RSS
Wecome to my Blog, enjoy reading :)

మ్రింగెడు వాడు విభుండని …… మహా శివరాత్రి పండుగ కథ!

అనగా అనగా.....
అమృతాన్ని ఆశించి క్షీరసాగర మధనం చేస్తూంటే, అమృతం కంటే ముందు హాలాహలం ప్రభవించింది. వెలువడిన విషపుధాటికి లోకాలన్ని అల్లకల్లోలమయ్యాయి. హాలాహలపు జ్వాలలకు అందరూ హాహాకారాలు చేస్తున్నారు.

కాపాడమని పరమశివుని ప్రార్ధించారు. సమస్య తనది కాదు. మింగితేనే తననేమీ చేయలేని విషం, మింగకపోతే అసలేమీ చేయలేదు. అయినా లోకహితం కోరి ఆ విషాన్ని పానం చేశాడు పరమేశ్వరుడు. ఆయన ఆదిభిక్షువే, అయినా అది హాలాహలం. దాన్ని గొంతులోనే నిలిపివేసాడు శివుడు. అది ఆయన కంఠాన్ని నల్లగా మాడ్చింది. అందుకే శివుడిని గరళకంఠుడనీ, నీలకంఠుడనీ పిలుస్తారు. తన యోగశక్తితో హాలాహలాన్ని, దాని శక్తిని అణిచివేసాడు పరమశివుడు. అంత కష్టాన్ని – లోకహితం కోసం, లోకాలకు శ్రేయస్సు కలిగించటం కోసం భరించాడు.

విషపానం చేసే ముందు పార్వతీ దేవితో శివుడు “ఇందరి ప్రాణ రక్షణ నా చేతులలో ఉంది. శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం. ఇప్పుడీ హాలాహలాన్ని తియ్యని పండులా ఆరగిస్తాను” అనగా ఆ యిల్లాలు చిరునవ్వుతో అంగీకరించింది.

“మ్రింగెడు వాడు విభుండని
మ్రింగెడిది గరళ మనియును
మేలని ప్రజకున్ మ్రింగమనె
సర్వ మంగళ! మంగళ సూత్రంబు
నెంత మది నమ్మినదో! “


అందుకే ఆ తల్లి లోకమాత.

అందుకే శివపార్వతులు ఆదిదంపతులు. సర్వలోకాల్లోని సకలప్రాణులకి జననీ జనకులు.


పరమశివుడు పచ్చివిషాన్ని కంఠాన బంధించేందుకు, తన యోగశక్తితో హాలాహలాన్ని అణిచేందుకు కన్నులు మూసుకొని వెత భరించాడు. ఎంతటి వారికైనా ఏ పనీ ’హాంఫట్’ అని అయిపోదు. దానికి కావలసిన ‘కర్తవ్య నిర్వహణ’ చేయవలసిందే. అందుచేత పరమశివునికీ ఆ ‘effort’ తప్పలేదు. కాబట్టే తర్వాత అమృతం పుట్టడం, దాని పంపకంలో జరిగిన గల్లంతూ, జగన్మోహినీ అవతారం శివుడు చూడలేదు.

ఆనాడు పరమశివుడు భరించిన వెతని తలుచుకుంటూ, శివరాత్రి నాడు, భక్తులందరూ శివనామ స్మరణ చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తారు. ఉపవాస దీక్షలో గడుపుతారు. అదే శివరాత్రి పండుగ.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

సైన్యమా, దైవమా - ఎవరు గెలుపునిస్తారు?

అనగా అనగా.....

మహా భారతంలో, పాండవులు ఉద్యోగపర్వానంతరం ఉపప్లావ్యంలో నివసిస్తూ ఉంటారు. కురుక్షేత్ర యుద్దం అందరికీ వూహాతీతం కాదు. కురుపాండువులిద్దరూ పరస్పరం రాయబారాలు నడుపుతూనే మరోవైపు యుద్దసన్నద్దులై, సైన్యసమీకరణాలు చేస్తున్నారు.

సైన్యసమీకరణల సందర్భంలో ఒకరోజు ధర్మరాజు, అర్జునుణ్ణి శ్రీకృష్ణుని సహాయాన్ని అర్ధించడానికి పంపించాడు. అర్జునుడు ద్వారక చేరే సమయానికి, అదేపనిమీద దుర్యోధనుడు, అర్జునుడి కంటే ముందుగానే వచ్చి ఉన్నాడు.

దుర్యోధనుడు అర్జునుడి కంటే ముందుగానే కృష్ణమందిరం చేరాడు. ఆ సమయానికి కృష్ణుడు నిద్రిస్తున్నాడు లేదా నిద్ర నటిస్తున్నాడు. దుర్యోధనుడు శ్రీకృష్ణుని తలవైపుగల ఆసనంలో కూర్చోన్నాడు, కాళ్ళవైపు ఆసనంలో కూర్చోవడంలో అవమానమని తలిచాడు. [అందులో తప్పేమి లేదనీ, అది అతడి ఇచ్చనీ అనుకోవచ్చు] కాస్సేపటికీ అక్కడికీ ప్రవేశించిన అర్జునుడు శ్రీకృష్ణుని పాదాల చెంత నిలిచి వేచిచూడసాగాడు. [అర్జునుడికి కృష్ణునిపట్ల భక్తి, గౌరవం, గురుభావనా ఉన్నాయి గనుక ఇది ఇతడి ఇచ్ఛ.]

కొద్దీక్షణాల తర్వాత శ్రీకృష్ణుడు లేచి ఇద్దరినీ కుశలమడిగాడు. తర్వాత ఏపని మీద వచ్చారో కనుక్కున్నాడు. ఇద్దరూ ‘రానున్న యుద్దంలో సహాయార్ధం వచ్చాం’ అన్నారు.

దుర్యోధనుడు:
"కృష్ణా, ముందుగా నేను వచ్చాను. కనుక ముందుగా నాకు సహాయం చేయటం న్యాయం” అన్నాడు.

శ్రీకృష్ణుడు:
ముందుగా వచ్చావు నీవు. కాని నేను ముందుముందుగా అర్జునుని చూశాను. మీరిద్దరూ నాకు బంధువులే. నా సహాయం మీ ఇద్దరికీ చెందాలి. నా సైన్యంలో 10,000 మంది నాకు సమానులైన వారు, నారాయణాంశగల యోధులున్నారు. వారొకవైపు. నేనొకవైపు. వారు యుద్ధం చేస్తారు. నేను యుద్ధం చేయను. యుద్ధంలో కావలసిన సలహాలు, మాట సహాయం చేస్తాను. ఇక మీకు ఏవికావాలో కోరుకొండి. కానీ అర్జునునికి ముందుగా కోరుకునే అవకాశం ఇస్తాను. ఏమందువు అర్జునా?

దుర్యోధనుడు:
కృష్ణా! నీయవచ్ఛక్తీనీ వినియోగించి, ఇందు అర్జునునకు భాగము కల్పించుటయే గాక కోరుకొనుటలోను అతడికీ ముందరవకాశ మొసంగి, బావా నీయభిప్రాయమేమి అని అడుగుచున్నావు. అహ! ఇంతకన్న ఎవరి అభిప్రాయమెట్లుండెడిది బావా?

శ్రీకృష్ణుడు:
బావా దుర్యోధనా! నీవు స్వతంత్రుడవు. అర్జునుడు సేవకుడు. అన్న ఆఙ్ఞలకు బద్దుడై చరిచెడి వాడు. అందుకే అలా వేరుగా అడగవలసి వచ్చింది.

దుర్యోధనుడు: [స్వగతంలో] కృష్ణుడెంత మోసము చేస్తున్నాడు? ఆయుధం పట్టడట, యుద్ధం చేయడట. ఊరికే సాయం చేస్తాడట. తన సైన్యాన్నంతా ఒకవైపు పెట్టి, తాను ఒక వైపు నిలుచున్నాడు. కంచిగరుడ సేవ లాంటి ఇతడితో ఏమీ ఉపయోగం? అర్జునుడు మాత్రం కృష్ణుణ్ణి ఎందుకు కోరుకుంటాడు? సైన్యాన్నే కోరుకుంటాడు.

కానీ అర్జునుడు కృష్ణుణ్ణే కోరుకుంటాడు. దుర్యోధనుడు “కృష్ణుని కపటోపాయము మనకే కలిసివచ్చింది” అనుకుంటూ సంతోషంగా సైన్యాన్ని తీసికొని, అర్జునునిపై జాలిపడి మరీ వెళ్ళిపోతాడు. తర్వాత కృష్ణుడు అర్జునుణ్ణి అడుగుతాడు, "ఆయుధపాణులైన యోధుల్ని వదిలి, ఒట్టిగోపాలుణ్ణి, నన్ను కోరుకున్నావు, బాలుడవువైతి వక్కటా” అంటాడు.

అర్జునుడు “కృష్ణా! నాకు యోధులు, ఆయుధాలు, నీ యుద్ధకౌశలం అక్కరలేదు. నీవు నా అండనుండుటయే చాలు. నేనే అన్నిటినీ గెలవగలను” అంటాడు.

ఆవిధంగా అర్జునుడు భావవాది గనుక, పదార్ధాన్ని గాక విల్ పవర్ నీ, తన ఆత్మబలాన్ని, సంకల్పబలాన్ని నమ్మాడు, లక్ష్యాన్ని ఛేదించాడు. ‘యతో ధర్మతతో జయః’ అన్నట్లు పాండవులు కురుక్షేత్రంలో గెలుపొందారు కదా!

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

రజాకార్ల అఘాయిత్యం!

అనగా అనగా.....

స్వాతంత్రం వచ్చిన తొలిరోజులు! రజాకార్ల దౌష్ట్యంతోనూ, కౄరచర్యలతోనూ అల్లాడిన నిజాం సంస్థానం, పటేల్ తీసుకొన్న పోలీసు చర్య అనంతరం భారత్ లో కలిసిపోయింది. ఈ సంఘటన రజాకార్ల అఘాయిత్యాలు పెట్రేగి ఉన్న సమయంలో జరిగింది, తర్వాత వెలుగుచూసింది.

హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిపోయిన కొద్దికాలం తర్వాత ఓరోజు – కొంతమంది రైల్లో ప్రయాణిస్తున్నారు. అప్పటి రాజకీయాల గురించి పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వారి సంభాషణ నాటి నిజాం క్రౌర్యం గురించి, రజాకార్ల హింస గురించి నడుస్తుంది. హఠాత్తుగా ఒక మహిళ తన ఒంటిమీది దుస్తులన్నీ విప్పి, అందరి ఎదుట నగ్నంగా నిలబడింది. అక్కడ పిల్లలూ, స్త్రీలూ, పురుషులు ఉన్నారు. అందరూ దిగ్భ్రాంతులయ్యారు. ఎవరూ మాట్లాడలేదు.

కొన్ని క్షణాల తర్వాత తేరుకున్న ఓ పెద్దాయన, "ఏమిటిది తల్లీ! ఇలా అందరి ఎదుట నిలబడతావా? ఆడదానివి కాదూ! ఇలా నిలబడటానికి సిగ్గుగా లేదూ?" అన్నాడట. ఒక్కసారిగా అగ్నిపర్వతం బ్రద్దలయినట్లు ఆమె “నేను కాదు. మీరందరూ సిగ్గుపడాలి” అంటూ భోరుమన్నది. దుఃఖాతిశయం తీరాక, దుస్తులు ధరించి, “నన్ను రజాకార్లు బహిరంగ స్థలంలో నగ్నంగా చెట్టుకి కట్టేసి వారం రోజులుంచారు. నానా హింసా పెట్టారు” అంటూ తన శరీరం మీద నాటి హింసల గుర్తులు చూపిందట. చూస్తోన్న అందరి కళ్ళల్లో నీళ్ళు!

ఇది ఆ రోజుల్లో కృష్ణాపత్రికలో ప్రచురింపబడినట్లుగా 2008 లో ఆంధ్రజ్యోతి ప్రచురించింది. కేసీఆర్ ’నిజాం’ని పొగిడిన సందర్భములో ఈ వార్తని ప్రచురించింది.

ఇంతటి కసాయి తనం, హద్దుల్లేని హింస!

ఇదీ కథ!

ఇది నిజంగా జరిగిన సంఘటన. మన చరిత్ర.

రాజభక్తి - దైవభక్తి

అనగా అనగా.....

ఓ దేశరాజధాని నగరం. రాజుగారి పుట్టినరోజు ఉత్సవసభ జరుగుతోంది. సభా ప్రాంగణం ప్రజలతో క్రిక్కిరిసి ఉంది. రాజు గారిని పొగుడుతూ సైన్యాధికారి ఉపన్యాసించాడు. ప్రజలంతా ఆ’సొల్లు’విని గట్టిగా జేజేలు పలికారు. తర్వాత మంత్రి! ప్రజలీసారి మరింత గట్టిగా చప్పట్లూ కొట్టి, హర్షధ్యానాలు చేశారు.

తర్వాత రాజుగారు కృతఙ్ఞతలు చెబుతూ ఉపన్యసించారు. ఈ సారి ప్రజలంతా దిక్కులు పిక్కటిల్లేలా చప్పట్లు చరుస్తూ, జేజేలు పలుకుతూ రాజుగారి పట్ల తమ విధేయత చాటుకున్నారు. సభకు రాకపోతే, రాజుగారిని పొగడక పోతే ఎక్కడ రాజుగారికి కోపం వస్తుందోనన్న భయం, రాజుకు కోపం వస్తే తమకి నష్టం అన్న ఆతృతా వారిలో ఉంది.

ఆ సభలో ఓ మూల ఓ వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతడు మౌనంగా ఉన్నాడు. చప్పట్లూ కొట్టలేదు, జేజేలు పలకలేదు. ప్రజలకి అతణ్ణి చూసి ఆశ్చర్యం వేసింది. గుసగుసలు పోయారు. విషయం రాజుగారి దాకా పోయింది. ఆయన గుర్రుమన్నాడు. విచారణ మొదలైంది. మంత్రి దర్పంగా, కాస్త కోపంగా “మేమంతా మన రాజు గారిని కీర్తిస్తుంటే నువ్వు మౌనంగా ఎందుకున్నావ్? నీకు రాజంటే భయం భక్తీ లేవా?” అన్నాడు.

చిరునవ్వు నవ్వాడు ఆ వ్యక్తి. చిర్రెత్తుకొచ్చింది అందరికీ.

"జవాబు చెప్పు?" హుంకరించాడు సైన్యాధికారి.

ఆవ్యక్తి ప్రశాంతంగా “అయ్యా! మీరంతా ఈ రాజుగారు సర్వాధికారి అని కదా ఆయన్ని పొగుడుతున్నారు! ఈ రాజుగారి పాలనలో జరుగుతున్న అన్యాయాలు మీకు తెలుసు. అయినా అవేవి మాట్లాడకుండా రాజుని పొగుడుతున్నారు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని మెచ్చుకోవాలని, రాజుగారి దయ మీమీద ఉండాలని, రాజు గారికి మీరు ప్రీతిపాత్రులు కావాలని!

అటువంటప్పుడు ఈ రాజు గారి కంటే కూడా గొప్పవాడు, సర్వాధికారి అయిన దేవుడి దయ నామీద ఉండాలనీ, దేవుడు నన్ను మెచ్చుకోవాలని, దేవుడికి నేను ప్రీతిపాత్రుణ్ణి కావాలని అనుకుంటే తప్పేమిటి?" అన్నాడు.

సభలో ఒక్కసారిగా నిశ్శబ్ధం!

రాజుకి ఙ్ఞానోదయమైంది. ప్రజలకీ ’సత్యం’ గోచరమైంది.

రాజు ఆవ్యక్తికి క్షమాపణా, కృతఙ్ఞతలూ చెప్పుకొని, తర్వాత నుండీ తన కర్తవ్యం అయిన ’ప్రజా శ్రేయస్సు’కోసం పాటు పడ్డాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

పరమానందయ్య గారి శిష్యులు

అనగా అనగా.....

తెలుగు సాహిత్యంలో పరమానందయ్య గారి శిష్యుల కథలు ఆబాల గోపాలాన్ని ఆకట్టుకున్న కథలు. పరమానందయ్య గారికి ఏడుగురు [పన్నెండు మందని కొందరంటారు] శిష్యులు. వీళ్ళు అమాయకులు, లోకఙ్ఞానశూన్యులు. [శాపగ్రస్తులైన తాపసులు] వీరు తమ అఙ్ఞానంతోనూ అమాయకత్వం తోనూ గురువుగారినీ, గురుపత్నినీ ఇబ్బందుల పాలు జేస్తూ ఉంటారు. అయితే ప్రతీసారి ఈ ఇబ్బందులు గురువు గారికి మేలే చేస్తుంటాయి.

ఓ రోజు పరమానందయ్య గారు మధ్యాహ్న భోజనం చేసి కాస్సేపు నడుం వాల్చాలను కుంటారు. తన శిష్యుల్లో ఇద్ధరిని పిలిచి తన కాళ్ళు పట్టవలసిందిగా ఆఙ్ఞ ఇచ్చి నిద్రకుపక్రమిస్తాడు. శిష్యులిద్దరూ భక్తిగా గురువు గారి కాళ్ళుపిసకటం మొదలు పెడతారు. ఆ మర్ధనా సుఖానికి గురువు గారు హాయిగా నిద్రలోకి జారుకుంటారు. కొద్దిసేపటి తర్వాత కాళ్ళ పడుతున్న శిష్యుల్లో ఒకడు తను వత్తుతున్న గురువు గారి కాలును మురిపెంగా చూసుకొంటూ “నేను ఒత్తుతున్న గురువుగారి కాలు చూడు. ఎంత బాగా మర్ధనా చేసానో. మిలమిల్లాడుతోంది” అన్నాడు.

రెండో వాడు “ఏడిశావ్ లేరా! నా కాలు చూడు. ఎలా తళతళ్లాడు తుందో? నేనే బాగా మర్ధనా చేసాను” అన్నాడు.

మొదటి వాడికి చిర్రెత్తు కొచ్చింది. “కాదు. నాకాలే మెరుస్తోంది. నీకాలు వికారంగా ఉంది” అన్నాడు కోపంగా.

రెండోవాడికి ఇంకా మండుకొచ్చింది. “నోరు ముయ్యి. నీకాలు చెత్తది. నా కాలు బంగారం” అన్నాడు గురువు గారి కాలుని చేత్తో నిమిరుతూ.

మొదట వాడు కోపంతో రొప్పుతూ “నువ్వు నా కాలుని అవమానించావు. చూస్కో నేనేం చేస్తానో?" అంటూ రెండోవాడు ఒత్తుతున్న గురువుగారి కాలిని ఒక్కటి కొట్టాడు.రెండో వాడు అంతకంటే కోపంతో “నా కాలునే కొడతావా? చూస్కో నీ కాలుని నరికేస్తాను” అంటూ గొడ్డలి తెచ్చాడు.

మొదటి వాడు “నీ కాలుని మాత్రం నే వదులుతానా?" అంటూ కత్తి పట్టుకొచ్చాడు.

ఇద్దరూ కలిసి గురువు గారి కాళ్ళని కొట్టటం అయిపోయి నరికేందుకు సిద్ధ పడ్డారు. ఈ గొడవకు నిద్ర లేచిన గురువు గారు ఇద్దరి అఘాయిత్యాల్ని ఆపమంటూ గావుకేక పెట్టారు.

తర్వాత ఆయన సహనంగా ఇద్దరు కలిసి తన కాళ్ళనే బాధించిన విషయాన్ని బోధపరచి వారిని వివేకవంతుల్ని చేసే ప్రయత్నం చేశాడు.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఈ కథకు నేటి సామాజిక పరిస్థితులకి, మన జీవితాలకి అనువర్తనతో కూడిన విశ్లేషణ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.

అవినీతి, నీతిగా ఎలా మారిందంటే…….. మైనర్ బాబు కథ

అనగా అనగా.....


అది కృష్ణా జిల్లాలోని ఓ గ్రామం. మరీ పల్లెటూరు కాదు, అలాగని పట్టణం కూడా కాదు. ఆ వూరి జమీందారు గారికి పిల్లల్లేని కారణంగా బంధువుల కుర్రాణ్ణి దత్తత తెచ్చుకున్నారు. ఆ పిల్లవాడికి మైనారిటి తీరని కారణంగా ఆ దత్తుడిని, ’మైనర్ బాబ’ని పిలవటం మొదలెట్టారు. మైనర్ బాబు పెరిగి పెద్దై మేజర్ అయినా పేరు మాత్రం మైనరు బాబుగానే స్థిరపడిపోయింది.

సదరు మైనర్ బాబు పక్కమెడలాల్చీలూ, సైడు క్రాపులతో సోగ్గాడిలాగా తిరిగేవాడు. పిల్ల జమీందారు అయిన కారణంగా చదువైతే ఒంట బట్టలేదు గానీ సకల దుర్గణాలూ అంటుకున్నాయి.

ఇంతలో జమీందారు గారు పరమపదిస్తూ తన యావదాస్తినీ మైనర్ బాబు పరంచేసి పోయాడు. అప్పటికే పెళ్ళై పిల్లలున్న మైనర్ బాబు ఆస్తి చేతికి రావడంతో మరీ పైలాపచ్చీసుగా తిరగడం మొదలెట్టాడు. వారానికోసారి చెన్నాపట్నం ప్రయాణం – మందు, విందు, అందాల పొందు.

ఇంట్లో మైనర్ బాబు శ్రీమతి కన్నీళ్ళు పెట్టుకుంటూ, వూళ్ళోని ఆడంగుల సానుభూతితో ఓదార్పు పొందుతూ కాలం గడిపేస్తోంది. ఇలా ఉండగా ఓరోజు హఠాత్తుగా మైనర్ బాబు చెన్నాపట్నం నుండి సినిమాల్లో చిన్నాచితకా వేషాలేసి రాణించలేకపోయిన ఓ ఎక్స్ ట్రా ఆర్టిస్టు ’రాణి’ని లేపుకొచ్చి జమీందారు భవనం వెనకున్న ’ ఔట్ హౌవుస్’లో పెట్టాడు.

ఊరంతా ఈ వార్త గుప్పుమంది. మరి అవి ఇంకా విలువుల గురించి కనీసం మాట్లాడుకుంటున్న రోజులయ్యె. వారం పదిరోజులు జమీందారు భవంతి వచ్చీపోయే ఆడంగులతో, జమీందారిణి వెక్కిళ్ళతో, ఓదార్పులతో సందడే సందడి! జమీందారిణిని ఓదార్చాలని వచ్చేవాళ్ళకి – జమీందారిణి దుఃఖం కన్నా, చెన్నాపట్నం నుండి వచ్చిన ’ఫిల్మ్ స్టార్’ రాణి ఎలా ఉంటుందో చూడాలన్న కుతుహలమే ఎక్కువుంది.

దాంతో ఔట్ హౌస్ వైపు తొంగి తొంగి చూసే వాళ్ళు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఔట్ హౌస్ లో రాణితో పాటు ఆవిడ తమ్ముడూ, మరో పనిమనిషి కూడా వచ్చారు. ఈ పనిమనిషి మహా నేర్పరి. అన్నింటి గురించీ, అందరి గురించి ఆచూకీలూ, కూపీలూ అలవోకగా లాగేసేది. రాణి గారి తమ్ముడు వారానికి రెండుసార్లు చెన్నపట్నం వెళ్ళి వస్తూ ఉండేవాడు.

మొదట్లో ఊరంతా ’రాణి’ని విడ్డూరంగా చూసేవాళ్ళు. మెల్లిగా అలవాటై పోయారు. ఈ లోపులో రాణి జమిందారిణి గారికి, తన తమ్ముడు చెన్నపట్నం నుండి తెచ్చిన విదేశీ స్నోలూ, పౌడర్లూ, పిల్లలకి విదేశీ చాక్లెట్లూ, రంగు రిబ్బన్లూ, రంగు రంగుల విదేశీ బట్టలు లాంటి చిన్నచిన్న బహుమతులు పంపింది. ముందు తిరగ్గొట్టిన జమీందారిణి మెల్లిగా తీసికోవటం మొదలైట్టింది. పిల్లలకైతే చెన్నపట్మం వింతబొమ్మలు మహా నచ్చేసాయి. మెల్లిగా జమీందారు భవనానికి, ఔట్ హౌస్ కు రాకపోకలు కూడా మొదలైనవి.

మెల్లిగా ’రాణి’ని చూడవచ్చే ఆడంగులు పోగయ్యారు. తన ఇంటికి అతిధులొచ్చినప్పుడల్లా చప్పున కలిపే కాఫీ పౌడర్లూ, జపాన్ చాక్ లెట్లు, రుచి చూపించింది రాణి. జమీందారిణికి, రాణికి సంబంధాలు బలపడ్డాయి. కందకి లేని దురద కత్తి పీటకెందుకన్నట్లు ఊళ్ళో వాళ్ళు ’రాణి’తో స్నేహం మొదలెట్టారు. మెల్లిగా పెళ్ళి పేరంటాలకి రాణిని పిలవడంతో మొదలై, మొదటి తాంబూలం దాకా సాగింది. రాణి నివాసం ఔట్ హౌస్ నుండి జమీందారు భవంతికి మారింది.

క్రమంగా అందరూ ’రాణి’ని రెండో జమీందారిణిగా గుర్తించారు. ఓ పుకారు ఏమిటంటే ’ఇటీవలే రాణికి జ్వరం వస్తే జమీందారిణి రాణికి కాళ్ళు వత్తిందని.’

ఇలా అవినీతి క్రమంగా సమాజంలో నీతిగా చలామణి అవుతుందని ఈ కథ వలన తెలుస్తుంది. ఇలా విదేశీ పౌడర్లూ, రిబ్బన్లూ, బొమ్మలూ, కాఫీలు, చాక్ లెట్లు తో మొదలై మోజు[ఫ్యాషన్] మాటున ప్రతీ అవినీతి కూడా సమాజంలో జనామోదం [Stamp?] పొందేస్తుంది.

ఇదీ కథ!

మరో కమ్మని కథ కోసం వేచి చూడండి.

ఛత్రపతి శివాజీ సాహసాలు – 3

అనగా అనగా.....

ఛత్రపతి శివాజీ జీవితంలోని ఈ సంఘటన....

ఓ రోజు శివాజీ కొలువు తీరి ఉండగా, సభలోనికి ఓ అనుచరుడు ఓ అందమైన యువతిని వెంటబెట్టుకొని వచ్చాడు. అతడు వినయము, అతృతా నిండిన గొంతుతో “మహారాజా! ముస్లింల నివాస ప్రాంతంలో ఈ అందమైన ముస్లిం యువతిని పట్టుకున్నాను. ఈమెను మీకు కానుకగా ఇవ్వాలని తెచ్చాను” అన్నాడు.

ఆరోజుల్లో, ముస్లిం రాజ్యాల్లో, ఆ ముస్లిం రాజుల అనుచరులు అందమైన హిందూ యువతుల్ని నిర్భందించి తీసుకుపోవటం, ముస్లిం రాజులకీ, వారి రాజోద్యోగులకీ కానుకలుగా సమర్పించటం చేస్తుండేవాళ్ళు. బదులుగా రాజుల నుండీ, రాజోద్యోగుల నుండి ప్రయోజనాలు పొందుతుండేవాళ్ళు. [అంటే ప్రమోషన్లూ, అవార్డులూ, రివార్డులూ లేదా కేరీర్ లాంటివన్న మాట]ఒక్కోసారి వాళ్ళు ముస్లిం స్త్రీలనీ విడిచి పెట్టేవాళ్ళు కాదు. తమ స్వార్ధం, స్వసుఖవిషయంలో వాళ్ళకి మానవత్వం లేదు, మతం, కులం, పేదరికం, పాపం పుణ్యం – ఏవీ పట్టవు.

శివాజీ ముస్లిం రాజులకీ, ముస్లిం చక్రవర్తి ఔరంగజేబుకి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు గనుక ఆయనకి ముస్లిం లంటే ద్వేషం ఉంటుందని ఆ అనుచరుడు అనుకొన్నాడు. ముస్లిం రాజులు హిందూ స్త్రీల మీద అత్యాచారాలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు గనుక ప్రతీకారంగా శివాజీ కూడా ముస్లిం స్త్రీలని అవమానిస్తాడు, అనుకొన్నాడు. అందుచేత అలాంటి చర్య తీసికున్నాడు. అలాంటి ముస్లిం యువతిని తెచ్చినందుకు తనను సత్కరిస్తాడని కూడా ఆశించాడు.

ఈ సంఘటనతో ఒక్కసారిగా సభమొత్తం నిశ్శబ్థం ఆవరించింది. సభికులంతా ఆశ్చర్యం తోనూ, ఉత్కంఠతోనూ చూస్తున్నారు. శివాజీ ఏమంటాడో నన్న కుతుహలం వాళ్ళందరిలోనూ ఉంది. ఆ ముస్లిం యువతి భయంతో వణుకుతోంది.

శివాజీ ఆమె వైపు తిరిగి “అమ్మా! భయపడకు!” అన్నాడు.

సభికుల వైపు తిరిగి “నిజంగానే ఈమె ఎంతో అందంగా ఉంది. ఈమె కడుపున నేను జన్మించి ఉంటే ఎంత అదృష్టవంతుడయ్యేవాడినో కదా! నా తల్లి కూడా ఈమెంతటి సౌందర్యవతి అయితే, నేను మరింత అందంగా ఉండి ఉండేవాడిని. ఈమె నా తల్లి జిజియా బాయి లాగే నాకు పూజ్యనీయురాలు” అన్నాడు.

చివరిగా తన అనుచరుడి వైపు చూచి “స్త్రీలని ఎలా గౌరవించాలో నేర్చుకో! పరస్త్రీలందరూ మనకు మాతృసమానులు. సగౌరవంగా ఈమెను, ఈమె ఇంట దిగవిడిచిరా!” అని ఆఙ్ఞాపించాడు.

శివాజీ ఆమెకు బహుమతులిచ్చి, రాచమర్యాదలతో ఆమెను స్వగృహానికి పంపించాడు. అదీ ఆయన నిబద్దత – ధర్మంపట్లా, నైతికత పట్లా, మానవతా విలువల పట్లా! వాస్తవానికి ధర్మం, నీతి, మానవీయ విలువలూ ఎప్పటికీ కులమత రాజకీయాలకూ, స్థలకాలమానాలకు అతీతమైనవి. వీటినే హిందూ ధర్మం చెప్తుంది. దానిని ఆచరించటమే నిజమైన హిందువు [మనిషి] చేయవలసినది.

ఇలాంటిదే మరో సంఘటన!

ఒకసారి శివాజీ మాతృశ్రీ జిజియాబాయి ఆయన్ని సింహఘడ్ ను గెలుచుకొని తనకు కానుకగా ఇమ్మని చెప్పింది. ఆయనీ కార్యాన్ని సాధించే పనిని తన అనుచరుడైన తానాజీకి అప్పగించాడు. తానాజీ శివాజీకి ఆప్తమిత్రుడు, అనుంగు అనుచరుడూ, మహా యోధుడు. ఈ వర్తమానం అందుకొనేటప్పటికి తానాజీ తన కుమారుడి వివాహానంతర విందు వినోద కార్యక్రమాల్లో ఉన్నాడు. అయితే వర్తమానం అందుకున్న మరుక్షణమే తానాజీ సింహఘడ్ మీదకి దాడికి సేనాసమేతుడై వెళ్ళాడు. తీవ్రపోరాటంతో సింహఘడ్ ని స్వాధీనం చేసుకొన్నాడు. అయితే ఆ పోరాటంలో తన ప్రాణాల్ని పోగొట్టుకున్నాడు.

దుర్గాన్ని గెలుచుకొన్న తర్వాత, విజయచిహ్నంగా ఫిరంగి మ్రోగింపబడింది. ఫిరంగి శబ్థం విన్న శివాజీ సింహఘడ్ కి చేరుకొన్నాడు. కోట గుమ్మం దగ్గర శివాజీకి విజయ స్వాగతం ఇవ్వబడింది. కానీ శివాజీ మరుక్షణమే తానాజీ అక్కడ లేకపోవడాన్ని, ఆయన నిర్జీవ శరీరాన్ని గమనించాడు. ఇంతలో ఓ సైనికుడు సంతోషం, గర్వం నిండిన గొంతుతో “మహారాజా! మీరు సింహఘడ్ ని గెలుచుకొన్నారు” అన్నాడు. [బహుశః విజయవార్తని చెప్పినందుకు శివాజీ మహారాజు నుండి బహుమానాన్ని అతడు ఆశించి ఉండవచ్చు.]

శివాజీ అతడి వైపు వాడి చూపు చూసి, తీవ్రస్వరంతో “ఘడ్ తో ఆయా, లేకిన్ సింహ్ చలాయా!” అన్నాడు. [దుర్గం వచ్చింది కానీ సింహాన్ని కోల్పోయాను]

అదీ శివాజీ భావవాద దృక్పధం, ఆలోచనా సరళి! సింహఘడ్ దుర్గాన్ని గెలిచిన ఆనందం కన్నా, తన ప్రియమిత్రుడూ, మహా యోధుడు అయిన తానాజీ మరణంపట్ల దుఃఖమే ఆయన హృదయాన్ని తాకింది. ప్రతి విషయాన్ని, అనుభూతినీ రూపాయల్లోకి తర్జుమా చేసుకుంటున్న నేటి సమాజంలో ఈ ’భావం’ ఎందరికి అర్ధమౌతుందో భగవానుని కెఱుక.
 
Copyright 2009 అనగా అనగా.... Powered by Blogger
Blogger Templates created by Deluxe Templates
Wordpress by Ezwpthemes