RSS
Wecome to my Blog, enjoy reading :)

విరిబోణి వివాహం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 28]

విక్రమాదిత్యుడు మరోసారి భేతాళుని బంధించి, భుజమ్మీద వేసుకొని నడుస్తుండగా, భేతాళుడు కథ ప్రారంభించాడు.

"విక్రమాదిత్యా! ఇది నేను నీకు చెబుతున్న కథలలో అయిదవది. సావధనుడవై విను" అంటూ కొనసాగించాడు.

ఒకానొకప్పుడు, సోమవేదిక అనే నగరముండేది. ఆ నగరాధీశుడి పేరు నీతివంశకేతు. [నీతే వంశపు జండాగా గలవాడు అని అతడి పేరుకు అర్ధం.] ఆ రాజెంతో మంచివాడు, సమర్ధుడు.

అతడు భద్రకాళీ భక్తుడు. తమ కులదేవతగా ఆ తల్లిని కొలిచేవాడు. అతడు భద్రకాళీ మాతకు గొప్ప ప్రాకారాలతో, గోపురాలతో కూడిన అద్భుత దేవాలయాన్ని నిర్మించాడు. బంగారు రధాన్ని, రత్నాభరణాలని సమకూర్చాడు. ప్రతీ ఏడాది, అమ్మ వారికి ఉత్సవాలు, పండుగలూ నిర్వహించేవాడు.

ఒక ఏడాది, సోమవేదిక లోని కాళీ మాత ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. చుట్టుప్రక్కల గ్రామాల నుండే గాక, ఎంతో దూరం నుండి కూడా, ఎందరో ప్రజలు ఆ జాతరకు వచ్చారు. అంతా కోలాహలంగా ఉంది. చిత్రవిచిత్ర వస్తువులు ప్రదర్శించేవాళ్ళు, అమ్మజూపేవాళ్ళు, రకరకాల తినుబండారాలు! అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు! ఇసుకవేస్తే రాలనంత మంది జనం ఉన్నారక్కడ! చెక్క భజనలు, కోలాటాలు, రంగుల రాట్నాలు, ఆట వస్తువులు... పానీయాలు... అరుపులూ కేకలు!

ఎక్కడ చూసినా జనమే! వాళ్ళల్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆమె పేరు విరిబోణి. [పువ్వువంటి సుకుమారమైన దేహం కలది అని ఆమె పేరుకు అర్ధం.] అక్కడికి యశోవంతుడనే యువకుడూ వచ్చాడు. [కీర్తిగలవాడని అర్ధం.] యశోవంతుడు విరబోణిని చూశాడు. తొలి చూపులోనే ప్రేమలో కూరుకుపోయాడు.

ఎలాగైనా ఆమెనే వివాహమాడాలని నిర్ణయించుకున్నాడు. ఆమె దృష్టిలో పడాలని, కొన్ని చిరుప్రయత్నాలు చేశాడు. లాభం లేకపోయింది. అతడు గుడిలోకి వెళ్ళి, అమ్మవారిని దర్శించుకొని "తల్లీ! భద్రకాళీ! నువ్వు భక్తుల పాలిట కల్పవల్లివి. మా కోర్కెలు తీర్చే అమ్మవు. అమ్మా! నే మనస్సు పడ్డ పిల్ల, నన్ను ప్రేమించేటట్లు, ఆమెతో నాపెళ్ళి అయ్యేటట్లు అనుగ్రహించు. అదే జరిగితే, ఓ తల్లీ! నా తల నీకు సమర్పించుకుంటాను. ఇదిగో నా తల కత్తిరించుకొని, నాదేహం నీ ముందు బలిపీఠంపై పెడతానని ప్రమాణం చేస్తున్నాను. దయ చూడగదే తల్లీ!" అని మొక్కుకున్నాడు.

తర్వాత యశోవంతుడు తన తల్లిదండ్రుల దగ్గరికి చేరి, వాళ్ళకి విరిబోణిని చూపించి, "అమ్మా!నాన్న! ఆ పిల్ల నాకు నచ్చింది. ఆమెతోనే నా పెళ్ళి జరిపించండి" అని చెప్పాడు. వాళ్ళకీ ఆ పిల్ల నచ్చింది. వాళ్ళు ఆ పిల్ల పేరూ, ఊరూ తల్లిదండ్రుల వివరాలు సేకరించారు.

జాతర ముగిసి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళాక, ఓ మంచిరోజు చూసుకుని, యశోవంతుడి తల్లిదండ్రులు ఇతర పెద్దల్ని తీసుకుని, విరిబోణి ఉండే గ్రామానికి వెళ్ళారు. విరిబోణి ఇంటికి వెళ్ళి, ఆమె తల్లిదండ్రులకి తమని తాము పరిచయం చేసుకున్నారు. ఆమాటా ఈమాటా అయ్యాక, తమ కుమారుడు యశోవంతుడికి విరిబోణి నివ్వాల్సిందిగా అడిగారు. విరిబోణి తల్లిదండ్రులకీ సంబంధం నచ్చటంతో అంగీకరించారు. అందరూ ఎంతో సంతోషించారు.

ఒక మంచి ముహుర్తాన... యశోవంతుడికీ, విరిబోణికీ వివాహం జరిగింది. బంధుమిత్రులంతా హాజరై వధువరులని దీవించారు. వివాహ విందు, ఉత్సవాలు ముగిసాక, విరిబోణి, సోమవేదికలోని అత్తగారింటికి కాపురానికి వచ్చింది. యశోవంతుడికి, భార్య విరిబోణితో జీవితం స్వర్గసమంగా ఉంది. విరిబోణి అందమైనదీ, మంచి ప్రవర్తన కలదీ కావటంతో, అందరి మనస్సులూ చూరగొంది. రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి.

ఈ విధంగా కొన్ని నెలలు గడిచాక, విరిబోణి తల్లిదండ్రులు, రానున్న పెద్దపండుగకి కూతుర్ని అల్లుణ్ణీ పిలిచి, కొన్నాళ్ళు ఇంట నుంచుకొని ఆనందించాలనుకున్నారు. వాళ్ళు తమ పెద్దకొడుకుని పిలిచి "నాయానా! నీవు సోమవేదిక పురానికి వెళ్ళి, నీ చెల్లెలైన విరిబోణిని, ఆమె భర్తనీ పిలుచుకు రా! రానున్న పండగకి ఇంట అల్లుడూ కూతురితో ఆనందంగా గడపాలని మా కోరిక" అన్నారు.

అతడు సరేనని సోమవేదిక చేరి, యశోవంతుడికీ, అతడి తల్లిదండ్రులకీ తమ ఆహ్వానం అందించాడు. వాళ్ళూ పండుగకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. అత్తగారింటికి బయలుదేరే లోపల, రాక రాక వచ్చిన బావమరిదికి, పట్నంలోని వింతలూ విశేషాలూ చూపించాలనుకున్నాడు యశోవంతుడు. ఊరంతా తిప్పి చూపించాడు.

ప్రయాణానికి ముందు రోజున... యశోవంతుడు, భార్యనీ, బావమరిదినీ వెంటబెట్టుకొని భద్రకాళి కోవెలకి వెళ్ళాడు. పూజాదికాలు ముగించుకున్నాక, ఆలయ ఆవరణలో ఓ చెట్టు క్రింద కూర్చున్నారు.

యశోవంతుడు "ఒక్క నిముషం! భద్రకాళీ తల్లికి మొక్కటం మరిచి పోయాను. ఇప్పుడే వస్తాను" అని చెప్పి గుడిలోకి వెళ్ళాడు.

ఆలయంలోకి వెళ్ళిన యశోవంతుడు, ఆ తల్లి ముందు నిలబడి "ఓ కాళీ మాతా! నేను కోరినట్లే విరిబోణితో నాపెళ్ళి జరిపించావు. తల్లీ! నా మాట నిలబెట్టుకుంటాను. ఇదే నా తలనిచ్చుకుంటున్నాను నీకు!" అంటూ... అమ్మవారి విగ్రహానికి ఎదురుగా ఉన్న మర్రిచెట్టు కొమ్మకి తన జుట్టు కట్టుకున్నాడు. బొడ్డున దోపుకున్న కత్తి తీసుకుని, తన దేహం అమ్మవారి ముందున్న బలిపీఠం మీద పడేటట్లుగా తల నరుక్కున్నాడు. రక్తం ధార గడుతూ అతడి తల చెట్టు కొమ్మకు వ్రేలాడుతోంది.

~~~~~~~~~

జ్ఞాని, సూత్రజ్ఞుడు, శూరుడు - ఎవరు గొప్ప?[భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 27]

విక్రమాదిత్యుడు మళ్ళీ మోదుగ వృక్షాన్ని చేరాడు. అప్పటికే భేతాళుడు శవరూపంలో ఆ చెట్టు కొమ్మకి తల్లక్రిందులుగా వ్రేలాడుతున్నాడు. ఒక్క క్షణం విక్రమాదిత్యుడికి ఆశ్చర్యం వేసింది. అయినా ప్రయత్నం విడిచిపెట్టలేదు. మరోసారి చెట్టెక్కి శవాన్ని దించి భుజమ్మీద వేసుకుని బృహదారణ్యంకేసి నడక ప్రారంభించాడు.

యధాప్రకారం, భేతాళుడు కథ ప్రారంభిస్తూ "విక్రమాదిత్య మహారాజా! ముందు కథ విను" అంటూ కొనసాగించాడు.

పూర్వకాలంలో మచ్చిలి అనే పట్టణం ఒకటి ఉండేది. అక్కడ అర్జునస్వామి అని ఓ ప్రముఖ బ్రాహ్మణుడుండే వాడు. అతడికొక కుమార్తె. ఆమె ఎంతో అందమైనది, అణకువ కలిగినది.

అర్జునస్వామి కుమర్తెని కంటికి రెప్పవలె కాపాడుతూ, ప్రేమగా పెంచాడు. ఒక రోజు వారి పట్టణానికి, ముగ్గురు బ్రాహ్మణ యువకులు వచ్చారు. వాళ్ళు అర్జునస్వామి కుమార్తె యొక్క అందం గురించి, మంచితనం గురించి విన్నారు.

అర్జునస్వామిని కలిసి కన్యాదానం చెయ్యమని అడిగారు. అర్జునస్వామి, వారిలో ఒకరికి తన బిడ్డనిచ్చి పెళ్ళి చెయ్యగలనన్నాడు. అంతలో అక్కడికి ఓ రాక్షసుడొచ్చాడు. అమాంతం ఆ బ్రాహ్మణుడి కుమార్తెని అపహరించుకు పోయాడు.

ఆమె తల్లిదండ్రులైన అర్జునస్వామి, అతడి భార్య గుండెలు బాదుకుని ఏడ్చారు. ముగ్గురు యువకులకు కూడా చాలా దుఃఖం కలిగింది.

వారిలో మొదటి వాడి పేరు జ్ఞాని. రెండవ వాడి పేరు సూత్రజ్ఞుడు. మూడవ వాడి పేరు శూరుడు. ముగ్గురూ కూడా సార్ధక నామధేయులు. జ్ఞాని ధ్యానంలో కూర్చుని, మనస్సుని ప్రపంచమంతా అన్వేషించేందుకు నియోగించాడు. జ్ఞాన నేత్రంతో ప్రపంచంలో తాను కోరుకున్న ఏ ప్రదేశాన్నైనా దర్శించగల విద్య అతడికి తెలుసు. (ఇప్పటి మన లైవ్ టెలికాస్ట్ చెయ్యగల ఎక్విప్డ్‌వ్యాన్ కున్న శక్తి వంటిదన్న మాట.)

ఆ శక్తితో జ్ఞాని (మొదటి యువకుడు) రాక్షసుడి నివాసం ఎక్కడో తెలుసుకుని, చెప్పాడు. రెండవ యువకుడు సూత్రజ్ఞుడు (అంటే అన్ని సూత్రాలు తెలిసిన వాడని అర్ధం.) తన విద్యాపరిజ్ఞానంతో ఒక రధాన్ని నిర్మించాడు. (ఇప్పటి మన ఇంజనీర్ల మాదిరిగా నన్న మాట.)

"ఈ రధం నేలమీద, నీటి మీద, గాలిలో కూడా మన ఆజ్ఞాననుసరించి ప్రయాణించగలదు. ఈ రధం మీద వెళ్ళి, ఆమెని కాపాడగల వారున్నారా? నేను రధాన్ని నిర్మించగలను గానీ, రాక్షసుణ్ణి యెదిరించలేను" అన్నాడు.

జ్ఞాని కూడా "నేను రాక్షసుడుండే చోటు గురించి చెప్పగలనే గానీ, అక్కడికి వెళ్ళి రాక్షసుడితో పోరాడలేను" అన్నాడు.

మూడవ యువకుడైన శూరుడు "ఓ సూత్రజ్ఞా! నేను వెళ్ళగలను. ఈ రధాన్ని యెలా నడిపించాలో నాకు తెలియజెయ్యి" అన్నాడు. సూత్రజ్ఞుడు శూరుడికి రధాన్ని నడిపించే విధివిధానాలని వివరించాడు. జ్ఞాని రాక్షసుడి నివాసం గురించిన ఆనవాళ్ళన్ని చెప్పాడు.

శూరుడు తన ఆస్త్ర శస్త్రాలన్నిటినీ తీసుకుని, కవచధారియై రధం యెక్కాడు. యెకాయకి రాక్షసుడి నివాసం చేరి, రాక్షసుడితో తలపడ్డాడు. హోరాహోరీ జరిగిన ఆ పోరులో చివరికి రాక్షసుణ్ణి హతమార్చాడు. అర్జునస్వామి కుమార్తెని రధమెక్కించుకొని మచ్చిలి పట్టణానికి తిరిగి వచ్చాడు. అందరూ ఎంతగానో ఆనందించాడు.

భేతాళుడీ కథ చెప్పి "ఓ ఉజ్జయినీ రాజ్యాధిపతీ! విక్రమాదిత్య మహారాజా! నువ్వు చెప్పు! జ్ఞాని, సూత్రజ్ఞుడు. శూరుడు... ఈ ముగ్గురు బ్రాహ్మణ యువకులలో, ఎవరు అర్జునస్వామి కుమార్తెని వివాహమాడేందుకు అర్హులు?" అనడిగాడు.

విక్రమాదిత్యుడు "ఓ భేతాళా! జ్ఞానీ, సూత్రజ్ఞుడు... ఇద్దరూ తమతమ జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని, విద్యలనీ ఉపయోగించి ఆ యువతిని కాపాడారు. అయితే ప్రమాదపు దరిదాపులకి పోలేదు. కానీ, శూరుడు తన ప్రాణాలను ఫణంగా పెట్టి, రాక్షసుడితో పోరాడి ఆమెని కాపాడాడు. కాబట్టి అతడే ఆమెని వివాహమాడటానికి అర్హుడు" అన్నాడు.

ఎప్పుడైతే విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పాడో, ఆ క్షణమే భేతాళుడు మాయమయ్యాడు.

కథ విశ్లేషణ:

ఈ కథలో... జ్ఞాని, సూత్రజ్ఞుల విద్యాకౌశలమూ గొప్పవే! జ్ఞానంతో, సూత్రజ్ఞత(అంటే సాంకేతికత!)తో ఎన్నో విషయాలు కనిపెట్టవచ్చు. టీవీ, కంప్యూటర్, రాకెట్, శాటిలైట్... ఇలా ఎన్నో వస్తువుల్ని కనిపెట్టవచ్చు. కానీ వారికంటే ధైర్యవంతుడు గొప్పవాడు. జ్ఞానం, టెక్నాలజీల కంటే ధైర్యం గొప్పది. ధైర్యం ఉన్నవాడు... లక్ష్యం కోసం ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టగలడు. ధైర్యం ఉన్నవాడు... సత్యాన్ని చూడగలడు, సత్యాన్ని పలక గలడు, సత్యం కోసం జీవించగలడు.

ఎంత తెలివితేటలున్నా, ఎంత శాస్త్రసాంకేతిక ప్రతిభా సామర్ధ్యాలతో పాటు, కళాకౌశాలాలు ఉన్నా, ధైర్యం లేకపోయినట్లయితే, అలాంటి వాళ్ళు... డబ్బున్న వాణ్ణి చూసో, బలమున్న వాణ్ణి చూసో... భయపడిపోయి, బానిస బ్రతుకు కయినా సిద్ధపడతారు. అంతేగానీ, ఎదురుతిరిగి పోరాడరు.

కాబట్టి... తెలివితేటల్ని, ప్రతిభాసామర్ధ్యాలని తక్కువ చేయరాదు గానీ, వాటితో బాటు, వాటికంటే ఎక్కువగానూ... ధైర్యాన్ని అలవరుచుకోవాలనీ, ధైర్యవంతుడే కథానాయకుడనీ ఈకథ పిల్లలకి చెబుతుంది. వాళ్ళల్లో ధైర్యశౌర్యాల్ని ప్రేరేపిస్తుంది.

ఎవరు గొప్ప నిపుణులు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 26]

విక్రమాదిత్యుడు మోదుగ చెట్టు చేరి, పైకెక్కి శవాన్ని దించి భుజాన వేసుకుని, మౌనంగా బృహదారణ్యం కేసి నడవసాగాడు.

భేతాళుడు, ప్రతాపవంతుడైన విక్రమాదిత్యుణ్ణి చూసి "ఓ రాజా! విక్రమాదిత్యా! నీకు మరో కథ చెబుతాను. మౌనంగా విను" అని ఇలా చెప్పసాగాడు.

ఒకానొకప్పుడు అంగనం అనే పట్టణ మొకటి ఉండేది. అక్కడ ఆది విష్ణువనే బ్రాహ్మణుడుండేవాడు. అతడికి ముగ్గురు కుమారులు. వాళ్ళు అన్ని విద్యలతో పాటు కొన్ని ప్రత్యేక కళలూ, నైపుణ్యాలూ నేర్చారు.

ముగ్గురు యువకులూ ఆ నగరాధిపతి యోగదాసుడి కొలువులో చేరదలిచి రాజాస్థానానికి వెళ్ళారు. తమని తాము రాజుకు పరిచయం చేసుకున్నారు. రాజు వాళ్ళని "మీ విశిష్టతలేమిటి?" అని అడిగాడు.

అందరిలోకి పెద్దవాడు "మహారాజా! నేను తిండి సుఖమెరుగుదును. నేను తిన్న వాటి నాణ్యాతానాణ్యతలను వివరించగలను" అన్నాడు.

మధ్యవాడు "మహాప్రభు! నేను స్త్రీ సుఖమెరుగుదును. నాతో గడిపిన స్త్రీ బాగోగులని విశ్లేషించగలను" అన్నాడు.

చివరివాడు "రాజ రాజా! నేను నిద్రాసుఖమెరుగుదును. తల్పముల లోటుపాట్లని తెలియజేయగలను" అన్నాడు.

రాజుకి ఎంతో ఆశ్చర్యం కలిగింది. వారి కౌశలాన్ని పరీక్షించాలన్న కుతూహలం కలిగింది. తన ఆస్థాన పురోహితుణ్ణి పిలిచి, మొదటి వాడికి రకరకాల పిండి వంటలతో షడ్రసోపేతమైన భోజనం పెట్టమన్నాడు.

అతడు భుజించి వచ్చాక, రాజు అతడితో "ఓ యువకుడా! ఇప్పుడు నీవారగించిన భోజనం యొక్క విశేషమేమిటి?" అని అడిగాడు. దాని కతడు "మహారాజా! నవకాయ పిండి వంటలతో, రుచి శుచి గల ఆహారాన్ని వడ్డించారు. అయితే నేను ఆరగించిన శాల్యోదనం (వరి అన్నం) మాత్రం, శ్మశానపు మట్టి రంగు, రుచీ, వాసనా కలిగి ఉంది" అన్నాడు.

రాజు విచారించగా, ఆ బియ్యం పండిన పొలానికి ఎరువు, శ్మశాన భూమి నుండి పంపబడిందని తేలింది. రాజుకి అతడి ప్రతిభని చూసి ఆశ్చర్యం కలిగింది.

రాజు, తన ఆస్థాన నాట్యశాలలో నాట్యకత్తె, అద్భుతమైన అందగత్తె అయిన వేశ్య నొకామెని పిలిచి, ఆ రాత్రికి ముగ్గురు సోదరులలో మధ్యవాణ్ణి ఆదరించమని ఆజ్ఞాపించాడు.

మరునాటి ఉదయం రాజు మధ్యవాడితో "ఓ యువకుడా! రాత్రి నీవు మా ఆస్థాన నర్తకీమణులలో ఒకామెతో గడిపినావు కదా? నీ విశ్లేషణ ఏమిటి?" అని అడిగాడు.

మధ్యవాడు "మహారాజా! ఆమె అద్భుత సౌందర్యవతి, సంగీత నాట్యాల తెలిసిన నైపుణ్యవతి. కానీ, ఆమె సాంగత్యం గొర్రె కంపు కొట్టినది" అన్నాడు చటుక్కున!

రాజుకు చురుక్కుమంది. నర్తకీమణి పూర్వాపరాలను విచారించగా, ఆమె గొర్రెల కాపరుల ఇంట పుట్టినదని తేలింది. రాజుకి దిగ్ర్భాంతి కలిగింది.

అతడు, ముగ్గురిలో చివరి సోదరుణ్ణి పిలిచి, ప్రత్యేక పంకం మీద పవళించవలసిందిగా ఆజ్ఞపించాడు. అది హంసతూలికా తల్పం! దానిపైన ఏడు పరుపులు పరచబడ్డాయి. హంస, నెమలి వంటి పక్షులు ఈకలలో ఈనెలు తీసేసి, దూదితో కలిపి తయారు చేయబడిన, దిండ్లూ పరుపులవి. వాటిపైన పట్టు దుప్పట్లు పరిచారు. పాలనురగలా మెత్తగా... పరిమళద్రవ్యాలతో మత్తుగా... ఉన్న పడక మీద నిద్రకుపక్రమించాడు విప్ర యువకుడు.

మరునాటి ఉదయం రాజు అతణ్ణి "ఈ శయ్యపై నీవు పొందిన నిద్రాసుఖం ఎలా ఉంది?" అని అడిగాడు. దానికతడు "మహారాజా! ఈ పడక పై నిద్రతో, నా ఒళ్ళంతా ఒకటే నొప్పులు సంభవించాయి!" అన్నాడు.

రాజు సేవకులని పిలిచి, పడకంతా పరీక్షించమన్నాడు. సేవకులా పని చేస్తుండగా తాను స్వయంగా పర్యవేక్షించాడు. ఆ మంచం మీద పరచిన ఏడు పరుపులు అడుగున, ఓ పొడవాటి వెంట్రుక ఉంది. రాజు విస్మయంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.

ముగ్గురు యువకుల ప్రతిభా నైపుణ్యాలు అతడికెంతో ఆనందం కలిగించాయి. వారికి తన ఆస్థానంలో తగిన స్థానాలిచ్చి సత్కరించాడు.

భేతాళుడీ కథ చెప్పి ఇలా అడిగాడు.

"ఓ విక్రమార్క మహారాజా! ముగ్గురు బ్రాహ్మణ యువకులలో ఎవరు గొప్ప ప్రతిభావంతులు? ఎవరి నైపుణ్యం విశిష్టమైనది? వివరించి చెప్పు!" అన్నాడు.

విక్రమాదిత్యుడు "భేతాళా! మొదటి సోదరుడు భోజన సుఖం తెలిపాడు. రెండవ వాడు తాను ఆనందించిన స్త్రీ గురించి వివరించాడు. ఈ ఇద్దరూ కూడా, తాము జాగృదావస్థలో ఉన్నప్పుడు తమ అనుభవాలని గుర్తించి, వివరించారు. మూడవ వాడు నిద్రావస్థలో ఉండి కూడా తన సుషుప్తి అనుభవంలోని బాగోగులని విశ్లేషించాడు. కాబట్టి ముగ్గురిలో మూడవవాడు నైపుణ్యమే మరింత విశిష్టమైనది" అన్నాడు.

విక్రమాదిత్యుడి వివేకపూరితమైన సమాధానానికి భేతాళుడు ముగ్ధుడయ్యాడు. అయినా మౌనానికి భంగం ఏర్పడినందున, తక్షణమే విక్రమాదిత్యుడి భుజం మీద నుండి మాయమై, మోదుగ చెట్టు మీద ప్రత్యక్షమయ్యాడు.

ఇది ఊహించినందున, విక్రమాదిత్యుడు వెనుదిరిగి శ్మశానం వైపు అడుగులేసాడు.

కథ విశ్లేషణ:

ఆహార నిద్రా మైధునాలు... ఏ ప్రాణికైనా ప్రాధమిక అవసరాలు! వాటి బాగోగులు తెలుసుకోవటంలో ఈ ముగ్గురు సోదరులూ నిష్ణాతులు. సాధారణంగా.... ఎప్పుడూ ఎక్కడా వినబడని, కనబడని ప్రజ్ఞలివి. ఇలాంటి కథలు విన్నప్పుడు, వాళ్లలానే ఏవైనా ప్రత్యేక విద్యలు, ఎవరికీ తెలియనివి, అరుదైనవీ నేర్చుకోవాలనే ఉత్సాహం పిల్లల్లో కలుగుతుంది. అది గొప్ప ప్రయోజనం కదా!

ప్రపంచంలో మరెవ్వరూ గుర్తించనంతగా మన పూర్వీకులు, కళలని 64 గా గుర్తించారు. ఇవి గాకుండా కూడా, ఇంకా చాలా కళలున్నాయి. అలాంటివే ఈ కథలోని బ్రాహ్మణ యువకులు చూపించేవి. సాధన చేస్తే మన పనిలో, దైనందిన జీవితంలో ఇలాంటి ఎన్నో నైపుణ్యాలు సాధించవచ్చు.

ఇప్పుడు కార్పోరేట్ ప్రపంచంలో... టీ, మద్య తయారీ సంస్థల్లో టేస్టర్స్ ప్రతిభ, కథలోని మొదటి యువకుడి సునిశిత నైపుణ్యం వంటిదే!

ఇక్కడ మీకు కొన్ని చిన్న ఉదాహరణలు ఇస్తాను.

మా వారి చిన్నప్పుడు వాళ్ళ పొరుగింట్లో ఒకామె ఉండేది. ఆమెకి రోజు సినిమా (11 గంటలకు ఉదయపు ఆట) చూడటం వ్యసనం. పనులన్నీ ముగించుకొని, కిరోసిన్ స్టౌలో సరిగ్గా అన్నం ఉడకటానికి కావలసినంత కిరోసిన్ మాత్రమే పోసి, అన్నం పెట్టి సినిమాకెళ్ళి పోయేది. (అప్పటికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు సరికదా, గ్యాస్, ప్రెషర్ కుక్కర్ కూడా అందరికీ అందుబాటులో ఉండేవి కావు.) ఆవిడ సినిమా చూసి తిరిగి వచ్చేసరికి, సరిగ్గా అన్నం ఉడికి కూర్చునేది. స్టౌ ఆరిపోయి ఉండేది. కాకపోతే వత్తులూ కాలిపోతాయి. వత్తులు కొంచెం పైకిలాగి, మళ్ళీ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.

అంత ఖచ్చితంగా కిరసనాయిల్ పరిమాణాన్ని లెక్కంచగల ఆమె నేర్పు ఆశ్చర్యం కలిగించేది.

అలాగే గుంటూర్లో మేం ఉప్పులూ పప్పులూ కొనే కిరాణా దుకాణం ఒకటి ఉండేది. వాళ్ళ షాపుకు వచ్చే కస్టమర్ ఒకతను లాయర్ ఉండేవాడు. అతడు ఎప్పుడు ఉల్లిపాయలు ఏరినా తూకం వేస్తే సరిగ్గా కిలో ఉండేవి. ఒక్క పాయ వెయ్యాల్సిన అవసరంగానీ తియ్యాల్సిన అవసరం గానీ వచ్చేది కాదు.

వీళ్ళు భట్టి విక్రమార్క కథలు చదివారో లేదో నాకు తెలియదు కాని, ఇలాంటి అనుభవాలు నాకూ ఉన్నాయి.

నా 11వ ఏట భట్టి విక్రమాదిత్య కథలు మొదటి సారి చదివాను. అప్పటి నుండి, ఎందరికి చెప్పి ఆనందించానో! అవి చదివినప్పటి నుండి విక్రమాదిత్యుడు నా రోల్ మోడల్! అతడిలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి కావాలని కలలు కనేదాన్ని!

ఈ సంఘటన జరిగినప్పుడు నాకు 15-16 ఏళ్ళుంటాయి. పదవతరగతి పరీక్ష వ్రాసేసి, వేసవి సెలవులని ఆనందిస్తున్నాను. ఓ రోజు రాత్రి రెండు గంటల దాకా ఏదో పెయింటింగ్ వేసి పండుకున్నాను. ఆ రీత్యా మర్నాటి మధ్యాహ్నం బాగా నిద్ర పోతున్నాను.

అప్పుడు మా వీధికి బంగారు నగలకి మెరుగు పెడతానంటూ.... ఎవరో ఒకతను వచ్చాడు. మా పొరుగింటి వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు కూడా, అతడి మాయ మాటల బుట్టలో పడ్డారు. మా ఇంటి వరండాలోనే అతడు సరంజామా అంతా సర్దుకొని పని ప్రారంభించాడు. మా అమ్మగాజులు, మా ప్రక్కింటామె గొలుసు గట్రాలకు మెరుగు పెట్టాడు. నిద్రపోతున్న నన్ను కుదిపి లేపి, నా గొలుసు ఇమ్మన్నారు. నిద్రమత్తులోనే గొలుసు తీసి ఇచ్చి మళ్ళీ నిద్రపోయాను. అతడు మెరుగు పెట్టాడు. అందరి కళ్ళ ఎదుటే పనంతా పూర్తి చేసి, కూలి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు.

నిద్రలేచాక నా గొలుసు నాకిచ్చింది మా అమ్మ. మెడలో వేసుకున్న వెంటనే నేను "ఇది నా గొలుసు కాదు" అన్నాను.

"ఠాఠ్! అతడు మా కళ్ళ ఎదుటే పని చేసాడు. అందరం ఎక్సరే కళ్ళతో కాపలా కాసాం. అతడు గొలుసు మార్చే అవకాశమే లేదు. ఇది నీ గొలుసే!" అన్నారు అమ్మానాన్న.

నా గొలుసు 24 గ్రాముల బరువుంటుంది. అప్పట్లోనూ, ఇప్పడంతగాక పోయినా, ఆ రోజులకి బంగారం ఖరీదే! నేను "గొలుసులో ఏదో మార్పుంది. ఇది నాది కాదు" అని గట్టిగా వాదించాను.

దాంతో అనుమానం వచ్చి మా నాన్న, మాకు నమ్మకంగా నగలు అమ్మే బంగారు నగల దుకాణానికి తీసికెళ్ళి, నగను పరిక్షించమన్నాడు. నగ తూకంలో తేడా వచ్చింది. నాలుగు గ్రాముల బంగారం తరుగువచ్చింది. మా అమ్మ గాజులు, ప్రక్కింటి వారి నగలూ కూడా అంతే! చూసుకుంటే దాదాపు సవరు బంగారం నష్టపోయాము.

నిస్సహాయతతో కూడిన కోపంతో మా నాన్న, "రాత్రంతా అడ్డమైన పుస్తకాలు చదువుతూనో, పిచ్చి బొమ్మలు వేసుకుంటూనో మేలుకోవడం, పగలు నిద్రపోవటం! మేలుకుని ఉంటే, చదువుకుంటున్న పిల్లవి, వాడి మోసం పసిగట్టే దానివి కదా?" అంటూ నన్ను చెడామడా తిట్టేసాడు. ఏంచేస్తాను? గమ్మున ఊరుకున్నానను కోండి.

కొన్ని రోజుల పోయి, కోపం తగ్గాక, అంత తక్కువ బరువు తేడా కనిపెట్టిన నన్ను, నా పరోక్షంలో మెచ్చుకున్నాడు. బంగారం పోయినందుకు బాధపడినా, నా సునిశిత పరిశీలనా నేర్పు పట్ల నాన్న ప్రశంస, నాకెంతో సంతోషం కలిగించింది.

అప్పుడే కాదు... మా బ్యాటరీ తయారీ సంస్థలో, మిక్సింగ్ యంత్రంలో లెడ్ ఆక్సైడు, పెరాక్సైడు, యాసిడ్ గట్రాలు కలిపి మిశ్రమం తయారు చేస్తాం. దాన్ని లెడ్ గ్రిడ్ కు అంటించి ఎలక్ట్రోడ్స్ (బ్యాటరీ ప్లేట్లు)ని తయారు చేస్తాం. అప్పుడు మిక్స్ అయిన కెమికల్‌ని చెక్కతో చేసిన ఘనంలో cm3 ఉన్న రంధ్రం చేసి అందులో కెమికల్ నింపి, సెన్సిటివ్ బ్యాలెన్స్‌తో బరువు కొలుస్తాం. అది 100 గ్రాములకు 5 గ్రాములు అటుఇటుగా ఉన్నా, మిక్సింగ్ సరిగ్గా ఉన్నట్లే! సరిగ్గా 100 గ్రాములు ఉంటే ఆ బ్యాచ్ ప్లేట్లు మరింత నాణ్యతతో ఉన్నట్లన్న మాట. దాన్ని crucible weight అంటాం.

ఆ క్రమంలో... మా ఫ్యాక్టరీలో వర్కర్స్, కెమికల్స్ మిక్చ్ చేసాక, క్రూసిబుల్ తీసుకొని నా దగ్గరికి వచ్చేవాళ్ళు. సరిగ్గా మిక్స్ అయ్యిందో లేదో పరిశీలించమని! దాన్ని తాకి స్పర్శతో, బొటన వేలు చూపుడు వేలు మధ్యా చిదిపి ధ్వనితోనూ కూడా well mixingని గుర్తించవచ్చు. ఆ విధంగా చెక్ చేసాక, క్రూసిబుల్ వెయిట్‌ని చేతిలోకి తీసుకోగానే అది 100 గ్రాములకి ఎంత ఎక్కువ లేదా తక్కువ ఉండగలదో చెప్పేసేదాన్ని! తర్వాత సెన్సిబుల్ బ్యాలెన్స్‌తో తూకం వేస్తే ఖచ్చితంగా అంతే ఉండేది. మా తమ్ముళ్ళు ఆశ్చర్యంగా అడిగే వాళ్ళు, అంత ఖచ్చితంగా ఎలా చెబుతావని. "జాగ్రత్తగా పరిశీలిస్తూ పోతే అదేం బ్రహ్మవిద్య కాదు" అనేదాన్ని!

పరిశీలించాలే గానీ ప్రతి మనిషిలోనూ... ఎన్నో నేర్పులూ, నైపుణ్యాలు!

అయితే ఇలాంటి కథలు, అలాంటి నైపుణ్యాల గురించి పిల్లల్ని ఉత్తేజితుల్ని చేస్తాయి, నైపుణ్యాలు సాధించాలనే వైపు ప్రోత్సహిస్తాయి. కథల పరమార్ధం పిల్లల్ని అలా తీర్చిదిద్దటమే కదా!

మంత్రవాది కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 25]

విక్రమాదిత్యుడు మళ్ళీ మోదుగు చెట్టెక్కి, తల్లక్రిందులుగా వేలాడుతున్న శవాన్ని దించి, భుజాన వేసుకుని బృహదారణ్యంలోని భద్రకాళి దేవాలయం కేసి నడవసాగాడు.

శవంలోని భేతాళుడు "ఓ విక్రమాదిత్య మహారాజా! నీకొక కథ చెబుతాను. దాని మీద ఓ ప్రశ్న వేస్తాను. నాకు జవాబు చెప్పకు. అప్పుడు నేను నీకు వశుడౌతాను. నీ బంటునై నీవు చెప్పిన పనులు చేస్తాను. కానీ జవాబు తెలిసీ చెప్పక పోయావో, నీ తల వేయి వక్కలు కాగలదు. తస్మాత్ జాగ్రత్త!" అని కథ చెప్పటం మొదలెట్టాడు.

బ్రహ్మచక్రం అనే ఊరిలోని బ్రాహ్మణ అగ్రహారంలో జటా గోపుడనే విప్రుడుందేవాడు. అతడి కొక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె అందాల బరిణె. (అందమంతా తెచ్చి ఓ చిన్ని బరిణె(డబ్బీ)లో పోసినట్లుందన్న మాట.) సుగుణాల రాశి. ఆ అమ్మాయి పేరు మృదుభాషిణి. (మృదువైన తీయని మాటలు మాట్లాడునది అని అర్ధం.) పేరుకు తగ్గట్టే ఆ పిల్ల మాట తీరు, నడవడిక ముగ్ధ మనోహరంగా ఉండేవి.

అందచందాలకు, ప్రవర్తనకు ఆమెకున్న మంచిపేరు తెలిసి, ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఆమెని పెళ్ళాడ గోరి వచ్చారు. ఒకడు ఆమె తండ్రియైన జటాగోపుణ్ణి కలిసి కన్యాదానం చెయ్యమని అర్ధించాడు. జటాగోపుడు సరేనన్నాడు.

మరొకడు ఆమె తల్లి, ఏటి నుండి నీళ్ళు తెస్తుండగా కలిసి, కాళ్ళ మీద పడి పిల్లనివ్వమని అడిగాడు. అతడి వినయ సౌశీల్యసౌందర్యాలు నచ్చి, ఆమె అలాగేనంటూ మాట ఇచ్చింది. మూడో వాడు, ఆ పిల్ల అన్నను కలిసి ప్రాధేయపడ్డాడు. అతడి స్నేహిశీలం, కలుపుగోలు తనం, మృదౌభాషిణి సోదరుడికి తెగ నచ్చేసాయి. దాంతో తన చెల్లెలిని అతడి కిచ్చి పెళ్ళి చేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చాడు.

తీరా ఇంటికొచ్చి విషయం ముగ్గురికీ తెలిసాక, ఎవరికి వాళ్ళే, తమ మాటే నెగ్గాలని దెబ్బలాడుకోసాగారు. ఎవరికి వారికీ తమ మాటే చెల్లాలని, తము నిర్ణయించిన వాడికే మృదుభాషిణినిచ్చి పెళ్ళి చెయ్యాలనో పంతం హెచ్చింది.

ఇదంతా చూసిన సున్నిత మనస్కురాలైన మృదుభాషిణి చాలా ఆందోళనకూ, ఆవేదనకూ గురయ్యింది. ఎంతో వ్యధకు గురై మరణించింది. అమ్మ నాన్న అన్నలలో బాటు, ఆమె గురించి తెలిసిన ఊరి వాళ్ళు కూడా ఎంతో దుఃఖించారు.

ఆమె భౌతిక కాయాన్ని శశ్మానానికి తీసుకు వెళ్ళి, హిందూ సాంప్రదాయ ప్రకారం చితి పేర్చి దహనం చేశారు. ఆమెని పెళ్ళాడగోరి వచ్చిన బ్రాహ్మణ యువకులు ముగ్గురూ కూడా ఎంతో దుఃఖించారు.

వారిలో ఒకడు... మృదుభాషిణి చితి లోంచి కొంత బూడిదనీ, ఎముకలనీ తీసుకుని కాశీ నగరానికి బయలు దేరాడు. కాశీ క్షేత్రంలో అన్నపూర్ణా విశ్వేశ్వర స్వాములని దర్శించి, ఆమె కోసం ప్రార్ధించాలనుకున్నాడతడు.

మరొకడు... మృదుభాషిణి మరణంతో మనస్సు విరిగి, ఇహలోక బంధాలెంత అశాశ్వతమో ఆలోచిస్తూ, శ్మశానవైరాగ్యం కొద్దీ దేశాటనకు బయలు దేరాడు. మూడోవాడు... కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూ శ్మశానంలోనే కూలబడ్డాడు.

దేశాటనకి బయలు దేరిన రెండవ వాడు చిత్తమొచ్చినట్లు తిరగసాగాడు. ఆ పర్యటనలో ఓ రోజు ఓ గ్రామం చేరాడు. ఎండ మండుతోంది. మధ్యాహ్నమైంది. ఒక బ్రాహ్మణ గృహం చూసుకుని ఆ పూటకి ఆశ్రయం అడిగాడు. ఆ ఇంటి వాళ్ళు అతడిని అతిధిగా అంగీకరించి స్వాగతించారు.

ఆ యింటి పెరటిలో బావి దగ్గర స్నానం చేసి, మామిడి చెట్టు క్రింది గట్టు మీద అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. గృహస్తుల వంటగది అతడికి కనిపిస్తూనే ఉంది.

ఆ ఇంటి ఇల్లాలు వంట చేస్తూ ఉంది. వారింట సంవత్సరపు బిడ్డడున్నాడు. దోగాడుతూ వచ్చి తల్లిని మాటికీ విసిగిస్తున్నాడు. గిన్నెలన్నీ లాగుతున్నాడు. తల్లి చీర కుచ్చిళ్ళు గుంజుతున్నాడు. కాలికీ చేతికీ అడ్డం పడి ఏడుస్తున్నాడు. తల్లి ఎంత వారించినా, బుజ్జగించినా లాభం లేకపోయింది.

చివరికి సహనం కోల్పోయిన ఆ తల్లి, బిడ్డని విసిరి పొయ్యి మంటలో వేసింది. కణకణ మండుతున్న పొయ్యిలో, పసిబిడ్డ క్షణాల్లో కాలి బూడిద అయ్యాడు.

ఇదంతా చూస్తున్న అతిధి(మృదుభాషిణి ని పెళ్ళాడగోరిన రెండవ యువకుడు) ఒక్కసారిగా కెవ్వున అరిచాడు. "ఓరి భగవంతుడా!" అంటూ రెండు కళ్ళూ మూసుకున్నాడు. అతడి శరీరం గజగజా వణుకుతున్నది.

అవధుల్లేని ఆగ్రహంతో ఒక్కసారిగా అరుగు మీంచి లేచి నిల్చున్నాడు. గృహిణి అతణ్ణి చూసి దగ్గరి కొచ్చింది. అతడామె వైపు కొఱకొఱ చూస్తూ "ఓ బ్రాహ్మణి! నీవు మహా పాపివి. కౄరరాక్షసివి. నీ స్వంత బిడ్డనే చంపిన దానివి. నీ అంతటి ఘోర పాపి మరెవ్వరూ ఉండరు. నీ ఇంట అన్నపు మెతుకు ముట్టిన వాడికి పుట్టగతులుండవు. రాక్షసీ! చిన్న పాపడిని, పొయ్యి మంటలో వేసి చంపావే, కన్న తల్లి వేనా నువ్వు? నీ ముఖం చూసినా పాపమే! నీ ఇంట ఇక క్షణ మాగను. నీ తిండి నాకక్కర లేదు" అనేసి చరాలున పోబోయాడు.

ఆ ఇంటి ఇల్లాలు, అతడి పాదాలపై బడి ప్రార్ధించింది. "అయ్యా! సహనం పొందండి. అతిధి యైన మీరు మా ఇంట భోజనం చేయకుండా వెళ్తే, గృహిణిగా నేను అధర్మం పాటించిన దానినౌతాను. దయ చేసి ఆగండి" అని అతణ్ణి ఆపు చేస్తూ, పొయ్యిలొంచి కుర్రవాడి ఎముకల్నీ, బూడిదనీ కట్టెతో బయటకు తీసి, కుప్పగా చేర్చి, దానిపై నీళ్ళు సంప్రొక్షిస్తూ మృత సంజీవనీ మంత్రోచ్ఛటన చేసింది. ఆశ్చర్యం! మరుక్షణం పిల్లవాడు, సంతోషంగా బంతిలా ఆడుకుంటూ ప్రత్యక్షమయ్యాడు.

చూస్తున్న బ్రాహ్మణ యువకుడు నిరుత్తరుడయ్యాడు. కొన్ని క్షణాల తర్వాత తేరుకొని ఆ గృహిణి పాదాల మీద పడి క్షమాపణ వేడుకున్నాడు.
"అమ్మా! దయచేసి నాకా మంత్రం ఉపదేశించు" అని ప్రార్ధించాడు.

ఆ బ్రాహ్మణి చిరునవ్వుతో "అయ్యా! మా ఇంటికి అతిధి మీరు. ముందు మీరు భోజనం చేయండి. తప్పకుండా నేను మీకా మంత్రాన్ని ఉపదేశిస్తాను. మీరు అభోజనంగా, అసంతృప్తిగా మా ఇంటి నుండి వెళ్తే, అది మాకు శ్రేయస్కరం కాదు" అంది.

అతడు సంతోషంగా ఆ ఇంట భోజనం చేశాడు. ఆమె చిన్నారి కుమారుడిని ముద్దు చేస్తూ హాయిగా గడిపాడు. ఆ ఇల్లాలు అతడికి మృతసంజీవని మంత్రాన్ని ఉపదేశించింది.

మంత్రాన్ని పొందాడు గనుక అతడు మంత్రవాది అని పిలవబడ్డాడు. అవధుల్లేని ఆనందంతో మంత్రవాది బ్రహ్మ చక్రానికి తిరిగి వచ్చాడు! మృదుభాషిణిని పునరుజ్జీవితురాలిని చెయ్యగలను కదా అన్న ఆనందంలో, ఆతృతగా శ్మశానానికి వెళ్ళాడు. అప్పుడక్కడ ఎవరూ లేరు. మృదుభాషిణిని పెళ్ళాడ గోరి వచ్చిన వారిలో, మూడో యువకుడు ఇప్పటికీ ఏడుస్తూ శ్మశానంలోనే ఉన్నాడు. తైల సంస్కారం లేని జుట్టు, శుచీ శుభ్రతా లేని దేహం, పోషకాహారం లేని ప్రాణంతో పిచ్చివాడిలా ఉన్నాడు.

మంత్రవాది మృదుభాషిణి చితివైపు చూశాడు. అక్కడ ఆమె బూడిదగానీ, ఎముకలు గానీ ఏవీ లేవు. మంత్రవాది ఉత్సాహమంతా నీరు గారిపోయింది. నిరాశతో దుఃఖం వచ్చింది. సరిగ్గా అప్పుడే... మృదుభాషిణి అస్థికలూ, చితాభస్మమూ తీసుకొని కాశీకి పోయిన, మొదటి యువకుడు తిరిగి వచ్చాడు. కాశీలో ఆమె అస్థికలని గంగలో కలిపాక, కొన్నిటిని తీసుకొని తిరిగి బ్రహ్మచక్రానికి వచ్చాడు. వాళ్ళ ఆచారం ప్రకారం క్రతువులేవో నిర్వహించాలని అతడి ఊహ!

విషయం తెలిసి అతడు మృదుభాషిని చితాభస్మాన్ని, అస్థికల్నీ ఇచ్చాడు. మంత్రవాది వాటిని కుప్పగా పోసి, నీళ్ళు సంప్రోక్షిస్తూ మంత్రం చదివాడు. నిద్ర నుండి లేచినట్లు మృదుభాషిణి పునరుజ్జీవితురాలై లేచి కూర్చుంది.

వార్త ఊరు ఊరంతా ప్రాకింది. మృదుభాషిణిని తీసుకొని, ముగ్గురు యువకులూ జటాగోపుడి ఇల్లు చేరారు. మళ్ళీ రచ్చ మొదలు! ఆమె నాదంటే నాదని ముగ్గురు యువకులూ కలహించసాగారు. ఆమె అమ్మా, నాన్న, అన్నా కూడా, ఆమెను ఎవరికివ్వాలా అని గొడవ పడసాగారు.

ఇంత వరకూ కథ చెప్పిన భేతాళుడు "ఓ విక్రమాదిత్య మహారాజా! నీవు సాహసికుడవు. ఆ యోగి కోరిక తీర్చుట కొరకు, శవరూపంలోని నన్ను ఈ అర్ధరాత్రి వేళ మోసికొని పోతున్నావు. అంతేగాక నీవు సకల విద్యా పారంగతుడవు. కనుక ఓ రాజా! నీవు నిర్ణయించి చెప్పు! మృదుభాషిణిని పెళ్ళాడేందుకు అర్హుడెవరు?" అనడిగాడు.

విక్రమాదిత్యుడు "ఓ భేతాళుడా! మృదుభాషిణి చితాభస్మాన్నీ, అస్థికలనీ భద్రపరచి, కాశీకి తీసికెళ్ళి తెచ్చిన వాడు ఆమెకు పుత్ర సమానుడు. కాబట్టి అతడామెని పెళ్ళాడేందుకు అనర్హుడు. మృత సంజీవనీ మంత్రం నేర్చి, ఆమెకు పునఃప్రాణం పోసిన మంత్రవాది ఆమెకు పితృసమానుడు. కాబట్టి అతడూ ఆమెని వివాహమాడ తగడు. శ్మశానంలో కూర్చొని, ఏడుస్తూ ఉండిపోయిన మూడవ యువకుడే ఆమెని పెళ్ళాడెందుకు అర్హుడు" అన్నాడు.

ఇంకేముంది? మౌనభంగం అయ్యింది. భేతాళుడు మాయం! మోదుగ చెట్టు పైకి చేరటం ఖాయం! విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి శ్మశానం వైపు అడుగు లేసాడు.

కథా విశ్లేషణ:

ఈ కథలో ఇన్ని మలుపులు ఉండగా, చాలా చోట్ల టూకీగా కథని చెప్పటం చూశాను. నిజానికి అద్భుతరసం నిండి ఉన్న ఈ కథలో... ముగ్గురు యువకులు పోటీ పడటం, వధువు మరణించటం, ఒకడు కాశీకి పోవటం, ఒకడు దేశాటనం పోవటం, మరొకడు ఏడుస్తూ కూర్చొవటం, దేశాటనం పోయిన వాడికి హిమాలయాల్లో ఓ యోగి మంత్రం ఉపదేశించటంగా... ఈ కథ ఎన్టీఆర్ విక్రమార్క విజయం, భట్టి విక్రమార్కల్లో కూడా ఉంది. నిజానికి అది రసం పిండేసిన పిప్పిలాంటి కథ!

అతిధి ధర్మాన్నీ, బ్రాహ్మణితో మంత్రవాది సంభాషణనీ వివరించే కథలోని మలుపులు ఎంతో ఆసక్తికరంగా, అద్భుత రసంతో నిండి ఉంటాయి. అవన్నీ వదిలేసి రామాయాణాన్ని ‘కట్టె కొట్టె తెచ్చె’ అని చెప్పినట్లుగా చెబితే... నేర్చుకోవడానికి, ఆనందించడానికి ఏం మిగులు తుంది? ఈ కథలే కాదు, సాంప్రదాయ బద్దమైన ఇలాంటి జానపద కథలూ, పంచతంత్ర కథలూ కూడా, రసం పిండేసిన పిప్పిలాంటివే ప్రచారంలోనూ, ప్రచురణలోనూ ఉన్నాయి.

అసలైన కథలని అవలోకిస్తే అదో అద్భుత ప్రపంచమే!

ఇక్కడ ఓ గమ్మత్తు ఏమిటంటే, ముగ్గురు యువకుల్లో ఒకడు కాశీకి పోయాడు, మరొకడు దేశాటనం పోయాడు. ఎక్కడికీ పోకుండా, ఏమీ చేయకుండా, ఊరికే ఏడుస్తూ కూర్చున్న వాడికి ఫలితం దక్కింది. చాలా తక్కువసార్లు ఇలా జరుగుతుంది. పనిచెయ్యకుండా ఫలితం దక్కటం! దీన్నే మరో కోణంలో చూస్తే మిగిలిన ఇద్దరి కన్నా, ఏడుస్తూ కూర్చున్న వాడిలో "ఫీల్’ ఎక్కువగా ఉంది. బహుశః అందుకే పిల్ల దక్కిందేమో! :)

ముప్పొద్దులా తినమన్న నందీశ్వరుడు!

గోపూజ హిందూ జీవన విధానంలో ఓ భాగం. పుణ్యక్షేత్రదర్శనంలోనూ, శుక్రవారాల్లోనూ గోవుల్ని విశేషంగా పూజిస్తారు. ఇక పంటల పండుగ సంక్రాంతి మరునాడు కనుమపండుగ అంటూ పశువుల్ని పూజిస్తారు.

అందునా ఆరోజు ఆవుల్నీ, ఎద్దుల్నీ ముఖంగాక తోకని పూజిస్తారు. పశు సంతతి వృద్ధిని కోరుతూ, అలా పూజిస్తారని ఒక వాదన ఉంది. దీని గురించి మరో ఆసక్తికరమైన కధొకటి ఉంది.

అదేమిటంటే -

అప్పటికి మనుష్యులు ఇంకా వ్యవసాయం నేర్చుకోలేదట. అస్థిర నివాసులై, ప్రకృతిలో దొరికినవి తింటూ కాలం వెళ్ళబుచ్చుకున్నారట.

అప్పుడోరోజు... మహాశివుడు నందీశ్వరుణ్ణి పిలిచి, "నందీ! భూలోకానికి వెళ్ళి మానవులకి, ముప్పొద్దులా స్నానం చెయ్యమనీ, ఒక పొద్దు తిండి తిన మనీ’ చెప్పిరా!" అన్నాడట.

నందీశ్వరుడు అలాగే వెళ్ళొచ్చాడు. తిరిగి వచ్చిన నందీశ్వరుణ్ణి మహాశివుడు "నందీ! చెప్పి వచ్చావా?" అనడిగాడు.

"చెప్పాను స్వామీ!" అన్నాడు నంది.

"ఏం చెప్పావు?" అన్నాడు స్వామి.

" ‘ముప్పొద్దులా తినండి. ఒకపొద్దు స్నానించండి’ అని చెప్పాను స్వామీ" అన్నాడు నందీశ్వరుడు.

"ఏడ్చినట్లుంది! మూడు పొద్దులా తింటే తిండెక్కడ సరిపోతుంది?" అన్నాడు స్వామి.

నంది నాలుక్కరుచుకొని "పొరపాటయ్యింది స్వామీ" అన్నాడు.

"నువ్వే ఆ పొరపాటు దిద్దుదువు గాక! ఇక నుండీ... నీవు, భార్యా పుత్ర పుత్రీ సమేతంగా, భూలోకానికి పో! నీవూ, నీ పుత్రులూ దుక్కి దున్నటం దగ్గర నుండి పంట పండించీ, నీ భార్యాపుత్రికలు పాలిచ్చీ, మానవుల కడుపులు నింపండి, పొండి" అన్నాడట శివుడు.

ఆనాటి నుండి ఆవులూ, ఎద్దులూ మన కడుపులు నింపుతుండగా... మహాశివుడు, మనుష్యులకి వాటి ఆలనా పాలనా చూడవలసిన విధిని నిర్ణయించాడట.

కొన్నాళ్ళ తర్వాత, మనిషి పశుగణాల పరిరక్షణ సరిగా చేస్తున్నాడో లేదో తెలుసుకుందామని, అవుల్నీ, ఎద్దుల్నీ "మనిషి మిమ్మల్ని బాగా మేపుతున్నాడా?" అని మహాశివుడు అడిగితే, అవి లేదన్నట్లు తల అడ్డంగా ఊపి అబద్దం చెప్పాయట. అయితే తోకలని నిలువుగా ఊపి నిజం చెప్పాయట.

అప్పటి నుండీ మనుష్యులు, అబద్దం చెప్పిన ఆవు శిరస్సు కంటే, తోకని మరింత శ్రద్దగా పూజిస్తారని జానపద కథ.

ఏదేమైనా హిందువులు పశుగణాలని శ్రద్దగా పూజిస్తారన్నది మాత్రం నిజం.

ఆషామాషీగా తీర్పులు చెబితే ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 24]

"యువరాణి పద్మావతి విషయంలో, తండ్రినైన నేను పక్షపాతరహితంగా న్యాయవిచారణ చేయలేను. కాబట్టి నీవే న్యాయం పరికించు" అన్నరాజుతో...

మంత్రి "ఓ మహారాజా! స్త్రీని చంపడం కంటె మహాపాపం ఇంకొకటి లేదు. కాబట్టి పద్మావతికి మరణ శిక్ష విధించలేం. కనుక ఆమెని దేశ బహిష్కారం చేద్దాం. అదే ఆమెకి తగిన శిక్ష!" అన్నాడు గంభీరంగా!

రాజు విచారంగా సైనికులను పిలిచి "ఓ భటులారా! రాణీ వాసం నుండి యువరాణీ పద్మావతిని తీసికెళ్ళి, దుర్గమారణ్యాల నడుమ విడిచి రండి" అని అజ్ఞపించాడు.

రాజభటులు రాజాజ్ఞను శిరసావహించి, పద్మావతిని అడవి మధ్యలో వదిలారు. భయ విహ్వలయైన పద్మావతి, తన విధిని నిందించుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించసాగింది.

అప్పుడామెని, ఆ అరణ్య మధ్యంలో దేవపురం యువరాజు వజ్రకూటుడు, మంత్రి కుమారుడు తమ నిజరూపాలతో కలుసుకున్నారు. ఆమె తన చెలికాడిని గుర్తించి, ఆశ్చర్య పోయింది. ప్రక్కనే ఉన్న మంత్రి కుమారుణ్ణి చూసి, అతణ్ణి చంపబూనిన తన పన్నాగం గుర్తొచ్చి, మన్నించమని మనస్ఫూర్తిగా వేడుకొంది.

వారామెని చిరునవ్వుతో ఆశ్వాసించి, జరిగినదంతా వివరించారు. తర్వాత వారంతా దేవపురం చేరారు. దేవపురం రాజు ప్రతాపవంతుడు, తన కుమారుడి ప్రేమ వృత్తాంతాన్ని అంగీకరించి, పద్మావతి వజ్రకూటుల వివాహం జరిపించాడు. వివాహ నేపధ్యంలో నేత్రపురానికి కబురు పంపేలోగా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.

అప్పుటికే... నేత్రపురంలో, పద్మావతి తండ్రియైన ఉత్తానపాదుడు, కుమార్తె విషయంలో జరిగిన వాటిని నమ్మలేక, ఆమె ఎడబాటును సహించలేక, దిగులుతో మరణించాడు. ఆమె తల్లి కూడా... భర్త మరణాన్ని, కుమార్తె దురదృష్టాన్ని తట్టుకోలేక మృతి చెందింది.

భేతాళుడు విక్రమాదిత్యునికి ఈ కథ చెప్పి, "విక్రమాదిత్యా! ఈ కథను సావధానుడవై విన్నావు కదా? ఇందులో రాజు ఉత్తాన పాదుడు, అతడి భార్య మరణాలకు సంబంధించిన పాపం ఎవరికి చెందుతుంది? ఈ ప్రశ్నకు నీవు జవాబు చెప్ప వలసి ఉంటుంది" అన్నాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వుతో తలాడించి, "భేతాళా! విను! దేవపుర యువరాజు వజ్రకూటుడు, మంత్రి కుమారుడు, నేత్రపుర యువరాణి పద్మావతి, తమతమ భావోద్వేగాల మేరకు ప్రవర్తించారు. ఉత్తానపాదుడు, అతడి భార్య కూడా, మానవ సహజమైన భావోద్రేకాల మేరకు బాధననుభవించి మరణించారు.

అయితే.... న్యాయం చెప్పవలసిన స్థానంలో ఉండి, నేత్రపురపు మంత్రి, పద్మావతి విషయంలో తన ధర్మాన్ని సరిగా పాటించలేదు. తన కుమార్తెను సందేహించవలసి ఉన్నందున, తీర్పు నిష్పక్షపాతంగా చెప్పలేనని తలచిన ఉత్తాన పాదుడు, ఆ బాధ్యతను మంత్రికి అప్పగించాడు.

మంత్రి, పద్మావతి విషయంలో ఏం జరిగిందో విచారించలేదు. పద్మావత కి సంజాయిషీ చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా, ఏక పక్షంగా తాము విన్న వివరాల మీద ఆధారపడి తీర్పు చెప్పాడు. జరిగిన దేమిటో పూర్వాపరాలు తెలుసుకోకుండానే, పద్మావతిని శవాలను పీక్కుతినే దోషిగా నిర్ధారణ చేసి, శిక్షని నిర్ణయించాడు.

అందుచేత రాజు రాణిల అర్ధాంతర మృతికి సంబంధించిన పాపం అతడికి చెందుతుంది" అన్నాడు.

ఈ విధంగా భేతాళుడు ప్రశ్న సంధించాడు. విక్రమాదిత్యుడు సమాధానం అందించాడు. విక్రమాదిత్యుడి మౌనం భంగమైంది. మరుక్షణమే విక్రమాదిత్యుడి భుజం మీది శవంలో అవాహనుడైన భేతాళుడు, శవంతో సహా మాయమై, తిరిగి మోదుగు చెట్టెక్కాడు. విక్రమాదిత్యుడది గమనించి, వెనుదిరిగి శ్మశానం వైపు అడుగువేసాడు. దూరాన మోదుగ చెట్టుకు వేలాడుతూ శవం కనబడుతోంది. చుట్టూ చీకటి చిక్కబడుతోంది.

~~~~~

కథా విశ్లేషణ:

ఈ కథ మనకి న్యాయమూర్తి బాధ్యత ఎంత గురుతరమైనదో తెల్పుతుంది. తెలిసి గానీ, తెలియక గానీ, అధర్మతీర్పు చెబితే, ఆ పాపం అతడికే చుట్టుకుంటుందనే నమ్మకం అనివార్యంగా, న్యాయమూర్తి, నిష్పాక్షిక న్యాయం చేసేటట్లు, తగిన తీర్పు చెప్పేటట్లు చేస్తుంది.

అలాంటి స్థితి నుండి నేటి సమాజం ఎక్కడికి ప్రయాణించింది?
కక్షిదారుల నుండి డబ్బులు తీసుకుని తీర్పులు చెప్పే న్యాయమూర్తుల దాకా,
అందుకోసం న్యాయవాదులతో లోతట్టు స్నేహ సంబంధాలు కొనసాగించే న్యాయమూర్తుల దాకా,
పదోన్నతుల కోసం అధికార పార్టీకి అనుకూలంగా తీర్పులు వెలువరించే న్యాయమూర్తుల దాకా!

సంస్కృతినీ, నమ్మకాలనీ వదిలిపెట్టి, దమ్మిడీల కోసం పరుగులు పెడితే, సమాజం ఇక్కడికే ప్రయాణిస్తుంది. దమ్మిడీల పరుగులో వేగనిరోధకల్లాగా... ఇలాంటి కథలూ, ఇతిహాసాలూ పనిచేస్తాయి. అందుకే, పనిగట్టుకుని మరీ... కథలని, ప్రజల జీవితం నుండి తరిమేసి, గోచీపాతలు వేసుకునే నాయికల ప్రేమకథలతో, ప్రజా జీవితాలని కుమ్మేసే కుటిల యత్నాలు ముమ్మరంగా నడుస్తుంటాయి.

ఇలాంటి జవాబు చెప్పాడంటే మహారాజుగా న్యాయనిర్ధారణ చేసేటప్పుడు విక్రమాదిత్యుడు ఎంత జాగరూకుడై ఉంటాడో తెలుస్తోంది.

~~~~~~

మంత్రి కుమారుడి మాయోపాయం ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 23]

పాయసం తిన్న కుక్క ప్రాణాలు విడవటంతో, యువరాజు ఖంగుతిని, "ఇంత పన్నాగాన్ని నేను పసికట్టలేదు" అన్నాడు. మంత్రి కుమారుడు "యువరాజా! ఆమెనంత ప్రతికూలంగా చూడకు. నీ మీద ప్రేమతో, ఆమె నా చావుకోరుకుంది. నీ సాన్నిహిత్యం పట్ల ఆమెకున్న అభద్రత అది!" అన్నాడు.

దానికి పరిష్కారం కోసం వాళ్ళిద్దరూ కాస్సేపు ఆలోచించారు. ఆమెని తమ నగరానికి తీసికెళ్ళి వివాహం చేసుకోవటమే తగిన పరిష్కారమని తోచింది యువరాజుకి. ఇంత జరిగాక పద్మావతి తండ్రియైన ఉత్తాన పాదుడి దగ్గరి కెళ్ళి పిల్లనడగాలని పించలేదు. ఎంతో తెలివైన పద్మావతికీ ఒక పాఠం నేర్పాలనుకున్నారు.

మంత్రి కుమారుడు బాగా ఆలోచించి "మంచిది, మిత్రుడా! ఆమె దగ్గరికెళ్ళి నాకు పాయసం ఇచ్చానని చెప్పు. కొంత తడవు ఆమెతో గడిపాక, ఆమె నిద్రించే సమయంలో, మెడలోని ముత్యాల హారాన్ని తస్కరించి తీసుకురా! వచ్చే ముందు, నీ చేతి మూడు వ్రేళ్ళ గోటి గుర్తులు పడేలా, ఆమె వక్షస్థలం మీద గుచ్చి, వచ్చెయ్" అని చెప్పాడు.

ఆ రాత్రి, యువరాజు తన మిత్రుడైన మంత్రి కుమారుడు చెప్పినట్లే చేసి, ముత్యాల దండ తీసుకొచ్చాడు.

మరునాటి ఉదయం, మంత్రి కుమారుడు తాను యోగిలా వేషం ధరించి, యువరాజుకి తన శిష్యుడి వేషం వేసాడు. ఇద్దరూ శశ్మానం ప్రక్క నున్న చెట్టు క్రింద కూర్చొని, తపస్సు నటించారు. అలా కొంత సేపు, అటు ఇటు పోయే ప్రజల కంట బడ్డాక, గురువు [మంత్రి కుమారుడు], శిష్యుణ్ణి [యువరాజుని] పిలిచి "నువ్వు పోయి రాచ వీధిలో ఈ ముత్యాల హారాన్ని ప్రదర్శించు. రాజు దాన్ని గురించి నిన్ను ప్రశ్నించినప్పుడు, నా గురించి వివరించి, ఇక్కడికి తీసుకురా!" అని చెప్పాడు.

యువరాజు అలాగే చేసాడు. రాజు ఉత్తాన పాదుడికి, రాచవీధిలో సాధువు శిష్యుడొకడు, మంచి మేలిమి ముత్యాల హారాన్ని ప్రదర్శిస్తూ, అమ్మకానికి పెట్టాడని తెలియ వచ్చింది. రాజతణ్ణి పిలిపించి, ధర ఎంతని వాకబు చేసాడు.

శిష్యుడిలా నటిస్తున్న యువరాజు అమాయకంగా ముఖం పెట్టి "మహారాజా! నా కదేమీ తెలియదు. మా గురువు గారు మీకన్ని విషయాలు చెప్పగలరు. మీరాయన్ని దర్శించడం మంచిది. శశ్మానం ప్రక్కన ఆయన ధ్యానం చేసుకుంటున్నారు" అన్నాడు.

ముత్యాల హారాన్ని పరిశీలించిన రాజుకి, అది తన కుమార్తె పద్మావతి దని అనుమానం వచ్చింది. దాంతో అతడు ఆ యోగిని చూడాలని తీర్మానించుకున్నాడు. మంత్రితో కలిసి మాయాయోగిని చూడబోయాడు.

చెట్టుక్రింద ధ్యాన ముద్రలో ఉన్న మాయా యోగి దగ్గరికి చేరి, రాజు, మంత్రి అతడికి నమస్కరించారు. అతడు వీళ్ళని దీవించి ప్రక్కనే కూర్చొనమని ఆదేశించాడు. రాజు అతణ్ణి ముత్యాల హారం గురించి అడిగాడు.

యోగి "ఓ రాజా! నేనిక్కడ ధ్యానం చేసుకుంటున్నాను. అయితే ప్రతీ రాత్రి, ఒక అందమైన యువతి ఇక్కడికి రావటం చూశాను. ఆమె శశ్మానం చేరి, చితిలో సగం కాలిన శవాల్ని బైటకు లాగి, పీక్కు తింటోంది. అలా ఆమె చాలా ఆకలిగా, ఆబగా తినటం గమనించాను. ఆకలి చల్లారాక, తృప్తిగా తలాడించి, ఆమె మీ నగరం వైపు వెళ్తోంది. ప్రతీ రోజూ ఇలాగే జరుగుతోంది.

ఆమెని పరీక్షింపగోరి, నిన్నటి రాత్రి, ఆమెని నా త్రిశూలంతో అడ్డగించాను. నా త్రిశూలంతో ఆమె గుండెల మీద పొడిచి "ఎవరు నువ్వు" అని గద్దించాను. అమె గజగజ వణికింది. నా పాదాల మీద పడి ప్రాధేయపడుతూ, తన మెడలో నుండి ముత్యాల హారం తీసిచ్చింది.

చేతులు జోడించి ఆర్దిస్తూ " ఓ యోగి పుంగవా! రక్షించు. నా రహస్యాన్ని కాపాడు. ఎవరికీ బహిరంగ పరచకు" అని ప్రార్దించింది.

నా కామెను చూసి జాలి కలిగింది. "అమ్మాయీ! ఎవరు నువ్వు? ఎందుకింత భయంకర నీచ కృత్యం చేస్తున్నావు?" అని అడిగాను.

"అయ్యా! నా పేరు పద్మావతి! నేనిలా చేయకపోతే నా కడుపు నిండదు" అనేసి పరుగెత్తి పారిపోయింది. అందుచేత ఈ ముత్యాల హారం నాది కాదు. అందుచేత దీన్ని నా శిష్యుడికిచ్చి రాజ వీధిలో ప్రదర్శించమన్నాను. ఆ విధంగా దాని స్వంత దారుకి ఆ దండని చేర్చాలన్నది నా ఉద్దేశం. ఏమైతేనేం, విషయం మీకు తెలిసింది. ఈ హార మెవ్వరిదో విచారించి, స్వంతదారుడికి దీన్ని అందచేయండి" అన్నాడు మాయోయోగి.

ఇదంతా విని రాజు ఉత్తాన పాదుడు దిగ్భ్రాంతి పడినాడు. అన్యమనస్కంగానే మాయాయోగి వద్ద, అతడి శిష్యుని వద్ద సెలవు పుచ్చుకొని, మంత్రితో సహా నేత్రపురానికి తిరిగి వచ్చాడు.

మాయాయోగి చెప్పినదంతా వినేసరికి, ఉత్తానపాదుడు తన కుమార్తె పద్మావతినే శంకించాడు. రాజమందిరం చేరాక, రాణిని పిలిచీ, విషయమంతా వివరించాడు.

సందేహం తీరక "రాణీ! మన కుమార్తె పద్మావతి దగ్గరకు పోయి, ఆమె మెడనూ, హృదయసీమనీ పరీక్షించిరా!" అని పంపాడు. రాణి ముత్యాల హారాన్ని తమ కుమార్తెదిగా గుర్తించింది.

భర్త చెప్పినట్లే పోయి పద్మావతి మెడనూ, వక్ష స్థలాన్నీ పరీక్షించింది. యువరాణి వక్షస్థలం మీద మూడు గాయపు గుర్తులున్నాయి. తల్లి కుమార్తెతో "పద్మావతి! ఇది నీ ముత్యాల హారమే కదా?" అని ప్రశ్నించింది, దండ చూపిస్తూ!

పద్మావతి ఒక్కసారిగా కలవర పడింది. తల్లి దండ్రులకి తన రహస్య ప్రణయ వ్యవహారం తెలిసి పోయిందని తలచింది. సిగ్గూ, భయం, తప్పు చేసానన్న లజ్జా భావం ముప్పిరి గొనగా, కన్నీళ్ళతో తలదించుకుంది.

రాణి తిరిగి వెళ్ళి రాజుకన్నీ వివరించింది. ఇద్దరికీ చాలా బాధ కలిగింది. రాజది దిగమింగుకుంటూ, "ఓ మంత్రీ! ఈ వ్యవహారంలో నీవే తీర్పు చెప్పాలి. ఇట్టి నీచకార్యం చేసింది, యువరాణి అయినా, మరొకరు అయినా.... మనం మన ధర్మం తప్పకూడదు. యువరాణి పద్మావతి విషయంలో, తండ్రినైన నేను పక్షపాతరహితంగా న్యాయవిచారణ చేయలేను. కాబట్టి నీవే న్యాయం పరికించు" అన్నాడు.

~~~~~~

పిసినారి ధనయ్య!

అనగా అనగా….

ఓ ఊళ్ళో ధనయ్య అనే నేతి వ్యాపారి ఉండేవాడు. అతడు వట్టి ఆశపోతు. మీదు మిక్కిలి పిసినారి కూడాను. లాభాల మీద ఆశకొద్దీ కల్తీ నెయ్యి అమ్మేవాడు.

ఓసారి ఊరికామందు ఇంట్లో పెళ్ళికి కూడా కల్తీనెయ్యి సరఫరా చేశాడు. ఆ నేతితో చేసిన మిఠాయిలు తిన్న చుట్టాలందరికీ వాంతులయ్యాయి.

దాంతో ఊరికామందు ధనయ్యని పిలిపించి పంచాయితీ పెట్టించాడు. నెయ్యి కల్తీదని ఋజువు కావటంతో ధనయ్యని దోషిగా నిర్ధారించాడు. దాంతో శిక్ష ఖరారయ్యింది.

వెయ్యి వరహాల జరిమానా విధించారు. పిసినారి ధనయ్య కట్టలేనన్నాడు.

వంద కొరడా దెబ్బలు విధించారు. దెబ్బలు తినలేనన్నాడు.

అయితే మణుగు నెయ్యి తాగమన్నారు. ఆశపోతు ధనయ్యకి ఈ శిక్ష లాభసాటిగా అన్పించింది. సరేనన్నాడు.

కానీ సగం నెయ్యి తాగేసరికీ గుడ్లు తేలేసాడు.

దాంతో కొరడాదెబ్బలు తింటానన్నాడు. కానీ యాభై దెబ్బలు తినేసరికీ బేర్ మన్నాడు.

నోరు మూసుకుని వెయ్యి వరహాలు జరిమానా కట్టి ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు.

పిసినారి ధనయ్యకి తగిన శాస్తి జరిగిందని ఊళ్ళో వాళ్ళంతా నవ్వుకున్నారు. ధనయ్య మాత్రం తన పిసినారితనంతోనూ, ఆశపోతుతనంతోనూ వరసగా అన్ని శిక్షలూ అనుభవించి, అసలు అదే సరైన శిక్ష అన్పించుకున్నాడు.


~~~~~~~~~~

పైన కోపం – లోన ప్రేమ ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 22]

పదవకొండవ రోజున, పేదరాశి పెద్దమ్మకి మరిన్ని విలువైన కానుకలిచ్చి రకరకాలుగా ధైర్యం చెప్పి, పద్మావతికి సందేశం పంపారు. భయం భయంగానే అయినా, పేద రాశి పెద్దమ్మ పద్మావతి దగ్గరికి పోయి, పూల దండలిచ్చి, ఎవరూ లేకుండా చూసి గుసగుసగా దేవపురం యువరాజు వజ్రకూటుని గురించి చెప్పింది. అడవిలో సరస్సు దగ్గరి సంగతులు కూడా గుర్తు చేసింది.

ఈ సారీ పద్మావతి కోపమే చూపించింది. కుడిచేతి మూడువేళ్ళు ఎర్రని కుంకుమలో ముంచి, ముసలిదాని గుండెల మీద, పమిటపైన మూడు గుర్తులు పడేలా ఓ పోటు పొడిచింది. సుతారంగా తిడుతూ, తన మందిరపు దొడ్డివాకిలి ద్వారా పూటకూళ్ళ ముసలమ్మని వెళ్ళగొట్టింది.

పేదరాశి పెద్దమ్మ ఏడుస్తూ పోయి, యువరాజుకూ, మంత్రి కుమారుడికీ జరిగిందంతా చెప్పింది. ఆమెకు మరిన్ని కానుకలిచ్చి సంతోషపరిచాడు మంత్రి కుమారుడు. పద్మావతి ఇలా కోపం చూపించటం, రెండోసారి కూడా జరిగే సరికి, యువరాజుకి నిరాశ తోచింది. చింత పడ్డాడు.

మంత్రి కుమారుడు యువరాజుని ఓదార్చి, ఉత్సాహపరిచాడు "నా ప్రియమైన మిత్రుడా, యువరాజా! దిగులుపడకు! యువరాణి నిన్ను తన అంతఃపురపు వెనక గుమ్మం ద్వారా రమ్మనీ, అదీ మూడురోజుల తర్వాత రమ్మనీ కబురు పంపింది. ఆమె ఇప్పుడు ఋతు క్రమంలో ఉన్నందున, నిన్ను మూడు రోజుల గడువు కోరింది. అది నీకు సంకేతంగా ఉండేందుకే, ఎర్రని కుంకుమ గుర్తులు పడే విధంగా ముసలమ్మ పమిట మీద కొట్టి, వెనుక గుమ్మం ద్వారా పంపింది" అని విడమరిచాడు.

[పైకి చూడటానికి యువరాణి కోపం చూపించినట్లే ఉంటుంది. అందులో నుండే యువరాజుకు సందేశం పంపింది. ఈ ముసలి దానికి మాత్రం అదేమీ తెలియదు. జీవిత కాలం పాటు యువరాణి కోపమే గుర్తుండి పోతుంది. అదీ సంకేత భాషలో సౌలభ్యం!]

యువరాజుకి ఎంతో సంతోషం కలిగింది. మూడు రోజులు ఎలాగో ఓపిక పట్టాడు. నాలుగో రోజు చీకటి పడినాక దేవపురం యువరాజు వజ్రకూటుడు... అభ్యంగన స్నానమాచరించి, పట్టు పీతంబరాలు రత్నాభరణాలు ధరించి, పద్మావతి మందిరానికి, వెనుక గుమ్మం ద్వారా వెళ్లాడు. రహస్యంగా ఆమె అతణ్ణి కలుసుకుంది.

ఆనాటి నుండి ఆమెతో యువరాజు 10 రోజుల పాటు ఆనందంగా గడిపాడు. ఎవరికీ తెలియకుండా, తన అంతరంగిక మందిరంలో అతణ్ణి రహస్యంగా దాచి ఉంచింది పద్మావతి. ఆమె ఆటపాటలతో, సాన్నిహిత్యంతో... యువరాజుకు రోజులు క్షణాల్లా గడిచిపోయాయి.

అందమైన పద్మావతి... పలుకనేర్చిన చిన్నారి, పలు కళలు నేర్చిన వయ్యారి కావటంతో, ఆమె ప్రేమలో బడి యువరాజు, తన ప్రాణస్నేహితుడైన మంత్రి కుమారుణ్ణి కూడా మరిచిపోయాడు. ఇలా పది రోజులు గడిచేసరికి, ఓ రోజు రాజకుమారుడికి తన మిత్రుడు గుర్తుకొచ్చి బెంగ తోచింది.

"ఎంత చెడ్డవాడిని నేను? చిన్న నాటి నుండీ... నేనూ, మంత్రి కుమారుడూ, కన్నూ కనురెప్ప వలె కలిసి యుంటిమి కదా? కలిసి విద్యలు నేర్చి, కలిసి తిరిగి, కలిసి బ్రతికినాము. ఇప్పటి వరకు అతడినొక్క దినమైననూ విడిచి యుండలేదు. నేటికి, ఈ సుందర నారితో వలపు రీత్యా, నా ప్రియమిత్రుణ్ణి మరచినాను గదా?" అని ఆలోచిస్తూ యువరాజు చింతా క్రాంతుడయ్యాడు.

దాంతో నిరుత్సాహంగా ఒక మూల కూర్చొండి పోయాడు. యువరాణి పద్మావతి ఇదంతా గమనించింది. అతడి దరిచేరి, "ఓ ప్రియా! యువరాజా! నీవీ రోజు మునుపటి లా లేవు. ఏదో దిగులుతో, నిరుత్సాహంతో ఉన్నావు. నీకు నా సాన్నిహిత్యము విసుగు కలిగించి నదా? నా ప్రేమ నీకు చేదైనదా?" అని అడిగింది.

యువరాజు; "లేదు ప్రేయసీ! అలా అనుకోకు. నాకు నీవనిన ఎంతో ప్రేమ! నాకు చిన్ననాటి నెచ్చెలి యెకడు కలడు. అతడు మా మంత్రి కుమారుడు. బాల్యము నుండీ మేమిరువురమూ ఒకే కంచం, ఒకే మంచము మాదిరి కలిసిమెలిసి యుంటిమి. అతడి సాయముతోనే, నేను నిన్ను కలుసుకోగలిగితిని. మీ నగరమునకునూ ఇద్దరం కలిసే వచ్చి యున్నాము. ఇప్పుడు పది రోజులుగా అతడి ఊసైననూ ఎత్తక, నీ సాంగత్యమున బడి అతనిని వదిలి ఉంటిని. ఇది తలంచి నాకు తప్పు చేసినట్లని పించుచున్నది. లజ్జా భావము కలుగుచున్నది. అంతే! అందుకే దిగులుగా నుంటిని" అన్నాడు.

అది వినగానే పద్మావతి మనస్సులో అసంతృప్తి, అసూయ కలిగాయి. తన ప్రియునికి తనకంటే అతని బాల్య మిత్రుడే ఎక్కువ కావటం ఆమెకి క్రోధం కలిగించింది. అయితే ఇవేవీ ఆమె బయట పెట్టలేదు. కొన్ని క్షణాల తర్వాత, తనకు అత్యంత నమ్మకస్తురాలైన చెలికత్తెను పిలిచి, పాయసము చేసి తెమ్మన్నది. చెలికత్తె తెచ్చిన పాయసంలో విషం కలిపి, యువరాజు దగ్గరికి వచ్చింది.

"ఓ యువరాజా! నా ప్రియ సఖా! నీవు దిగులు చెందకు. మీ స్నేహితుడు నాకునూ ఆదర పాత్రుడే! నా కానుకగా ఈ పాయసమును తీసికెళ్ళి నీ మిత్రుని కిమ్ము. అతడీ పాయసమును ఆరగించిన పిదప, అతనితో కొంత సమయము సంతోషముగా గడిపి రమ్ము" అంటూ పాయసము గిన్నెను యువరాజు కిచ్చింది.

దాంతో యువరాజుకి ఆమె మీద మరింత ప్రేమ కలిగింది. ఆమెతో కొన్ని క్షణాలు మురిపాలాడి, పాయసం గిన్నె తీసుకొని, స్నేహితుడి దగ్గరికి బయలు దేరాడు. పద్మావతి మీద గల అనురాగం కొద్దీ, అతడేదీ శంకించలేదు.

స్నేహితుణ్ణి చూడగానే సంతోషంగా పలకరించి, పాయసం గిన్నె ఇచ్చాడు. ఎంతో ప్రేమతో కబుర్లు చెబుతూ, పాయసం తాగ మన్నాడు. మంత్రి కుమారుడు గిన్నెలోకి తీక్షణంగా చూసి "యువరాజా! నీ బాల్య మిత్రుణ్ణయిన నన్ను చంపటానికి, పాయసంలో విషం కలిపి తెచ్చావా?" అన్నాడు.

అది విని యువరాజు బిత్తర పోయాడు. ‘ఎందుకిలా అంటున్నాడతడు? ఎంతో ప్రేమతో నేను పాయసం తీసుకు వస్తే..., నేనెంతో ప్రేమతో తెచ్చానో, తానంత ప్రేమతో దాన్ని ఆరగించక, ఇలా సందేహిస్తున్నాడేమిటి? ఇతడికి నా మీద స్నేహం తగ్గి పోయిందా?’... అనుకుంటూ అలాగే చూడసాగాడు.

మంత్రి కుమారుడిదంతా గమనిస్తూనే ఉన్నాడు. పాయసపు పాత్రతో వీధిలోనికి వచ్చి, ఊరకుక్కని పిలిచి, పాత్ర దాని ముందుంచాడు. పాయసం తిన్న కుక్క మరుక్షణం క్రిందపడి, గిలగిల కొట్టుకుని ప్రాణాలు విడిచింది.


~~~~~~~~~~~

మూగ బాసల అర్ధాలేమిటి? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 21]

భేతాళుడు మొదటి కథ ప్రారంభించాడు.

ఒకప్పుడు దేవాపురం అనే నగరం ఉండేది. ఆ నగరాధీశుడి పేరు ప్రతాపవంతుడు. అతడికొక కుమారుడు; పేరు వజ్రకూటుడు. ప్రతాప వంతుడి మంత్రికీ ఒక కుమారుడున్నాడు. రాజు, మంత్రి కుమారులిద్దరూ సమ వయస్కులు. ప్రాణ స్నేహితులు కూడా! అనతి కాలంలోనే గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి, ఇరువురూ నగరానికి తిరిగి వచ్చారు.

నెలకో రోజు ఇద్దరూ కలిసి, సపరివార సమేతంగా వేటకై అడవికి వెళ్ళేవారు.

అదే విధంగా, ఓ రోజు యువరాజు, మంత్రి కుమారుడూ వేట కెళ్ళారు. అడవిలో వేటాడుతుండగా వాళ్ళకొక సుందర సరోవరం కనబడింది. ఆ సరస్సులో అందమైన యువతి ఒకామె జలకాలాడుతోంది. ఆమెని చూడగానే యువరాజు ముగ్ధుడై పోయాడు. తొలి చూపులోనే ప్రేమలో పడి పోయాడు. ఒడ్డుకు చేరుకున్న ఆమె కూడా యువరాజుని చూసింది. అతడి అందమైన రూపానికి ఆమె కూడా ముగ్దురాలై, ప్రేమలో పడింది.

చెంపలు ఎర్రబడగా తల దించుకొంది. యువరాజు రెప్పలార్పక ఆమెనే చూస్తున్నాడు. ఆ యువతి క్రిందికి వంగి, కొలనులో నుండి పద్మాన్ని కోసింది. పద్మాన్ని తన రెండూ కళ్ళకూ తాకించుకొంది. దాన్ని మునిపంట కొరికి, పాదాల మీద వేసుకుంది. మరోసారి కొలనులో నుండి కలువ పూవు నొకదాన్ని కోసింది. ఆ పూవును సున్నితంగా ముద్దాడి, హృదయానికి తాకించుకుంది. ఆపైన సిగలో పెట్టుకొని, రాకుమారుడి వైపు క్రీగంట చూసి, ముసిముసి నవ్వులతో అక్కడి నుండి వెళ్ళిపోయింది.

ఆమె అందాన్నీ, చేతల్నీ చూసి యువరాజు దిమ్మెర పోయాడు. మంత్రి కుమారుడితో "మిత్రుడా! ఆ యువతి నా మనస్సు హరించింది. చూడగా ఆమె చేతలకేదో సంకేతార్ధమున్నట్లు తోచుచున్నది. ఆమె చర్యల కేది అర్ధమై ఆలోచించి చెప్పు" అన్నాడు.

మంత్రి కుమారుడు కొన్ని క్షణాలు ఆలోచించి "యువరాజా! ఆమె పద్మాన్ని కనులకి తాకించుకొంది. ఆ విధంగా ఆమె తన నివాసం ఈ దాపులనే ఉన్న నేత్రపురమని చెప్పింది. పద్మాన్ని మునిపంట కొరికింది. ఆ విధంగా ఆమె తన పేరు పద్మావతి అని చెప్పింది. పిదప పద్మాన్ని పాదాల మీద పడవేసింది. అంటే ఆమె తండ్రి పేరు ఉత్తాన పాదుడన్న మాట.

ఆమె కలువ పూవును ముద్దాడి, హృదయానికి తాకించుకొంది. కలువ పూవు చంద్రుని ప్రేయసి. ప్రేమకు చిహ్నం. ఆ విధంగా, ఆమె తాను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని సంకేతమిచ్చింది. కలువని సిగలో తురిమి, మిమ్మల్ని ఓరకంట చూసి, ముసిముసిగా నవ్వి వెళ్ళిపోయిందంటే అర్ధం, మీరు తనని రహస్యంగా వచ్చి కలుసుకోమని. ఇవీ ఆమె చర్యలకు అర్ధాలు" అన్నాడు సాలోచనగా!

యువరాజుకి పట్టలేనంత సంతోషం కలిగింది. వేట చాలించి, పరివారంతో కలిసి దేవపురానికి తిరిగి వెళ్ళారు. తర్వాత ఇద్దరే మారువేషాల్లో బయలు దేరి, నేత్రపురం వెళ్లారు. అక్కడికి వెళ్ళి వాకబు చేస్తే తేలిందేమంటే - ఉత్తాన పాదుడు నేత్రపురాధీశుడు. పద్మావతి అతడి కుమార్తె.

అంతఃపురంలో ఉండే యువరాణి నెలా కలవటం? రాజు, మంత్రి కుమారులిద్దరూ, పద్మావతి దాసదాసీ జనుల వివరాలు సేకరించారు. యువరాణి పద్మావతికి పూమాలికలు అల్లి తీసికెళ్ళే దాసీ గురించి తెలుసుకున్నారు. ఆమె పూటకూళ్ళ ఇల్లు కూడా నడిపే పేదరాశి పెద్దమ్మ. పూలదండలని వైనవైనాలుగా అల్లే ఆమె చాతుర్యం రీత్యా, ప్రతీరోజూ యువరాణికి ఆమె పూలమాలలు తీసికెళ్ళి ఇచ్చేందుకు నియమింపబడింది.

రాజు, మంత్రి కుమారులిద్దరూ పూటకూళ్ళ అవ్వ ఇంట బస చేసారు. [పూర్వకాలపు హోటళ్ళనే పూటకూళ్ళ ఇళ్ళనే వాళ్ళు. అక్కడ డబ్బులిస్తే బస, ఆహారం దొరుకుతాయి.] విలువైన కానుకలిచ్చి, పూటకూళ్ళ అవ్వను బాగా మంచి చేసుకున్నారు. రెండు రోజులున్నాక అవ్వకు అన్ని విషయాలు చెప్పి, ఆమె ద్వారా పద్మావతికి తన రాక గురించి సందేశం పంపించాడు యువరాజు.

పూటకూళ్ళ అవ్వ యువరాణికి పూదండలిచ్చాక, ఎవరూ లేకుండా చూసి, యువరాజు రాక గురించీ, ఇతర వివరాలన్నీ చెప్పింది. అదంతా వినగానే పద్మావతి కోపంతో భగ్గుమంది. తన పదివేళ్ళనీ తెల్లని చల్లని చందనంలో ముంచి, ముసలవ్వ బుగ్గల మీద పదివేళ్ళ గుర్తులు పడేలాగా, చెంపల మీద సున్నితంగా కొట్టింది.

ఆపైన తిట్టి వెళ్ళగొట్టింది. పేద రాశి పెద్దమ్మ, యువరాణి కోపాన్ని చూసి, తిట్లు వినీ, దెబ్బలు తినీ, భయంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చింది. పులి పంజా నుండి తప్పించుకొచ్చిన లేడి కూనలా గజగజా వణుకుతూ, రాజు, మంత్రి కుమారులకి చెంపమీద వేళ్ళ గుర్తులు చూపిస్తూ పొగిలి పొగిలి ఏడ్చింది. యువరాజు ఏదో చెప్పబోయాడు.

అవ్వ”చాలు నాయనలారా చాలు! బహుశః ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసు కాబోలు. అందుకే అమాయకపు ముసలి దాన్ని నన్నెంచుకున్నారు. ఇంత వయస్సు వచ్చి, మీ చేతుల్లో ఇలా మోసగించబడ్డాను. ఇంతకూ మిమ్మల్నన పనేమిటి? ఇందులో మీ తప్పేం లేదు. తప్పంతా నాది. మిమ్మల్ని నమ్మి, ఈ వయస్సులో ఇలా భంగపడ్డాను!” అంటూ అంగలార్చింది.

పేదరాసి పెద్దమ్మ పెడబొబ్బలు విని యువరాజు మ్రాన్పుడిపోయాడు. యువరాణి పద్మావతికి కోపం రావట మేమిటని నిర్ఘాంతపడ్డాడు. పాపం, యువరాజుకి బెంగ కూడా వేసింది.

మంత్రి కుమారుడు యువరాజును ఊరడించి, ఏకాంత ప్రదేశానికి తీసుకుపోయాడు. "ఓ యువరాజా! ఆమె సామాన్యురాలు కాదు. ఎంత అందమైనదో, అంత తెలివైనది. ఆమె పేదరాశి పెద్దమ్మ చెంపల మీద, తెల్లని గంధంలో ముంచిన పదివేళ్ళ గుర్తులు పడేలా సున్నితంగా కొట్టింది. నిజంగా కోపం ఉన్నదే అయితే సున్నితంగా కొట్టదు. చెంపలు వాతలు తేలేలా కొట్టి ఉండేది. అంతే కాదు, కేవలం తిట్లతో సరిపెట్టేది కాదు, రాజు గారితో చెప్పి ముసలవ్వకు శిక్ష వేయించేది. కాబట్టి, ఆమెకు నీ మీద ప్రేమలేదని బెంగపడకు.

ఒక ప్రత్యేక సంకేతాన్నిచ్చేందుకే ఆమె ఇలా చేసింది" అన్నాడు. యువరాజు ఆతృతగా "అవునా? ఏమిటా సంకేతం?" అనడిగాడు.

మంత్రి కుమారుడు "ఇప్పుడున్నవి శుక్ల పక్షపు రోజులు. ఈ రోజు పంచమి. రానున్న రోజులన్నీ వెన్నెల రోజులే! నేటికి పదవ రోజున పున్నమి. తర్వాత కృష్ణ పక్షపు రోజులొస్తాయి. అప్పుడంతా చీకటిగా ఉంటుంది. కాబట్టి, మిమ్మల్ని పదిరోజులు పాటు వేచి ఉండమన్న సంకేతం పంపింది." అని విడమరిచి చెప్పాడు. యువరాజు స్థిమితపడ్డాడు. పదిరోజులు పది యుగాలుగా గడిపాడు. నిరీక్షణ అంతూ దరీ లేనట్లు తోచింది. పదిరోజులు గడిచాయి. పదకొండవ రోజున…

~~~~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes