RSS
Wecome to my Blog, enjoy reading :)

జ్ఞానమూ ప్రతికూలాంశం కావటం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 20]

విక్రమాదిత్యుడి సహాయంతో భేతాళుని వశపరుచుకొని, పిదప అతణ్ణి వెయ్యవ బలిగా కాళికాదేవిని సమర్పించవలెనన్నది జ్ఞాన శీలుని పన్నాగం.

దాంతో, మర్నాడు అతడొక సామాన్య సాధు వేషంలో, విక్రమాదిత్యుని సభా భవనానికి వెళ్ళి, మహారాజుకు కానుకగా ఒక దానిమ్మ పండుని సమర్పించాడు. ఒక్క మాటైనా మాట్లాడకుండా, మరుక్షణం అక్కడి నుండి నిష్ర్కమించాడు. కొన్ని రోజుల పాటు నిరంతరాయంగా అదే ప్రకారం చేసాడు.

అలాగే... ఒక రోజు ఈ సాధువు దానిమ్మ పండు విక్రమాదిత్యునికి సమర్పించి వెళ్ళిపోయాడు. మహారాజు దాన్ని ప్రక్కనే ఉన్న చిన్న బల్లపై ఉంచాడు. సభా భవనాన్ని ఆనుకొని రాజోద్యాన వనం ఉంది. కిటికీ లో నుండి పూదోట కనువిందు చేస్తుంటుంది. ఆ తోటలో చెట్టు కొమ్మమీద కూర్చొన్న కోతి దృష్టిని, ఈ దానిమ్మ పండు ఆకర్షించింది.

అది అమాంతం కిటికీ లో నుండి లోపలికి దుమికి, పండు చేతిలోకి తీసుకొని కసుక్కున కొరికింది.

ఆశ్చర్యం!

సన్నిని నీటి గొట్టం నుండి నీటి ధార ఎగజిమ్మినట్లు, దానిమ్మ పండులో నుండి కెంపులు జల జలా రాలి క్రింది పడ్డాయి. ఒక్కసారిగా సభలోని వాళ్ళంతా దిగ్ర్భమ చెందారు. విక్రమాదిత్యు మహారాజు, ప్రతీ రోజూ సాధువు యిస్తూ వచ్చిన దానిమ్మ పండ్లను, రాజమందిరంలో ఓ ప్రక్కన ఉంచి పట్టించుకోలేదు.


దాంతో విక్రమార్కుడు సేవకులను పిలిచి, ఆ పళ్ళన్నిటినీ తీసుకు రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు. దానిమ్మ పళ్ళను కోస్తే, ఒక్కోపండులో గింజలపేర్చి ఉన్నట్లుగా, మణిమాణిక్యాలున్నాయి! ఒక దానిలో రత్నాలు, మరో దానిలో మరకతాలు, ఇంకో దానిలో పుష్యరాగాలు, గోమేధీకాలు, తెల్లని మేలి ముత్యాలు... ఇలా!

అన్ని పళ్ళనూ కోసేటప్పటికి అక్కడ నవరత్నాలు రాశిగా పడ్డాయి. అదంతా చూసి సభికులూ, రాజూ కూడా ఆశ్చర్య పోయారు. విక్రమాదిత్యుడు ప్రతీ రోజూ తనకు పండ్లని సమర్పిస్తున్న సాధువు గురించి ఆలోచించాడు. తానెప్పుడూ అతడిని ఆదరించి పలకరించనందుకు చింతించాడు. ఒక్క మాట కూడా మాట్లాడ కుండా, తన పలకరింపును ఆశించకుండా, పండు సమర్పించి వెళ్ళిపోయే సాధువు పట్ల రాజుకు ఆశ్చర్యం గౌరవం కలిగాయి.

మరునాడు కూడా ఆ సాధువు సభలోకి వచ్చి, రాజుకు పండు సమర్పించాడు. విక్రమాదిత్యుడు అతణ్ణి ఆపి, ఆదరంగా పలకరించి, సుఖాసీనుణ్ణి చేసాడు. అతిధి మర్యాదలన్నీ చేసి, గౌరవంగా, "ఓ తపస్వీ! నా నుండి మీరు ఏం ఆశిస్తున్నారు? ఎందుకిలా మమ్మల్ని బహుకరిస్తున్నారు? నేను మీకు చెయ్యగల కార్యమేదైనా ఉంటే సెలవియ్యండి. తప్పక నెరవేరుస్తాను" అన్నాడు.

సామాన్య సాధు వేషంలో ఉన్న జ్ఞానశీలుడు, "ఓ రాజోత్తమా! చాలా రోజులుగా నాకొక ఆకాంక్ష ఉన్నది. అది నెరవేర్చగలనని నీవు నాకు ప్రమాణం చేస్తేనే, నేను నీకది వివరించగలను." అన్నాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వుతో "మీరు కోరినట్లే చేయగలను" అన్నాడు.

అంతట జ్ఞానశీలుడు "ఓ రాజేంద్రా! నా పేరు జ్ఞానశీలుడు. ఇక్కడికి దాపుల నున్న బృహదారణ్యంలోని కాళికా దేవి ఆలయంలో నేనొక యాగం నిర్వహిస్తున్నాను. రానున్న అమావాస్యకు ముందు రోజు, దయ ఉంచి నీవక్కడికి వచ్చినట్లయితే, అప్పుడు నీవు నాకు చేయగల ఉపకారం గురించి చెబుతాను. నీవు నాకై అది నెరవేర్చాలి. దాంతో నా యాగం పరి సమాప్తి కాగలదు" అన్నాడు అభ్యర్ధనగా!

విక్రమాదిత్యుడు ఆనందంగా అంగీకరించాడు. రాజిచ్చిన హామీతో జ్ఞాన శీలుడక్కడి నుండి వీడ్కొలు తీసుకున్నాడు.

అమావాస్యకు ముందు రోజు, విక్రమాదిత్యుడు బృహదారణ్యంలోని కాళీ మాత గుడికి వెళ్ళాడు. జ్ఞాన శీలుడు అత్యంత సంతోషంతో రాజుని ఆహ్వానించాడు. విక్రమాదిత్యుడు చెప్పమన్నట్లు చూశాడు.

జ్ఞాన శీలుడు "ఓ మహారాజా! నీవు సత్యవాక్పరిపాలకుడవు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఇచ్చటికి వచ్చావు. నేను నిన్నిక్కడికు ఎందుకు పిలిచానంటే -ఇక్కడకు అరామడ దూరంలో ఓ గొప్ప మోదుగ వృక్ష ముంది. శవ రూపంలో భేతాళుడు ఆ చెట్టు కొమ్మకు తల్లక్రిందులుగా వ్రేళ్ళాడుతుంటాడు. అతడెవ్వరికీ వశువు కాడు. అతణ్ణి వశపరుచుకోగల వాడవు నీవే! ఏ దోక విధంగా అతడిని నీవిక్కడకు తీసుకు రావాలి. ఇదే నీవు నాకోసం నిర్వర్తింపవలసిన కార్యం!" అన్నాడు.

విక్రమాదిత్యుడందుకు సమ్మతించి, భేతాళుడి కోసం బయలు దేరాడు. జ్ఞాన శీలుడందుకెంతో సంతోషించి, యాగాన్ని పూర్తి చేసేందుకు కావలసిన ఇతర ఏర్పాట్లు చేసుకోవడంలో మునిగి పోయాడు. అసలిందుకే అతడు విక్రమాదిత్యుడిని వెయ్యవ బలిగా ఎంపిక చేసుకొంది!

విక్రమాదిత్యుడు మోదుగ వృక్షాన్ని చేరి, దాని మీది శవాన్ని నిశవంగా గమనించాడు. చుట్టూ చీకటి! శ్మశానాన్ని తలపించే వాతావరణం, నిశ్శబ్ధం! రాజు కివన్నీ పట్టలేదు. చెట్టెక్కి శవాన్ని దించి భుజన వేసుకొని, కాళీ మాత ఆలయం వైపు అడుగులు వేశాడు.

శవంలోని భేతాళుడు విక్రమాదిత్యుణ్ణి పరిశీలించాడు.

భేతాళుడు "రాజా! ఎందుకు నన్ను మోసుకెళ్తున్నావు? నేనెవవ్వరికీ లొంగను. నేను నీకు వశుడను కావలెనంటే ఒక షరతు ఉంది. నేను నీకొక కథ చెబుతాను. ముగింపులో కథను గురించి ఒక ప్రశ్న అడుగుతాను. దానికి నీవు సరైన సమాధానం చెప్పాలి. అయితే నా ప్రశ్నకు జవాబు చెప్పేందుకు నీవు మౌనం వీడితే, మరుక్షణం నేను నీ భుజంపై అదృశ్యమై చెట్టుపై నుంటాను. అలాగని జవాబు తెలిసీ చెప్పకుండా మౌనాన్ని పాటిస్తే, నీతల వెయ్యి వక్కలౌతుంది. ఇదీ నియమం" అన్నాడు.

విక్రమాదిత్యుడందుకు అంగీకార సూచకంగా తలాండించాడు. మౌనాన్ని వీడక చిరునవ్వు నవ్వాడు. భేతాళుడు మొదటి కథ ప్రారంభించాడు.

[ఇక్కడ ఆసక్తి కరమైన అంశం ఏమిటంటే - కథ ద్వారా భేతాళుడిచ్చే ప్రవల్లిక (పజిల్ వంటి ప్రశ్నని)ని విక్రమాదిత్యుడు పరిష్కరించాలి. కానీ, విక్రమాదిత్యుడు మౌనభంగం చేసి ప్రశ్నకు జవాబిచ్చాడో... భేతాళుడు తిరిగి చెట్టెక్కేస్తాడు. తెలిసీ జవాబు చెప్పక పోతే... తల వెయ్యి వక్కలౌతుంది. విక్రమాదిత్యుడు సకల శాస్త్ర పారంగతుడు గనక, అతడు ఎలాంటి ప్రశ్నకైనా జవాబు చెప్పగలడు. దాంతో మౌనభంగమౌతుంది. అప్పుడు భేతాళుడు వశుడు కాడు. ‘భేతాళుడి ప్రశ్నకు విక్రమాదిత్యుడికి సమాధానం తెలియక పోవటం’ మాత్రమే దీనికి పరిష్కారం అవుతుంది. ఎప్పుడైనా, ఎక్కడైనా, జ్ఞానం కలిగి ఉండటం అనుకూలాంశం (Advantage) అవుతుంది. ఇక్కడ అది ప్రతికూలాంశం (Disadvantage) గా ఉంటుంది. అదే గమ్మత్తు!]

~~~~~~~~~

భట్టి విక్రమాదిత్యుల అన్ని కథలు !

01. భారతీయ సంస్కృతీ సంపద [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 01]

02. ధారా నగరం – వేట వినోదం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 02]

03. శరవణ భట్టు మంచె కథ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 03]

04. సువర్ణ సింహాసనం – మెట్టుకో బొమ్మ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 04]

05. వినోద రంజిత ప్రారంభించిన కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 05]

06. చంద్రవర్ణుడి కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 06]

07. అలంకార వల్లి – చంద్రవర్ణుడు [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 07]

08. చంద్రవర్ణుడి వివాహం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 08]

09. భట్టి విక్రమాదిత్యుల జననం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 09]

10. భర్తృహరి కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 10]

11. విక్రమాదిత్యుడి పట్టాభిషేకం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 11]

12. మేధో సాహసాల మేలు కలయిక![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 12]

13. ఉజ్జయినీ నగర నిర్మాణం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 13]

14. రంభ, ఊర్వశుల నాట్య వివాదం ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 14]

15. దేవేంద్రుని ఆహ్వానం! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 15]

16. ఎవరు గొప్ప నాట్యగత్తె !? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 16]

17. ఇంద్రుడిచ్చిన సింహాసనం! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 17]

18. సహస్రాయుష్మాన్ భవ ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 18]

19. మదనాభిషేక ప్రతిమ చెప్పిన కథ ప్రారంభం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 19]

20. భట్టి విక్రమాదిత్యుడు అన్ని కథలు !

21. జ్ఞానమూ ప్రతికూలాంశం కావటం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 20]

22. మూగ బాసల అర్ధాలేమిటి? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 21]

23. పైన కోపం – లోన ప్రేమ ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 22]

24. మంత్రి కుమారుడి మాయోపాయం ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 23]

25. ఆషామాషీ తీర్పులు చెబితే ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 24]

26. మంత్రవాది కథ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 25]

27. ఎవరు గొప్ప నిపుణులు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 26]

28. జ్ఞాని, సూత్రజ్ఞుడు, శూరుడు – ఎవరు గొప్ప?[భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 27]

29. విరిబోణి వివాహం [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 28]

30. విరిబోణికి భర్త ఎవరు? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 29]

31. చిలుకలు త్రికాలవేదులు ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 30]

32. మగవారినెందుకు నమ్మరాదు ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 31]

33. తప్పు చేయబోతే ముక్కు యిరుక్కుంది![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 32]

34. ఆడువారిని నమ్మరాదా !? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 33]

35. రాజు – సేవకుడు – ధర్మనిరతి ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 34]

36. కార్పటికుని కథ ! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 35]

37. ధనలాలస – ధర్మనిరతి! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 36]

మదనాభిషేక ప్రతిమ చెప్పిన కథ ప్రారంభం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 19]

రెండవ రోజు.... భోజరాజు, అతడి మంత్రులూ, పరివారమూ, సభాసదులూ తమ దైనందిన కార్యక్రమాలు ముగించుకొని, ఎంతో ఆతృతతో సభకు విచ్చేసారు.

భోజరాజు సువర్ణ సింహాసనాన్ని సమీపించాడు. సభికులంతా ఊపిరి బిగబట్టి చూడసాగారు. భోజరాజు తొలి మెట్టు మీద కాలు మోపాడు. వినోదరంజిత ప్రతిమ మౌనంగా ఉండిపోయింది. అతడు రెండవ మెట్టుపై కాలుపెట్టేందుకు పాదం ఎత్తాడు. అంతలోనే రెండవ మెట్టు మీద ఉన్న బొమ్మ చప్పట్లు చరుస్తూ బిగ్గరగా నవ్వింది.

ఆ బొమ్మ "చాలు భోజరాజా చాలు! నీ శ్రేయస్సు కోరి, మేము నీతీధర్మాలను చెబుతున్నాము. బహుశః వాటిని నీవు గ్రహించటం లేదు కాబోలు. నల్లని బండరాయిని మనం నీటిలో పెక్కు దినాలుంచి, తీసి కడిగినప్పటికీ, దాని నలుపు పోయి తెల్లగాను రాదు, మృదువుగానూ మారదు. ఇదీ అట్లే ఉన్నది.

తొలి మెట్టుపై గల వినోదరంజిత ప్రతిమ, నీకెన్నో విషయాలు చెప్పి యున్నది. కానీ నీవు పెడచెవిన బెట్టినావు. పైగా గొప్ప ఆడంబర సరళితో, మంత్రి పరివార సభికుల సహితంగా సింహాసనమెక్కగా వచ్చినావు. ఓ భోజరాజా! ఈ సువర్ణ సింహాసనము నీకు లభ్యమగునను కొనుచున్నావా?

నీ ప్రయత్నము, చిటారు కొమ్మనున్న తేనెపట్టును అందుకోవాలని, రెండు కాళ్ళు లేని అవిటి వాడు ఆశించినట్లుగా ఉంది. చాలు. ఇక్కడితో ఆగుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము. లేనిచో వెనుదిరిగి ఇంటికి బొమ్ము.

నీవీ సింహాసనమును పొందలేవని తెలుసుకో! ఓ భోజరాజా! నేను తదుపరి విషయాలను చెప్పుచున్నాను వినుము. విక్రమార్కుడు దయామూర్తి. కరుణాత్మడు. నీతీ ధర్మాలు గల వాడు. సహన శీలి. సహాయ శాలి. శాంతమూర్తి. ప్రేమాదరాలు గలవాడు. ధైర్య సాహసాలు గలవాడు. దైవభక్తి గలవాడు. ధర్మం పట్ల ధృఢమైన నమ్మకాలున్నవాడు. నీలో ఈ లక్షణాలు ఉన్నాయా? నీవు విక్రమాదిత్యునితో సరిపోలవని నిశ్చయంగా చెప్పగలను. కాబట్టి... సింహాసనాన్నధిరోహించాలనే కాంక్ష వదిలి, వెనక్కి మరలు!" అన్నది.

భోజరాజు, అతడి మంత్రులు కొన్ని క్షణాలు లజ్జ బిడియాలతో మాట్లాడక నిలుచున్నారు. పిదప భోజరాజు "ఓ ప్రతిమా మణీ! మీ మహారాజు యొక్క గుణగణాలు గురించి, మరింతగా వినవలెనని కోరుతున్నాము. అవి మాకు వినిపించి మమ్మల్ని ధన్యుల్ని చెయ్యి" అన్నాడు.

సువర్ణ ప్రతిమ అతడి సుగుణశీలానికి, వినయానికి సంతృప్తి చెంది "ఓ భోజ రాజేంద్రా! విను. నేను ఈ సింహాసనము పైని రెండవ మెట్టు పై గల ప్రతిమను. నా పేరు మదనాభిషేక. నిన్నటి దినాన, వినోద రంజిత ప్రతిమ చెప్పినట్లుగా... విక్రమాదిత్యుడు ఏడాదికి ఆరు మాసములు రాజ్యపాలన చేస్తూ, మిగిలిన ఆరు మాసములు దేశాటనంలో భాగంగా వివిధ ప్రదేశాలు సందర్శిస్తూన్నాడు.

ఆ రోజులలో ఉజ్జయినీ నగరానికి పది ఆమడల దూరంలో దట్టమైన అరణ్యముండెడిది. దాన్ని బృహదారణ్యమని పిలిచేవాళ్ళు. ఆ ఆరణ్యంలో కాళీకా దేవి ప్రాచీనాలయమొకటి ఉండేది. దానికి అర్ధామడ దూరంలో ఒక మోదుకు వృక్షం ఉండేది. [దాని ఆకులతో ఒకప్పుడు విస్తళ్ళు కుట్టేవారు. బాదం చెట్టు ఆకుల్లాగే!]

ఆ పెను వృక్షపు ఒక కొమ్మకు, తల్లక్రిందులుగా, భేతాళుడు శవ రూపంలో వేలాడు తుండేవాడు. [భేతాళుడు భూతాలకు రాజు. మహా శివుని ప్రమధ గణాలలో ఒక గణాధిపతి.]

అట్టి బృదహరణ్యంలో, జ్ఞాన శీలుడనే యోగి ఉండేవాడు. అతడు దీర్ఘకాలం తపస్సు చేసాడు. దాంతో ఎంతో శక్తి సంపన్నుడయ్యాడు. అయితే ఇతడు సద్గుణుడూ, కరుణా హృదయుడు కాడు.

ఒక నాడు అతడు తపస్సు వదిలి, భేతాళుని వశపరుచు కోవాలనీ, కాళికా దేవి కృపను పొందాలనీ తలచాడు. దేవీ ఆలయాన్ని చేరి, పూజాదికాలూ, క్రతువులూ నిర్వహించాడు.

నిరంతరాయంగా, కాళిక దేవి ప్రీత్యర్దమై, క్రతువు నాచరించ సాగాడు. దుశ్శీలుడైనా... అతడి కఠోర దీక్షకూ, మొక్కవోని సాధనకూ సంప్రీతురాలై, కాళికా దేవి అతడి యెదుట ప్రత్యక్షమైంది.

[నిజానికి తపస్సు అంటేనే సాధన. ఏళ్ళ తరబడి, నేటి శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు కూడా తపస్సు వంటివే! ఆయా పరిశోధనలలో వారు చేసే సాంకేతిక ఆవిష్కరణలు, దేవతల వరాల వంటివి. పురాణ కథలలో వరాలతో పొందిన విమానాది యంత్రాలు, మంత్రోచ్ఛాటనతో ఎవరికైనా ఉపయోగ పడటం వంటిదే... ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ యంత్రాలు!]

కాళికా దేవి, అతణ్ణి "ఓయీ! జ్ఞాన శీలా! ఏమి కావాలి నీకు?" అని అడిగింది.

అతడు "ఓ తల్లీ! విశ్వమాతా! నీవు ఎల్లప్పుడూ నా పట్ల సంప్రీతి కలిగి ఉండాలి.[ఎంత తెలివైన కోరికో చూడండి.] భేతాళుడు నాకు వశుడై, నా బంటుగా ఉండాలి. ఈ సకల ప్రపంచానికి నేను సామ్రాట్టుని కావాలి. ముసలి తనమూ మరణమూ లేకుండా, విక్రమాదిత్యుని సువర్ణ సింహాసనం మీద కూర్చొని, ఈ ధరావలయాన్నంతా నేను పరిపాలించాలి. ఇదీ నా కోరిక!" అన్నాడు.

కాళికా దేవి మర్మగర్భంగా నవ్వుతూ "ఓ యోగీ! నీవు పరమ కఠోరమైన కోరిక కోరుతున్నావు. అది తీరవలెనంటే నీవు వెయ్యిమంది రాజుల శిరస్సులు ఖండించి, ఈ యాగాగ్నిలో వ్రేల్చాలి. విను, అందులో వెయ్యవ రాజు అసమాన శూరుడూ, సద్గుణ శోభితుడూ అయి ఉండాలి. ఇది సాధ్యం గానట్లయితే, నీకు సముడైన యోగి తలను ఖండించి, బలిగా ఈ పీఠముపై నుంచి, పిదప యాగాగ్నిలో బడవేయుము" అని చెప్పి అంతర్ధాన మయ్యింది.

జ్ఞానశీలుడు వెయ్యిమంది రాజుల శిరస్సులను బలి యివ్వటానికే నిశ్చయించు కున్నాడు. ఎందుకంటే - తనకు సమానుడైన యోగి లభ్యంకావటం అసంభవం గనుక!

999 మంది రాజులను... యోగి వేషమున, తీయని మాటలతో, ఆశలు రేపి, మోసగించి తెచ్చి బలి యిచ్చాడు. ఇక ఒకే ఒక తల బాకీ ఉంది. వెయ్యవ బలిగా... జ్ఞానశీలుడు విక్రమాదిత్యుని ఎంచుకున్నాడు. అసమాన శూరుడూ, సర్వ సల్లక్షణ శోభితుడూ విక్రమాదిత్యుడే! అతడి సహాయంతో భేతాళుని వశపరుచుకొని, పిదప అతణ్ణే వెయ్యవ బలిగా దేవికి సమర్పించవలెనన్నది జ్ఞానశీలుని పన్నాగం.
~~~~~~~~~~

సహస్రాయుష్మాన్ భవ ![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 18]

ఆ విధముగా భట్టి పట్టు విడవకుండా ప్రార్దిస్తుండేసరికి, చివరికి కాళికాదేవి, భట్టిని మరింతగా పరీక్షింపనెంచి "మంచిది భట్టీ! నే చెప్పునది శ్రద్ధతో వినుము. నీ అన్నయైన విక్రమార్కుని శిరస్సును ఖండించి, నా ముందున్న బలిపీఠముపై బెట్టుము. అట్లయిన నీవడిగిన వరము నీయగలదానను" అన్నది.

భట్టి "సరి" యంటూ, విక్రమాదిత్యుని మందిరమునకు వెళ్ళాడు. ఆ అర్దరాత్రి సమయాన విక్రమాదిత్యుడు నిద్రించుచున్నాడు. భట్టి రాజు శయ్యను సమీపించాడు. ఆ శయన మందిరం, దేదీపమానముగా వెలుగుచున్న దీపాలతో పట్టపగలు వలె ఉన్నది.

భట్టి ఒర నుండి కత్తి తీసినాడు. దీపపు వెలుగులలో కత్తి అంచు పదునుగా మెరుస్తోంది. ఒక చేత కత్తిబట్టి, మరో చేత్తో విక్రమార్కుని తట్టి లేపాడు.

కళ్ళు తెరచిన విక్రమార్కుడు యెదుట భట్టిని చూచి "నా ప్రియమైన తమ్ముడా, భట్టి! ఇంత అర్దరాత్రి వేళ నీవిచ్చటికి వచ్చిన కారణమేమిటి?" అనినాడు.

భట్టి "ఓ రాజాధిరాజా! ఒక కార్యమునకై నాకు నీ తల అవసరపడినది. అందులకై అర్ధరాత్రి నీ మందిరమునకు వచ్చితిని" అన్నాడు. మరుక్షణం విక్రమార్కుడు "అటులైన తీసికో" అంటూ తిరిగి పరుండినాడు.

భట్టి విక్రమాదిత్యుని శిరస్సును ఖండించి, ఆ తలను చేత బట్టి, కాళికాలయమునకు వెళ్ళాడు.

ఖండించిన విక్రమాదిత్యుని శిరస్సును బలిపీఠం మీద ఉంచి, భట్టి భద్రకాళిని ప్రార్దించాడు. ఆ తల్లి ప్రత్యక్షమై, భట్టికి ఈ భూమిపై రెండు వేల యేళ్ళు బ్రతుకునట్లుగా వరమిచ్చింది.

తక్షణమే భట్టి విరగబడి నవ్వడం ప్రారంభించాడు. కాళికాదేవి, "భట్టీ! ఏల నవ్వుచున్నావు?" అని అడిగింది.

భట్టి వినయంగా "ఓ తల్లీ! మృఢానీ! రుద్రాణీ! దేవేంద్రుడు మా యన్న విక్రమాదిత్యునకు అమరావతిలో, నిండు కొలువులో, దేవతలు, మహర్షులు మహామహులందరి సమక్షంలో, వెయ్యేండ్లు రాజ్యమేలునట్లు వరమిచ్చినాడు. ఇది జరిగి నెల్లాళ్ళు కూడా కాలేదు. నెల లోపుననే, స్వయముగా నేనే, మా యన్న శిరమును ఖండించితిని. ఆయన మరణించినాడు. దేవేంద్రుడి వరమిట్లు తప్పిపోయినది. మరి నీవిచ్చిన వరమెట్లగునో? ఇది తలంచియే నవ్వితిని" అన్నాడు.

భట్టి బుద్ధి కుశలత కూ, సమయ స్ఫూర్తికీ, కాళికా దేవి ఎంతో సంతోషించింది. అతడి మేధస్సునూ, భక్తి వినయాలను, తన యందు నమ్మకమూ చూసి, ఆనందించింది. ఆ విధంగా భట్టి అమ్మవారి పరీక్షలో నెగ్గాడు.

ఆ తల్లి చిరునవ్వుతో "భట్టీ! నీవు తెలివైన వాడివి. నీ మేధస్సు, సాహసం, సమయస్ఫూర్తి... దేవతలలో సైతం కాన రాదు" అంది మెచ్చుకోలుగా.

భట్టి వినయంతో చేతులు జోడిస్తూ "తల్లీ! దేవతలతో నన్ను పోల్చరాదు. నేను మానవ మాత్రుడను" అన్నాడు.

కాళీమాత "భట్టీ! ఓ మంత్రీ! నా వరములను శంకింపకు. ఇంకా నీకేమైనా కోరికలుంటే అడుగు" అన్నది.

భట్టి "అమ్మా! విక్రమాదిత్యుని బ్రతికింపుము" అన్నాడు. ఆ తల్లి నవ్వుతూ, విక్రమాదిత్యుని బ్రతికించు ఉపాయం జెప్పి, అంతర్ధాన మయ్యింది.

భట్టి సంతోషానికి అవధులు లేకపోయాయి. విక్రమాదిత్యుని ఖండిత శిరస్సును తీసుకొని, రాజ మందిరానికి పోయి, దేహానికి తల చేర్చాడు. దేవీ సూక్తాన్ని జపిస్తూ, కోవెల నుండి తెచ్చిన మంత్రజలాన్ని చల్లాడు. మరు క్షణం విక్రమాదిత్యుడు నిద్ర నుండి మేల్కొన్నట్లుగా లేచి కూర్చున్నాడు.

"భట్టీ! ఏమయ్యింది?" అనడిగాడు. భట్టి జరిగిందంతా చెప్పాడు. అది విని విక్రమార్కుని కెంతో సంతోషం కలిగింది. అయితే భట్టి విచారంలో మునిగి పోయాడు. అతడికి తన పొరబాటు అర్ధమయ్యింది.

"అన్నా! విక్రమాదిత్యా! నీవు స్వర్గానికి పోయి, ఈ భూమిపై వెయ్యేళ్ళు రాజ్యమేలునట్లు వరమందినావు. నా గురించి మరిచినావు. అది నాకు విచారమును, పరితాపమును కలిగించినది. అందుచేత నేను కాళీ మాతను ప్రార్ధించాను. అయితే ఆ కినుకలో, నేను రెండు వేల యేళ్ళు బ్రతుకునట్లు వరమడిగాను. కానీ ఇప్పుడు నాకు వాస్తవం అర్ధమౌతుంది. నీ తోడు లేకుండా, మోడులా... నేనెలా బ్రతక గలను? అయ్యో! ఎంత తప్పు చేసాను?" అని చింతించాడు.

విక్రమాదిత్యుడు "తమ్ముడా భట్టి! అది నీ తప్పు కాదు. నిశ్చయంగా నా పొరబాటే! స్వర్గలోకమున నుండగా నీ గురించి మరిచినాను. కానీ నీ తోడు లేకుండా నేనూ బ్రతకలేను. అది నాకు సంతోషము కాదు. అందుకే, నీవు వచ్చి నా తల నడిగినప్పుడు సంతోషముగా ఇచ్చాను. ఇప్పుడు ఇద్దరమూ సంకటంలో పడ్డాము. ఎలా దీనిని పరిష్కరించగలం?" అన్నాడు సాలోచనగా.

[ఇది మానవ మనస్తత్త్వ రీత్యా కూడా యదార్ధమే! ఆగ్రహంగా ఉన్నప్పుడు మరేవీ గుర్తు రావు. అన్న తనని మర్చిపోయాడు అనే కోపంలో భట్టి ఒకటికి రెండువేల యేళ్ళు బ్రతికేటట్లు వరం కోరుకున్నాడు. అలాగే అత్యంత ఆనందంగా ఉన్నప్పుడు కూడా మరేవీ గుర్తుకు రావు. స్వర్గంలో ఉన్నప్పుడు విక్రమాదిత్యుడు, భట్టి గురించి మర్చిపోయాడు.]

ఇద్దరూ కాస్సేపు ఆలోచనలో మునిగి పోయారు. కొంత సమయం గడిచింది. ఒక్క క్షణం! భట్టి ముఖం సంతోషంతో వెలిగి పోయింది. "అన్నా!" అని అరిచాడు. విక్రమాదిత్యుడు చెప్పమన్నట్లుగా చూసాడు.

భట్టి "దేవేంద్రుడు మీకు వెయ్యేళ్ళు ఈ సింహాసనం మీద కూర్చొని రాజ్యమేలునట్లుగా వరమిచ్చాడు. కాబట్టి సంవత్సరంలో ఆరు మాసములు మీరు రాజ్య పాలన చేయండి. మిగిలిన ఆరు మాసములు ఈ భూమీ మీద గల వింతలూ విడ్డూరాలు చూస్తూ, దేశాటనం చేయండి. మీరు లేని ఆరునెలలు నేను రాజ్య పాలనాభారం వహిస్తాను. మనమిద్దరం కలిసి దేశాటనం చేయబోయినప్పుడు, మన మంత్రులు రాజ్య రక్షణ పర్యవేక్షిస్తారు. దీనికి మీరేమంటారు?" అన్నాడు.

పట్టరాని సంతోషంతో విక్రమార్కుడు, తన ప్రియమైన తమ్ముడు భట్టిని కౌగిలించుకున్నాడు.

ఆ రోజు నుండి భట్టి విక్రమాదిత్యులరువురూ కలసిమెలసి, రాజ్య పాలన మొదలు అన్నివిషయాలలోనూ చర్చించుకుంటూ, సహకరించుకుంటూ గడప సాగారు. ఒకరి నొకరు గౌరవించుకుంటూ, ఒకరి నొకరు ప్రేమించుకుంటూ....! వారి మధ్య ప్రేమాను బంధం, వారి రాజోచిత జీవితానికి.... బంగారానికి పరిమళం అద్దినట్లుగా శోభాయమానం అయ్యింది.

రాజ్యంలోని రైతుల, ఇతర వృత్తుల ప్రజల ఆదాయం నుండి 6 వ వంతను శిస్తుగా గ్రహిస్తూ... ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని, వారి సమస్యలు పరిష్కరిస్తూ, రాజ్యపాలన సాగించారు. ప్రతీ విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటూ, రాజ్యాన్ని, పరిపాలనని పర్యవేక్షించారు. రాజోద్యోగులందరూ వినయంతోనూ, సేవాభావంతోనూ.... అటు రాజు మంత్రులనీ, ఇటు ప్రజలనీ సేవించుకుంటున్నారు.

రాజ్యంలో పౌరులూ, పాలనాధికారులూ, అన్ని వృత్తుల వాళ్ళు ఒకరికొకరు సహకరించు కుంటూ, సదవ గాహనతో వ్యవహరిస్తున్నారు. పిల్లి ఎలుకలు కలిసి ఒకేచోట ఆడుకుంటున్నాయి. పులీ ఆవులు ఒకే ఒడ్డున నీరు త్రాగుతున్నాయి. నెలకు నాలుగు వానలు కురుస్తున్నాయి. పంటలు విరివిగా పండుతున్నాయి. వాతావరణ చల్లగా, పచ్చగా, ఆహ్లాదంగా ఉంది.

ఇంత వరకూ కథ చెప్పి, వినోద రంజిత ప్రతిమ, "ఓ భోజ రాజేంద్రా! విన్నావు కదా, విక్రమాదిత్యుని ధైర్యసాహసాల గురించీ, ధర్మ వర్తన గురుంచీ! ఈ ప్రపంచమున తమ్ముడి కోరిక తీర్చటానికై తన తలనిచ్చే వారెవ్వరైనా ఉన్నారా?

విక్రమాదిత్యుని సౌశీల్య గుణములలో నూరింట ఒక వంతైనా, నీవు కలిగి ఉన్న పక్షంలో, ఈ సింహాసన మధిరోహించే ప్రయత్నం చెయ్యి. లేదా... వచ్చిన దోవను బట్టి ఇంటికి బోవుట మేలు!" అని మౌనం వహించింది.

భోజరాజు, అతడి ప్రధాని బుద్దిసాగరుడు, ఇతర మంత్రులూ, సర్వసభికులూ... అప్పటి వరకూ అమిత ఆశ్చర్యంతో, వినోద రంజిత చెప్పిన కథను విన్నారు. తిరిగి చూస్తే ఏముంది? అప్పటికే సూర్యాస్తమయం అయిపోయింది. సభని మరునాటికి వాయిదా వేసి, అందరూ ఇళ్ళకి మరలారు.

భోజరాజు అంతఃపురాన్ని చేరి... ఆలోచిస్తూనే, స్నానపానాదులు ముగించి నిద్రకుపక్రమించాడు.

~~~~~~~~

ఇంద్రుడిచ్చిన సింహాసనం! [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 17]

విక్రమాదిత్యుడికి వీడ్కొలు ఇస్తూ, దేవేంద్రుడా మహారాజును ఎంతగానో సత్కరించాడు. ప్రశంసలతో బాటుగా ప్రేమాదరణలనీ పంచాడు. ముప్పది రెండు మెట్లతో ఉన్న ఈ స్వర్ణ సింహాసనాన్ని, దేవేంద్రుడు విక్రమాదిత్యునికి కానుకగా ఇచ్చాడు. ఒకో మెట్టు పైనా ఒకో సుందర సువర్ణ ప్రతిమలున్న ఈ సింహాసనం అపూర్వమైనది. ఇంద్ర పట్టాభిషేక మహోత్సవ సమయంలో, దేవేంద్రుడికి, మహాశివుడు ఇచ్చిన సింహాసనమిది.

దేవేంద్రుడు "ఓ విక్రమాదిత్య భూపతీ! నీవు ఈ సువర్ణ సింహాసనాసీనుడివై వెయ్యేండ్లు రాజ్య మేలెదవు గాక! ఇది నేను నీకు ప్రీతితో ఇస్తున్న వరము. నీకు సర్వదా శుభమగు గాక!" అన్నాడు.

విక్రమాదిత్యుడు దేవేంద్రునికి వినయమంతోనూ, మైత్రితోనూ నమస్కరించి, కృతజ్ఞతలు తెలిపి, వీడ్కొలు తీసుకున్నాడు. దేవేంద్రుడు మాతలికి విక్రమాదిత్యుని ఉజ్జయినిలో దింపి రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు.

మాతలి ఎంతో వినయ విధేయతలతోనూ, ఆరాధన తోనూ... విక్రమాదిత్యునికి చేయి అందించి, రధమున ఆసీనుణ్ణి చేసి, స్వర్ణ సింహాసనముతో సహా ఉజ్జయినికి తీసుకు వచ్చాడు. విక్రమాదిత్యుడి ఆనతి మేరకు, ఉజ్జయిని మహాంకాళి ఆలయము వద్ద దిగవిడిచి, వీడ్కొలు తీసుకున్నాడు.

విక్రమాదిత్యుడు ముందుగా కాళికాదేవి కోవెలలోకి వెళ్ళి, పూజాదికాలు ముగించి, తదుపరి తన భవనానికేగినాడు. భట్టి రాజుని చూడవచ్చాడు.

విక్రమాదిత్యుడు "తమ్ముడా!భట్టి! దేవేంద్రుడు ప్రీతితో నాకు స్వర్ణ సింహాసనమును బహుకరించినాడు. అది ఉజ్జయిని కాళీమాత ఆలయము వద్ద ఉన్నది. సేవకులను పంపి, దానిని తెప్పించి, మన సభా భవనమున ప్రతిష్ఠించు" అని ఆజ్ఞాపించాడు.

భట్టి ఆ ఏర్పాట్లన్నీ కావించి, అన్న దగ్గరకు తిరిగి వచ్చాడు. "ఓ విక్రమాదిత్య మహారాజా! మీరు అమరావతికి వెళ్ళినప్పటి నుండి ఇప్పటి వరకూ జరిగిన వాటినన్నింటి గురించీ తెలుసుకోవాలని, మాకందరికీ ఎంతో కుతుహలంగా ఉంది. దయచేసి వివరించండి" అన్నాడు.

విక్రమాదిత్యుడన్నీ పూసగుచ్చినట్లుగా వివరించాడు. స్వర్ణ సింహాసనాన్ని చూపుతూ "సభాసదులారా! తమ్ముడా, భట్టీ! ఈ బంగారు సింహాసనాన్ని మహేశ్వరుడు దేవేంద్రుని కిచ్చినాడట. నాయందు ప్రీతితో, దేవేంద్రుడిది నాకిచ్చినాడు. దీనిపై గూర్చుండి వెయ్యేండ్లు రాజ్యమేలునట్లుగా, దేవేంద్రుడు నాకు వరమొసంగినాడు. మాతలి రధముపై దీన్నితెచ్చినాడు. ఇదీ జరిగిన విశేషము" అన్నాడు.

భట్టీ "అన్నా! నీవు వెయ్యేళ్ళు రాజ్యమేలునట్లు వరము నందినావు. నీ ప్రియ సోదరుడనైన నా కొఱకు ఏ వరమునూ తేలేదా?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు "తమ్ముడా! మరచినాను" అన్నాడు ఒకింత విచారంగా!

భట్టి "నిజము. అది సహజమే! స్వర్గమునకు బోయినపుడు భూమిపైని విషయములు, బంధములు మరచుట సహజము. సరియె, పోనిమ్ము! గడిచిపోయిన వాటిపై దుఃఖించడం ఎందుకు? గతించిన వాటికై ఇప్పుడు దుఃఖించినా ప్రయోజనమేమున్నది?" అన్నాడు, ఒకింత కినుకగా!

ఈ విధంగా పలికి, భట్టి, అన్న వద్ద సెలవు పుచ్చుకొని తన మందిరానికి వెళ్ళాడు. పంచభక్ష్య పరమాన్నములతో కూడిన రాజోచిత భోజనాన్ని ఆరగించి, పట్టుపరుపులు పరచిన హంస తూలికా తల్పం పైన పవళించాడు. కానీ భట్టికి నిద్ర రాకున్నది.

"నేనూ రెండు వేల ఏళ్ళు బ్రతకవలెనని ఆకాంక్ష కలుగుచున్నది. అది యెట్లు సాధ్యమగును? విక్రమాదిత్యుడు దేవేంద్రుని మెప్పించి వరమును పొందినాడు. నేనేమి చేయవలె? ఆ! నేనెందుకు మా కులదేవతయైన మహంకాళి దేవి అనుగ్రహముపొంది వరముల గోరరాదు? అవును! అదే సరియైన పని." అనుకున్నాడు.

ఇట్లాలోచించిన భట్టి, దిగ్గునలేచి, రత్నాభరణములనూ, రత్నఖచిత ఖడ్గమునూ ధరించి, అప్పటికప్పుడే... రాత్రి పది ఘడియల వేళ భద్రకాళి గుడికేగినాడు.

ఆ సమయానికి ఉజ్జయినీ కాళీమాత ఆలయమున లేదు. నగర రక్షణనూ, బాగోగులనూ పర్యవేక్షించేందుకు, నగర సందర్శన చేయబోయినది. ఆలయమున దేవీ విగ్రహమందు తేజస్సులో వ్యత్యాసమును బట్టి, భట్టి ఇది గ్రహించినాడు. దేవళమునకు కాపున్న భూతగణముల పారద్రోలి, దేవళం తలుపులు బంధించి, అమ్మవారి విగ్రహం ఎదుట పద్మాసనస్థుడై ధ్యానమగ్నుడైనాడు.

కొంత తడవుకు కాళికా దేవి ఆలయమునకు తిరిగి వచ్చింది. ఆ తల్లికి అసాధ్యమన్నది లేకున్ననూ, తల్లిబిడ్డల నాడించి వినోదించురీతిన, తాను ఆలయములోనికి ప్రవేశించుటకు బంధించిన తలుపులు అడ్డుగానున్నట్లు "భట్టీ! తలుపులు తీయు"మన్నది.

భట్టి వినక ధ్యానము కొనసాగించినాడు. కాళీమాత నామాన్ని ఉచ్ఛరిస్తున్నాడు. ఆ తల్లి ముదముతో భట్టి ఎదుట ప్రత్యక్షమైనది. ఆమెకు భట్టి యొక్క భక్తి, వినయాలు చూసి ముచ్చట కలిగింది. "బిడ్డా, భట్టీ! ఇంత రాత్రివేళ ఏల ఇక్కడికి వచ్చితివి? ఎందుకీ విధమున నా నామస్మరణ చేయుచున్నావు?" అని అడిగింది.

భట్టి ఆ తల్లికి నమస్కరిస్తూ "అమ్మా! మా బంగారు తల్లి! వరాల తల్లి! సౌందర్యరూపిణీ! దయామూర్తీ! నీవు అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకివి! నీకు వేనవేల నమస్కారములు. ఎందులకు నిన్ను ప్రార్దించుచుంటినని అడిగితివి కదా? నాకు నీవు వరములు ప్రసాదించగలవు తల్లీ!" అన్నాడు.

భద్రకాళి "వత్సా! ఏమి కావలయును నీకు?" అనడిగింది.

భట్టి "తల్లీ! సకల జగత్తుకూ రక్షణ నిచ్చుదానవు. నీ భక్తుడూ, నా సోదరుడూ అయిన విక్రమాదిత్యుడు... అమరావతి కేగి, ఇంద్రుని మెప్పించి, ఈ భూమిపై వెయ్యేళ్ళు రాజ్యమేలునట్లు వరములు పొందినాడు. నన్ను మరచినాడు. దేవేంద్రుడిచ్చిన సువర్ణ సింహాసనముతో తిరిగి వచ్చినాడు.

నాకు నీవు తప్ప ఇతరులు తెలియదు. నీవు తప్ప అన్యధా శరణ్యము లేదు. నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను. నిన్నే కొలుచుచున్నాను. నిన్నే సేవించుకుంటున్నాను. నాకు నీవే రక్ష! కాబట్టే - నీ భక్తుడైన నేను నీ దగ్గరికీ వచ్చినాను. నీ దగ్గరకు గాక ఎటుకేగ గలను? నీవు తప్ప ఎవరు నా ఆశలు తీర్చువారు? తల్లీ! ఓ అమ్మా! ఈ భూమిపై రెండు వేల ఏళ్ళు, సుఖంబుగా బ్రతుకు నటుల నాకు వరమీయ గదే!"అని ప్రార్దించాడు.

ఇది విని కాళికా దేవి "ఓ మంత్రీ! భట్టీ! నీకు నేనట్టి వరములనీయలేను" అని మౌనము దాల్చింది. భట్టిని పరీక్షింపవలెనని ఆ తల్లి సంకల్పం! భట్టి ఆమెను పరిపరి విధముల ప్రార్దించినాడు.

"ఓ తల్లి! నీవు అమ్మలగన్న యమ్మవు. దయా రూపిణివి. విశ్వమాతా! నీకు అసాధ్యమన్నది లేదు. నీవే కాదనిన ఈ జగత్తున ఔనను వారెవ్వరు? నన్ను కరుణింపవే తల్లీ!" అంటూ పట్టు విడవకుండా దేవిని ప్రార్దించాడు.

సువర్ణముఖి నది కథ!

‘అనుభవమైతే గానీ తత్త్వం బోధ పడదంటారు’ పెద్దలు. అలాగే ‘తత్త్వం బోధపడితే గానీ సత్యం కళ్ళకు కనబడదు’. అందుకే పరిస్థితులు అర్ధం చేసుకోవాలంటే, దాని పూర్వాపరాలు ముందు తెలుసుకోవాలి. నిజానికి అవి పూర్వాపరాలు కాదు, పునాదులు.

అందుచేత ముందుగా ఆ పునాదుల గురించి చెబుతాను.

భారతీయులుగా మనం వేలసంవత్సరాల నుండి భగవద్గీతని నమ్ముతాం. భగవంతుడి శక్తిని, సత్యాన్ని నమ్ముతాం. కొన్ని నమ్మకాల పునాదుల మీద జీవన రమ్యహర్య్మాన్ని నిర్మించుకుంటాం. భారతీయుల రక్తంలో ఉంది ఈ నమ్మకాలతో కూడిన దృక్పధమే. అది చేటవంటిది. ప్రతిదానిలో చెడుని వదిలేసి మంచిని గ్రహించేటటువంటి బుద్ది. ఇలాంటి దృక్పధాన్ని, పురాణేతిహాసాలు, పండగలు, జీవన సరళి క్షణక్షణం సమాజానికి, వ్యక్తులకి నూరిపోసేవి.

కాబట్టే ఆ రోజుల్లో సర్వసంగ పరిత్యాగులు ఏంచెప్పినా ప్రజలు నమ్మేవాళ్ళు. అలాగే యోగులూ సామాజిక హితవు చెప్పేవాళ్ళు. ’సంసారమే త్యజించిన వారికి స్వార్ధం ఉండదు కదా! అందునా యోగి! ఇతడు మన హితవు కోరి చెబుతాడు. సత్యమే చెబుతాడు. మనం తిరగని ప్రాంతాలు ఇతడు తిరిగాడు. కాబట్టి మనకంటే ఇతడికి ఎక్కువ తెలుసు’ – ఇదీ యోగులని విశ్వసించటంలో ప్రజల దృక్పధం.

అయితే క్రమంగా ఆ స్థానాన్ని మీడియా ఆక్రమించాక, మంచి స్థానే చెడు ఎలా ఆక్రమించింది? ఆ మీడియా మరుగుపరచిన భారతీయ తత్త్వ చింతనని, తాత్త్విక మూలాలని, నమ్మకాల పునాదులని ఒకసారి పునః పరిశీలించాలి, జప్తికి తెచ్చుకోవాలి.

’చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు’, ’చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ!’ అంటారు పెద్దలు.

అంటే మనమేం చేస్తే ఆ ఫలితమే పొందుతామని దాని అర్ధం. మంచికి మంచి, చెడుకి చెడూ!

మనకున్న ప్రసిద్ధ పుణ్యకేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి. ధూర్జటికవి పుణ్యమా అని శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తి మహాత్మ్యమూ అలా నిలిచి ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రం దగ్గర సువర్ణ ముఖి నది ప్రవహిస్తోంది. ఇప్పుడంటే నీళ్ళు లేక, ఇసుక పర్రలతో కన్పిస్తోంది గాని, ఒకప్పుడు నీటిగలగలలతో శ్రవణపేయంగా ఉండేది.

ఆ నదికి, ఆ గుడికి సంబంధించిన [విశేషం] కథ ఇది –

సర్పం, ఏనుగుల భక్తి పోరాటంతో ప్రసిద్దమైన ఈ ఆలయ నిర్మాణం జరిగేటప్పుడు, వేలాదిగా శిల్పులూ, కూలీలు, ప్రజలు కూడా ఆ నిర్మాణ పనుల్లో పాలుపంచుకునేవారట.

సూర్యాస్తమయ వేళ, పనులు ముగించి, నదిలో కాళ్ళు చేతులూ కడుగుకొని, దోసిలిలో నీళ్ళు తీస్తే, ఆ దోసిట్లో తాము ఆ రోజు పడిన శ్రమకు తగిన కూలీ, బంగారు నాణాల రూపేణా దొరికేదట. ఎవరెంత పనిచేస్తే అంతగా! ఎక్కువపని చేసిన వారికి ఎక్కువ నాణాలు, తక్కువ పనిచేసిన వారికి తక్కువ నాణాలు. అందుకే ఆ నదికి ’సువర్ణముఖి’ అన్న పేరు వచ్చిందట.

పనిచెయ్యకుండా… చేసినట్లు నటిస్తే, లేదా మేస్త్రీ[పైఅధికారి]కి కాకా కొడితే పైఅధికారి డబ్బు ఇస్తాడేమో గానీ భగవంతుడివ్వడుగా![పైఅధికారి ఇచ్చింది కూడా వచ్చిన దారిలోనే పోవడం కద్దు. ఈ వైచిత్రి చూడగల కళ్ళుండాలి అంతే!] అంచేత ఈ పైరవీలన్నీ సువర్ణముఖి నది దగ్గర చెల్లేవి కాదన్నమాట.

ఈ కథ[విశేషం] చెబుతూ పెద్దలు “ఎవరు చూసినా చూడకపోయినా మనమేం చేస్తున్నామో భగవంతుడు చూస్తాడు. ఇవ్వాల్సిందే ఇస్తాడు. తస్మాత్ జాగ్రత్త!” అని చెప్పేవారు.

కాబట్టే మనం చేసిన మంచి, తరతరాలు మన పిల్లాపాపల్ని కాపాడుతుంది. చేసుకున్న చెడు భావితరాలని కూడా కట్టికుడుపుతుంది. అందుకే పాపభీతి, దైవభక్తి, పుణ్యప్రీతి ఉండాలి అనుకునేవాళ్ళు.

ఎవరు నమ్మినా నమ్మకపోయినా, ఎవరు – దీన్ని తమ జీవితాల్లోనూ, చుట్టూ అందరి జీవితాల్లోనూ పరిశీలించగలిగినా లేకపోయినా, ఇది సత్యం. సోదాహరణంగా కనబడినప్పుడయినా, దీన్ని నమ్మకతప్పదు.

ఎవరు గొప్ప నాట్యగత్తె!? [భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 16]

మరునాటి సభకు విక్రమాదిత్యుడు రహస్యంగా విభిన్న రకాల, వాసనల పుష్పములను సేకరించాడు. రంభ ఊర్వశుల నాట్య కౌశలాన్ని పరీక్షించేటందుకు, ఆ పుష్పాలతో రెండు దండలను కూర్చాడు. ఆ దండల నడుమ విష కీటకాలని ఉంచాడు. దండలను ఎంత నేర్పుగా అల్లాడంటే..... ఇతరులెవరు చూసినా విరిదండ విలక్షణంగా ఉందనుకుంటారే గాని, లోపల పురుగులున్నాయని గుర్తించలేరు. రెండు దండలనూ విక్రమాదిత్యుడు సభకు తీసుకుని వెళ్ళాడు.

రంభ ఊర్వశుల నాట్య పోటీ ప్రారంభమైంది.

విక్రమాదిత్యుడు వాళ్ళిద్దరినీ దగ్గరికి పిలిచి, "మీరు రిక్త హస్తాలతో నాట్యం చేస్తే, అదంత ఆకర్షణీయంగా ఉండదు. కాబట్టి, ఇదిగో ఈ పూలహారాలని చేత ధరించి, నాట్యం చేయండి" అంటూ.... రంభ ఊర్వశిలకి చెరో దండనీ అందించాడు. వాళ్ళిద్దరూ నాట్యాన్ని పునఃప్రారంభించారు.

నాట్యం చేస్తున్న వేళ, రంభ, తన చేతిలోని దండని గట్టిగా పట్టుకుంది. దానితో దండలోపల దాచబడిన క్రిములు వత్తిడికి గురయ్యాయి. ఆమెని ఇబ్బంది పెట్టసాగాయి. దాంతో ఆమె నాట్యానికి అంతరాయం ఏర్పడసాగింది. శృతిలయలకు అనుగుణంగా పడాల్సిన అడుగులు తాళం తప్పుతున్నాయి. ఆమె చేతిలోని దండ నుండి పువ్వులు రాలి పడుతున్నాయి.

అదే సమయంలో ఊర్వశి, తన చేతిలోని దండని అలవోకగా పట్టుకొని నాట్యం చేయసాగింది. దానితో దండ లోపలి క్రిములకి ఏ వత్తిడీ కలగ లేదు. అవీ ఆమెని ఇబ్బంది పెట్టలేదు. ఆమె నాట్యం నిరంతరాయంగా, శృతిలయలకు అనుగుణంగా, తాళ బద్దంగా సాగుతోంది. ప్రేక్షకులని సమ్మోహన పరుస్తోంది. ఆమె చేతిలోని దండలో పువ్వులు... ఆమెలాగే అందంగా, ముగ్ద మనోహరంగా ఉన్నాయి.

వారి నాట్య ప్రదర్శన ముగిసాక, దేవేంద్రుడు "ఓ విక్రమాదిత్యా! సాహసీ! సునిశిత దృష్టి కలవాడా! ఈ నాట్య పోటీలో విజేత ఎవరు? రంభ, ఊర్వశిలలో ఎవరిని ఉత్తమ నాట్య ప్రవీణగా నీవు నిర్ణయించావు?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు చిరునవ్వుతో "దేవేంద్ర! ఊర్వశి ఉత్తమ నాట్యగత్తె" అన్నాడు స్థిరంగా!

దేవేంద్రుడు ఓ క్షణం ఆశ్చర్యచకితుడయ్యాడు. కుతూహలంగ "ఎలా నిర్ణయించగలవు?" అన్నాడు.

విక్రమాదిత్యుడు.... రంభ, ఊర్వశిలిద్దరినీ పిలిచి "నేను మీకిచ్చిన దండలేవి?" అని అడిగాడు.

వెంటనే ఊర్వశి తన చేతిలోని పూలహారాన్ని విక్రమాదిత్యుడికి అంద చేసింది. దాన్లోని పూలన్నీ చెక్కు చెదరనట్లుగా, తాజాగా, ముగ్దగా ఒదిగి ఉన్నాయి. రంభ, నాట్యం మధ్యలోనే తన చేతిలోని పూదండని దూరంగా గిరాటు వేసింది. అందులోని క్రిములు ఆమె చేతుల మీద పారాడి, కుట్టి, ఇబ్బంది పెట్టాయి మరి!

విక్రమాదిత్యుడు అడగటంతో, రంభ... సభామండపంలో తాను పూదండని విసిరిన చోటి కెళ్ళి, దాన్ని తెచ్చి అందించింది. అందులోకి పుష్పాలు కొన్ని రాలిపడి పోయి, అక్కడక్కడా దారం బయటపడింది.

ఆ దండలని చూపుతూ విక్రమాదిత్యుడు "దేవేంద్రా! ఈ రెండు దండలలోని వ్యత్యాసాన్ని గమనించండి. రంభ దండతో నాట్యం చేయలేక దూరంగా విసిరివేసింది. ఊర్వశి దండ చేతనుంచుకునే నాట్యమాడింది. నేనిద్దరికీ దండలిచ్చి, వాటిని చేత ధరించి నాట్యం చేయమన్నాను. బహుశః రంభ ఈ దండభారాన్ని సైపలేకపోయినట్లుంది" అన్నాడు మర్మగర్భంగా!

ఇలా అంటూనే విక్రమాదిత్యుడు, రెండు దండలనీ విడదీసాడు. వాటిల్లోంచి విషక్రిములు బయటకు వచ్చాయి. అది చూసి అందరూ ఆశ్చర్య పడుతుండగా విక్రమాదిత్యుడు "దేవేంద్రా! ఊర్వశి పూలదండని అలవోకగా పట్టుకోవటం చేత, ఈ క్రిములామెని పీడింపలేదు. రంభ పూదండని గట్టిగా పట్టుకోవటం చేత, అవి ఆమెని గాయపరిచాయి. కాబట్టి, ఆమె దండని గిరాటు వేసింది.

ఊర్వశికి, తన నాట్య కౌశలం మీద తనకి నమ్మకం ఉంది. ఆమె విజయాన్ని గురించి ఆందోళన చెందలేదు. కాబట్టి - ఆమె ప్రశాంత చిత్తంతో, స్వేచ్ఛగా నాట్యం సలిపింది. కనుక దండని అలవోకగా పట్టుకుంది.

రంభ తన నాట్యం గురించి, విజయం గురించి ఆందోళిత హృదయంతో ఉంది. దాంతో ఆమె తన నాట్యగతిని తప్పింది. నాట్య మాడు వేళ, ఆమె వత్తిడితోనూ, గెలుపు గురించిన బెంగతోనూ ఉంది. దాంతో దండని గట్టిగా పట్టుకుంది. దాంతో అందులోని క్రిములామెని కుట్టి బాధించాయి. అది భరించలేక రంభ దండని విసిరి కొట్టింది.

అదీ... వీరిద్దరి నాట్య కౌశలంలోని వ్యత్యాసం! అందుచేతే, నేను ఈ నాట్య పోటీలో విజేతని ఊర్వశిగా నిర్ణయించాను" అన్నాడు.

[నిజానికి ఇది భాగవద్గీతలో చెప్పబడిన బుద్దియోగమే! కర్మణ్యేవాధికారస్తే.... శ్లోకంలో, శ్రీకృష్ణుడు చెప్పినది ఇదే! మనం మన పని గురించే ఆలోచించాలి గానీ, ఫలితాన్ని గురించి కాదు. ఫలితం గురించిన ఆందోళన వదిలి, పని మీదే మన ఏకాగ్రత నిలిపినప్పుడు, విజయం దానంతట అదే వస్తుంది. ఈ విషయాన్ని, ఈ కథ... పిల్లల మనస్సులకి హత్తుకునేంతగా, ఆసక్తికరంగా చెబుతుంది.]

విక్రమాదిత్యుడి తీర్పు వినగానే, దేవసభలోని దేవతలు, మునులూ, మహామహులందరూ... హర్షాతిరేకంతో, జయజయ ధ్వానాలు చేసారు. విక్రమాదిత్యుడి మేధస్సునీ, సునిశిత ఆలోచనా పటిమనీ ప్రశంసించారు.

దేవేంద్రుడు ఊర్వశిని విజేతగా ప్రకటించి, గొప్ప కానులిచ్చాడు. రంభనూ ఉత్సాహపరుస్తూ, తగిన విధంగా సన్మానించాడు. ఆ సంఘటనని సభలోని అందరూ ఎంతో ఆనందించారు.

దేవేంద్రుడు "విక్రమాదిత్యా! నీవిచ్చటనే మా అతిధిగా మరో నాలుగు రోజులుండ వలెను. ఒక గొప్ప కానుకను నేను నీకివ్వనున్నాను" అన్నాడు ఎంతో ప్రేమాదరాలతో!

విక్రమాదిత్యుడికి దేవేంద్రుని పలుకులు ప్రవల్లిక[puzzle]లా తోచాయి. అయితే... కుతూహలం కొద్దీ కూడా, దేవేంద్రుడివ్వ బోయే ‘గొప్ప కానుక’ ఏమిటని అడగలేదు. విక్రమాదిత్యుడు అంతటి స్థిరబుద్ది కలవాడు, వస్తు సామాగ్రి, విలువైన కానుకల పట్ల మోహం లేని వాడు.
~~~~~~~

మెహమూద్ – కార్త్యవీర్యార్జునుడు !

ముందుగా ఒకటికి రెండు కథలు చెప్పి, వాటి అనువర్తనతో మా బ్లాగు చుట్టాలని అలరించాలని….

కైరో నగరంలో ఉన్న మెహమూద్, జరీనా దంపతులకు ఉన్న ఆస్తంతా ఒక బక్కచిక్కిన గొర్రెపిల్ల మాత్రమే!

ఒకనాడు జరీనా భర్తతో “ఏమండీ! నెలరోజుల్లో వర్షాకాలం రాబోతుంది. అప్పుడు కూలి పనులుండవు. అందుకని ముందుగానే మనగొర్రె పిల్లని అమ్మేసి ఆ డబ్బులు దాచుకుంటే మేలు” అని సలహా ఇచ్చింది.

సరేనని మెహమూద్ గొర్రెపిల్లని సంతలో అమ్మకానికి పెట్టాడు. అయితే ఆ బక్కగొర్రెను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. చేసేది లేక వెనుదిరిగి వస్తుంటే దారిలో ఒక శ్మశానం దగ్గర పచ్చిక విస్తారంగా ఉండడం కన్పించింది. ‘గొర్రెనిక్కడ ఎలా గోలా కొన్నాళ్ళు ఉంచితే, పచ్చిక తిని బలంగా తయారవుతుంది. అప్పుడు అమ్మితే మంచి ధర పలుకుతుంది’ అనుకుని ఒక ఉపాయం ఆలోచించాడు.

తిన్నగా కాటికాపరి ఆలీఖాన్ వద్ద కెళ్ళి “ఆలీభాయ్! నీకు ఈ గొర్రెపిల్లను కానుకగా యిద్దామని వచ్చాను” అన్నాడు.

“ఎందుకు?” అనడిగాడు ఆలీఖాన్ ఆశ్చర్యంగా.

“మరేం లేదు భాయ్! నేనా ఒంటరివాడిని. చనిపోతే నన్ను ఎవరు పూడ్చి పెడతారు? అందుకని ముందే సుంకంగా గొర్రెపిల్లని ఇద్దామని వచ్చా” అన్నాడు మెహమూద్. వీడెవడో మూర్ఖుడులా ఉన్నాడనుకున్న ఆలీఖాన్ లోలోపల సంతోషించి “ఓ! నిక్షేపంగా! నీవు చచ్చిన తరువాత నీ శవాన్ని పాతిపెడతానులే!” అంటూ గొర్రెపిల్లను తీసుకున్నాడు.

కొన్నాళ్ళు గడిచేసరికి గొర్రె తెగ బలిసింది. అది గమనించిన మెహమూద్, ఆలీఖాన్ దగ్గరకు వెళ్ళి “భాయ్! నేను మక్కా పోతున్నాను. నువ్వూ మూటాముల్లే సర్ధుకుని బయల్దేరు!” అంటూ తొందర చేశాడు.

“నీకు మతి చలించలేదు కదా? నీతో నేనెందుకు?” అన్నాడు ఆలీఖాన్.

“భలే వాడివే. నేను చస్తే పాతిపెట్టడానికి గొర్రెను తీసుకున్నావుగా? మరి నేను మక్కాలో పోతేనో? కాబట్టి పదపద” అన్నాడు మెహమూద్. ఆలీఖాన్ కి ఆరికాలి మంట నెత్తి కెక్కింది. “ఏంటీ? నీ గొర్రెను తీసుకున్న పాపానికి నీతో ఊరేగాలా? కుదర్దు. కావాలంటే నీ గొర్రె పిల్లని నువ్వే పట్టుకుపో” అంటూ కేకలేశాడు.

ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న మెహమూద్ “సరే… మరి నీ ఇష్టం!” అంటూ గొర్రెను తీసుకుని, తిన్నగా సంతకి వెళ్ళి మంచి ధరకి దాన్ని అమ్మేశాడు. వర్షాకాలంలో ఆ దంపతులకు ఏ లోటూ రాలేదు.

శ్రీపాద సత్యనారాయణ గారు వ్రాయగా, ఈనాడులో నేను చదివిన కథ ఇది. ఇందులో తెలివిగలిగిన మెహమూద్ [పేదవాడే కావచ్చు గాక] తన మేధోబలంతో కాటికాపరి అలీఖాన్ ని మోసగించాడు. ఎక్కడా “నా గొర్రెని నాకు ఇచ్చెయ్!” అన లేదు. కాటికాపరే, తనంతట తానే “గొర్రెని తీసేసుకో!” అనేలా చేసాడు. వెరసి కాటికాపారి కష్టాన్ని, మెహమూద్ దోచుకున్నాడు.

మరో కథ చూద్దాం. ఇది మన పురాణాల్లోని [భాగవతం] కథ. నరనారాయణులు తపస్సు చేసుకుంటూ ఉండగా, కార్త్యవీర్యార్జునుడు అనే రాజు, యుద్దకాంక్షతో అన్నిదేశాలూ తిరుగుతూ, ఆయా రాజుల్ని ఓడిస్తూ, యుద్దోన్మాదంతో తిరుగుతూ ఉంటాడు. అతడి యుద్దోన్మాదాన్ని భరించలేక, కొందరతడికి, “ఆశ్రమంలో నరనారాయణులున్నారు. వాళ్ళతో యుద్ధం చెయ్యి! నీ యుద్దకాంక్ష చల్లారుతుంది” అని సలహా ఇస్తారు.

కార్తవీర్యార్జునుడికి వేయిభుజాలు[చేతులు] ఉంటాయి. అమిత బలవంతుడు. ఆ బలగర్వంతోనే అందర్నీ యుద్దానికి ఆహ్వానిస్తూ, ఆ గెలుపులలో కలిగిన విజయగర్వంతో మరింత విర్రవీగుతూ, చివరికి యుద్దోన్మాది అయ్యాడు. అలాంటి కార్త్యవీర్యార్జునుడికి పైసలహా నచ్చింది. దాంతో నరనారాయణులు తపస్సు చేసుకుంటున్న ఆశ్రమానికి చేరాడు. యుద్దఘర్జనలు చేస్తూ వారిరువురినీ యుద్దానికి పిలిచాడు.

వారు “ఎందుకయ్యా యుద్దం! మేం ప్రశాంతంగా తపస్సు ఆచరిస్తున్నాం! మమ్మల్నెందుకు అలజడి చేస్తావు? వెళ్ళు!” అన్నారు. అతడు విన్పించుకోలేదు. ’యుద్ధం చెయ్యడానికి భయం కాబోలు!’ అని వెక్కిరించాడు. చేవలేదని ఛీత్కరించాడు. ఓడిపోతారని సంకోచమంటూ రెచ్చగొట్టాడు. ’యుద్ధం చెయ్యమని తన చేతులు తీటపెడుతున్నాయనీ, యుద్ధం చెయ్యకతప్పదనీ’ అన్నాడు. ’యుద్ధం చేస్తే వాళ్ళ ఓటమి, తన గెలుపూ ఖాయమనీ’ ప్రగల్భాలు పలికాడు.

అతడి గోలతో నరనారాయణుల ప్రశాంతత దెబ్బతింటోంది. చివరికి నారాయణ ప్రేరితుడై, నరుడు కార్త్యవీర్యార్జునుడితో యుద్ధం చేసేటందుకు లేచాడు. ఒక ధర్భను మంత్రించి, అదే శరంగా అంటే ఆయుధంగా సంధించాడు. కార్త్యవీర్యార్జునుడు ఎంతగా పెనుగులాడినా, ప్రతిఘటించ ప్రయత్నించినా నరుడు ప్రయోగించిన ఆయుధంతో యుద్ధం చెయ్యలేకపోయాడు. చివరికది అతడి 998 చేతులనూ ఖండించి, రెండు చేతులను వదలివేసింది.

పరాజితుడైన కార్త్యవీర్యార్జునుడు భయంతో, పశ్చాత్తాపంతో నరనారాయణుల కాళ్ళపైబడ్డాడు. అప్పుడు వారిరువురూ “కార్త్యవీర్యార్జునా! బలం ఉన్నది బలహీనులని బాధించేందుకు కాదు. వారిని రక్షించేటందుకు! ఇకనైనా బుద్ధిగా ప్రజలని, బలహీనులని కాపాడుతూ రాజ్యం చేసుకో!” అని చెప్పి పంపారు.

ఆ విధంగా భారతీయ ఇతిహాసాలు ’బలం ఉంటే, అది శారీరక బలం కానివ్వండి, మేధోబలం [తెలివి] కానివ్వండి, ఆ బలంతో బలహీనులని రక్షించాలి గానీ దగా చేయకూడదు, బాధించకూడదు’ అని చెబుతాయి! ఇలాంటి ధర్మాలని ప్రభోదిస్తూ భారతీయ ఇతిహాసాలు ప్రజా దృక్పధాన్ని పాపం, పుణ్యం అని ప్రభావపరుస్తాయి. కాబట్టే హిందూమతాన్ని మతాలకతీతంగా జీవన సరళి అనీ, సనాతన ధర్మమనీ అంటారు.

’నేను తెలివైన వాణ్ణి. చట్టప్రకారం వ్యాపారం చేసాను’ అని తను చేసిన మోసాన్ని సమర్దించుకుంటూ, ఎవరైనా అంటే…. ఏమనగలం? చట్టం మానవనిర్మితం. అది రాజ్యాంగం అనబడే ఓ పుస్తకాన్ని బట్టిఉంటుంది. కాని ధర్మం మానవత్వాన్ని బట్టి ఉంటుంది. దృక్పధాన్ని బట్టి ఉంటుంది. దాన్ని మతం ప్రబోధిస్తుంది. కాబట్టే ఏకాదశ నాడు ఉపవాసం చేసి [ఫలహారాలు తిని అన్నం తినకపోవటం ఉపవాసం కాదు, అసలు ఆహారమే గ్రహించక పోవటం ఉపవాసం అవుతుంది] ఆకలిని అనుభవపూర్వకంగా గుర్తుచేసుకున్న తర్వాత, ద్వాదశి రోజున అతిధి అభ్యాగతులకు భోజనం పెట్టి, ఆపైన ద్వాదశి పారాయణ చేయటం అన్నది సాంప్రదాయంగా ఉండేది.

డబ్బున్నవాడు పేదలకి దానధర్మాలు చేయటం, బలవంతుడు బలహీనుల్ని రక్షించటం అన్న క్షాత్రధర్మాన్ని పాటించటం, పండితుడు శాస్త్రజ్ఞానాన్ని ప్రజలకి బోధించటం – ఇలాంటి వాటిని తమకు తామే, స్వచ్ఛందంగా, తమ విద్యుక్తధర్మంగా పాటించి ఆచరించటం – ఇలాంటి వాటిని ఏ చట్టమూ ప్రేరేపించలేదు, ప్రజలు పాటించేలా చేయలేదు. వీటిని ఆచరించేలా చేసేది ప్రజల దృక్పధం మాత్రమే. ఆ దృక్పధాన్ని, అంటే ఆలోచనా సరళిని, పాపం పుణ్యం పేరిట ప్రభావ పరిచేది మత విశ్వాసాలే!

అలాంటిచోట, మత విశ్వాసాలని ధ్వంసం చేస్తే, ఇక ఆ జాతిని ధ్వంసం చేయటం ప్రాణంలేని కట్టెను తగలబెట్టినంత సులభం! కాబట్టి ప్రతీ మనిషి ఆర్ధికాభివృద్ధితోపాటు, ఆత్మోన్నతి కోసం ప్రయత్నించక తప్పదు. భాగవతంలో – ‘ధర్మమంటే సత్యమూ, భూతదయ, దానము, తపస్సు – ఈ నాలుగూ ధర్మం యొక్క పాదాలు’ అని చెప్పబడుతుంది.

దేవేంద్రుని ఆహ్వానం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 15]

ఇంకా ఆలస్యం చేస్తే.... నారద మహర్షికి ఆగ్రహం కలిగి శపించగలడని, మాతలికి భయం కలిగింది. దేవేంద్రుని రధాన్ని అలంకరించి, ఆకాశమార్గాన భూలోకానికి ప్రయాణ మయ్యాడు. రాత్రి పదహారు ఘడియలకు అతడు ఉజ్జయినీ నగరాన్ని చేరాడు. [ఘడియలన్నవి ఆనాటి కాలమానం.]

మాతలి దేవరధాన్ని ఉజ్జయినీ మహంకాళి ఆలయ సమీపంలో నిలిపాడు. విక్రమాదిత్యుని మందిరాని కేగి, విక్రమాదిత్యుని చూచి నమస్కరించాడు. "ఓ రాజేంద్రా! దేవేంద్రుడు మిమ్ము జూడగోరి యున్నాడు. నేను ఇంద్ర సారధి యగు మాతలిని. దేవపతి ఆనతి మీద మిమ్ములను స్వర్గమునకు తీసికొని పోవుటకు రధమును తెచ్చిన వాడను. మీ అభిప్రాయం బేమి?" అని అడిగాడు.

విక్రమాదిత్యుడు ప్రక్కనే ఉన్న భట్టిని సాభిప్రాయముగా తిలకించాడు. భట్టి కొన్ని క్షణాలు ఆలోచించి, "మహారాజా! ఇది ఎంతో విశేషమూ, ప్రత్యేకమూ కూడా! మీ కీర్తి చంద్రికలు స్వర్గలోకానికీ పరివ్యాప్తి చెంది ఉండవచ్చు. లేకున్న దేవేంద్రుడే మిమ్మల్ని ఆహ్వానించడు గదా? మీరు జాగు సేయక, తక్షణమే ప్రయాణమవ్వండి. ఇందులో శంకించడానికేమీ లేదు" అన్నాడు.

విక్రమాదిత్యుడు పట్టుపుట్టములనూ, రత్నాభరణములనూ ధరించి, భద్రకాళీ దేవాలయమునకు పోయినాడు. మహంకాళీ దివ్యదర్శనము చేసి కొని "ఓ దేవీ! ఓ తల్లీ! నీవు సమస్త లోకమాతవు. నన్నూ, ఈ లోకమును గాచు అమ్మవు. నేను నీ బిడ్డను. నీ భక్తుడను. దయతో నన్ను అనుగ్రహించు! కరుణా మూర్తివై నన్ను రక్షించు!!" అని ప్రార్దించాడు.

మహంకాళీ మాత అతడి ముందు ప్రత్యక్షమైంది. చిరునవ్వుతో "వత్సా, విక్రమాదిత్యా! నీవు స్వర్గమునకు వెళ్ళుము. ఈ యాత్ర నీకు శుభాన్నీ, కీర్తినీ కలిగించ గలదు. స్వర్గ భూలోకములలోని అందరికీ అది సంతోషాన్ని ఇవ్వగలదు" అని దీవించి... విభూతి, నిమ్మపండుల నిచ్చింది.

విక్రమాదిత్యుడు భక్తితో వాటిని స్వీకరించి, దేవరధాన్ని చేరాడు. అది దేవ రధమైనందున విక్రమాదిత్యుడు, ఎక్కబోయే ముందు దానికి ప్రదక్షిణలాచరించి, భక్తితో నమస్కరించాడు. పిదప కుడిపాదమెత్తి రధం మీద ఉంచాడు. అతడు రెండవ పాదమెత్తి రధములోనికి ఎక్కక మునుపే, మాతలి రధాన్ని, వాయువేగంతో ముందుకి ఉరికించ బోయాడు.

అయితే విక్రమాదిత్యుడు ఆందోళన చెందలేదు. అతడు తన పాదాలని భూమి మీద, రధం మీదా గట్టిగా నొక్కి ఉంచి స్థిరంగా నిలబడ్డాడు. ఆశ్చర్యం! రధం అంగుళం కూడా ముందుకి కదలలేదు.

మాతలి ఆశ్చర్యం పోయాడు. "ఏమిటది? రధం ఎందుకు కదలటం లేదు. ఏమి ఆశ్చర్యం ఇది? కారణమేమై ఉంటుంది?" అని ఆలోచిస్తూ వెనుదిరిగి చూశాడు. చిరునవ్వుతో స్థిరంగా నిలిచి ఉన్న విక్రమాదిత్యుణ్ణీ, అతడి ప్రయత్నాన్నీ గమనించాడు. మాతలికి భయమూ, విభ్రమమూ కలిగాయి.

‘నారద మహర్షి చెప్పినది సత్యమే! నేను దానిని సరికాదనుకొంటిని. ఇప్పుడీ వింతను కనులారా చూచితిని. మానవ మాత్రుడీ అద్భుతము చేయజాలడు. ఈ విక్రమాదిత్య మహారాజు నిజముగా దేవతా సముడే!’ అనుకున్నాడు.

వెంటనే మాతలి రధము దిగి వచ్చి, విక్రమాదిత్యుని ఎదుట నిలిచాడు. విక్రమాదిత్యునికి నమస్కరించి, "ఓ విక్రమాదిత్యా! రాజోత్తమా! నా తప్పును మన్నించు" అని ప్రార్దించాడు. మాతలికి ఎంతో సిగ్గుగానూ, పశ్చాత్తాపం గానూ తోచింది. అతడి మాటల్లో వినయం ఉంది. ముఖంలో దైన్యం ఉంది.

విక్రమాదిత్యుడు సాదరంగా చిరునవ్వు నవ్వి అతణ్ణి ఆశ్వాశించాడు. పిదప రధారూఢుడైన విక్రమాదిత్యుని మాతలి అమరావతికి ఆకాశ మార్గాన తీసికెళ్ళాడు. ఎంతో వినయ విధేయతలతో అతణ్ణి ఇంద్రసభకు తోడ్కొని పోయాడు.

విక్రమాదిత్యుడు ఇంద్రుడికి నమస్కరించాడు. దేవేంద్రుడు విక్రమాదిత్యుని చూడగానే ఎంతో ప్రసన్నుడయ్యాడు. తనలో ‘నారద మహర్షి సత్యము పలికినాడు. ఈతడి తేజస్సు దేవతలతో సరితూగు నట్టిది’ అనుకున్నాడు.

దేవేంద్రుడు విక్రమాదిత్యుడిని ఎంతో గౌరవంగా, ఆత్మీయ అతిధిగా ఆదరించాడు. సభలో విక్రమాదిత్యుడు సుఖాసీనుడయ్యాక, దేవేంద్రుడు "విక్రమాదిత్య మహరాజా! మీ రాజ్యము సస్యశ్యామలంగా, సిరిసంపదలతో నిండి ఉన్నదా? మీ ప్రజలు మీ పట్ల గౌరవ విధేయతలతో మొలుగు తున్నారు కదా? నీవు ప్రజల యోగ్యతా యోగ్యతలనీ, సామర్ద్య అసమర్దతలనీ ఎరింగి, వారికి కావలసిన అన్ని సదుపాయములూ సమకూర్చుతున్నావా? నీ రాజ్యమున ప్రజలకు నీ మంత్రులూ, రాజోద్యోగులూ ఇష్టులై ఉన్నారా?" అంటూ ప్రశ్నించాడు.

[చూడండి! ఒక రాజును అడిగిన ప్రశ్నలలోనే ఒక రాజ్యం, ఎలా ఉండాలో, పరిపాలనా విధానం (Administration) ఎలా ఉండాలో స్ఫురింపు ఉంది. రాజు ప్రజలకి అన్నీ సమకూర్చాలి. రాజు ప్రజల చేత గౌరవింపబడాలి. ప్రజలు ఉద్యోగులంటే ఇష్టం కలిగి ఉండాలి. ఇప్పటి స్థితో?]

విక్రమాదిత్యుడు "దేవేంద్రా! మీ దయతో మా రాజ్యంలో అన్నీ శుభప్రదంగానూ, ప్రవర్ధమానంగానూ ఉన్నాయి" అని ప్రత్యుత్తర మిచ్చాడు. దేవేంద్రుడు విక్రమాదిత్యునికి అతిధి గృహన్ని, అతిధి మర్యాదలని అమరించాడు. కామధేనువు విక్రమాదిత్యునికి కావలసిన వస్తు సంబరాలని, అమృతమయ ఆహారాన్ని సమకూరుస్తోంది.

విక్రమాదిత్యుడీ విధంగా పక్షం రోజుల పాటు దేవలోకములో గడిపాడు. ప్రతిదినమూ రెండు సార్లు దేవసభకు హాజరయ్యాడు. శాస్త్ర చర్చలలోనూ, ఆధ్యాత్మక చర్చలలోనూ పొల్గొనే వాడు. వివిధ విషయాలపై విక్రమాదిత్యుడి ఆకళింపును చూచి దేవేంద్రుని కెంతో ఆనందమూ, ప్రీతీ కలిగాయి.

ఒకనాటి సభలో... రంభ, ఊర్వశులిద్దరూ నాట్య చేయసాగారు. ఇద్దరూ అందంగా, ధగధగలాడే రత్నాభరణ భూషణులై, మిలమిల లాడే వస్త్రధారులై మెరిసి పోతున్నారు.

వారి నాట్య ప్రదర్శన సాగుతుండగా దేవేంద్రుడు, "ఓ విక్రమాదిత్య మహరాజా! రంభ, ఊర్వశి లిద్దరిలో ఎవరు గొప్ప నాట్య ప్రవీణులో నీవు నిర్ణయించాలి" అన్నాడు.

విక్రమాదిత్యుడు "రేపటి సభలో నా నిర్ణయం చెబుతాను. ఇప్పటికి వారిద్దరి నృత్యాన్ని ఆపించండి" అన్నాడు.

వారి నృత్య పోటీ మరునాడు కొనసాగించ వలసిందిగా ఆజ్ఞాపించ బడింది.
~~~~~

రంభ, ఊర్వశుల నాట్య వివాదం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 14]

వినోద రంజిత ప్రతిమ, ఇంత వరకూ కథ చెబుతూ ఇలా అంది. "ఓ భోజ రాజేంద్రా! తదుపరి కథని శుద్దాత్ముడవూ, శ్రద్దాత్ముడవూ అయి విందువు గాక!" అంటూ... ఇలా కొనసాగించింది.

భట్టి విక్రమాదిత్యుల పాలనలో రోజులలా హాయిగా గడిచి పోతుండగా...

ఒకనాడు...

అమరావతీ నగరంలో దేవ నర్తకీ మణులైన రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమా, ఘృతాచి, పుంజక స్థల మొదలైన వారి మధ్య ఒక వివాదం తలెత్తింది. చివరికది రంభ ఊర్వశిల మధ్య, ఇద్దరిలో ఎవరు గొప్ప నాట్యగత్తెలనే వివాదంగా పరిణమించింది.

వారిరువురూ నేను గొప్పంటే, నేను గొప్పని ఒకరి నొకరు సవాలు చేసుకోసాగారు. ఇది దేవేంద్రుడి చెవి దాకా చేరింది. దేవలోక వాసుల మధ్య ఎటువంటి వివాదాలూ రేకెత్తటం దేవేంద్రుడికి సబబుగా తోచలేదు.

అతడు రంభ, ఊర్వశులిద్దరిని పిలిపించి, "రంభా, ఊర్వశీ! ఎందుకిలా మీలో మీరు జగడము లాడుచున్నారు? మీలో ఒకరు, మరొకరి కంటే గొప్పవారైన గానీ, లేక తక్కువైన గానీ ఏమన్నది? దాని వలన ఒనగూడు లాభమేముంది? కాబట్టి మీ జగడముల కట్టిపెట్టి, ప్రశాంతముగా ఉండగలరని నా అభీష్టము" అనినాడు.

రంభూర్వశులిద్దరూ దేవేంద్రునికి వినయంగా నమస్కరించారు. "దేవేంద్రా! నీవు దేవతలకథిపతివి. అసమర్దులూ, నైపుణ్య హీనులూ, ఏ విధంగానూ తమది తాము నిరూపించుకోలేక బ్రతుకీడ్చగలరు. మేమలా బ్రతుక నిచ్చగించము. మన ప్రతిభాపాటవాలని బట్టే, ప్రజలలో మన గౌరవాదరాలుండ గలవు.

రాజైన వాడు... సమర్దులనీ, అసమర్దులనీ ఒకే విధముగా జమ కట్టరాదు. రాజు తన ప్రజలలో, అర్హతానర్హతలను బట్టి ఆదరించినప్పుడే అతడు నీతిని పాటించినట్లుగును. లేకున్న అది పాపమగును" అన్నారు.

దేవేంద్రుడా మాటలలోని సత్యమును గుర్తించినాడు.

"సరే! మీరిరవురూ నాట్యములో పోటీ పడుదురేని, రేపటి దినమున, తగిన ఆహార్య అలంకారములతో సభకు రండి! మీ కౌశలమును బట్టి నాట్య ప్రదర్శన చేయండి. దేవ సభలోని మహామహులు, మీలో ఎవరు ఉత్తమ నాట్యగత్తెలో నిర్ణయించగలరు" అని ఆజ్ఞాపించాడు.

ఆ ప్రకారం, దేవసభలో రంభూర్వశులిద్దరూ, అద్బుతంగా అలంకరించుకొని, అంతకంటే అద్భుతరీతిలో తమ నాట్య ప్రదర్శన కావించారు. అందమైన, అనేక రీతుల లోన, వారు ప్రదర్శించిన అభినయం సభికులందరినీ ఎంతో అలరించింది.

ఇరువురూ అందంగా ఉన్నారు. అందంగా అలంకరించుకున్నారు. పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు! అభినయమూ పోటాపోటీగా ఉన్నది. దేవేంద్రుడు కూడా వారిద్దరిలో ఎవరు గొప్పగా నాట్యము సలిపారో నిర్ణయించలేక పోయాడు. సభలోని మహామహులను, నిర్ణయం చేయవలసిందిగా కోరాడు. ఎవరూ జవాబివ్వలేదు.

దేవేంద్రుడు అక్కడున్న మహర్షులతో "మహామునులారా! రంభ, ఊర్వశీల నాట్య ప్రదర్శనను తిలకించారు కదా? వారిలో ఎవరు ఉత్తమ కళాకారిణో నిర్ణయించండి" అని అభ్యర్దించాడు. మునులు సైతం న్యాయ నిర్ణయం చేయలేకపోయారు. మౌనమే జవాబయ్యింది.

అప్పుడు నారద మహర్షి, సభనవలోకించి, దేవేంద్రుడి వైపు తిరిగి, "ఓ దేవేంద్రా! రంభూర్వశుల అద్భుత కళాకౌశలాన్ని, అషామాషీగా తలచి, మనకి తోచిన నిర్ణయం చెప్పుట సరియైనది కాదు. అట్లు చెప్పినా అది వృధానే అవుతుంది తప్ప, వారి వివాదమూ తీరదు. కాబట్టే, అర్హత లేనిదే పదుగురు గొప్పవారు కూర్చుండు సభలకు వెళ్ళరాదంటారు పెద్దలు!

ఎందుకంటే... ఒక వ్యక్తి, ఏదైనా సభలో.... తెలిసి గానీ, తెలియక గానీ... ఏదైనా మాట్లాడినా, అన్నియూ తెలిసి కూడా మౌనం పాటించినా... అది చివరికి ఆ వ్యక్తికి అపఖ్యాతినే కలిగిస్తుంది.

పెక్కుమంది ఉన్న సభలలో, అందరికీ అమోద యోగ్యమయ్యే విధంగా ‘నిర్ణయాలు చేయటం’ చాలా చిక్కులతో కూడి ఉంటుంది. కనుక, రంభ, ఊర్వశీలలో ఎవరు ఉత్తమ నాట్యగత్తో చెప్పటం కష్టమైన పనే! ఎటుల నిర్ణయించగలం? ఈ సమస్యను పరిష్కరించగల పురుషుడు భూలోకమున ఉన్నాడు. అతడన్ని కళలలో ఆరితేరిన వాడు. విక్రమాదిత్యుడను పేర ప్రసిద్దడైన వాడు. అతడు గొప్పయోధుడు, సాహసీ! అతడి సోదరుడు భట్టి గొప్ప మేధావి. భట్టి ప్రధానమంత్రిగా, విక్రమాదిత్యుడు వైభవంగా రాజ్యమేలు తున్నాడు.

వాళ్ళిద్దరూ స్వేచ్ఛాప్రియులూ, శాంతి కాముకులూ! వాళ్ళు జ్ఞానానికి, కరుణకీ, సహాయ ప్రవృత్తికీ, ధైర్య సాహసాలకు ప్రతిరూపాలు! అరవై నాలుగు కళలలోనూ ఆరితేరిన వారు. మనుస్మృతిని చక్కగా ఎఱిగిన వారు. [మనుస్మృతి ని ఆనాటి రాజ్యాంగం అనవచ్చు.]
అట్టి విక్రమాదిత్యుని నీవు దేవసభకు ఆహ్వానించి, రంభ ఊర్వశిల మధ్య గెలుపెవరిదో అతడి ద్వారా తెలుసుకో! అట్లు కానిచో, కల్పాంతమైననూ, రంభూర్వశూలలో ఎవరు గొప్పో తేల్చుటకు ఎవరికినీ సాధ్యము కాదు" అన్నాడు.

ఇది విని దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. ఆశ్చర్యపడ్డాడు కూడా! తనలో "ఓహో! భూలోకమున అంతటి గొప్ప వ్యక్తి గలడా? లేకున్న దేవముని, సర్వజన పూజితుడూ అయిన నారద మహర్షి ఎందుకిట్లు చెప్పును! అంతటి గొప్ప వ్యక్తిని చూచి తీరవలయును" అనుకొన్నాడు.

తన సారధియైన మాతలిని పిలిచి "ఓ మాతలీ! నీవు భూలోకమున గల ఉజ్జయినీ నగరానికి పోవలెను. ఆ నగరాధీశుడైన విక్రమాదిత్యుని దర్శించి, నా ఆహ్వానము తెలియ బరచి, అతడి నిక్కడికి తోడ్కొని రమ్ము" అని ఆజ్ఞాపించాడు.

అది విని మాతలి కొంత విభ్రాంతి పడినాడు. తనలో "ఏమిటీ విపరీతమూ? ఈ స్వర్గలోకమున దేవతలూ, సత్త్వగుణ పూరితులైన మహామునులూ ఉన్నారు. అట్టి స్వర్గలోకమునకు, నేను భూలోకమున గల రజోగుణ పూరితుడైన ఒక మహారాజును తీసుకొని రావలెనా? దేవేంద్రునకు మతిభ్రంశం కాలేదు కదా?" అని తలపోస్తూ, దేవేంద్రుని ఆజ్ఞకు ఉలకక పలకక నిలచుండినాడు. అట్లని తన అయిష్టతను వ్యక్తీకరించు ధైర్యము చేయలేకపోయాడు. తనలో తాను "నా అయిష్టతను దేవేంద్రునకు చెప్పినట్లయితే, అది తప్పుగా పరిణమించవచ్చు" అని సందేహిస్తూ, భూలోకము వైపుకు చూచుచూ మౌనంగా ఉండిపోయాడు.

బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షికి, మాతలి మధన అర్దమయ్యింది. ఆయన చిరునవ్వుతో "మాతలి! నీ సందేహము నాకు తెలుసు! అయితే నీవు ఉజ్జయినీ పురాధీశుడైన విక్రమాదిత్యుని గురించి సందేహించవలదు. అతడు దేవతలకు దీటైన వాడు. నీవు వెంటనే వెళ్ళి అతనిని పిలుచుకు రాగలవు" అన్నాడు.

~~~~~~~~

ఉజ్జయినీ నగర నిర్మాణం![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 13]

భట్టి ఇదంతా రెప్పవాల్చక, ఊపిరి పీల్చక చూస్తున్నాడు. విక్రమాదిత్యుడి శిరస్సు త్రిశూలాన్ని తాకిన క్షణాన, భట్టి కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసినట్లయ్యింది. ఆ వెలుగుకతడు కళ్ళు మూసుకున్నాడు. క్షణం తర్వాత కళ్ళు తెరిచి చూస్తే... అతడి ముందు ట్రిశూలమూ లేదు, విక్రమాదిత్యుడి దేహమూ లేదు.

భట్టి, విక్రమాదిత్యుడి ప్రాణశ్శరీరాలను మహంకాళీ మాత కాపాడి ఉంటుందని ఊహించాడు. వెంటనే ఆలయంలోకి పరిగెత్తాడు. అక్కడ అమ్మవారి విగ్రహం ముందు, విక్రమాదిత్యుడి శరీరం పరుండబెట్టి ఉంది. విక్రమాదిత్యుడు స్పృహలో లేడు.

భట్టి దీనిని ముందే ఊహించాడు. మహంకాళి దివ్యవిగ్రహానికి చేతులు జోడించి నమస్కరిస్తూ.... భట్టి " ఓ తల్లీ! సంతోష ప్రదాయనీ! సాధు జన కల్పవల్లీ! దీనుల పాలిట అమృత వల్లీ! భయోత్పాత నాశినీ! సంకట హారిణీ! దయామూర్తీ! శాంకరీ! శాంభవీ! పరమేశ్వరీ! పరమానంద స్వరూపిణీ! భవానీ! కాళీ! భద్రకాళీ! పరమానంద కాళీ! ఓంకారీ! క్రీంకారీ! హ్రీంకారీ! సర్వజనులకూ మాతృమూర్తివి నీవు! మము దయజూడవే మాతా! నీ దయార్ధ్ర దృక్కులకై విక్రమార్కుడీ సాహసానికి పూనుకున్నాడు. ఓ భక్త జన ప్రియ మాతా! మమ్ము రక్షించు! విక్రమాదిత్యుని దీవించు!!" అని ప్రార్దించాడు.

మహంకాళీ మాతకు విక్రమాదిత్యుడి సాహసం పట్లా, భట్టి మృదు మధుర భాషణ పట్లా ఎంతో ప్రీతి కలిగింది. ఆ తల్లి కరుణతో, విక్రమాదిత్యుడు స్పృహలోకి వచ్చాడు. దేవి వాళ్ళ ముందు చిరునవ్వుతో ప్రత్యక్షమైంది.

భట్టి విక్రమాదిత్యుల ఆనందానికి అవధులు లేకపోయాయి. పరమానందంతో, భక్తి పారవశ్యంతో, ఆ తల్లికి నమస్కరించి, స్త్రోత్రాలు చేశారు. ఆ తల్లి ప్రసన్నంగా "వత్సలారా! ఏమి మీ కోరిక? మీకేమీ వరములు కావలెనో కోరుకోండి, తీర్చెద గాక!" అంది.

విక్రమాదిత్యుడు వినయంగా చేతులు జోడించి, "తల్లీ! ఇచ్చోటన ఒక అందమైన, మహా నగరాన్ని నిర్మించాలని మా ఆకాంక్ష! ఈ ఆలయానికి దాపుననే, ఎటు చూసినా 10 ఆమడలుండే విధంగా... చక్కని, భారీ నగరాన్ని నిర్మించునట్లు మమ్మల్ని ఆశీర్వదించు! అట్టి నగరాన్ని నిర్మించేందుకు, సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి పాలించేందుకు, మాకు ఐశ్వర్యం కావాలి. వీటన్నిటినీ సాధించేందుకు నీ కరుణ కావాలి" అన్నాడు. [దూరాన్ని ఆమడలలో కొలవటం అప్పటి లెక్క.]

కాళీ మాత, చిరునవ్వుతో, ప్రేమ నిండిన కళ్ళతో - "బిడ్డలారా! మీరు కోరిన ప్రతీ వరాన్నీ అనుగ్రహిస్తున్నాను. ఈ ఆలయమునకు ఈశాన్య దిక్కున తవ్వేనట్లయితే... నవ రత్నాలూ, బంగారమూ ఉన్న నిధి నిక్షేపాలని పొందగలరు. ఇక్కడే నగర నిర్మాణము గావించి, సామ్రాజ్య స్థాపన చేయ గలరు. ఉజ్జయిని అను పేరున అది మిక్కిలి ప్రసిద్ది చెందగలదు" అని వరమిచ్చి, వారిరువురినీ దీవించి అంతర్దాన మైంది.

భట్టి విక్రమాదిత్యులు ఎంతగానో ఆనందించారు. [ఉజ్జయినీ కాళీ ఆలయం ఇప్పటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అష్టాదశ శక్తి పీఠములలో అది ఒకటి!]

భట్టి విక్రమాదిత్యులు, సైన్యాన్ని, కూలీలని నియోగించి, దేవీ కోవెలకు ఈశాన్య దిక్కున తవ్వించారు. నవరత్నాలతో నిండిన, బంగారు గని కనుగొన్నారు. వెలలేని ఆ సంపదని ఉపయోగించి, వాళ్ళు ఉజ్జయినీ నగరాన్ని, అతి సుందరంగా నిర్మించారు. రాజాంతఃపురాలు, నివాస విలాస భవనాలు, రాజోద్యోగ కార్యాలయ భవనాలు, ఉద్యాన వనాలు, క్రీడా మైదానాలు, సుందర సరోవరాలు, సభాభవనాలు, వస్తు విక్రయ ప్రదర్శన శాలలు, దేవాలయాలు, కళామందిరాలు... ఇలా కావలసిన అన్ని వసతులనీ సమకూర్చుకున్నారు.

తమ పూర్వ రాజధాని యైన కన్యాపురానికి, తమ అనుచరుణ్ణి సామంత రాజుగా నియమించి, పరిపాలనా కట్టుదిట్టాలన్నీ చేశారు.

ఒక శుభముహుర్తాన, తమ కుటుంబ సభ్యులూ, ఆశ్రితులూ, అనుచరులూ వెంటరాగా ఉజ్జయినీ నగర ప్రవేశం చేశారు. అది గొప్ప ఉత్సవంగా నిర్వహించారు. మహంకాశీ దేవికి అంగరంగ వైభవంగా పూజాదికాలు, ఉత్సవాలు జరిపించారు. మంత్రులూ, సైన్యాధికారులూ, పాలనాధికారులూ... మొదలు దిగువ స్థాయి రాజోద్యోగుల వరకూ, అందరికీ, వారి వారి స్థాయిని బట్టి, తగిన నివాసాలను కేటాయించారు. సామాన్య ప్రజలకు వారి వృత్తులకు, స్థాయిలకూ తగిన ఆవాసాలని కల్పించారు.

అందమైన, సౌకర్యవంతమైన, విశాలమైన నగరం! చుట్టూ అందమైన ప్రకృతి! పర్వతాలు వరస పెట్టని గోడలా విలసిల్లుతోంది. ప్రక్కనే నదీ ప్రవాహపు గలగల! నీటికి కొఱత లేదు. సారవంతమైన నేలతో ఆహారానికి కొఱత లేదు. చల్లని ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో, అందరూ ఆనందంగా జీవిస్తున్నారు.

భట్టి విక్రమాదిత్యులు మరోసారి తమ సామ్రాజ్యాన్ని పర్యటించి, పటిష్టపరుచు కున్నారు. సర్వ సమర్దమైన, పటిష్ఠమైన పాలనా విధానాలని ప్రవేశపెట్టి నిర్వహించారు. ఉజ్జయినీ రాజ్యప్రజలు, దేనికీ కొరతలేకుండా... చోర ప్రకృతి ఉత్పాత భయాలు లేకుండా.... ప్రశాంతంగా, హాయిగా ఉన్నారు.

రాజు ధర్మపరుడైతే... ఆ రాజ్యంలో వరదలూ, కరువులూ, భూకంపాలూ, వంటి ప్రకృతి ఉత్పాతాలుండవట. విక్రమాదిత్యుడి పాలనలో నెలకు నాలుగు వానలు కురిసేవి. రైతులకి పుష్కలంగా పంటలు పండేవి. ధన ధాన్యాలతో, సిరి సంపదలతో, సుఖశాంతులతో ఎల్లెడలా సంతోషం వెల్లి విరుస్తుండేది.

మానసిక ఉల్లాసానికి, కళలూ సాహిత్యమూ ఇతోధికంగా పోషింపబడేవి. స్వయంగా 64 కళలలో ఆరితేరిన భట్టి విక్రమాదిత్యులు, అన్ని విషయాలని పర్వవేక్షించే వాళ్ళు. సమర్దులైన, నీతి పరులైన ఉద్యోగులని నియమించి, ఎక్కడా ఏ అసౌకర్యమూ, అన్యాయమూ ప్రజలకి కలగకుండా జాగ్రత్త తీసుకునేవాళ్ళు.

అధ్యాత్మిక ఉన్నతికై.... ప్రజలలో భక్తి భావనలు, భావోద్రేక అతిక్రమణకై విద్యాంసుల, మునుల ప్రవచనాలు నడిచేవి. ‘యధా రాజాః తధా ప్రజాః’ అన్నట్లు ప్రజలూ ధర్మపరులై మెలిగే వాళ్ళు.

అదంతా కాళీ మాత కృపగా భావించి, అందరూ ఆ దేవిని సేవించే వాళ్ళు!

పంటలు సమృద్దిగా పండుతున్నాయి. ప్రజలు సంతృప్తిగా బ్రతుకు తున్నారు.

ఇలా ఉండగా....
~~~~~~~

మేధో సాహసాల మేలు కలయిక![భట్టి విక్రమాదిత్యుల కథల మాలిక – 12]

ఆ శిలాశాసనాన్ని చదవగానే భట్టికి సంభ్రమాశ్చర్యాలు కలిగాయి. తన ‘అన్న విక్రమాదిత్యుడు అట్టి సాహస కార్యాన్ని తప్పక నెరవేర్చగలడు’ అనుకున్నాడు. తాము ఆశించినదే ఎదురుగా ఉన్నట్లు తోచి భట్టికెంతో ఆనందం కలిగింది.

భట్టి దేవాలయంలోకి ప్రవేశించి, అక్కడ గల మహంకాళికా దేవిని అర్చించాడు. మనో వాక్కాయ కర్మల, ఇష్టపూర్తిగా పూజాదికాలు నిర్వహించాడు. కోవెలలో అమ్మవారి కంటి చూపుకు ఎదురుగానే, సరోవరం ఉండటాన్ని, దాని మధ్యలో త్రిశూలం ఏ ఆధారమూ లేకుండానే నిలిచి ఉండటం గమనించాడు. అది అమ్మవారి మహిమగా గ్రహించాడు.

దేవీ కోవెలలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, కన్యాపురానికి తిరుగు ప్రయాణమయ్యాడు. నగరం చేరి, తనకు అన్న, రాజూ అయిన విక్రమాదిత్యుడి దగ్గరి కెళ్ళి, వినయంగా నమస్కరించాడు.

భట్టిని చూడగానే విక్రమాదిత్యుడికెంతో సంతోషం కలిగింది. ప్రేమాప్యాయతలతో భట్టిని కౌగిలించుకున్నాడు. "నా ప్రియమైన తమ్ముడా, భట్టీ! నీవు నన్ను కంటికి రెప్పవలె కాపాడు ఆత్మబంధువవు. నీ విక్కడ నుండి వెడలి ఆరుమాసాలు గడిచినవి. మనం ఆశించినట్లుగా ఏదైనా ప్రదేశాన్ని కనుగొన్నావా?" అని అడిగాడు.

"అన్నా! కనుగొంటిని" అన్నాడు భట్టి. సవిస్తరంగా తాను చూచిన ప్రదేశాన్ని, దేవీ ఆలయాన్ని, శిలా శాసనాన్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించాడు.

విక్రమాదిత్యుడికి ఎంతో ఆనందమూ, ఉత్సాహమూ కలిగాయి. వెంటనే అక్కడికి వెళ్లాలని నిశ్ఛయించుకున్నారు. తమ అనుచరులలో ఒక సమర్దుడిని ఎంపిక చేసి, కన్యాపుర రాజ్యపు బాగోగులు చూడవలసిందిగా ఆదేశించారు.

ఒక పుణ్య తిధినాడు, సుముహుర్తం చూసుకుని భట్టి విక్రమాదిత్యులిద్దరూ మారువేషాలు ధరించి వింధ్యాటవికి ప్రయాణ మయ్యారు. దట్టమైన అందమైన అరణ్యాలని, కొండకోనలని, వాగు వంకలనీ దాటుకుంటూ వెళ్ళారు. దుర్గమారణ్యాలలో ప్రయాణిస్తూ... ప్రకృతి రమణీయతనీ, వన్యమృగ సంచారాన్ని ఎంతగానో ఆనందించారు.

కొన్ని దినాల ప్రయాణానంతరం, ఇద్దరూ వింధ్య పర్వత ప్రాంతాన్ని, గుణవతీ నదీ తీరాన్నీ చేరారు. ఉత్సాహంగా మహంకాళీ దేవీ పురాతన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు. పుష్కరిణిలో స్నానమాచరించి, దేవళంలోకి ప్రవేశించారు.

విక్రమాదిత్యుని చూసి, మహంకాళి దేవి ఎంతో ప్రసన్నురాలైంది. గోవు తన వత్సలని చూసినట్లుగా, తల్లి తన బిడ్డలని చూసినట్లుగా మహంకాళి దేవి, భట్టి విక్రమాదిత్యులని వాత్సల్యంతో చూసింది. విక్రమాదిత్యుని సాహస లక్షణాలని చూసి ‘ఈతడి చేత ఇక్కడ నగరాన్ని నిర్మింప చేయాలని, పురాతన ఆలయానికి ప్రాభవం తేవాలనీ’ సంకల్పించింది. విక్రమాదిత్యుని సామర్ధ్యమందుకు తగినదో కాదో పరీక్షింపనెంచి, అదృశ్య రూపంలో భట్టి విక్రమాదిత్యుల వెంట నడిచింది.

దేవళంలోని దేవీ మూర్తికి పూజాదికాలు, సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, భట్టి విక్రమాదిత్యులు సరోవరం దగ్గరికి చేరారు. విక్రమాదిత్యుడు శిలాశాసనాన్ని మరోసారి చదివాడు. సరస్సు మధ్యలో ఆధార రహితంగా, నీటిపై నిట్టనిలువుగా నిలిచి ఉన్న త్రిశూలాన్నీ, సరస్సు పైకి వ్యాపించి ఉన్న మర్రి కొమ్మలకు వ్రేలాడుతున్న ఏడు ఉట్లనీ పరీక్షగా చూశాడు.

ఆధారరహితమైన త్రిశూలాన్ని చూసి "తమ్ముడా! భట్టి! నీటిలో ఈ త్రిశూలము ఆధారము లేకనే ఎట్లు నిలిచి ఉన్నది?" అని అడిగాడు.

భట్టి "మహారాజా! గుడిలోని దేవికి ఎదురుగా నున్నది గనుక, ఆ తల్లి మహిమతోనే అది అట్లు నిలిచి ఉన్నదని తలంచుచున్నాను" అన్నాడు.

విక్రమాదిత్యుడి కది చూసి ఎంతో ఉద్వేగమూ, భక్తి పరవశమూ కలిగాయి. శిలా శాసనం మీద వ్రాసి ఉన్న సాహస కార్యము చేసి తీరాలన్న పట్టుతల కలిగింది. ఒకవేళ దేవీ దర్శనము పొందలేక, ప్రాణాలు కోల్పోయినా పోయేదేం లేదనిపించింది.

మరోసారి భక్తిగా సరోవరంలో పుణ్యస్నానమాచరించి, గుడిలోని తల్లిని స్మరించుకున్నాడు. భట్టిని వటవృక్షము మొదలులో నిలబడమని చెప్పాడు. వృక్ష రాజానికి నమస్కరించి చెట్టెక్కాడు.

ఒర నుండి కత్తి తీసి నోటబెట్టి, చెట్టు కొమ్మలపైని ఉట్ల దగ్గరికి చేరాడు. విక్రమాదిత్యుడికి తాను చేయబోయే సాహసకార్యం ఎంత ప్రమాదకరమైనదో తెలుసు. అయితే, అందుకు రెట్టింపుగా, విక్రమాదిత్యుని మనస్సు, మహంకాళి దేవిపై భక్తితోనూ, నమ్మకంతోనూ నిండిపోయింది. కళ్ళు నిగిడ్చి ఏడు ఉట్లని పరిశీలించాడు. అవి ఒకే కొమ్మకు వరుసగా లేవు; ఒక్క వేటులో తెగ వెయ్యటానికి! వర్తులా కారంలో ఉన్నాయి.

విక్రమాదిత్యుడు "తమ్ముడా భట్టి! ఈ ఏడు ఉట్లునూ ఒకే తాటికి కట్టిలేవు. ఒకే వరుసలోనూ లేవు. వలయాకృతిలో అమర్చబడ్డాయి. ఒక్క వేటుతో వీటిని తెగ వేయిటెట్లు? ఆలోచించి ఉపాయం చెప్పు!"అన్నాడు.

అప్పటికే భట్టి దానిని పరిశీలనగా చూస్తున్నాడు. అతడికీ చిక్కు అర్దమయ్యింది. "అన్నా! నీ కుడిపాదమును ఒక ఉట్టిపై ఉంచి, దాని ప్రక్కనున్న ఉట్టిని ఎడమ చేత బట్టుకొనుము. ఊయల ఊగినట్లుగా, కుడివైపుకు ఊపు తెచ్చుకొనిన, అవి గుండ్రముగా తిరిగి పురి ఎక్కగలవు. అప్పుడు ఏడు ఉట్లు తాళ్ళు పెనవేసుకుపోయి, ఏక తాడు వలె బలంగా, గట్టిగా కాగలవు. అప్పుడు కత్తితో, ఒక్కవేటుతో వాటిని తెగనరక వచ్చును. తెగిన ఉట్లు నీటిని చేరక ముందే, తల్లక్రిందులుగా త్రిశూలము పైకి దూకుము. ఆపైన దేవీ కృప!" అన్నాడు.

విక్రమాదిత్యుడు మరోమారు ఉట్లను పరిశీలనగా చూశాడు. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని సాహస క్రియకు పూనుకున్నాడు. కొన్నిలిప్తల పాటు కాళీ మాతని స్మరించాడు. శ్రద్ద, పట్టుదల కలగలిపి, ఒక ఉట్టిపై కుడిపాదము నుంచాడు. దాని ప్రక్కన గల మరియొక ఉట్టిని ఎడమ చేత బట్టుకుని, శరీరాన్ని కుడివైపుకు వంచి, ఒక్క ఉదుటున ఊపు తెచ్చుకున్నాడు. రంగుల రాట్నము తిరిగినట్లుగా ఉట్లు తిరిగి, ఏడు తాళ్ళూ పెన వేసుకు పోయి పురి ఎక్కాయి.

విక్రమాదిత్యుడు ఆ ఏక తాటిని, కత్తితో ఒక్క వేటున తెగ వేశాడు. మరుక్షణమే తాను తల్లక్రిందులుగా త్రిశూలము పైకి దూకాడు. ఉట్లు నీటిని చేరక మునుపే అతని శిరస్సు త్రిశూలాన్ని తాకింది.

భట్టి ఇదంతా రెప్పవాల్చక, ఊపిరి పీల్చక చూస్తున్నాడు. విక్రమాదిత్యుడి శిరస్సు త్రిశూలాన్ని తాకిన క్షణాన, భట్టి కళ్ళ ముందు పెద్ద మెరుపు మెరిసినట్లయ్యింది. ఆ వెలుగుకతడు కళ్ళు మూసుకున్నాడు. క్షణం తర్వాత కళ్ళు తెరిచి చూస్తే... అతడి ముందు ట్రిశూలమూ లేదు, విక్రమాదిత్యుడి దేహమూ లేదు.

~~~~~~
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes