండి, వరుసలో ముందు వెళ్తున్న చీమలు ఆగిపోయాయి. వెనక వస్తున్న చీమలు ముందున్న వాటిని "ఎందుకు ఆగిపోయారు?" అనడిగాయి.

ముందున్న చీమలు "ఇక్కడ ఓ మంచం ఉంది. దానిపైన కొత్తగా పెళ్ళైన జంట ఉంది. మనం వారి మంచం క్రింద, వారి మధ్య విభజన రేఖ గీస్తున్నట్లుగా నిట్టనిలువుగా ప్రయాణిస్తున్నాం. ‘అది ఎంత వరకూ సబబు?’ అని ఆలోచిస్తూ ఆగిపోయాయి" అన్నాయి.

వెనక ఉన్న చీమలు "దానికింత ఆలోచనెందుకు? మంచాన్ని ఎగరేసి పక్కకి త్రోసేద్దాం" అన్నాయి. ముందున్న చీమలు "అలాగే చేయవచ్చును గానీ, పడకపై నున్న భార్యభర్తలు ఒకరి సాన్నిహిత్యాన్నొకరు ఆనందిస్తూ ఏవో సరాగాలాడుకుంటున్నారు. వాళ్ళని అభ్యంతర పరచటం పాపకార్యమని సంకోచపడుతున్నాం" అన్నాయి.

మణిమేఖలుడు సకల కళా విశారదుడైనందున, అతడికి ‘చీమల భాష’ కూడా తెలుసు. ఆ సంభాషణంతా విన్న మణిమేఖలుడికి నవ్వు వచ్చింది. తమ దారి మార్చుకోవాలని గాక, తమ మంచాన్ని ఎగరేసి ప్రక్కకి త్రోసేయటంలోని పాపపుణ్యాల గురించి ఆలోచిస్తున్న చీమల్ని చూస్తూ, అతడు ఫకాలున నవ్వాడు.

అతడి ప్రక్కనే శయనించి ఉన్న మణిమేఖలకి భర్త ఎందుకు నవ్వాడో అర్ధం కాలేదు. బహుశః తనని చూసే నవ్వాడనుకొని చిన్నబుచ్చుకుంది. ఉండబట్టలేక "ఎందుకు నవ్వుతున్నావు?" అడిగింది.

అతడేదో చెప్పబోయేంతలో... ఇదంతా గమనించిన చీమలు "ఓ యువరాజా! మణిమేఖలుడా! మా సంభాషణ గురించి నీవు ఎవరికైనా చెప్పినట్లయితే, నీ తల వంద ముక్కలై మరణించగలవు సుమా!" అని శపించాయి.

దాంతో మణిమేఖలుడు మౌనంగా ఉండిపోయాడు. మణిమేఖల ఊరుకోలేదు. "నా ప్రియపతీ! ఎందుకు మౌనంగా ఉన్నావు? నా ప్రశ్నకు జవాబు చెప్పవేమి?" అంది.

మణిమేఖలుడు "ప్రియసఖీ! అది రహస్యం! ఆ విషయం ఇంతటితో వదిలిపెట్టు. దాని గురించి చెబితే నా ప్రాణాలకే ముప్పు. గనుక దాని గురించి మరిచిపో!" అన్నాడు.

మణిమేఖల నమ్మలేదు. ‘బహుశః తనని చూసే భర్త నవ్వి ఉంటాడు. చెప్పడం ఇష్టం లేక దాట వేస్తున్నాడు’ అనుకుంది. దాంతో..."నేనింత అడుగుతున్నా చెప్పడం లేదంటే నీకు నామీద ప్రేమ లేదు. ప్రేమ లేని చోట కలిసి జీవించి ఏం సుఖం? ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే నిప్పుల్లోనో నీళ్ళల్లోనో దూకి చావటం మేలు. ఊరి పెట్టుకు ఊసురు తీసుకున్నా నయమే! నేనిక బ్రతక జాలను" అంటూ దుఃఖ పడసాగింది.

భార్యమాటలు విని మణిమేఖలుడికి చాలా బాధ కలిగింది. అతడికి భార్యంటే చాలా ప్రేమ! ఆమె దుఃఖించటాన్ని చూడలేక పోయాడు. తనకి ఏమైనా సరే, ఆమెని సంతోష పెట్టాలనుకున్నాడు. దానితో భార్యని తీసుకుని, ఆ రాత్రి వేళ ఊరి బయటకు వెళ్ళాడు.

అక్కడ ఓ చితిపేర్చుకుని దానిపై పడుకున్నాడు. భార్యను దగ్గరికి పిలిచి, తానెందుకు నవ్వాడో చెప్పి, మరుక్షణం అగ్నిపెట్టుకు మరణించాలని అతడి ఆలోచన! అన్నీ సిద్ధం చేసుకుని మణిమేఖలని దగ్గరికి పిలిచాడు.

పైన చందమామ నిండుగా వెలుగుతున్నాడు. మణిమేఖల ముఖం కూడా చందమామలా వెలిగిపోతుంది. అయితే అతడి మీద ప్రేమతో కాదు, అతడు చెప్పబోయే రహస్యం పట్ల ఆతృత తో! అతడు నోరు విప్పి ఏదో అనబోయాడు.

ఆ క్షణంలో... ఆ ప్రక్కనే రెండు మేకలున్నాయి. ఒకటి ఆడమేక(పెంటి), మరొకటి మగమేక (పోతు). పోతుమేక పెంటి దగ్గరికి ప్రేమగా చేరబోయింది. ఆడమేక దాని నాపుతూ. "నీకు నిజంగా నా మీద ప్రేమ ఉంటే... అదిగో, ఆ బావి లోతట్టు గోడల మీద పచ్చని లేత చివురాకులున్నాయి. ఆ బావి మనకి దాపులనే ఉంది. నీవా లేచిగురాకులు తెచ్చి నాకిచ్చినట్లయితే నీ ప్రేమని అంగీకరిస్తాను" అంది.

మగమేక బావి వద్ద కెళ్ళి తొంగి చూసింది. బావి గోడలు పాకుడు పట్టి ఉన్నాయి. లోతట్టు గోడల కున్న పగుళ్ళలో పచ్చని మెత్తని పచ్చిక, చిగురాకులతో చిన్న చిన్న మర్రి మొక్కలూ పెరిగి ఉన్నాయి. గాలికి అవి ఊగుతున్నాయి, ఆకులు వెన్నెలలో మెరుస్తున్నాయి.వాటిని చూసి మగమేక ఓ క్షణం చింత పడింది. బావిలోకి ఓ సారి, పెంటి మేక వైపోసారి మార్చిమార్చి చూసింది.

ధనలాలస - ధర్మనిరతి! (భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక - 36)

హఠాత్తుగా బ్రహ్మపురంలో ప్రత్యక్షమైన కార్పటికుడి గురించి క్షణాల్లో వార్త ఊరంతా ప్రాకి సంచలనం రేపింది. కార్పటికుడు నేరుగా వెళ్ళి రాజదర్శనం చేసుకున్నాడు.

చండసింహుడతణ్ణి "కార్పటికా! ఏమయ్యింది? నీవు వెళ్ళిన పనిని ఎంత వరకూ సాధించావు?" అనడిగాడు. కార్పటికుడు రాజుకు నమస్కరించి, తను బయలు దేరినప్పటి నుండీ అప్పటి వరకూ ఏం జరిగిందో, ఏదీ దాచకుండా చెప్పాడు.

రాజది విని ఆశ్చర్యపోయాడు. అతడికా ఆలయాన్ని, ఆ అద్భుత సుందరిని చూడాలనిపించింది. ఓ మంచిరోజున... రాజు, కార్పటికుడు నౌకమీద ప్రయాణం ప్రారంభించారు. కొంచెం కష్టపడినా గానీ, కార్పటికుడు గతంలో తను చేరిన దీవిని గుర్తించాడు.

వెంటనే, రాజు చండసింహుడు, కార్పటికుడు కాళికాదేవి ఆలయంలోకి వెళ్ళారు. రాజు కాళికా దేవికి పూజాదికాలు నిర్వహించాడు. తర్వాత ఆలయ ఆవరణలోకి వచ్చారు. మునుపటి లాగే, మర్రిచెట్టు నీడలో అరుగు మీద, అంతకు క్రితం కార్పటికుడు చూసిన వయ్యారి, విలాసంగా శయనించి ఉంది.

చుట్టూ పరిచారికలు, ఆమెకు సపర్యలు చేస్తున్నారు. రాజామెను చూశాడు. ‘కార్పటికుడు చెప్పింది నిజమే! ఈమె అద్భుత సౌందర్యవతి’ అనుకున్నాడు.

అదే సమయంలో ఆ యువతి కూడా రాజును చూసింది. కోర మీసం, గిరజాల జుట్టు, బలమైన భుజాలు, కండలు తిరిగిన ధృఢ శరీరుడైన రాజుని చూసి ఆమె మైమరచిపోయింది. శౌర్యాన్ని ప్రకటిస్తున్న అతడి దేహభాష, చురుకైన కంటి చూపు, ఆమెను రాజుపై ప్రేమలో పడదోసాయి.

చెలికత్తెలని పిలిచి, రాజును చూపి ఏదో చెప్పింది. ఇద్దరు చెలికత్తెలు రాజు దగ్గరికి వచ్చి నమస్కరించి, ఆమె పంపిన ప్రేమ సందేశాన్ని వినిపించారు. రాజామెను తన వద్దకు రావలసిందిగా కోరాడు. సంతోషంతో,వయ్యారంగా కదులుతూ ‘అందమే ప్రవహించుకొస్తుందా!’ అన్నట్లు ఆమె అతణ్ణి సమీపించింది.

చండసింహుడు "ఓ సౌందర్యరాశి! ఎవరు నీవు? ఇక్కడెందుకు ఉన్నావు?" అనడిగాడు.

తేనెలొలుకుతున్న స్వరంతో ఆమె "నేను నాగలోక యువరాణిని. నా పేరు నాగిని. ప్రతీరోజూ నేనీ కోవెలలో అమ్మవారిని సేవించుకునేందుకు వస్తాను. ఓ రాజా! నీ మీది వలపుతో నా తలపులు నిండిపోయాయి. నన్ను స్వీకరించు" అంది తలవాల్చుకుని.

చండసింహుడు కార్పటికుణ్ణి దగ్గరకు పిలిచి, ఆమెతో "ఓ నాగిని! నీ ప్రేమను అంగీకరించలేనందుకు నన్ను మన్నించాలి. ఇతడు నా ప్రియమిత్రుడు. ఇతడు నిన్ను ప్రాణాధికంగా ప్రేమిస్తున్నాడు. ఇతడి ప్రేమను అంగీకరించు" అన్నాడు.

ఒక్కక్షణం నాగిని అయోమయంగా చూసింది. చండసింహుడు, కార్పటికుడి ప్రేమను స్వీకరించ వలసిందిగా ఆమెకు నచ్చచెప్పాడు. ఆమె కార్పటికుణ్ణి పెళ్ళాడేందుకు అంగీకరించింది.

చండసింహుడు "కార్పటికా! ఆ రోజు, వేట వినోదం నాడు, నీవు నాకు రెండు ఉసిరి ఫలాలనిచ్చి నా దప్పిక తీర్చి, నా ప్రాణాలు కాపాడావు. అందుకు ప్రత్యుపకారంగా... ఇదిగో ఈ యువతీ రత్నాన్ని నీకిస్తున్నాను. ఈమెతో జీవితాన్ని ఆనందించుదువుగాక!" అన్నాడు.

కార్పటికుడు తలవంచి రాజుకు నమస్కరించాడు. కాళికా దేవి సమక్షంలో వారిద్దరికీ వివాహం జరిపించి, చండసింహుడు నాగినీ కార్పటికుల వద్ద సెలవు తీసుకున్నాడు. మరోసారి అమ్మవారిని నమస్కరించి, ఆలయ ప్రాంగణంలోని బావిలో మునిగాడు. తక్షణం బ్రహ్మపురంలో తన రాజ సౌధం ముందు నిలబడి ఉన్నాడు.

కార్పటికుడు నాగినితో సుఖంగా ఉన్నాడు. చండసింహుడు సింహళ రాకుమారిని పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు.

భేతాళుడు ఈ కథ చెప్పి "విక్రమాదిత్య రాజేంద్రా! కార్పటికుడు, రాజు చండసింహులలో ఎవరు గొప్పవారు?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు వెన్నెల కురిసినట్లు చిరునవ్వు నవ్వాడు. "భేతాళా! విను! కార్పటికుడు తన యజమాని అయిన రాజుకు సేవ చేసాడు. మిగిలిన పరివారం అలిసిపోయినా, అతడు రాజు వెన్నంటే ఉన్నాడు. ఓ ప్రక్క రాజు రక్షణ బాధ్యత నిర్వహిస్తూ కూడా, దరిదాపుల్లో ఏమేమి ఉన్నాయోనని గమనిస్తూ అప్రమత్నంగానూ ఉన్నాడు. కాబట్టే దాపులనే ఉన్న ఉసిరి చెట్టునీ, సరస్సునీ గుర్తించగలిగాడు. అది అతడికి వృత్తిపట్ల గల నిబద్దత! అయితే అది అతడి వృత్తిధర్మం కూడా! ఆలికి అన్నం పెట్టడం ఊరినుద్దరించినట్లుకాదు. కాబట్టి - అతడి పని అతడు నెరవేర్చడం గొప్పకాదు.

అయితే రాజు చండసింహుడు కార్పటికుడి పట్ల చూపిన కృతజ్ఞత గొప్పది. ఎందుకంటే - కార్పటికుడు చేసిన సేవకే రాజతడికి జీతమిస్తున్నాడు. అయినా అతడి వృత్తి నిబద్దతని, సేవాధర్మాన్ని గ్రహించి, ప్రత్యుపకారం చేసాడు. లోక సహజంగా... ధనికులు, యజమానులు, రాజులు, సేవకుల నుండి సేవలు పొందుతూ ‘అందుకు తాము ధనం చెల్లిస్తున్నాం కదా!’ అనుకుని ఉదాసీనంగా ఉంటారు. అలా గాకుండా... రాజు చండసింహుడు, తన సేవకుడి పట్ల ప్రభుధర్మాన్ని నిర్వర్తించాడు. కాబట్టి చండసింహుడే గొప్పవాడు!" అన్నాడు.

భేతాళుడు అంగీకార సూచకంగా తలవూపుతూ, విక్రమాదిత్యుడి భుజం పైనుండి మోదగచెట్టు మీదికి ఎగిరిపోయాడు. విక్రమాదిత్యుడు వెనుదిరిగాడు.

కధావిశ్లేషణ: వీరవర్ధనుడు, కార్పటికుడు - రెండు కథలలోనూ, విక్రమాదిత్యుడు రాజు పాటించినదే గొప్ప ధర్మనిరతి అంటాడు. ధనలాలసలోనూ ధర్మనిరతి గుర్తించటం గొప్పవిషయమే కదా మరి!

కార్పటికుని కథ ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 35]

విక్రమాదిత్యుడు భేతాళుని బృహదారణ్యం వైపుకు మోసుకెళ్తుండగా, ఎప్పటి లాగానే భేతాళుడు మరో కథ ప్రారంభించాడు. ఇది, ఎనిమిదవ కథ!

ఒకప్పుడు చండ సింహుడనే రాజుండేవాడు. అతడు బ్రహ్మపురం అనే నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలు తుండేవాడు. అతడు మంచివాడు, ప్రతాపవంతుడు, తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలవాడు.

ఒకరోజు... కార్పటికుడు అనే యోధుడు రాజు వద్దకు వచ్చి, తన యోగ్యతలు వివరించి కొలువునివ్వ వలసిందిగా అభ్యర్ధించాడు. చండసింహుడికి కార్పటికుడి స్వరూప స్వభావాలు నచ్చటంతో, తన వ్యక్తిగత అంగరక్షకుడిగా అతణ్ణి నియమించాడు.

కార్పటికుడు రాజునెంతో భక్తిశ్రద్ధలతో సేవిస్తుండేవాడు. ఇలా ఉండగా... ఓ రోజు రాజు చండసింహుడు సపరివారంతో అడవికి వేటకెళ్ళాడు. రాజెక్కిన గుర్రం, సైనికుల గుర్రాల కంటే చురుగ్గా ఉంది. అది మెరుపు వేగంతో అడవిలోకి దూసుకెళ్ళింది. రాజు వెంట ఉన్న బృందంలో సైనికుల గుర్రాలు గానీ, మంత్రి తదితర అనుచరుల గుర్రాలు గానీ, దాని వేగాన్ని అందుకోలేక పోయాయి.

క్షణాల్లో రాజు ఎక్కిన గుర్రం అడవి మలుపుల్లో మాయమైంది. కొంత సేపటికి రాజు, తాను పరివారం నుండి దూరంగా వచ్చేసానన్న విషయాన్ని గ్రహించాడు. గుర్రాన్ని అదిలించి, దాని నియంత్రించాడు. వెనుదిరిగి చూస్తే... ఒక్క కార్పటికుడు తప్ప మరెవ్వరూ కనుచూపు మేరలో లేరు. అదీ కార్పటికుడు తన గుర్రాన్ని పరుగుతో అనుసరించి రావటం చూసి, రాజు చండసింహుడు అమితాశ్చర్య పడ్డాడు.

అయితే అప్పటికే అతడు డస్సిపోయి ఉన్నాడు. గుర్రం దిగి, ప్రక్కనే ఉన్న మర్రిచెట్టు నీడన కూలబడ్డాడు. దాహంతో నోరెండిపోయింది. కార్పటికుణ్ణి చూసి ‘దాహం’ అన్నట్లుగా సైగ చేశాడు.

అప్పటికి కార్పటికుడు చెమటలు గ్రమ్మి ఉన్నాడు. ఆయాసంతో రొప్పుతున్నాడు. అయినా గానీ, తన విద్యుక్త కర్తవ్యాన్ని మాత్రం మరిచి పోలేదు. రాజుకు అంగరక్షకుడిగా పరిసరాలని నిశితంగా పరిశీలించటం తన విధి. అందులో భాగంగా, అతడు దారి పొడుగునా పరిసరాలు గమనిస్తూనే వచ్చాడు.

రాజు విశ్రాంతికై కూర్చున్న మర్రి చెట్టుకు దాపులనే ఊసిరి చెట్టుండటం, కార్పటికుడు గుర్తించి ఉన్నాడు. రాజు ‘దాహం’ అనగానే పరిగెత్తుకు పోయి రెండు ఉసిరి కాయలు తెచ్చి రాజుకిచ్చాడు.

దాపులనే సరస్సుని గమనించి పరుగున పోయి ఆకుదొన్నెలో నీటిని తెచ్చి రాజుకిచ్చాడు. అప్పటికే ఉసిరి కాయాలతో నోరు తడి చేసుకున్న రాజు, నీరు త్రాగి సేదతీరాడు. రాజు స్థిమిత పడ్డాక, కార్పటికుడు వెళ్ళి సరస్సు నీటితో దాహం తీర్చుకుని వచ్చాడు. అప్పటికి రాజ పరివారం అక్కడికి చేరుకుంది.

కాస్సేపు సేద తీరి, అంతా రాజధానికి తిరిగి ప్రయాణమయ్యారు. రాజు కార్పటికుని విధి నిర్వహణకి ఎంతగానో ముగ్ధుడయ్యాడు. రాజధాని చేరాక, రాజు చండసింహుడు, కార్పటికుణ్ణి తన అంగరక్షక దళానికి అధిపతిగా చేసి సత్కరించాడు.

రోజులు గడుస్తున్నాయి. చండసింహుడు సింహళ రాజకుమారిని వివాహమాడదలిచాడు. ఆమె చాలా అందమైనదీ, తెలివైనదే గాక సుగుణశాలి అని అతడు విని ఉన్నాడు. దాంతో అతడు కార్పటికుణ్ణి పిలిచి, సింహళం వెళ్ళి ఇతర వివరాలు తెలుసుకు రమ్మన్నాడు.

కార్పటికుడు, ఓ వ్యాపారి దగ్గరికి వెళ్ళి, అతడి నౌకలో సింహళానికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకున్నాడు. (నేటి శ్రీలంకకు నాటి పేరు సింహళమే.) సముద్రయానం ప్రారంభమైంది. మార్గమధ్యంలో వారు పెను తుఫానులో చిక్కుకున్నారు. గాలివానలో వాళ్ళ నౌక చిగురుటాకులా ఊగిపోయింది. రాకాసి అలల్లో అల్లాడుతుంది. చివరికి ఓడ బద్దలైంది.

సముద్రపు నీళ్ళల్లో ఈదుతున్న కార్పటికుణ్ణి ఓ పేద్ద తిమింగలం అమాంతం మ్రింగేసింది. ఒరనున్న కత్తి తీసి, కార్పటికుడు, ఆ చేప కడుపును చీల్చుకుని బయటకు వచ్చాడు. అప్పటికి అతడికి కనుచూపు మేరలో ఓ దీవి కనపించింది.

ఈదుకుంటూ అతడా దీవి చేరుకున్నాడు. అక్కడ అతడికి అద్బుతమైన శిల్పకళతో అలరారుతున్న కాళికా దేవి ఆలయం కనబడింది. అతడు ఆలయం ప్రవేశించి, అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశాడు. తర్వాత ఆలయం ఆవరణలో శిల్పాలను చూస్తూ తిరగసాగాడు. అక్కడ ఓ పెద్ద మర్రివృక్షం ఉంది. దాని చుట్టూ అరుగు నిర్మించి ఉంది. శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ చెట్టు నీడలో, ఓ అందమైన యువతి వయ్యారంగా వాలి పడుకుని ఉంది.

ఆమె చుట్టు దాసీలున్నారు. చుక్కల్లో చంద్రుడిలా, సరస్సులో కలువలా... ఆమె, చెలుల మధ్య భాసిస్తోంది. ఆమె అందాన్ని చూడటానికి కార్పటికుడికి రెండు కళ్ళూ చాలలేదు. వర్ణించేందుకు మాటలు రాలేదు.

ఆమె నల్లని కురులు చీకటిని తలపిస్తూ చెలరేగుతున్నాయి. నునువైన శరీరంతో, తీర్చిదిద్దినట్లున్న ఒంపుసొంపులతో, దేవాలయ గోడల మీద ఉన్న శిల్పసుందరి, ప్రాణం పోసుకు వచ్చినట్లుంది. కార్పటికుడామెని చూడగానే ప్రేమలో పడి పోయాడు.

కాస్సేపలా ఆమెనే చూస్తూ నిలబడి పోయాడు. అది గమనించి, ఆమె చెలికత్తెలలో ఒకతె... అతడి దగ్గరి కొచ్చి ‘ఏమిటన్నట్లు’గా చూసింది. మరొకామె ‘ఇక దయచెయ్’ అన్నట్లుగా సైగ చేసింది. అతడు వాళ్ళద్దరినీ ప్రాధేయపడుతూ... తనకు వారి యజమానురాలిపై గల ప్రేమను వివరించి, తన ప్రేమ సందేశాన్ని ఆమె కందించమని ప్రార్ధించాడు.

ఏమనుకున్నారో ఏమో, ఆ చెలికత్తెలిద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళి, అతడి గురించి చెప్పారు. ఊపిరి బిగబట్టి అదంతా చూస్తున్నాడు కార్పటికుడు. ఆమె ఓ క్షణం అతడి వైపు తదేకంగా చూసింది. వీణ మీటినట్లున్న స్వరంతో "వెళ్ళి, ఆలయ ఆవరణలో ఉన్న బావిలో స్నానం చేసి రా!" అంది.

కార్పటికుడు ఆ దిగుడు బావిలోకి దిగి, స్నానం చేద్దామని బుడుంగున మునిగాడు. ఒక్క మునక వేసి పైకి తేలి చూస్తే... ఆశ్చర్యం! అతడు తన ఊరైన బ్రహ్మపురంలో రాజ ప్రసాదానికి ఎదురుగా నిలబడి ఉన్నాడు.
~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes